నేటి కాలపు కవిత్వం

వికీసోర్స్ నుండి

NETIKLAPUKAVITVAM

By Akkiraaju Umakanta Vidyasekharulu


ప్రధమ ముద్రణ: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు 1928

ద్వితీయ ముద్రణ: తెలుగు విశ్వవిద్యాలయం 1994

ప్రచురణ సంఖ్య: 148

ప్రతులు: 2000

వెల: రూ. 35.00

ప్రతులకు:

రిజిస్ట్రా ర్

తెలుగు విశ్వవిద్యాలయం

పబ్లిక్‌గార్డెన్సు నాంపల్లి

హైదరాబాదు - 500 004

ముద్రణ:

ఎస్. వి. ప్రింటర్స్

1-1-770/5, గాంధినగర్

హైదరాబాదు 500 380

అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు

ప్రథమ ముద్రణ ముఖపత్రం లోపలి పుట నమూనా

పండిత శ్రీ ఉమాకాన్తవిద్యాశేఖరుల

కృ తు లు

వాఙ్మయ పరిశిష్టభాష్యం

నే టి కా ల పు క వి త్వం.


ప్రకాశకులు:

వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్.

చెన్నపురి.

శ్రీరామ ముద్రాక్షరశాలయందు

ముద్రణము 1928

All Rights Reserved

[వెల రూ..2-8-0

ముందు మాట

ఆచార్య పేర్వారం జగన్నాథం

ఉపాధ్యక్షులు

తెలుగు విశ్వవిద్యాలయం

హైదరాబాదు

నేటి కాలపు కవిత్వం అనే గ్రంధం ఆధునిక కవితా రీతులపై ఈ శతాబ్దంలో వచ్చిన తొలి గ్రంధం. ఇందువల్ల కాలికంగానూ వస్తువిషయకంగానూ ఈ గ్రంధానికి ప్రాముఖ్యం ఉన్నది. సుమారు డెబ్బై సంవత్సరాలనాడు తొలిసారి ప్రకటితమైన ఈ గ్రంథాన్ని గూర్చి ఈ తరం తెలుగు భాషాసాహిత్య విద్యార్దులకు గానీ సామాన్య తెలుగు పాఠకులకు గానీ అంతగా తెలియదు. ఈగ్రంథకర్త అయిన ఉమాకాంత విద్యాశేఖరులవారి దాడి అంతా ముఖ్యంగా భావకవిత్వాన్ని ఉద్దేశించిందే అని ఈ గ్రంథంలో ఆయన లేవనెత్తిన అంశాలద్వారా తెలుస్తున్నది. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో మూడు దశాబ్దాల కాలం భావకవిత్వం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది. ఇంచుమించు ఈ శతాబ్ది మొదటి దశాబ్దం గడిచే నాటికి తెలుగు సాహిత్యంలో భావకవిత్వం కవితాకాశంలో ఇంద్రధనుస్సులాగా ఉజ్వలించింది. ఆ తర్వాత సుమారు ఒక దశాబ్దం గడిచేసరికి అత్యున్నత దశకు చేరుకున్నది మరో దశాబ్ది గడిచేసరికి క్రమంగా కళాకాంతులు కోల్పోయింది, భావకవిత్వం పరాకాష్ఠకు చేరి ఆంధ్ర దేశంలో భావకవిత్వారాధనలు విరివిగా జరుగుతున్న సమయంలో ఉమాకాంత విద్యాశేఖరుల "నేటికాలపు కవిత్వం" వచ్చింది. 1910 సంవత్సరానికి రూపురేఖలు దిద్ది తీర్చుకున్న భావకవిత్వం 1934-35 సంవత్సరాలకు తన ప్రాభవం కోల్ఫోయి వేళాకోళానికి హాస్యభాజనతకు గురి అయ్యే స్థితికి చేరుకున్నది అప్పటినుండి ఆధునిక సాహిత్యంలో అభ్యుదయ కవితా యుగం ఆరంభమైనదంటారు సాహిత్య విమర్శకులు.

అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు నవద్వీప విద్వత్పరిషత్తు సాహిత్య సదస్సులలొ పాల్గొని అక్కడి మహావిద్వాంసుల మన్నన పొందినవారు కలకత్తాలో ప్రమదనాధ తర్కవాచస్పతి వద్ద తమ సంస్కృత సాహిత్య ప్రతిభకు మెరుగులు దిద్దుకొన్నవారు అక్కడి ప్రెసిడెన్సీ కాలేజిలో ఎఫ్ ఎ చదవటానికి ఉపక్రమించినవారు 1923 లో ప్రారంభించి తెలుగుదేశపు వాఙ్మయ పత్రికను అత్యంత ప్రతిభావంతంగా ఒక మూడేళ్లపాటు నిర్వహించారు. 1926లో నేటికాలపు కవిత్వం తొలి ముద్రణ వచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు భారతి రజతోత్సవ సంచికలో ప్రకటించిన పాతికేళ్ల తెలుగు కవిత్వం ప్రస్తావనలో ఉమాకాంత విద్యాశేఖరుల "నేటికాలపు కవిత్వం" ప్రస్తావన కూడా వస్తుంది ఆ మహాపండితుడి ఆక్షేపణలకు సమాధానం ఎవరేం చెప్పగలరు? మరింత ఉత్సాహంతో పట్టుదలతో నవ్యకవితారీతులను ప్రచారం చేయడమే ఆయనకు చెప్పగల సమాధానమని మేమనుకున్నాం అని ప్రస్తావించారు దేవులపల్లివారు.

వ్యాస, వాల్మీక, కాళిదాస, భవభూతుల సారస్వతాన్ని అధ్యయనం చేసి హృద్గతం చేసుకోకుండా భారతీయ సాహిత్య సంప్రదాయ ప్రస్థాన పరిశ్రమ లేకుండా భారతీయాలంకారిక సంప్రదాయం అలక్ష్యం చేస్తూ భావకవులు తామేదో నూతన కవితాలోకాలను ఆవిష్కరణం చేశామని స్వీయ ప్రశంసలకు పూనుకోవడం అనుచితమని "నేటికాలపు కవిత్వం" ద్వారా ఉమాకాంతంగారు ఆక్షేపించారు. ఇంగ్లీషు సాహిత్యంనుంచి ఉపజ్జారహితంగా అనుకరించడం తగదన్నారు. పూర్వపక్ష ప్రతిపక్ష సిద్ధాంతపూర్వకంగా తగు విమర్శసాగించారు. ఇది సంస్కృత వాఙ్మయంలోని భాష్య రచనా సంప్రదాయం తమ విమర్శను భాష్య గ్రంధమనే అన్నారు విద్యాశేఖరులు.

ఆధునిక తెలుగు కవిత్వం దాని పరిణామ వికాసాలను గూర్చి నిరంతర జిజ్ఞాసతో అధ్యయన తత్పరత్వంతో కృషిని కొనసాగిస్తున్న భాషావేత్త ఆచార్య చేకూరి రామారావు ఈ కవితా విమర్శ గ్రంథానికి సంపాదకత్వం వహించడం సముచితమని తెలుగు విశ్వవిద్యాలయం భావించింది వారీ పనిని సమర్ధంగా నిర్ఫహించారు వారికి కృతజ్ఞతలు చెపుతూ సాహితీ విద్యార్దులకు ఈ గ్రంథం ఉపకరించగలదని విశ్వసిస్తున్నాను.

హైదరాబాదు.

20-4-1994

పేర్వారం జగన్నాధం

సంపాదకీయం

"దేశంలో భారతీయ సంస్కార ప్రవాహాలు ఇంకిపోయినవి. విద్యాపీఠాలు అస్తమించినవి. గురుకులాలు రూపు మాసినవి. భారతీయ సంస్కారం లేని కేవల పాశ్చాత్య సంస్కారం బలప్రదం కాక ఆత్మ విముఖత్వాన్ని పర సంస్కార దాస్యాన్ని మనకు ఆపాదించినవి".

ఈ పుస్తకం చివర రాసిన పైమాటల్లో అక్కిరాజు ఉమాకాంతం (1889-1942) గారి సర్వసాహిత్య కృషి నేపద్య సారాంశం తెలుస్తుంది. ఆయన జీవించింది 53 సంవత్సరాలే అయినా అమోఘమైన పాండిత్యంతో అసమాన వాదపటిమతో అవిచ్చిన్న సారస్వత వ్యాసంగంతో తెలుగు సాహిత్య లోకంలో చిరకాలంగా పాతుకు పోయిన విశ్వాసాలను కుదిపి వేసిన సాంస్కృతిక విప్లవకారుడు అక్కిరాజు ఉమాకాంతం గారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవటానికి ఆయన జీవిత చరిత్ర ఎవరూ రాయలేదు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు గారి శత జయంతి సంపుటం (1986) లో "త్రిలిఙ్గ తొలినాళ్ళ సంపాదకులు ఉమాకాంత విద్యా శేఖరులు" అనే పేరుతో అక్కిరాజు రమాపతిరావుగారి అయిదు పేజీలు చిరు వ్యాసమూ తెలుగు విజ్ఞాన సర్వస్వము మూడవ సంపుటంగా వచ్చిన 'తెలుగు సంస్కృతి' అనే వాల్యూము (1959) లో అబ్బూరి రామకృష్ణారావుగారి ఒక పేజీకి మించని చిన్న నోటూ మాత్రమే ప్రధాన ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి.

అక్కిరాజు ఉమాకాంతంగారు గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా గుత్తికొండ అనే చిన్న గ్రామంలో లక్ష్మమ్మ లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు. గుత్తికొండకు సుమారు ఏడెనిమిది మైళ్ళ దూరంలో ఉన్న జానపాడు అనే ఊళ్ళో సంస్కృత భాషాభ్యాసం చేశారు. శిష్ట్లా సీతారామశాస్త్రి గారు వీరి గురువుగారు ప్రస్తుత గ్రంథంలొ మొదటి శ్లోకంలో వారి ప్రస్తావన ఉంది. పదిహెను పదహారేళ్ళ వయసులో గుంటూరు లూధరన్ మిషన్ వారి హైస్కూలులో ఇంగ్లీషు చదువులు చదివారు మెట్రిక్యులేషన్ చదివే రోజుల్లో ఈయన శతావధానం చేశారు. బెజవాడలో కన్యకాపరమేశ్వరి హిందూ పాఠశాలలో కొన్నాళ్ళు తెలుగు పండితులుగా ఉద్యోగం చేశారు. 1912 లో తెరచిన ఆంధ్రసాహిత్యపరిషత్తు మద్రాసు కార్యాలయంలో జయంతి రామయ్యగారి ఆహ్వనంపై కొన్నాళ్ళు మేనేజరుగా పనిచేశారు. వేషధారణపై వచ్చిన పేచీ వల్ల ఉమాకాంతంగారు ఉద్యొగం మానేసినట్లు రమాపతిరావుగారు పైన పేర్కొన్న వ్యాసంలో రాశారు. ఈయన బెంగాల్‌లో నవద్వీప సంప్రదాయాన్ననుసరించి భాష్యాంతముగా సంస్కృత వ్యాకరణమూ తర్కశాస్త్రమూ, అభ్యసించి 'విద్యాశేఖరు' లైనా రని అబ్బూరి రామకృష్ణరావుగారు రాశారు. "తమ తర్క వ్యాకరణ విద్యా వ్యాసంగాన్ని వంగ దేశంలో జరుపుతూ వచ్చారు. వంగ సాహిత్యవేత్తలతో సాహచర్యం వల్లా లోకజ్ఞానం వల్లా స్వానుభవం వల్లా వంగసాహిత్యాభ్యుదయానికి గల కారణాలను వివేకంతో సూక్ష్మంగా పరిశీలించడం వల్లా తమకు కలిగిన జ్ఞానాన్ని ఆధారంగా తీసికొని తమ మాతృభాష అయిన తెనుగును పరామర్శించడం ఆరంభించారు" అని అన్నారాయన ఆయన వావిలి కొలను సుబ్బారావుగారి తరవాత (1929లో) మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకులుగా పనిఛేశారు. 1913-1914 మధ్య కాలంలో త్రిలిఙ్గ పత్రిక సంపాదకులుగా పనిచేశారు. 'త్రిలిఙ్గ' అనే పేరు ఆయన పెట్టిందేనని త్రిలిఙ్గ రజతోత్సవ సంచిక (1941)కు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఆ సందేశంలో ఇంగ్లీషులో కామెంటు (Comment) అనే మాటకు పర్యాయంగా వ్యాఖ్యా శబ్దాన్ని పరీక్ష పత్రాల్లో తానే మొదట వాడినట్లు పేర్కొన్నారు.

1913-1914 సంవత్సరాల మధ్యలో ఆయన త్రిలిఙ్గ పత్రికలో కధలు రాశారు 1918 లో ఇవి త్రిలిఙ్గ చిన్నకధలు పేరుతో సంకలితం అయ్యాయి. ఉమాకాంతం గారు తమ కధల పీఠికలో 'ఇట్టి కధల వాఙ్మయము తెలుగునకు కొత్తది ' అని గుర్తించారు. అప్పటి కాయన రచనాశైలి ప్రాచీన భాషకు సన్నిహితం సంధి నియమాలను సడలించి ఆధునిక రచనాభాషను ఏర్పరచటానికి ఉమాకాంతం గారు కూడా కృషి చేసినట్లు ఈ సంపుటం ద్వారా తెలుసుకోవచ్చు ఈయన కధల్లో కూడా తొలినాటి ఇతరుల కథల్లో లాగే లక్ష్యం సాంఘిక సంస్కరణే. మూఢ విశ్వాసాల నిర్మూలనే బ్రాహ్మణ సమాజంలో పాదుకొన్న మూఢ విశ్వాసాల వల్ల స్త్రీల బతుకుల్లో ఉన్న బాధల్ని వివిధ రీతుల్లో ఈ కధల్లో వర్ణిస్తారు.

ఈకథల్లో 'ఎదుగనిబిడ్డ ' ఆంధ్ర సాహిత్యాన్ని కన్న తెలుగుతల్లి ఉత్తమ పురుషలో చెప్పిన కథ. చివరివరకు ఎలిగొరీ అనే కథా శిల్పాన్ని పాటించిన ఈ కథలో 'ఆంధ్ర సాహిత్యం ఎప్పుడూ ఎదగని బిడ్దయే' అని తమ నిశ్చితాభిప్రాయాన్ని వెల్లడించారు సుమారు పాతికేళ్ళ ప్రాయంనుంచి ఆయనకు తెలుగు సాహిత్యంపై సదబిప్రాయం లేనట్టు ఈ కథను బట్టి మనం తెలుసుకోవచ్చు అదల్లా ఉంచి ఎలిగొరీ పద్దతిలో ఉత్తమ పురుష కథనంలో రాసిన మొదటి తెలుగు కథ ఇదే కావచ్చు.

తెలుగు సాహిత్యంలో అబివృద్ధి కాని నూతన ప్రక్రియలను అబివృద్ధి చెయ్యాలనే ఆకాంక్ష ఆయనకు గాఢంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆకోరికే ఆయన చేత చిన్న కథలను రాయించింది ఫిలిప్ మెడోస్ టైలరు (Philip Meadows Tailor 1808-1876) అనే ఆంగ్ల నవలా కారుడు రచించిన టిప్పు సుల్తాన్ నవలను ఆంద్రీకరించి 1912 నవంబరులో ప్రకటించారు. ఈ నవల పీఠికలో కూడా ఆంధ్ర సాహిత్య స్థితిని గూర్చిన చర్చ ఉంది. టైలరు హైందవ సంప్రదాయాభిమామాని కావటం వల్ల అతని రచనను తెలిగించానని ఉమాకాంతం గారు పీఠికలొ చెప్పుకున్నారు. 'ఉమాకాంతం గారు 1921 లో తెలుగు దేశ వాఙ్మయ పత్రికను స్థాపించి సంస్కృత వ్యాకరణ ప్రదీపం. పాణినీయ ఆంధ్ర వివరణం. రసమీమాంస నైషద తత్వ జిజ్ఞాస వంటి ప్రశస్త రచనలు వెలువరించారు' అని అక్కిరాజు రమాపతి రావుగారు రాశారు.

'లౌకిక దృష్టితో చెప్పుకోదగిన సంఘటన లేవీ ఆయన జీవితంలో లేవు పాండిత్యానికి తగిన శరీర దార్డ్యం ఆయన కెన్నడూ లేకపోయింది' అని అబ్బూరి రామకృష్ణారావు తెలుగు విజ్ఞానసర్వస్వంలో అన్నారు.

ఉమాకాంతంగారి రచనలపై సమగ్ర సమీక్ష జరగలేదు సంపూర్ణమైన అంచనా రాలేదు. ఆయన రచనలు దొరికినంత వరకూ (అన్నీ దొరకవు) పరిశీలిస్తే ఆయనకు తెలుగు సాహిత్యంపై నిర్ధిష్టమైన అభిప్రాయాలు విలక్షణమైన ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన రచనలన్నింటా తెలుగు సాహిత్య స్థితిని గూర్చి ఆవేదన కనిపిస్తుంది. ప్రచురణ వివరాలు దొరకలేదు గాని రమాపతి రావుగారి సౌజన్యం వల్ల ఆయన చిన్న చిన్న వ్యాసాలు కొన్ని దొరికాయి.

సాంఘికంగా ఆయనకు అబివృద్దికరభావాలే ఉన్నట్టు, సాంఘిక సంస్కరణలకు ఆయన అనుకూలుడే అయినట్టూ ఆయన కథలను బట్టేకాక ఆయన విడివిడి వ్యాసాలనుబట్టి కూడా చెప్పవచ్చు. 'తెలుగు దేశము నందలి చండాలురు' అనే వ్యాసంలో "చండాలురని చెప్పుటకు ఏ ప్రమాణమూ లేని మాదుగులను ఆంధ్రదేశము నందలి మొదటి తెగలగు చెంచులు బలిజెలు మొదలైన వారివంటి మాదుగులను అస్పృశ్యులుగా బాధించుచున్నాము ఊళ్ళనుండి బయటికి వెళ్ళగొట్టినాము. బావుల వద్దకు రానీయము. దేవాలయములలో ప్రవేశించనీయము. ఇంతకంటె తెలుగుదేశము ఆచరించుచున్న అధర్మము మఱియొకటిలేదు. ఈ దురాచారము అప్రామాణికమైనది అనర్ధహేతువైనది అని చెప్పుచున్నాను' అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. విదేశయానం చేసినందుకు నడింపల్లి నరసింహారావు గారిపై తెచ్చిన అభియోగానికి ఉమాకాంతం గారు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. దాన్ని ఒక విమర్శన వ్యాసంగా రాస్తూ సముద్రయానం చెయ్యటం వల్ల పతితుడవుతాడనటానికి శాస్త్ర ప్రమాణం లేదని నిరూపించారు.

ఉమాకాంతం గారు సాహిత్యాంశాలపై తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించారు. ఎంతటి గొప్పవారి అభిప్రాయాలను ఖండించటానికైనా వెనుదీసె వారు కాదు. మద్రాసు విశ్వవిద్యాలయంలో 1923 సంవత్సరానికి పెట్టిన పురాణపండ మల్లయ్య శాస్త్రిగారి శుక్రనీతిని విమర్శిస్తూ 'బ్రదిమి ఏనిక దిగ్గియ ఒండె ఉలుపా ఎకిమీడు ' వంటి పాతబడ్ద మాటలను వాడటాన్ని నిరసించారు. ఆ పుస్తకానికి యోగ్యతా పత్ర మిచ్చిన జయంతి రామయ్య గారి స్వవచో వ్యాఘాతాలను ప్రదర్శించారు.

ఇంగ్లీషు పాఠ్య నిర్ణాయక సంఘంలో ప్రెసిడెన్సీ కాలేజిలో ఇంగ్లీషు బోదించే వారిని వేసి, తెలుగు పాఠ్య నిర్జాయక సంఘంలో తెలుగు బొధకులను వేయక పోవటాన్ని నిరసించారు.

విష్ణు చిత్తీయ వ్యాఖ్యాన సభలో వేదం వెంకటరాయశాస్త్రిగారు కట్టమంచి రామలింగారెడ్దిగారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో తీవ్రంగా విభేదిస్తూ వాఙ్మయపత్రికలో వ్యాసాలు రాశారు. ఆముక్త మాల్యదలో చాలా గొట్టుమాటలున్నాయి కాబట్టి అది గొప్ప కావ్యం అయినట్టు వేదం వెంకటరాయశాస్త్రి గారన్నారని చెపుతూ ఆ మాటలందు నాకు ప్రమాణ బుద్ది కలగలేదు అన్నారు. మను చరిత్రలో రసాభాస ఉన్నది కాబట్టి దాన్ని మంచి కావ్యం కాదన గూడదన్నారు (అంతమాత్రం చేత మను చరిత్ర ఉత్తమ కావ్యమనికాదు ఇతర కారణాలు చూపించాలని ఆయన అభిప్రాయం) రసాభాస నిషిద్ధం కాదని అది అంగంగా ఉండవచ్చునని సిద్ధాంతం చేశారు. ఇంతకీ మనుచరిత్రలో ఉన్నది రసాభాసకాదని వరూధిని కది వాస్తవమేనని వాదించారు. ఆ సందర్భంలోనే మనుచరిత్రను పెద్దన రచించ లేదనీ కృష్ణరాయలు రచించాడనీ కట్టమంచి రామలింగారెడ్డిగారు చేసిన అభాషణాన్ని విమర్శిస్తూ "కృష్ణరాయలు రచించినా కృష్ణశ్రీష్ఠిరచించినా కృష్ణామాత్యుడు రచించినా, కృష్ణ భట్టు రచించినా, పుస్తకములోని మంచి చెడ్డలు మారవు గనుక ఆ విచారణ నేనిక్కడ పెట్టుకోలేదు" అని వస్తుగత విమర్శ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు.

కట్టమంచి రామలింగా రెడ్డిగారు మద్రాసు గోక్లేహాల్లో ఇచ్చిన ఉపన్యాసాన్ని పత్రికల్లో చదివి వాఙ్మయ పత్రికలో విమర్శించారు. రామాయణం కంటే భారతం ప్రాచీనం అని రెడ్దిగారా ఉపన్యాసంలో చెప్పారు. భారతం కావ్యంకాదు. సంహిత అని రెడ్డిగారన్నారు. భారతం కావ్యమేనని. భారతం కంటే రామాయణం పూర్వమనే ఉపనిషత్తులను ప్రదర్శిస్తూ ఉమాకాంతంగారు వారించారు. ఆ సందర్భంగా "వాస్తవముగా సంఘమును సంస్కరింపవచ్చును. సర్వసమత్వము ప్రతిష్టించ యత్నించవచ్చును. వీటికన్నిటికి రామలింగా రెడ్దిగారు మరికొన్ని మార్గములు అవలంబించ వలసియున్నది గాని భారత వర్షేతిహాసములను గురించి భారతీయుల ప్రాచీన వాఙ్మయము గురించి తెలిసి తెలియని మాటలు మాట్లాడుట మాత్రము అనుచితమైన కార్యము" అని స్పష్టంగా నిర్భయంగా ప్రకటించారు.

'నైషధ తత్త్వ జిజ్ఞాస' అనేది సంస్కృత నైషధ కావ్యంపై విమర్శ శ్రీహర్షుని మేదాశక్తిని పాండిత్యాన్ని ప్రశంసిస్తూనే నైషధము ఉత్తమ కావ్యము కాదని తేల్చారు. శ్రీహర్షుని కాలానికి భారతదేశంలో శాస్త్ర పరిశ్రమ హెచ్చినదని కావ్య గుణం తగ్గిందని వివరించారు. "అది గొప్ప విమర్శనము బయలుదేరిన సమయము. గొప్ప కవిత్వము కుంటువడిన సమయము" అని అభిప్రాయ పడ్డారు. అందుకు కారణాలను అన్వేషిస్తూ "ఏనాడు అర్ధము యవన హస్తగతమైనదో ఆనాడే భారతీయుడు పరాధీనతను ప్రాపించెను.. ఆర్య సంప్రదాయములు క్రమక్రమముగా విచ్చిన్నము లాయెను. మహమ్మదీయుల విషయ లోలత్వము దేశమున వ్యాపింప జొచ్చెను." అని దేశపరిస్థితులను వివరించారు. భారతదేశ సాంస్కృతిక పతనానికి మహమ్మదీయులు కారణంగా భావింఛే ఒక ఆలోచనా ధోరణి మన దేశంలో చాలా కాలంగా ఉన్నది. అక్కిరాజు ఉమాకాంతం గారి సంస్కత భాషా పాండిత్యం ప్రాచీన భారత సంస్కృతిపై ఆయనకున్న అభిమానము ఎరిగిన వారికి ఆయన ఈ ఆలోచనారీతి ఆశ్చర్యకరం కాదు హిందువులలో సంస్కరణ లాయన కిష్టమే. మహమ్మదీయుల విషయములో ఆయనపై ఆర్య సమాజపు ఆలోచనా ధోరణి ప్రభావం ఉండి ఉండవచ్చును.

గుంటూరు జిల్లా కారెంపూడిలో 1928 జూన్ 9 న జరిగిన సభలో చేసిన ఉపన్యాసం 'ఆంధ్ర భాషోపన్యాసం' గా అచ్చయింది అందులో "నాకు దేశ భాషోద్యమంలో విశ్వాసంగలదు. విజ్ఞాన వ్యాప్తి దేశ భాషయందు వలె అన్య భాషయందు జరుగ నేరదు" అన్నారు తదనుగుణంగా సంస్కృత గ్రంథాలను తెలిగించారు సంస్కృత చంద్రాలోకాన్ని తెలుగు వచనంలో అనువదించారు. పాణినీయాన్ని తెలుగు చేసినట్టు తెలుస్తున్నది. 'పాణినీయము సాంద్ర వివరణము' పేరుతో 9 సంచికల సంపుటంలో గట్టి బైండుతో వచ్చినట్టు ప్రకటన ఉంది. సంస్కృత వ్యాకరణ ప్రదీపము కారకం వరకు రచించినట్లు కూడా అదే ప్రకటనలో ఉంది. ఉమాకాంతంగారికి ఎక్కువ పేరు తెచ్చి పెట్టినవి ఆయన పరిష్కరించి ముద్రించిన పల్నాటి వీరచరిత్ర( 1911-1938) నేటి కాలపు కవిత్వం (1928)

పల్నాటి వీర చరిత్ర మొదటి ముద్రణకు రచించిన పీఠికలో అమూల్యమైన చారిత్రకాంశాలను పొందుపరిచారు. ఇతిహాసాలను గురించి పల్నాడు గురించి శ్రీనాథుని గురించి ఎనబైరెండు పేజీల విపుల చారిత్రక భూమిక ఇది. దాని సారాంశాన్ని ఇంగ్లీషులో ఐదు పేజీల్లో చెప్పారు. డెబ్బైమూడు పేజీల ద్వితీయ భూమిక (1938) లో తెలుగు సాహిత్యంపై తమకున్న అభిప్రాయాల్ని వివరించారు. రెండో పీఠికకు ముందే నేటి కాలపు కవిత్వం వచ్చింది ఈ రెంటిలోనూ పూర్తిగా తర్కపద్ధతి అవలంబించారు ఏవిషయాన్నెత్తుకున్నా సమగ్రంగా చర్చించటం ఆయనకు అలవాటు. అందువల్ల ఆయన పీఠికల్లోనూ వ్యాసాల్లోనూ విషయాన్ని విస్మరించి ఏవేవో మాట్లాడుతున్నట్టనిపించినా అవన్నీ విజ్ఞాన వికాస హేతువులు కావటం విశేషం ఈ రెండో పీఠికలో "పల్నాటి వీర చరిత్రను విచారించడానికి పూర్వం తెలుగు వాఙ్మయాన్ని గురించి క్లుప్తంగా తెలుపుతాను" అని ప్రారంభించి తెలుగు సాహిత్యాన్ని గురించి తమ విలక్షణాభిప్రాయాలను వ్యక్తపరచారు.

"మూలం యొక్క స్వరూపం అవికలంగా భాషాంతరంలో తెలపడమే అనువాదానికి పరమ ప్రయోజనం. నన్నయాదులవి అనుచితానువాదాలు" అని ఆంధ్ర భారతాది గ్రంథాలను విమర్శించారు. తెలుగు ఎప్పుడూ ఉత్తమ విద్యాద్వారంగా ఉండలేదు కాబట్టి తెలుగు అభివృద్ది కాలేదన్నారు. తెలుగు కావ్యాలు అధమాధికారులకే అని ఉమాకాంతంగారి అభిప్రాయం. ఆ స్థితి మద్రాసు విశ్వవిద్యాలయం వచ్చిన తరవాత కూడ మారలేదని ఆనాటి తెలుగు పాఠ్యాదీతర గ్రంథాలనుంచి అధికంగా ఉదాహరించారు శబ్దరత్నాకరంలో 'సఖుడు ' అకారాంత పుంలింగం అనటాన్ని విమర్శిస్తూ అది ఇకారాంత పుంలింగం అనే విషయంగూడా ఈ పీఠికలో ప్రస్తావించారు. సంస్కృతం సరిగ్గా రాని రచయితలను ఆక్షేపిస్తూ వారిని దూడ పేడ సంస్కృతం వారని ఆక్షేపించారు. పంచాగ్నుల ఆదినారాయ శాస్త్రి చిలుకూరి నారాయణరావు వంటి పండితుల రచనల్లోని దోషాలను కూడా చూపించారు.

ఉత్తమ సంస్కృత కావ్యాలను తెలుగులో తీసుకురావాలన్న ప్రయత్నంలో ఆయన రఘువంశానువాదం తల పెట్టినట్టుకనిపిస్తుంది. ఆయన రఘువంశ పీఠికలో --

అక్షరమ్ముల ఆట కవితగ
పెంటకుప్పల జేసి కృతులను
చిందు దొక్కెడి వారి గంతులు
చిన్న పిల్లల వేడుక

అన్నారు ఉమాకాంతంగారి అభిప్రాయాలను ఆయన సహచరులు "దశోపదేశిగా" సంగ్రహించారు. వాటిని ఇక్కడ తిరగరాస్తున్నాను.

1. గధ్యంలో లేని విశేషం పద్యానికి ఛందస్సు సమకూర్చగలినది గతి మనోజ్ఞత 2. అది గణాల ఆరోహణావరోహణల వల్లనే సిద్దిస్తున్నది.

3. అక్షర వినోదం (వళిప్రాసలు) శబ్దాలంకారాల్లో చేరినది.

4. శబ్దాలంకారాలు అలంకారశాస్త్రంలోనివి.

5. శబ్దాలంకారాలు స్వయంగా ఆపతితమైతేనే తప్ప ఆవశ్వకంగా స్వీకార్యం కావని, వీటిని ప్రధానంగా స్వీకరిస్తే కావ్యం అధమ మవుతుందని సాహిత్య వేత్తల మతం.

6. ఇద్ధరన్ మానుగ అనఘ అమల ఓలి, ఒగి పరగు చెన్నుగ యిట్లాటి దండగ చెత్తకు లేదా యతి భంగానికి హేతువై అనర్ధప్రదం కావటం వల్ల అక్షరాల ఆట (పళి ప్రాసలు) ఆవశ్యకంగా ఉపాదేయంకాదు.

7. యతి అంటే విచ్ఛేదం వాగింద్రియ విశ్రాంతిని శ్రావ్యతను పద్యం యొక్క సుపరత్వ రచ్యుత్వాలను సిద్దింపచేస్తుంది గనుక దీర్ఘ పాదాల్లొ మధ్య యతీ పర్వత పాదాంత యతీ నియతం.

8. పద్యం గానీ పద్యాలు గానీ శీఘ్రంగా గాని విలంబంగా గాని అల్లిన మాత్రాన పద్యకర్త అవుతాడు కవి కానేరడు. విజ్ఞానశాలి కానేరడు విద్వద్గోష్టుల్లొ శాస్త్రాబ్యాసజన్యం విజ్ఞానం

9. జన్మాంతర సంస్కార రూపమైన ప్రతిభ విద్వద్గోష్టుల్లో ఉత్తమ విజ్ఞాన లబ్థి. చరాచరలోకప్రభావ పరిశీలనం కావ్యజ్ఞ శిక్ష కావ్యత్వహేతువని మమ్మటుడు.

10. పద్యరూపానగాని గద్య రూపానగాని అనువాదం చేస్తే అనువాది కాగలడుగాని కవి కాజాలడు. రసభావ విష్పాదక మైన సృష్టికి సంబందిచినది కవిత కొంత తీసివేసి కొంతచేర్చి అనువాదం చేస్తే అప్రశస్తాను వాది అనూదిత కావ్యంలో సృష్టివిశేషాదులు అనువాదివి కాజాలవని స్పష్టం.

వీటి అధారంగా ఆయన అనుయాయులు కొందరు అనువాదాలు సాగించి ఆయన సిద్ధాంతాలు ప్రచారం చేసినట్టు కొమరవోలు చంద్రశేఖర మంత్రిగారు ప్రకటించిన లక్ష్యఖండం (1937) వల్ల తెలుస్తుంది ఉమాకాంతం గారి లక్షణాలకు వీరు రచించిన లక్ష్యాలని వీరుద్దేశించి నట్టు 'లక్ష్యఖండం' అనే పేరు పెట్టడం లోనే తెలుస్తున్నది. ఉమాకాంతం గారు రఘువంశ పీఠికలో-

మూలమున లేనట్టిదానిని
వ్రాయననపేక్షితము చెప్పను
అన్న నాథుని మాట దలచగ
అర్హుడనొ కానో!

అన్నారు 'మూలంలో లేనిది చెప్పను. మూలంలో ఉద్దేశించనిది కూడా చెప్పను' అన్న మల్లినాథసూరి మాట తల్చుకున్నారు. ఆయన్ననుసరించి ఆలంపూరు కృష్ణస్వామిగారు --

'వదలి మూలస్థమ్ము లేనిది
కుక్కి అనువాదమ్ము చేసెడి
ఆజ్ఞ మార్గము తొలగిపోవుత
నాకు గురువుల కరుణచే' -- అన్నారు

ఇక్కడ 'గురువులు' అనే మాటలో ఉమాకాంతం గారిని ఉద్దేశించినట్టు భావించవచ్చు.

