Sriram vishnudatta/sandbox

వికీసోర్స్ నుండి
template error: please do not remove empty parameters (see the style guide and template documentation).

NETIKLAPUKAVITVAM

By Akkiraaju Umakanta Vidyasekharulu


ప్రధమ ముద్రణ: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు 1928

ద్వితీయ ముద్రణ: తెలుగు విశ్వవిద్యాలయం 1994

ప్రచురణ సంఖ్య: 148

ప్రతులు: 2000

వెల: రూ. 35.00

ప్రతులకు:

రిజిస్ట్రా ర్

తెలుగు విశ్వవిద్యాలయం

పబ్లిక్‌గార్డెన్సు నాంపల్లి

హైదరాబాదు - 500 004

ముద్రణ:

ఎస్. వి. ప్రింటర్స్

1-1-770/5, గాంధినగర్

హైదరాబాదు 500 380

అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు

ప్రథమ ముద్రణ ముఖపత్రం లోపలి పుట నమూనా

పండిత శ్రీ ఉమాకాన్తవిద్యాశేఖరుల

కృ తు లు

వాఙ్మయ పరిశిష్టభాష్యం

నే టి కా ల పు క వి త్వం.


ప్రకాశకులు:

వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్.

చెన్నపురి.

శ్రీరామ ముద్రాక్షరశాలయందు

ముద్రణము 1928

All Rights Reserved

[వెల రూ..2-8-0

ముందు మాట

ఆచార్య పేర్వారం జగన్నాథం

ఉపాధ్యక్షులు

తెలుగు విశ్వవిద్యాలయం

హైదరాబాదు

నేటి కాలపు కవిత్వం అనే గ్రంధం ఆధునిక కవితా రీతులపై ఈ శతాబ్దంలో వచ్చిన తొలి గ్రంధం. ఇందువల్ల కాలికంగానూ వస్తువిషయకంగానూ ఈ గ్రంధానికి ప్రాముఖ్యం ఉన్నది. సుమారు డెబ్బై సంవత్సరాలనాడు తొలిసారి ప్రకటితమైన ఈ గ్రంథాన్ని గూర్చి ఈ తరం తెలుగు భాషాసాహిత్య విద్యార్దులకు గానీ సామాన్య తెలుగు పాఠకులకు గానీ అంతగా తెలియదు. ఈగ్రంథకర్త అయిన ఉమాకాంత విద్యాశేఖరులవారి దాడి అంతా ముఖ్యంగా భావకవిత్వాన్ని ఉద్దేశించిందే అని ఈ గ్రంథంలో ఆయన లేవనెత్తిన అంశాలద్వారా తెలుస్తున్నది. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో మూడు దశాబ్దాల కాలం భావకవిత్వం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది. ఇంచుమించు ఈ శతాబ్ది మొదటి దశాబ్దం గడిచే నాటికి తెలుగు సాహిత్యంలో భావకవిత్వం కవితాకాశంలో ఇంద్రధనుస్సులాగా ఉజ్వలించింది. ఆ తర్వాత సుమారు ఒక దశాబ్దం గడిచేసరికి అత్యున్నత దశకు చేరుకున్నది మరో దశాబ్ది గడిచేసరికి క్రమంగా కళాకాంతులు కోల్పోయింది, భావకవిత్వం పరాకాష్ఠకు చేరి ఆంధ్ర దేశంలో భావకవిత్వారాధనలు విరివిగా జరుగుతున్న సమయంలో ఉమాకాంత విద్యాశేఖరుల "నేటికాలపు కవిత్వం" వచ్చింది. 1910 సంవత్సరానికి రూపురేఖలు దిద్ది తీర్చుకున్న భావకవిత్వం 1934-35 సంవత్సరాలకు తన ప్రాభవం కోల్ఫోయి వేళాకోళానికి హాస్యభాజనతకు గురి అయ్యే స్థితికి చేరుకున్నది అప్పటినుండి ఆధునిక సాహిత్యంలో అభ్యుదయ కవితా యుగం ఆరంభమైనదంటారు సాహిత్య విమర్శకులు.

అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు నవద్వీప విద్వత్పరిషత్తు సాహిత్య సదస్సులలొ పాల్గొని అక్కడి మహావిద్వాంసుల మన్నన పొందినవారు కలకత్తాలో ప్రమదనాధ తర్కవాచస్పతి వద్ద తమ సంస్కృత సాహిత్య ప్రతిభకు మెరుగులు దిద్దుకొన్నవారు అక్కడి ప్రెసిడెన్సీ కాలేజిలో ఎఫ్ ఎ చదవటానికి ఉపక్రమించినవారు 1923 లో ప్రారంభించి తెలుగుదేశపు వాఙ్మయ పత్రికను అత్యంత ప్రతిభావంతంగా ఒక మూడేళ్లపాటు నిర్వహించారు. 1926లో నేటికాలపు కవిత్వం తొలి ముద్రణ వచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు భారతి రజతోత్సవ సంచికలో ప్రకటించిన పాతికేళ్ల తెలుగు కవిత్వం ప్రస్తావనలో ఉమాకాంత విద్యాశేఖరుల "నేటికాలపు కవిత్వం" ప్రస్తావన కూడా వస్తుంది ఆ మహాపండితుడి ఆక్షేపణలకు సమాధానం ఎవరేం చెప్పగలరు? మరింత ఉత్సాహంతో పట్టుదలతో నవ్యకవితారీతులను ప్రచారం చేయడమే ఆయనకు చెప్పగల సమాధానమని మేమనుకున్నాం అని ప్రస్తావించారు దేవులపల్లివారు.

వ్యాస, వాల్మీక, కాళిదాస, భవభూతుల సారస్వతాన్ని అధ్యయనం చేసి హృద్గతం చేసుకోకుండా భారతీయ సాహిత్య సంప్రదాయ ప్రస్థాన పరిశ్రమ లేకుండా భారతీయాలంకారిక సంప్రదాయం అలక్ష్యం చేస్తూ భావకవులు తామేదో నూతన కవితాలోకాలను ఆవిష్కరణం చేశామని స్వీయ ప్రశంసలకు పూనుకోవడం అనుచితమని "నేటికాలపు కవిత్వం" ద్వారా ఉమాకాంతంగారు ఆక్షేపించారు. ఇంగ్లీషు సాహిత్యంనుంచి ఉపజ్జారహితంగా అనుకరించడం తగదన్నారు. పూర్వపక్ష ప్రతిపక్ష సిద్ధాంతపూర్వకంగా తగు విమర్శసాగించారు. ఇది సంస్కృత వాఙ్మయంలోని భాష్య రచనా సంప్రదాయం తమ విమర్శను భాష్య గ్రంధమనే అన్నారు విద్యాశేఖరులు.

ఆధునిక తెలుగు కవిత్వం దాని పరిణామ వికాసాలను గూర్చి నిరంతర జిజ్ఞాసతో అధ్యయన తత్పరత్వంతో కృషిని కొనసాగిస్తున్న భాషావేత్త ఆచార్య చేకూరి రామారావు ఈ కవితా విమర్శ గ్రంథానికి సంపాదకత్వం వహించడం సముచితమని తెలుగు విశ్వవిద్యాలయం భావించింది వారీ పనిని సమర్ధంగా నిర్ఫహించారు వారికి కృతజ్ఞతలు చెపుతూ సాహితీ విద్యార్దులకు ఈ గ్రంథం ఉపకరించగలదని విశ్వసిస్తున్నాను.

