కురాన్ భావామృతం/అల్-హజ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

22. హజ్‌ (కాబాయాత్ర)
(అవతరణ: మదీనా; సూక్తులు: 78)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
మానవులారా! మీ ప్రభువు ఆగ్రహానికి దూరంగా ఉండండి. ప్రళయ భూకంపం చాలా తీవ్రమైన (భయంకర) విషయం. ఆరోజు పరిస్థితి చూడు... పాలుపట్టే ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను సైతం మరచిపోతుంది. అలాగే ప్రతి గర్భిణికీ గర్భస్రావం అవుతుంది. ప్రజలు మైకంలో లేకపోయినా మైకంలో ఉన్నట్లు కన్పిస్తారు. నిస్సందేహంగా దైవశిక్ష చాలా కఠినంగా ఉంటుంది. (1-2)
కొందరు జ్ఞానం లేకుండానే దేవుని విషయంలో వాదిస్తారు. వారు తలబిరుసెక్కిన ప్రతి షైతాన్‌ని అనుసరిస్తారు. వాడి తలరాతలో తనతో స్నేహం చేసిన ప్రతి మనిషినీ వాడు మార్గభ్రష్టుడిగా చేసి, నరకందారి చూపిగాని వదలిపెట్టడని రాసిఉంది. (3-4)
మానవులారా! పునరుజ్జీవం గురించి మీకేమైనా అనుమానముంటే, గుర్తుంచు కోండి... మాశక్తి మీముందు ప్రస్ఫుటం కావడానికి మేము (మొదట) మిమ్మల్ని మట్టితో సృజించాం. తర్వాత వీర్యబిందువు ద్వారా పుట్టించాం. ఆతర్వాత పిండంరూపంలో, ఆపై మాంసంతో. దాని రూపం అందంగా, అందవిహీనంగానూ ఉంటుంది.
మేము తలచినదాన్ని గర్భాశయంలో ఒక నిర్ణీతకాలం వరకు ఆపి ఉంచుతాం. తర్వాత మిమ్మల్ని ఒక శిశువు రూపంలో బయటికి తీస్తాం. (ఆ తర్వాత) మీరు పూర్తిగా యుక్తవయస్సుకు చేరుకోవడానికి (మిమ్మల్ని పోషిస్తున్నాం). అయితే మీలో కొందరిని ముందుగానే వెనక్కి పిలిపించుకుంటున్నాము. మరికొందరిని అన్నీ తెలిసిన తరువాత ఏమీ తెలియనంత సుదీర్ఘ వయస్సుకు చేర్చుతున్నాము.
నీవు భూమి పరిస్థితి చూస్తూనే ఉన్నావు. అది ఎండి బంజరునేలగా మారుతుంది. తర్వాత మేము వర్షం కురిపించగానే సస్యశ్యామలమై ఉబ్బిపోతుంది. తర్వాత రమణీ య దృశ్యంతో రకరకాల చెట్లు, చేమల్ని మొలకెత్తిస్తుంది. వీటన్నిటికి మూలకారణం దేవుడు మాత్రమే సత్యం. ఆయనే మృతుల్ని తిరిగి బ్రతికించేవాడు. ఆయన ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. కనుక ప్రళయం తప్పకుండా వస్తుంది. (చచ్చి) సమాధుల్లోకి పోయినవారందర్నీ దేవుడు తప్పకుండా (బ్రతికించి) లేపుతాడు. (5-7)
మరికొందరు ఎలాంటి జ్ఞానం, మార్గదర్శకత్వం, (జ్ఞాన)కాంతి ప్రసాదించే గ్రంథం లేకుండానే ప్రజలను పెడదారి పట్టించడానికి దేవుని విషయంలో గుండెలు విరుచుకొని మరీ వాదిస్తుంటారు. అలాంటివాడికి ప్రపంచంలో అవమానం, అప్రతిష్ఠలే మిగులు తాయి. ప్రళయదినాన మేమతనికి నరకాగ్ని యాతనలు చవిచూపిస్తాం. “ఇదే నీకోసం, నీ చేజేతులా సంపాదించి పంపుకున్నదాని ఫలితం. అంతేగాని దేవుడు తన దాసులకు ఎలాంటి అన్యాయం చేయడు” (అని అతనికి చెప్పబడుతుంది). (8-10)