ఈ మార్గం లోనే కన్నెకంటి ప్రభులింగాచార్యులు గారు కాళిదాసు కుమార సంభవాన్ని అనువదిస్తూ

ఆర్ష భూయస్త్వోత్తమములగు
కాళిదాస కవిత్వవిధులను
మా కొసంగిన మల్లినాథా!
నిన్ను వినుతింతు

అని మల్లి నాథుని ప్రశంసించి --

విడువగా రాదున్నదానిని
లేనిదానిని కుక్కగూడదు
ఇదియె అనువాదాల తెరువను
ప్రవచనమ్ము తలంచెదన్

అని అనువాద విదానంలో ఉమాకాంతం గారి మర్గాన్ని పునరుద్ఘాటించారు.

ఉమాకాంతంగారు వారి అనుయాయులు ఈ అభిప్రాయాలను ప్రచారం చేశారు. సంస్కృత వృత్తాలతో పాటు తెలుగు పద్యాలను కూడా వర్ణమైత్రి లేకుండా ప్రయోగించారు. గీతాది లఘు పద్యాలకు పాదాంత విరతిని మాత్రమే నియమంగా పాటించారు. పెద్ద పద్యాలలో పాదమధ్య విరతిని కూడా పాటించారు.

వీరంతా ముత్యాల సరాన్ని ఆదరించడం చారిత్రకంగా గుర్చించ దగిన ఒక విశేషం అయితే వీరి రచనల్లో ఎక్కడా గురజాడ అప్పారావుగారిని విరివిగా స్మరించినట్లు గాని (ఈ పుస్తకంలో ఒక్క చోట తప్ప) ముత్యాలసరం పేరును ప్రస్తావించినట్లు గాని కనపడదు. అయినా ముత్యాల సరాలను ధారాళంగా వాడారు. అదీ గురజాడ పద్దతిలోనే యతి ప్రాసలు నియమాలుగా కాక అలంకారాలుగా మాత్రమే పరిగణించిన అప్పారావు గారి మార్గం ఉమాకాంతం గారికి నచ్చినట్లు భావించవచ్చు. భావకవులకూ ఉమాకాంతంగారికీ ముత్యాలసరం విషయంలో మాత్రం ఏకీభావం కనిపిస్తుంది. భావకవుల్లో రాయప్రోలు సుబ్బారావుగారు తల్లావజ్ఘల శివశంకర శాస్త్రిగారి వంటివారు వర్ణమైత్రీయుత వళినిగాని ప్రాసముగాని ముత్యాల సరాల్లో కూడా పాటించారు. కృష్ణశాస్త్రి గారి ముత్యాల సరాల్లో వర్ణమైత్రి లేనివి కనిపిస్తాయి.

ఉమాకాంతం గారు ఆంధ్ర వాఙ్మయాన్ని అంతటినీ సూత్ర పద్ధతిలో చెప్పదల్చుకున్నారు. ఆ సూత్రాలకు మళ్ళీతానే భాష్యం చెప్పదల్చుకున్నారు. అయితే చెయ్యదల్చుకున్నవన్నీ చెయ్యటానికి జీవితం చాలింది కాదు. వాఙ్మయదర్శనము పేరుతో ప్రాచీన ఖండాన్ని తొమ్మిది భాగాలు (ఆలోకములు) గా సూత్ర పద్దతిలో రచించారు. ఈ సూత్రాలు గ్రాంథిక భాష (కావ్య భాష)లో ఉన్నాయి. ఈ సూత్రాలు చూస్తే చాలా విస్తృత ప్రణాళికనే వేసుకున్నట్లు తెలుస్తుంది భాష్యం లేక పోయినా ఉమాకాంతంగారి వాఙ్మయ దృష్టిని అర్ధం చేసుకోటానికి ఈ వాఙ్మయ దర్శన సూత్రాలు ఉపయోగపడతాయి. ద్వితీయాలోకంలో.

1. అభారతీయము గనుక 2. సంప్రదాయ విచ్చేదము గనుక 3. త్యాజ్యము క్రీస్తు శకము 4. ఆత్మీయము గనుక 5. అఖండ కాలదర్శన సాదనము గనుక 6. శ్రుతి స్మృతి పురాణేతిహాస దేశీయ కధాచులనుండి అవిచ్ఛిన్నత్వము ప్రతిపాదించును గనుక 7. సంప్రదాయ సిద్ధము గనుక 8. గ్రాహ్యము కలిశకము 9. అవిశేషము వల్ల కలిశకము కృష్ణ శకమని 10.అంతర్భూతము గనుక శాలివాహనము పాక్షికముపధ--

ఉమాకాంతంగారు క్రీస్తు శకాన్ని కూడా గుర్తించని సంప్రదాయ ప్రియుడు. ఆయన తన పీఠికల కిందా, ముద్రించిన రచనల పైనా శాలివాహన శకాన్నే వేసేవారు.

ఉమాకాంతంగారు వాఙ్మయ దర్శనంలో భారతీయ సంస్కారాదుల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. ఇది కాక వేరే ఇంకా ప్రాచీనాంధ్ర వాఙ్మయ సూత్రాల గురించి ఏమైనా రాశారేమో తెలీదు. 'నేటి కాలపు కవిత్వం' అని నామాంతరం ఉన్న ఈ వాఙ్మయ సూత్ర పరిశిష్ట భాష్యంలో మూడు అధ్యాయాలలో ఆధునికాంధ్ర వాఙ్మయాన్ని సూత్రీకరించారు. అందులో మొదటి అధ్యాయం నేటి కాలపు కవిత్వం. దాన్ని మాత్రమే విపులీకరించారు. నేటికాలపు కృతి రచన నేటికాలపు విద్య అనే అధ్యాయాలు సూత్ర రూపంలోనే ఉన్నాయి. భాష్యం రాయలేదు. ఈ పరిశిష్టాన్ని ఆలోకనాలు అనకుండా అధ్యాయాలుగా విభజించటం వల్ల వాఙ్మయ దర్శనం కన్నా బిన్నమైన వాఙ్మయ సూత్రాలు అనే గ్రంథాన్ని రాసినట్టుగానో, కనీసం రాయ తలపెట్టినట్టు గానో ఊహించాలి. అయితే మనకు పూర్తిగా భాష్య రూపంలో దొరుకుతున్నది. ఈ పరిశిష్ట సూత్ర భాష్య రూపమే (అదీ మొదటి అధ్యాయమే) మొదటి సారి వావిళ్ళ ప్రచురణగా 1928 లో వెలువడింది.

ఉమాకాంతం గారు ఈ పుస్తకంలో ప్రధానంగా భావకవిత్వం పేరుతో ప్రచారమైన కవిత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు. తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనాన్ని రేపిన గ్రంథం ఇది. "కాని వారు చేసిన ముఖ్యమైన ఆక్షేపణలకు తగిన సమాధానం ఇంతవరకూ రానే లేదనే అనుకోవలసి వస్తోంది"అని అబ్బూరి రామకృష్ణారావు గారన్నారు. "మహాపండితులైన ఉమాకాంతం విమర్శలకు ఆనాడెవరూ జవాబు చెప్పలేక పోయారు" అని శ్రీశ్రీగారు 1960 లో విశాలాంధ్ర వారి ఆంధ్ర దర్శినిలో రాశారు. భావకవిత్వాన్ని సమర్ధిస్తూ, ప్రశంసిస్తూ, విశ్లేషిస్తూ వ్యాసాలూ, పుస్తకాలూ చాలా వచ్చాయి. కాని, ప్రత్యేకంగా ఉమాకాంతం గారి ఆక్షేపణలకు సమాధానంగా ఇంతవరకూ పుస్తకరూపంలో ఏమిరాలేదన్న మాట నిజమే. అట్లాగే ఉమాకాంతంగారు తిట్టినా అదో గొప్పగా ఆనాటి కవులు చెప్పుకునే వారని అ.రా.కృ గారు అంటుండేవారు. అంతటి మహాపండితుడి దృష్టిలో పడటమే గొప్పగా ఆనాటి కవులు భావించేవారన్న మాట. ఆనాటి భావకవుల్లో బహుశా ఎవరినీ ఆయన క్షమించలేదు. విస్తర దోషాన్ని గురించి విస్తరణాధి కరణంలో చెబుతూ చెప్పవలసినదానికంటే ఎక్కువగా చెప్పటం విస్తర దోషమని నిర్వచించి, ఈ కాలపు కృతుల్లో ఇది విస్తారంగా ఉందని ప్రస్తావించి "యెంకి పాటల వంటి వాటిలో కొన్నిటిలో తప్ప తక్కిన యీ కాలపు కృతుల్లో అనేకాల్లో యీ దోషం కనబడుతున్నది" అని యెంకి పాటలకు మినహాయింపు ఇచ్చారు. ఆ మాత్రం మినహాయింపు ఇయ్యటం కూడా విశేషమే ననుకుంటాను.

ఆధునిక కవిత్వం ప్రాచీన ధోరణుల నుంచి విడివడి కొత్తదారులు వెతుక్కుంటున్న సమయంలో అక్కిరాజు ఉమాకాంతం గారు సాహిత్య విమర్శలో ప్రవేశించారు. సంప్రదాయ పండితులు చాలామంది భావకవిత్వాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఉమాకాంతం గారి మార్గం భిన్నమైనది. ఆయనకు తెలుగులోనే కవిత్వం కనపడలేదు. ఆయన ప్రమాణాలు ప్రాచీన సంస్కృతాలంకారికులవి. వాద పద్దతి సంస్కృతంలో తర్కపద్ధతి. ఈ పద్ధతిలో సిద్ధాంతం - పూర్వపక్షం, ఆక్షేపణ - సమాధానం అనే విభజనలుండటం వల్ల దీనికి ప్రామాణికతే గాక హేతుబద్ధత కూడా వచ్చింది. ఈయనకు పాశ్చాత్య తర్కపద్దతితో కూడా పరిచయమున్నట్టు ఈ గ్రంథం లోనే అనౌచిత్యాధికరణంలో Fallacy of undue Assumption అనే పద్ధతి ప్రస్తావన వల్ల తెలుసుకోవచ్చు.

ఉమాకాంతం గారి తర్క పద్ధతికి, ఆధునిక శాస్త్ర ప్రతిపాదనల పద్ధతికి కొన్ని పోలికలున్నా యి. ఆధునిక శాస్త్ర పద్ధతిలో ఒక ప్రతిపాదన చేసినపుడు ఆ ప్రతిపాదనకు ప్రతికూలమైన అంశాలను కూడా ప్రస్తావించి వాటిని తన ప్రతిపాదన ఎట్లా పరిష్కరిస్తుందో చెప్పాలి. ఆప్పుడే ఆ ప్రతిపాదన సిద్దాంత మవుతుంది. ఉమాకాంతంగారి వాద పద్దతి ఎంత ప్రాచీనమో అంత ఆధునికం కూడా. ఒక విషయాన్ని అన్ని వైపుల నుంచి పరిశీలించటానికి ఉమాకాంతం గారి తర్క పద్ధతి పనికొచ్చింది.

ఇదికాక ఉమాకాంతంగారి శైలి సూటిదనం, సారళ్యం అనే రెండు లక్షణాల వల్ల ఆకర్షణీయంగా ఉంటుంది. 'ఆపతితం, ద్రష్టవ్యం, వక్ష్యమాణం' వంటి మాటలు ఆయన పాండిత్యం వల్ల అరుదుగా దొర్లినా సాంకేతికత లేని సాధారణ పదాలు వాడటం ఆయన అలవాటు. ఉగుడు మాటలు, పులుముడు, వికారాలు, దూడపేడ సంస్కృతం, దండగ్గణం వంటి అతి సామాన్య పద జాలంతో తన భావాలను చెప్పగలిగారు. సిద్ధాంత పూర్వ పక్షాలు, అక్షేప - సమాధానాలు అనే పద్ధతి వాద ప్రతివాదాల సంభాషణ (dialogue) పద్ధతి. ఈ నిర్మాణం (structure) వల్ల శైలి సంభాషణశైలికి సన్నిహితమై మరింత ఆకర్షకమైంది. భాష విషయంలో ఆయన మారీన దృష్టి కూడా ఇందుకు తోడ్పడింది. దానికి తోడు ఉమాకాంతం గారికి విషయ వివరణకుప యోగించే దృష్టాంతాలను, పిట్ట కథలను ఎన్నుకొని విషయ వివరణ చెయ్యటంలో అద్భుతమైన నేర్పుంది. సంస్కృతాంగ్లాలలో విశేషమైన పాండిత్యం ఉన్న ఆయన తన రచనలలో ఉదహరించిన సంస్కృతాంగ్ల వాక్యాలకు తరచుగా ఆంధ్రాను వాదాలను కూడా ఇస్తుంటారు. ఆయన చెప్పిన విషయాల్లో భేదించినా ఆయన వాద పద్దతి నుంచి ఈ నాటి విమర్శకులు నేర్చుకో వాల్సింది చాలా ఉంది. ఉపపత్తులు చూపకుండా ఆయన సిద్ధాంతాలు చెయ్యలేదు. ఆక్షేపణలకు సమాధానాలు చెప్పకుండా సిద్ధాంతాలను ఊరికే వదల లేదు. ఏవిషయాన్ని మరుగుగానూ, ఆస్పష్టంగానూ చెప్పలేదు. ఇన్ని సుగుణాలున్న ఈ పుస్తకం సాహిత్యాభిమానులందరికీ ఆవశ్య పఠనీయం.

ఈ పుస్తకానికి చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. ఒక విద్యావేత్త పరాధీనమైన తన జాతి పతనమై పోతున్నదని, విలువలు క్షీణిస్తున్నాయని, ప్రమాణాలు పడిపోతున్నాయని ఎంత ఆవేదన చెందాడో తెలుసుకోటానికి కూడా ఈ పుస్తకం చదవటం అవసరం. దాదాపు అర్ధాయుష్కుడైన ఒక సాహిత్య కృషీవలుడు ఉన్న కొద్ది జీవితకాలం లోనే ఎన్ని విద్యలు నేర్వవచ్చునో, తాను లోక కళ్యాణమని ఎంచిన దాన్ని ఆచరించటానికి ఎంత కృషి చేశాడో తెలుసుకోటానికి ఆయన జీవితాన్ని గురించి కూడా తెలుసుకోవాలి.

అయితే ఉమాకాంతంగారు భావకవిత్వం గురించి చేసిన నిర్ణయాలు కాలంలో నిలవలేదు. మారుతున్న అభిరుచుల కనుగుణంగా భావ కవిత్వం చరిత్రలో నిలిచింది. స్థిరదోషాలుగా ఉమాకాంతంగారు గుర్తించినవి 'అస్థిర మైనవిగా మారినాయి. వాటిని దోషాలుగా పాఠకులు గుర్తించ లేదు. అయోమయత్వం. పులుముడు, నిదర్శన పరంపరలు, భాషా వ్యతిక్రమం అని పేర్లు పెట్టి ఆయన నిరసించిన వాటిని తరవాత పాఠకులు గుణాలుగా మెచ్చుకొని ఆస్వాదిస్తున్నారు. ప్రాచీన సంస్కృత సాహిత్య శాస్త్ర మర్యాదలు సర్వకాల సర్వదేశ సాహిత్యాలకీ సంపూర్ణ ప్రమాణాలుగా నిలుస్తాయని ఉమాకాంతం గారు. నిజాయితీగానే నమ్మారు. ఆయన ఆనాటి కవులను కఠినంగా విమర్శించారు. చరిత్ర ఇంకా కఠినమైనది. ఉమాకాంతంగారి ఆక్షేపణలను తోసిపుచ్చింది. కాలం మరీ క్రూరమైనది. ఉమాకాంతం గారినే మరుగున పడేట్టు చేసింది. నిర్భీకత, కాలానికి ఎదురీదే లక్షణం, పాండిత్యం, కృషి. చెప్పేవిషయంలో నిజాయితీ, స్పష్టత, సూటిదనం, సహేతుక వాదపటిమ ఆయన నిర్ణయాలను మించి విలువైనవి. అవే ఆయన తన తరువాత తరానికి అందించిన విలువలు. సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతంగారి నిర్ణయాలు ముఖ్యంకాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాశ్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు.

ఈ ముద్రణలో సంపాదకుడుగా నేను చేసిన మార్పులకూ, చెయ్యని మార్పులకూ కొంత సంజాయిషీ ఇచ్చుకోటం భావ్యం అనుకుంటాను.

ఈ గ్రంథం తొలి ముద్రణలోనే కొన్ని పొరపాట్లు దొర్లినాయి. వాటిని అన్ని చోట్లా సవరించటం సాధ్యం కాలేదు. సంస్కృతంలో అచ్చు తప్పులను ఆచార్య రవ్వా శ్రీహరిగారు సవరించారు. తెలుగు పద్యాల్లో స్పష్టంగా దోషాలుగా కనిపించే వాటిని సవరించాను కాని కొన్నిటిని వదిలేశాను. ఉదాహరణకు 'ఏకాంత సేవ అనే పుస్తకాన్ని 'యేకాంత సేవ' అని రాయటమే కాక పుటల సూచిక (ఇండెక్స్) లో కూడా అట్లాగే ఇచ్చారు. అట్లాగే ఆ కావ్యంనుంచి ఉదాహరించిన పద్య భాగంలో "మధుర మోహన కళామహితమై వుండ (పే.జీ 71, 88, 94} అనే పాదంలో ఉండ అనే క్రియా పదాన్ని 'వుండ' అని రాశారు. యకార, వకారాగమాలు కవ్యుదోషాలు కావనుకుంటాను. అయినా ఉమాకాంతం గారు కావాలనే అట్లా రాశారని అభిప్రాయ పడి వాటిని మార్చలేదు. అట్లాగే ఉమాకాంతంగారు ఉదాహరించిన పద్యపాదాలు ఇప్పుడు దొరికే ప్రతుల్లో వేరుగా కనిపిస్తున్నా, ఆయన చూసిన ప్రతుల్లో అట్లా ఉండి ఉండవచ్చునని మార్చలేదు. స్పష్టంగా ఛందో దోషాలున్న చోట మాత్రం ముద్రిత ప్రతుల ననుసరించి సవరించాను. అట్లాంటి మార్పులు తెలుగు భారతం నుంచి, ఆ ముక్తమాల్యద నుంచి ఉదాహరించిన చోట్ల అవసరమయ్యాయి. ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా నుంచి ఉదాహరించిన భాగం (పే.జి. 136) లో ఇంగ్లీషులో Jonffroy అనీ తెలుగులో 'జాన్ ఫ్రాయి' అని స్పష్టంగా ఇచ్చారు. ఈ పేరులో ఏదో పొరపాటున్నట్టు కనిపిస్తున్నది గాని సవరించటం సాధ్యం కాలేదు. ఆ పేరు తెలిసిన ఇంగ్లీషు సాహిత్య పండితులు అందుబాటులో లేకపోవటం వల్ల అట్లాగే ఉంచాను. ఉదాహృత పద్య పాదాలను సాధ్యమైనంతవరకు ఈ కూర్పులో పాద విభజన చేసి చూపించాను. కొన్ని సంస్కృత శబ్దాల వర్ణక్రమాన్ని ఉమాకాంతం గారు నియతంగా పొటించినట్టు కనిపించదు. వాటిని అట్లానే ఉంచాను.

ఈ పీఠికారచనకు ప్రేరేపించిన మిత్రులు ఆచార్య పేర్వారం జగన్నాథం గారికి సమాచార సామగ్రిని సాదరంగా అందించిన అక్కిరాజు రమాపతిరావుగారికీ, చలసాని (విరసం) ప్రసాదుకూ కృతజ్ఞతలు.

హైదరాబాదు.

1994 జనవరి 26.

చేకూరి రామారావు.

విషయ సూచిక

ప్రస్తావన

प्रस्तावना

Introduction

సంకేతాల వివరణ

వాజ్మయసూత్ర పరిశిష్టం

గురుస్తోత్రాదులు 1

ప్రధమాధ్యాయం - నేటికాలపు కవిత్వం 2

ద్వితీయాద్య్లాయం - నేటికాలపు కృతిరచన 4

తృతీయాధ్యాయం - నేటికాలపు విద్య 5

వాజ్మయ ప్రిశిస్టభాష్యం

నేటికాలపు కవిత్వం - ప్రధమాధ్యాయం

అధికరణానుక్రమం

నూతనత్వాధికరణం 6

విస్తరాధికరణం 37

వికారాధికరణం 39

నామాధికరణం 41

ఊగుడుమాటల అధికరణం 44

నిదర్శనాధికరణం 48

తత్వజిజ్ఞాసాధికరణం 59

అయోమయత్వాధికరణం 71

పులుముడుఘటనాధికరణం 80

శబ్దవాచ్యతాధికరణం 93 దృష్టివిచారాధికరణం 110

వ్యతిక్రమాధికరణం 117

భావకావ్యాధికరణం 136

జానపదపాత్రాధికరణం 142

శృంగారాధికరణం 146

క్షుద్రకావ్యాధికరణం 201

అనౌచిత్యాధికరణం 205

తత్త్వార్ధికరణం 223

వనకావ్యాధికరణం 226

నాయకాధికరణం 231

దయాధికరణం 233

స్థిత్యధికరణం 235

ఉద్దేశాధికరణం 236

గీతాధికరణం 237

భావనాధికరణం 238

ఉపోద్ఘాతాధికరణం 243

దోషసామ్యాధికరణం 248

చిహ్నాధికరణం 256

బుద్ద్యధికరణం 260

ప్రజాధికరణం 261

సమకాలాధికరణం 262

ప్రకాశాధికరణం 264

ఇచ్ఛాధికరణం 266

సంస్కారాధికరణం 267

సంజ్ఞావచకాదుల సూచిక i-xiv

తప్పొప్పుల పట్టిక xv

ప్రస్తావన

నావాఙ్మయసూత్రపరిశిష్టంలో నేటికాలపు కవిత్వమనే యీ కృతి ప్రథమాధ్యాయం నేటికాలపువిద్య, నేటికాలపుకృతులు అనేవి ద్వితీయతృతీయాధ్యాయాలు తృతీయాధ్యాయంలో పరిశిష్టం సమాప్తమవుతుంది మద్రాసులో కొంతకాలం కింద జరిగిన ఒకసమావేశంలో శ్రీ వింజమూరి రంగాచార్యులవారు శ్రీ భావరాజు సుబ్బారావుగారు అదివరకు వ్యాకరణసిద్ధాన్తాలను ప్రవచనంచేయడానికి ఆంధ్రదేశమందలి ముఖ్యపట్టణాలకు పోయినప్పుడు మరికొందరు మిత్రులు నేటికాలపు కవితను గురించి ప్రస్తావించా రని ఆసమయంలో నేనేమీ చెప్పలేదని నాకు జ్ఞాపకం. అప్పటికి ఆపరిశీలనం ముగియకపోవడమే దానికి కారణం. విచారణ ముగిసిన తరువాత యీకృతిలో వున్న విషయాన్ని 5027 సం॥ చైత్రంలో చెన్నపురి ఆంధ్రసభలో ఉపన్యసించాను. ఆంధ్రపత్రికలో ప్రకటితమైన ఆఉపన్యాసాల విస్తరరూపమే యీకృతి. వాఙ్మయసూత్రం ప్రకటితమైన తరువాత పరిశిష్టం ముద్రితం కావడం క్రమమైనప్పటికీ, పరిశిష్టం ఒక వేరైన భాగంకావడంవల్ల మహావాక్యానయత్వం వ్యక్తం కాకున్నా అర్ధబోధానికి ప్రాతికూల్యం అపతితంగాదు.

ఈకృతి ముద్రితంకావడానికి దయతో తోడ్పడ్డ శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులవారికి కృతజ్ఞతాసూచకంగా నమస్కృతు లర్పిస్తున్నాను. మనదేశంలో విద్యయిప్పటికీ వేరువేరు మార్గాల్లో నడుస్తున్నది గనుక జిజ్ఞాసావిషయాలను సంస్కృతంలోను ఇంగ్లీషులోను సయితం ఉపోద్ఘాతరూపాన క్లుప్తంగా తెలిపినాను. విచారణోపక్రమంలో సహాయులైన సాహిత్యతత్పరులను కృతజ్ఞతతో స్మరిస్తున్నాను.


చెన్నపురి
5027 శ్రావణ పంచమి

అని
ఉమాకాన్తుడు

आधुनिककविताया विचारणा कृतावस्यां प्रचलिप्यति. बहुनि नवीनतया उत्पन्ननि काव्यानि इदानीं पुस्तकापणेषु दरीदृश्यन्ते. कीदृशी ताबदियं कवितेति जिज्ञासा. आनन्दपूर्वः पूरुषार्थोपदेश : काव्यस्य परमं प्रयोजनमिति व्यक्तमेव. तदुक्तं मुगिना

"लोकोपदेशननं नाटसमेत विध्यति" इति. प्रतिपादितं च आनन्दवर्धनाचार्यैः. "सदाचारोपदेशरूप दि नाटलदिगोष्टी मुनिभिरवता " इति. रञ्जकरसप्रधाननां केयां विद्रूपकानां पुरुषार्थोपयोगो नास्तोत्पभिनव भारत्याख्यायां जाट्यविवृत्तौ वद्भिः अभिनवगुमपादैरपि पुरुषार्थे पदेशस्य काव्यफल सारत्वं सूचितपेत. काव्यप्रकाशकारादीनां वचनानि सुविदितालि. आनन्द एव प्राधान्येन उता इति लोचने यभिनवगुप्तपादा आबोचन्ता कारण अन्यदैलक्षायमेव घोरपतीति न कश्चिद्विरोध:. तदेव निरूपितं विद्यानाथेन "इयान विशेषः लागत नव्हताधी सरसा अन्यत्रम तथा" इति. पुरुषार्थेषु अत्र अर्थकामयोधर्मानुगतत्वमेवेच्छामः अर्थस्य कामस्य च धर्मास्पृष्ट्ये हि तत्प्रतिपादकं काव्यं 'काव्यालापांश्च वर्जये' दिति निषेधस्य विषयः स्यात्, धर्मादपेतयोरर्थकामधोरगृह्यत्वं पतनहेतुत्वं वा स्पषमेव. भवन्ति किल अब प्रसिद्धानि बहूनि स्मृत्यादीनां वाक्यानि. वाल्मीकि प्रस्थानमेतदेव विशदीकरोति. "धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ" इत्येतद्वीतावचनं उपादेयकामोपाधिं दर्शयत्येत. वात्स्यायनीये कामसूत्रेऽपि जयमङ्गलप्रदर्शिता ________________

Xxx "अपि नाम निवर्गेऽस्मिन् सेवेतोत्तरबाधकम् । पूर्वस्य तु प्रधानत्वन्न सेव्यः पूर्वबाधकः" || इत्यभियुक्तोक्तिः कामस्य धर्माबाधकत्वमेवोपदिशति. धमांधर्मयोरुभयोरपि स्पर्शः ययोर्न विद्यते तावर्थकामौ न संम्भवत एव. ननु कलाप्रसङ्गे. धर्मप्रशंसा न कर्तव्या क्रियतां सा कृतिस्मृत्यादिविचारे, अन्न तु आनन्दवैशिष्ट्य मेव प्रधानमिति चेन्मैवम्. केवल विनोदफलका अपि कलाविशेषास्तावदेव उपादीयन्ते यावक्ते मनुष्याणां दूष्यगुणान् न तोषयन्ति. यदि कला मानुषीः प्राकृत चित्तवृत्ती: संस्कर्तुमपि न पारयेत् मन्दप्रयोजना सती सा क्षुद्रकोटावेव प्रविशेत्. यदि संस्कर्तुं पारयति तर्हि तत्न धर्मप्रसक्तिं वारयितुं कः शक्नुयादित्यलं बहुना. विस्तरसत्वग्रे वक्ष्यते. ___ आधुनिककविता प्रायेण उदात्तप्रयोजनेन हीनैव दृश्यते. कालिदासादीनां. कृतीरलंकुर्वाणस्य स्वल्पवचः प्रतिपादितार्थ भूयस्त्वस्य रीति रिदानींतनानां कृतिपुमृग्या, अस्फुटस्वल्पार्थवच्छब्दबाहुल्यमेव आधुनिककाव्येषु प्रायः उपलभामहे. रघुवंशकर्तृप्रभृतिषु यद्विशिष्टलक्षणत्वेन नित्यधर्मद्रष्टुत्वं जागर्ति तदाधुनिकसंदर्भप्रणेतृषु नैव लक्ष्यते. समीचीनच्छन्दोनियमातिक्रमात्, अक्षर मैत्रीसंपादनस्यैव अवश्यकार्यत्वाच्य, आन्ध्राणां पद्यमप्यपथ एव चरति. आधुनिककाव्येषु शृङ्गारः प्रायेण अनुचिततां नति इति व्यक्ततरं ज्ञायते. आधुनिक कृतिषु भावकाव्यमिति कश्चन नूतनः काव्यभेदः उपलभ्यत इति केचित्. तदयुक्तम्. भारतवर्षीयसाहित्ये हि भावध्वनिः प्रसिद्धः सौन्दर्यलहर्यादीनि भावकाव्यान्येव. यूरोपीयलिरिक्सन्दर्भापेक्षया भारतवर्षीयभावकाव्यं प्रस्फुट लक्षणं भाति. शिष्टं निरूपयिष्यते. आधुनिककवितायां विज्ञानपरिणती लुप्तप्राये. ईदानींतनकाव्येषु प्रायेण यूरोपीयादिसरण्यनुकरणं पश्यामः, मद्रास्विश्वविद्यालयस्य तत्प्रतिबिम्बसदृशस्य आन्ध्रविश्वविद्यलयस्य च विद्यक्रमे, भारतवर्षीयविज्ञानप्रबोधहेतूनां उचितसंस्थितेरभावात् विज्ञानपरिणत्योः आधुनिककृतिषु प्रायः क्षयः संप्राप्त इति स्पष्टं जानीमहे. विज्ञानस्तब्धतादूरीकरणाय इदानीं आन्ध्राणां य आरम्भः स अतीव श्लाघ्यः, किं च क्षालनाय पुनर्नवत्वाय च शुद्ध जले अलभमानेन, पङ्कानिर्गतेनेव क्लेशः अनुभूयते. ________________

xxxi आन्धाणां विद्यास्थानेषु यूरोपीयविज्ञानलब्धिरिव भारतवर्षीयविज्ञानलब्धिरपि यद्यवश्यविधेया स्यात् तर्हि आन्ध्राः न केवलं भारतवर्षस्य किं तु सर्वस्यापि लोकस्य संस्कारसंपदं वर्धयितुं शकुयुः. ५०२७ मिते कल्यब्दे चेन्नपुर्यान्ध्रसभामन्दिरे आधुनिकवितामधिकृत्य मया उपन्यासि. तदवसरे ये व्याख्यातास्त एव विषयाः कृतावस्यां प्रपञ्चयिष्यन्ते. चेन्नपुरी, ५०२७ मिते कल्यब्दे कृतिप्रणेता. श्रावण शुद्धपञ्चम्याम् इति

INTRODUCTION

The following pages are a part of the Supplement to my "Interpretation of Literature." They deal with the present day poetry. In the Telugu country we are having productions in verse and prose in large numbers though there is not a corresponding widening of the reading circle. Even in the limited circles, the influence of poetry on not only the rise and growth of the noble qualities but also on the moral and intellectual prosperity of a nation is not inconsiderable. What is the nature of the poetry that we meet at every corner of our country to-day? What is the relation of this poetry with ourlife real and ideal? What is its effect upon us Telugus as a race? We, Andhras, as Indians are proud of the heritage of the culture and civilisation of our Ancient india. Are we in line with that cultural advancement? Or are we falling? Such considerations led me to inquire into ous literature past and present. The old literature does not come under this as it was dealt with in the previous part of the work.

I shall briefly mention here some of the facts which will be observed during the course of iny investigation in the following pages. The highest end of Indian art, at any rate of poetic art, is the guidance of human activities preceded by unstained pleasure for the blissful conduct of the world for a supreme goal. There is not much truth in the argument that guidance of human activities or Dharma is outside the province of aesthetics and that are stands by itself. No noble art can stand by itself without a high purpose behind it. Even such as yield mere amusement and satisfaction of a particular kind of sentiment are acceptable only so far as they do not appeal to the ugly qualities of human heart. No art is worth the name if it does not at least refine the grosser feelings of humanity. When it does, it cannot escape the extensive province of Dharma in its varied aspects. I do not like to go into the question further here and it will be discussed at some more length in the chapter on "Sringraa"

The present-day poetry falls very much below high ideals. The art of suggesting a world of ideas by a few strokes as found in our Kalidas etc. is very rare in the present-day writers. Moreover the unscientific and improper features of our Telugu verse and the absolute necessity of somehow securing some particular letter adjustments deprived it of its essentials and filled it with all sorts of uncouth encumbrances unconnected with the occasion. The present-day poetry in Telugu is more versification than poetry. It is a well-sounding mass of word-profusion with scanty meaning. The poetic vision that can see through ages giving out standing universal sentiments is hardly to be seen in it.

BHAVAKAVYA.

There is a wrong idea among some that Bhavakavya is a new innovation ins our literature. Bhavadhwani of indian poetics is very old and poems like Soundaryalahari are Bhavakavyas. The word bhavadhwani in Indian poetics is more definite than the term "Lyric" in modern Western poetry which can be applied to some aspects of all poetry. As for conjugal love we see it in its completion is separated from the category of Bhava and is given a higher place under Rasa. Devotional raptures fall under bhava and love of children and nature also may come under it

THOUGHT AND CULTURE.

Much of the present-day poetry is raw imitation of western writers and others and betrays a lack of maturity of thought and cultural background. Bare imitation of outward features without the inner life cannot but result in mockery. This is to a great extent due to the scheme of University studies in this province by which a vast majority of students go out of the University year after year without having the necessity, throughout their course, to be in sight of even the portals of Indian Culture, the literature in a Vernacular language like Telugu being extremely and pitiably insufficient for the purpose in the present stage. Alien culture without one's own cannot produce its proper effects in any individual in a country like India with its everlasting glories of culture and civilization. If there is renaissance and cultural revival in the other parts of India under a different system of University Education, Andhras cannot rest content that all that occurred among themselves.

Much of the present-day poetry is love-soliloquy straight and roundabout and it presents very little beyond personal erotomania and these erotic sentiments scarcely rise above the physical aspect and beastly passions. However, there are some happy signs of reaction against the intellectual stagnation of the middle ages but it is like the case of one who crawled out of a stagnant pool with no life-giving water fountain for purification and resuscitation. I expect changed and proper conditions for Indian culture along with other cultures with their due place in the seats of learning of Andhras that they may enable themselves to partake worthily in the sacred task of contributing to India's and World's civilization.

