వేమన పద్యాలు
ఇష్ట దేవతా స్తుతి[మార్చు]
విఘ్నముల కాది కర్తయౌ విఘ్నపతిని
విశ్వ సాక్షిగ నెంచుట వినతియగును
శుద్ధ చిన్మాత్రుడని యెంచి సొక్క వలయు
విశ్వధాభిరామ వినుర వేమ!
తాత్పర్యము: విఘ్నాధిపతియైన వినాయకుని విశ్వసాక్షిగా భావించి ప్రార్థించాలి. ఆ పరమాత్మ పవిత్ర జ్ఞాన స్వరూపునిగా కొలవాలి.
శివకవులకు నవకవులకు
శివభక్తికి తత్వమునకు చింతామణికిన్
శివలోక ప్రమథులకును
శివునకు గురువునకు శరణుసేయర వేమా!
తాత్పర్యము: శివకవులను, నవకవులను, శివభక్తిని, శివతత్వాన్ని, చింతామణిని, శివలోకంలో నివశించే ప్రమధగణాలని, శివుణ్ణి, గురువునీ శరణు వేడుకోవాలి.
శ్రీరామ యనెడు మంత్రము
తారకమని యెరిగి మదిని ధ్యానపరుండై
సారము గ్రోలిన నరునకు
చేరువగను పరమ పదము చేకూరు వేమా!
తాత్పర్యము: శ్రీరామ నామము తారకమంత్రము. ఆ రామనామంలోని సారాన్ని గ్రహించి మనస్సులో ధ్యానం చేసినట్లయితే మోక్షం తప్పక లభిస్తుంది.
శ్రీయన మంగళదేవత
శ్రీయనగా విష్ణుపత్ని సిరిసంపదయున్
శ్రీయనెడు మూలశక్తిని
శ్రీయని వర్ణింపుమెపుడు స్థిరమతి వేమా!
తాత్పర్యము: శ్రీ అనగా శుభాలను కలుగచేయు దేవత, విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి, సిరి సంపదలకు మూలము, ఆ శక్తియే మూలశక్తి, కనుక స్థిరబుద్ధి కలవాడవై "శ్రీ" శక్తిని స్తుతించాలి.
శ్రీమూలశక్తి యనదగు
నా మూర్తుల కన్నతల్లి నే గానకన్
ధీమూర్తి నెంచిచూడుము
నేమూర్తికి సాటిలేదు నిజముగ వేమా!
తాత్పర్యము: ఆదిపరాశక్తి శ్రీకారము. సమస్త విశ్వము ఆమెనుంచి ఉద్భవించాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఆదిపరాశక్తి (శ్రీకారము) కన్నతల్లి. ఆమెతో సమానమయిన దేవత మరియొకరు లేరని గ్రహించాలి.
కఫము మీఱి మఱియుఁగనులు మూతలుపడి
బుద్ధి తప్పిచాల బుడమి మఱచు
వేళలందు నిన్ను వెదుకుట సాధ్యమా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము: మరణ సమయంలో కఫం నోటికి అడ్డుపడి మాటను రానీయదు, కనులు మూతపడిపోతూ ఉంటాయి. జ్ఞానం తగ్గిపోతూ ఉంటుంది. ఈ లోకాన్నే గుర్తించలేని స్థితిలో ఉండి పరమాత్ముడవైన నిన్ను వెదుకుట సాధ్యంకాదు. కనుక శరీరంలో శక్తి ఉన్నప్పుడే భగవంతుని ధ్యానించి పరమాత్మను చేరాలి.
ఆత్మపూజ[మార్చు]
ఏవంక మనసు కలిగిన
నా వంకను నింద్రియంబులన్నియు నేగున్
నీ వంక మనసు కల్గిన
ఏ వంకకు నిందరియంబు లేగవు వేమా!
తాత్పర్యము: మనస్సు ఎటువైపుకి ప్రయాణిస్తే ఇంద్రియాలన్ని అటువైపున ప్రయాణిస్తూ ఉంటాయి. కనుక మనస్సుని భగవంతునిపై లగ్నం చేస్తే ఇంద్రియాలు కూడా భగవంతుని వైపే ఉంటాయి.
