కురాన్ భావామృతం/హూద్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

11. హూద్‌
(అవతరణ: మక్కా; సూక్తులు: 123)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్‌-లామ్‌-రా. ఇది స్థిరమైన, స్పష్టమైన సూక్తులతో సర్వజ్ఞుడు, మహా వివేక వంతుడయిన శక్తిస్వరూపుని దగ్గర నుండి అవతరించిన గ్రంథం. దీని ఆదేశం ప్రకారం మీరు (నిజ)దేవుడ్ని తప్ప మరెవరినీ ఆరాధించకూడదు. నేను ఆయన వైపున మిమ్మల్ని హెచ్చరించే, శుభవార్త అందజేసేవాడ్ని. (1-2)
మీరు మీ ప్రభువును క్షమాపణ కోరుకోండి. ఆయన వైపు మరలండి. అలాచేస్తే ఆయన మీకు ఓ నిర్ణీతకాలం వరకు మంచి జీవనసామగి అనుగ్రహిస్తాడు. ప్రతి సహృదయునికీ తన సౌహార్ధత, సౌభాగ్యాలను ప్రసాదిస్తాడు. అయితే మీరు (నా హితోప దేశం వినకుండా) ముఖం తిప్పుకుంటే (నాకొచ్చే నష్టమేమీ లేదు.) మీ విషయంలో నేను ఓ భయంకర దినాన సంభవించే (నరక)యాతనను గురించి భయపడుతున్నాను. మీరంతా (చనిపోయిన తరువాత) దేవుని సన్నిధికే చేరుకోవలసి ఉంది. ఆయన ప్రతి పనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. (3-4)
చూడు, వారు (తమ దుష్టాలోచనల్ని) ఆయనకు తెలియకుండా దాచడానికి వృధా ప్రయత్నంచేస్తూ ఎలా ముఖం చాటేస్తున్నారో. జాగ్రత్త! వారు తమ ముఖాలు వస్త్రాలలో దాచుకుంటున్నారుగాని, దేవునికి వారి అంతర్‌బాహ్య విషయాలన్నీ తెలుసు. ఆయనకు మానవుల హృదయాలలో మెదిలే రహస్య విషయాలు సైతం తెలుసు. (5)
భూమండలంపై సంచరించే ప్రతిప్రాణికీ ఉపాధినిచ్చే బాధ్యత దేవునిపైనే ఉంది. అలాగే ఏప్రాణి ఎక్కడ నివసిస్తుందో, ఎక్కడ (దానిప్రాణం) భద్రపరచబడుతుందో కూడా దేవునికి తెలుసు. సమస్త విషయాలు స్పష్టంగా గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. (6)
ఆయనే భూమ్యాకాశాల్ని ఆరు రోజుల్లో సృష్టించినవాడు. దీనికి పూర్వం ఆయన (అధికార) సింహాసనం నీటిమీద ఉండేది. మీలో ఎవరు నీతిగా నడుచుకుంటారో పరీ క్షించడానికే ఆయన ఇదంతా సృష్టించాడు. (ప్రవక్తా!) నీవు అవిశ్వాసులకు “మరణానం తరం మీరు తిరిగి బ్రతికించి లేపబడతారు” అని చెబుతుంటే వారు “ఇది మంత్రజాలం తప్ప మరేమీ కాద”ని అంటున్నారు. మేము వారిని వెంటనే శిక్షించకుండా ఓ నిర్ణీత కాలం వరకు వదలిపెడ్తుంటే “ఏ విషయం దాన్ని నిరోధించింది?” అంటున్నారు వారు. వినండి, వారికి శిక్ష సమయం సమీపించినప్పుడు ఇక దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. వారు హేళన చేస్తున్న విషయమే వారిని చుట్టుముడ్తుంది. (7-8)
ఎప్పుడైనా మేము మానవునికి మా కారుణ్యం చవిచూపిన తర్వాత తిరిగి తీసు కుంటే అతను నిరాశచెంది కృతఘ్నుడుగా మారిపోతాడు. ఒకవేళ అతనికి వచ్చిన ఆపద దూరంచేసి మేము సౌఖ్యం కలిగిస్తే అతను (తెగ సంబరపడిపోతూ) “నా కష్టాలన్నీ తీరి పోయాయి” అంటాడు. పైగా అతను మితిమీరిన సంతోషంతో గర్విష్ఠుడైపోతాడు. అయితే సజ్జనులు, సహనశీలురు మాత్రం ఇలాంటి బలహీనతలను దరికి చేరనివ్వరు. అలాంటివారికే (దేవుని దగ్గర) మన్నింపు, గొప్ప ప్రతిఫలమూ లభిస్తాయి. (9-11)
కనుక నీపై అవతరిస్తున్న విషయాల్లో కొన్నిటిని (ప్రచారం చేయకుండా) వదిలే స్తావేమో (అలా వదిలేయకు సుమా!) అలాగే వారు “ఈ మనిషిపై ఏదైనా ఒక నిధి ఎందుకు అవతరించలేదూ, లేదా ఇతని వెంట దైవదూతయినా ఎందుకు రాలేదూ?” అనంటారు. దానికి బాధపడకు. నీవు (ప్రజల్ని) హెచ్చరించేవాడివి మాత్రమే. ఆ తరువాత విషయాలన్నీ దేవుడే చూసుకుంటాడు. ఆయనే ప్రతి దానికీ పర్యవేక్షకుడు. (12)
వారు ఈగ్రంథాన్ని అతనే కల్పించుకున్నాడని అంటున్నారా? అయితే వారినిలా అడుగు: “సరే, ఇలాంటి పది అధ్యాయాలు రచించి తీసుకురండి. (కావాలంటే) ఈ పనిలో మీకు సహాయపడేందుకు ఒక్క దేవుడ్ని వదలి మీరు ఎవరెవర్ని పిలుచుకోగలరో వారందర్నీ పిలుచుకోండి. మీరు నిజాయితీపరులైతే (ఈపని చేసిచూపండి). వారు గనక మీ సహాయానికి రాకపోతే ఈగ్రంథం (మానవమేధా జనితంకాదని,) దైవజ్ఞానంతో అవత రించిందని, ఆ దేవుడు తప్ప మరో ఆరాధ్యుడు లేడని తెలుసుకోండి. మరి మీరు (ఇప్పటికైనా ఈ సత్యానికి) తలవొగ్గుతారా?” (13-14)