The present part is a collection of the lectures delivered by me in April 1926 in the Andhra Sabha hall and reproduced in the Andhra Patrika.

MADRAS

13-8-26

THE AUTHOR

శ్రీగురుభ్యోనమః హరిఃఓమ్.

ఈకృతిలో ప్రయుక్తమైన సంకేతాల వివరణం.

ఆగ్నేయ, ఆగ్నే = అగ్నేయపురాణం

అహో = అహోబిలపండితీయం

ఉత్తర = ఉత్తరరామచరిత్రం

ఋ.మ,సూ.ఋ = ఋగ్వేదం, మండలం, సూక్తం, ఋక్కు

ఐతరే = ఐతరేయోపనిషత్తు

కాదం = కాదంబరి

కవికర్ణ = కవికర్ణరసాయనం

కాశీ = కాశీఖండం

కావ్య = కావ్యప్రకాశం

కా.ప్ర.వ్యా = కావ్యప్రకాశవ్యాఖ్య

కా.త = కాలజ్ఞానతత్వాలు

కావ్యమీ = కావ్యమీమాంస

కా. ద = కావ్యాదర్శం

కాసూ.వృ = కావ్యాలంకార సూత్ర వృత్తి

కిరా = కిరాతార్జునీయం

కుమా = కుమారసంభవం

కేయూర = కేయూరబాహుచరిత్రం

గౌపా = గౌడపాదభాష్యం

చంద్రరేఖా = చంద్రరేఖాపరిణయం

చా = చాటువు

ఛాందో - చాందోగ్యోప నిషత్తు

తి. భా = తిక్కనభారతం

తైత్తి = తైత్తిరీయోపనిషత్తు

తైత్తి. భృ - తైత్తిరీయోపనిషత్తు భృగువల్లి

దశ = దశరూపకం

ధ్వన్యా = ధ్వన్యాలోకం

ధ్వ.లో = ద్వన్యాలోకలోచనం

న.భా, భా.నన్నయ = నన్నయ భారతం

నైష = నైషధం

ప్రశ్నో = ప్రశ్నోపనిషత్తు

ప్రస = ప్రసన్నరాఘవం

ప్రతాప = ప్రతాపరుద్రీయం

పాణి = పాణీనీయం

బసవ = బసవపురాణం

బ్రహ్మ. బ్ర.సూ = బ్రహ్మసూత్రం

బ్ర. భా =బ్రహ్మసూత్రభాష్యం

బిల్హ = బిల్హణీయం

భర్తృ, భ.త్రి, త్రి. శ = భర్తృతహరి త్రిశతి

భగవ = భగవధీత

భ. నా = భరతనాట్యశాస్త్రం

భజగో = భజగోవిందస్తోత్రం

భట్టి = భట్టికావ్యం

భా. ఆ, భా. న. ఆ = నన్నయభారతం. ఆదిపర్వం

భా. తి. వి = తిక్కనభారతం విరాటపర్వం

భామినీ = భామినీవిలాసం

మను = మనుస్మృతి

మహాభా = మహాభారతం

మహాభా. ఆ = మహాభారతం ఆదిపర్వం

మధురా, మధు = మధురావిజయం

మ = మనుచరిత్ర

మహా = మహాభాష్యం

మా, మాఘ = మాఘకావ్యం

మాలతీ = మాలతీమాధవం

ముద్రా = ముద్రారాక్షసం

మేఘ = మేఘసందేశం రఘు = రఘువంశం

రత్నా = రత్నాపణం

రామా, రా = రామాయణం

రా.యు = రామాయణం, యుద్ధకాండం

వసు = వసుచరిత్రం

వా. కా, వా. కా. సూ = వాత్స్యాయన కామ సూత్రం

వా. రా = వాల్మీకిరామాయణం

వాక్య = వాక్యపదీయం

విద్యా. భా = విద్యారణ్యభాష్యం

వేమ = వేమనశతకం

శంకర = శంకరవిజయం

శాకుం, శా = శాకుంతలం

శ్రు = శ్రుతి

శ్రీ. భా = శ్రీ భాగవతం

సర్వ = సర్వదర్శనసంగ్రహం

సాహి, సా.ద = సాహిత్యదర్పణం

సాహిత. ఉ = సాహిత్యదర్పణంలో ఉదాహరణం

సా. కా = సాంఖ్యకారిక

హర్ష = హర్షచరితం

శ్రీరస్తు

వాఙ్మయసూత్ర పరిశిష్టం.

తృతీయాధ్యాయం

నేటి కాలపువిద్య

1. ఇంగ్లీషు పాఠశాలల్లో విద్య సంస్కృతపాఠశాలల్లో విద్య పద్య విద్య అని నేటికాలపు ఆంధ్రులవిద్య మూడువిధాలు.

2. ఇంగ్లీషుపాఠశాలల్లో భారతీయసంస్కారం నస్టప్రాయం.

3.పాశ్చాత్య భారతీయసంస్కారాల సమ్మేళనం విరశం

4.సంస్కృత పాఠశాలల్లో కావ్యపఠనమార్గం హేయం

5.భాషస్వాధీనమైన తరవాత, రసాస్వాదనశక్తియేర్పడ్డతరవాత రఘువంశం మొదలైనకవ్యాలు పఠించదగినవి

6.ప్రాయికంగా శాస్త్ర పఠనమార్గం అప్రశస్యం.

7.కనుక సంస్కృతపాఠశాలల్లో విద్యవల్ల భారతీయసంస్కార స్వరూప దర్శనమూ పరిణతిఫలమూ క్వాచిత్కం.

8. పద్యవిద్య విజ్ఞానశూన్యం

9. ఇదే ఆంధ్ర విద్య.

10. ఛందోవ్యతిక్రమంవల్ల భాషావ్యతిక్రమంవల్ల తెలుగుపద్యం కలుషితం

11. ఆంధ్రుల్లో సంస్కారోజ్జీవనం కార్యం కార్యం

అని శ్రీ - ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో తృతీయాధ్యాయం సమాప్తం. పరిశిష్ఠంగూడా సమాప్తం.

శ్రీ ర స్తు

వాఙ్మయ పరిశిష్ట భాష్యం

నేటికాలపు కవిత్వం

ప్రధమాధ్యాయం

నూతనత్వాధికరణం

నైషదతత్వజిజ్ఞాస ముగింపువాక్యంగా నేటికాలపుకవిత్వం అనివ్రాశాను. ఇప్పుడు దీన్ని వివరిస్తున్నాను దీంట్లో నేడు అన్నా, నేటికాలమన్నా ఈపరిశిష్టం వ్రాసిన సమయని వ్యాఖ్యేయం నేడు ఆంధ్రదేశంలోఅనేకులు పద్యాలు వ్రాస్తున్నారు. చిన్నచిన్న కావ్యాలు కథాభాగం విశేషంలేకుండా కొందరు వ్రాస్తున్నారు. ఈ చిన్న కావ్యాలనే నేనిక్కడ ప్రధానంగా పరామర్శిస్తాను. వీటిని భావగీతాలని యిది భావకవిత్వమని కొందరంటున్నారు. ఇది మనకు నేటికి కొత్తగాలభించిందని చాలా ఉత్తమమయిన దని కొందరి అభిప్రాయము. ఇది కవితయొక్క హైన్యమని కొందరి అభిప్రాయం.

"ఈ దినములలో బావకవిత్వమనునది యొక్కటి బయలు వెడలిన దనియు అది శొచనీయస్థితియందున్నదనియు కొందరు వ్రాయుచున్నట్లు తోచెడిని."

కా. బ్రహ్మయ్య శాస్త్రి (భారతి)

ఈ తీరుగా ఈ చిన్నకావ్యాలను గురించి వేరు వేరు భావములు దేశంలో వ్యాపించియున్నవి వీటి నూతనత్వాన్ని వీటి హేయొపాదేయత్వాలను వివరించదలచి వీటి జీవవిచారణకుముందు శరీరవిచారణ ఆరంభిస్తున్నాను. భారతి మొదలైన పత్రికల్లోవున్న ప్రణయపద్యాలు అనేక పద్యాల సముదాయరూపమైన కృష్ణపక్షంవంటి పుస్తకాలు యేకాంత సేవ కావ్యకుసుమావళి వనకుమారి లక్ష్మీకాంతతొలకరి బాపిరాజుతొలకరి యెంకిపాటలు నారాయణమ్మ నాయుడుబావపాట, యెంకయ్య చంద్రమ్మపాట యిటువంటివన్నీ యిప్పటి నావిచారణకు విషయం ఈ కావ్యాలు నూతనమని అనేకుల అభిప్రాయమని చెప్పినాను.

"ఈ కృతులనేకములు భావగీతములని యిప్పుడు ప్రచారమునకు వచ్చిన కొత్త కవితాప్రపంచమునకు చేరినవి.

సంస్కృతంయొక్క దాస్యంనుండి విముక్తి నొందుచున్నామని మానమ్మకము."

క. రామలింగారెడ్డి (లక్ష్మీకాంత తొలకరి పీఠిక)

"మనవారు కొత్తవారైనారు"

-దే. కృష్ణశాస్త్రి (యేకాంత సేవ పీఠిక)

"నవ్యాంధ్ర కావ్యరీతులు - కడచిన పదియేండ్లలో పొందియున్నవి."

పు.సూరిశాస్త్రి (ఆంధ్ర హెరాల్డు)

"ఇంతవరకును మనకవులు సంస్కృతమునందు వివరించబడిన సంప్రదాయములను శిరసావహించి పనిచేసిరి. మార్పులురాక తప్పదు. ప్రాచీన సంప్రదాయూములయెడ గౌరవము తగ్గెను. మార్పులు రాక తప్పదు. ఆంధ్ర భాషాచరిత్రమున నేడొక నూతనాధ్యాయము ఆరంభమగుచున్నది"

-నిడమర్తి సత్యనారాయణమూర్తి (భారతి సం. 3 సం. 3)

"ఆయందము ఆనూతనవికాసము స్వర్ణయుగపు వాఙ్మయ చిహ్నాలు."

-దశిక సూర్యప్రకాశరావు (భారతి).

ఈ తీరుగా ఈ చిన్నకావ్యాలూ వీటికవిత్వం కొత్తదనీ భారతీయుల సంప్రదాయాలను అతిక్రమించి స్వేచ్ఛవహించడంవల్ల ఆనూతనత్వం వచ్చిం దనీ, అది మన మిదివర కెరుగమనీ అంటున్నారు యీవిషయాన్ని యిక విచారిస్తాను.

నూతనత్వం

వాస్తవంగా నూతనకవిత్వం నూతన కావ్యాలు అని వినగానే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నూతనత్వం అభిలషణీయమైనది పరిణతబుద్దులైన మన ప్రాచీనులు నూతనత్వాన్ని మిక్కిలి అరాధించారు.

"క్షణే క్షణే యన్నవతా ముపైతి
తదేవ రూపం రమణీయతాయా:" (మా.4)

అని మాఘు డంటున్నాడు.

అసలు నూతనత్వమే కవిత్వాన్ని ఉపాదేయకొటిలో చేరుస్తున్నది. అది లేదా పాడిందేపాట అయి హేయకోటిలో చేరుతున్నది. అందుకే శబ్దాలు అర్ధాలు వెనుకటికవులు వాడినవే అయినా శక్తిమంతుడైన కవి వాటినే స్వీకరించి కావ్యంరచించినప్పుడు నూతనత్వం ప్రకటితంవుతున్నదని.

"దృష్టపూర్వా అపి హ్యార్ధాః కావ్యే రసపరిగ్రహాత్.
 సర్వే నవా ఇవాభాన్తి మధుమాస ఇవ ద్రుమాః"

అనే వాక్యాలతో ఆనందవర్ధనుడు చెప్పుతున్నాడు. అంతేగాదు భావాలన్నీ మహాకవులు గార్లించారే ఇక మనమేమి కొత్దిది చెప్పగలమని భయపడవద్దు అనంతంగా బిన్నస్వరూపాలు వహిస్తున్న యీప్రకృతిలో కాలం దేశం ప్రాణులమనో ప్యాపారలీలలు కవికి నూతనత్వం ప్రదర్శిస్తూనే వుండగలవనే ఆశయాన్ని సయితం ఆనందవర్ధనుడు.


"స్వభావో హ్యయం వాచ్యానాం చేతనాచేతనానాం యదవ స్థాభేదా ద్దేశభేదాత్యాలభేదా దా త్స్వాలక్షణ్యలక్షణభేదా చ్చానంత తాభవతి తైశ్చతధావ్యస్థితైః సద్బి: ప్రసిద్దానేకస్వభానుసరణరూపయా స్వభావోక్త్యాపి తావదుపనిబధ్యమానై: నిరవధి: కావ్యార్ధ: సంపద్యతే (ధ్వన్యా)


(అవస్థాభేదంవల్ల దేశభేదంవల్ల కాలబేదంవల్ల అనితరలక్షణాలు కలిగివుండడమనే వైలక్ష్యణ్యంవల్ల కావ్యంలో వ్యర్ధభూతమైన చేతనా చేతనాలయొక్క అనంతత ప్రకృతి సిధ్దం ఇట్లాబిన్నంగా వ్యవస్థితమైన యీచేతనాచేతనాలను ప్రసిద్ధానేకస్వబావానుసరణ రూపమైన స్వభావోక్తి చేత ప్రతిపాదిస్తూరచించినా కావ్యార్ధం అనంతంగా సంపన్నమవుతున్నది") అనే పఙ్త్కుల్లో తెలుపుతున్నాడు.


"యా వ్యాసారవతీ రసాన్రసయితుం కాచిత్ కవీనాం నవా దృష్టి" (ధ్వన్యా)

వాఙ్మయ సూత్ర పరిశిష్టం

1. శిష్ఠ్లా న్వవాయసంజాత సీతారామపశ్చితః,
   గురుపాదాః సదా ప్రేమ్ణా వర్తన్తాం హృదయే మమ.

2. అన్యే ప్రమథనాథాద్యా మహాన్తో గురవోమయి,
    ప్రసారయస్తు నిర్వ్యాజాన్. కటాక్షాన్ కరుణాంచితాన్.

3. నమామి వాఙ్మయీం దేవీం దేవం వాణీమనోహరం,
    వీరాంశ్చ కవితాధీనాన్ ధీరాన్ రసవిమోహితాన్.

4. కృష్ణా పినాకినీ గోదా, తుంగభద్రా పయఃశుభాం,
   త్రిలింగజననీం వందే త్రికోటిజనశోభితాం.

5. స్తవీమి ధ్వనికారాద్యాన్. సిద్దాన్ సౌందర్యలోభినః,
    వాఙ్మయం భారతీయం యే దదృశు స్తత్త్వతోఖిలమ్.

6. సూత్రాణామథ భాష్యాణాం మార్గౌచిత్యం విలోకయన్,
    పథా తేనైవ గచ్ఛామి వాఙ్మయస్య వివేచనే.

శ్రీ ర స్తు

వాఙ్మయ సూత్ర పరిశిష్టం.

ప్రథమాధ్యాయం.

నేటికాలపు కవిత్వం

1. నేటికాలపు కవిత్వాన్ని విచారణచేస్తాను

2. నూతనత్వం కవిత్వధర్మం

3. విస్తరం వికారాలు అనుచితపు పేర్లు ఊగుడుమాటలు నిదర్శనపరం పరలు అయోమయత్వం పులుముడు శబ్దవాచ్యత దృష్టిసంకోచం అనేవాటితో ప్రాయికంగా యీ కాలపుకవిత్వం దుష్ఠం

4. ఈ కాలపుకృతు లనేకాలు చాటుపద్యసంచయాలు; చాందసపు మాటలు కావ్యత్వసిద్ధిపొందినవి విరళం. ఉత్తమమధ్యమాలూ విరళం

5. వీట్లో తరుచుగా భాషావ్యతిక్రమం కనబడుతున్నది

6. ఇది ఉపలభ్యమానకృతుల్లో నన్నయభారతంలో ఆరబ్దం

7. ఛాందసాలు ఈ కాలపుకృతుల్లో బహుళం

8. నిర్భర్ధ వళిప్రాసలమైత్రుల అవర్జాలు ఛందోవ్యతిక్రమం వీట్లో కనబడుతున్నవి

9. భాషావ్యతిక్రమంవలె యివికూడా ఉపలభ్యమాన కృతుల్లో నన్నయ భారతంలో అరబ్ధం

10. పులుముడు మొదలైనదోషాలకీ ఛందోవ్యతిక్రమాదులు హేతువు

11. భారతీయభావకావ్యం ప్రాచీనం

12. పాశ్చాత్యభావకావ్యానికి పైన భారతీయభావకావ్యం ఔచిత్యవంతం 13. కావ్యం ప్రవృత్తిమార్గ ప్రధానసాధనం

14. నివృత్తిసాధనంగూడా నని కొందరు

15. శృంగారం జగదవిచ్చిన్నతారూప ధర్మప్రతిపాదకం

16. సాధారణ నాయకావలంబనం చిల్లరశృంగారమని క్షుద్రశృంగారమని యిక్కడ వ్యపదేశం

17. దుష్టనాయకాశ్రయం హేయశృంగారం

18. లోకోత్తర నాయకాశ్రయంవల్ల పరిపోషాతిశయమని విద్యానాథుడు

19. అది ఉత్తమ ప్రకృతి ప్రాయమని విశ్వనాథుడు

20. అదమనాయకాశ్రయం రసాభాసమని ప్రాచీనులు

21. అది అంగంగా కావ్యంలో ఉండదగినది

22. ఈ కాలపు కృతుల్లో ప్రాయికంగా క్షుద్రశృంగారం అంగి

23. అనౌచిత్యం రసభంగానికి ముఖ్య హేతువని ఆనందవర్దనుడు

24. అది యీకాలపుకృతుల్లో తరుచుగా కనబడుతున్నది

25. భారతీయకావ్యాలకు వనసీమలు చిరపరిచితం

26. ఉపోద్ఘాతకర్తలను కృతికర్తలాశ్రయించడం బహుళం

27.వక్ష్యమాణం చౌర్యం ఈకాలపుకృతుల్లో తరుచు

28. అన్యత్ర స్థితి దోషానికి ఉపాదేయత్వం లేదు

29. ఆంధ్ర దేశంలో భారతీయసంస్కారం క్షీణం

30. వక్ష్యమాణమైన పాశ్చాత్య భారతీయసంస్కారాల సమ్మేళనం మృగ్యం

31. నన్నయ పెద్దనాదుల భారతమనుచరిత్రాదుల స్వరూపం వాటి హేయోపాదేయతా విచారితపూర్వం

32. ఆంధ్రుల్లో సంస్కారోజ్జీవనం కార్యం కార్యం

అని శ్రీమదక్కి రాజు లక్ష్మినారాయణపుత్ర ఉమాకాన్త విద్యాశేఖర ప్రణీతమైన వాఙ్మయసూత్ర పరిశిష్టంలో ప్రథమాద్యాయం.

శ్రీ ర స్తు

వాఙ్మయసూత్ర పరిశిష్టం.

ద్వితీయాధ్యాయం.

నేటికాలపు కృతిరచన

1. నేటి కాలపుకృతుల్లో పద్యం విచారితపూర్వం తక్కిన దేశేతిహాసం పత్రికారచనలు మొదలైనవాట్లో ఉపజ్ఞవిరళం.

2. చౌర్యం బహుళం.

3. అంగాంగి వివేకం మృగ్యం.

4. విచార్యమాణ విషయానబిజ్ఞత తరుచు.

5. తర్జుమాల అమార్గగామిత్వం ప్రాయికం.

6. నేటికాలపుకృతుల్లో వ్యుత్పత్తి వికసితమైన ప్రతిభ అరుదు.

7. భాషావ్యతిక్రమం అసౌష్ఠవం, ఛాందసాలు నేటికాలపుకృతులను వికృతం ఛేస్తున్నవి.


అని శ్రీ - ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర పరిశిష్ఠంలో ద్వితీయాధ్యాయం

"శ్రూయతే చ కువిన్దో నామ రాజా తేన పరుషసంయోగాక్షర వర్జం అన్తఃపుర ఏవేతి."

(కావ్యమీ)

1. కున్తలదేశంలో సాతహహనుడనేరాజు అంతఃపురంలో మాత్రం ప్రాకృతశబ్దాలు తప్పమరి అన్యం మాట్లాడగూడ దని నియమం చేశాడు.

2. మగధదేశంలో శిశునాగు డనేరాజు స్వాంతఃపురంలో మాత్రం ఉచ్చారణకు కటువైన ట. ఠ. డ. ఢ. లను శ. ష. హ. క్ష లను తప్పించి మాట్లాడవలె నని నియమం చేశాడు.

3. శూరసేన దేశంలో కువిందుడనేరాజు అంతఃపురంలో మాత్రం పరుష సంయోగక్షరాలను మాని మాట్లాడవలె నని నియమం చేశాడు.

అని రాజశేఖరుడు చెప్పుతున్నాడు ఇట్లా యీకట్వక్షరరహితమైన పదఘటన ఆడవాండ్ల అంతఃపురంలోనేగాదు కావ్యమార్గంలో గూడా యీకటుశబ్దాలు లేనిమార్గాన్ని బారతీయులు వినిపించారు

"చిత్తద్రవీభావమయో హ్లాదో మాధుర్యముచ్యతే, సంభోగే
 కరుణే విప్రలంభే శాంతేఃధికం క్రమాత్

                                                     

(సాహిత్య)

(చిత్తద్రవీభావమయమైన హ్లాదం మాధుర్యమనేగుణం సంభోగశృంగారంలోను కరుణంలోను విప్రలంభంలోను శాంతంలోను క్రమంగా ఈమాధుర్యమనేగుణం హెచ్చుగా వ్యక్తమవుతుంది.) అని సాహిత్య వేత్తలు చెప్పుతున్నారు. అంతేగాదు ఫలానిఫలాని అక్షరాలుగలపదాల సంఘటనవల్ల యీగుణం సిద్దిస్తుందని కూడా తెలిపినారు.

"మూర్ద్ని వర్గాంత్యవర్ణేన యుక్తాష్టఠడాన్ వినా
 రణౌ లఘూచ తద్వ్యక్తౌ వర్ణా। కారణతాం గతాః"
"అవృత్తి రల్పవృత్తిర్వా మధురా రచనా తధా"

(సాహిత్య)

(ట, ఠ, డ, ఢ,లు తప్ప "కా" మొదలు "మా" వరకు వుండే అక్షరాలు వర్ణాంతర యోగ రహితమైన ర, ణ లు ఈ మాధుర్యమనే గుణాన్ని వ్యక్తం చేస్తవి. రచన సమాసంలేకుండా గాని అల్పసమాసాలతో గాని వుండ వలెను) అని వివరించారు కనుక మీరనే గుణం కొత్తది గాదని దానివల్ల యిప్పటికవిత్వం నూతనమని అనడం అసంగతమంటున్నాను.

ఆక్షేపం

అవునుసరే, యీగుణం పూర్వకాలంలో గూడా వుంటే వుండవచ్చు మేమనేది అదిగాదు.

ఇప్పటి కావ్యాలు

"హృదయ మోహనమై ప్రేమ మృదులమైన
 తావకీన లీలాసుధాదళపుటంబు
 మామకీన ప్రణయభంగ మధుకణాళి
 విడిచెడు విరక్తిభాష్పముల్ విడుచుపోల్కి"
                                                 (తృణకంకణం)
 
"తనగుణ లతలుపూచిన శోభలో యన
      చిరునవ్వు వెన్నెల చెండ్లు విసరఁ
 దన మనోలీలగాంచిన రాగమధువనఁ
     బలుకు బంతులుపూలపాలనీయ"
                                                 (తృణకంకణం)

అని యిట్లా మెత్తమెత్తగా రచిస్తున్నారు.
  
"విశ్వమోహనం మృదులం
 పూలపాలు వెన్నెలచెండ్లు తియ్యములు జింకపడతి"

అని యిట్లాటి మెత్తమెత్త అర్ధంగల మెత్తటిమాటలతో యిప్పటి కావ్యాలున్నవి. ఇట్లాటివి వెనకటి కావ్యాల్లో లేవు. ఇదే నూతనత్వం. అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను అది అసంబద్ధం

"సంచారిణి పల్లవినీ లతేవ" (కుమార)
"పుంస్కోకిలో యన్మధురం చుకూజ" (")
"తాంబూలవల్లీ పరిణద్ధపూగా (")

శ్వేతాలతాలింగిత చందనాను" (రఘు)
"మధు ద్విరేఫః కుసుమైకపాత్రే" (కుమార)

"చెన్నగు నన్నదీవులిన సీమల దాగిలి మూతలాడుచున్
 వెన్నెల రేలు కప్పురపు విప్పు టనంటుల నీడనీగు ా
 కన్నెలరోయు నన్నులకుఁ గన్నులుమూయు తదీయవాసనల్
 మన్ననగాంచికప్రపు దుమారము రేచు సమీర డింభముల్"
                                                                 (వసు)

"నాథచివులురంజిల్లె ననలు మొలిచె
 నలరె విరులెల్ల పూపలు దలలుసూపెఁ
 బసిమి నిరవొందెఁ బిందియల్ బలసెనవశ
 లాటువులు సాంద్ర రుచుల ఫలంబు లెసంగె" (వసు)

"తీవ ముత్తైదువచాలు" (వసు)

"కెంపుల పళ్లెరంబులన్" (వసు )

"మొగ్గలు ముత్తెపు మ్రుగ్గులీనగన్" (వసు)

"కన్నెమావిగుంపునం బెనగొన్న మల్లియలం బూచిన కోనలు " (వసు)

"కనుగొంటి లతకూన ననిడాయు" (వసు)

"హృదయమోహనశక్తి నీయిందువదన
 యంచితభ్రూలతారేఖ కైనయపమ" (నై. 3ఆ)

"శ్రుతపూర్వంబగువిశ్వమోహనకళాశోభావిశేషంబు" (నై. 3ఆ)

"చిన్ని వెన్నలకందు వెన్ను దన్ని సుధాబ్ది.
 బొడమిన చెలువ తోఁబుట్టుమాకు" (మ)

"పూఁత పసిండివంటి వలపుంబచరించు కులంబునీతికిన్" (మ)

"పసమీరు సెలయేరు లిసుకవెట్టెడు చోటఁ.
 జిగురుమాపుల సంజ నెగడు చోట" (మ)

అవి యిట్లా మెత్తటి అర్ధంగల మెత్తటిమాటలు మన కావ్యాల్లో చిరకాలంనుండి వున్నవి.

ఆక్షేపం.

అవునయ్యా యిట్లాటివి వెనకటికావ్యాల్లో వుంటే వుండవచ్చును కాని అవి ఆకావ్యాల్లో కొన్నిచోట్ల మాత్రేమే వున్నవి. యిప్పటి కావ్యాలనేకాలు అంతటా మెత్తటి అర్ధంగల మాటలతో నిండి ఆద్యంతం మెత్తగా వుంటున్నవి ఇది కొత్త: అని వాదిస్తామంటారా?

సమాధానం

చెప్పుతున్నాను మీ రన్నట్లు ఇప్పటికొన్ని కావ్యాల్లో పద్యాలన్నీ మెత్తమెత్తటిమాటలతో మెత్తగా వుండడం నిజమే కావచ్చును. అట్లా పద్యాలన్నీ మెత్తమెత్తటి అర్ధంగల మెత్తమెత్తటి మాటలతో మెత్తమెత్తగా వుండడం దోషమని భారతీయులు మాని వుండవచ్చును. మధురం తియ్యని మృదులం మోహనం యిట్లాటివి నిండుగా వుండడం శబ్దవాచ్యత అనే దోషమని ముందు వివరించబోతున్నాను. ఇక వెన్నెల చెండు పూలపాలు అనే యిట్లాటిమాటలె అసంగతం. లౌకికమైనట్టి లేదా భావరూపమైనట్టి సంబంధంమీద ఆధారపడి సాదృశ్యంగాని ఆరోపంగాని కల్పన చేయవలసివుంటుంది. లేకుంటే యోగ్యతా విరహంచేత ఆమాటలు అసంబద్దమే అవుతున్నవి. వెన్నెల చెండ్ల వంటివి యిట్టాటి అసంబద్ధపుమాటలే అవుతవి విస్తరభీతి చేత యీచర్చ ఆపి ప్రస్తుత విచారణకు వస్తాను వెన్నెల చెండ్లవంటివి మంచిమాటలే నని కొంతసేపు వొప్పుకొనే విచారిస్తాను. ఇట్లాటిమాటలు మంచివైతే దేశకాలపాత్రాల ఔచిత్యాన్ని పరిపాలించి సందర్భానుసారంగా వాడితే ఆకావ్యం యింపుగానే వుంటుంది కాని పాలు, పూలు, చెండ్లు, మధురం, శిరీషం, పేశలం, మృదులం, జిలుగుపూలు, వెన్నెల యిట్లాటి మాటలతోనే నింపి కావ్యమంతా మెత్తటి అర్ధాల మెత్తటిమాటలతో మెత్తగావుండే టట్లు చేయవలెనంటే తప్పకుండావెగటూ, భావసంకోచం తటస్థిస్తున్నవి. దశరూపక కారుడన్నట్లు ఉక్తరసాల్లోరమ్యం, జుగుప్సితం, ఉగ్రం, ప్రసాది, గహనం, వికృతం అయి అనేక రూపాలతో వున్న ప్రకృతిని వాచ్యం చేసేకవికి తద్దనుగుణాలైనభావాలూ శబ్దరూపాలూ యెన్నో స్వీకార్య "రసాలను రస్యమానావస్థకుతెచ్చే ఒకానొక ప్రతిరూపమైన నవదృష్టి" అని నవత్వప్రతిపాద కత్వాన్ని ఆనందవర్ధనుడు ప్రశంసిస్తాడు

"నవేతి క్షణే క్షణేనూత నైర్వైచిత్ర్యైర్జగన్త్యా సూత్రయన్తీ"

(ధ్వ.లో)

(నవఅంటే క్షణక్షణం నూతనవైచిత్ర్యాలవల్ల జగత్తులను చిత్రిస్తూ) అని పైపఙ్త్కులకు అభినవగుప్తపాదులు వ్యాఖ్యచేశారు. ఈ తీరుగా భారతీయులు కవిత్వంయొక్క నూతనత్వాన్ని ఆరాధిస్తున్నారు.

సంస్కృత సంప్రదాయాలను అనుసరించడంవల్ల నూతనత్వానికి అడ్దుగలిగి వాటిమీద ఇప్పుడాదరం తగ్గిందని భారతి సం- 3. సం- 3 లో ప్రకటితమైన వ్రాత అజ్ఞానమూలం భారతీయులు కవిత యొక్క నూతనత్వాన్ని ఆరాధించారని విశదపరచాను. ఆంధ్రకవిత్వంలో ఇప్పుడు నూతనత్వం సిద్ధించింది అని నూతనత్వాన్ని యిక విచారిస్తాను. భారతి మొదలయిన పత్రికల్లోవున్న ప్రణయపద్యాలు నారాయణమ్మ నాయుడు బావపాట, వెంకయ్య చంద్రమ్మపాట అనేకపద్యాల సముదాయ రూపమైన కృష్ణపక్షం వంటిపుస్తకాలు యేకాంతసేవ. కావ్యకుసుమావళి, వనకుమారి, యిటు వంటివన్నీ యిప్పటి నావిచారణకు విషయమన్నాను. ఆనందవర్ధనాదు లన్నట్లు వీటిలో నూతనత్వముండడం సాధారణంగా కవిత్వధర్మమేగాని విశేష మేమీలేదు. ఈ నూతనత్వమే కవికి ప్రాణం. కాళిదాసు భవభూతి మొదలైనవారి కవిత్వమంతా యెక్కడికక్కడ నూతనమే ఈనూతనత్వం ఇప్పటి కవిత్వానికి వుంటే కవిత్వధర్మం సిద్ధించిందనవచ్చును. గాని ప్రాచీన సంప్రదాయాలను తిరస్కరించడంవల్ల యీనూతనత్వం వచ్చిందని నూతనశకమని వెనక యెన్నడూ మన మెరుగని కొత్తకవిత్వమని అనడం అసంబద్దం.

ఆక్షేపం

ఈనూతనత్వంగాదు మేమనేది. అసలు శరీరం జీవం అవయవం ఇవన్నీ మారిపోయి ఒకవిశిష్టమైన కవితాకృతి వచ్చింది అందువల్ల నూతనశకం కొత్తకవిత్వం అని అంటున్నాము. అని అంటారా?

సమాధానం

వివరిస్తాను. ఈ కావ్యాల్లో వున్న శబ్ధాలు అర్ధాలు నూతనమంటే అది సరిగాదు. శబ్దాలు అనాదివృద్ధవ్యవహారపరంపరామూలాన వ్యవహృత మవుతున్నవి.

"ఘటేన కార్యం కరిష్యన్ కుంభకారకులం గత్వాహ కురు ఘటం కార్వమనేన కరిష్యామీతి న తద్వచ్చబ్దాన్ ప్రయుయుక్ష మాణో వైయాకరణ కులం గత్వాహ కురుశబ్ధాన్ ప్రయోక్ష్యఇతీ (మహా) అని పతంజలి అన్నట్లు శబ్దాల నెవరూ నిర్మించరు ఇక అర్ధాలుగూడా ఆశబ్దాలకు అనాది వృద్ధవ్యవహారంవల్లనే విదితమవుతున్నవి.

"నిత్యాః శబ్దార్థసంబంధాః సమామ్నాతా మహర్షిభి:" (వాక్య) అని వాక్యపదీయకారుడు చెప్పుతున్నాడు. మీమాంసకు లిట్లానే అంటారు. వాస్తవంగా అర్ధాలు శబ్దాలతో అవినాభావసంబంధంగలిగి వర్తిస్తున్నవే గాని వాటిని కొత్తగా కవులు యేర్పరచరు. నూతనంగా కవులు శబ్ధార్ధాలు నిర్మిస్తే వాటిని ఆ కవులే వివరించవలనుగదా వాటికి ప్రామాణ్య మేమిటి? కనుక ఇప్పటికవిత్వం శబ్దార్దాలవల్ల నూతన మనడానికి వీలులేదు.

కావ్యంలో కొన్ని యీకాలపురోడ్దు రైలువంటి కొత్తమాట లున్నమాత్రాన అవినూతనశకం ఆరంభిస్త వనడం అనుచితం భాషలో కొన్ని కొత్తశబ్దాలు వచ్చిన వనవచ్చును గాని కావ్యంలో యెట్లా నూతనశక మారంభమవుతుంది? కావ్యంలో రసభావాలు ప్రధానం.