ఎట్టిరూపుచూడ నీరూపు గనిపించు
నీదురూపుచూడ నెచ్చు తెలివి
యె
చ్చు తెలివికెల్ల ఈవెగా దోచురా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము: లోకంలో ఏ రూపాన్ని చూసినా పరమాత్మవైన నీ రూపం కనబడుతోంది. అటువంటి స్థితిని పొంది నీ రూపాన్ని చూసినట్లయితే నాలోని అజ్ఞానం పోయి జ్ఞానోదయం కలుగుతోంది. ఈ బ్రహ్మజ్ఞానానికి నీవే మూలాధారం అని తెలుస్తోంది.
నిన్ను జూచెనేని తన్నుదామఱచును
దన్ను జూచినేని నిన్ను మఱచు
నేవిధమున మనుజుఁడెఱఁగు నిన్నును దన్ను
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము: పరమాత్మ ప్రత్యక్షమయినప్పుడు తనను తాను మరచి భగవంతున్ని చూస్తూ ఉండిపోతాడు. ఒకవేళ పరమాత్మ గురించి ఆలోచించడం మానేసి తనగురించి తాను ఆలోచిస్తూ ఉంటే భగవంతుడిని చూడలేరు. కనుక మానవులు భగవంతుని గురించి, తనగురించి ఒకేసారి ఏ విధంగా తెలుసుకో గలుగుతాడు.
నీవాడిన నేనాడును
నీ వుండిన నేనుండు నిర్వణ్ణుఁడనై
నీవు దలంచినఁ దలపుదు
నీవు నగిన నేను నగుదు నిజముగ వేమా!
తాత్పర్యము: ఓ పరమాత్మా నీవు ఆడుతూ ఉంటే, నేనూ ఆడుతూ ఉంటాను. నీవు నిర్వికారంగా ఉంటే నేనూ నిర్వికారంగానే ఉంటాను. నీవు నన్ను తలచుకుంటూ ఉంటే నిన్ను నేను తలచుకుంటూ ఉంటాను. నువ్వు నవ్వుతూ ఉంటే నేనూ నవ్వుతూ ఉంటాను.
నీవు గలుగుచోట నెలవు దెలియువాడు
వసుధయందు త్రోవ వదలడెందు
కాలుకదలనీక గ్రక్కున చేరురా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము: పరమాత్మను చేరే మార్గాన్ని తెలుసుకొన్నవాడు ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా, ఏ మాత్రం శ్రమ పడకుండా పరమాత్మ పధాన్ని చేరుకుంటాడు.
పలుకమన్న నేల పలుకక యున్నావు?
పలుకుమయ్య నాతో ప్రబలముగను
పలుకుమయ్య నీదు పలుకు నేనెరిగెద
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము: ఓ పరాత్పరా! నేను "మాట్లాడమని" నిన్ను ప్రార్థించినా నీవు నాతో కరుణించి మాట్లాడుటలేదు. నేను ఆశ్చర్యపడునట్లుగా నీవు నాతో మాట్లాడు. నీవు మాట్లాడినట్లయితే నీ మాటలు ఎలా ఉంటాయో తెలుసుకుంటాను.
వెలది చక్కదనము వెరపైన యీడును
విభుని కరుణ లేక విగతినుండు
నీదు కరుణ లేక నేర్పులు కొరగావు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము: స్త్రీయొక్క అందము, వయసు కూడ భగవంతుని కరుణ లేకపోతే అందవిహీనంగా మారిపోతాయి. భగవంతుని కరుణ లేనిదే ఎటువంటి ప్రతిభా పనికిరాకుండా పోతుంది. భగవంతుని కరుణ లేనిదే ఎటువంటి ప్రతిభా చెల్లదని భావం.
వేమన జీవితాంశము[మార్చు]
వేమన తన జన్మ వృత్తాంతాన్ని ఈ పద్యాలలో తెలియ బరుస్తున్నాడు.