కేవలం ప్రాపంచిక జీవితాన్ని, దాని తళుకుబెళుకుల్ని కోరుకునే వారికి వారి కర్మ ఫలం పూర్తిగా ఇక్కడే ఇచ్చివేస్తాం. అందులో వారికి ఎలాంటి కొరత చేయం. అయితే పరలోకంలో అలాంటివారికి నరకాగ్ని తప్ప మరేమీ ఉండదు. వారు ప్రపంచంలో సమ కూర్చుకున్నదంతా నిరర్థకమైపోయింది; వారు చేసినదంతా మిధ్యే. (15-16)
ఒకవ్యక్తి తనప్రభువు నుండి స్పష్టమైన నిదర్శనం కలిగిఉన్నాడు. ఆ తర్వాత (ఆ నిదర్శనాన్ని సమర్థిస్తూ) మరో నిదర్శనం కూడా అతని ప్రభువు నుండి వచ్చింది. దీనికి పూర్వం మార్గదర్శినిగా, (దైవ)కారుణ్యంగా అవతరించిన మూసా గ్రంథం కూడా ఉంది. మరి (ఈవ్యక్తి ప్రపంచపూజారిలా ముహమ్మద్‌ తెచ్చిన సత్యాన్ని తిరస్కరించగలడా)? అలాంటివారు దీన్ని తప్పక విశ్వసిస్తారు. యావత్‌ మానవజాతుల్లో ఏజాతయినా దీన్ని తిరస్కరిస్తే దాని నివాసస్థలం నరకమవుతుందని వాగ్దానం చేయబడుతోంది. కనుక ముహమ్మద్‌ (స)! ఈ విషయంలో నీవు ఎలాంటి సందేహానికి ఆస్కారమివ్వకు. ఇది నీ ప్రభువు నుండి వచ్చిన సత్యం. కాని చాలామంది దీన్ని విశ్వసించడంలేదు. (17)
దేవునికి అబద్ధం ఆపాదించేవాడి కంటే పరమ దుర్మార్గుడెవరుంటారు? అలాంటి వారిని దేవుని ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అప్పుడు సాక్షులు తమ ప్రభువుకు అసత్యం ఆపాదించినవారు వీరేనని సాక్ష్యమిస్తారు. వినండి. దేవుని మార్గం నుండి ప్రజల్ని నిరోధించే దుర్మార్గులపై దైవశాపం విరుచుకుపడుతుంది. (18)
ఈ దుర్మార్గులు దేవుడు నిర్దేశించిన మార్గాన్ని వక్రీకరింపజూస్తూ పరలోకాన్ని తిరస్కరిస్తున్నారు. వారు యావత్తు భూమండలంలో దేవుడ్ని ఏమాత్రం అశక్తుడిగా చేయ లేరు. దేవునికి వ్యతిరేకంగా వారికి సహాయం చేసేవాడూ ఉండడు. వారికి రెట్టింపు శిక్ష పడుతుంది. వారిప్పుడు ఎవరి (హిత)వచనాలు వినే స్థితిలో లేరు. వారికీ ఎలాంటి (మంచి) విషయం తట్టదు. తమకుతాము నష్టం కల్గించుకున్న ఆత్మవినాశకులు వీరే. వారి అభూతకల్పనలన్నీ వారినుండి కనుమరుగైపోతాయి. వారే పరలోకంలో అందరి కన్నా ఘోరంగా నష్టపోయేవారు. అందులో ఎలాంటి సందేహం లేదు. (19-22)
ఇక సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులైనవారు మాత్రం (తుదిశ్వాస వరకు) తమ ప్రభువుకే అంకితమయి ఉంటారు. వారు తప్పకుండా స్వర్గనివాసులవుతారు. స్వర్గంలోనే కలకాలం (హాయిగా) ఉంటారు. ఈ ఉభయవర్గాలను ఇలా పోల్చవచ్చు. ఒకడు అంధుడు, బధిరుడు. మరొకడు కళ్ళూ, చెవులూ ఉన్నవాడు. వీరిరువురు సమాన మేనా? మీరు విషయం గ్రహించరా? (23-24)
మేము నూహ్‌ను అతని జాతిప్రజల దగ్గరకు పంపాము. అప్పుడతను (వారికి హితోపదేశం చేస్తూ) “నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించడానికి వచ్చాను. (ఏకైక) దేవుడ్ని తప్ప మీరు ఎవరినీ ఆరాధించకండి. ఇలా చేయకపోతే మీపై ఘోరమైన శిక్ష వచ్చిపడుతుందని నేను భయపడుతున్నాను” అని అన్నాడు. (25-26)
అతని జాతిలో సత్యాన్ని తిరస్కరించిన నాయకులు దానికిలా సమాధానమిచ్చారు: “మా దృష్టిలో నీవు మాలాంటి మానవమాత్రుడివే. (అంతకుమించి మరేమీకావు.) అదీ గాక ముందుచూపు లేకుండా నీమాటలు విని నిన్ను (గుడ్డిగా) అనుసరిస్తున్నవారు ఎలాంటివారో మేము చూస్తూనే ఉన్నాం. (విజ్ఞత, వివేచనల్లేని) అధములు, తుచ్ఛులే గదా నిన్ను అనుసరిస్తున్నది? మీరు మాకంటే ఏ విషయంలోనూ మించిపోయినట్లు మాకగపడటం లేదు. నువ్వొట్టి అబద్ధాలరాయుడవని మేము భావిస్తున్నాం.” (27)
నూహ్‌ ఇలా అన్నాడు: “నా జాతిప్రజలారా! కాస్త ఆలోచించండి. నా ప్రభువు అనుగ్రహంతో (ఇంతకు పూర్వంనుంచే) నేనొక నిదర్శనం (అంతరాత్మ ప్రబోధనా జ్యోతి) కలిగివున్నాను. ఆతర్వాత ఆయన నాకు తన విశేషకారుణ్యం (దివ్యావిష్కృతి) ప్రసా దించాడు. అది మీకు కన్పించకపోతే (నేనేం చేయను?) విశ్వసించడానికి మీకిష్టం లేక పోతే దాన్ని బలవంతంగా మీమీద రుద్దడానికి నాదగ్గర ఎలాంటి సాధనం లేదుగదా!