ప్రజల్లో మరికొందరు (గోడమీది పిల్లిలా) ఒడ్డుమీద నిల్చొని దేవుడ్ని ఆరాధిస్తారు. లాభం కన్పిస్తే తృప్తిపడతారు. కష్టం వచ్చిపడితే (ఇస్లాం నుండి) వెనక్కి మరలిపోతారు. ఇలా వారు (రెంటికి చెడ్డ రేవడిలా) ఇటు ప్రపంచాన్నీ, అటు పరలోకాన్నీ కోల్పోతారు. ఇదే అసలైన నష్టమంటే. ఆతర్వాత వారు (నిజ)దేవుడ్ని వదలి తమకు లాభంగాని, నష్టం గాని చేకూర్చలేని మిధ్యాదైవాల్ని ప్రార్థిస్తారు. ఇదే మార్గభ్రష్టత్వానికి పరాకాష్ఠ. (11-12)
వారు లాభంకన్నా ఎక్కువ నష్టం కలిగించే వాటిని వేడుకుంటున్నారు. అతని సంరక్షకుడు పరమచెడ్డవాడు; అతని సహచరుడు కూడా పరమచెడ్డవాడే. (పోతే) సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులైనవారిని దేవుడు తప్పక సెలయేరులు పారే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. దేవుడు తాను తలచిన పని చేసితీరుతాడు. (13-14)
తనకు ప్రపంచంలోగాని, పరలోకంలోగాని దేవుడు ఎలాంటి సహాయం చేయడని భావిస్తున్నవాడు ఒక త్రాటి సహాయంతో ఆకాశానికి ఎక్కి రంధ్రం వేయాలి. ఆ తరువాత తనకు కంటకప్రాయమైన విషయాన్ని తన శక్తియుక్తులు నిరోధించ గలుగుతాయేమో చూసుకోవాలి... ఇలాంటి స్పష్టమైన విషయాలతో మేమీ ఖుర్‌ఆన్‌ని అవతరింపజేశాము. దేవుడు తాను తలచిన వ్యక్తికి మార్గం చూపుతాడు. (15-16)
సత్యాన్ని విశ్వసించినవారు, యూదులయినవారు, సాబియీలు (బాప్టిస్టులు), క్రైస్తవులు, మజూసీలు (అగ్ని పూజారులు), బహుదైవారాధకులు- వీరందరినీ గురించి దేవుడు (రేపు) ప్రళయదినాన తీర్పుచేస్తాడు. ప్రతి వస్తువూ, ప్రతి విషయమూ దేవుని దృష్టి పథంలో ఉంది. (17)
భూమ్యాకాశాల్లో ఉన్న సమస్త సృష్టిరాసులు దేవుని ముందు సాష్టాంగపడుతున్న విషయం నీవు గమనించలేదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, అనేకమంది మానవులు, (దైవ)శిక్షకు అర్హులైపోయిన చాలా మంది మానవులు కూడా (సాష్టాంగపడుతున్నారు). దేవుడు ఒక వ్యక్తిని నీచుడిగా, క్షుద్రుడిగా చేయదలచుకుంటే, ఇక అతడ్ని ఎవరూ గౌరవించరు. దేవుడు తాను తలచిన పని తప్పకుండా చేస్తాడు. (18)
ఈ రెండు వర్గాల (విశ్వాసులు, అవిశ్వాసుల) మధ్య వారి ప్రభువు (ఆరాధన) విషయంలో జగడం ఏర్పడింది. వారిలో సత్యాన్ని తిరస్కరించినవారి కోసం అగ్నివస్త్రాలు తయారు చేయబడ్డాయి. వారి తలలపై సలసల మరిగే నీటిని కుమ్మరించడం జరుగుతుంది. దానివల్ల వారి చర్మాలు మాత్రమే కాదు, వారి పొట్టలోని పేగులు సయితం కాలి కరిగిపోతాయి. అంతేకాదు, వారిని చితక బాదడానికి ఇనుప గదలు కూడా ఉంటాయి. వారా (ఇనుప గదల) బాధ భరించలేక నరకం నుండి పారిపోవడా నికి ప్రయత్నించినప్పుడల్లా “దహన యాతనలు చవిచూడండి” అంటూ దైవదూతలు వారిని తిరిగి నరకంలోకి త్రోసివేస్తారు. (19-22)
(పోతే రెండో వర్గం వారయిన సత్యాన్ని) విశ్వసించి సత్కార్యాలు చేసినవారిని దేవుడు సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. వారక్కడ స్వర్ణ కంకణాలు, మణిమాణిక్యాలతో అలంకరించబడతారు. (ఎంతో విలువైన) పట్టువస్త్రాలు ధరిస్తారు. వారికి ఇహలోకంలో శిష్టవచనం స్వీకరించే సద్బుద్ధి ప్రసాదించబడింది. వారికి (దేవుని) వెలుగుబాట చూపబడింది. (23-24)
