నేటి కాలపు కవిత్వం/సంస్కారాధికరణం

వికీసోర్స్ నుండి

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

సంస్కారాధికరణం

నేటికాలపు కవిత్వాన్ని విచారణచేసి అదిప్రాయికంగా దృష్టి సంకోచంచేత హీనంగా వున్నదని, పులుముడు, అయోమయం, శబ్దవాచ్యతమొదలైన దోషాలతో దూషితమైనదని, నేటికాలపు కృతులు ప్రాయికంగా చిల్లరశృంగారమని క్షుద్రాలని కావ్యంపతితదశలో వున్నదని విశదపరచాను. సాతవాహనుల కాలం శతశతాబ్దులకింద గడిచింది. వొరంగల్లు వైభవం విశేషబలప్రదంకాకుండానే అంతరించింది. తరువాత ఆంధులు భారతవర్షంలో అజ్ఞాతసీమల్లో అణగిపోయినారు. దక్షిణాన కాంచి, మధుర, ఉత్తరాన ఇంధ్రప్రస్ధం, ఉజ్జయినీ, కౌశాంబి, పాఠలీపుత్రం విదిశ, ధార మొదలైన నగరరాజులవలె సర్వభారతవర్షాన్ని ఆకర్షించిన మహారాజధానులకుగాని, రామేశ్వరం, ప్రయాగ, అయోధ్య, ద్వారకమొదలైన పట్టణాలవలె సర్వభారతవర్షం సన్నివిష్టమయ్యే మహాక్షేత్రాలకుగాని, నవద్వీపం, కాశి, కాశ్మీర, శారదాపీఠంమొదలైన పవిత్రస్థలాలవలె సర్వభారతవర్షాన్ని పాదాక్రాంతం జేసిన మహావిద్యాస్థానాలకుగాని ఆంధ్రదేశం ఆకరంగాలేదు. రెడ్లకింద కొంచెంతలయెత్తనారంభించి తిరిగి దైవోపహతమయింది. వెనక చాళుక్యుల చేతిలోవలె, రాజ్యాలగతులు క్షణక్షణం వ్యత్యస్తమయి క్షుబ్ధావస్థయందున్న దశలో విదేశీయులైన విజయనగరరాజుల వశమైనాము. పురాణేతిహాసాల ఛాయలు సంస్కృతచ్ఛందస్సుతో పులుముడు భాషావ్యతిక్రమం ఛందోభంగం మొదలమైన ఘోరదోషాలతో నిర్బద్ధవళిప్రాసల అనర్థాలతో నిండిన మను, వసు, చరిత్రలవంటి క్షుద్రకావ్యాలే మనకు సర్వభారతీయసంస్కారమై, పద్యం వ్రాయడమే కవిత్వమయింది. అదే పరమవిద్య అయింది. ఆ పద్యంసయితం అశాస్త్రీయమైన మురికిలక్షణాలతో వికృతమైంది. ఈతీరుగాభారతవర్షంలో అధములమై భారతీయ విజ్ఞానానికి దూరులమై వంచితులమైనాము. దేశంలో భారతీయ సంస్కారప్రవాహాలు యింకిపోయినవి. విద్యాపీఠాలు అస్తమించినవి. గురుకులాలు రూపుమాసినవి. భారతీయసంస్కారం లేని కేవల పాశ్చాత్య సంస్కారం బలప్రదంగాక ఆత్మవిముఖత్వాన్ని పరసంస్కారదాస్యాన్ని మనకు ఆపాదిచినవి. ఈదశలో ఆంధ్రదేశంలో వెలువడుతున్న కృతులు యెండునేలను మొలచిన గిటకగడ్డివలెను, యిమడక వెళ్లిపోయిన ఆహారంవలెను వుండవలసివచ్చినవి. బురదగుంట నుండి పైకివచ్చిక్షాళనానికి శుద్ధజలం లభించకతిరిగే పతితుడివలె సంకిలమైన అపరిణత బుద్ధులతో కృతుల రచనలు చేస్తున్నాము. దేశీయవిద్యాశాలలుగానీ రాజకీయవిద్యాశాలలుగానీ భారతీయసంస్కారం నిర్భంధంగా ప్రధానంగా విదేశీయసంస్కారం అంగంగా దేశీయులకు ప్రసాదించినప్పుడే యీపంకం మనకు తొలగి మనం స్వచ్ఛదీప్తితో భారతజాతుల్లో ఉత్తమస్థానం ఆక్రమించగలము. నన్నయాదుల భారతంమొదలైనవి భారతీయ సంస్కారంయొక్క శుద్ధస్వరూపం కావంటున్నాను. భారతీయ సంస్కార పరిపాకంపొంది స్వచ్ఛ దీప్తితొ భారతజాతుల్లో ఉత్తమస్థానం ఆక్రమించ గలిగినప్పటి కృతులుగాని చిత్రాలుగాని మరేమిగాని మరేవిగాని ఒక ఆంధ్రులనెగాక సర్వభారతవర్షాన్ని సర్వలోకాన్ని నూతనసందేశాలతో పవిత్రం చేయగలవు! ఆనిమిషానికే నేను ప్రతీక్షిస్తున్నాను. జన్మాంతరంలోనైనా ఆనిర్మలదశ చూడగలననే ఆశతో విశ్వాసంతో ఆంధ్రులసంస్కారానికి సేవను ఆకాంక్షిస్తున్నాను.

అనిశ్రీ..ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో నేటికాలపుకవిత్వమనే ప్రథమాధ్యాయంలో సంస్కారాధికరణం

సమాప్తం

అధ్యాయంగూడా సమాప్తం.