హైదరాబాదు.

20-4-1994

పేర్వారం జగన్నాధం

సంపాదకీయం

"దేశంలో భారతీయ సంస్కార ప్రవాహాలు ఇంకిపోయినవి. విద్యాపీఠాలు అస్తమించినవి. గురుకులాలు రూపు మాసినవి. భారతీయ సంస్కారం లేని కేవల పాశ్చాత్య సంస్కారం బలప్రదం కాక ఆత్మ విముఖత్వాన్ని పర సంస్కార దాస్యాన్ని మనకు ఆపాదించినవి".

ఈ పుస్తకం చివర రాసిన పైమాటల్లో అక్కిరాజు ఉమాకాంతం (1889-1942) గారి సర్వసాహిత్య కృషి నేపద్య సారాంశం తెలుస్తుంది. ఆయన జీవించింది 53 సంవత్సరాలే అయినా అమోఘమైన పాండిత్యంతో అసమాన వాదపటిమతో అవిచ్చిన్న సారస్వత వ్యాసంగంతో తెలుగు సాహిత్య లోకంలో చిరకాలంగా పాతుకు పోయిన విశ్వాసాలను కుదిపి వేసిన సాంస్కృతిక విప్లవకారుడు అక్కిరాజు ఉమాకాంతం గారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవటానికి ఆయన జీవిత చరిత్ర ఎవరూ రాయలేదు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు గారి శత జయంతి సంపుటం (1986) లో "త్రిలిఙ్గ తొలినాళ్ళ సంపాదకులు ఉమాకాంత విద్యా శేఖరులు" అనే పేరుతో అక్కిరాజు రమాపతిరావుగారి అయిదు పేజీలు చిరు వ్యాసమూ తెలుగు విజ్ఞాన సర్వస్వము మూడవ సంపుటంగా వచ్చిన 'తెలుగు సంస్కృతి' అనే వాల్యూము (1959) లో అబ్బూరి రామకృష్ణారావుగారి ఒక పేజీకి మించని చిన్న నోటూ మాత్రమే ప్రధాన ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి.

అక్కిరాజు ఉమాకాంతంగారు గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా గుత్తికొండ అనే చిన్న గ్రామంలో లక్ష్మమ్మ లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు. గుత్తికొండకు సుమారు ఏడెనిమిది మైళ్ళ దూరంలో ఉన్న జానపాడు అనే ఊళ్ళో సంస్కృత భాషాభ్యాసం చేశారు. శిష్ట్లా సీతారామశాస్త్రి గారు వీరి గురువుగారు ప్రస్తుత గ్రంథంలొ మొదటి శ్లోకంలో వారి ప్రస్తావన ఉంది. పదిహెను పదహారేళ్ళ వయసులో గుంటూరు లూధరన్ మిషన్ వారి హైస్కూలులో ఇంగ్లీషు చదువులు చదివారు మెట్రిక్యులేషన్ చదివే రోజుల్లో ఈయన శతావధానం చేశారు. బెజవాడలో కన్యకాపరమేశ్వరి హిందూ పాఠశాలలో కొన్నాళ్ళు తెలుగు పండితులుగా ఉద్యోగం చేశారు. 1912 లో తెరచిన ఆంధ్రసాహిత్యపరిషత్తు మద్రాసు కార్యాలయంలో జయంతి రామయ్యగారి ఆహ్వనంపై కొన్నాళ్ళు మేనేజరుగా పనిచేశారు. వేషధారణపై వచ్చిన పేచీ వల్ల ఉమాకాంతంగారు ఉద్యొగం మానేసినట్లు రమాపతిరావుగారు పైన పేర్కొన్న వ్యాసంలో రాశారు. ఈయన బెంగాల్‌లో నవద్వీప సంప్రదాయాన్ననుసరించి భాష్యాంతముగా సంస్కృత వ్యాకరణమూ తర్కశాస్త్రమూ, అభ్యసించి 'విద్యాశేఖరు' లైనా రని అబ్బూరి రామకృష్ణరావుగారు రాశారు. "తమ తర్క వ్యాకరణ విద్యా వ్యాసంగాన్ని వంగ దేశంలో జరుపుతూ వచ్చారు. వంగ సాహిత్యవేత్తలతో సాహచర్యం వల్లా లోకజ్ఞానం వల్లా స్వానుభవం వల్లా వంగసాహిత్యాభ్యుదయానికి గల కారణాలను వివేకంతో సూక్ష్మంగా పరిశీలించడం వల్లా తమకు కలిగిన జ్ఞానాన్ని ఆధారంగా తీసికొని తమ మాతృభాష అయిన తెనుగును పరామర్శించడం ఆరంభించారు" అని అన్నారాయన ఆయన వావిలి కొలను సుబ్బారావుగారి తరవాత (1929లో) మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకులుగా పనిఛేశారు. 1913-1914 మధ్య కాలంలో త్రిలిఙ్గ పత్రిక సంపాదకులుగా పనిచేశారు. 'త్రిలిఙ్గ' అనే పేరు ఆయన పెట్టిందేనని త్రిలిఙ్గ రజతోత్సవ సంచిక (1941)కు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఆ సందేశంలో ఇంగ్లీషులో కామెంటు (Comment) అనే మాటకు పర్యాయంగా వ్యాఖ్యా శబ్దాన్ని పరీక్ష పత్రాల్లో తానే మొదట వాడినట్లు పేర్కొన్నారు.

1913-1914 సంవత్సరాల మధ్యలో ఆయన త్రిలిఙ్గ పత్రికలో కధలు రాశారు 1918 లో ఇవి త్రిలిఙ్గ చిన్నకధలు పేరుతో సంకలితం అయ్యాయి. ఉమాకాంతం గారు తమ కధల పీఠికలో 'ఇట్టి కధల వాఙ్మయము తెలుగునకు కొత్తది ' అని గుర్తించారు. అప్పటి కాయన రచనాశైలి ప్రాచీన భాషకు సన్నిహితం సంధి నియమాలను సడలించి ఆధునిక రచనాభాషను ఏర్పరచటానికి ఉమాకాంతం గారు కూడా కృషి చేసినట్లు ఈ సంపుటం ద్వారా తెలుసుకోవచ్చు ఈయన కధల్లో కూడా తొలినాటి ఇతరుల కథల్లో లాగే లక్ష్యం సాంఘిక సంస్కరణే. మూఢ విశ్వాసాల నిర్మూలనే బ్రాహ్మణ సమాజంలో పాదుకొన్న మూఢ విశ్వాసాల వల్ల స్త్రీల బతుకుల్లో ఉన్న బాధల్ని వివిధ రీతుల్లో ఈ కధల్లో వర్ణిస్తారు.