అవిశ్వాసులు (నేడు ప్రజలను) దైవమార్గంలోకి రానివ్వకుండా నిరోధిస్తున్నారు. మేము ప్రజల కోసం నిర్మించిన ప్రతిష్ఠాలయాన్ని సందర్శించనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రతిష్ఠాలయంపై స్థానికులేగాక, బయటనుండి వచ్చేవారికి కూడా సమాన హక్కులున్నాయి. అలాంటి దేవాలయంలో ఎవరయినా సరే నీతిమార్గం తప్పి దౌర్జన్యానికి పాల్పడితే వారికి మేము దుర్భర శిక్ష చవిచూపిస్తాం. (25)
ఇబ్రాహీం వృత్తాంతం జ్ఞాపకం తెచ్చుకో. అతని కోసం మేమీ ఆలయస్థలాన్ని ప్రతి పాదిస్తూ ఇలా ఉపదేశించాం: “నాకు ఎవరినీ సాటి కల్పించకూడదు. నా ఆలయ ప్రదక్షిణ చేసే, ఇక్కడ ప్రార్థనకై నిలబడే, మోకరిల్లే, సాష్టాంగపడే వారి కోసం పవిత్రంగా ఉంచాలి. హజ్‌ చేయడానికి ప్రజలకు సాధారణ అనుమతి నివ్వాలి. వారు దూరదూర ప్రాంతాల నుంచి కాలినడకన, ఒంటెలమీద వస్తారు. వారిక్కడ తమకోసం ఉంచబడిన ప్రయోజనాలు చూసి తరిస్తారు. కొన్ని నిర్ణీత దినాలలో మేము ప్రసాదించిన పశువుల్ని దేవుని పేరుతో బలిచేస్తారు. దాన్ని వారూ తింటారు, పేదలక్కూడా దానం చేస్తారు. ఆ తర్వాత వారు తమ మురికి, మలినాలు తొలగించుకుంటారు. తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఆపై ఈ ప్రాచీనాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు.” (26-29)
ఇదే (కాబానిర్మాణ లక్ష్యం). దేవుడు నిర్దేశించిన ప్రతిష్ఠాత్మక విషయాలను ఎవరు గౌరవిస్తారో అది దేవుని దృష్టిలో స్వయంగా వారికే శ్రేయస్కరం.
మీకు లోగడ తెలియజేయబడినవి తప్ప మిగిలిన పశువులన్నీ మీకోసం ధర్మ సమ్మతం చేయబడ్డాయి. కనుక మీరు విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండండి. అసత్యాలు, అభూతకల్పనలు మానేయండి. పూర్తిగా ఏకోన్ముఖులై అల్లాహ్‌నే ఆరాధిం చండి. ఆయనకు ఎవరినీ సాటికల్పించకండి. దేవునికి సాటి కల్పించినవాడు ఆకాశం నుండి అమాంతం అథఃపాతాళంలోకి పడిపోయినట్లే. ఇక అతడ్ని పక్షులైనా పొడుచుకు తింటాయి; లేదా గాలిఅయినా ఎత్తి దూరంగా విసరిపడవేస్తుంది. (30-31)
ఇదే (అసలు విషయం). ఎవరు దేవుడు నిర్ణయించిన ధార్మిక చిహ్నాలను గౌరవిస్తారో వారి హృదయాలలో ఇది దైవభీతికి నిదర్శనం అవుతుంది. (32)
ఓ నిర్ణీతకాలం వరకు ఆ బలిపశువుల్ని మీరు ఇతర పనులకోసం ఉపయోగించు కోవచ్చు. తరువాత (వాటిని) వాటి (బలి) ప్రదేశమైన ప్రాచీనాలయం దగ్గర (బలిచేయ వలసి) ఉంటుంది. (33)
ప్రజలు తమకు దేవుడిచ్చిన పశువుల్ని దేవునిపేరు స్మరించి బలివ్వడానికి మేము ప్రతి సమాజానికి ఒక బలివిధానం నిర్ణయించాం. గుర్తుంచుకోండి, మీఆరాధ్యుడు ఒక్క దేవుడు మాత్రమే. ఆయన ఆజ్ఞలనే శిరసావహిస్తూ ఆయనకే మీరు విధేయులైఉండాలి.