నా జాతిప్రజలారా! నేనీ పని కోసం మీనుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించడం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత దేవుడే తీసుకున్నాడు. నామాటలు విశ్వసించిన వారిని నేను గెంటివేయలేను. వారు కూడా తమ ప్రభువు సన్నిధికి చేరుకోవలసినవాళ్ళే. సోదరులారా! నేనొకవేళ వారిని నా దగ్గర్నుంచి గెంటివేస్తే దేవుని పట్టునుండి నన్నెవరు కాపాడతారు? మీరామాత్రం అర్థం చేసుకోలేరా? నాదగ్గర నిధులు, నిక్షేపాలున్నాయని నేను మీతో అనడం లేదు. నాకు అతీంద్రియ శక్తులున్నాయని, నేను దైవదూతని కూడా చెప్పుకోవడం లేదు. మీ కళ్ళకు నీచులుగా కన్పిస్తున్న వీరికి దేవుడు ఎలాంటి మేలు చేయడని నేను చెప్పలేను. వారి అంతరంగాల స్థితి దేవునికే బాగా తెలుసు. ఒకవేళ వారిని గురించి అలా చెబితే నేను దుర్మార్గుణ్ణయి పోతాను.” (28-31)
అప్పుడు వారు “నూహ్‌! నువ్వు మాతో వాదనకుదిగి బాగానే వాదించావు. సరే, నీవు సత్యవంతుడవైతే మమ్మల్ని బెదిరిస్తున్న ఆశిక్ష ఏమిటో ఇక తీసుకురా” అన్నారు. దానికి నూహ్‌ ఇలా అన్నాడు: “దాన్ని దేవుడే తలచుకుంటే తీసుకువస్తాడు. అప్పుడు మీరు దాన్ని ఏవిధంగానూ అడ్డుకోలేరు. అదీగాక దేవుడు మిమ్మల్ని మార్గభ్రష్టత్వంలోనే పడి ఉండనివ్వదలచుకుంటే, నేనిక మీశ్రేయస్సు కోసం ఏది చేయాలనుకున్నా అది మీకెలాంటి ప్రయోజనం చేకూర్చదు. అలాంటి శక్తిసంపన్నుడే మీ ప్రభువు. (మరణా నంతరం) మీరు ఆయన సన్నిధికే చేరుకోవలసి ఉంటుంది. (32-34)
ముహమ్మద్‌ (సల్లం)! వారు “ఇదంతా అతనే కల్పించుకున్నాడ”ని అంటున్నారా? అయితే వారికిలా చెప్పు: “ఒకవేళ నేను దీన్ని కల్పించుకుంటే, ఆ నేరం నాదే. కాని మీరు చేస్తున్న నేరాలకు నేను ఎలాంటి బాధ్యుడ్ని కాను.” (35)
నూహ్‌కు దివ్యావిష్కృతి ద్వారాఇలా సూచించబడింది: “నీ జాతిప్రజల్లో (సత్యాన్ని) విశ్వసించవలసిన వారంతా విశ్వసించారు. ఇక కొత్తగా విశ్వసించేవారెవరూ లేరు. కనుక వారి అకృత్యాలను గురించి నీవు బాధపడనవసరం లేదు. ఇప్పుడు మా పర్యవేక్షణలో మా ప్రోత్సాహంతో ఒక ఓడ తయారుచేసుకో. అయితే దుర్మార్గుల్ని గురించి నా దగ్గర సిఫారసు చేయకూడదు. వారంతా ఇప్పుడు మునిగి పోనున్నారు.” (36-37)
నూహ్‌ (తన అనుచరులతో కలసి) ఓడ నిర్మాణంలో నిమగ్నుడయిపోయాడు. అతని జాతి నాయకులు అతని ముందు నుంచి పోతూ అతడ్ని అపహాస్యం చేసేవారు. దానికి నూహ్‌ ఇలా అన్నాడు: “ఏమిటీ, మీరు మమ్మల్ని చూసి నవ్వుతున్నారా? అయితే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నాం. అవమానకరమయిన శిక్ష ఎవరిపైకి వస్తుందో, తిరుగు లేని ఉపద్రవం ఎవరిని చుట్టుముడ్తుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది.” (38-39)
చివరికి మాఆజ్ఞ రానేవచ్చింది. (మహోపద్రవం) కుంపటి పొంగిపొరలింది. అప్పుడు మేమిలా ఆదేశించాం: “ప్రతి జాతికి చెందిన ప్రాణులలో ఒక్కొక్క జతను నౌకలోకి తీసుకో. అలాగే ఎవరెవరిని గురించి నీకు ముందే తెలియజేశామో వారిని వదలి (మిగి లిన) నీ కుటుంబసభ్యుల్ని, (వారితో పాటు) విశ్వాసుల్ని కూడా నౌకలో ఎక్కించుకో.”
నూహ్‌తో పాటు విశ్వాసులు కొద్దిమందే ఉన్నారు. నూహ్‌ (తన అనుచరులతో) “దేవుని పేరు స్మరించి ఓడలోకి ఎక్కండి. అది నడవడం, ఆగిపోవడం అన్నీ (దేవుని చేతిలో ఉన్నాయి). నాప్రభువు గొప్పక్షమాశీలి, అమిత దయామయుడు” అని అన్నాడు.
ఓడ వారిని తీసుకొని ముందుకు సాగింది. కొండల్లాంటి సముద్రకెరటాలు ఎగిసి పడుతున్నాయి. నూహ్‌ దూరానవున్న తన కుమారుడ్ని పిలిచి “బాబూ! (ఇటు వచ్చేయి.) మాతోపాటు ఓడలోకి ఎక్కు. అవిశ్వాసులతో కలసిఉండకు” అని అన్నాడు. (40-42)
దానికి అతను “ఇదిగో చూడు, నేనిప్పుడు ఓ కొండ ఎక్కుతాను. అది నన్ను నీటి (ప్రవాహం) నుండి కాపాడుతుంది” అన్నాడు. “దేవుడు కరుణిస్తే తప్ప ఈరోజు ఆయన ఆజ్ఞ (శిక్ష)నుండి ఏశక్తీ కాపాడలేదు” అన్నాడు నూహ్‌. అంతలో వారిద్దరి మధ్య ఓ (పెద్ద) కెరటం వచ్చింది. దాంతో అతను కూడా మునిగిపోయేవారిలో చేరిపోయాడు. (43)