ఆక్షేపం

అవునండీ ప్రణయం, లతకూన, చిగురు, లలితం, కన్నె, లేత, కలికికోయిల, కోమలం, దివ్యం, ఆనందం, చారు ఈమాట లీ కావ్యాల్లోవున్నవి. వెనుకటివాటిలో లేవు. ఇవిమీరన్నట్లు కావ్యంలో ప్రధానమైన రసభావాలను ఉపకారకాలు గనుక ఈ కాలపు కావ్యాలు విశిష్టం... అని అంటారా?

సమాధానం

చెప్పుతాను. మీరన్నమాటసరిగాదు. దివ్యం, ప్రణయం, లలితం మొదలైనవి వెనకటి కావ్యాల్లోను వున్నవి.

"దివ్య విషామృత ప్రకటనానాకావ్యధుర్యుండ"(భీమకవి చా)

"ఆనందో బ్రహ్మయటన్న ప్రాఁజదువు నంతర్బుద్ది నూహింపుమా" (మను)

"కరస్థదర్భ ప్రణయాపహారిషు" (కుమార)

"ప్రణయవిశదాం దృష్టిం దదాతి" (రత్నా)

"ప్రణయకుపితాం" (శ్రీముంజుడు దశారూపకంలో ఉదాహృతం)

"లలితైణాంక శిలాలవాల" (వసు)

"కన్నెమావిగుంపున" (వసు)

"లేఁగల్వ తూపునకు" (వసు)

"కలికి కోయిలగళగ్రహము సేయకమున్న" (వసు)

"నూతన లతికాలతాంగులను" (వసు)

"చూతాంకురాస్వాదకషాయకంఠః

పుంస్కోకిలో యన్మధురం చుకూజ" (కుమార)

"చరుణా మృరితేనాయ మపరిక్లతకోమలః.

పిపాసతో మమానుజ్ఞాం దదాతీవ ప్రియాధరః"" (శా)

ఈ తీరుగా ఇట్లాటి శబ్దాలన్నీ వెనకటి కావ్యాల్లోను వున్నవి. లతాంగనలు వసుచరిత్రలో వున్నారు. అవునయ్యా వెనకటికావ్యాల్లో లేవని అనలేదు. ఇప్పటికావ్యాల్లో యెక్కువగా ఉన్నవి.

"ప్రణయ మలయానిలోర్మికా పటలినూగు
 ప్రణయ నీరజ మధుర సౌరభముగ్రోలు
 ప్రణయ విమలాంబరాబ్ధి గర్భమునఁదేలు
 ప్రణయ వనతరు శాఖలం బల్లవించు" (కృష్ణపక్షం)

"మధుర చంద్రికలలో మధురామృతంబు
 మదురామృతంబులో మదురరసంబు
 మధురరసంబులో మధురభావంబు" (యేకాంతసేవ)

అని యీతీరున హెచ్చుగావున్నవి, ఈహెచ్చే కొత్త. ఈహెచ్చు కావ్యగుణాన్ని హెచ్చిస్తున్నది. కనుక ఈ కావ్యాల్లో కొత్త వున్నదంటాము; అని వాదిస్తారా?

సమాధానం

వివరిస్తాను. ఈహెచ్చు కావ్యగుణమని తేలవలెను. ఇట్లా యెక్కువగా వుండడం దోషమని తెలిసిమనవారు మాని వుండవచ్చును.

వాస్తవంగా ఇది దోషమని పిమ్మట నిర్ణయించబోతున్నాను. ఇది కొత్త అయినా దోషం గనుకను కావ్యవైసిష్ట్యంగుణాలవల్ల యేర్పడవలె గనుకను దొషాలవల్లనే ఆవైశిష్ట్య మేర్పడితే దుష్టకావ్యాలన్నీ ఒక కొత్తకవిత్వమే కావలసివచ్చును గనుకను మీకావ్యవైశిష్ట్యానికి దోషభూతమైన యీ ఆనందల ప్రణయల మధురల దివ్యల హెచ్చుకారణంగా నిల్వనేరదు.

ఆ క్షేపం

అవునయ్యా ఈ కాలపు కృతికర్తలు కటువైన మాటలు లేకుండా రచిస్తారు. ఇది కొత్త అంటాము; అని వాదిస్తారా

సమాధానం

చెప్పుతున్నాను. కటువైనశబ్దాలు లేని రచన చిరకాలంనుండి వున్నది. కొందరు రాజులు అంతఃపురంలో వినబడదగిన భాషను గురించి కొన్ని నియమాలు చేశారని రాజశేఖరుడు కావ్య మీమాంసలో తెలుపుతున్నాడు.

"శ్రూయతే కున్తలేషు సాతవాహనో నామ రాజా తేన ప్రాకృత భాషాత్మక మంతఃపుర ఏవేతి"

"శ్రూయతే మగధేషు శిశునాగో నామ రాజా తేన దురుచ్చారనష్టౌ వర్ణాన్ అపాస్య స్వాంతః పురుఏవ ప్రవర్తితో నియమః టకారాదయ శ్చత్వారో మూధన్యా స్తృతీయవర్జ మూష్మాణ స్త్రయః క్షకారశ్చేతి." మవుతున్నవి. దేశం, కాలం, ప్రకృతి మొదలైన భేధాలవల్ల భావాలూ తద్వ్యంజకమైన శబ్దసందర్బాలూ యెన్ని విధాలనో మారుతవి వీటికన్నిటికిi విముఖుడై మెత్తటిమెత్తటి అర్ధాల మాటలని కూర్చుంటే భావసంకోచం వెగటు. తప్పక పైనబడుతున్న వంటున్నాను. అత్తవారింటిలో యెప్పుడూ మెత్తటి మెత్తటి మాటలే మాట్లాడ వలెననికోరి దూది, పేడ వెన్నపూస అని అత్త వారింటిని అలజడిపాలు చేసిన పరమానందాయ శిష్యుడివలె తప్పక కృతికర్త అకృతార్దుడు కాగలడు ప్రసన్నత్వంగాక తక్కినమాధుర్యం మొదలైనకొన్ని గుణాలకొరకు కొన్ని అక్షరాలను మాత్రమే -- భావస్పోరక మైనశబ్దాలను గాదు -- వదల మన్నఘట్టంలో ఒక్కొక్క సందర్బాన్ని అనుసరించి ఆ అక్షరాలనుసయితం మానవలసిన పనిలేదని

"క్వచిద్గోపస్తు సమతా మార్గాభేద స్వరూపిణీ.
 క్వచిద్వక్త్రాది వైశిష్ట్యా దన్యధా రచనాదయః" |(సాహిత్య)

అని హితం జెప్పిన భారతీయసాహిత్య వేత్తల ఔచిత్య విజ్ఞానం వాస్తవంగాఆరాధ్యమైవున్నది. ఇట్లాటి ఔచిత్య విజ్ఞానంతో వెలసిన వాల్మీకి కాళిదాసాదుల కావ్యాలు ఇష్టగుణసంపన్నమై లోకోత్తరంగా వున్నవి. ఇంతకూ చెప్పదలచిందేమంటే అంతటా మెత్తటిమెత్తటిమాటలతోనే కావ్యంనింపవలె నంటే భావసంకోచం వెగటు, ఆపతితమవుతున్నవని అవి రచయితను అకృతార్ధుణ్ని చేస్తున్నవని అంటున్నాను. లోకంలో సయితం సందర్బానికి తగినట్లు మెత్తమెత్తగా మాట్లాడితే వుచితంగా వున్నదని అనుకొంటాము. కాని అయినదానికీ కానిదానికీ సమయంలో అసమయంలో మెత్తమెత్తటి అర్ధాల మెత్తమెత్తమాటలు వేసి తలతిప్పుతూ మాట్లాడుతూవుంటే అతణ్ని ఆడమాదిరి మనిషి అని పరిహసనీయకోటిలో చేరుస్తాము. అట్లానే కావ్యంసయితం హాస్యాస్పదమవుతుంది. కనుక అంతటా మెత్తమెత్తటి మాటలు నింపడం గుణంగాదని దోష హేతువని మెత్త మెత్తటి అర్ధాల మాటలతో అంతటానిండిన యిప్పటికవిత్వం నూతనమంటే అదిదోషం గనుక గ్రాహ్యంగాదని చెప్పుతున్నాను.

ఆక్షేపం

అవునయ్యా.

"కవితాకన్యా వృణీతే స్వయం" (బిల్హ)
"కాంతా సమ్మితతయోపదేశయుజే" (కావ్య)
"నవపల్లవ కోమల కావ్యకన్యకన్" (కేయూర)

అని యిట్లా కవ్యాన్ని కన్యతో పోల్చడం భారతీయసంప్రదాయం కావ్యం కన్యవలె మృదువైంది గనుకను రమణులు మెత్తమెత్తటి మాటలాడుతూ మెత్తగావుండడం అందరికీ ఆహ్లాదకరమే గనుకను కావ్యంగూడా అట్లానే ఆహ్లాదకరమై వుండడానికి అంతటా మెత్తమెత్తంగా మెత్తమెత్తటి మాటలతో నిండివుండడం ఆవశ్యకమే అవుతున్నది అని అంటారా

సమాధానం

సాదృశ్యవిచారణ

వివరిస్తున్నాను. "కాంతేవసరసతాపాదనేన అభిముఖీకృత్య" అని మమ్మటుడు చెప్పినట్లు సరసత్వాపాదనం చేతశ్రోతను అభిముఖుణ్ని చేసేమటుకే కన్యతో సాదృశ్యంగాని కన్నెవలె మెత్తగామెత్తగావుంటుంది. రవికతొడుక్కొంటుంది అని సర్వాంశాలా సాదృశ్యం చెప్పగూడదు. ఆమె ముఖం చంద్రుడివలె వుంటుందంటే చంద్రుడివలె సౌమ్యం. కాంతిమత్త్వం కలిగివుంటుందని అభిప్రాయంగాని చంద్రుడివలె గుండ్రంగా ముక్కూ కండ్లూ లేకుండా చెక్కినట్లు వుంటుందని భావంగాదు. అట్లాసర్వ సాదృశ్యం చెప్పితే ఉపమానోపమేయభావంపోయి రెండూ ఒకటేననవలసివస్తుంది. కొంతభేదం కొంతసాదృశ్యం వున్నప్పుడే ఉపమానోపమేయ భావం సంగతమవు తున్నది. కనుకనే సాదృశ్యం భేదవిశిష్టమై వుంటుంది. ఈవిషయాన్నే శ్రీశంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రబాష్యంలో ఉపాదిగతమైన ఆత్మకు జలసూర్య కాదితుల్యత్వాన్ని సిద్దాంతీకరిస్తూ.

"అత ఏవ చోపమా సూర్యకాదివత్."
"అంబువదగ్రహణాత్తు న తధాత్వం." (బ్ర. సూ)

"వృద్ధిహ్రాసభాక్‌త్వ మంతర్భావా ధుభయసామంజస్యా దేవమ్" (బ్ర. సూ)

అనే సూత్రాల సందర్భాన వివరించారు.

"నజలసూర్యకాది తుల్యత్వమి హోపపద్యతే తద్వదగ్రహణాత్! సూర్యాదిభ్యో హి మూర్తేభ్యః పృథగ్భూతం విప్రకృష్టం మూర్తం జలం గృహ్యతే| తత్రయుక్తః సూర్యాది ప్రతిబింబోదయః| నత్వాత్మా మూర్తః నచాస్మాత్ పృథగ్భూతా విప్రకృష్టదేశాశ్చోపాధయః సర్వ గతత్వాత్ సర్వానన్యత్వాచ్చ| తస్మాదయుక్తోయం దృష్టాంత" ఇతి.

"యుక్త ఏవ త్వయం దృష్టాంతో వివక్షితాంశ సంబవాత్| నహి దృష్టాంతదార్ప్టాంతికయోః క్వచిత్ కించి ద్వివక్షితాం శం ముక్త్వా సర్వసారూప్యం కేన చిద్దర్శయితుం శక్యతే| సర్వసారూప్యే హి దృష్టాంత దార్ప్టాంతికయో। ఉచ్ఛేద ఏవ స్యాత్|... జలగతం సూర్యబింబం జలవృద్ధౌ వర్ధతే జలహ్రసే హ్రసతి జలచలనే చలతి జలభేదే భిద్యత ఇత్యేవం జలధర్మానుయాయి భవతి న పరమార్ధతః సూర్యస్యతథాత్వ మస్తి ఏవం పరమార్థతో 7 వికృతమేకరూపమపి సద్బ్రహ్మ దేహాద్యు పాధ్యంతర్భావాత్ ద్భజతివ ఉపాదిధర్మాన్ వృద్ధి హ్రసాదీన్ ఏవ ముభయో ర్దృష్టాంత దార్ప్టాంతికయో: సామంజస్యాదవిరోధః (బ్ర. భా)

పరమాత్మ ఒకటైనా దేహాద్యుపాధుల్లో వ్వవస్థితమై ఉదకంలో ప్రతిబింబితమైన సూర్యుడివలె అనేకవిధాల కనబడుతున్నదంటే ఆదృష్టాంతం వొప్పుకో వీలులేదు. జలసూర్యులకున్న సంబంధం ఉపాధులకు ఆత్మకు లేదు. మూర్తాలైన చంద్రుడు సూర్యుడు మొదలైన వాటినుండి అవి ప్రతిబింబించే జలం మూర్తమై వేరై వాటికి దూరమైన స్థలంలో వుంటున్నది. కనుక సూర్యుడూ చంద్రుడూ జలంలో ప్రతిబింబిస్తారంటే వొప్పుకోవచ్చును. కాని ఆత్మకు మూర్తే లేదు. అది ప్రతిబింబించడానికి ఉపాధులు వేరై దానికంటెదూరమైన స్థలాల్లో లేవు. యెందుకంటే ఆత్మసర్వగతం ఆత్మకంటె భిన్నమైనది మరొక్కటిలేదు. కనుక జలగతసూర్యుడికి ఉపాధివ్యవస్థితమైన ఆత్మకూ సారూప్యం జెప్పడం అనుచితం (అని వాదిస్తే సిద్ధాంతం ఉక్తమవుతున్నది.)

(పై వాదం సరిగాదు)

ఈ దృష్టాంతం యుక్తమేను సామ్యానికి విషమైన వివక్షితాంశం వున్నది. దృష్టాంతదార్ప్టాంతికల్లో వివక్షితమైన కొంత సాదృశ్యంతప్ప సర్వసాదృశ్యం నిరూపించడానికి యెవరికి సాధ్యంగాదు. సర్వసారూప్యమే చెప్పుతామా దృష్టాంత దార్ప్టాంతికభావమే పోతుంది. జలగతమైన సూర్యబింబంజలం హెచ్చితే హెచ్చుతుంది. జలం తగ్గితే తగ్గుతుంది. జలం కదిలితే కదులుతుంది. జలం భేదిస్తే భేదిస్తుంది. ఈతీరుగా సూర్యుడు జలధర్మాలను పొందుతాడు. కాని నిజానికి సూర్యుడికి జలసంబంధి వృద్ధిహ్రాసాదులు లేవు. అట్లానే వాస్తవానికి ఆత్మ అవికృతం యేకరూపం అయినప్పటికీ దేహాధ్యుసాధయంతర్భావంవల్ల ఉపాది ధర్మాలైన వృద్ది హ్రాసా దులను పొందినట్లు కనబడుతుంది (ఈ వృద్ది హ్రాసభాక్త్వమే సూర్యుడికి ఆత్మకు సాదృశ్యంలో వివక్షితాంశం. ఈతీరుగా దృష్టాంత దార్ప్టాంతికాలు సమంజసమై ఆవిరుద్ధంగావున్నవి) అని శ్రీశంకరభగవత్పాదులు విశదీకరించారు. ఇంతకూ వివక్షితాంశమేమంటే కావ్యం కాంతవంటిదన్నప్పుడు సరసత్వా పాదనంచేత శ్రోతను అభిముఖుణ్ణి చెయ్యడం మట్టుకే సాదృశ్యంగాని అసాదృశ్యాన్ని అంతటా అన్వయించి కాంతవలె కావ్యమంతా మెత్తమెత్తగావుంటుందనీ అందువల్ల కావ్యం అంతటా విశ్వమోహనం ప్రణయం శిరీషం చిరు సోనలు జింకపడతి యిట్లాటి మెత్తటి అర్ధాల మెత్తమెత్తటిమాటలతో నిండివుండవలెననీ అనడం అప్రశస్తమని చెప్పుతున్నాను.

ఆక్షేపం

అవునయ్యా మీరన్నట్లు సర్వసాదృశ్యం అవసరంకాకుంటే కాకపోనీయండి సరసత్వాపాదనంచేత అభిముఖీకరణం సాదృశ్యంలో వివక్షితాంశమంటే మేమొప్పుకోము. ప్రణయం మృదులం, విశ్వమోహనం కన్నెలేడి యిట్లాటి మెత్తటి మాటలు వుండడమే కాంతా కావ్యాలకు సాదృశ్యంలో వివక్షితాంశ మంటాము. అని వాదిస్తారా?

సమాధానం.

చెప్పుతున్నాను. సరసత్వాపాదనంచేత అభిముఖీకరణం వివక్షితాంశమనేమాటను ఒప్పుకోమని మీరంటే, కావ్యమంతటా "ప్రణయం, మృదులం, విశ్వమోహనం, జింకపడతి" వంటి మెత్తటిమాటలసద్భావం సాదృశ్యంలో వివక్షితాంశమనె మీమాటను అంతకంటె చులకనగా నిరాకరిస్తున్నాము. అయితే యిది రాయిగుద్దుడువాదం. మీరన్నట్లు మెత్తటి మాటలతో అంతటా నిండివుండడమే వివక్షితాంశమని కొంత సేపువొప్పుకొని విచారిస్తాను. అట్లా కావ్యంలో అంతటాప్రణయం , శిరీషం, కన్నెమావి, విశ్వమోహనం, జింకపడ తి యిట్లాటి మెత్తటి అర్ధాల మెత్తటిమాటలే నిండివుంటే భావసంకోచం వెగటు అనే దొషాలు ఆపతితమై రచయితను ఆకృతార్థుణ్ని చేస్తున్నవని యిదివరకే నిరూపించాను. కనుక మమ్మటాదులన్నట్లు దేశ కాలపాత్రాలను అనుసరించి రసభావాలను పరిపాలించి సందర్భం వచ్చినప్పుడు మాధుర్యాధిగుణాల రచనలు ప్రతిపాదించడం శోభా హెతువు తప్పక కాగలదు. లేదా అనౌచిత్యం. భావసంకోచం, వెగటూసంభవించి రచయిత ఆకృతార్ధుడవుతున్నాడని తిరిగి చెప్పుతున్నాను. కనుక యిప్పటి కావ్యాలు కొన్ని అంతటా మెత్తమెత్తటి మాటలతో నిండివున్నవని అది నూతనత్వమని అంటే అట్లావుండడం భావసంకోచం వెగటూవంటి దోషాలకు హేతువని దోషం అంగీకార్యం గాదని, దోషానికి హేతువైన వైలక్షణ్యం నూతనత్వంగాదని అది గ్రాహ్యంగాదని విశదంచేశానని చెప్పి యీవిచారణ ముగిస్తున్నాను.

పూర్వపక్షం

ఈ కాలపు కృతుల్లో స్వాతంత్ర్యమెక్కువ
'ఈకవులు నిక్కముగ స్వతంత్రులు"
      -క. రామలింగారెడ్ది (లక్ష్మీకాంత తొలకరిపీఠిక)
"నవకవులకు స్వేచ్చప్రాణము "
కట్టుబాటులోకవిత్వమా"- దే.కృష్ణశాస్త్రి (యేకాంతసేవపీఠిక)

"జగమునిండ స్వేచ్ఛాగానఝురులనింతు". (కృష్ణపక్షం)

"స్వాతంత్ర్య గీతానాదమే స్వర్ణయుగమునకు ప్రాణభూతము,
 పోకడలు స్వతంత్రములు భావములు స్వతంత్రములు
                                          దశిక సూర్యప్రకాశరావు (భారతి)

అని ప్రకటించిన తీరున ఇప్పటికవులు స్వాతంత్ర్యాన్ని కనబరుస్తున్నారు. ఇట్లాటి స్వాతంత్ర్యంపూర్వుల్లో లేదు. కనుక ఇది కొత్తకవిత్వం అని వాదిస్తారు.

సమాధానం

చెప్పుతున్నాను అదిసరిగాదు. స్వాతంత్ర్యం సర్వకాలాల్లోను వున్నది. ఒకహద్దుకు లోబడ్డ స్వాతంత్ర్యాన్ని ప్రాచీనకాలంనుండి భారతీయులు గౌరవిస్తున్నారు.

ఇట్లాటి స్వాతంత్ర్యం రానురాను భవిష్యత్ప్రజల్లో నశిస్తుందని చింతపడ్డారు.

"స్వాతంత్ర్యం కౌశలం కాన్తిర్త్ధర్యం మార్దవమేవ చ (శ్రీభా)

అని యీగుణాన్ని శ్రీభాగవతకారుడు ప్రశంసిస్తున్నాడు.

"సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మ వశం సుఖం" (మను) అని మనువు చెప్పుతున్నాడు.

అయితే నేను పాఠశాలనుమాని యెగురుతాను. ఆచార్యులవద్ద విద్యనేర్వడం స్వాతంత్ర్యానికిభంగం అందువల్ల నాకు యేవిద్యావద్దు అని అనడం అనర్థహేతువు. అజ్ఞానాపాదకం గనుక అది స్వాతంత్ర్యం గాదు. అందుకే కొన్నిహద్దులకు లోబడ్డ స్వాతంత్ర్యాన్ని భారతీయులు ఆరాధించారన్నాను. కవిత్వంలో చూస్తామా యెవరి మనః ప్రవృత్తిని అనుసరించ్క్షి వారుసృష్టి చేశారు. కాళిదాససృష్టి వేరు భవభూతిసృష్టి వేరు. భవభూతి స్వతంత్రించి "ఏకోరసః కరుణఏవ" (ఉత్తర) అని ఉపదేశించాడు. "మురారేస్తృతీయ; పన్ధా:" అని ప్రసిద్దమేగదా! దీన్ని విస్తరించి వ్రాయవలసిన పనిలేదు. "నిరంకుశాః కవయః" అనేమాటలే చాలును అవిబారతీయ కవుల యీస్వాతంత్ర్యాన్ని అస్ఫుటద్వనితో వినిపిస్తున్నవి కనుక స్వాతంత్ర్యం వల్ల ఈకాలపు కవిత్వం కొత్తదంటే అంగీకరించ వీలులేదంటున్నాను" జగమునిండ స్వేచ్చాగాన ఝురుల నింతు" అని యీతీరునచెప్పలేదుగదా అంటే అట్లాచెప్పడం ఒకశ్ళాఘ్య లక్షణంగాదు.

ఉత్తము లెప్పుడూ తమగుణాలను కార్యాలచేత విదితంచేస్తారు గాని చెప్పుకోరు. అది తేలిక మనుషుల యొక్క వెలితి లక్షణం ఈ సంగతినే.

"తస్య సంవృతమంత్రస్య గూఢాకారేంగితస్య చ.
 ఫలానుమేయాః ప్రారంభాః" (రఘు)

(ఆలోచన గూఢంగావుండే ఆయన యత్నాలు ఫలాలవల్లనే కనుక్కోదగినవి.)

అనే పఙ్త్కులవల్ల కాళిదాసీభావాన్నే వ్యక్తం చేస్తున్నాడు

"బ్రువతే హి ఫలేన సాధవో న తు వాక్యేన నిజోపయోగితాం"

(సాధువులు నిజోపయోగితను మాటలచేత చెప్పరు. ఫలాల చేత కనబరుస్తారు.)

అని శ్రీహర్షు డీ అంశాన్నే తెలుపుతున్నాడు.

ఇంతకూ ఇట్లా చెపుకొన్నవాండ్లుకూడా వెనకవున్నారు
అర్జవవేష్టి తాఖిలమహామహిమండలమందు బూతులం బూర్ణుడ
                                                        (జగ్గకవి - చంద్ర రేఖా)

"ఎవ్వరేమన్న నండ్రు నాకేమికొరత" (శ్రీనథుడు-కాశీ)

ఈతీరుగా వారివారి స్వాతంత్ర్యాన్ని చెప్పుకొన్నారు. అసలిట్లా చెప్పుకొనడం లఘుత్వద్యోతక మని అది కొత్తగా దనితెలిపినాను. కనుక స్వాతంత్ర్యప్రకటనంవల్ల ఇప్పటికవిత్వంకొత్త అన్న మాట నిలువజాలదు.

"మ్రోడుమోక చివురులెత్తి మురుపుసూప"
"కర్కశశిలయ నవజీవ కళలుదేర"
"జగము నిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు" (కృష్ణపక్షం)

అని యిట్లా ఆత్మస్తుతిచేసుకొనడం గూడా కొత్తగాదు

ఇతరు లక్షరరమ్యతనాదరింప (భా- నన్నయ)
"విటుడు యతిగాక పోవునే వెస మదీయ

కావ్య వైరాగ్య వర్ణనాకర్ణనమున
యతి విటుడుగాకపోవునే యస్మదీయ
కావ్య శృంగారవర్ణనాకర్ణనమున". (నృసింహకవి-కవి కర్ణ)

"ఆమూలా ద్రత్నసానో ర్మలయవలయితాదాచకూలాత్ పయోధేః
యావంతః సన్తి కావ్యప్రణయనపటవః తే విశంకం వదంతు

"మృద్వీకామధ్యనిర్యన్మసృణమధుఝురీమాధురీభాగ్యభాజాం
వాచామాచార్యతాయాః పదమనుభవితుం కోస్తి ధన్యో మదన్య"

(మేరువుమూలంనుండి మలయవలయితమైన సముద్రతీరందాకా వున్న కావ్యకర్తలు నిశ్శంకంగా చెప్పుదురుగాక. ద్రాక్షనుండి వచ్చే చిక్కటి మధువుయొక్క మాధుర్యభాగ్యంగలిగిన వాక్కులకు ఆచార్యపదం అనుభవింప ధన్యుడు నాకంటె అన్యు డెవడున్నాడు. జగన్నాథుడు) యీతీరుగా ఇట్లాటి ఆత్మస్తుతి యేసందర్బంలో చెప్పినా చిరకాలంనుండి వస్తున్నది. ఈఆత్మస్తుతులైనా యే వొకటిరెండు వాక్యాల్లోనో పద్యాల్లోనో చెప్పితే మితంగా వుంటుంది.

"కలికి పాటలకోయిల కులముమాది"
"పికకుమారకు నన్ను బాడుకొన నిమ్ము"
 రాళ్లకు జీవకళవచ్చేటట్లు మోళ్లు చిగురులు పెట్టేటట్లు స్వేచ్ఛా
 గానం చేస్తాను;

కట్టుబాట్లు తెగేటట్లు ఆకాశం ప్రత్రిధ్వనించగా స్వేచ్చాగానం చేస్తాను;

చిత్త మానంద మయమరీచికలసోల
హృదయ మానంద భంగమాలికలదేల
కనుల నానంద జనితాశ్రుకణములూర
జగము నిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు
విశ్వమే పరవశమయి వెంటాడ
జగమునిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు
మాయ మయ్యెదను నామధురగానమున
ఏను స్వేచ్ఛాకుమారుడ నేనుగగన
పథవిహారవిహంగమ పతిని నేను

మోహనవినీల జలధరమూర్తి నేను
ప్రళయ ఝుంఝూప్రభంజన స్వామి నేను."
                                      (దే. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం)

అని యింకా యీతీరున ఆత్మస్తుతులు కృష్ణపక్షకర్తవలె చేసుకుంటే రోతగానే వుంటుంది.

పాపాయి అనేకృతిలో తత్కర్త

"లేశమేనియుఁ బ్రఖ్యాతి లేని నాకు
 కలిగె పాపాయి తండ్రియన్ గౌరవంబు
 పద్ధియంబులు నీపేర వ్రాయు కతన"

"రాణ నొప్పారె నాంధ్రసారస్వతాబ్ధి
 కావ్య మణులెన్నియో నేటికాలమందు
 వాని నెల్లను సరిపోల్పవచ్చునొక్కొ
 తావకానూనకావ్యరత్నంబుతోడ" (భారతి)

అని మొదట తన్ను తాను స్తుతించుకొని తరవాత యితరులు స్తుతించారని చెప్పుతున్నాడు. ఈస్తుతి ఇంకా వున్నదిగాని ఉదాహరించక మానుతున్నాను.

యెంకిపాటల్లో ఆత్మస్తుతిచేసుకో వీలులేక వాట్లో మాట్లాడేది పాత్రలే గనక ఆత్మస్తుతులను పాత్రలకు యెంకిపాటలకర్త ఒప్పగించాడు.

"కతకాడుమావూసె చెప్పాలె
 ఈసీమ ఆసీమ అందరందాలు
 తిన్నగా నినుజూసి దిద్దుకుంటారు
 ముందు మనపాపణ్ని కిందదిగనీరు
 యెంకొక్క దేవతై యెలిసెనంటారు."

ఇవి నాయుడి ఆత్మస్తుతులు

ఈవక్రమార్గపుస్తుతులతో తనివిలేక--

"ఆమహోన్నతభవాలకు నాయెంకిపాటలే కారణమైతే ధన్యుడను ... ధన్యుడను .... నన్ను ప్రత్యేకించి ఆహ్వానించి గౌరవించారు". అని కూడా యెంకిపాటలకర్త చెప్పుకున్నాడు. యిట్లాటి ఆత్మస్తుతులు ఈతీరుగా రోతలోకి దిగి యీనాడు మెండైనవి ఇట్లాటివి యేకాలంలో నైనా సరే అల్పబుద్ధిత్వ సూచక మేగాని పరిణతిద్యోతకంగావు. కవికుల గురువు కాళిదాసు.

"మందః కవియశఃప్రార్థీ గమిష్యామ్యపహాస్యతాం" (రఘు)

(మందుడను కవియశస్సునుగోరి అపహాస్యతను పొందుతాను) అని విజ్ఞలోకానికి వినతుడవుతున్నాడు.

అంతేగాని పికకుమారుణ్ణి కోయిలను, చిలకను అవి పాగడుకోలేదు. ఈ ఆత్మస్తుతి అధములుగూడా చేసుకోవచ్చును. మహాకవులను లోకం స్వయంగానే ఆరాధిస్తున్నది.

"వందే వాల్మికికోకిలం"
"పురా కవీనాం గుణనాప్రసంగే కనిష్ఠికాధిష్ఠితకాళిదాసా
 అద్యాపి తత్తుల్యకవేరభావాత్ అనామికా సార్ధవతీ బభూవ"
"దాసతాం కాళిదాసస్య కవయః కే న విభ్రతి"
                                               (గంగాదేవి - మధురా)
"నిర్గతాసు నవా కన్య కాళిదాసస్య సూ క్తిమ.
 ప్రీతిర్మధురసార్ద్రాసు మంజరీష్వివ జాయతే. (హర్ష - బాణుడు)
"శ్లోకత్వమాపద్యత యస్య శోకః" (రఘు - కాళిదాసు)

అని మహాకవులు నాటికి నేటికి ఆరాధితులవుతున్నారు. అనుచితమైన ఆత్మస్తుతులు అల్పబుద్ధిత్వసూచికమని అది కొత్తకాదని చెప్పి యీ విమర్శ ముగిస్తున్నాను.

పూర్వపక్షం

"పూర్వులాశ్రయించిన పద్యములు ముఖ్యముగా వృత్తములు కందములు ఇప్పటినవకవులకు విశేషముగా యోగ్యమయినవి గీతములు, ద్విపదలు" అని లక్షీకాంతతొలకరి పీఠికాకర్త శ్రీ రామలింగారెడ్దివారు వ్రాసినట్లు యిదివరకు చంపకమాలలు మొదలైనవి వ్రాసే వారు. యిప్పటి కవులు గీతాలు ద్విపదలు వ్రాస్తున్నారు యింకా ముత్యాల సరమువంటి వెన్నోకొత్తవి వ్రాస్తున్నారు. యీతీరుగా పద్యాల్లో కొత్తకనబడుతున్నది కనుక యిప్పటి కవిత్వం కొత్తఅంటామంటారా

సిద్ధాంతం.

చెప్పుతున్నాను. మీరన్నమాటసరికాదు. ఇప్పటికవులుగూడా చంపకమాలలు మొదలైనవి తరుచుగా వాడుతున్నారు, వనకుమారి నిండా ఈవృత్తాలువున్నవి. కొమాండూరి కృష్ణమాచార్య కృతులైన విరహోత్కంఠిత, పాదుకాస్తవం ఇవి వృత్తమయాలు గీతాలు, ద్విపదలు వెనుకటివారు సయితంవాడినారు వెనుకటివారు అక్కడక్కడ వాడినారుగాని, యిప్పటివారు గ్రంథమంతా గీతాలుగాని ద్విపదగాని వాడుతున్నారంటారా? అదిగూడా అసత్యం రంగనాథుడు శ్రీనాథుడు మొదలైనవారు కేవలం ద్విపదలలోనే గ్రంథమంతావ్రాశారు. ఇక వేమనశతకం చాలామట్టుకు గీతమయమేగదా ఇట్లాగీతాలు, ద్విపదలు గ్రంథమంతా వాడడం మనకు కొత్తగాదు. ఇప్పుడెక్కువమంది వాడుతున్నారంటారా అదిసరిగాదు. అప్పుడెంతమంది అట్లాగీతమయంగా ద్విపదమయంగా వ్రాశారో యెవరెరుగుదురు?

నలచరిత్రం. సారంగధరచరిత్ర (బాణాల శంభుదాసుడు)

ధర్మాంగదచరిత్ర (బొమ్మకంటి నృసింహకవి)

మైరావణచరిత్రం. భారతోద్యోగపర్వం (తిమ్మయ)

గీతరఘునందనం (తిరుమలకవి)

ఇట్లా ద్విపదగ్రంథాలెన్నోవున్నవి. వీట్లో అచ్చుపడనివి కొన్ని వున్నవి. యథా వాల్మీకమనే ద్విపదరామాయణం. ద్విపదబారతమే వున్నవని తెలిసినప్పుడు ఆకాలంలో ద్విపద యెంతవ్యాప్తిలో వుండేదో మనకు గోచరిస్తున్నది. ఇఘ ముత్యాలసరంవంటి పద్యాలను విచారిస్తాను. ఈ తీరుగా కొత్త పద్యాలను వాడడం యిప్పటి యీతొలకరి కృష్ణ పక్షం మొదలైన కృతికర్తలతో ఆరంభంగా లేదు. భారతరామాయణాల్లోలేని రగడలను పెద్దనవాడినాడు. శ్రీనాథుడు, పోతన అదివరకు నన్నయ తిక్కనలు, యెర్రాప్రగడా వాడని దండకాలను వ్రాశారు.