ప్రవక్తా! నమ్రత, అణుకువలతో నడచుకునేవారికి శుభవార్త విన్పించు. దేవుని ప్రసక్తి రాగానే వారి హృదయాలు కంపించిపోతాయి. కష్టాలు వచ్చినప్పుడు వారు సహనం వహిస్తారు. నమాజ్‌ (వ్యవస్థ)ను నెలకొల్పుతారు. మేము ప్రసాదించిన ఉపాధి నుండి (మా మార్గంలో) ఖర్చుపెడ్తారు. (34-35)
మేము బలిపశువుల్ని మీ కోసం దైవచిహ్నాల జాబితాలో చేర్చాము. వాటిలో మీ శ్రేయస్సు ఉంది. కనుక వాటిని (ఒంటెలను) నిలబెట్టి దేవుని పేరు ఉచ్చరించండి. (అంటే దేవుని పేరు స్మరించి జిబహ్‌ చేయండి. బలిచేసిన కొద్ది క్షణాలకు) వాటి వీపులు నేలమీద (చలనరహితంగా) నిలిచిపోయిన తరువాత వాటి మాంసాన్ని మీరూ తినండి; అర్థించేవారికి, అర్థించనివారికి కూడా ఇవ్వండి. మీరు మాపట్ల కృతజ్ఞులై ఉండ టానికే మేమిలా పశువుల్ని మీకోసం అదుపులో ఉంచాం. (36)
దేవుని వద్దకు వాటి రక్తమాంసాలు చేరవు. మీ భయభక్తులే ఆయన దగ్గరకు చేరు తాయి. మీకు సన్మార్గం చూపినందుకు కృతజ్ఞతగా తనను స్తుతించడానికే దేవుడు ఈ పశువుల్ని మీఅదుపులో ఉంచాడు. ప్రవక్తా! సజ్జనులకు శుభవార్త అందజేయి. (37)
దేవుడు విశ్వాసుల తరఫున తప్పకుండా పోరాడుతాడు. ఆయన విశ్వాసఘాతకు డైన ఏ కృతఘ్నుడ్నీ ప్రేమించడు. (అన్యాయంగా) దాడికి పాల్పడినవారితో పోరాడేవారికి (ఆత్మరక్షణ పోరాటానికై) అనుమతి ఇవ్వబడుతోంది. కారణం, వారు చాలా పీడించ బడ్డారు. వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. (38-39)
వారు తమ ఇండ్ల నుంచి అన్యాయంగా వెడలగొట్టబడ్డారు. వారు “మా ప్రభువు అల్లాహ్‌” అన్నంత మాత్రానికే ఇలా జరిగింది. దేవుడు గనక ప్రజలను ఒకరిద్వారా మరొకరిని తుదముట్టించకపోతే, దేవుని పేరు అత్యధికంగా స్మరించబడే మఠాలు, మందిరాలు, చర్చీలు, మసీదులు, (ఇతర) ఆరాధనాలయాలు ధ్వంసం చేయబడే ప్రమాదం ఉంటుంది. (కనుక) దేవుడు (తన ధర్మానికి) సహాయం చేసేవారిని తప్పక ఆదుకుంటాడు. దేవుడు ఎంతో బలాఢ్యుడు, సర్వశక్తిమంతుడు. (40)
వీరు (ఎంతో నీతిమంతులు), వీరికి మేము ధరణిలో రాజ్యాధికారమిస్తే ప్రార్థనా (నమాజ్‌) వ్యవస్థ నెలకొల్పుతారు. (పేదల ఆర్థిక హక్కయిన) జకాత్‌ చెల్లిస్తుంటారు. (ప్రజలను) మంచిని గురించి ఆదేశిస్తారు, చెడుల నుండి వారిస్తారు. సమస్త వ్యవహా రాల పర్యవసానం దేవుని చేతిలోనే ఉంది. (41)
ప్రవక్తా! వారు నిన్ను తిరస్కరిస్తే (తిరస్కరించనీ), వారికి పూర్వం నూహ్‌జాతి, ఆద్‌ -సమూద్‌ జాతులు, ఇబ్రాహీంజాతి, లూత్‌జాతి, మద్యన్‌వాసులు కూడా తిరస్కరిం చారు. మూసా కూడా తిరస్కరించబడ్డాడు. వారికి మొదట్లో నేనెంతో అవకాశమిచ్చాను. ఆ తరువాతే వారిని పట్టుకున్నాను. చూడు నాశిక్ష ఎంత కఠినమైనదో! (42-44)