“భూమండలమా! నీ నీటినంతటినీ మింగెయ్యి. ఆకాశమా! ఇక ఆగిపో” అని ఆజ్ఞ అయింది. అప్పుడు నీరంతా నేలలోకి ఇంకిపోయింది. జరగవలసింది జరిగిపోయింది. ఓడ జూదీ పర్వతం మీద నిలిచిపోయింది. దాంతో ‘దుర్మార్గుల పీడ విరగడై పోయింద’ ని ప్రకటన వెలువడింది. (అయితే) నూహ్‌ దైవాన్ని వేడుకుంటూ “ప్రభూ! నా కొడుకు, నా కుటుంబానికి చెందినవాడు. నీ వాగ్దానం నిజమయినది. నీవు పరిపాలకులలో కెల్లా గొప్ప పరిపాలకుడివి. అధికారులలో కెల్లా మంచి అధికారివి” అన్నాడు. (44-45)
(దేవుడిలా)అన్నాడు: “నూహ్‌! అతను నీ కుటుంబానికి చెందినవాడుకాదు. అతను (నీ కడుపున చెడబుట్టిన) పరమ అప్రయోజకుడు. నీకు వాస్తవం ఏమిటో తెలియనిదాన్ని గురించి నన్నర్థించకు. నేను నీకు ఉపదేశిస్తున్నాను. నీవు అజ్ఞానిగా ప్రవర్తించకు.” (46)
(ఈమాట వినగానే) నూహ్‌ (భయపడి) “ప్రభూ! నాకు తెలియనిదాన్ని గురించి నిన్నర్థించడం (అనే కీడు) నుండి నేను నీశరణు కోరుతున్నాను. (నన్ను క్షమించు) నీవు నన్ను కనికరించి క్షమించకపోతే నేను నాశనమైపోతాను” అని వేడుకున్నాడు. (47)
ఆజ్ఞ జారీఅయింది: “నూహ్‌! (ఓడ)దిగు. నీకు, నీతోపాటున్న వర్గాలకు మానుండి శాంతీశుభాలు కలుగుగాక! (మీ సంతతి నుండి ఉనికిలోకి వచ్చే) మరికొన్ని వర్గాలు కూడా ఉన్నాయి. వారికి మేము కొంతకాలం (ప్రపంచంలో) ప్రయోజనం కలిగిస్తాం. తర్వాత (వారి దుష్కర్మలకు) వారికి మా తరఫున దుర్భరశిక్ష పడుతుంది.” (48)
ముహమ్మద్‌ (స)! ఇవన్నీ అగోచర విషయాలు. వీటిని మేము నీకు దివ్యావిష్కృతి (వహీ) ద్వారా తెలియజేస్తున్నాము. దీనికి పూర్వం నీవుగాని, నీజాతి ప్రజలుగాని ఈ విషయాల్ని ఏమాత్రం ఎరుగరు. అందువల్ల నీవు సహనంతో వ్యవహరించు. పర్యవ సానం భయభక్తులు కలవారికే అనుకూలంగా ఉంటుంది. (49)
ఆద్‌ జాతిప్రజల దగ్గరకు మేము వారి సోదరుడు హూద్‌ని (ప్రవక్తగా నియమించి) పంపాము. అతనిలా అన్నాడు: “నా జాతిప్రజలారా! దేవుడ్ని (మాత్రమే) ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీవన్నీ అభూతకల్పనలు తప్ప మరేమీ కావు. (అలాంటి మిధ్యాదైవాలను ఇకనైనా వదలిపెట్టండి).” (50)
“ప్రజలారా! నేనీ పనికోసం మీనుండి ఎలాంటి ప్రతిఫలం కోరడం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత నన్ను సృష్టించినవాడే తీసుకున్నాడు. మీరు విషయాన్ని అర్థం చేసుకోరా? నా జాతిప్రజలారా! మీ ప్రభువుకు క్షమాపణ చెప్పుకొని ఆయన వైపు మరలండి. ఆయన మీకోసం ఆకాశం నుండి పుష్కలంగా వర్షం కురిపిస్తాడు. మీ శక్తిని పెంచి మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తాడు. కనుక నేరస్థుల మాదిరిగా ముఖం చాటు చేసుకోకండి.” (51-52)
వారిలా అన్నారు: “హూద్‌! నీవు మాదగ్గరకు స్పష్టమైన ప్రమాణం తీసుకురాలేదు. నీమాటలు విని మా దేవతలను ఎన్నటికీ వదలుకోం. నిన్ను విశ్వసించే ప్రసక్తి కూడా లేదు. మేమసలు మా దేవతల్లో ఏదైనా నీకు కీడు తలపెట్టిందేమోనని భావిస్తున్నాం.”
హూద్‌ ఇలా అన్నాడు: “నేను దేవుడ్ని సాక్షిగా పెడ్తున్నా. మీరు కూడా సాక్షులుగా ఉండండి. దేవుడ్ని వదలి మీరు కల్పించుకున్న మిధ్యాదైవాలతో నేను విసిగిపోయాను. మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా ఏదైనా చేయదలచుకుంటే అందులో ఎలాంటికొరత చేయకండి. నాకేమాత్రం అవకాశం ఇవ్వకండి. నేను దేవుడ్నే నమ్ముకున్నాను. ఆయన నాకూ ప్రభువే, మీకూ ప్రభువే. ప్రతిప్రాణి జుట్టు దేవుని చేతిలోనే ఉంది. నా ప్రభువు చూపే మార్గమే అసలైన రుజుమార్గం. మీరు (నాబోధ నచ్చక) ముఖం తిప్పుకుంటే తిప్పుకోండి. (నాకొచ్చే నష్టమేమీ లేదు.) నాకిచ్చి పంపిన సందేశం నేను మీకందజేశాను. (నాబాధ్యత తీరిపోయింది.) ఇప్పుడిక నా ప్రభువు (మిమ్మల్ని నిర్మూలించి) మీ స్థానంలో మరో జాతిని ఉద్ధరిస్తాడు. అప్పుడు మీరాయనకు ఎలాంటి నష్టం కలిగించలేరు. నా ప్రభువు ప్రతిదాన్నీ ఓకంట కనిపెట్టి చూస్తున్నాడు.” (53-57)
ఆ తరువాత మా ఆజ్ఞ వచ్చేసింది. (వారిపై భయంకరమైన ఉపద్రవం విరుచుకు పడింది.) అప్పుడు మేము మా అనుగ్రహంతో హూద్‌ని, అతనితోపాటు విశ్వసించిన వారిని రక్షించాము. మేము వారిని ఘోరమైన శిక్ష నుండి కాపాడాము. (58)