ఈకథల్లో 'ఎదుగనిబిడ్డ ' ఆంధ్ర సాహిత్యాన్ని కన్న తెలుగుతల్లి ఉత్తమ పురుషలో చెప్పిన కథ. చివరివరకు ఎలిగొరీ అనే కథా శిల్పాన్ని పాటించిన ఈ కథలో 'ఆంధ్ర సాహిత్యం ఎప్పుడూ ఎదగని బిడ్దయే' అని తమ నిశ్చితాభిప్రాయాన్ని వెల్లడించారు సుమారు పాతికేళ్ళ ప్రాయంనుంచి ఆయనకు తెలుగు సాహిత్యంపై సదబిప్రాయం లేనట్టు ఈ కథను బట్టి మనం తెలుసుకోవచ్చు అదల్లా ఉంచి ఎలిగొరీ పద్దతిలో ఉత్తమ పురుష కథనంలో రాసిన మొదటి తెలుగు కథ ఇదే కావచ్చు.

తెలుగు సాహిత్యంలో అబివృద్ధి కాని నూతన ప్రక్రియలను అబివృద్ధి చెయ్యాలనే ఆకాంక్ష ఆయనకు గాఢంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆకోరికే ఆయన చేత చిన్న కథలను రాయించింది ఫిలిప్ మెడోస్ టైలరు (Philip Meadows Tailor 1808-1876) అనే ఆంగ్ల నవలా కారుడు రచించిన టిప్పు సుల్తాన్ నవలను ఆంద్రీకరించి 1912 నవంబరులో ప్రకటించారు. ఈ నవల పీఠికలో కూడా ఆంధ్ర సాహిత్య స్థితిని గూర్చిన చర్చ ఉంది. టైలరు హైందవ సంప్రదాయాభిమామాని కావటం వల్ల అతని రచనను తెలిగించానని ఉమాకాంతం గారు పీఠికలొ చెప్పుకున్నారు. 'ఉమాకాంతం గారు 1921 లో తెలుగు దేశ వాఙ్మయ పత్రికను స్థాపించి సంస్కృత వ్యాకరణ ప్రదీపం. పాణినీయ ఆంధ్ర వివరణం. రసమీమాంస నైషద తత్వ జిజ్ఞాస వంటి ప్రశస్త రచనలు వెలువరించారు' అని అక్కిరాజు రమాపతి రావుగారు రాశారు.

'లౌకిక దృష్టితో చెప్పుకోదగిన సంఘటన లేవీ ఆయన జీవితంలో లేవు పాండిత్యానికి తగిన శరీర దార్డ్యం ఆయన కెన్నడూ లేకపోయింది' అని అబ్బూరి రామకృష్ణారావు తెలుగు విజ్ఞానసర్వస్వంలో అన్నారు.

ఉమాకాంతంగారి రచనలపై సమగ్ర సమీక్ష జరగలేదు సంపూర్ణమైన అంచనా రాలేదు. ఆయన రచనలు దొరికినంత వరకూ (అన్నీ దొరకవు) పరిశీలిస్తే ఆయనకు తెలుగు సాహిత్యంపై నిర్ధిష్టమైన అభిప్రాయాలు విలక్షణమైన ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన రచనలన్నింటా తెలుగు సాహిత్య స్థితిని గూర్చి ఆవేదన కనిపిస్తుంది. ప్రచురణ వివరాలు దొరకలేదు గాని రమాపతి రావుగారి సౌజన్యం వల్ల ఆయన చిన్న చిన్న వ్యాసాలు కొన్ని దొరికాయి.

సాంఘికంగా ఆయనకు అబివృద్దికరభావాలే ఉన్నట్టు, సాంఘిక సంస్కరణలకు ఆయన అనుకూలుడే అయినట్టూ ఆయన కథలను బట్టేకాక ఆయన విడివిడి వ్యాసాలనుబట్టి కూడా చెప్పవచ్చు. 'తెలుగు దేశము నందలి చండాలురు' అనే వ్యాసంలో "చండాలురని చెప్పుటకు ఏ ప్రమాణమూ లేని మాదుగులను ఆంధ్రదేశము నందలి మొదటి తెగలగు చెంచులు బలిజెలు మొదలైన వారివంటి మాదుగులను అస్పృశ్యులుగా బాధించుచున్నాము ఊళ్ళనుండి బయటికి వెళ్ళగొట్టినాము. బావుల వద్దకు రానీయము. దేవాలయములలో ప్రవేశించనీయము. ఇంతకంటె తెలుగుదేశము ఆచరించుచున్న అధర్మము మఱియొకటిలేదు. ఈ దురాచారము అప్రామాణికమైనది అనర్ధహేతువైనది అని చెప్పుచున్నాను' అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. విదేశయానం చేసినందుకు నడింపల్లి నరసింహారావు గారిపై తెచ్చిన అభియోగానికి ఉమాకాంతం గారు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. దాన్ని ఒక విమర్శన వ్యాసంగా రాస్తూ సముద్రయానం చెయ్యటం వల్ల పతితుడవుతాడనటానికి శాస్త్ర ప్రమాణం లేదని నిరూపించారు.

ఉమాకాంతం గారు సాహిత్యాంశాలపై తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించారు. ఎంతటి గొప్పవారి అభిప్రాయాలను ఖండించటానికైనా వెనుదీసె వారు కాదు. మద్రాసు విశ్వవిద్యాలయంలో 1923 సంవత్సరానికి పెట్టిన పురాణపండ మల్లయ్య శాస్త్రిగారి శుక్రనీతిని విమర్శిస్తూ 'బ్రదిమి ఏనిక దిగ్గియ ఒండె ఉలుపా ఎకిమీడు ' వంటి పాతబడ్ద మాటలను వాడటాన్ని నిరసించారు. ఆ పుస్తకానికి యోగ్యతా పత్ర మిచ్చిన జయంతి రామయ్య గారి స్వవచో వ్యాఘాతాలను ప్రదర్శించారు.

ఇంగ్లీషు పాఠ్య నిర్ణాయక సంఘంలో ప్రెసిడెన్సీ కాలేజిలో ఇంగ్లీషు బోదించే వారిని వేసి, తెలుగు పాఠ్య నిర్జాయక సంఘంలో తెలుగు బొధకులను వేయక పోవటాన్ని నిరసించారు.

విష్ణు చిత్తీయ వ్యాఖ్యాన సభలో వేదం వెంకటరాయశాస్త్రిగారు కట్టమంచి రామలింగారెడ్దిగారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో తీవ్రంగా విభేదిస్తూ వాఙ్మయపత్రికలో వ్యాసాలు రాశారు. ఆముక్త మాల్యదలో చాలా గొట్టుమాటలున్నాయి కాబట్టి అది గొప్ప కావ్యం అయినట్టు వేదం వెంకటరాయశాస్త్రి గారన్నారని చెపుతూ ఆ మాటలందు నాకు ప్రమాణ బుద్ది కలగలేదు అన్నారు. మను చరిత్రలో రసాభాస ఉన్నది కాబట్టి దాన్ని మంచి కావ్యం కాదన గూడదన్నారు (అంతమాత్రం చేత మను చరిత్ర ఉత్తమ కావ్యమనికాదు ఇతర కారణాలు చూపించాలని ఆయన అభిప్రాయం) రసాభాస నిషిద్ధం కాదని అది అంగంగా ఉండవచ్చునని సిద్ధాంతం చేశారు. ఇంతకీ మనుచరిత్రలో ఉన్నది రసాభాసకాదని వరూధిని కది వాస్తవమేనని వాదించారు. ఆ సందర్భంలోనే మనుచరిత్రను పెద్దన రచించ లేదనీ కృష్ణరాయలు రచించాడనీ కట్టమంచి రామలింగారెడ్డిగారు చేసిన అభాషణాన్ని విమర్శిస్తూ "కృష్ణరాయలు రచించినా కృష్ణశ్రీష్ఠిరచించినా కృష్ణామాత్యుడు రచించినా, కృష్ణ భట్టు రచించినా, పుస్తకములోని మంచి చెడ్డలు మారవు గనుక ఆ విచారణ నేనిక్కడ పెట్టుకోలేదు" అని వస్తుగత విమర్శ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు.