(ఈవిధంగా) మేము పాపాత్ములుండిన ఎన్నో పట్టణాలను నాశనం చేశాము. ఈనాడు అవి తల్లక్రిందులుగా పడి (శిధిలావస్థలో) ఉన్నాయి. ఎన్ని బావులు పాడుపడి ఉన్నాయి! మరెన్ని మేడలు శిధిలాలుగా మారిపోయాయి!! వీరు ప్రపంచంలో తిరిగి చూడరా? (తిరిగి చూస్తే) వారి హృదయాలు (వాస్తవాన్ని) అర్థం చేసుకునేవిగా, వారి చెవులు (సత్యాన్ని) వినేవిగా మారేవికదా! నిజానికి చర్మ చక్షువులకు అంధత్వం లేదు. హృదయ చక్షువులకే అంధత్వం ఉంది. (45-46)
వీరు శిక్ష కోసం మహా తొందరపడుతున్నారు. దేవుడు తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగపరచడు. కాని నీప్రభువు దృష్టిలో ఒక రోజు మీరు లెక్కించే వేయి సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. ఎన్నో పట్టణాలు దుర్మార్గానికి పాల్పడ్డాయి. నేను మొదట్లో వాటికి అవకాశమిచ్చాను. ఆ తరువాత వాటిని పట్టుకున్నాను. చివరికి అందరూ నా దగ్గరికే తిరిగి రావలసి ఉంటుంది. (47-48)
ప్రవక్తా! వారికిలా చెప్పు: “ప్రజలారా! నేను (మీ శ్రేయోభిలాషిని. దుర్దినాలు దాపు రించక ముందే) మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడ్ని మాత్రమే.” కనుక సత్యాన్ని విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి మన్నింపు, గౌరవప్రదమైన ఉపాధి ఉన్నాయి. మా సూక్తుల్ని కించపరచడానికి ప్రయత్నించేవారు నరక వాసులవుతారు. (49-51)
ముహమ్మద్‌ (సల్లం)! మేము నీకు పూర్వం షైతాన్‌ గొడవ లేకుండా ఉండే ఏ ప్రవక్తనూ, సందేశహరుడ్నీ పంపలేదు. ప్రతి ప్రవక్తా ఏదైనా చేయదలచుకున్నప్పుడల్లా షైతాన్‌ అతని పనికి అవరోధాలు సృష్టిస్తుండేవాడు. అయితే షైతాన్‌ సృష్టించే అవరోధా లన్నిటినీ దేవుడు (ఎప్పటికప్పుడు) తొలగిస్తూ తన సూక్తుల్ని మరింత పటిష్ఠం చేస్తున్నాడు. దేవుడు సర్వం తెలిసినవాడు, మహా వివేకవంతుడు. హృదయాల్లో రోగమున్నవారికి, వక్రమనస్కులకు షైతాన్‌ దుశ్చర్యల్ని దేవుడు కఠిన పరీక్షగా చేస్తాడు. అసలీ దుర్మార్గులు శత్రుత్వం వహించడంలో హద్దుమీరిపోయారు. (52-53)
జ్ఞానం ప్రసాదించబడినవారు ‘ఇది నీప్రభువు నుండి వచ్చిన సత్యం’ అని తెలుసు కొని దాన్ని విశ్వసించాలి. వారి హృదయాలు ఆయన ముందు లొంగిపోవాలి. విశ్వసించే వారికి దేవుడు ఎల్లప్పుడూ సన్మార్గమే చూపిస్తాడు. (54)