నందన సంవత్సరమున
పొందుగ కార్తీకమందు బున్నమినాడీ
వింధ్యాద్రి సేతువులకును
నందున నొక వీరు డేరుపడెరా వేమా!
తాత్పర్యము: నందననామ సంవత్సరములో కార్తీకమాసంలో పున్నమి తిధియందు వింధ్యపర్వతము సముద్రమునకు మధ్యభాగమునందు ఒక వీరుడు జన్మించాడు.
ఊరుకొండవీడు వునికి పశ్చిమవీధి
మూగచింతపల్లె మొదటి యిల్లు
ఎడ్డిరెడ్డికులము యేమని చెప్పుదు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము: కొండవీడుకి పశ్చిమంగా ఉన్న మూగచింతపల్లి గ్రామంలో మొదటి ఇల్లు తన నివాసమని, రెడ్డి కులంలో జన్మించానని వేమన తెలియ బరుస్తున్నాడు.
టక్కురులగూడి తిరుగుచు
ఎక్కుడు కాలంబు జ్ఞాన మెరుగలేక
నొక్క వెలయాలి పొందునె
మిక్కుటమగు మోక్షమనుచు మెలగితి వేమా!
తాత్పర్యము: దుష్టులతో కలసిమెలసి తిరుగుతూ అజ్ఞానంతో కాలాన్ని వృధా చేస్తూ, వెలయాలి పొందే మోక్షమని భావిస్తూ తిరిగాను.
ఎంతకాలమో వ్యర్థమై యంతవీలు
చక్కగాచిక్క వెంటనే జలకమాడి
పాత్రపుష్పములిడుకొని పట్టినాడఅ
గుహముఖము సొచ్చి కనుగొంటినిగురుని వేమా!
తాత్పర్యము: ఈ విధంగా ఎన్నో రోజులు వ్యర్థమయిపోయాక ఒక రోజున పుష్పాలు తీసుకొని గుహలో ప్రవేశించగా నా గురువుని (అభిరాముని) చూసాను.
ధర తగ కీర్తిమంతుడును దైవసముండతిగోప్యుడోర్పుమీ
రరహిని కొండవీటి యభిరామయ నాగురువర్యుడాతడు
న్మఱియు ప్రభుండనవీవు నను మానము లేదిక మీదునామముల్
స్థిరముగనుండు గాక యిది సిద్ధము సుమ్ము జాగన వేమ!
తాత్పర్యము: లోకంలో మంచి కీర్తి కలవాడు, దైవసమానుడు అతి రహస్యముగా జీవిస్తున్న కొండవీటి అభిరామయ్య నా గురువు, ప్రభువు. అతని పేరు లోకంలో స్థిరంగా ఉండేటట్టగా చేస్తాను అని వేమన చెబుతున్నాడు.
కాదనడెవ్వరితోడను
వాదాడగబోడు వెర్రివానివిధమునన్
భేదాభేద మెరుంగును
వేదాంత రహస్యములను వేమన నుడువున్ ||
తాత్పర్యము: తన గురువైన అభిరాముడు ఎవ్వరితోను వాదనకు దిగకుండగా, మంచి చెడ్డలను గ్రహిస్తూ, వేదాంత రహస్యములను వేమనకు బోధిస్తూ ఉండేవాడు. అభిరాముడు పైకి వెర్రివాడివలె కనిపించెడివాడు.
గ్రంథసంఖ్య[మార్చు]
నీతి, వైరాగ్య, భక్తి, వి నీతులకును
ఘూతకులుఁ గాని, జ్ఞాన సం కలితులకును
వ్రాలకందని పద్యముల్ వేలసంఖ్య
చేత; నందుగ వేమనఁ జెప్పె భువిని.
శ్రీకర శివతత్వ శీలుఁడౌ వేమన్న
పదియునైదువేల పద్యములను
లోకమందుఁ జెప్పె ప్రాకృతుల్ దరిఁజేర,
విశ్వదాభిరామ వినురవేమ!
వేమన పద్యాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|