వారే ఆద్‌ జాతిప్రజలు. వారు తమప్రభువు సూక్తులు, సూచనలు తిరస్కరించారు. ఆయనప్రవక్తల హితవులు నమ్మలేదు. వారు సత్యవిరోధి అయిన ప్రతి అహంకారికీ విధేయులయి పోయారు. చివరికి వారు ఇటు ఇహలోకంలోనూ శపించబడ్డారు, అటు ప్రళయదినాన (పరలోకంలో) కూడా వారు శాపగ్రస్తులుగానే ఉంటారు. వినండి, ఆద్‌ ప్రజలు తమ ప్రభువుని తిరస్కరించారు. బాగా వినండి, హూద్‌జాతి అయిన ఆద్‌ ప్రజలు దూరంగా విసరివేయబడ్డారు. (59-60)
మేము సమూద్‌ జాతిప్రజల దగ్గరకు వారి సోదరుడు సాలిహ్‌ను పంపాము. అతనిలా అన్నాడు: “నా జాతిప్రజలారా! ఏకైక దేవుడ్ని (మాత్రమే) ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే మిమ్మల్ని నేల నుండి పుట్టించి ఇక్కడ మీకు వసతి సౌకర్యం కల్పించాడు. కనుక మీరు ఆయన్నే క్షమాపణకోరుకోండి. ఆయన వైపు మరలండి. నా ప్రభువు (మానవులకు) అతిసమీపంలోనే ఉన్నాడు. ఆయనే (మన) మొరలను ఆలకించేవాడు.” (61)
దానికి వారిలా అన్నారు: “సాలిహ్‌! లోగడ నీవు మాలో ఎంతో మంచివాడివిగా ఉన్నావు. నీమీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. (ఇప్పుడేమయింది నీకు?) మా తాతముత్తాతల కాలం నుండి వస్తున్న ఈ దైవాలను పూజించుకోనీయకుండా మమ్మల్ని వారిస్తున్నావు? నీవు బోధిస్తున్న విషయం పట్ల మాకు చాలా అనుమానంగా ఉంది. అది మమ్మల్ని తీవ్రమైన సందిగ్ధంలో పడవేసింది.” (62)
అప్పుడు సాలిహ్‌ ఇలా అన్నాడు: “నా జాతిప్రజలారా! నేను నా ప్రభువు దయవల్ల (ఇంతకు ముందునుంచే) ఒక నిదర్శనం (అంతరాత్మ ప్రబోధనా జ్యోతి) కలిగిఉన్నాను. ఆతర్వాత ఆయన నాకు తన విశేషకారుణ్యాన్ని (దివ్యావిష్కృతిని) కూడా ప్రసాదించాడు. దీన్ని గురించి యోచించరా? ఇవన్నీ లభించిన తర్వాత కూడా నేను దేవునికి అవిధేయు ణ్ణయిపోతే ఆయన పట్టునుండి నన్నెవరు కాపాడుతారు? మీరు నన్ను నష్టపరచడం తప్ప నాకు ఏవిధంగా ఉపయోగపడతారు?” (63)
“నా జాతిప్రజలారా! ఇదిగో చూడండి. ఇది దేవునిఒంటె. మీకోసం ఇదొక సూచన. దీన్ని దేవుని నేలపై స్వేచ్ఛగా మేయడానికి వదలిపెట్టండి. దీని జోలికి పోకూడదు. పోతే మాత్రం మీపై దేవుని శిక్ష విరుచుకుపడేందుకు అట్టే ఎంతోసేపు పట్టదు.” (64)
అయితే వారు (హెచ్చరికను ఖాతరుచేయకుండా) ఒంటెను చంపేశారు. అప్పుడు సాలిహ్‌ (ఆగ్రహం వెలిబుచ్చుతూ) “ఇప్పుడిక మీరు మూడురోజులు మాత్రమే మీ ఇండ్లలో గడపగలరు. ఇది ఏమాత్రం అసత్యంగా మారని తిరుగులేని మాట” అన్నాడు.
చివరికి మాఆజ్ఞ వచ్చింది. (భీకరవిపత్తు వచ్చిపడింది.) అప్పుడు మేము మా అను గ్రహంతో సాలిహ్‌ని, అతనితోపాటు విశ్వసించినవారిని రక్షించాం. ఆనాటి అవమానం నుండి వారిని కాపాడాము. నీ ప్రభువు అత్యంత శక్తిమంతుడు, సర్వాధికారి. ఇక దౌర్జన్యపరుల విషయానికొస్తే, అతి తీవ్రమయిన విస్ఫోటం వారిని కుదిపేసింది. దాంతో వారు తమఇండ్లలో ఎలాంటి చలనం లేకుండా, అసలు వారక్కడ లేనే లేరన్నట్లు నిస్తేజంగా పడిపోయారు. వినండి, సమూద్‌జాతిప్రజలు తమ ప్రభువుని విశ్వసించడానికి నిరాకరించారు. బాగావినండి, సమూద్‌జాతిప్రజలు దూరంగా విసరేయబడ్డారు. (65-68)
పోతే ఇబ్రాహీం దగ్గరకు మా దూతలు శుభవార్త తీసికెళ్ళి “మీకు శాంతీశ్రేయాలు కలుగుగాక!” అన్నారు. దానికి ఇబ్రాహీం “మీక్కూడా శాంతి కలుగుగాక!” అన్నాడు. ఆ తర్వాత కాస్సేపటికి ఇబ్రాహీం ఆవుదూడను కాల్చి తెచ్చాడు. కాని వారి చేతులు భోజనం మీదికి పోవడంలేదు. దాంతో అనుమానం కలిగి అతను లోలోన భయపడసాగాడు. వారు “భయపడకు. మేము లూత్‌జాతి వైపు పంపబడ్డాం” అన్నారు. (69-70)
అప్పుడు ఇబ్రాహీం భార్య కూడా అక్కడే నిలబడి ఉంది. ఆమె ఈ మాటలు విని (తమ పట్నానికి ప్రమాదం తప్పినందుకు సంతోషిస్తూ) నవ్వింది. ఆతర్వాత మేమామెకు ఇస్‌హాఖ్‌ పుట్టుక గురించి, ఇస్‌హాఖ్‌ తర్వాత యాఖూబ్‌ పుట్టుక గురించి శుభవార్త చెప్పాము. దానికామె “ఆయ్యో నా పాడుగాను! ఈ వయస్సులోనా నాకు సంతానం? నేను పండుముసలిదాన్నయి పోయానే! నాభర్త కూడా ముసలివాడైపోయాడే!! (సంతానం ఎలా కలుగుతుంది?) చాలా విచిత్రంగా ఉందే!!!” అన్నది (ఆశ్చర్యపోతూ) - (71-72)
“దైవాజ్ఞ విని ఆశ్చర్యపోతున్నావా నీవు? ఇబ్రాహీం కుటుంబసభ్యులారా! (వినండి) మీపై దేవుని కారుణ్యం, ఆయన శుభాలు ఉన్నాయి. దేవుడు ఎంతో ప్రశంసనీయుడు, మహోన్నతుడు” అన్నారు దైవదూతలు. (73)