కట్టమంచి రామలింగా రెడ్డిగారు మద్రాసు గోక్లేహాల్లో ఇచ్చిన ఉపన్యాసాన్ని పత్రికల్లో చదివి వాఙ్మయ పత్రికలో విమర్శించారు. రామాయణం కంటే భారతం ప్రాచీనం అని రెడ్దిగారా ఉపన్యాసంలో చెప్పారు. భారతం కావ్యంకాదు. సంహిత అని రెడ్డిగారన్నారు. భారతం కావ్యమేనని. భారతం కంటే రామాయణం పూర్వమనే ఉపనిషత్తులను ప్రదర్శిస్తూ ఉమాకాంతంగారు వారించారు. ఆ సందర్భంగా "వాస్తవముగా సంఘమును సంస్కరింపవచ్చును. సర్వసమత్వము ప్రతిష్టించ యత్నించవచ్చును. వీటికన్నిటికి రామలింగా రెడ్దిగారు మరికొన్ని మార్గములు అవలంబించ వలసియున్నది గాని భారత వర్షేతిహాసములను గురించి భారతీయుల ప్రాచీన వాఙ్మయము గురించి తెలిసి తెలియని మాటలు మాట్లాడుట మాత్రము అనుచితమైన కార్యము" అని స్పష్టంగా నిర్భయంగా ప్రకటించారు.

'నైషధ తత్త్వ జిజ్ఞాస' అనేది సంస్కృత నైషధ కావ్యంపై విమర్శ శ్రీహర్షుని మేదాశక్తిని పాండిత్యాన్ని ప్రశంసిస్తూనే నైషధము ఉత్తమ కావ్యము కాదని తేల్చారు. శ్రీహర్షుని కాలానికి భారతదేశంలో శాస్త్ర పరిశ్రమ హెచ్చినదని కావ్య గుణం తగ్గిందని వివరించారు. "అది గొప్ప విమర్శనము బయలుదేరిన సమయము. గొప్ప కవిత్వము కుంటువడిన సమయము" అని అభిప్రాయ పడ్డారు. అందుకు కారణాలను అన్వేషిస్తూ "ఏనాడు అర్ధము యవన హస్తగతమైనదో ఆనాడే భారతీయుడు పరాధీనతను ప్రాపించెను.. ఆర్య సంప్రదాయములు క్రమక్రమముగా విచ్చిన్నము లాయెను. మహమ్మదీయుల విషయ లోలత్వము దేశమున వ్యాపింప జొచ్చెను." అని దేశపరిస్థితులను వివరించారు. భారతదేశ సాంస్కృతిక పతనానికి మహమ్మదీయులు కారణంగా భావింఛే ఒక ఆలోచనా ధోరణి మన దేశంలో చాలా కాలంగా ఉన్నది. అక్కిరాజు ఉమాకాంతం గారి సంస్కత భాషా పాండిత్యం ప్రాచీన భారత సంస్కృతిపై ఆయనకున్న అభిమానము ఎరిగిన వారికి ఆయన ఈ ఆలోచనారీతి ఆశ్చర్యకరం కాదు హిందువులలో సంస్కరణ లాయన కిష్టమే. మహమ్మదీయుల విషయములో ఆయనపై ఆర్య సమాజపు ఆలోచనా ధోరణి ప్రభావం ఉండి ఉండవచ్చును.

గుంటూరు జిల్లా కారెంపూడిలో 1928 జూన్ 9 న జరిగిన సభలో చేసిన ఉపన్యాసం 'ఆంధ్ర భాషోపన్యాసం' గా అచ్చయింది అందులో "నాకు దేశ భాషోద్యమంలో విశ్వాసంగలదు. విజ్ఞాన వ్యాప్తి దేశ భాషయందు వలె అన్య భాషయందు జరుగ నేరదు" అన్నారు తదనుగుణంగా సంస్కృత గ్రంథాలను తెలిగించారు సంస్కృత చంద్రాలోకాన్ని తెలుగు వచనంలో అనువదించారు. పాణినీయాన్ని తెలుగు చేసినట్టు తెలుస్తున్నది. 'పాణినీయము సాంద్ర వివరణము' పేరుతో 9 సంచికల సంపుటంలో గట్టి బైండుతో వచ్చినట్టు ప్రకటన ఉంది. సంస్కృత వ్యాకరణ ప్రదీపము కారకం వరకు రచించినట్లు కూడా అదే ప్రకటనలో ఉంది. ఉమాకాంతంగారికి ఎక్కువ పేరు తెచ్చి పెట్టినవి ఆయన పరిష్కరించి ముద్రించిన పల్నాటి వీరచరిత్ర( 1911-1938) నేటి కాలపు కవిత్వం (1928)

పల్నాటి వీర చరిత్ర మొదటి ముద్రణకు రచించిన పీఠికలో అమూల్యమైన చారిత్రకాంశాలను పొందుపరిచారు. ఇతిహాసాలను గురించి పల్నాడు గురించి శ్రీనాథుని గురించి ఎనబైరెండు పేజీల విపుల చారిత్రక భూమిక ఇది. దాని సారాంశాన్ని ఇంగ్లీషులో ఐదు పేజీల్లో చెప్పారు. డెబ్బైమూడు పేజీల ద్వితీయ భూమిక (1938) లో తెలుగు సాహిత్యంపై తమకున్న అభిప్రాయాల్ని వివరించారు. రెండో పీఠికకు ముందే నేటి కాలపు కవిత్వం వచ్చింది ఈ రెంటిలోనూ పూర్తిగా తర్కపద్ధతి అవలంబించారు ఏవిషయాన్నెత్తుకున్నా సమగ్రంగా చర్చించటం ఆయనకు అలవాటు. అందువల్ల ఆయన పీఠికల్లోనూ వ్యాసాల్లోనూ విషయాన్ని విస్మరించి ఏవేవో మాట్లాడుతున్నట్టనిపించినా అవన్నీ విజ్ఞాన వికాస హేతువులు కావటం విశేషం ఈ రెండో పీఠికలో "పల్నాటి వీర చరిత్రను విచారించడానికి పూర్వం తెలుగు వాఙ్మయాన్ని గురించి క్లుప్తంగా తెలుపుతాను" అని ప్రారంభించి తెలుగు సాహిత్యాన్ని గురించి తమ విలక్షణాభిప్రాయాలను వ్యక్తపరచారు.