శ్రీ కొక్కొండ వేంకటరత్న శర్మవారు వెండి బంగారు రత్నం మొదలైన కొత్తపద్యాల నెన్నిటినో నిర్మించారు. కనుక కొత్తపద్యాలను వాడడం నేడు కొత్తగావచ్చిందికాదు. ఒకవేళ వచ్చిందని నొప్పుకున్నా అది పద్యాలకొత్త అవుతుంది కవిత్వంలో కొత్తగాదు గదా యెందుకంటే పద్యాలే కవిత్వంగాదు కవిత్వంలేని పద్యాలు వుండవచ్చును గద్యంలోగూడా కవిత్వం వుండవచ్చును.

"పద్యగద్యమయం ద్విధా" (సాహిత్య)

అని సాహిత్యదర్పణకారు డీసంగతిని తెలుపుతున్నాడు కనుక ఒకవేళ పద్యాలు కొత్తవున్నా అది కవిత్వానికి సంబంధించినది కాదు. ఇంతకూ అనుశ్రుతంగా యీకొత్త వస్తున్నదేగాని నేటికాలపు కృతికర్తల అపూర్వమార్గం కాదని యిదివరకే తెలిపినాను.

"తటతరంగము విరిగెనే
                కెరటాలు
 చిటిలియొడ్డున చిందెనే
               చివురాకు. (విశ్వనాధ సత్యనారాయణ - భారతి)

అని యీతీరున దరువులు విరుపులు వెనకలేవు. కనుక ఇది కొత్త అంటారా అది అసంగతం. పెద్దన, వాడినరగడలు దరువులతో విరుపులతో కూడినవే అదిగాక అప్పకవి కళిక, ఉత్కళిక, నవవిధరగడలు మొదలైన లయతాళ సమన్విత రీతుల నెన్నిటినో తెలిపినాడు.

దనరహయతదార్క్ష్యుండంచు మును శుకాదిమునులు పొగడ (హయప్రచారరగడ)

విజయభద్రముచెల్లు నిదురపూజితపాద (ద్విరదగతిరగడ)

కమలనేత్రునిరాక రోయుచుయమునయొడ్డును దపము చేయుచు (ఉత్కళిక)

మరియువ్రేతలనెల్ల మరులుకొల్చినవాని (కళిక)

గాలిరక్కసుఁ జాహగాలదన్నినవాని (కళిక)

నేర్పుమైనల్ల యది నెఱుల దొలుపూదుఱిమె
దర్పకునకర్పింపఁ దలాపదెంతటి పెరెమె"
ఇంతిపావురపురొద యేలవినెదారజము
వింతయేవిరహిణుల వెతబెట్టు బేరజము. (రగడ-మను)

బాలబాల రసాలమిది పికపాలిపాలిటి యమరసాలము
గేలిగేలిడి గ్రుచ్చగడురా గిల్లుగిల్లుము తత్ప్రవాళము
మూలమూలల మల్లె లెంతటిమోహమో హరిణాక్షిదాచితి

యేలయేలకిపొదలు వెదకెద వింత వింతలె యెందుజూచితి"
                                                 (వృషభగతిరగడ-వసు

అని యీతీరున దరువులు విరుపులు చిరకాలమునుండి వున్నవిగాని కొత్తవిగావు. వీటిలో ఉత్కళిక గురుజాడఅప్పారావు కన్యక అనే ఖండకావ్యపు వృత్తానికి మూలమనదగినది. వీరు కట్టుబాట్లు తెంపి కావ్యాలు వ్రాస్తున్నారు. అది కొత్త అంటారా? అదిగూడా నిల్వజాలదు. కట్టుబాటులో కవిత్వమా అనిచెప్పిన పీఠికాకర్త కృష్ణపక్షంలో వళులు, ప్రాసలు మొదలైన వాటికిందనే వున్నాడు.

........... మాలికలంబ్రణయార్ద్ర -
........... బూవుపూవునకు -
ఆకులో నాకునై (మురువుసూప)
యదృశ్యమౌ నిద్రవోవు (కృష్ణపక్షం)

అని యీతీరున నుగామం గజడదబల గసడదవల అదేశం, యడాగమం మొదలైనవన్నీ వెనుకటికావ్యాల్లో వలెనే వున్నవి. యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాట యిటువంటి కావ్యాల్లో భాష కొత్తది అంటారా అదీ సరిగాదు.

"యెట్లా పోనిస్తివోయి మట్లావోరి చిన్నదాన్ని"
"ఓరందకాడా బంగారుబావా"

అనే యిట్లాటి యాటపాటల్లో చిరకాలమునుండి యీభాష వుంటూనే వున్నది.

ఆక్షేపం.

అవునుగాని వీటిలో ఋతువర్ణనలు చంద్రోపాలంభాదులు మొదలైనవి లేవు గనక యీకలపు కవిత్వం కొత్త అంటాము అని వాదిస్తారా?

సమాధానం

చెప్పుతున్నాను మీమాట సరిగాదు. ఋతువర్ణనలు మొదలైనవి వుండడం లేకపొవడం కవిత్వానికి నూతనత్వ మాపాదించవు. సందర్భానికి వుచితంగా వుంటే అవి కావ్యానికి నూతనత్వ మాపాదించవు. సందర్భానికి వుచితంగా వుంటే అవి కావ్యానికి గుణాన్నే ఆపాదిస్తవి. ఉచితదశల్లో మనోహరంగా వుండే ఋతుసందేశాలకు చంద్రుడికి కవియెట్లా విముఖుడు కాగలడు? అనుచితంగావుంటే అవి ధోషమే అవుతవి. అంతేగాని అవి వుండడం లేకపోవడం కవిత్వానికి నూతనత్వ మాపాదిస్తవనడం అసంగతం అసిలింతకూ ఋతువర్ణనలూ, చంద్రోపాలంభాదులూ అనుచితమైన జాబితాలుగా లేని మేఘసందేశాదులు శాకుంతలాదులు ఓరోరిబండోడ ఓరందకాడా బంగారు బావా మొదలైన పాటలు చాలాకాలంనుండి వున్నవి దీంట్లో యేమీ కొత్తలేదు. కనుక ఋతువర్ణనలు చంద్రోపాలంబాదులు మొదలైనవి లేకపోవడంవల్ల యీకాలపు కవిత్వం కొత్త అనడం అసంబద్ధమంటున్నాను.

పూర్వాక్షం

అవునయ్యా యిప్పటికవులు ఒకటి రెండుపద్యాలు మాత్రం వ్రాసి ఒకపేజీమీద ప్రత్యేకంగా అచ్చువేస్తున్నారు. వెనకటి కావ్యాలన్నీ యెంతో విపులమైనవి. యిది కొత్త అంటారా?

సిద్దాంతం.

చెప్పుతున్నాను అది అసంబద్దం వెనుకటి కవులుగూడా ఇట్లా ఒకటి రెండు పద్యాలు వ్రాశారు.

"రంజనచెడి పాండవులరిభంజనులైవిరటుగొల్వ పాల్పడిరకటా"
"నరసింహ కృష్ణరాయల కరమరుదుగకీర్తియొప్పె"
'కరిభిత్ గిరిభిత్ కరికరిభిత్ గిరిగిరిభిత్
"కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబై"
"కాశికావిశ్వేశు గలిసె వీరారెడ్డి"
"రత్నాంబరంబులే రాయడిచ్చు" (చా)

ఇవన్నీ అట్లాటివే వీటికే చాటూక్తు లనిపేరు. ఇప్పటి పద్యకర్తలు వ్రాసేవిగూడా మనోహరంగా వుంటే చాటూక్తులే అవుతవి. వీటిని వీరు కావ్యమంటున్నారు. ఇది కొత్త అంటారా? అది వీలుగాదు. ఒకటి రెండు పద్యాలు కావ్యం కాదని, రసభావాలసిద్ధికి సాంగస్వరూపావిష్కృతి అవశ్యకమని అవి చాటూక్తులేనని ముందు తెలుపబోతున్నాను. వాటిని కావ్య మనడం అజ్ఞానంగాని కొత్తగాదు. ఈ తెలియక పోవడం కొత్త అయితే కావచ్చునుగాని కొత్త గుణప్రతిపాదకమైనపుడే గ్రాహ్యం గనుక దానిని ఉపేక్షిస్తున్నాను. ఇక ఈ కాలపుకృతులలో వుండే నిదర్శనపరంపరలు, దరువులు, విరుపులు వికారాలని, వృత్తంతో సంబంధించని జడకుచ్చులవంటి పేర్లు అనుచితమని ముందు నిరూపించబోతున్నాను. ఇఘ వాగులు, కొండలు, మేఘములు, విద్యుల్లతలు, వీటిమీది ఆసక్తి యీకాలపు కృతికర్తలకు కొత్త ఆనడం అవివేకం. భారతీయకవుల కివి చిరకాలంనుండి ప్రేమపాత్రంగా వున్నసంగతి భారతీయవాఙ్మయం బహుముఖాల వ్యక్తం చేస్తున్నది.

"ఉద్యానే సరణిః సర్వఫలపుష్పలతా ద్రుమాః
 పికాలికేకిహంసాద్యాః క్రీడావాప్యధ్వగస్థితిః,
 శైలే మేఘౌ షధీధాతువంశ కిన్నర నిర్ఘరాః". (సాహిత్య)

అని యీతీరున వీటిని కావ్యవేత్తలు విడదీసి సయితం చెప్పినారు. రసభావాలసందర్భా లకు తగినట్లు సర్వజగత్తునందు మృదువుకఠినం ప్రసన్నమప్రసన్నం ఋజుకుటిలం అయిన సమస్త పదార్ధసంచయాన్ని పరిణతదృష్టితో చూడగలిగిన భారతీయకవుల సృష్టి అమేయమై వెలసివున్నది.

"రమ్యం జుగుప్సితముదారమధాపినీచ
 ముగ్రం ప్రసాది గహనం వికృతం చ వస్తు
 యద్వాప్యవస్తు కవిభావకబావ్యమానం
 తన్నాస్తి యన్న రసభావముపైతి లోకే." (దశ)

అని దశరూపకకారుడు చెప్పుతున్నాడు ఇట్లాటి భారతీయవాఙ్మయంలో ఈకాలపు కృతికర్తలకు వాగులకొండల లతల కోయిలలమీది ప్రీతి కొత్త అనడం అవివేకమే అవుతుంది.

ఆక్షేపం

అవునయ్యా మీ రిదివరకు కొత్తలేదని చూపినవన్నీ స్వల్పవిషయాలు అప్రధానవిషయాలు. వాటిలో కొత్తలేకున్నా మావాదానికి భంగంలేదు. నేటి కాలపుకవిత్వం వాస్తవంగా కొత్తది. వెనుకటికవులు ఆశ్వాసాలని, సర్గలని, కావ్యవస్తువును విభజించి పెద్దపెద్దకావ్యాలు వ్రాశారు కాని యెంకిపాటలవలె కధ కొంచెంగా సర్గవిభాగం లేకుండా కొద్దిపాటిగా భావమే ప్రధానంగా వ్రాసినకావ్యాలు లేవు. ఇవి యింగిలీషు లిరిక్సునుబట్టివ్రాసినవని వీటిలో భావోద్రేకం ప్రధానం. ఇట్లాటివి మనకు లేవు. ఇప్పటికవుల చిన్నకావ్యాలు యీలిరిక్కులకు చేరినవి వీటిని మేము భావకవిత్వమంటాము. ఇవి కొత్త, దీన్నికాదని మీరెంత యత్నించినా అనలేరు. అని వాదిస్తారా?

సమాధానం

చెప్పుతున్నాను. ఈసంగతి ముందు విచారిస్తాను. దాన్నిప్పుడు నిల్పుతున్నాను.

ఆక్షేపం

"ఈదులాడంగవచ్చు మీయింటికెలని
 పంటకాలవ కొబ్బరిపాలలోన
 నొకరిపై నొకరము చేతు లుంచుకొనుచు
 ఇష్టపడెదవు నీతోడ నేనుగూడ
 పూని చనుదెంతు నీసన్నిధానమునకు
 మరువకే నెచ్చెలీ నన్ను మరువబోకు"
                               (గిరికుమారుడు.సాహితి)

"సుందరాంగుల నెందర జూచియున్న
 జానకీ ఆత్మ నిల్పు నీయానవంబె
 తరుణి నాచిత్త మనియెడు దర్పణమున
 బింబితంబగు నీముఖ బింబమెపుడు"
              (అధికార్ల సూర్యనారాయణ - భారతి సం.2 సం.2)

"ఏల నాహృదయంబు ప్రేమించు నిన్ను"
                                   (దే. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం)

"విబుధులందరు నన్ను విడిచిపోయినను
 హేతులందరును నన్ను నేవగించినను
 నాప్రేమభాగ్యంపు నవ్వువెన్నెలలు
 నాపైన ప్రసరింప నాకేమిభయము"
                      (గరిగపాటి రామమూర్తి - భారతి 2.11)

అని యీతీరున "నేను" అని ఉత్తమపురుషతో చెప్పడం కొత్త. వెనకటివాండ్లంతా యేనలుడిథనో చెప్పేవాండ్లు కాని యిప్పుడు నేను, నా, అని చెప్పుతున్నారు. ఇది కొత్తగాదా అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. అది అసంబద్ధం ఇట్లాటి "నేను" పద్యాలు చిరకాలంనుండి వుంటున్నవి.

"జొన్నచేలోమంచి సొగసుకత్తెనుజూస్తి
 నిన్నటాలనుంచి నిరుదలేదు-"

"గొల్లవారీచిన్నది నన్ చల్లగుండూమన్నదీ"

"వరబింబాధరమున్ పయోధరములున్ వక్రాలకంబుల్ మనో
 హరలోలాక్షులు చూప కవ్వలిమొగంబై నంత నేమాయె నీ
 గురుభాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు నాకుల జాల వేగంగ కి
 ద్దరిమేలద్దరి కీడునుం గలదె యుద్యద్రాజబింబాననా"- (చాటు)

"అవిదితసుఖదుఃఖం నిర్గుణం వస్తు కించిత్
 జడమతిరిహ కశ్చిన్మోక్ష ఇత్యాచచక్షే
 మమ తు మతమనంగస్మేరతారుణ్యఘూర్ణ
 న్మదకలమదిరాక్షీనీవిమోక్షో హి మోక్షః"

(సుఖంగాని, దుఃఖంగాని విదితముకానటువంటి ఒక నిర్గుణవస్తువు మోక్షమని ఒక జడబుద్ది అన్నాడు. నామత మదిగాదు. వికసించే యౌవనంతో ప్రకాశిస్తూవున్న స్త్రీయొక్క నీవిమోక్షమే మోక్షమని నామతం.)

"సతి ప్రదీపే సత్యగ్నౌ సత్సు తారామణీందుషు
 వినా మే మృగశాబాక్ష్యా తమోభూతమిదం జగత్" (భర్తృ)

దీపముంటేనేమి అగ్నివుంటేనేమి నక్షత్రాలు చంద్రులు మణులుంటేనేమి, నామృగశాబాక్షిలేకుంటే నాకు జగమంతా చీకటే.)

"కదా కాంతాగారే పరిమళమిళత్ పుష్పశయనే
 శయానః కాంతాయాః కుచయుగమహం వక్షసి వహన్.
 అయే కాంతే ముగ్దే కుటిలనయనే చంద్రవదనే
 ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్"

(కాంతాగారంలో సువాసనగల పుష్పశయ్యమీద పరుండి ప్రియురాలి వక్షోయుగ్మాన్ని రొమ్ముమీద వహిస్తూ "ఓముగ్దా, కుటిలనయనా, చంద్రవదనా, ప్రసన్నురాలవు కావలసినది. అని అంటూ యెప్పుడు దినాలను నిమిషంవలె గడుపుతాను?)"

అని "నేను" అని చెప్పినవి చిరకాలంనుండి వుండినవి

"దై వేపరాగ్యదనశాలిని హంత జాతే
 యాతే చ సంప్రతి దివం ప్రియబంధురత్నే
 కస్తై మనః కథయితాసి నిజామవస్థాం
 కః శీతలైః శమయితా వచనై స్తవార్తిం (భామిని)

దైవం పరాఙ్ముఖంకాగా ప్రియబంధురత్నం స్వర్గానికిపోగా ఒమనస్సా! ఇఘ నీదశను యెవరికి చెప్పుకుంటావు. శీతలవచనాలతో యెవరు నీసంతాపాన్ని పోగొడతారు) అని మనస్సును సంబోధించి తరువాత--

"ప్రత్యుద్గతా సవినయం సహసా పురేవ
 స్మేరైః స్మరస్య సచివైః సరసావలోకైః
 మామద్యమంజురచనై ర్వచనైశ్చ బాలే
 హాలేశతోపి న కథం శిశిరీకరోషి" (భామిని)

"సర్వేపి విస్మృతిపథం విషయాః ప్రయాతాః
 విద్యాపి భేదగళితా నిముఖీబభూవ
 సా కేవలం హరిణశాబకలోచనామే
 నైవాపయాతి హృదయాదధిదేవతేవ" (భామిని)

"మందస్మితేన సుధియా పరిషిచ్య యా మాం
 నేత్రోత్పలైర్వికసితై రవిశం సమీపే
 సా నిత్యమంగళమయీ గృహదేవతామే
 కామేశ్వరీ హృదయతో దయితా న యాతి" (భామిని)

"బాలా యిదివరకువలె యెదురుగావచ్చి వినయంతో మన్మథుడి మంత్రులనదగిన ఆలోకనాలతో మనోహరమైన మాటలతో అయ్యో! కొంచెమయినా నన్నిప్పుడు సంతోషపెట్టవెందుకు?

ఇంద్రియార్థాలు మరచాను. దుఃఖంచేత విద్యగూడా వెనక బట్టింది. కేవలం ఒక్క నాభార్యయే లేడిపిల్లలవంటి కన్నులుగల నాభార్యయే. ఆధిదేవతవలె నాహృదయంనుండి పోదు.

"చిరునవ్వనే అమృతంతో నన్ను స్నానంజేయించి వికసించిన నేత్రోత్పలాలతో నన్నెప్పుడూ పూజిస్తున్న ఆ నిత్యమంగళమయి ఆ నాగృహదేవతాకామేశ్వరి, ఆనాప్రియురాలు నాహృదయంనుండిపొదు" అని భామినీవిలాసాంతర్గతమైన కరుణవిలాసంలో జగన్నాథవిరచిత పద్యాలు కనబడుతున్నవి.

ఈ తీరున నేను, నా, అనేపద్యాలకవిత్వం చిరకాలంనుండి వస్తున్నది. దీంట్లో యేమీకొత్తలేదు. ఇంతకూ నేను, నా, అనే యిట్లాటి కవిత్వం యొక్క ఔచిత్యం ముందు చర్చించబోతున్నాను. కనుక యిక్కడి ఆప్రశంస వదలుతున్నాను. ఇఘ మరేవిధమైన కొత్తాలేదు. యేదైనా కొత్తవుంటే అది దోషభూతం గనుక కొత్తలోచేరదని తెలపబోతున్నాను. కనుక "కొత్తకవితాప్రపంచం" "మనవారు కొత్తవారైనారు"

అని యిట్లా అనుకొనడం భ్రమ. అజ్ఞానం. అవివేకం అని చెప్పుతూ యిఘ యీకాలపుకృతులలో గుణదోషవిచారణ చేస్తాను.

నేటికాలపు కవిత్వం వెనుకటిదానికి తీసిపోదని వెనుకటికాలపు కవిత్వం కంటె ఉన్నతదశలో వున్నదని కొంద రంటున్నారు

"కవులు బయలుదేరినారు. పాతకవులవంటి వారుగారు"
"కవనమున కుండవలసిన లక్షణము లన్నియు నిద్దానికి
 సంపూర్ణముగ గలవు"
               (యేకాంతసేవ పీఠిక. దే. కృష్ణశాస్త్రి.)

"ఈబాలకవులు తొల్లింటిస్కంధముల యశంబునకేమాత్రమును తీసిపోని యొక కొత్తస్కంధమును చేర్చబొవుచున్నారు."
                                                     (బాపిరాజతొలకరి పీఠిక - కూల్ద్రే)
"గుణమున నింతకంటె శ్రేష్ఠములైన కృతులు మనలో లేవు"
                                        (లక్ష్మీకాంత తొలకరిపీఠిక -క.రామలింగారెడ్డి)
"యెంకిపాటలు పూర్వపురచనలకంటె వింత అందమును నూతనప్రకాశమును వెలిగక్కుచున్నవి"
                                                       (దశిక సూర్యప్రకాశరావు. భారతి)

అని యీతీరున అన్నారు. మంచిది. ఈవిషయాన్ని ఇక విచారిస్తాను. ఇంతటి ఉత్కృష్టమైనకవిత్వం నేటికాలంలో వున్నదని విన్నపుడు నాకెంతో ఆనందం కలిగింది. మిక్కిలి కుతూహలంతో ఈకవిత్వాన్ని పఠించాను. గుణదోషాలను వివరిస్తాను.

అని శ్రీమదక్కి రాజు లక్ష్మీనారాయణపుత్ర - ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో

వాఙ్మయసూత్ర పరిశిష్టంలో నూతనత్వాదికరణం.

సమాప్తం

శ్రీ ర స్తు.

వాఙ్మయ పరిశిష్టభాష్యం

విస్తరాధికరణం

ఇది గుణదోష విచారనచేస్తాను.

ఈ కాలపు కృతుల్లో ముఖ్యంగా నాటకాల్లో ఈవిస్తరదోషం కనబడుతున్నది. చెప్పవలసినదానికంటె హెచ్చుగా కవిగాని పాత్రలు గాని చెప్పడం విస్తరదోషం. దీనివల్ల విసుగు రసభంగం కలుగుతున్నవి. లోకంలో సయితం వదరుబోతును అధికప్రసంగంచేస్తాడని అసహ్యించుకొంటాము. ఇక రసాస్వాదం కలగవలసిన నాటకంలో అధిక ప్రసంగం అసహ్యమని చెప్పవలసిన పనిలేదు. నాటకంప్రయోగ ప్రధానం రంగస్థలంలో పాత్రలు ఊరికెవదురుతుంటే లేచిపోవలెనని మనకు బుద్ధిపుట్టుతుంది. వకీళ్లు విద్యాంసులు తమసిద్ధాంతాలను స్థాపించడానికి హెచ్చుగా మాట్లాడినా తగేవుంటుందిగాని రసాస్వాద ప్రధానమైన కావ్యనాటకాల్లో ఆపని చాలాహేయం. ఈ హేయమైనపని యీ కాలపు కావ్యాల్లో నాటకాల్లో తరుచుగా కనబడుతున్నది. కూచి నరసింహకృతి వనవాసిలో సేవకుడు యజమానుడి అపాత్రదానాన్ని గురించి రెండుపుటలు ప్రసంగిస్తాడు. సప్తమాంకంలో పావకుడు దారకుణ్ని దూషించడానికి మధ్య ఒక దారకవాక్యం తీసివేస్తే వరసగా మూడుపుటలు ప్రసంగిస్తాడు. బళ్లారి కృష్ణమాచార్యుల సారంగధర చిత్రనళీయాదులు విస్తరదోషంతోకూడి వున్నవి. చిత్రనళీయంలో ప్రథమాంకం తృతీయరంగంలో నటుడు భీమపుర వర్ణనగురించి హరిణగతిరగడలో పూర్తిగా రెండుపుటలుపన్యసిస్తాడు. అడవిలో దమయంతి నిద్రబొయ్యేటప్పుడు ఈమె నెట్లా వదులుతానని రెండుపుటలు గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతాడు. దమయంతి లేచి రెండుపుటలు విలపిస్తుంది. ఇట్లానే రామరాజుతో పఠానుచివరన కొన్నిపుటల ఉపన్యాసం చేస్తాడు. సారంగధర మొదలైన విట్లానేవున్నవి. ఇట్లాటివి వెనుకటి నాటకాల్లో వున్నా అది దోషమేగాని గుణంకాదు. కాళిదాసువంటి కవియొక్క కృతిలో ఇది కనబడితే దాన్ని దోషమనే మమ్మటుడు నిరాకరించాడు. అది కుమారసంభవంలోని రతీవిలాపం. అది ఉండవలసినదానికంటె హెచ్చుగా వుంటుంది. శాకుంతలంలో తృతీయాంక ప్రారంభంలో రాజు కొంచెం దీర్ఘంగా ప్రసంగించినట్లుంటుంది.

"ముద్రారాక్ష సాద్యసత్ కావ్యవిషయత్వాత్" (అహో) అని అహోబలుడు నిరాకరించిన ముద్రారాక్షసంవంటి కేవలవ్యవహార నాటకాల్లో వుంటే అది అసత్కావ్యత్వాన్ని యింకా యెక్కువగా స్థిరపరుస్తుంది. ఇక వెనుకటినాటకాల్లో యెక్కడనైనావుంటే అది దోషమేగాని గుణంకాదు.

ఈకాలపుకృతుల్లో ఇది విస్తారంగా వున్నది. కృష్ణపక్షంలోని "ఆశ" మొదలైనవి సాహితిలోని "వియోగరాగము. ప్రబోధము" ఇవన్నీ యీదోషానికి ఉదాహరణలే అయివున్నవి. యెంకిపాటలవంటి వాటిలో కొన్నిటిలో తప్ప తక్కిన యీకాలపుకృతుల్లో అనేకాల్లో యీదోషం కనబడుతున్నది.

అని శ్రీ... ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో విస్తారాధికరణం సమాప్తం.

శ్రీ ర స్తు.

వాఙ్మయ పరిశిష్టభాష్యం.

వికారాధికరణం

వికారాలు

దయా, సత్య, విజ్ఞాన, ప్రభృతిగుణాలచేత తేజస్వి అయిన మనిషికి వేషాదులు అప్రధానమై అప్రధానంగా తేజస్సుగోచరిస్తుంటుంది. అది లేనప్పుడు వేషం సవరించడం జుట్టుదిద్దడం, ఇట్లాటివి ప్రధానమౌతవి. ఇట్లాటివికారాలు ఈకాలపుకవిత్వంలో తరుచుగాకనబడుతున్నవి.

నాలుగుపాదాలు ముగించి ఆఖరున రెండుమాటలు తగిలిస్తారు. కొందరు దరువులు పట్టిస్తారు కొందరు కృష్ణపక్ష కర్త మూడుపాదాలు వ్రాసి నాలుగోపాదంలో రెండుమాటలు వ్రాసి చాలిస్తాడు.

"మొగముగంటి గనులుగంటి, మొగిలుగంటి పాటవినుచుంటి"
"అదయతను ద్రుంచినారే
                 పెంధూళిఁ
 జిదిమి వెదజల్లినారే
 మొదలంట దూర్చినారే
                భయదాగ్ని
 కీలలను వ్రేల్చినారే"

అని పాదాల్లో యిమడని మాటలను రెండుపాదాల మధ్యన వేసి దరువు కొట్టుతున్నాడు.

"గళఘోరగంభీర ఫెళఫెళార్బటులలో
                               మెరపేలా?
 నిబిడ హేమంతరాత్రీకుంతలములలో
                               చుక్కేలా?"

అని నాలుగుపాదాల్లో యిమడని వాటిని అంతాన వేస్తున్నాడు.

"నీ
కనుఱెప్ప కొనలనొక
చినుకైన కదలనీ
నీ
పెదవిచివురులనొక నిడుదయూర్పువిసరనీ"

అని పాదాల నెత్తిమీద ఒంటిగా "నీ" లను నిల్చుతున్నాడు. ఒక్కొక పేజీలో నాలుగు పంక్తులే అచ్చువేసి తక్కినకాగితమంతా ఖాలీచేస్తున్నాడు. కొన్ని పద్యాల నెత్తిమీద చుక్కబెట్టుతున్నాడు. ఒక వేళ యీసవరణలన్నీ సొగసుకూర్చేవని ఒప్పుకొన్నా అసలుకావ్యం వికృతమైనప్పుడు.

"వపుష్యలలితే స్త్రీణాం
 హారో బారాయతే పరం" (ఆగ్నేయ)

అన్నట్లు వికారాలుగానే పరిణమించడం సహృదయులకు విదితం అసలు తేజస్వికి ఈ వేషవికారాలు అనావశ్యకం. ఈదరువులు విరుపులు తాళాలు వికారాలే అవుతున్నవని క్రమంగా స్పష్టపరుస్తాను గనుక ఈచర్చ యింతటితో వదలుతున్నాను.

అని శ్రీ ... ఉమాకాన్త విద్యాశేఖర కృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో వికారాధికరణం సమాప్తం.

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

నామాధికరణం.

పేర్లు.

పుల్లయ్య, రామయ్య, సీతయ్య అనే మనుషులపేర్లు యదృచ్చాసంజ్ఞలు పుల్లయ్యలో పుల్లలేదు రామయ్యలో దాశరథిత్వం లేదు. సీతమ్మకు జానకీత్వం లేదు. కాని కావ్యనామాలు వస్తుధర్మాన్ని అనుసరించి యేర్పడుతున్నవి. రామకథ రామాయణం భరతవంశస్థులకథ భారతం రఘువంశాన్ని అధికరించి రచించినది. రఘువంశం ఈతీరున కావ్యనామాలు వస్తు ద్యోతకంగా వుండడం వుచితం కాని యిప్పుడు జడకుచ్చులని, సంధ్యారాగమని సెలయేటిగానమని తమకు ప్రియమైన పేర్లన్నీ కావ్యాలకు పెట్టుతున్నారు. అది అప్రశస్తం.

పూర్వపక్షం

యదృచ్ఛానామాలు మనుషులకే పెట్టవలె నని నియమమేమిటి? పుస్తకాల కెందుకు పెట్టగూడదు?

యెవరికింపైనపేర్లు వారు కవిజనమనోభిరామమని జడకుచ్చులని అవి అని ఇవి అని పెట్టుకొంటారు అని వాదిస్తారా?

సమాధానం

చెప్పుతున్నాను మనుష్యసంజ్ఞలు కేవలవ్యవహారం కొరకు. కావ్యసంజ్ఞలు కావ్యవస్తుగ్రహణంకొరకు మనిషి తనయింటికి తనకుటుంబానికి హక్కుదారుడై వాటికి బద్ధుడై వుంటాడు. మహాపురుషులెవరైనా యింటిని దాటి లోకానికి దృష్టి మరల్చవచ్చును. అప్పుడు వారికి పరమహంసలని లోకమాన్యులని గుణవాచకాలు అనేకుల విషయంలో ప్రయుక్తమవుతునేవున్నవి కావ్యం ఒకమనిషికిగాని ఒక కుటుంబానికిగాని వుద్దేశించిందిగాదు. అది లోకానికి ఉద్దిష్టం కాకుంటే దాన్ని లోకంలో వ్యాపించజేసేయత్నమే అనావశ్యకం. దాన్ని లోకానికి వుద్దేశించినప్పుడు దాంట్లో యేమున్నదీ లోకానికి తెలపవలసిన బాధ్యత కర్తకువున్నది. కందులను తన యింట్లో తాను రత్నాలనుకొన్నా కందిపప్పును వరహాలనుకొన్నా బాధలేదు. బయటికి వచ్చి మూట బుజానవేసుకొని రత్నాలో అని అరిస్తే చూపమన్నప్పుడు కందులుచూపి నాలిక వెళ్లబెట్టవలసివస్తుంది. నిజంగా కందులు కావలసిన వాండ్లు అవి రత్నాలనుకొని అతణ్ని పిలిచి కొనకుండానే పోవచ్చును. కావ్యకర్త తన యింటిలో తన కావ్యాలను జడ అని ముడి అని చుట్ట అని కొప్పు అని జడకుచ్చు అని కుచ మని కపోల మని బనారసు చీర అని ముఖమల్లు రవికె అని తనకు ప్రియమైన పేర్లు పెట్టుకొని బులుపుతీర్చుకోవచ్చును గాని లోకానికి వుద్దేశించినప్పుడు ఈవికారపు పనిచేసెనా లోకవంచనా, ఆత్మవంచనా అతని పైన బడుతున్నవి.

న్యాయకుసుమాంజలి, ముక్తావళి, సిద్ధాంతకౌముది ఖండనఖండభాద్యం అనేవి ఆశాస్త్రాలకాఠిన్యాన్ని మృదువుపరచడానికి చేర్చినమాటలు గనుక వీటికి అన్వయించవు. కవిత్వ మసలె మృదువైనది. మనోహరమైనది. దానికి మృదుత్వమనోహరత్వాలు పులిమితే శబ్దవాచ్యత అవుతుంది శబ్దవాచ్యతను ముందు వివరిస్తాను.

ఆక్షేపం

అవునుగాని జడకుచ్చులవంటివి కేవల సంజ్ఞలుగావు. జడకుచ్చులవలె యింపైన పద్యగుచ్చా లిందులో వున్నవని భావం కనుక ఇది లోకమాన్య మహాత్మ అన్నట్లు గుణవాచకం గుణవాచకాలుచితమే గదా అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను: జడకుచ్చులవలె ఇంపైనవి అని ఆయింపు యితరులు చూచి అనవలసిందిగాని తానే చెప్పుకోవలసిందిగాదు. కాకిబిడ్డ కాక్కి ముద్దు అన్నట్లు యెవరిది వారికి యింపుగానే వుండవచ్చును ఇతరుల కది దొషభూయిష్టంగా కనబడవచ్చును. రఘువంశమన్నప్పుడు దాంట్లో రఘువంశకథ లేదని యెవరూ అన లేరుగదా. కనుకనే అనిశ్చితమైన ఒకగుణాన్ని స్వయంగానే తన కవ్యానికి ఆరోపించుకొని వివాదానికి అవకాశమిచ్చే సెలయేటిగానం, జడకుచ్చులు. అనే యిట్లాటిపేర్లు కావ్యాలకు పెట్టడం అత్యంతం నింధ్య మంటున్నాను. అదిగాక యీపేర్లు యేకావ్యానికి పెట్టరాదు? పెంట మాటలువ్రాసి దాన్ని జడకుచ్చు లనవచ్చును. అదేమంటే నాది నాకు బాగున్నవనవచ్చును ఇవన్నీ అవివేకపు పనులని వెనకటివైనా యిప్పటివైనా యిట్లా జడకుచ్చులు, సెలయేటిగానము అనే మాదిరిపేర్లు అప్రశస్తమని అంటున్నాను.