ఇబ్రాహీంలోని భయం పోయి (సంతాన శుభవార్త వల్ల) మనస్సు కాస్త కుదుట పడిన తర్వాత అతను మాతో జగడానికి దిగాడు. నిజానికి ఇబ్రాహీం ఎంతో సహన శీలుడు, మృదుహృదయుడు, దేవుని వైపు మరలేవాడు. “ఇబ్రాహీం! ఇక దాన్ని వది లెయ్యి. నీ ప్రభువాజ్ఞ అయింది. వారిపై తప్పనిసరిగా శిక్ష వచ్చిపడుతుంది. దానికి తిరుగులేదు.” (అక్కడ్నుంచి) మా దూతలు లూత్‌ దగ్గరికి చేరుకున్నారు. వారిని చూసి అతను చాలా ఆందోళన పడసాగాడు. అతని హృదయం కుంచించుకు పోయింది. “ఈరోజు పెద్ద ఆపదే వచ్చిపడింది” అన్నాడతను. (74-77)
(లూత్‌ ఇంటికి అతిథులు రాగానే) అతని జాతిప్రజలు అతని దగ్గరకి పరుగెత్తారు. వారు మొదటినుంచీ అశ్లీలచేష్టలకు అలవాటుపడ్డారు. లూత్‌ (వారికి నచ్చజెప్తూ) “సోదరులారా! (ఈపని మీకు తగదు.) కావాలంటే నాయీ కుమార్తెలున్నారు చూడండి. వీరు మీకోసం పరిశుద్ధ స్త్రీలు. దేవునికి భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను అవమానపర్చకండి. ఏమిటీ! మీలో మంచివాడు ఒక్కడూ లేడా?” అని అన్నాడు. (78)
“నీకు తెలుసుకదా, నీ కుమార్తెలతో మాకు పనిలేదని. మాకు కావలసిందేమిటో కూడా నీకు తెలుసు” అన్నారు వారు. “అయ్యయ్యో! నాకు మిమ్మల్ని అదుపులోఉంచే శక్తి ఉంటే బాగుండు! లేదా ఆశ్రయం పొందడానికి ఏదైనా దృఢమైన కోట దొరికినా బాగుండు” అన్నాడు లూత్‌ (79-80)
అప్పుడు దైవదూతలు ఇలా అన్నారు: “లూత్‌! మేము నీ ప్రభువు పంపిన దూతలం. వీరు నిన్నేమీ చేయలేరు. కొంత రాత్రి గడిచిన తరువాత నీ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడ్నుంచి బయలుదేరి (వేరే చోటికి) వెళ్ళు. జాగ్రత్త! మీలో ఏఒక్కరూ వెనక్కి తిరిగి చూడకూడదు. అయితే నీభార్య మాత్రం (నీవెంట రాకూడదు). వారి మీద సంభ వించేదే నీభార్య మీద కూడా సంభవిస్తుంది. వారి వినాశకాలం నిర్ణయమైపోయింది. (రేపు) ఉదయమే. ఇక ఎంతో సమయం లేదు.” (81)
ఆ తరువాత మాఆజ్ఞ వచ్చేసింది. అప్పుడు మేమా పట్టణాన్ని అమాంతం కుదిపేసి తల్లక్రిందులు చేశాం. ఆపై మండుతున్న మట్టిరాళ్ళు దాని మీద ఉధృతంగా కురి పించాము. అందులోని ప్రతి రాయీ నీ ప్రభువు దగ్గర గుర్తు వేయబడింది. ఇలాంటి శిక్ష దుర్మార్గ వైఖరి అవలంబించినవారికి ఎంతో దూరం లేదు. (82-83)
మద్యన్‌జాతి ప్రజల దగ్గరకు వారి సోదరుడు షుఐబ్‌ని (ప్రవక్తగా నియమించి) పంపాము. అతను (వారికి హితోపదేశం చేస్తూ) ఇలా అన్నాడు: “నా జాతిప్రజలారా! ఏకైక దేవుడ్ని (మాత్రమే) ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. తూనికల్లో, కొలతల్లో (సరుకులు) తగ్గించి ఇవ్వకండి. నేనీ రోజు మీరు మంచి స్థితిలో ఉండటం చూస్తున్నాను. కాని (మీ వైఖరి ఇలాగే కొనసాగితే) రేపు మీమీద అందర్నీ చుట్టుముట్టే ఆపద విరుచుకు పడవచ్చని భయపడుతున్నాను. (84)
కనుక న్యాయంగా సరైన కొలమానంతో పూర్తిగా తూచి-కొలచి ఇవ్వండి. ప్రజలకు రావలసిన సరుకులు తగ్గించి వారికి నష్టం కల్గించకండి. లోకంలో కలహాలు-కల్లోలాలు రేకెత్తిస్తూ తిరగకండి. (అక్రమ లాభార్జనకన్నా) దేవుడు ప్రసాదించే (సక్రమ) ఆదాయమే మీకు శ్రేష్ఠమైనది, మీరు నిజాయితీపరులైతే (దాంతోనే తృప్తిచెందాలి). ఏమైనా నేను మాత్రం మీమీద కావలివాడుగా (అనుక్షణం) కనిపెట్టుకొని ఉండలేను.” (85-86)
దానికి వారిలా అన్నారు: “షుఐబ్‌! మా తాతముత్తాతల కాలం నుండి వస్తున్న ఈ దైవాలను ఆరాధించడం మేము మానుకోవాలా? మా ధనాన్ని మా ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టుకునే అధికారం కూడా లేదా మాకు? ఇదేనా నీప్రార్థన నీకు నేర్పుతున్నది? (మా అందరిలో) సాధుస్వభావి, సన్మార్గగామివి నీవొక్కడివే మిగిలావు కాబోలు!” (87)
“సోదరులారా! కాస్త ఆలోచించండి. నేను నాప్రభువు దయవల్ల (ఇంతకుముందు నుంచే) ఒక నిదర్శనం (అంతరాత్మ ప్రబోధనా జ్యోతి) కలిగిఉన్నాను. ఆపై ఆయన నాకు మంచి ఉపాధి కూడా అనుగ్రహించాడు. అలాంటప్పుడు నేను మీ మార్గవిహీనత, అవినీతి పనుల్లో ఎలా పాల్గొనగలను? నేను మిమ్మల్ని ఏ చెడుల నుంచి వారిస్తున్నానో ఆ చెడులకు స్వయంగా నేను పాల్పడనా? అది ఎన్నటికీ సాధ్యం కాదు. నేను మాత్రం నాకు చేతనైనంత వరకు పరిస్థితి చక్కదిద్దాలని భావిస్తున్నాను. అయితే నేను చేయ దలచుకున్నదంతా దేవుని దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంది. ఆయన్నే నేను నమ్ముకున్నాను. ప్రతి వ్యవహారంలోనూ నేను ఆయన వైపుకే మరలుతాను. (88)