"మూలం యొక్క స్వరూపం అవికలంగా భాషాంతరంలో తెలపడమే అనువాదానికి పరమ ప్రయోజనం. నన్నయాదులవి అనుచితానువాదాలు" అని ఆంధ్ర భారతాది గ్రంథాలను విమర్శించారు. తెలుగు ఎప్పుడూ ఉత్తమ విద్యాద్వారంగా ఉండలేదు కాబట్టి తెలుగు అభివృద్ది కాలేదన్నారు. తెలుగు కావ్యాలు అధమాధికారులకే అని ఉమాకాంతంగారి అభిప్రాయం. ఆ స్థితి మద్రాసు విశ్వవిద్యాలయం వచ్చిన తరవాత కూడ మారలేదని ఆనాటి తెలుగు పాఠ్యాదీతర గ్రంథాలనుంచి అధికంగా ఉదాహరించారు శబ్దరత్నాకరంలో 'సఖుడు ' అకారాంత పుంలింగం అనటాన్ని విమర్శిస్తూ అది ఇకారాంత పుంలింగం అనే విషయంగూడా ఈ పీఠికలో ప్రస్తావించారు. సంస్కృతం సరిగ్గా రాని రచయితలను ఆక్షేపిస్తూ వారిని దూడ పేడ సంస్కృతం వారని ఆక్షేపించారు. పంచాగ్నుల ఆదినారాయ శాస్త్రి చిలుకూరి నారాయణరావు వంటి పండితుల రచనల్లోని దోషాలను కూడా చూపించారు.

ఉత్తమ సంస్కృత కావ్యాలను తెలుగులో తీసుకురావాలన్న ప్రయత్నంలో ఆయన రఘువంశానువాదం తల పెట్టినట్టుకనిపిస్తుంది. ఆయన రఘువంశ పీఠికలో --

అక్షరమ్ముల ఆట కవితగ
పెంటకుప్పల జేసి కృతులను
చిందు దొక్కెడి వారి గంతులు
చిన్న పిల్లల వేడుక

అన్నారు ఉమాకాంతంగారి అభిప్రాయాలను ఆయన సహచరులు "దశోపదేశిగా" సంగ్రహించారు. వాటిని ఇక్కడ తిరగరాస్తున్నాను.

1. గధ్యంలో లేని విశేషం పద్యానికి ఛందస్సు సమకూర్చగలినది గతి మనోజ్ఞత 2. అది గణాల ఆరోహణావరోహణల వల్లనే సిద్దిస్తున్నది.

3. అక్షర వినోదం (వళిప్రాసలు) శబ్దాలంకారాల్లో చేరినది.

4. శబ్దాలంకారాలు అలంకారశాస్త్రంలోనివి.

5. శబ్దాలంకారాలు స్వయంగా ఆపతితమైతేనే తప్ప ఆవశ్వకంగా స్వీకార్యం కావని, వీటిని ప్రధానంగా స్వీకరిస్తే కావ్యం అధమ మవుతుందని సాహిత్య వేత్తల మతం.

6. ఇద్ధరన్ మానుగ అనఘ అమల ఓలి, ఒగి పరగు చెన్నుగ యిట్లాటి దండగ చెత్తకు లేదా యతి భంగానికి హేతువై అనర్ధప్రదం కావటం వల్ల అక్షరాల ఆట (పళి ప్రాసలు) ఆవశ్యకంగా ఉపాదేయంకాదు.

7. యతి అంటే విచ్ఛేదం వాగింద్రియ విశ్రాంతిని శ్రావ్యతను పద్యం యొక్క సుపరత్వ రచ్యుత్వాలను సిద్దింపచేస్తుంది గనుక దీర్ఘ పాదాల్లొ మధ్య యతీ పర్వత పాదాంత యతీ నియతం.

8. పద్యం గానీ పద్యాలు గానీ శీఘ్రంగా గాని విలంబంగా గాని అల్లిన మాత్రాన పద్యకర్త అవుతాడు కవి కానేరడు. విజ్ఞానశాలి కానేరడు విద్వద్గోష్టుల్లొ శాస్త్రాబ్యాసజన్యం విజ్ఞానం

9. జన్మాంతర సంస్కార రూపమైన ప్రతిభ విద్వద్గోష్టుల్లో ఉత్తమ విజ్ఞాన లబ్థి. చరాచరలోకప్రభావ పరిశీలనం కావ్యజ్ఞ శిక్ష కావ్యత్వహేతువని మమ్మటుడు.

10. పద్యరూపానగాని గద్య రూపానగాని అనువాదం చేస్తే అనువాది కాగలడుగాని కవి కాజాలడు. రసభావ విష్పాదక మైన సృష్టికి సంబందిచినది కవిత కొంత తీసివేసి కొంతచేర్చి అనువాదం చేస్తే అప్రశస్తాను వాది అనూదిత కావ్యంలో సృష్టివిశేషాదులు అనువాదివి కాజాలవని స్పష్టం.

వీటి అధారంగా ఆయన అనుయాయులు కొందరు అనువాదాలు సాగించి ఆయన సిద్ధాంతాలు ప్రచారం చేసినట్టు కొమరవోలు చంద్రశేఖర మంత్రిగారు ప్రకటించిన లక్ష్యఖండం (1937) వల్ల తెలుస్తుంది ఉమాకాంతం గారి లక్షణాలకు వీరు రచించిన లక్ష్యాలని వీరుద్దేశించి నట్టు 'లక్ష్యఖండం' అనే పేరు పెట్టడం లోనే తెలుస్తున్నది. ఉమాకాంతం గారు రఘువంశ పీఠికలో-

మూలమున లేనట్టిదానిని
వ్రాయననపేక్షితము చెప్పను
అన్న నాథుని మాట దలచగ
అర్హుడనొ కానో!

అన్నారు 'మూలంలో లేనిది చెప్పను. మూలంలో ఉద్దేశించనిది కూడా చెప్పను' అన్న మల్లినాథసూరి మాట తల్చుకున్నారు. ఆయన్ననుసరించి ఆలంపూరు కృష్ణస్వామిగారు --

'వదలి మూలస్థమ్ము లేనిది
కుక్కి అనువాదమ్ము చేసెడి
ఆజ్ఞ మార్గము తొలగిపోవుత
నాకు గురువుల కరుణచే' -- అన్నారు

ఇక్కడ 'గురువులు' అనే మాటలో ఉమాకాంతం గారిని ఉద్దేశించినట్టు భావించవచ్చు.

ఈ మార్గం లోనే కన్నెకంటి ప్రభులింగాచార్యులు గారు కాళిదాసు కుమార సంభవాన్ని అనువదిస్తూ

ఆర్ష భూయస్త్వోత్తమములగు
కాళిదాస కవిత్వవిధులను
మా కొసంగిన మల్లినాథా!
నిన్ను వినుతింతు

అని మల్లి నాథుని ప్రశంసించి --

విడువగా రాదున్నదానిని
లేనిదానిని కుక్కగూడదు
ఇదియె అనువాదాల తెరువను
ప్రవచనమ్ము తలంచెదన్

అని అనువాద విదానంలో ఉమాకాంతం గారి మర్గాన్ని పునరుద్ఘాటించారు.