సత్యతిరస్కారులు తమపై హఠాత్తుగా ప్రళయం వచ్చిపడే వరకు లేదా ఒక దుర్దినాన ఏదైనా విపత్తు విరుచుకుపడే దాకా దాని విషయంలో ఎప్పుడూ అనుమానం లోనే పడిఉంటారు. ప్రళయదినాన రాజ్యాధికారం దేవునిదే అవుతుంది. ఆరోజు, విశ్వసించి సదాచార సంపన్నులైనవారిని గురించి ఆయన తీర్పు చేస్తాడు. వారు భోగ భాగ్యాలతో నిండిన స్వర్గవనాల్లో ప్రవేశిస్తారు. మా సూక్తులు నిరాకరించి అవిశ్వాసులై పోయిన వారికోసం మాత్రం అవమానకరమైన యాతన కాచుకొని ఉంది. (55-57)
దైవమార్గంలో వలసపోయినవారు తరువాత చావడమో లేక చంపబడటమో జరిగితే, అలాంటివారికి దేవుడు (పరలోకంలో) శ్రేష్ఠమైన ఉపాధినిస్తాడు. దేవుడే అందరి కంటే మంచి ఉపాధిప్రదాత. వారిని ఆయన వారు పరమానంద భరితులయ్యే నిల యానికి చేరుస్తాడు. దేవుడు సర్వం తెలిసినవాడు, ఎంతో మృదుహృదయుడు. (58-59)
తనకు అన్యాయం జరిగిన మేరకు మాత్రమే ప్రతిక్రియ చేసిన వ్యక్తిపై తిరిగి దౌర్జన్యం జరిగితే దేవుడు అతనికి తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (60)
రాత్రి నుండి పగటిని, పగటి నుండి రాత్రిని వెలికి తీసేవాడు దేవుడే. ఆయన సమస్తం వింటున్నాడు, చూస్తున్నాడు. అంతేకాదు, దేవుడే సత్యం. దేవుడ్ని వదలి వారు పూజిస్తున్నవన్నీ మిధ్య, అసత్యం మాత్రమే. దేవుడే గొప్పవాడు, మహోన్నతుడు. (61-62)
దేవుడు ఆకాశం నుండి వర్షం కురిపిస్తున్నాడు. దానివల్ల భూమి సస్యశ్యామలమై పోతుంది. ఈవిషయాన్ని మీరు గమనించడం లేదా? ఆయన ఎంతో సూక్ష్మగ్రాహి, సర్వం ఎరిగినవాడు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం ఆయన సొత్తే. ఆయన నిరపేక్షా పరుడు, స్వతహాగా ప్రశంసనీయుడు. (63-64)
ప్రపంచంలో ఉన్న సమస్తాన్నీ ఆయన మీకోసమే అదుపులో ఉంచాడు. ఆయనే ఓడలను తన ఆజ్ఞతో సముద్రంలో నడిచేలా క్రమబద్ధీకరించాడు. ఆయనే ఆకాశాన్ని తన ఆజ్ఞ లేనిదే పడిపోకుండా ఉండేలా పొదివిపట్టుకున్నాడు. ఇదంతా మీరు చూడటం లేదా? దేవుడు మానవులపట్ల ఎంతో వాత్సల్యుడు, దయామయుడు. ఆయనే మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు, చంపుతున్నాడు. ఆయనే మిమ్మల్ని (అంతిమదినాన) తిరిగి బ్రతికిస్తాడు. కాని మానవుడే చాలా కృతఘ్నుడై పోయాడు. (65-66)
ప్రతి మానవసముదాయం కోసం మేమొక ఆరాధనావిధానం నిర్ణయించాం. దాన్నే అది అనుసరిస్తుంది. కనుక ప్రవక్తా! ఈవిషయంలో వారు నీతో వాదించకూడదు. నీవు నీప్రభువు (సందేశం) వైపు ప్రజల్ని పిలువు.. నిస్సందేహంగా నీవు సన్మార్గంలో ఉన్నావు#
నీతో వాదనకు దిగితే వారికిలా చెప్పు: “మీరు చేసే పనులన్నీ దేవునికి బాగా తెలుసు. ఆయన ప్రళయదినాన మీరు విభేదిస్తున్న విషయాలన్నిటిని గురించి మీ మధ్య తీర్పు చెబుతాడు. భూమ్యాకాశాలకు చెందిన అణువణును గురించి ఆయనకు తెలుసని నీవెరుగవా? అవన్నీ ఒక గ్రంథంలో నమోదయి ఉన్నాయి. ఈ పనులన్నీ దేవునికి ఏమాత్రం కష్టసాధ్యం కావు. (67-70)