నా జాతిప్రజలారా! నాకు వ్యతిరేకంగా మీరు అవలంబించిన ఈ మూర్ఖత్వం, మొండి వైఖరుల్ని చూస్తుంటే చివరికి నూహ్‌, హూద్‌, సాలిహ్‌ జాతులపై వచ్చి పడి నటువంటి శిక్షలు (ఉపద్రవాలు) మీపై కూడా విరుచుకుపడతాయేమో అనిపిస్తోంది. అలాంటి దుర్గతి పట్టకూడదు సుమా! లూత్‌జాతి(కి పట్టిన దుర్గతి) మీకెంతో దూరం లేదు. (ఈ మధ్యకాలంలోనే ఆ భయంకర సంఘటన సంభవించింది.) కనుక మీరు (ఇప్పటికైనా) దేవుడ్ని క్షమాపణ కోరుకొని ఆయన వైపు మరలండి. నా ప్రభువు ఎంతో దయామయుడు. ఆయనకు తనదాసుల పట్ల అపార ప్రేమాభిమానాలున్నాయి” అంటూ షుఐబ్‌ వారికి హితోపదేశం చేశాడు. (89-90)
“షుఐబ్‌! నీవు చెప్పేవాటిలో చాలా మాటలు మాకసలు అర్థమే కావడం లేదు. నీవు మాకు బలహీనుడివిగా కన్పిస్తున్నావు. (నీకు మద్దతుగా) నీ బంధువర్గమే గనక లేకపోయి నట్లయితే మేము ఎప్పుడో నిన్ను రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళం. మమ్మల్ని ఎదుర్కునే అంత శక్తి నీకు లేదు” అన్నారు వారు. (91)
“సోదరులారా! మీ కళ్ళకు దేవుని కంటే నా బంధువర్గమే శక్తిమంతమైనదిగా కన్పిస్తున్నదా? (నా బంధువులకైతే భయపడ్డారు గాని) దేవుడ్ని మాత్రం పూర్తిగా వది లేశారు! గుర్తుంచుకోండి, మీరు చేస్తున్న పనులను నా ప్రభువు గమనిస్తూనే ఉన్నాడు. సోదరులారా! (సరే), మీరు మీపద్ధతి ప్రకారం నడుచుకోండి. నేను నాపద్ధతి ప్రకారం నడుచుకుంటాను. ఎవరిపై అవమానకరమైన శిక్ష వచ్చిపడుతుందో, ఎవరు అసత్య వాదులో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. (దానికోసం) మీరూ ఎదురుచూడండి, మీతో పాటు నేనూ ఎదురుచూస్తాను” అన్నాడు షుఐబ్‌ (తుది హెచ్చరిక చేస్తూ). (92-93)
చివరికి మా ఆజ్ఞ (అమల్లోకి) వచ్చేసింది. అప్పుడు మేము మా అనుగ్రహంతో షుఐబ్‌ని, అతనితో పాటు విశ్వసించినవారిని రక్షించాం. అన్యాయం, అక్రమాలకు పాల్ప డిన దుర్మార్గులపై తీవ్రమైన విస్ఫోటం విరుచుకుపడింది. దాంతో వారు తమఇండ్లలోనే పడి సర్వనాశనమయ్యారు. అసలు వారక్కడ ఎన్నడూ నివసించనే లేదన్నట్లు తెల్లవారు జామున ఎలాంటి చలనం లేకుండా నిస్తేజంగా పడిఉండిపోయారు. వినండి, సమూద్‌ ప్రజల మాదిరిగా మద్యన్‌ప్రజలు కూడా దూరంగా విసరివేయబడ్డారు. (94-95)
మేము మూసాకు (ప్రవక్త నియామకానికి సంబంధించిన) స్పష్టమైన ప్రమాణాలు, నిదర్శనాలిచ్చి ఫిరౌన్‌, అతని అధికారుల దగ్గరకు పంపించాం. కాని ఫిరౌన్‌ ఆదేశం సమంజసంగా లేకపోయినా అతని జాతిప్రజలు అతని ఆదేశాన్నే పాటించారు. ప్రళయ దినాన అతను తన జాతిప్రజలకు (నాయకత్వంవహించి) ముందుముందుగా ఉంటాడు. ఆవిధంగా అతను తన నేతృత్వంలో వారిని నరకానికి తీసికెళ్తాడు. వారు చేరుకునే ప్రదేశం ఎంత చెడ్డప్రదేశం! వారిటు ప్రపంచంలోనూ శపించబడ్డారు; అటు పరలోకం లోనూ శపించబడతారు. వారికి లభించే ప్రతిఫలం ఎంత దుష్ట ప్రతిఫలం!! (96-99)
ఇవి కొన్ని జనపదాల చారిత్రక గాధలు. వీటిని మేము నీకు విన్పిస్తున్నాం. అ జనపదాలలో కొన్ని ఇప్పటికీ (జరిగిన ఘటనలకు సాక్షీభూతంగా) నిలిచిఉన్నాయి. మరికొన్ని సమూలంగా తుడిచిపెట్టుకుపోయాయి. మేము వారికి అన్యాయం చేయ లేదు. వారే ఆత్మవంచనకు పాల్పడి ఆపద కొనితెచ్చుకున్నారు. దేవుని ఆజ్ఞ వచ్చిన ప్పుడు, దేవుడ్ని వదలి వారు పూజిస్తూ వచ్చిన మిధ్యాదైవాలు వారికి ఏమాత్రం ఉప యోగపడలేదు. అవి వారికి వినాశం, విధ్వంసాలే తెచ్చిపెట్టాయి. (100-101)
నీ ప్రభువు ఏదైనా దుర్మార్గపు పట్టణాన్ని పట్టదలచుకుంటే ఆయన పట్టు ఇలాగే ఉంటుంది. నిజంగా ఆయన పట్టు చాలా కఠినంగా, అతి బాధాకరంగా ఉంటుంది. పరలోక శిక్ష గురించి భయపడేవారికి ఇందులో ఎంతోగుణపాఠం ఉంది. అదొక (నిర్ణీత) దినం. ఆ రోజు మానవులంతా సమావేశమవుతారు. ఆరోజు జరిగే విశేషాలన్నీ అందరి కళ్ళముందు ఉంటాయి. దాన్ని తీసుకురావడానికి మేమెంతో ఆలస్యం చేయడంలేదు. అతిస్వల్ప వ్యవధి మాత్రమే దానికోసం నిర్ణయించబడింది. (102-104)
ఆరోజు ఏ ఒక్కరికీ నోరుమెదిపే ధైర్యం కూడా ఉండదు, దేవుని అనుమతితో ఏదైనా కొంచెం మనవి చేసుకోవడం తప్ప. ఆరోజు కొందరు దౌర్భాగ్యులు ఉంటారు. మరికొందరు సౌభాగ్యులు ఉంటారు. (105)