ఉమాకాంతంగారు వారి అనుయాయులు ఈ అభిప్రాయాలను ప్రచారం చేశారు. సంస్కృత వృత్తాలతో పాటు తెలుగు పద్యాలను కూడా వర్ణమైత్రి లేకుండా ప్రయోగించారు. గీతాది లఘు పద్యాలకు పాదాంత విరతిని మాత్రమే నియమంగా పాటించారు. పెద్ద పద్యాలలో పాదమధ్య విరతిని కూడా పాటించారు.

వీరంతా ముత్యాల సరాన్ని ఆదరించడం చారిత్రకంగా గుర్చించ దగిన ఒక విశేషం అయితే వీరి రచనల్లో ఎక్కడా గురజాడ అప్పారావుగారిని విరివిగా స్మరించినట్లు గాని (ఈ పుస్తకంలో ఒక్క చోట తప్ప) ముత్యాలసరం పేరును ప్రస్తావించినట్లు గాని కనపడదు. అయినా ముత్యాల సరాలను ధారాళంగా వాడారు. అదీ గురజాడ పద్దతిలోనే యతి ప్రాసలు నియమాలుగా కాక అలంకారాలుగా మాత్రమే పరిగణించిన అప్పారావు గారి మార్గం ఉమాకాంతం గారికి నచ్చినట్లు భావించవచ్చు. భావకవులకూ ఉమాకాంతంగారికీ ముత్యాలసరం విషయంలో మాత్రం ఏకీభావం కనిపిస్తుంది. భావకవుల్లో రాయప్రోలు సుబ్బారావుగారు తల్లావజ్ఘల శివశంకర శాస్త్రిగారి వంటివారు వర్ణమైత్రీయుత వళినిగాని ప్రాసముగాని ముత్యాల సరాల్లో కూడా పాటించారు. కృష్ణశాస్త్రి గారి ముత్యాల సరాల్లో వర్ణమైత్రి లేనివి కనిపిస్తాయి.

ఉమాకాంతం గారు ఆంధ్ర వాఙ్మయాన్ని అంతటినీ సూత్ర పద్ధతిలో చెప్పదల్చుకున్నారు. ఆ సూత్రాలకు మళ్ళీతానే భాష్యం చెప్పదల్చుకున్నారు. అయితే చెయ్యదల్చుకున్నవన్నీ చెయ్యటానికి జీవితం చాలింది కాదు. వాఙ్మయదర్శనము పేరుతో ప్రాచీన ఖండాన్ని తొమ్మిది భాగాలు (ఆలోకములు) గా సూత్ర పద్దతిలో రచించారు. ఈ సూత్రాలు గ్రాంథిక భాష (కావ్య భాష)లో ఉన్నాయి. ఈ సూత్రాలు చూస్తే చాలా విస్తృత ప్రణాళికనే వేసుకున్నట్లు తెలుస్తుంది భాష్యం లేక పోయినా ఉమాకాంతంగారి వాఙ్మయ దృష్టిని అర్ధం చేసుకోటానికి ఈ వాఙ్మయ దర్శన సూత్రాలు ఉపయోగపడతాయి. ద్వితీయాలోకంలో.

1. అభారతీయము గనుక 2. సంప్రదాయ విచ్చేదము గనుక 3. త్యాజ్యము క్రీస్తు శకము 4. ఆత్మీయము గనుక 5. అఖండ కాలదర్శన సాదనము గనుక 6. శ్రుతి స్మృతి పురాణేతిహాస దేశీయ కధాచులనుండి అవిచ్ఛిన్నత్వము ప్రతిపాదించును గనుక 7. సంప్రదాయ సిద్ధము గనుక 8. గ్రాహ్యము కలిశకము 9. అవిశేషము వల్ల కలిశకము కృష్ణ శకమని 10.అంతర్భూతము గనుక శాలివాహనము పాక్షికముపధ--

ఉమాకాంతంగారు క్రీస్తు శకాన్ని కూడా గుర్తించని సంప్రదాయ ప్రియుడు. ఆయన తన పీఠికల కిందా, ముద్రించిన రచనల పైనా శాలివాహన శకాన్నే వేసేవారు.

ఉమాకాంతంగారు వాఙ్మయ దర్శనంలో భారతీయ సంస్కారాదుల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. ఇది కాక వేరే ఇంకా ప్రాచీనాంధ్ర వాఙ్మయ సూత్రాల గురించి ఏమైనా రాశారేమో తెలీదు. 'నేటి కాలపు కవిత్వం' అని నామాంతరం ఉన్న ఈ వాఙ్మయ సూత్ర పరిశిష్ట భాష్యంలో మూడు అధ్యాయాలలో ఆధునికాంధ్ర వాఙ్మయాన్ని సూత్రీకరించారు. అందులో మొదటి అధ్యాయం నేటి కాలపు కవిత్వం. దాన్ని మాత్రమే విపులీకరించారు. నేటికాలపు కృతి రచన నేటికాలపు విద్య అనే అధ్యాయాలు సూత్ర రూపంలోనే ఉన్నాయి. భాష్యం రాయలేదు. ఈ పరిశిష్టాన్ని ఆలోకనాలు అనకుండా అధ్యాయాలుగా విభజించటం వల్ల వాఙ్మయ దర్శనం కన్నా బిన్నమైన వాఙ్మయ సూత్రాలు అనే గ్రంథాన్ని రాసినట్టుగానో, కనీసం రాయ తలపెట్టినట్టు గానో ఊహించాలి. అయితే మనకు పూర్తిగా భాష్య రూపంలో దొరుకుతున్నది. ఈ పరిశిష్ట సూత్ర భాష్య రూపమే (అదీ మొదటి అధ్యాయమే) మొదటి సారి వావిళ్ళ ప్రచురణగా 1928 లో వెలువడింది.

ఉమాకాంతం గారు ఈ పుస్తకంలో ప్రధానంగా భావకవిత్వం పేరుతో ప్రచారమైన కవిత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు. తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనాన్ని రేపిన గ్రంథం ఇది. "కాని వారు చేసిన ముఖ్యమైన ఆక్షేపణలకు తగిన సమాధానం ఇంతవరకూ రానే లేదనే అనుకోవలసి వస్తోంది"అని అబ్బూరి రామకృష్ణారావు గారన్నారు. "మహాపండితులైన ఉమాకాంతం విమర్శలకు ఆనాడెవరూ జవాబు చెప్పలేక పోయారు" అని శ్రీశ్రీగారు 1960 లో విశాలాంధ్ర వారి ఆంధ్ర దర్శినిలో రాశారు. భావకవిత్వాన్ని సమర్ధిస్తూ, ప్రశంసిస్తూ, విశ్లేషిస్తూ వ్యాసాలూ, పుస్తకాలూ చాలా వచ్చాయి. కాని, ప్రత్యేకంగా ఉమాకాంతం గారి ఆక్షేపణలకు సమాధానంగా ఇంతవరకూ పుస్తకరూపంలో ఏమిరాలేదన్న మాట నిజమే. అట్లాగే ఉమాకాంతంగారు తిట్టినా అదో గొప్పగా ఆనాటి కవులు చెప్పుకునే వారని అ.రా.కృ గారు అంటుండేవారు. అంతటి మహాపండితుడి దృష్టిలో పడటమే గొప్పగా ఆనాటి కవులు భావించేవారన్న మాట. ఆనాటి భావకవుల్లో బహుశా ఎవరినీ ఆయన క్షమించలేదు. విస్తర దోషాన్ని గురించి విస్తరణాధి కరణంలో చెబుతూ చెప్పవలసినదానికంటే ఎక్కువగా చెప్పటం విస్తర దోషమని నిర్వచించి, ఈ కాలపు కృతుల్లో ఇది విస్తారంగా ఉందని ప్రస్తావించి "యెంకి పాటల వంటి వాటిలో కొన్నిటిలో తప్ప తక్కిన యీ కాలపు కృతుల్లో అనేకాల్లో యీ దోషం కనబడుతున్నది" అని యెంకి పాటలకు మినహాయింపు ఇచ్చారు. ఆ మాత్రం మినహాయింపు ఇయ్యటం కూడా విశేషమే ననుకుంటాను.