వీరసలు దేవుడ్ని వదలి మిధ్యాదైవాలను ఆరాధిస్తున్నారు. అందుకు దేవుడు ఎలాంటి ప్రమాణం పంపలేదు. వారికి కూడా ఆ మిధ్యాదైవాల్ని గురించి ఎలాంటి జ్ఞానం లేదు. కనుక ఈ దుర్మార్గులకు (పరలోకంలో) సహాయం చేసేవారెవరూ ఉండరు. (71)
అవిశ్వాసులకు మా విస్పష్టసూక్తులు విన్పిస్తున్నప్పుడు నీవు గమనించే ఉంటావు. వారు ముఖాలు చిట్లించుకొని మాసూక్తులు పఠిస్తున్నవారిపై విరుచుకుపడతారా అన్నట్లు వారివైపు కొరకొర చూస్తారు. వారికి చెప్పు: “అంతకంటే నీచమైన విషయం ఏమిటో చెప్పనా మీకు? నరకాగ్ని! అవిశ్వాసుల కోసం అది కాచుకొని ఉందని దేవుడు వారి విషయంలో వాగ్దానం చేశాడు. అది పరమ చెడ్డనివాసం.” (72)
మానవులారా! ఒక ఉదాహరణ ఇస్తున్నాం, జాగ్రత్తగా వినండి: మీరు దేవుడ్ని వదలి ప్రార్థిస్తున్న మిధ్యాదైవాలన్నీ కలసి కనీసం ఒక ఈగనైనా సృష్టించదలచుకుంటే, దాన్ని కూడా సృష్టించలేవు. పైపెచ్చు ఆ ఈగ ఆ మిధ్యాదైవాల దగ్గర్నుంచి ఏదైనా వస్తువుని గుంజుకుంటే ఆ వస్తువుని కూడా అవి దాన్నుండి విడిపించుకోలేవు. సహాయం అర్థించే వారు, సహాయం అర్థించబడేవారు ఇద్దరూ బలహీనులే. అసలు శక్తిమంతుడు, గౌరవ నీయుడు దేవుడు మాత్రమే. (73-74)
దేవుడు దైవదూతల్ని సందేశహరులుగా నియమిస్తాడు. మానవుల్లో కూడా కొంద రిని సందేశహరులుగా నియమిస్తాడు. ఆయన సమస్తం వింటున్నాడు, (ప్రత్యక్షంగా) చూస్తున్నాడు. వారి కళ్ళెదుట ఉన్నదేమిటో, వారికి కనుమరుగై ఉన్నదేమిటో అంతా ఆయనకు తెలుసు. సమస్తవ్యవహారాలు ఆయన దగ్గరికే చేరుకోవలసిఉంది. (75-76)
విశ్వాసులారా! (విశ్వప్రభువు సన్నిధిలో) మోకరిల్లండి, సాష్టాంగపడండి, (ఈ విధం గా) మీ ప్రభువును ఆరాధించండి, సత్కార్యాలు చేయండి; బహుశా మీరు కృతార్థు లవుతారు. (మీ జీవితం సార్థకం అవుతుంది.) దైవమార్గంలో (దుష్టశక్తులతో) పోరాడ వలసిన విధంగా పోరాడండి. ఆయన మిమ్మల్ని తన పని కోసం ఎన్నుకున్నాడు. ధర్మంలో ఆయన మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. మీ తండ్రి ఇబ్రాహీం సమాజంలో స్థిరంగా ఉండండి. దైవప్రవక్త మీకు సాక్షిగా నిలబడేందుకు, మీరు ప్రజలకు సాక్షులుగా ఉండేందుకు దేవుడు మీ పేరును ఇదివరక్కూడా ముస్లిం అనే పెట్టాడు, ఇప్పుడీ గ్రంథంలో కూడా (అదే పేరు పెట్టాడు).
కనుక నమాజ్‌ (వ్యవస్థ) నెలకొల్పండి. (పేదల ఆర్థిక హక్కు) జకాత్‌ చెల్లించండి. దేవుడ్ని (ఆయన ధర్మాన్ని) గట్టిగాపట్టుకొని ఉండండి. ఆయనే మీ సంరక్షకుడు. ఆయన ఎంతో మంచి సంరక్షకుడు, మంచి సహాయకుడు కూడా. (77-78)