"శిశుక్రంద యమసభ ద్వంద్వేంద్ర జననాదిభ్యశ్ఛః"

అని పాణిని చెప్పినట్లు శిశుక్రందీయం, యమసభీయం కిరాతార్జునీయం ఇంద్రజననీయం, విరుద్ధభోజనీయం మొదలైనవీ. రఘువంశం కుమారసంభవం మొదలైనవి, పేర్లు కావ్యవస్తువును సూచించేవి మన వాఙ్మయంలో ప్రతిష్ఠితమై వున్నవి.

ఇంత ఆలోచించియే, భారతీయసాహిత్య వేత్తలు--

"కవేర్వృత్తస్య వా నామ్నా నాయకస్యేతరస్య నా" (సాహిత్య) (కవిపేరునుగాని, వృత్తంపేరునుగాని, నాయకుడి పేరును గాని, తత్సంబంధి అయిన ఇతరుడి పేరునుగానిబట్టి కావ్యానికి నామం కల్పించవలెను) అని ఆదేశిస్తున్నారు. పేర్లను క్లప్తంచేయవచ్చును.

స్వారోచిషమనుసంభవం అనడానికి మనుచరిత్ర అనవచ్చును

"సత్యభామా భామా, దేవదత్తో దత్త:" (మహా)

అని మహాభాష్యంలో పతంజలి వ్రాస్తున్నాడు. పేర్లనుగురించి వివేకం కోల్పోయి లోకాన్ని వంచించే జడకుచ్చులు మొదలైన అనుచితపు పేర్లు ఈ కాలపు కృతులకు తరుచుగా కనబడుతున్నవి.

అని శ్రీ ... ఉమాకాన్త విద్యాశేఖర కృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో నామాధికరణం సమాప్తం.

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

ఊగుడుమాటల అధికరణం.

ఊగుడుమాటలు

"కవి నొక విధమగు నుద్రేక మూగింపవలెను. ఒకయావేశ మావహింపవలెను వలవలనేడ్చును. పకపకనవ్వును పిచ్చి కేకలిడును పాడును నృత్యము చేయును." (యేకాంతసేవపీఠిక-దే.కృష్ణశాస్త్రి)

ఇట్లా వూగవలె నని యిది యిమోవ నని (Emotion) ఆవేశపడవలె నని పిచ్చి కేకలు వేస్తాడని ఊహలు ఈకాలపు కృతికర్తల్లో వ్యాపించివున్నది.

"ఆకులో నాకునై పూవులోఁ బూవునై
 కొమ్మలో గొమ్మనై నునులేత రెమ్మనై
 ఈయడవి దాగిపోనా యెట్లైన నిచటనే యాగిపోనా
 పగడాల చిగురాకు తెరచాటు తేటనై
 పరువంపువిరిచేడె చిన్నారి సిగ్గునై
 ఈయడవిదాగిపోనా యెట్లైన నిచటనేయాగిపోనా". (కృష్ణపక్షం)

అని వెర్రిపాటలోవున్న మాటలు యీ వూగుడుపిచ్చిమాటలే అయివున్నవి దయ్యంబట్టితే అంకాళమ్మ పోలేరమ్మ ఆవేశిస్తే వూగుతారు. దూపదీపనైవేద్యాలతో వేపాకుమండలదెబ్బలతో ఊగుడు ఉపశమిస్తుంది. కాని కవులువూగరు. పిచ్చికేకలు వేయరు. భావం ఆవరించినపుడు దానికి మొదట కవి వశుడయ్యేమాట సత్యం.

"క్రౌంచద్వంద్వవియోగోత్ధః శోకః శ్లోకత్వమాగతః" (ధ్వన్యా)

(క్రౌంచమిధునవియోగంవల్ల పుట్టినశోకం శ్లోకమైనది) అనేమాటలు వాల్మీకి ఆశోకానికి యెంత వశుడైనదీ తెలుపుతున్నవి. అయితే కావ్యరచనయందు ఆభావాన్ని తానే వశంచేసుకొని సృష్టి ఆరంభిస్తున్నాడు.

"ఉపస్పృశ్యోదకం సమ్యఙ్ముని స్థిత్వా కృతాంజలిః
 ప్రాచీనాగ్రేషు దర్బేమ ధర్మేణాన్వేపతే గతిం.

 తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః
 పురా యత్ తత్ర నిర్వృత్తం పాణానామలకం యధా

 తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ న మహాద్యుతిః
 అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః". (రామా)

 పుణ్యే హిమవతః పాదే మేధ్యే గిరిగుహాలయే
 విశోధ్య దేహం ధర్మాత్మా దర్బసంస్తరమాశ్రితః

 శుచిః ననియమో వ్యాసః శాంతాత్మా తపసి స్థితః
 జారతస్యేతిహాసస్య ధర్మేణాన్వీక్ష్యతాం గతిం
 ప్రవిశ్య యోగం జ్జానేన సోపశ్యత్ సర్వమాన్తతః. (మహాభా)

అవే పంఙ్త్కులు వాల్మీకి యొక్క వ్యాసుడియొక్క ఆత్మవశత్వాన్ని స్థితప్రజ్ఞత్వాన్ని ధర్మతేజస్కత్వాన్ని విదితం చేస్తున్నవి. సర్వభావాలకు మొదట వశుడై సర్వభావాలను పిమ్మట వశంచేసుకొని భావోద్వేగానికి (Emotion)తాను మొదట వశుడై పిమ్మట భావోద్వేగాన్ని తనవశంచేసుకొని సర్గానికి ఉన్ముఖుడయ్యే జగన్నిర్మాతవలె అమోఘువివేకంతో కావ్యసృష్టికి ప్రవృత్తుడవుతున్నాడు. కనుకనే

"అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః" (ధ్యన్యా)
(అపారమైన ఈ కావ్యసంపారంలో కవియే ప్రజాపతి)
"ననరసరుచిరాం నిర్మితి మాదధతీ కవేర్భారతీ జయతి (కావ్య)
(నవరససుందరమైన నిర్మితిని చేస్తున్న కవివాక్కు సర్వోత్కృష్టంగా వర్తిల్లుతున్నది.)
"నానృషిః కురుతే కావ్యమ్"
(ఋషికానివాడు కావ్యం రచించడు)

అని కవి కీర్తితుడగుచున్నాడు. అంతేగాని కవులు పిచ్చికేకలు వేసి వూగరు. కవులు ఆయాసందర్బాల్లో యిష్టపాత్రలతో సమానుభవం పొందుతారు కాని ఊగరు. వాల్మీకికి రావణుడితో సమానానుభవం వుండదు అతడు ఇష్టపాత్రలైన రామాదులతో సమానుభవం పొంది నట్లు గోచరిస్తుంది దీన్నే

"నాయకస్య కవేః శ్రోతుః
 సమానానుభవస్తతః" (ధ్య .లో)

అని భట్టతోతుడు అన్నట్లు ద్వన్యాలోకవ్యాఖ్యానంలో అభినవగుప్త పాదులు ఉదాహరిస్తారు. మేఘదూతలో యక్షుడితో కవికి సమానుభవంవున్నా

"కామార్తా పిః ప్రకృతికృపణాశ్చేతనాచేతనేఘ" (మేఘ)

అని స్వవశత్వాన్ని విదితంచేస్తాడు. భవభూతి భావసాంద్రత కెంత వశుడైనా

"నమోవాకం ప్రశాస్మహే" (ఉత్తర)
అని ఆదికవులకు నమస్కరించి
"ఏకో రసః కరుణ ఏవ" (ఉత్తర)
అని అమోఘవివేకంతో వినిపిస్తాడు.

ఆక్షేపం

అవునయ్యా "బాలోన్మత్తపిశాచవత్" అని పెద్దలు చెప్పుతున్నారు. జ్ఞాని బాలుడివలె వెర్రివాడివలె, పిశాచంవలె వుంటాడు. కవులు జ్ఞానులు వెర్రివాండ్లవలె ఊగి మట్లాడడం ఉచితమేగదా కనుక కృష్ణపక్షంలో వున్న

"పాడమన్నది చిన్నబాలుదు పాడవిన్నది గాలిమబ్బులు
 పాడినది ఒకమేకపై ఆ వెర్రిపాటకు డెవ్వడో"

అనే వెర్రిపాట మంచిదేను అని వాదిస్తారా

సమాధానం

వివరిస్తాను, "బాలోన్మత్తపిశాచవత్" అనేది కవికిగూడా వర్తింస్తుంది అనివొప్పుకొనే విచారిస్తాను. "బాలోన్మత్తపిశాచవత్" అనేది జ్ఞానికి బాహ్యలక్షణంగాని బాలుడివలె చనుబాలుగుడుస్తాడని వెర్రివాడివలె రాళ్లు రువుతాడని దయ్యంవలె యితరులను పడతాడని అభిప్రాయంగాదు. అసలింతకూ "బాలోన్మత్తపిశాచవత్" అనేది విరక్తుడైన వేదాంతిలక్షణం. అతడికి లోకంతో పనిలేదు.

"నిస్త్రెగుణ్యే పథి విచరతాం కో విధిః కో నిషేధః:"

అన్నట్లు అతడిప్రవృత్తి లోకాతీతంగా వుంటున్నది కాని కవి, లోకంతో అత్యంతం సంబద్దుడై లోకానికి తనకావ్యాన్ని ఉద్దేశించి లోకసంబంది విభావాదులను అలంబనందేసి గసభావాలను ఉన్మీలనం జేస్తున్నాడు. ఇతడు "బాలోన్మత్తపిశాచవత్" అనే లక్షణంగల జ్ఞానికోటిలో చేరెనా

"ఆత్మానం చేత్ విజానీయాదయమస్మితి పూరుషః
 కిమిచ్చన్ కన్యకామాయ శరీరమనుసంజ్వరేత్" (శ్రు)

అని కావ్యాన్నే వదులుతున్నాడు కాదు కూడదు పిచ్చికేకలు వేస్తాడంటారా వెర్రివాడివలె కేకలువేసి పిచ్చిమాటలు ఒక వేళ మాట్లాడి, కావ్యంలో వ్రాసినా అవి పిచ్చిమాటలే గనుక వాటితో లోకానికి పనిలేదు.

ఆపిచ్చిమాట లతనికే లోకం వదలుతున్నది.
"నావృషిః కురుతేకావ్యమీ"
"అపారే కావ్యనంసారే కవిరేవ ప్రజాపతి॥"

అని అఖండవివేకశాలిగా కీర్తితులవుతున్న కవులకు సమస్కరిస్తూ యీపిచ్చిమాటలను గురించిన ప్రస్తావన ముగిస్తాను. ఇక "శిశువదనంలో కవిత్వమున్నది. సతీవదనంలో కవిత్వమున్నది" అని అంటే కవిత్వప్రేరకమైన అంశమున్నదని అభిప్రాయంగాని అవేకావ్యమని అర్ధంకాదు. ఆభారతీయ వర్షాల్లో ఊగి వెర్రిమాటలు మాట్లాడితే మాట్లాడుతారేమోగాని కవితాప్రస్థానం మహావికాసంపొంది సర్వోచ్చదశనొందిన భారతవర్షంలో కవిపరమోన్నత మైనపదం అధిష్టించి వున్నాడు. ఊగడం, కేకలు వేయడం ఆవేశమని కవి అట్లా ఆవేశపడి వూగుతాడని పిచ్చి కేకలు వేస్తాడని యీకాలంలో వ్యాపించివున్న అభిప్రాయం అజ్ఞానజన్యమని చెప్పి యీచర్చ చాలిస్తున్నాను.

అని శ్రీ. ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర పరిశిష్టంలో

ఊగుడుమాటల అధికరణం సమాప్తం.

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

నిదర్శనాధికరణం

నిదర్శనపరంపరలు.

విస్తరదోషంలో నిదర్శనపరంపర యిమిడివున్నా దీన్ని ప్రత్యేకించి తెలపవలసినంత హెచ్చుగా ఈ కాలపుకృతుల్లో వ్యాపించివున్నది.

ఈ దోషాన్ని వివరిస్తాను; ఒకసంగతిని స్ఫుటపరచడానికి నిదర్శనం చలా తోడ్పడుతుంది.

"క్వ సూర్య ప్రభవో వంశః క్వచాల్పవిషయా మతిః"
"తితీర్షుర్దుస్తరం మోహా దుడుపేనాస్మి సాగరం" (రఘు)
సూర్యప్రభవమైన ఆ రఘువంశ మెక్కడ?
అల్పవిషయమైన నామతియెక్కడ?
దుస్తరసముద్రాన్ని పుట్టితో దాటనెంచాను

అని అన్నప్పుడు కాళిదాసు చేయదలచినకార్యంయొక్క దుష్కరత్వం యెంతో హృదయంగమంగా వ్యక్తమవుతున్నది. ఇక పైననిదర్శనాలు చెప్పడం అధిక ప్రసంగమే అవుతున్నది.

భావం హృదయంగమంగాస్ఫుటపడ్డతరవాత దాన్ని యింకా చెప్పడం విసుగును రోతను పుట్టిస్తుంది. ఒకవస్తువును వెడల్పుగా పరచి సాగగొట్టిన కొద్దీదానికి బలంతగ్గి పలచబడిపోతుంది. భావాన్ని వ్యక్తదశకు తెచ్చి వదలితే అఖండబలంతో హృదయాన్ని అధిష్ఠిస్తుంది. లేదా కొట్టికొట్టి వదలితే పలచబడి నీరసిస్తుంది. అందుకే నిదర్శనపరంపర దోషమని హేయమని చెప్పుతున్నాను. హేయం గనకనే కళాదాసాదులు ఉత్తమమార్గమవలంబించి భావవ్యక్తిచేస్తూ కావ్యసౌందర్యాన్ని మనకు ప్రసాదించారు. "దుస్తరసాగరాన్ని అజ్ఞానంచేత పుట్టితో దాటదలచాను" అని భావం వ్యక్తంచేశాడు కాని కొట్టికొట్టి

"హిమవత్పర్వతాన్ని చిన్ననిచ్చెనతో యెక్కదలచాను
 అఖండవాయుగోళాన్ని అరచేతితో పట్టదలచాను
 సముద్రసికతాకణాలనుసాంతం లెక్కించదలచాను"

అని యీతీరున ఉడుకుసోదిలోకి దిగలేదు.

"అపూర్వకర్మచండాల మయి ముగ్ధే విముంచ మాం
 శ్రితాసి చందనభ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం". (ఉత్తర)

(ఓప్రియురాలైనముగ్దా! అపూర్వకర్మ చండాలుణ్నీ నన్ను వదలు చందనవృక్షమనుకొని దుర్విపాకమైన విషవృక్షాన్ని ఆశ్రయించావు). అని భవభూతి శ్రీరాముడిచేత అనిపిస్తాడు. అంతేగాని సాగదీసి

"మణి అనుకొని మహోగ్రాగ్నినిచేపట్టినావు"
 

అని క్రూరసర్పాన్ని మెడవేసుకున్నావు"


అని వదరించడు

అసత్కావ్యమని అహోబలపండితుడన్న ముద్రారాక్షసంలొ సయితం కోపసంరంభసమయంలో కూడా

"ఆస్వాదితద్విరదశోణితశోణశోభాం
 సంధ్యారుణామివ కలాం శశలాంఛనస్య
 జృంభావిదారితముఖస్య ముఖాత్ స్ఫురంతీం
 కో హర్తు మిచ్ఛతి హరేః పరిభూయ దంష్ట్రాం" (ముద్రా)

(యేనుగునెత్తురు ఆస్వాదించి చంద్రుడి సంధ్యారుణకాంతివలె యెర్రగావున్న సింహపుకోరను ఆవలిస్తే బయటికి ప్రకాశిస్తున్న దాన్ని ఆసింహపునోటినుండి యెవడు పరాభవించి పెరకగోరుతున్నాడు) అని ఒక్క నిదర్శనంతోనే రాక్షససాహసికత్వాన్ని నిరూపిస్తాడు.

"నందకులకాలభుజగీం
 కోపానలబహుళనీల ధూమలతాం
 అద్యాపి బధ్యమానాం
 వధ్యః కో నామ నేచ్ఛతి శిఖాంమే" (ముద్రా)

(కోపానలబహుళనీలధూమలత నందకులానికి నల్లతాచు అయి యిప్పటికీ కట్టబడుతున్న నాశిఖను వధ్యుడెవడు ఇచ్చగించడు) అని మలయ కేతునిగ్రహాన్ని సూచించి దాన్ని యింకొక్కనిదర్శనంతో

"ఉల్లంఘయన్మమ సముజ్జ్వలతః ప్రతాపం
 కోపస్య నందకులకాననధూమకేతోః
 సద్యః పరాత్మపరిమాణవివేకమూఢః
 కః శాలభేన విధినా లభతాం వినాశం" (ముద్రా)

(నందకులకానన ధూమ కేతువయిన నాప్రజ్వలించే కోపప్రతాపాన్ని ఉల్లంఘిచి యెవడు పరబలమెరుగని మూఢుడు మిడతవలె వినాశం పొందుతాడు) అని ఉపోద్బలంచేస్తాడు.

దుఃఖం అతిశయించి కొంత అధికాలాపం ఆరంభమయ్యే ఘట్టంలో కాళిదాసు రతిచేత భర్తతోగూడా భార్యపోవాలె ననేఅభిప్రాయానికి

"శశినా సహ యాతికౌముదీ సహమే ఘేన తటిత్ ప్రలీయతే." (కుమా)

(చంద్రుడితో వెన్నెలపోతుంది. మేఘంతో మెరుపులీన మవుతుంది) అని రెండునిదర్శనాలకంటె యెక్కువచెప్పించడు. ఇట్లా చెప్పినా "పునఃపునర్దీప్తి" అనేదోషం రతివిలాసానికి సంక్రమించిందని మమ్మటుడన్నాడు. అది వేరేవిషయం.

కాళిదాసు సాధారణంగా ఒకటి, రెండు, లేదా మూడు నిదర్శనాలను చెప్పుతాడు. నిదర్శనబాహుళ్యం అరుదు యెక్కడనైనా యిప్పటివలె నిదర్శనపరంపరలు అధికంగావుంటే అవి దోషమేగాని గుణంగాదు.

నిదర్శనపరంపరలు మామాలుప్రజలకు వుడుకెక్కించే సభల్లో అవసరమైతే కావచ్చునుగాని పరిణతబుద్దులకు ఉద్దిష్టమైన కావ్యాల్లో విసుగూ రోతా పుట్టిస్తవి శ్లేషలకు వాక్యాల ఉన్మగ్ననిమగ్నతలకు యత్నిస్తూ సర్వార్ధాలను గార్లించ ఉద్యుక్తమైన కాదంబరిలోని నిదర్శనపరంపరలు ప్రత్యేకించి విమర్శించదగ్గవి గనుక వాటివిచారణ యిక్కడ వదులుతున్నాను. శాస్త్రాల్లో విషయం స్ఫుటపరచడానికి ఆవశ్యకత వస్తుంది. వాక్యపదీయకారుడు ద్వితీయకాండంలో

"ప్రమాణత్వేన తాం లోకః సర్వః సమనువశ్యతి,
 సమారంభాః ప్రతీయన్తేతిరశ్చామపి తద్వశాత్." (వాక్య)

(ఆప్రతిభయే ప్రమాణంగా లోకం చూస్తున్నది. ఆప్రతిభావశోననే తిర్యక్కులకుగూడా ప్రవృత్తిప్రతీతమవుతున్నది.} అని ప్రతిభను ప్రతిపాదించి

"స్వరప్రవృత్తిం వికురుతే,
 మధౌ పుంస్కోకిలస్యకః" (వాక్య)

(మధుమాసంలో కోకిలకు పంచమస్వరవిరావం యెవడు కలిగిస్తున్నాడు? ప్రతిభయే.)

అని నిదర్శనం చెప్పుతాడు. కాని శాస్త్రం గనుక .యింకాస్ఫుట పడడానికి,

"జంత్వాదయః కులాయాదికరణే కేన శిక్షితాః,
 ఆహార ప్రీత్యభిద్వేష ప్లవనాదిక్రియాసు కః.
 జాత్యన్వయప్రసిద్దాసు ప్రయోక్తా మృగపక్షిణాం." (వాక్య)

(సాలీడు మొదలైనవాటికి గూళ్లు నిర్మించడం యెవరునేర్పినారు? ఆహారం, ప్రీతి, ద్వేషం, యీదడం మొదలయిన జాత్యన్వయ ప్రసిద్దక్రియలలో మృగపక్షులను యెవడు నడిపేవాడు) అని నిరూపిస్తాడు. అనాది ప్రతిభావశంవల్ల ఈక్రియలు ప్రేరితమై ప్రతీతమవుతున్న వని వీటికి జన్మాంతరంలో శబ్దశ్రవణం బోధహేతువని శ్రుతాశ్రుతశబ్దాలే సర్వప్రవృత్తికి హేతువని యిట్లా శబ్దంవల్ల కలిగే యితికర్తవ్య తారూపమైనదే. వాక్యార్థ మని అదే భగవతి ప్రతిభ అని ఆపంక్తుల అభిప్రాయం. శాస్త్రం గనుక మూడునిదర్శనాలు చెప్పి అభిప్రాయం స్ఫుటపరచాడు. ఇట్లానే సర్వం స్వభావంచేతనే ప్రవృత్తమవుతున్నది గాని వేరే నియంత లేడనే చార్వాకసిద్ధాంతం మాధవాచార్యులవారు సర్వదర్శనసంగ్రహంలో ప్రతిపాదిస్తూ ఉదాహరించిన అభియుక్తోక్తి, అభిప్రాయం స్ఫుట పరచడానికి,

"అగ్నిరుష్ణో జలం శీతం శీతస్పర్శ స్తథానిలః,
 కేనేదం చిత్రితం తస్మాత్ స్వభావాత్ తద్ వ్యవస్థితిః" (సర్వ)

(అగ్ని, వుష్ణం. జలం, శీతం, గాలి. శీతస్పర్శం యిదంతా యెవరు చిత్రించారు? స్వభావంవల్లనే యిదంతా యేర్పడుచున్నది). అని నిదర్శనాలను చెప్పుతున్నది. ఇవి శాస్త్రసందర్భాలు. అక్కడ సయితం మితత్వాన్ని అతిక్రమించలేదు. పరిణతబుద్దులకు భావాన్ని అందిస్తూ రసాస్వాదం కలిగించవలసిన కావ్యంలో కాళిదాసాదులు ఔచిత్యం పరిపాలించి నిదర్శనపరంపరలు లేకుండా కావ్యసౌందర్యాన్ని కాపాడినారు. కాని యీకాలపుకృతికర్తలకు యీవివేకం నశించింది. నిదర్శనం మొదలు పెట్టితే వుడుకుబోతువుపన్యాసంలోకి దింపి విసుగూ రోతా పుట్టిస్తున్నారు.

దుఃఖంలో ఆశ. దాన్ని నిరూపించడానికి కృష్ణపక్షకర్త

"కన్నీటికెరటాల వెన్నెలేలా?
 నిట్టూర్పుగాడ్పులో నెత్తావియేలా ?"

అని అన్నాడు. ఇంతటితో వూరుకోలేదు.

"ప్రళయకాలమహోగ్ర భయదజీమూతోరు
 గళఘోరగంభీర ఫెళ ఫెళార్భటులలో మెర పేలా"

అని ఉడుకెక్కించాడు. ఇంకో ఊరుకోలేదు.

"అశనిపాతమ్ములో నంబువేలా?"

అన్నాడు. ఇంకా ఊరుకోలేదు.

"హాలాహలమ్ములో నమృతమేలా"
 
అని ఇంతటితో చాలించలేదు.

"ప్రబలనీరంధ్రాభ్ర జనితగాడధ్వాంత,
నిబిడ హేమంత రాత్రీ కుంతలములలో చుక్కేలా"

అని అన్నాడు. ఇంతటితో విరమించలేదు.

"శిథిలశిశిరమ్ములో జివురేలా?"
 
అన్నాడు. కాని ఊరుకోలేదు.

"పాషాణపాళిపై బ్రసవమేలా?"
 
అని అన్నాడు. ఇంకా వదలలేదు.

"వికృతక్రూరక్షుధాక్షుభితమృత్యుకఠోర
 వికటపాండురశుష్క వదనదంష్ట్రాగ్నిలో నవ్వేలా"

అని అన్నాడు. ఇప్పటికైనా విడిస్తే చాలు నని అనుకొన్నాను గాని ఆయన అట్లా విడువదలచలేదు.

"కన్నీటికెరటాల వెన్నెలేలా?
 నిట్టూర్పుగాడ్పులో నెత్తావియేలా"

అని వదలినాడు. ఈతీరుగా నీదర్శన పరంపరలు నిండినవి.

"ఆకులో నాకునై పూవులో పూవునై
 కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
          ఈయడవి దాగిపోనా?"

అని చెప్పి ఇట్లా అయిదుసార్లు 'అడవిలో దాగిపోనా' అని 'ఆకునై కొమ్మనై, పూవునై, రెమ్మనై,' అని యింకా యేమేమో అని ఊరుకుంటాడు.

ఈకాలపుపద్యాలకు ఈదోషం హెచ్చుగా కనబడుతున్నది.

ఆంధ్రహెరాల్డులో, బసవరాజు అప్పారావుగారు

"ఆమబ్బు యీమబ్బు ఆకాశమధ్యాన
 అద్దు కున్నట్లు మనమైక్యమౌదామే".

అని ప్రియురాలిని ఉద్దేశించిన మాటలను అంటారు. ఆమాట అని ఈకృతికర్త అంతటితో వూరుకోడు.

"ఆతీగె యీతీగె, ఆవాగు యీవాగు, అమాట యీమాట" అని మొత్తం నాలుగునిదర్శనాలు వేసి పూర్తి చేస్తాడు.

తీగె తీగెకలిసినా వాగువారు కలసినా అంతగా భావభేదంలేని యీనిదర్శనపరంపరలు నిరర్థక మంటున్నాను. సాహితిలో ఒకరు

"సంతత మడంగి యున్నె? నిసర్గగుణము
 ఎంత ప్రతికూల వృత్తిలో నిరికియున్న
 ఎంత యుత్సాహ జలధార లింకుచున్న
 హృదయ మందున కవితాంశదృఢతనుండ
 ఉండునే యది యుప్పొంగ కుండనెపుడు"

అని తన దుర్నివారకవిత్వాన్ని ప్రతిపాదిస్తాడు. దీనికి

"తరణి కిరణంబు లపుడప్డు తప్తుజేయ
 కాలమేఘాళి సారెకు గప్పుచుండ
 కృష్ణపక్షము లెపుడు కృశింపజేయ
 విమల కమనీయ కౌముదీ హిమకరుండు
 శారద నీశీధినుల వేదజల్లకున్నె"

అని అయిదుపంక్తుల్లో ఆకృతికర్త ఒకనిదర్శనం చెప్పుతాడు. ఇది ప్రకృతిశాస్త్ర ప్రథమపాఠం ఫక్కిగాని కావ్యఫక్కిగాదు. అయినా యింతటితో వూరుకోడు.

"గండశైలము లెన్నొ మార్గమునబడిన
 ఉరునికుంజంబులెన్నొ క్రిక్కిరిసియున్న.
 తీక్ష్ణ కిరణము లెంతబాధించుచున్న
 ఝరమతిరయంబుతోడ వర్షాగమమున
 ఇరుకెలంకులు తెగ బ్రవహింపకున్నె".

అని నిదర్శనాన్ని సాగదీస్తాడు. ఇంకా వూరుకోడు.

"అనిల మామోదమును సతం బాహరింప
 మార్దవము నాతవము రూపుమాపుచుండ
 భృంగములు మకరందము బీల్చుచుండ
 కోమలంబుగ విచ్చి పరీమళంబు
 కుసుమము వసంత వేళనువిసరకున్నె"

అని తిప్పితిప్పి చెప్పుతాడు. ఇంకా వదలడు.

"ప్రేమతో గన్నతల్లి తన్వీడి చనిన
 విరసకంఠాల నడుమను బెరగుచున్న
 అరిభయంబుస నాకుల నడగియున్న
 తరుణ మరుదెంచు చోగలస్వరముతోడ
 ప్రమదభరమున కోకిల పాడకున్నె "

అని వూరుకుంటాడు.

ఈ కవికి వున్న యింతదుర్నివారకవిత్వం ఆంధ్రదేశానికి లభించిందేమో నని యెక్కడనైనా వున్నదేమో నని వెదుకుతున్నాను. శబ్దార్థాలను భావాన్ని అందించేమట్టుకు స్వీకరిస్తూ ఆనందఫలకమైన ధర్మాధర్మ ప్రవృత్తి నివృత్తులను రసాస్వాదప్రదానపూర్వకంగా శ్రోతలకు ప్రసాదించే పరమార్థానికి ఉన్ముఖమై వుండవలిసిన కావ్యం జాబితాలను, తయారుచేస్తున్నప్పటి పతితదశ వాస్తవంగా సంతాపకరమైనది.

ఆక్షేపం.

అవునయ్యా. ఇప్పటిది భావకవిత్వమని అది కొత్తదని మేమన్నాము. దాన్ని మీరు కాదనలేదు. భావకావ్యమంటనే యేకభావాన్ని ప్రతిపాదించేది. ఒకటేభావాన్ని అనేకభంగుల ప్రతిపాదించారు. దీంట్లో దోషమేమిటి? అని అంటారా.

సమాధానం.

చెప్పుతున్నా ను, భావకావ్యాన్ని ముందు విచారిస్తాను. ప్రేమ, భక్తి, వంటి చిరావస్థానంగల మనోవృత్తి భావం. ఇదే కావ్యానికి విషయం. నిద్రపోతున్నాను: అన్నందిన్నాను; అనే ఒక వాక్యార్థంకాదు భావం. అదేభావమని వొప్పుకున్నా ఆభావంవల్ల కలిగేచేష్టలు వివిధసందర్భాల్లో వేడలేసంభాషణలు, తత్సంబంధి మనో వ్యాపారాలు, ఇవన్నీ ప్రతిపాదించడం భావ ప్రతిపాదనంగాని ఒకటే అభిప్రాయానికి తిప్పితిప్పి పది పన్నెండు ఉదాహరణా లియ్యడం గాదు. ఇట్లా ఉదాహరణాలు అయిదారో పది పన్నెండో కలిస్తే ఆది వోక కావ్యమనే అభిప్రాయం గూడా ఈరోజుల్లో వ్యాపించింది.

చాటుపద్యాలు.

వ్యాకరణం మొదలైన శాస్త్రాల్లోవలె ఉదాహరణలు గుప్పడం కవిత్వంగా దని నిరూపించాను. అయినా ఒకభావాన్ని పరిపోషం చేసేటప్పుడు అంగంగా అవసరమైనంతమట్టుకు యివి చెప్పితే ఒకప్పుడు తగివుండవచ్చునుగాని,

"నిట్టూ ర్పుగాడ్పులో
 ఫెళఫెళార్భటులలో
 హాలాహలమ్ములో

రాత్రీకుంతలములలో
శిశిరమ్ములో!!

అని యిట్లా ఉదాహరణలు గుప్పించి, అది కావ్యమవుతుందని మురియడం అనుచితమైనవని.

ఆక్షేపం.

అవునయ్యా. "వాక్యం రసాత్మకంకావ్యం" అని విశ్వనాథు డన్నాడు. ఒక వాక్యమైనాచాలు, రసవంతమైనది. అదేకావ్యం. అనేక వాక్యాలు వుండవలసిన పనిలేదు. అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను; వాక్యం రసాత్మకం కావ్యం అంటే మహావాక్యం అని అభిప్రాయం. లేదా రసాత్మక వాక్యం కావ్యాంశం అని అయినా అభిప్రాయం. మీరుచెప్పిందే ఆవాక్యానికి అర్థమైతే ఒకవాక్యం వ్రాసి కవిగావచ్చును.

వాక్యంతో గూడా పనిలేదు.

"తదదోపౌ శబ్దార్థౌ సగుణావనలంకృతీపునః క్వాపి". (కావ్య) అని సాహిత్యవేత్తలంటారు.

శబ్దార్థౌ అంటే శబ్దం అర్థం రెండు అని అభిప్రాయం. శబ్దానికి అర్థం యెట్లానైనా వుంటుంది గనుక ఒక మంచిశబ్దం రచిస్తే చాలు. కావ్య మౌతుంది. రచయిత కవి అవుతాడు.

"మందః కవి యశః ప్రార్థీ"

అని కాళిదాసువంటివాడు చెప్పడం అనవసరం. ఇంతమంది ఇంత తేలికగా కవులవుతుంటే అతనికి జంకెందుకు? ఇందు వదన ఇది ఒకకావ్యం; సుందరాంగి ఒక కావ్యం; ఇందువదన కౌగిలియ్యవే సుందరాంగి, ముద్దుపెట్టవే; ఇవి రెండు మహాకావ్యాలు అని నిర్ణయించవచ్చును. కాని యివన్నీ తెలివితక్కువమాటలు, ఒక భావంగాని రసంగాని పరిపోషం చెందినప్పుడే కావ్యత్వ సిద్దికలుగుతున్నది. కాదా అవి కొన్ని మాటలే అవుతున్నవి గాని కావ్యంగాదు. ఇందుకే "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న సాహిత్యదర్పణకారుడు,

"తత్ర వాక్యం యథా శూన్యం వాసగృహం" ఇత్యాది "మహావాక్యం యథా రామాయణ మహాభారత రఘువంశాది" (సాహి)

అని వినిపిస్తున్నాడు.