ఆధునిక కవిత్వం ప్రాచీన ధోరణుల నుంచి విడివడి కొత్తదారులు వెతుక్కుంటున్న సమయంలో అక్కిరాజు ఉమాకాంతం గారు సాహిత్య విమర్శలో ప్రవేశించారు. సంప్రదాయ పండితులు చాలామంది భావకవిత్వాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఉమాకాంతం గారి మార్గం భిన్నమైనది. ఆయనకు తెలుగులోనే కవిత్వం కనపడలేదు. ఆయన ప్రమాణాలు ప్రాచీన సంస్కృతాలంకారికులవి. వాద పద్దతి సంస్కృతంలో తర్కపద్ధతి. ఈ పద్ధతిలో సిద్ధాంతం - పూర్వపక్షం, ఆక్షేపణ - సమాధానం అనే విభజనలుండటం వల్ల దీనికి ప్రామాణికతే గాక హేతుబద్ధత కూడా వచ్చింది. ఈయనకు పాశ్చాత్య తర్కపద్దతితో కూడా పరిచయమున్నట్టు ఈ గ్రంథం లోనే అనౌచిత్యాధికరణంలో Fallacy of undue Assumption అనే పద్ధతి ప్రస్తావన వల్ల తెలుసుకోవచ్చు.

ఉమాకాంతం గారి తర్క పద్ధతికి, ఆధునిక శాస్త్ర ప్రతిపాదనల పద్ధతికి కొన్ని పోలికలున్నా యి. ఆధునిక శాస్త్ర పద్ధతిలో ఒక ప్రతిపాదన చేసినపుడు ఆ ప్రతిపాదనకు ప్రతికూలమైన అంశాలను కూడా ప్రస్తావించి వాటిని తన ప్రతిపాదన ఎట్లా పరిష్కరిస్తుందో చెప్పాలి. ఆప్పుడే ఆ ప్రతిపాదన సిద్దాంత మవుతుంది. ఉమాకాంతంగారి వాద పద్దతి ఎంత ప్రాచీనమో అంత ఆధునికం కూడా. ఒక విషయాన్ని అన్ని వైపుల నుంచి పరిశీలించటానికి ఉమాకాంతం గారి తర్క పద్ధతి పనికొచ్చింది.

ఇదికాక ఉమాకాంతంగారి శైలి సూటిదనం, సారళ్యం అనే రెండు లక్షణాల వల్ల ఆకర్షణీయంగా ఉంటుంది. 'ఆపతితం, ద్రష్టవ్యం, వక్ష్యమాణం' వంటి మాటలు ఆయన పాండిత్యం వల్ల అరుదుగా దొర్లినా సాంకేతికత లేని సాధారణ పదాలు వాడటం ఆయన అలవాటు. ఉగుడు మాటలు, పులుముడు, వికారాలు, దూడపేడ సంస్కృతం, దండగ్గణం వంటి అతి సామాన్య పద జాలంతో తన భావాలను చెప్పగలిగారు. సిద్ధాంత పూర్వ పక్షాలు, అక్షేప - సమాధానాలు అనే పద్ధతి వాద ప్రతివాదాల సంభాషణ (dialogue) పద్ధతి. ఈ నిర్మాణం (structure) వల్ల శైలి సంభాషణశైలికి సన్నిహితమై మరింత ఆకర్షకమైంది. భాష విషయంలో ఆయన మారీన దృష్టి కూడా ఇందుకు తోడ్పడింది. దానికి తోడు ఉమాకాంతం గారికి విషయ వివరణకుప యోగించే దృష్టాంతాలను, పిట్ట కథలను ఎన్నుకొని విషయ వివరణ చెయ్యటంలో అద్భుతమైన నేర్పుంది. సంస్కృతాంగ్లాలలో విశేషమైన పాండిత్యం ఉన్న ఆయన తన రచనలలో ఉదహరించిన సంస్కృతాంగ్ల వాక్యాలకు తరచుగా ఆంధ్రాను వాదాలను కూడా ఇస్తుంటారు. ఆయన చెప్పిన విషయాల్లో భేదించినా ఆయన వాద పద్దతి నుంచి ఈ నాటి విమర్శకులు నేర్చుకో వాల్సింది చాలా ఉంది. ఉపపత్తులు చూపకుండా ఆయన సిద్ధాంతాలు చెయ్యలేదు. ఆక్షేపణలకు సమాధానాలు చెప్పకుండా సిద్ధాంతాలను ఊరికే వదల లేదు. ఏవిషయాన్ని మరుగుగానూ, ఆస్పష్టంగానూ చెప్పలేదు. ఇన్ని సుగుణాలున్న ఈ పుస్తకం సాహిత్యాభిమానులందరికీ ఆవశ్య పఠనీయం.

ఈ పుస్తకానికి చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. ఒక విద్యావేత్త పరాధీనమైన తన జాతి పతనమై పోతున్నదని, విలువలు క్షీణిస్తున్నాయని, ప్రమాణాలు పడిపోతున్నాయని ఎంత ఆవేదన చెందాడో తెలుసుకోటానికి కూడా ఈ పుస్తకం చదవటం అవసరం. దాదాపు అర్ధాయుష్కుడైన ఒక సాహిత్య కృషీవలుడు ఉన్న కొద్ది జీవితకాలం లోనే ఎన్ని విద్యలు నేర్వవచ్చునో, తాను లోక కళ్యాణమని ఎంచిన దాన్ని ఆచరించటానికి ఎంత కృషి చేశాడో తెలుసుకోటానికి ఆయన జీవితాన్ని గురించి కూడా తెలుసుకోవాలి.