దౌర్భాగ్యులు నరకానికి పోతారు. (అక్కడ తీవ్రమైన వేడి, దాహం వల్ల) వారు రొప్పుతూ, రోజుతూ ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతుంటారు. నీ ప్రభువు మరేదయినా తలిస్తే తప్ప వారు ఆ స్థితిలోనే భూమ్యాకాశాలున్నంత వరకు పడివుంటారు. నీ ప్రభువు తాను తలచుకున్న ప్రతి పనీ చేయగల సమర్థుడు, సర్వశక్తి మంతుడు. పోతే, సౌభాగ్యులు మాత్రం స్వర్గానికి వెళ్తారు. నీ ప్రభువు మరేదయినా తలిస్తే తప్ప వారు స్వర్గంలోనే భూమ్యాకాశాలున్నంత వరకు (సుఖంగా) ఉంటారు. వారికక్కడ ఎన్నటికీ ఎడతెగని బహుమానాలు లభిస్తాయి. (106-108)
కనుక ప్రవక్తా! వారు ఆరాధిస్తున్న వాటిని గురించి నీవు ఏమాత్రం సందేహించకు. పూర్వం తమ తాతముత్తాతలు ఎలా (గుడ్డిగా మిధ్యాదైవాలను) ఆరాదిస్తూ ఉండేవారో వీరు కూడా అలాగే ఆరాధిస్తున్నారు. మేము వారికి రావలసిన కర్మఫలం వారికి పూర్తిగా ఇచ్చి వేస్తాం. అందులో ఎలాంటి కొరత చేయము. (109)
మేము దీనికి పూర్వం మూసాకు కూడా గ్రంథం ప్రసాదించాము. (ఈ గ్రంథం విషయంలో లాగే) దాని విషయంలో కూడా (సత్యతిరస్కారులు) అభ్యంతరాలు లేవ దీశారు. నీప్రభువు వైపున ఒకమాట ముందే నిర్ణయించబడక ఉంటే (ఇలా) అభ్యం తరాలు లేవదీసేవారి సంగతి ఎప్పుడో తేల్చివేయబడి ఉండేది. వారసలు దాన్ని గురించి సందేహం, సందిగ్ధాలలో పడిపోయారు. నీ ప్రభువు వారికి తప్పకుండా వారి కర్మఫలం ఇచ్చివేస్తాడు. ఆయన వారి చర్యలన్నిటినీ గమనిస్తున్నాడు. (110-111)
కనుక నీవు, అపమార్గం వదలివచ్చిన నీ అనుచరులు మీకివ్వబడిన ఆజ్ఞ ప్రకారం సన్మార్గంలో స్థిరంగా ఉండండి. హద్దుమీరి ప్రవర్తించకండి. మీరు చేస్తున్నదంతా మీ ప్రభువు ఓకంట గమనిస్తూనే ఉన్నాడు. ఆ దుర్మార్గులవైపు ఏమాత్రం మొగ్గకండి. అలా చేస్తే మీరూ నరకాగ్నికి సమిధలైపోతారు. దేవుని పట్టు నుండి కాపాడేందుకు మీకు ఎలాంటి స్నేహితుడుగాని, సంరక్షకుడుగాని, సహాయకుడుగాని లభించడు. (112-113)
వినండి. పగటివేళ ఆద్యంతాలలో (ఉదయం, సాయంత్రం), రాత్రివేళ కొంచెం సమయం గడచిన తర్వాత ప్రార్థన చేయండి. నిస్సందేహంగా సత్కార్యాలు దుష్కార్యా లను నిర్మూలిస్తాయి. అనుసరించేవారి కోసం ఇదొక హితబోధ. (కష్టకాలంలో) సహనం వహించండి. సదాచారుల ప్రతిఫలాన్ని దేవుడు ఎన్నటికీ వృధాచేయడు. (114-115)
మరి మీకు పూర్వం ఉండిన జాతులలో ప్రజలను ప్రపంచంలో అరాచకం, అల్ల కల్లోలాలు రేకెత్తించకుండా నిరోధించే సంఘశ్రేయోభిలాషులు ఎందుకు లేరు? ఒకవేళ ఉన్నా బహుకొద్దిమందే ఉన్నారు. వారిని మేము ఆ జాతుల బారినుండి కాపాడాము. దుర్మార్గులు మాత్రం భోగభాగ్యాలలో తేలియాడుతూ పాపపంకిలంలో కూరుకు పోయారు. ప్రజలు సంస్కర్తలయి మంచి పనులు చేస్తుంటే దేవుడు వారి పట్టణాలను ఎన్నటికీ అన్యాయంగా నాశనం చేయడు. దేవుడు అలాంటివాడు కాదు. (116-117)
నీ ప్రభువు తలచుకుంటే యావత్తు మానవాళిని ఒకేజాతిగా, ఒకే సముదాయంగా చేసేవాడు. కాని వారిప్పుడు విభిన్న పద్ధతులు అనుసరిస్తున్నారు. వారిలో నీ ప్రభువు కరుణించినవారు మాత్రమే అపమార్గానికి దూరంగా మసలుకుంటారు. ఈ పని (భావా చరణల స్వేచ్ఛనిచ్చి పరీక్షించడం) కోసమే ఆయన మానవుల్ని సృష్టించాడు. మానవు లతో, జిన్నులతో నరకం నింపేస్తానని నీ ప్రభువు అన్నమాట (ఇలా) నెరవేరుతుంది.#
ముహమ్మద్‌ (సల్లం)! ఇవి దైవప్రవక్తల గాధలు. నీకు మనోబలం చేకూర్చడానికి వీటిని వివరిస్తున్నాం. ఈ గాధల ద్వారా నీకు వాస్తవమయిన విషయజ్ఞానం లభించింది. అటు విశ్వాసులకు హితోపదేశం, గుణపాఠాలు కూడా ఉన్నాయి. (118-120)
విశ్వసించనివారికి ఇలా చెప్పెయ్యి: “మీరు మీ పద్ధతుల ప్రకారమే నడచుకోండి. మేము మా పద్ధతుల ప్రకారం నడచుకుంటాము. పర్యవసానం కోసం మీరూ ఎదురు చూడండి; మేమూ ఎదురుచూస్తుంటాము.” భూమ్యాకాశాల్లో నిక్షిప్తమయి ఉన్న సమస్తం దేవుని అధీనంలోనే ఉంది. సకల వ్యవహారాలు చివరికి ఆయన దగ్గరికే చేరుకోవలసి ఉంటుంది. కనుక ముహమ్మద్‌ (సల్లం)! నీవు ఆయన్నే ఆరాధించు. ఆయన మీదే భారం వెయ్యి. మీరు చేస్తున్నదంతా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. (121-123)