"వాక్యం రసాత్మకం కావ్యం" అన్నప్పుడు కావ్యాంశం వాక్యంలో వుంటుందని అభిప్రాయం. యేకవాక్యమే కావ్యమైతే, మేఘసందేశాదులు మహామహాకావ్యాలు గావలెగదా. మేఘసందేశాదులు ఖండకావ్యాలని విశ్వనాథుడు చెప్పుతున్నాడు. మేఘసందేశంలోని ఒకశ్లోకమే కావ్యమైతే మేఘసందేశమంతా కలిసి ఖండకావ్య మెట్లా అవుతుంది? రసభావాలు పరిపోషంచెంది శ్రోతకు మనః పరిణతి కలిగించడంలో కావ్యత్వసిద్ది యేర్పడుతున్నది. చిరావస్థానం లేని అభిప్రాయాన్ని తెలిపే వకవాక్యంగాని ఒకమాటగాని అట్టాటిపనికి సమర్థంగావు. సాహిత్య గ్రంథాల్లో ఇది రసం, ఇది భావం, ఆని ఒక్కొక్కశ్లోకాన్ని ఉదాహరించడం, ఉపదేశోపాయమని తెలుసుకోవలెను. దాంట్లో రసాంశ, భావాంశ, వున్న దని తెలుసుకోవలెను. అదీ గాక ఈభావం, రసం. భావత్వంచేత, రసత్వంచేత, మాత్రమే గ్రాహ్యం గావు. ఆధారంయొక్క గుణగుణాలు ఆధేయంమీద ముద్రితమవుతున్నవి. ఈసంగతి ముందింకా స్పష్టంగా విశదీకరిస్తాను. రసం, భావం గ్రాహ్యంకావడానికి తదాధారమైన ఆలంబనం విదితమై అవి పరిపోషం చెందడానికి సాంగరూపసిద్ధి కలిగేవరకు ఉపస్థితంకావలెను. అప్పుడే మనకు ఉత్తమకావ్యం సిద్ధించగలదు. అట్లాకాక ఆ చిరావస్థానమైన ఒక అభిప్రాయానికి నాలుగైదు ఉదాహరణాలు వ్రాసి ఆ మాటలను ప్రత్యేకంగా ఒక పేజీమీద ముద్రించినమాత్రాన అది ఒకకావ్యంగాదు. అవి యింపుగావుంటే వాటిని కావ్యాంశగల చాటూక్తు లనవచ్చును. ఆమనోహరత్వం గూడా లేకుంటే అవి పనికిమాలిన ఛాందసపుమాట లవుతవి. కృష్ణపక్షంలోని విరిచేడె, విశ్రాంతి, శాపం, అబ్బ, తొలకరిలోని మరపు, గడ్డిపూలు, మొదటిముక్క, ఇట్లాటివన్నీ చాటూక్తులైనా అవుతవి. ఛాందసపు మాటలైనా అవుతవి. ఈకాలపుఖండ కృతుల్లో ఛాందసపుమాటలే హెచ్చుగా కనబడుతున్నవి. యెంకిపాటల వలె కావ్యత్వ సిద్ధిపొందినవి అరుదుగా కనబడుతున్నవి.

ఆక్షేపం.

అవునయ్యా, ఈ రోజుల్లో మీరన్నట్లు స్వరూపసిద్ధి అయ్యేదాకా కావ్యం వ్రాస్తే చదవడానికి యెవరికీ తీరదు. అదిగాక పత్రికలవారికి చిన్న చిన్న పద్యాలు పద్యసంచయాలు అయితే అనుకూలిస్తవి, కనకనే చిన్న కృతులు వ్రాస్తున్నారు, అదిగాక ప్రజలరుచులు చిన్న వాటిమీదనే వున్నవి. అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. తీరిక లేదనేమాట నేనొప్పుకోను. యేమితోచక యెందరోకాలాన్ని యెట్లానో నెట్టడం మన మెరుగుదుము. చీట్లాడడం యెరుగుదుము. కనుక తీరికెలేదంటే అంగీకరించజాలను. కావ్యాసక్తి గలవారిలో కొందరైనా తీరికగలవారున్నారు. ఇఘ పత్రికలవారికి తీరిక లేనివారికి చిన్నచిన్న వి కావలెనంటె కావలసి వుండవచ్చును. అంతమాత్రం చేత ఉత్తమకవిత్వ మెట్లా అవుతుంది? ఆపద్యాలు ఉత్తమకావ్య మెట్లా అవుతవి? వార్తలవలెయిది చదివి పారవేయడానికి పనికివస్తవంటే, ఇవి పత్రికలవారి వ్యాపారానికి తీరికెలేనివారికి వేసే చిల్లరముక్కలంటే. నాకు విప్రతిపత్తిలేదు. అప్పుడు నావిచారణ ఆవశ్యకంగాదు. ఇక ప్రజలరుచులంటారా? ప్రజలరుచులకు సేవచేయడానికి కవులు వేశ్యలూ, వర్తకులూగారు గదా.

"యథాస్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే" (ధ్వన్యా)

(కవికి విశ్వమెట్లా ఇష్టమైతే అట్లా పరివర్తనపొందుతుంది) అని ఆనందవర్ధను డన్నట్లు సర్వలోకాన్ని వశీకరించి ఉత్తమమార్గాన నడపవలసినకవి ప్రజలరుచులకు సేవచేసే వేశ్యాపదవిని వణిక్థ్సానాన్ని పొందడం హైన్యం.

అని శ్రీ ... ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో నిదర్శనాధికరణం సమాప్తం.

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

తత్త్వజిజ్ఞాసాధికరణం.

వేదాంతం.

ఈకాలపు కృతుల్లో తత్వకవిత్వమంటూ కొంత కనబడుతున్నది. కవిత్వం తత్వజిజ్ఞాసా, చాలా సంబంధంకలవి.

"నానృషిః కురుతే కావ్య" మని భారతీయులు చెప్పుతున్నారు.

భగవద్గీతవంటి తత్వగ్రంథాన్ని కవి వ్యాసుడు తనకృతిలో యేకదేశం చేశాడు. అసలీ తత్వజిజ్ఞాసలకు కవులే బీజావాపకులు.

"నాసదాసీత్ నో సదాసీ త్తదానీం నాసిద్రజో నోవ్యోమాప రోయత్"

(ఋ. మ10. అ 11. సూ 1. ఋ. 1)

ప్రళయదశలో అసత్తులేదు, సత్తులేదు, భూమి పాతాళం మొదలైనవిలేవు. అంతరిక్షంలేదు. (విద్యా. భా.)

"కో అద్దా వేద క ఇహ ప్రవోచత్ కుత ఆజాతా కుత ఇయం సృష్టికి
 అర్వాగ్దేవా అస్య విసర్జనేనాధాకో వేద యత ఆబభూవ."
                                                     (ఋ. మ 10. అ 11. సూ 1. ఋ 6)

యేవుపాదానకారణంచేత యేనిమిత్తకారణంచేత ఈసృష్టి సకలం ప్రాదుర్భవించిందీ యెవడికి వాస్తవంగా తెలుసును? యెవడు చెప్పగలడు? ఈభూతసృష్టికి పిమ్మటివారుగా దేవతలుచేయబడిరి. జగత్తేకారణంవల్ల పుట్టిందో యెవడికి తెలుసు? (విద్యా . భా.)

అని వినిపించిన ఋగ్వేదకవివాక్కులు ఈతత్వజిజ్ఞాసలను విశదం చేస్తున్నవి.

"కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత మోహితాః" (భగవ) అని వ్యాసుడు కవుల కీ తత్వజిజ్ఞాసలతోటి గల సంబంధాన్ని విశదంచేస్తున్నాడు. బాదరాయణుడికి పిమ్మట వచ్చిన కాళిదాసాదులు అంతకు పూర్వం వికసితమైన జిజ్ఞాసల నన్నిటిని ప్రసిద్దభారతీయ విద్వద్గోష్ఠుల్లో మననంచేసి ఆపైన వారి అనుభవాన్ని సందర్భంవచ్చినచోట కావ్యమర్యాదతో వినిపిస్తూ వచ్చారు. ఔపనిషదం జైమినీయం పౌరాణికం, కాపిలం కాణాదం నైయాయికం పాతంజలం మొదలైనమార్గాల తత్వ సిద్ధాంతాలను స్వానుభవాలను అనుసరించి మేళగించి కావ్యనయాన కాళిదాసు రఘువంశదశమాశ్వాసంలో దేవతలు రావణ వధార్థం విష్ణువును ప్రార్ధించిన సందర్భాన.

1. "నమో విశ్వసృజే పూర్వం విశ్వం తదనుబిభ్రతే,
   అథ విశ్వస్య సంహర్త్రే తుభ్యం త్రేధా స్థితాత్మనే.

2. రసాంతరాణ్యేకరసం యధా దివ్యం పయోశ్నుతే,
   దేశే దేశే గుణేష్వేవ మనస్థా స్త్వమవిక్రియః.

3. ఏకః కారణతస్తాం తాల అవస్థాం ప్రతిపద్యసే,
   నానాత్వం రాగసంయోగాత్ స్ఫాటికస్యేవ దృశ్యతే.

4. అమేయో మితలోకస్త్వమనర్థీ ప్రార్థనావహః,
   అజితో జిష్ణురత్యంత మవ్యక్తో వ్యక్తకారణం.

5. హృదయస్థ మనాసన్నమకామం త్వాం తపస్వినం.
   దయాళుమనఘస్పృష్టం పురాణమజరం విదుః.

6. సర్వజ్ఞస్త్వమవిజ్ఞాతః సర్వయోనిస్త్వమాత్మభూః,
   సర్వప్రభురనీశ స్త్వమేకస్త్వం సర్వరూపభాక్.

7. సప్తసామోపగీతం త్వాం సప్తార్ణవజలేశయం,
   సప్తార్చిర్ముఖమాచఖ్యుః సప్తలోకైకసంశ్రయమ్.

8. చతుర్వర్గఫలం జ్ఞానం కాలావస్థా చతుర్యుగా,
   చతుర్వర్ణమయో లోకః త్వత్తః సర్వం చతుర్ముఖాత్.

9. ఆభ్యాసనిగృహీతేన మనసా హృదయాశ్రయం,
   జ్యోతిర్మయం విచిన్వంతి యోగినస్త్వాం విముక్తయే.

10. అజస్య గృహ్ణతో జన్మ నిరీహస్య హతద్విషః,
    స్వపతో జాగరూకస్య యాథార్థ్యం వేద కస్తవ.

11. శబ్దాదీన్ విషయాన్ భోక్తుం చరితుం దుస్తరం తపః,
    పర్యాప్తోసి ప్రజాః పాతుం ఔదాసీన్యేన వర్తితుం.

12. బహుధాప్యాగమైర్భిన్నా : పంథానః సిద్దిహేతవః,
    త్వయ్యేవ నివసంత్యోఘా జాహ్నవీయా ఇవార్ణవే.

13. త్వయ్యావేశితచిత్తానాం త్వత్సమర్పితకర్మణాం,
    గతిస్త్వం వీతరాగాణాం అభూయః సన్ని వృత్తయే.

14. ప్రత్యక్షో ప్యపరిచ్ఛేద్యో మహ్యాది ర్మహిమా తవ,
    ఆప్త వాగనుమానాభ్యాం సాధ్యం త్వాం ప్రతి కా కథా

15. కేవలం స్మరణేనైవ పునాసి పురుషం యతః
    అనేన వృత్తయః శేషాః నివేదితఫలాస్త్వయి.

16. ఉదధేరివ రత్నాని తేజాంసీవ వివస్వతః, .
     స్తుతిభ్యో వ్యతిరిచ్యన్తే దూరాణి చరితాని తే.

17. అనవాప్తమవాప్తవ్యం నతే కించన విద్యతే.
    లోకానుగ్రహ ఏవైకో హేతుస్తే జన్మకర్మణోః.

18. మహిమానం యదుత్కీర్త్య తవ సంప్రియతే వచః,
    శ్రమేణ తదశక్త్యా వా న గుణానామియత్తయా." (రఘు)

1. మొదట విశ్వంసృజించి, పిమ్మట విశ్వంభరించి. తరువాత విశ్వం సంహరిస్తూ త్రివిధరూపాత్ముడైన నీకు నమస్కారం.

2. ఆకాశసంబంధి జలం యేకరసమైనా, దేశదేశంలో రసాంతరాలను పొందినట్లు, నీవు వికారరహితుడవైనా గుణాల్లో భిన్నా వస్థలు పొందుతున్నావు.

3. నీవొకడవై కూడా ఉపాధివశాన ఆయాఅవస్థలను రాగసంయోగంవల్ల స్ఫటికానికి నానాతత్వంవలె, ప్రాప్తిస్తున్నావు.

4. నీవు కొలతకందవుకాని నీవు లోకాలను కొల్చావు. నీకు కోరికలు లేవు కాని కోరికలు తీరుస్తావు. నిన్ను గెల్చేవాండ్లు లేరు. నీకు సర్వత్రజయం. నీవు అవ్యక్తుడవు కాని వ్యక్తం నీవల్లనే కలుగుతున్నది.

5. హృదయంలో వున్న దూరస్థుడవని, తపస్సాధ్యంలేని తపస్వివని. వ్యసనంలేని కరుణాశాలివని. ముదిమిలేని వృద్ధుడవని అంటారు.

6. నీకన్నీ తెలుసును. నిన్నెవ్వరు తెలియరు. నీవు అన్నిటికి కారణం. నీకు నీవు తప్ప వేరేకారణంలేదు. నీవందరికీ ప్రభుడవు. నీకు ప్రభువు లేడు. నీవు ఒక్కడవి అన్ని రూపాలను పొందుతున్నావు.

7. సప్తసామాలు కీర్తించేది నిన్ను. సప్తసముద్రాలు నీకు శయనం, సప్తజిహ్వుడు నీకు ముఖం. సప్తలోకాలకు నీవు సంశ్రయం.

8. నాలుగు పురుషార్థాలనిచ్చేజ్ఞానం, నాలుగు యుగాలుగా వున్నకాలం, నాలుగువర్ణాలతో వున్నలోకం, ఇవన్నీ నాలుగు ముఖాలుగలనీనుండే కలుగుతున్నవి.

9. హృదయంలో జ్యోతిర్మయమై వుండే నిన్ను అభ్యాస నిగృహితమైన మనస్సుతో యోగులు ముక్తికొరకు ధ్యానిస్తారు.

10. పుట్టుకలేనివాడవై పుట్టుతూ క్రియారహితుడవై శత్రుల సంహరిస్తూ నిద్రలో జాగరూకుడవై వుండే నీయథాస్థితి యెవడికి తెలుస్తుంది.

11. శబ్దాది విషయాలను అనుభవించడానికి, దుస్తరతపస్సు తపించడానికి, ప్రజలను రక్షించడానికి, ఉదాసీనంగా వుండడానికి నీవు సమర్థుడవు.

12. గంగాప్రవాహాలు యెన్నివిధాల చీలినా చివరకు అర్థవంలో కలిసేరీతి సిద్దిహేతువులైన మార్గాలు బహుధాభిన్నాలైనా నీలోనే పడుతున్నవి.

13. నీయందు అవేశితచిత్తులై కర్మలను నీకు సమర్పిస్తూ కోరికలు వదలిన యోగులముక్తికి నీవు గతివి. 14. భూమ్యాదిభూతాలవల్ల నీమహిమ ప్రత్యక్షంగా కనబడుతున్నా యిట్లాటి దని తెలుసుకోవీలులేకున్నది. ఇక శబ్దాను మానాలవల్ల సాధ్యుడవైన నిన్ను గురించి యేమన వలెను?

15. స్మరణచేస్తేనేపురుషుణ్ని పవిత్రపరుస్తావు. నిన్ను పూజించడం దర్శించడం మొదలయిన వాటివల్ల ఫలమెంతగొప్పదో యిందువల్లనే తెలుసుకోవచ్చును.

16. సముద్రంలో రత్నాలు, సూర్యుడికిరణాలు చెప్పవీలులేనట్లు నీచరితలుస్తుతించ అలవికాకున్నవి.

17. పొందదగినదియేదీ, నీవు పొందకుండా వుండలేదు. నీవుజన్మిస్తే లోకానుగ్రహమొకటే హేతువై వుంటుంది.

18. నీమహిమను పొగడి. మావాక్కు లు చాలించడం శ్రమవల్లనో అశక్తివల్లనో గాని నీగుణా లింతే నని గాదు.

అని చెప్పి.

ఇతి ప్రసాదయామాసుః తేసురాస్తమధోక్షజం,
భూతార్థవ్యాహృతిః సా హి న స్తుతిః పరమేష్ఠినః.

ఇదంతా ఆపరమేష్ఠికి స్తుతిగాదు. సిద్ధమైవున్న గుణాలను చెప్పడమేనని పూర్వుల విజ్ఞానానికి తన వినతిని "భూత" శబ్దంచేత వ్యంగ్యముఖాన మనకు వినిపిస్తాడు. ఇట్లానే మాఘుడు.

"బహిర్వికారం ప్రకృతేః పృథగ్విదుః
 పురాతనం త్వాం పురుషం పురావిదః" (మాఘ)

అని పెద్దలంటారని పూర్వుల విజ్ఞానానికి వినతిని చూపినాడు కాళిదాసు అజవిలాపసందర్భంలో వశిష్ఠుడిచేత

1. తదలం తదపాయచింతయా
   విపదుత్పత్తిమతముపస్థితా.

2. రుదతా కుతఏవ సా పునర్భవతా నానుమృతాపి లభ్యతే.
   పరలోక జుషాం స్వకర్మభిర్గతయోభిన్న పథాహి దేహినాం.

3. మరణం ప్రకృతిః శరీరిణాం వికృతి ర్ణీవిత ముచ్యతే బుదైః
   క్షణమప్యవతిష్ఠతే శ్వసన్ నను జంతుర్యది లాభవానసౌ

4. అవగచ్ఛతి మూఢచేతనః ప్రియనాశం హృదిశల్యమర్పితం,
   స్థిరధీస్తు త దేవమన్యతే కుశలద్వారతయా సముద్ధృతం.

5. స్వశరీరశరీరిణావపి శ్రుతసంయోగవిపర్యయౌ యదా,
   విరహః కిమిషానుతాపయే ద్వద బాహ్యైర్విషయై ర్విపశ్చితం.

6. న పృథగ్జనవచ్చుచో వశం వశినాముత్తమ గంతుమర్హసి.
   ద్రుమసానుమతాం కీమంతరం యది వాయౌ ద్వితయే పితే చలాః. (రఘు).

1. ఆమె మరణానికి చింతచాలించు. ఉత్పత్తిగలవాటికి విపత్తుచేరువనే వుంటున్నది.

2. నీవు ఆమెవెంట మరణించినాగూడా ఆమె నీకెట్లాను లభించదు. పరలోకంలో స్వకర్మానుసారంగా దేహులకు గతులు భిన్నంగా వుంటవి గదా. ________________

66

వాజ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం

3. మరణమే ఆత్మకు స్వభావసిద్దమైన అవస్థ బ్రతుకువికృతావస్థ అని పెద్దలంటారు క్షణమాత్రమరణమైనా శ్రేయస్సే గదా.

(క్షణమాత్ర జీవితమైనా అని మల్లినాథుడు).

4. ప్రియవినాశం హృదయ శల్యంగా మూడుడు భావిస్తాడు,స్థిరప్రజుడు తెరచిన కుశలద్వార మనుకుంటాడు.

5. స్వకీయమైన దేహాత్మలకే సంయోగవియోగాలు కలుగుతూవుం టతెలిసినపొడేమని బాహ్యవిషయ వియోగానికితాపపడతాడు.

6. వశులలో ఉత్త ముడమైన అజుడా! సాధారణుల వలె | దుఃఖానికి వశం కావడం నీకు అర్ఘంగాదు..

"చెట్లూ పర్వతం రెండూ వాయుపతికి కదలితే వాటి కేమిభేదం?"

అని ప్రాణుల సంయోగవియోగజన్యమైన సుఖదుఃఖాలను గురించి

చెప్పించిన ఘట్టంలో "బుదైః" అని విబుధులవిజ్ఞానానికినతిని కనబరచాడు.

ఆకాలంనాటి విజ్ఞానసౌధాన్ని ఆరోహించి తత్వ జిజ్ఞాసలకు

వెలుగునిచ్చే నూతనానుభవాలను సయితం అక్కడక్కడ కాళిదాసాదులు

అనుగ్రహిస్తూ వచ్చారు. కనుకనే శాస్త్రవేత్తలుసయితం

"కర్తవ్యం కాళిదాసాదేః కావ్యానాం పరిశీలనం" అని అన్నారు.

"భిన్న రుచి లోకః' | (రఘు)

అభితప్త మయోపిమార్ధవం భజతే కైవకథా శరీరిష" (రఘు)

అని తీరున విదీతంచేసిన సార్వకాలిక సత్యాలకు తోడు తత్వజిజూసకు కొత్త వెలుగుచూపించే అనుభవాలను ప్రసాదించినప్పుడు శాస్త్రవేత్తలు వీటిని తమజిజ్ఞాసలలో స్వీకరిస్తూ వచ్చారు. మీమాంసాసూత్రీయ శాబరభాష్యవ్యాఖ్యానమైన తంత్ర వార్తికంలో శిష్టచారవిచారంలో కుమారిల భట్టాచార్యులు

"సతాం హి సందేహపదేషు వస్తుషు
 ప్రమాణమంతఃకరణప్రవృత్తయః"( శాకుం)

అనే శాకుంతలవాక్యాలను గ్రహించారు. వైయాకరణసిద్ధాంత గ్రంథమైన వాక్యపదీయంలో భగవతిప్రతిభయే వాక్యార్థమని నిరూపించే ఘట్టంలో

"ప్రమాణత్వేన తాం లోకః సర్వః మనుపశ్యతి,
 సమారంభాః ప్రతీయన్తే తిరశ్చామపి తద్వశాత్." (వాక్య)

అనే కారికకు వ్యాఖ్యవ్రాస్తూ, హేలారాజు "సతాంహి" అనే పై వాక్యాలనే స్వీకరిస్తాడు.

హంస యోగిభాష్యమనే గీతాభాష్యంలో
"శరీరమాద్యం ఖలు ధర్మసాధనం". (కుమా)

అనే కుమారసంభవవాక్యాలు హంసయోగి స్వీకరించాడని శుద్ధధర్మ మండలి కార్యదర్శి చెప్పగా విన్నాను. ఈతీరుగా ఆకాలపు తత్వజిజ్ఞాసలకు బలం ప్రసాదించిన కాళిదాసాదులు తత్వజ్ఞత్వసంబంధం కలిగే లో కోత్తరులై వున్నారు.

శంకరులు - నూతనశకం

అయితే శ్రీశంకరులకాలంనుండి భారతవర్షంలో తత్వజిజ్ఞాసలకు ఒక నూతనశకం ప్రారంభమయింది. భారతంనుండి భగవద్గీత వేరైంది. ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, గీతకు భాష్యాలు వ్రాసి భారతవర్షపుమూలమూలల అగణ్యశిష్యులతో సంచారం చేసి తత్వజిజ్ఞాసలను వెదచల్లినాడు. అదివరకే శాస్త్రంగా ఆరంభమైవున్న బ్రహ్మజిజ్ఞాస ఒక అఖండశాస్త్రమై అదే అనేకసంవత్సరాల పఠనానికి తగిన ఒకప్రసిద్ద విద్యాస్థానమయింది. శంకరాచార్యులకాలంనుండి బ్రహ్మజిజ్ఞాస ఒక అఖండవిద్యాస్థానమై దేశంలోవున్న మహామేధావంతు లనందరినీ ఆకర్షించ మొదలుపెట్టింది. బుద్ధుడితో కదలిక ఆరంభమైన యీజిజ్ఞాసలకు శంకరాచార్యులచేతిలో మహోచ్చదశ ప్రాప్తించింది. పిమ్మట రామానుజాదు లీజిజ్ఞాసల సాగించారు. మాధవాచార్యులవంటి మేధా సముద్రుల ఈజిజ్ఞాసలకు ఆకృష్టులైనారు. కవులనుండి యీతత్వ జిజ్ఞాసలు పూర్తిగా విడిపడ్డవి. కవులీ జిజ్ఞాసలకుచేర్చదగ్గది మృగ్యమైతోచినది.

శాఖోపశాఖలతో పెరిగిన యీవిజ్ఞానం అధిగమించడంలో యెన్నో సంవత్సరాలు పట్టుతున్నవి. బుద్ధి విశ్రాంతావస్థకు వస్తున్నది. తత్వజిజ్ఞాసలకు దారిచూపే అనుభవాలు ఉండజాలనంతగా శాస్త్రవేత్తలు గార్లించి అనంతంగా వృద్ధిపరచారు. ఇక కవులేదైనా చెప్పితే అది ఆఅమేయశాస్త్రశాఖలముందు నిస్తేజంగా అణగి పోవలసినదే ఆయెను. కనుకనే శ్రీహర్షుడు తన అనిర్వచనీయత్వసిద్ధాంతాన్ని ఖండన ఖండఖాద్యమనే ఒక గ్రంథంలో ప్రతిపాదించి, దాన్ని శాస్త్రశాఖలకు చేర్చాడుగాని తనకావ్యంల్లో వాక్యరూపంగా చెప్పి వూరుకుండలేకపోయినాడు. అట్లా వూరుకుంటే విస్తరించివున్న శాస్త్రశాఖలయెదుట ఆవాక్యాలు నిల్వజాలవు. కనుకనే శంకర రామానుజాదుల తరువాత ఈజిజ్ఞాసలను స్పృశించ అవకాశం కవులకు కనబడలేదు. ఇక ఆంధ్రదేశంలో శంకర రామానుజాదుల ప్రచారమేగాకుండా దేశీయుల్లో అనేకు లీవిజ్ఞానాన్ని వెదచల్లినారు. గురువని మీమాంసకుల్లో ప్రసిద్ధిగన్న ప్రభాకరుడివలె ఆంధ్ర దేశంలో గురుపద వాచ్యుడైన వీరబ్రహ్మ. . వేమన్న, సిద్దప్ప, శివరామదీక్షితులు మొదలైన యోగులు, తత్వజ్ఞులు. దేశభాషాసాధనంతో ఆంధ్రదేశపు పల్లెపల్లెల ఈజిజ్ఞాసలను ప్రతిధ్వనింప జేశారు. వ్యాసుడు, జైమిని, గౌతముడు, కణాదుడు. కపిలుడు, పతంజలి. శంకరుడు. రామానుజుడు మొదలైన మహాతత్వవేత్తలు, బ్రహ్మగురువు, వేమన్న సిద్దప్ప, శివరామదీక్షితులు మొదలైన జ్ఞాననిధులు దేశాన్ని ప్రబోధిస్తుండగా వీటినిమించి కొత్తవెలుగుచూపే విజ్ఞానం కవులు ప్రసాదిస్తే తప్పక వారిని ఆరాధిస్తాము. కాదా? వారితత్వకవిత్వపుమాటలు నిస్సారములే కాగలవు. ఇంకా ఆధ్యాత్మికవిజ్ఞానం అస్ఫుటాపస్థలో వున్న అభారతీయులకు అట్లాటి తత్వకవిత్వం గొప్ప అయితే కావచ్చునుగాని ఆధ్యాత్మికవిజ్ఞానం పరిపాకావస్థకు వచ్చినభారతవర్షంలో అందులో ఆంధ్రదేశంలో అది తప్పక నిస్సారమే అవుతుంది. ఆతత్వకవిత్వం ఆంధ్రులకు అవసరంమాలిందేకాగలదు. ఇట్లా పరిహాసాస్పదమైన నీరసపు తత్వకవిత్వం ఈ కాలపు కృతుల్లో తరుచుగా కనబడుతున్నది.

"జననమరణములు రెండు విశ్రాంతిలేక
 జరుగుచుండును నీప్రపంచంబునందు." (వనకుమారి)
                (పునరపి మరణం పునరపి జననం. భజగో)

"ఒకప్పుడు కొన్ని సంఘము లుత్తమస్థితి గలిగియుండు
 మరికొన్ని అధమ సన్మానంబునొందు
 కష్టసుఖముల నీచోచ్చగతులు గలవు
 చక్రదండంబునకు బోల" (వనకుమారి)

"కస్యాత్యంతం సుఖముపనతం దుఃఖమేకాంతతోవా
 నీచై ర్గచ్చ త్యుపరిచ దశా చక్రనేమిక్రమేణ" (మేఘ)

"కాలమహత్వమెవ్వరికి గన్గొనరాదు ప్రతిక్షణంబు గా
 ర్యాళి ప్రయత్న లబ్దమగు కల్గవు కొన్ని ప్రయత్నయుక్తినేన్
 లీల లయించు భాగ్య. మవలీల దరిద్రతబోవు యిట్టులే
 తేలును మున్గుకాలజలధిన్ సకలంబును అస్వసంత్రతన్."
                                                                 (వనకుమారి).

"కాలః సృజతి భూతాని కాలః సంహరతే ప్రజాః
 కాలః సుప్తేషు జాగర్తి కాలో హి దురతిక్రమః.
 కాలమూలమిదం సర్వం భావాభావౌ సుఖాసుఖే."
                                                    (మహాభా. ఆ.)

"కాల ఏవహి పురుషాన్ అర్థానర్థయోః
 జయపరాజయయోః . సుఖదుఃఖయో శ్చ స్థాపయతి." (వా.కా.సూ)

అని యిదివరకు ప్రసిద్ధమైనవచనాలనే తత్వంగా వనకుమారికర్తవ్రాస్తే మానవసుఖదుఃఖాలపై వీరిదృష్టి పెసిమిష్టికుగా వున్నదని ఆంధ్ర హెరాల్డులో ఒకరు సారంతేల్చారు. యీమాటల్లో వీరి నూతనానుభవంగాని వీరి స్వదృష్టిగానిలేదు. లోకంలో ప్రసిద్ధమైన వచనాలివి. జీర్ణించని పాశ్చాత్యసంస్కారంతో భారతీయసంస్కారానికి అంధులై వున్నంతకాలం ఇట్లాటివి గోచరిస్తుండగలవు. ఈకొత్త సంగతులు మనకు ప్రసాదించడానికి వనకుమారికర్త పడ్డ శ్రమలో నాల్గవవంతు భారతీయ విజ్ఞానంప్రాప్తించడానికి పడినట్లయితే ఆ అమేయ విజ్ఞానాన్ని మేళగించి వ్రాసినా వ్రాయకున్నా ఇట్లా పెద్దలంటారని బుద్ధి పరిపాకాన్నీ, వినతిని, అయినా కనబరచే వాడు.

ఇట్లనే భారతి సం 3. సం 1. లో రాయప్రోలు సుబ్బారాయకృతి ధ్యాన గీతవున్నది. యేదో తత్వం తెలుపబోయి ధ్యానగీతకర్త నేను బ్రాహ్మముహుర్తంలో మేలుకొన్నాను, నా అహంకారం కదలలేదు, నేను ఉపనిషత్తు పఠించాను, దేవీపంచరత్నాలు చదివినాను. రామకథ మీదికి మనసుపోయింది. తరువాత భాగవతంమీద బుద్ధిపుట్టింది, నాకేమి తోచలేదు. తరువాత అనువాకాలకు తిరిగినాను, అని తనచర్య వ్రాశాడు. చివరన అయోమయంలోకి దిగి వదలినాడు. దీన్ని తరువాత నిరూపిస్తాను. అనంతరూపంతో విస్తరించివున్న తత్వజ్ఞానం యొక్క శిఖరం ఆరోహించి సర్వ భావాలను వశపరచుకొని మనకు నూతనవిజ్ఞానం ప్రసాదిస్తే వారిని తప్పకుండా ఆరాధిస్తాము. కాని చెప్పగలిగినది. చెప్పవలసినది యేమీ లేనప్పుడు తత్వంలోకి దిగితే అది నిస్సారపు అయోమయపుమాటలలోనీకే పర్యవసిస్తుంది. తత్వంవ్రాస్తామా? అది వేదాంతవిజ్ఞానవిలసితులకు గ్రాహ్యంగా వుండవలెను. లేదా ఆసామగ్రి లేనప్పుడు ఊరుకొనడం ఉచితం. "ఆకున ఆందని పోకనపొందనీ" యేవో నాలుగుమాటలు పులిమి, బులుపుతీర్చుకుంటే తీర్చుకోవచ్చును. తెలియనివారు తెలియకుండా వాటిని చదవవచ్చునుగాని వాటిని అయోమయపు ఆజ్ఞానవచనాలని సంస్కారవంతులు నిరాకరిస్తారు.

అని శ్రీ... ఉమా కాస్త నిధ్యాఖగకృతీలో వాజ్మయసూత్ర

పరిశిష్ట్రంలో తత్త్వజిజ్ఞాసాధికరణం సమాప్తం.

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

అయోమయత్వాధికరణం.

అయోమయత్వం.

బుద్ధి అపరిణతమై ఉదితభావపరంపరలో స్పష్టతలేనప్పుడు వెలువడే మాటలు అయోమయంగా వుండడం సహజం. చెప్పదలచుకొన్నది చెప్పడానికి బలంలేని భీరుత్వమూ చెప్పవలసిన దేమిలేనప్పుడు వ్రాయవలెననే కోరికా అయోమయపుమాటలనే వెడలిస్తవి.

ఉన్నది మామూలు అభిప్రాయమే ఓసి ఇంతేనా అంటారని దాన్ని యేమేమో మాటలతోచెప్పి అయోమయంతో ఆత్మవంచన చేసుకొంటారు కొందరు.

ఈ అన్నిరకాల అయోమయాలు నేటికాలపుకవిత్వంలో బహుళంగా కనబడుతున్నవి.

"మధురమోహనమూర్తి మందహాసమున
 నద్భుతంబుగ లీనమై నట్టులుండ
 మధురహాసంబులో మాధురీప్రకృతి
 యానంద ముద్రితమై నట్టులుండె
 మధురచంద్రికలలో మధురామృతంబు
 మధురామృతంబులో మధురరసంబు
 మధురరసంబులో మధురభావంబు
 మధురభావంబులో మధురరూపంబు
 మధురరూపంబులో మధురతేజంబు
 మధుర మోహనకళా మహితమై వుండ
 మధురస్వరంబులో మధురగీతముల
 మధురగానంబులో మదిమేళగించి." (యేకాంత సేవ)

అని యేకాంతసేవలోవున్నది యీ అయోమయ ప్పులుముడే నని ఇదివరకే నిరూపించాను.

"పెద్దపులినోటిలో నే నేను. పెనుబొబ్బపెడతాను నే నేను
 గొర్రెల్లెమేకల్లె నే నేను. ఘోషిల్లిపోతాను నే నేను
 భార్యనీవకచెంప నే నేను. భర్తనీవకచెంప నే నేను"
                                  (భారతి సం. 2, 11).