అయితే ఉమాకాంతంగారు భావకవిత్వం గురించి చేసిన నిర్ణయాలు కాలంలో నిలవలేదు. మారుతున్న అభిరుచుల కనుగుణంగా భావ కవిత్వం చరిత్రలో నిలిచింది. స్థిరదోషాలుగా ఉమాకాంతంగారు గుర్తించినవి 'అస్థిర మైనవిగా మారినాయి. వాటిని దోషాలుగా పాఠకులు గుర్తించ లేదు. అయోమయత్వం. పులుముడు, నిదర్శన పరంపరలు, భాషా వ్యతిక్రమం అని పేర్లు పెట్టి ఆయన నిరసించిన వాటిని తరవాత పాఠకులు గుణాలుగా మెచ్చుకొని ఆస్వాదిస్తున్నారు. ప్రాచీన సంస్కృత సాహిత్య శాస్త్ర మర్యాదలు సర్వకాల సర్వదేశ సాహిత్యాలకీ సంపూర్ణ ప్రమాణాలుగా నిలుస్తాయని ఉమాకాంతం గారు. నిజాయితీగానే నమ్మారు. ఆయన ఆనాటి కవులను కఠినంగా విమర్శించారు. చరిత్ర ఇంకా కఠినమైనది. ఉమాకాంతంగారి ఆక్షేపణలను తోసిపుచ్చింది. కాలం మరీ క్రూరమైనది. ఉమాకాంతం గారినే మరుగున పడేట్టు చేసింది. నిర్భీకత, కాలానికి ఎదురీదే లక్షణం, పాండిత్యం, కృషి. చెప్పేవిషయంలో నిజాయితీ, స్పష్టత, సూటిదనం, సహేతుక వాదపటిమ ఆయన నిర్ణయాలను మించి విలువైనవి. అవే ఆయన తన తరువాత తరానికి అందించిన విలువలు. సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతంగారి నిర్ణయాలు ముఖ్యంకాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాశ్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు.

ఈ ముద్రణలో సంపాదకుడుగా నేను చేసిన మార్పులకూ, చెయ్యని మార్పులకూ కొంత సంజాయిషీ ఇచ్చుకోటం భావ్యం అనుకుంటాను.

ఈ గ్రంథం తొలి ముద్రణలోనే కొన్ని పొరపాట్లు దొర్లినాయి. వాటిని అన్ని చోట్లా సవరించటం సాధ్యం కాలేదు. సంస్కృతంలో అచ్చు తప్పులను ఆచార్య రవ్వా శ్రీహరిగారు సవరించారు. తెలుగు పద్యాల్లో స్పష్టంగా దోషాలుగా కనిపించే వాటిని సవరించాను కాని కొన్నిటిని వదిలేశాను. ఉదాహరణకు 'ఏకాంత సేవ అనే పుస్తకాన్ని 'యేకాంత సేవ' అని రాయటమే కాక పుటల సూచిక (ఇండెక్స్) లో కూడా అట్లాగే ఇచ్చారు. అట్లాగే ఆ కావ్యంనుంచి ఉదాహరించిన పద్య భాగంలో "మధుర మోహన కళామహితమై వుండ (పే.జీ 71, 88, 94} అనే పాదంలో ఉండ అనే క్రియా పదాన్ని 'వుండ' అని రాశారు. యకార, వకారాగమాలు కవ్యుదోషాలు కావనుకుంటాను. అయినా ఉమాకాంతం గారు కావాలనే అట్లా రాశారని అభిప్రాయ పడి వాటిని మార్చలేదు. అట్లాగే ఉమాకాంతంగారు ఉదాహరించిన పద్యపాదాలు ఇప్పుడు దొరికే ప్రతుల్లో వేరుగా కనిపిస్తున్నా, ఆయన చూసిన ప్రతుల్లో అట్లా ఉండి ఉండవచ్చునని మార్చలేదు. స్పష్టంగా ఛందో దోషాలున్న చోట మాత్రం ముద్రిత ప్రతుల ననుసరించి సవరించాను. అట్లాంటి మార్పులు తెలుగు భారతం నుంచి, ఆ ముక్తమాల్యద నుంచి ఉదాహరించిన చోట్ల అవసరమయ్యాయి. ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా నుంచి ఉదాహరించిన భాగం (పే.జి. 136) లో ఇంగ్లీషులో Jonffroy అనీ తెలుగులో 'జాన్ ఫ్రాయి' అని స్పష్టంగా ఇచ్చారు. ఈ పేరులో ఏదో పొరపాటున్నట్టు కనిపిస్తున్నది గాని సవరించటం సాధ్యం కాలేదు. ఆ పేరు తెలిసిన ఇంగ్లీషు సాహిత్య పండితులు అందుబాటులో లేకపోవటం వల్ల అట్లాగే ఉంచాను. ఉదాహృత పద్య పాదాలను సాధ్యమైనంతవరకు ఈ కూర్పులో పాద విభజన చేసి చూపించాను. కొన్ని సంస్కృత శబ్దాల వర్ణక్రమాన్ని ఉమాకాంతం గారు నియతంగా పొటించినట్టు కనిపించదు. వాటిని అట్లానే ఉంచాను.

ఈ పీఠికారచనకు ప్రేరేపించిన మిత్రులు ఆచార్య పేర్వారం జగన్నాథం గారికి సమాచార సామగ్రిని సాదరంగా అందించిన అక్కిరాజు రమాపతిరావుగారికీ, చలసాని (విరసం) ప్రసాదుకూ కృతజ్ఞతలు.

హైదరాబాదు.

1994 జనవరి 26.

చేకూరి రామారావు.

విషయ సూచిక

ప్రస్తావన

प्रस्तावना

Introduction

సంకేతాల వివరణ

వాజ్మయసూత్ర పరిశిష్టం

గురుస్తోత్రాదులు 1

ప్రధమాధ్యాయం - నేటికాలపు కవిత్వం 2

ద్వితీయాద్య్లాయం - నేటికాలపు కృతిరచన 4

తృతీయాధ్యాయం - నేటికాలపు విద్య 5

వాజ్మయ ప్రిశిస్టభాష్యం

నేటికాలపు కవిత్వం - ప్రధమాధ్యాయం

అధికరణానుక్రమం

నూతనత్వాధికరణం 6

విస్తరాధికరణం 37

వికారాధికరణం 39

నామాధికరణం 41

ఊగుడుమాటల అధికరణం 44

నిదర్శనాధికరణం 48

తత్వజిజ్ఞాసాధికరణం 59

అయోమయత్వాధికరణం 71

పులుముడుఘటనాధికరణం 80

శబ్దవాచ్యతాధికరణం 93 దృష్టివిచారాధికరణం 110

వ్యతిక్రమాధికరణం 117

భావకావ్యాధికరణం 136

జానపదపాత్రాధికరణం 142

శృంగారాధికరణం 146

క్షుద్రకావ్యాధికరణం 201

అనౌచిత్యాధికరణం 205

తత్త్వార్ధికరణం 223

వనకావ్యాధికరణం 226

నాయకాధికరణం 231

దయాధికరణం 233

స్థిత్యధికరణం 235

ఉద్దేశాధికరణం 236

గీతాధికరణం 237

భావనాధికరణం 238

ఉపోద్ఘాతాధికరణం 243

దోషసామ్యాధికరణం 248

చిహ్నాధికరణం 256

బుద్ద్యధికరణం 260

ప్రజాధికరణం 261

సమకాలాధికరణం 262

ప్రకాశాధికరణం 264

ఇచ్ఛాధికరణం 266

సంస్కారాధికరణం 267

సంజ్ఞావచకాదుల సూచిక i-xiv

తప్పొప్పుల పట్టిక xv