అనేవి యీఅయోమయపుకోటిలోనే చేరుతున్నవి. ఇది శంకరుల అద్వైతమా? వైయాకరణుల శబ్దబ్రహ్మవాదమా? లేదా జైమినీయమా? కాపిలమా? కాణాదమా? పాతంజలమా? గౌతమీయమా? స్వకీయ నూతనసిద్దాంతమా? యీబొబ్బలు పెట్టడమేమిటి; భార్యగావడమేమిటి; భర్తగావడమేమిటి; యీ అయోమయాన్ని యీకృతికర్తకే వదులుతున్నాను. ఇది స్వకీయసిద్దాంతమయితే దీనిని సుబోధంగా వ్యక్తపరచవలసి వుంటుంది. లేదా అయోమయంలోబడవేసి కృతికర్త అకృతార్దుడే అవుతున్నాడు.

"వినబడదు శ్రుతివాణి విప్పినవిధాన
 కనబడదుస్మృతి ఋషివచించిన విధాన." (భారతి.ధ్యానగీత),

అని ధ్యానగీతకర్త అంటాడు. శ్రుతివాణి విప్పిన విధానవినబడదంటే ఋగ్వేదంమొదటిరూపంతో లేదనా? మొదటి శ్రుతికారుడు చదివినట్లు నేటిబ్రాహ్మణుడు చదవలేడనా? లేదా వాట్లో ప్రక్షిప్తాలు చేరినవనా? యశ్రుతి? ఋగ్వేదమా? యజుర్వేదమా? అధర్వవేదమా? సామవేదమా? వాట్లో మంత్రభాగమా? బ్రాహ్మణభాగమా? యేవిప్రక్షిప్త భాగాలు? కాకుంటే ప్రథమంలో ఋగ్వేదం వినబడ్డట్లు ఇప్పుడు వినబడదనా? అయితే వేదం పుట్టినప్పటిధ్వని ఈధ్యానగీతకర్త యెప్పుడువిన్నాడు? ఇట్లానేస్మృతి. ఇవే అయోమయపునిస్సారపు మాట లంటున్నాను.

"వినబడియె నొక్కసూక్తి హృద్వివరమందు
 స్మృతులు మాని ముక్కోటిదేవతల వదలి



బ్రహ్మ విష్ణు రుద్రుల బరిత్యజించి
అగ్నిముఖమున బురుషుని నరయుమనుచు" (భారతీ.ధ్యానగీత)

అని ధ్యానగీత కర్త అన్నాడు.

అగ్నిముఖాన ఆరయమంటే యజ్ఞంచేయమనా? అగ్నిలోనిల్చోని తపస్సుచేయమనా? పార్శీలవలె అగ్నిపూజచేయమనా? అగ్నిలోవుండే జ్యోతిస్సునే బ్రహ్మమనుకోమనా? బ్రహ్మమునకు అగ్ని ముఖమనా? చెప్పదలచినది స్పష్టంగా చెప్పగల బలంలేని భీరుత్వంవల్ల యిట్లాటి అయోమయపు ధోరణి దిగుతున్నది.

"కలవిహంగమ పక్షముల దేలియాడి
 తారకామణులలో దారనై మెరసి
 మాయమయ్యెదను నామదురగానమున
 మొయిలు దోనెలలోన బయనంబొనర్చి
 మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి
 పాడుచు జీన్కునై పడిపోదునిలకు
 పక్షినయ్యెద జిన్ని ఋక్ష మయ్యెదను
 మధుపమయ్యెద జంద మామనయ్యెదను
 మేఘమయ్యెద వింత మెఱపు నయ్యెదను
 అలరు నయ్యెద జిగురాకు సయ్యెదను
 పాటనయ్యెద గొండ వాగునయ్యెదను
 పవనమయ్యెద వార్దిభంగమయ్యెదను" (కృష్ణపక్షం)

ఇవన్నీ అయోమయపు మాటలు. ఈ కృష్ణపక్షకర్తయిట్లా తుమ్మెదఅయి, మేఘమయి. గారడిచేస్తుంటే చూడవలెనని నేను కుతూహలపడుతున్నాను. కావ్యానందం లేకుంటే గారడీ ఆనందంతో నైనా తృప్తి పడతాను.

"ఓకుటిలపన్నగమ చెవియొగ్గివినుమ
 ఏను స్వేచ్ఛాకుమారుడ నేను గగన
 పథవిహారవిహంగమపతిని నేను

మోహనవినీలజలధరమూర్తి నేను
ప్రళయజంఝూప్రభంజనస్వామి నేను

ఎవ్వరని యెంతురో నన్ను ఏననంత
శోకభీకరతిమిర లోకైకపతిని
కంటక కిరీటధారినై కాళరాత్రి
మధ్యవేళల జీమూతమందిరంపు
గొలువుకూటాల నే కాంతగోష్ఠిదీర్చి
దారుణ దివాంధరోదన ధ్వనులశ్రుతుల
బొంగి పొంగియు నుప్పొంగి పొరలిపోవు
నావిలాపనిబిడగీతికావళీవి
రావముల నర్ధరాత్ర గర్భమ్ము మరియు
మరియు భీషణకాళిమోన్మత్తగాగ
జేయు తఱి నన్ను మీరు వీక్షింపలేదొ "

ఇది కూడా ఆకృష్ణపక్షంలోవున్న అయోమయధోరణే. వాస్తవంగా శోకభీకర తిమిరలోకైకపతు లెవరైనావుంటే ఇట్లా చెప్పుకోవడం అంతగా వుచితంకాదు. ఇట్లాటిమాటలను గురించే కాబోలు. "కంచుమోగునట్లు కనకంబుమోగునా" అని వేమన అన్నాడు. చిన్నప్పుడు వెంట్రుకలు మొగానికి కప్పుకోని "ఆం! నేను యెలుగొడ్డును" అని దడిపిస్తే మొగం తేరి పారజూచి "నీవు అన్నయ్యవుగావా" అన్నమాటలు జ్ఞాపకానికి వస్తున్నవి.

"ఏవియో ఘోర పవనార్బటీధ్వను లివె
 కర్మకుహరాంతరస్థలిం గలత బరచు
 ధూమపావకజ్వాలల నొదిగియుండి
 భూత పైశాచములు నన్నుఁ బొడుచుచుండు."

అని భూతాలూ పైశాచాలూ విడివడి బాధిస్తున్న యామర్తి సూర్యప్రకాశరావువారిమాటలు ఈప్రళయజంఝూప్రభంజనస్వామి అయోమయపు కోటిలోని వేనని చూపి ఈచర్చ ముగిస్తున్నాను. ఇఘ యీ అయోమయపుమాటలను గురించి చర్చించడం అనవసరం. బుద్ధి అపరిణతమై వున్నప్పుడూ, చెప్పదలచినది చెప్పడానికి బలంలేని భీరుత్వం తమస్సు ఆవరించివున్నప్పుడూ, చెప్పవలసినదేమీ లేనప్పుడూ, ఉన్నది మామూలు అభిప్రాయమై దాన్ని యేమేమో మెలికలువేసి ఆత్మవంచనకు ఆరంభించినప్పుడూ, యీఅయోమయం దిగుతుందని చెప్పి చాలిస్తున్నాను. యెంతో జ్ఞానాన్ని దేశం నిండా వెదజల్లిన వేమన ప్రభృతులు సయితం

"నీరు కారమాయె కారంబు నీరాయె
 కారమైన నీరు కారమాయె
 కారమందు నీరు కడురమ్యమైయుండు
 విశ్వదాభిరామ వినురవేమ. (వేమ)
 
 బ్రహ్మ గుఱ్ఱమాయె భవుడు పల్లంబాయె
 నాది విష్ణు లెన్న నంకె నాయె
 నందు మీదివాడు ఆడదో మొగవాడొ
 విశ్వదాభిరామ వినురవేమ" (వేమ)

"మొనలుమీదుగ తలలుకిందుగ మొలచియున్నది వృక్షమూ
 మోదమలరగ మంట మీదను మదగజము విహరించెరా
 చిదిమి పట్టిన బంటుకైవడి చీమయేనుగు మింగెరా
 విర్రవీగుచు కేక వేయుచు యోగమంచము మింగెరా
 గొర్రెయొక్కటి అయిదుపులులను గొట్టి నెత్తురుదావెరా
 చిర్రిచెట్టున జాజిపూవులు శ్రీకరంబుగ పూచెరా
 మర్రిపై కదళీఫలంబులు మళ్లూరిరామదయానిధే.
 కొంచమౌ నొకగృహములోపల కోటిసింహము లుండెరా
 అంచితంబుగ నన్నిటిని యొకసామజంబు వధించెరా
 పంచవన్నెల చిలుకలైదొక పర్వతము భక్షించెరా
 మంచి తత్వజ్ఞానమిది మళ్లూరిరామదయానిధే.
 ఒంటిపాటుల రెండుకోతులు జంటపిల్లుల నీనెరా
 కంటి నని ఒక నక్కకడుపున కామధేనువు పుట్టెరా

 
వింటి నని ఒక మొసలినవ్వుచు వీధిపఱుగులు బారెరా
మానసంబున మనుజుడొక్కడు మాను నమలుచునుండెరా
కాని కానిమ్మనుచు దోమలు కనకగిరి కదలించెరా

నిరుపమాంబుధి చంద్రమళ్లూరి వీర రాఘవదయానిధే" (కా.త) అని యిట్లా చెప్పినమాటలు నేటికి అయోమయమై సమస్యలకిందికి దేలి ఉద్దిష్టప్రయోజనానికి దూరమై వున్నవి. సర్వలోకం సంశ్రయించ దగినవిజ్ఞానాన్ని ప్రసాదించిన శంకరప్రభృతులు తమసిద్ధాంతాలను అయోమయత్వంలోకి దింపలేదు. గనుకనే దిగంతవ్యాప్తమై వున్నవి. శ్రీభాగవతకవి యీతీరుగా అన్యాపదేశంగా పురంజనోపాఖ్యానం జెప్పి చివర కది అయోమయమవుతుందని తలచి కాబోలు తానే దాన్ని విపి వినిపించాడు.

పూర్వపక్షం

.

అవునండీ, మీరది అయోమయమంటారు; ధ్యానగీతలో ప్రతిక్రియలో కృష్ణపక్షపు ప్రభంజనస్వామిలో అంతరార్థమున్నదని మేమంటాము అని వాదిస్తారా?

సమాధానం.

చెప్పుతున్నాను. ఆఅంతరార్థాన్ని ఢీకొనే అంతరార్థం నా విచారణలో కూడా వున్నదంటాను. మీ రది విప్పినప్పుడు నే నిది విప్పుతానంటాను. ఈమాటలకు తలా తోకా లేదు. యేమైనా అంతరార్థం వుంటే దాన్ని యెందుకు కప్పిపెట్టవలె నని ప్రశ్నిస్తున్నాను. యేమైనావుంటే దాన్ని విప్పి చెప్పండి అని కోరుతున్నా ను. చెప్పే దాక ఆవి అయోమయమ్మాట లంటున్నాను. విప్పి చెప్పినప్పుడు అవి యెంతవరకు వుచితమో మళ్లీ ఆమాటలమీద వేరే విచారణచేస్తాను.

అస లింతకూ విప్పడానికి ఇవి సమస్యలుగావు; తిరుమలేశ పద్యాలుగావు; సౌందర్యభావన దర్శనమాత్రాన్నే కలుగ వ లెనుగాని కండ్లూ, ముక్కూ. చెవులూ, కండ్లకు దగ్గిరగాపెట్టుకొని చెక్కిపై తోలుతీసి పరీక్షిస్తే సౌందర్యస్పురణానికే మూలక్షయం కలుగుతుంది.

ఆక్షేపం.

ఇవి యీకాలంలో తెలియవు. ముందుకాలంవారుగాని వీటిలోతు కనుక్కోరు. అందుకే భవభూతి

"కాలో హ్యయం నిరవధిర్విపులా చ పృథ్వీ" (మాలతీ) అన్నాడు అని అంటారా?

సమాధానం.

చెబుతున్నాను; అది అసంబద్ధం. తనకావ్యాన్ని కొందరు గౌరవించకపోతే మీరు కాకుంటే మీతరువాతవారు దాన్ని గౌరవిస్తారు అని అన్నాడు.

"ఏకో రసః కరుణ ఏవ" (ఉత్తర)

అనే యిట్లాటి నూతనసిద్ధాంతాలను వారు అంగీకరించకుంటే వాటిలో సత్యమే ఉన్నట్లయితే ముందు వారంగీకరిస్తారని అతడి అభిప్రాయం. అంతేగాని భవభూతి తననాటకాలను అయోమయంగా వ్రాసిముందువారి కివి తెలుస్తవనలేదు. భవభూతినాటకాల్లో యెక్కడా యేమాత్రం అయోమయత్వం లేదు. ఒక వేళ ముందుకాలపువారి కని ఒప్పుకుందాము. అవి ముందుకాలపువారికే అయితే యిప్పుడే అచ్చువేయించి అమ్మడం యెందుకు? యీమాటల కర్థం మారింది గనుక అవిముందుకాలంవారికి తెలుస్తవంటారా? ఆమారిన అర్థాలెవరికీ తెలియకుండా పద్యకర్త కొక్కడికే యిప్పు డెట్లా తెలిసినవి? ముందు కాలపు వారి భాష వీరికెట్లా వినబడ్డది? వీరు కొత్తగా అయోమయపు భాషను సృష్టించారంటారా?

|"నిత్యాః శబ్దార్ధసంబంధాః" (వాక్యా) అని శబ్ద తత్వజ్ఞులు చెప్పుతున్నారు.

పతంజలి "కుంభకారకులం గత్వా" (మహా) అన్నట్లు భాషనెవరూ చేయలేరని భారతీయులసిద్ధాంతం. ఒక వేళ చేస్తారని వొప్పుకున్నా దీన్ని ముందుకాలపువాండ్లు యెట్లా నేర్చుకుంటారు? సాధనాలు వేరే యేర్పరచారంటారా? వీటికి ప్రామాణ్యమేమిటి? వీటిని ముందు కాలపువారు అంగీకరిస్తారని నియమమేమిటి? పోనీ అట్టాటి వేమైనా వుంటే మాకెందుకు ప్రసాదించగూడదు? ముందుకాలపువాండ్లు యింకా తెలివిగలవాండ్లవుతారు గనుక, వారికి తెలుస్త వంటారా? అది అసంబద్దం. పాణిని పతంజలి ప్రభృతులు వ్రాసిన శాస్త్రాలను యెన్నో సంవత్సరాలు పరిశ్రమజేసి సంస్కారవంతుల మవుతున్నాము. వెనకటి కాలపువారికంటే ముందుకాలపువారు యెక్కువ బుద్ధిమంతులనడం అనుచితం. సొట్యశాస్త్రంలో

"భవిష్యతి యుగే ప్రాయో భవిష్యంత్యబుధా నరాః" (భ.నా)

భవిష్యత్కాలంలో నరులు అబుధులవుతారు అని భరతుడు అన్నాడు పోనీయండి. ముందు రాబొయ్యేవారికంటె యిప్పటివారు తెలివితక్కువవారనే వొప్పుకుందాము. ఈ తెలివి తక్కువ వారికే దాన్ని విప్పి చెప్పండి అంటున్నాను. చెప్పినా తెలియదంటారా? తెలిసేటట్టు చెప్పండి.

వక్తురేవ హి తజ్జాడ్యం శ్రోతా యత్ర న బుద్యతే.”}}
(వినేవాడికి తెలియకపోవడం వక్తయొక్క జాడ్యమేను).

అని పెద్దలుచెప్పుతున్నారు. అధికారులు లేరంటారా? ఒకరైనాలేరా? కొందరు భీరువులై అటుభార్యకు తగిలేటట్లు యిటుదేవతకు తగిలేటట్లు అయోమయంగా రచిస్తున్నారు. వ్రాయదలచుకుంటే నిర్బయంగా జగన్నాథాదులవలె భార్యనుగురించి వ్రాయండి. లేదా దేవతమీద భక్తిని శ్రీగుణరత్న కోశం, సౌందర్యలహరి మొదలయినవాట్లోవలె కనబరచండి. ఇదే ఉత్తమమార్గం. భీరుత్వం. అయోమయం ఆధమమంటున్నాను.

ఆక్షేపం.

అవునండీ, చెప్పవలసినది లేనప్పుడు వ్రాస్తే అయోమయ మంటారు. చెప్పదలచుకున్నది చెప్పడానికి కావలసిన బలం లేనప్పుడు వ్రాస్తే అయోమయ మంటారు. వచ్చీరాని సంస్కృతంవ్రాస్తే అయోమయ మంటారు. అభిప్రాయము మామూలుదై దాన్ని మెలికలువేస్తూవ్రాస్తే అయోమయ మంటారు. ఈ అయోమయమైనా వ్రాస్తే మంచిది గదా. యేమీ వ్రాయకుండావుంటే వాఙ్మయం యెట్లా వృద్ధిఅవుతుంది? అని అంటారా? "

సమాధానం.

చెప్పుతున్నాను; అయ్యో! కవిత్వంవ్రాసేవాండ్లు లేరే అని దుఃఖించి కవిత్వంవ్రాయవద్దు. యేమీ వ్రాయకుండావుంటే యేమీ మునిగిపోలేదు. మనకు కాళిదాసాదులకవిత్వం యుగయుగాలవరకూ ఆనందపారవశ్యం కలిగించగలిగినది వున్నది. కవిత్వం లేదుగదా అనీ దుఃఖపడవలసిన పని లేదు. ఇఘ ఆంధ్రులను పవిత్రులను జేసి సర్వభారతవర్షానికీ సర్వలోకానికీ సందేశమిచ్చే కవిత్వం పద్యరూపానగాని గద్యరూపానగాని వస్తుందా దాన్ని ఆంధ్ర దేశం శిరసావహించగలదు, కాని యిప్పుడు కవిత్వం కొరతగా వున్నదని దుఃఖపడి మాత్రం వ్రాయవద్దంటున్నాను.

అని శ్రీ...ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో అయోమయత్వాధీకరణం సమాప్తం.

శ్రీ ర స్తు.

వాఙ్మయ పరిశిష్ట భాష్యం

పులుముడుఘటనాధికరణం.

పులమడం.

నేటి కాలపు కవిత్వంలో పులమడం విశేషంగా కనబడుతున్నది. పులమడమనేది గొప్ప కావ్యదోషం. దీన్ని ముందు వివరిస్తాను. తేలిక రంగులతో కొద్దిగీతలతో గొప్పభావాలను ప్రకటించే చిత్రకారుడివలె. కవి, చెప్పినమాటల అర్థంకంటె ఆమాటవల్ల స్ఫురించే భావ విశేష పరంపర అమేయమై వుండేటట్లు గోచరింపజేస్తాడు.

"ఏవంవాదిని దేవర్షౌ పార్శ్వే పితురధోముఖీ."
 లీలా కమలపత్రాణి గణయామాస పార్వతీ." (కుమా.)

(దేవర్షి నారదుడు పార్వతీపరమేశ్వరుల వివాహప్రశంసచేయగా తండ్రి పార్శ్వాన కూర్చున్న పార్వతి తలవంచి చేత్తో లీలారవిందపు రేకులు లెక్క పెట్టింది. ) అన్నప్పుడు పార్వతి లజ్జా, ఆమాటలు వినడం వల్ల ఆమెకు కలిగిన ఆనందం, ఆమె సౌశీల్యం, వినయసంపదా, ఆత్మనిగ్రహం, భవిష్యత్సంయోగదర్శనచిత్తప్లుతీ, యేతజ్జాతీయమనోవిభ్రమాలెన్నో గోచరిస్తున్నవి.

"అపూర్వకర్మచండాల మయి ముగ్ధే విముంచ మాం,
 శ్రితాసి చందన భ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం" (ఉత్తర)

("ఓముగ్ధా! అపూర్వకర్మ చండాలుణ్నైన నన్నిఘవదలు. చందన మనుకొని దుర్విపాకమైన విషవృక్షాన్ని ఆశ్రయించావు" అని రాముడు తొడమీద నిద్రిస్తున్న సీతను జూచి అన్నప్పుడు రాముడి ధర్మపరత్వం సీతావియోగదుఃఖం, ధర్మంయొక్క నిష్ఠురత్వం, లౌకిక సుఖోపలబ్దికోరే వారు ధర్మారాధనలో పొందే ఆశాభంగం, విధియొక్క అజ్ఞాతపరిణామ వికల్పాలూ, ఇట్లా ఒక విశిష్టభావప్రపంచం శ్రోతయొక్క మనః పరిణతిననుసరించి సంకోచవికాసాలుపొందుతూ లీలామాత్రంగా గోచరిస్తుండడం సహృదయవేద్యం. ఇదే కావ్యసౌందర్య విభుత్వం. ఒక వస్తువు యొక్క సౌందర్యమహిమ లభ్యాలభ్యమై దృశ్యాదృశ్య దశయందులీలా మాత్రంగా గోచరిస్తున్నప్పుడు పరమోన్నతి పొందు తున్నది. దీన్నే --

"ప్రతీయమానం పునరన్యదేవ
 వస్త్వస్తి వాణీషు మహాకవీనాం". (ధ్వన్యా)

(మహాకవులవాక్కులలో ప్రతీయమానమయ్యేవస్తువు మళ్లీ వేరేవున్నది.)

"సర్వధా నాస్త్యేవ సహృదయహృదయహారిణః కావ్యస్య సప్ర కారో యత్ర నప్రతీయమానార్థసంస్పర్శేన సౌభాగ్యమ్" (ధ్వన్యా).

(ధ్వనించే అర్ధసంస్పర్శచేత సౌందర్యం లేనటువంటి సహృద హృదయహారికావ్యప్రకారమే సర్వధాలేదు.)

అని సాహిత్యవేత్తలు స్తుతిస్తున్నారు.

ఇట్లా అమేయమై, అమితమై శ్రోతయొక్క పరిణతి ననుసరించి సంకోచవికాసాలు పొందుతూ దృశ్యాదృశ్యదశయందు లీలామాత్ర గోచరమై సౌందర్యపిపాసువుల చిత్తవృత్తికి విశాలావకాశాన్ని ప్రసాదించే కావ్యరచనను సాహిత్యవేత్త లారాధిస్తున్నారు. దీన్నే ధ్వని ఆని కావ్య వేత్తలు చెప్పుతున్నారు. దీని ప్రాధాన్య మిట్లాటిది గనుకనే

"ధ్వని సత్కావ్యముత్తమమ్." (సాహిత్య)

అని విశ్వనాథుడు వినిపిస్తున్నాడు.

ఇంత పరిపాకవంతమైనది గనుకనే దీన్ని భారతీయసాహిత్య వేత్తలు ఉత్తమమయినదంటున్నారు.

"ప్రాప్తపరిణతీనాం తు ధ్వనిరేవ ప్రాధాన్యేన కావ్యమితి స్థితం". (ధ్వన్యా) అని ఆనందవర్ధను డంటున్నాడు.

ఇట్లానే తక్కిన సాహిత్యవేత్త లందరు చెప్పుతున్నారు; కాళిదాసాదుల కావ్యాలీ ఉత్తమత్వాన్నే పొందివున్నవి. ఆకాలంనాటికి వికసితమైన సర్వవిజ్ఞానం బలప్రదమై వుండగా సర్వభావాలకు మొదట వశుడై పిమ్మట సర్వభావాలను వశంచేసుకొని సత్వతేజస్సుతో వెలసే దశయందే ఈఉత్తమకవితాసిద్ధి కలుగుతున్నది, ఇట్లాటి కవితాదశ సర్వ --లోనే కాళిదాసాదుల కేకొద్దిమందికో తప్ప మిక్కిలి అరుదుగా గోచరిస్తున్నది. కనుకనే--

"నరత్వం దుర్లభం లోకే విద్యా తత్ర సుదుర్లభా,
 కవిత్వం దుర్లభం తత్ర శక్తి స్తత్ర సుదుర్లభా." (అగ్నే.)

అని ఆగ్నేయపురాణకారు డన్నాడు.

"యేనాస్మిన్నతివిచిత్ర కవిపరంపరావాహిని సంసారేకాళిదాస
 ప్రభృతయోద్విత్రాః పంచషావామహాకవయ ఇతి గణ్యన్తే"
                                                              (ధ్వన్యా)

(ఈ అతివిచిత్ర కవిపరంపరా చక్రంలో కాళీదాస ప్రభృతులు ఇద్దరు ముగ్గురు లేదా అయిదారుగురు మాత్రమే మహాకవులని పరిగణితులవుతున్నా రు.)

అని అన్న ఆనందవర్ధనుడు ఈ అభిప్రాయాన్నే తెలుపుతున్నాడు.

"కవయః కాళిదాసాద్యాః కవయో వయమప్యమీ,
 పర్వతే పరమాణౌ చ పదార్థత్వం వ్యవస్థితం."

(కాళిదాసాదులూ కవులు, మేమూ కవులమే పర్వతమూ పదార్థమే, పరమాణువూ పదార్థమే.)

అని కవితాతత్వజ్ఞులంటున్నారు.

"పురా కవీనాం గణనాప్రసంగే కనిష్టికాధిష్ఠితకాళిదాసా.
 అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతీ బభూవ."

(కవులసామర్థ్యం గణించేటప్పుడు మొట్టమొదట కాళిదాసు పేరుచెప్పి కనిష్ఠికను గణించారు. కాళిదాసు తరవాత అతనికి ద్వితీయుడుగా వుండదగ్గకవి కనబడలేదు. ఇప్పటివరకూ కనబడలేదు. గనుకనే కనిష్ఠికతరువాతి వేలు పేరులేకుండా అనామిక అని అర్థవతిఅయింది.) అని స్తుతిస్తున్నారు.

"నిర్గతాసు నవా కస్య కాళిదాసస్య సూక్తిషు,
 ప్రీతిర్మధురసార్దాసు మంజరీష్వివ జాయతే" (హర్ష)

మధురసార్ద్రలైన పూలగుత్తులయందువలె నిర్గతమైన కాళిదాససూక్తులయందు యెవరికి ప్రీతి జనించదు?)

అని బాణుడూ,

"కవికులగురుః కాళిదాసః" (ప్రస)
 (కవికులగురువైన కాళిదాసు)}}

అని జయదేవుడూ,

"దాసతాం కాళిదాసస్య కవయః కే న బిభ్రతి." (మధు )

(యేకవులు కాళిదాసుకు దాసులుకారు?) అని గంగాదేవీ ఆ ఉత్తమకవితాస్వరూపాన్ని ఆరాధిస్తున్నారు. అకవిత్వస్వరూపం గోచరించడానికి సయితం అంతటి సంస్కారం బుద్ధికి కావలసివున్నవి. కాని, కాళిదాసాదుల ఆ ఉత్తమ కావ్యాలను అపరిణతులైన బాలవిద్యార్థుల పాలుచేసి వారికి మొదటనే రఘువంశం ఆరంభంచేసి, తరతరాలుగా మనమీకవితా దేవిని నిరసించాము. విద్యార్థి లోకాన్ని వంచించి మనంవంచితులమైనాము.

"తస్మై నమః కర్మణే." (త్రిశం.)

అని భర్తృహరి అన్నట్లు కర్మఫలం మనకు అనుభూతమయింది. ఆ నిరాసానికి ఘోరశిక్షగా కవితాస్వాదనశక్తే జాతికి నశించింది. ఇది వేరేవిషయం. స్థలాంతరంలో దీన్ని పూర్తిగా మిమాంసచేశాను గనుక విస్తరభీతిచేత దీన్ని వదలుతున్నాను. లభ్యాలభ్యమై దృశ్యాదృశ్యదశలో లీలామాత్రంగా గోచరిస్తూ పిపాసువుల చిత్తవృత్తికి ప్రత్యక్షవాక్కులచేత గృహీతమైనప్పుడు మేయమై, మితమై, సౌందర్యతృష్ణను కుంఠితం చేస్తున్నది. కనుకనే "పరిమితస్వరూపాః" అని యిట్లాటి కావ్యబంధాలను గురించి ఆనందవర్థనుడన్నాడు. ఇట్లాభావాన్ని మితంజేసి భావ విభుత్వాన్నితగ్గించేది ఉత్తమత్వంనుండి తప్పక పతితమవుతున్నది. కనుకనే యిట్లాటిదాన్ని మధ్యరకంలో చేర్చారు.

"వ్యంగ్యస్య అప్రాధాన్యే మధ్యమం గుణీభూతవ్యంగ్యమితి గీయతే" (ప్రతాప.) |

(వ్యంగ్యార్థం అప్రధానమైనప్పుడు ఆకావ్యం గుణీభూత వ్యంగమవుతున్నది. అది మధ్యమకావ్యం) అని విద్యానాథు డంటున్నాడు.

భవభూతి

"రే హస్త దక్షిణ మృతస్య శిశోర్ద్విజస్య
 జీవాతవే విసృజ శూద్రమునే కృపాణం.
 రామస్య గాత్రమసి నిర్భరగర్భఖిన్న
 సీతావివాసనపటోః కరుణా కుతస్తే." (ఉత్తర.)}}

అని చెప్పినది గుణీభూతవ్యంగ్యమే అయివున్నది.

రాముడిగాత్రమగు నీకు కరుణయెక్కడిది అంటే, రాముడు నిష్ఠురత్వం, సీతావివాసనపటుత్వం, ధర్మం కొరకు అవలంబించే కాఠిన్యం ఈతీరున శ్రోతృపరిణతి ననుసరించి ఒక భావపరంపర గోచరిస్తుంది. కాని "నిర్బగర్భఖిన్న సీతావివాసనపటోః" అని ఆభావాన్ని సాక్షాత్తుగా విప్పిచెప్పి మితంమేయంజేశాడు.

అయితే ఆమాటలయినా మితంగా సహృదయులకు ఆస్వాద్యంగా చెప్పబట్టి మనోజ్ఞత్వాన్ని సంపూర్ణంగా కోల్పోలేదు గనుక యివికూడా రెండవరకంగా, ఆనందజనకమయ్యే వున్నవి. అందుకే

"రమణీయాస్సనో వివేకినాం సుఖావహాః" (ధ్వన్యా.)}} అని ఆనందవర్ధనుడు గుణీభూతవ్యంగ్యాన్ని గురించి ప్రస్తావించిన సందర్భంలో అన్నాడు. అదిగాక రసాది తాత్పర్యానుసంధానంచేత గుణీభూతవ్యంగ్యంగూడా ధ్వనిరూపం పొందుతున్న దని

"ప్రకారోయంగుణీభూతవ్యంగ్యోపి ధ్వనిరూపతాం,
 ధత్తే రసాదితాత్పర్య పర్యాలోచనయా పునః (ధ్వన్యా)}]

(రసాదితాత్పర్యపర్యాలోచనచేత గుణీతవ్యంగ్యంగూడా ధ్వని రూపాన్ని వహిస్తున్నది.)

అనే పఙ్త్కులవల్ల ధ్వనికారుడు వినిపిస్తున్నాడు.

ఆకాలానికి వికసితమైన విజ్ఞానపరిపాకం బలప్రదమవుతూ, సత్వప్రాధాన్యం కొంత అణగి రజఃప్రాబల్యంతో భావం నడిచేదశలో గుణిభూతవ్యంగ్యరూపమైన ఈమధ్యమకవిత ఉత్పన్నం కాగలదు.

ఈ కాలపుకృతుల్లో ఈ గుణీభూతవ్యంగ్యకోటిలో చేరేవి. కొమాండూరి కృష్ణమాచార్యుల పాదుకాస్తవంవంటివి కొన్ని మాత్రమే కనబడుతున్నవి. వీట్లో సయితం విస్తరం, వికారాలు, అయోమయత్వం, వక్ష్యమాణశబ్దవాచ్యతా, వుంటే దోషసహిత మే అవుతున్న వి. కృష్ణపక్షం, యేకాంతసేవ ఇట్లాటివి గుణీభూతవ్యంగ్యత్వంవద్దగూడా ఆగక ఇంకా దిగిపోయినవి. ఆసంగతి ముందు తెలుపుతాను.

ఈ కాలపు కవిత్వంలో పులుముడుదోషం విస్తరించి వున్నదన్నాను. దాన్ని క విశదీకరిస్తాను.

పులుముడు.

ఇదే నేటికాలపుకృతుల్లో విశేషంగా కనబడుతున్నది. పులమడ మంట యేమో చెప్పుతాను. నిపుణుడైన చిత్రకారుడు సాధ్యమైనంతవరకు రంగులు తక్కువగా ఉపయోగించి అఖండమైన భావాన్ని ప్రకటిస్తాడు. ఆప్రౌఢిమలేని గుజీలిమనిషి పటంనిండా గాఢంగారంగులు వులుముతాడు. గాఢంగా రంగులు పులమడంవల్ల చిత్రసౌందర్యవివేచనం లేనివాండ్లకు ఆపటాలు రంజకంగా వుండవచ్చునుగాని మనం సౌందర్య జిజ్ఞాసువులమైతే పులుముడు రంగులపటాన్ని అధమమని నిరాకరిస్తాము. కృతుల్లోగూడా ఉత్తమకవులు కాళిదాసాదులు కొద్దిమాటల్లో అమేయార్ధాన్ని స్ఫురింపజేస్తారు. చెప్పినమాటల అర్థంకంటె ఆమాటలవల్ల స్ఫురించే భావవిశేషపరంపర అమేయమై గోచరిస్తూ వుంటుంది. తనమాటలను తాము నిల్పుకొన్నా నిల్పుకోకపోయినా

"అల్పాక్షరముల ననల్పార్ధరచన" (బసవ)

అని పాల్కురికి సోమన్న ఉత్తమకవిత్వాన్ని కీర్తించాడు

"యావదర్ధపదాం వాచమేవమాదాయ మాధవః
 విరరామ మహీయాంసః ప్రకృత్యా మితభాషిణః" (మాఘ)

(మాధవుడు కావలసినంతవరకే మాట్లాడి చాలించాడు గొప్పవారు ప్రకృతిచేతనే మితభాషులు ) అని ..

"నైతల్లఘ్వపి భూయస్యా వచో వాచాతిశియ్యతే
 ఇంధనౌఘధగప్యగ్నిః త్విషా నాత్యేతి పూషణం" (మాఘ)

(ఆసంభాషణ కొద్దిదైనప్పటికి విస్తరించివుండేమాటలు దాన్ని అతిశయించలేదు కట్టెలను మండించేదైనప్పటికీ కాంతిచేత అగ్ని సూర్యుణ్ణిమించదు). అని మాఘుడు రెండవసర్గలో మితోక్తుల మహిమను కొనియాడుతాడు.

లోకంలో సయితం సాధ్యమనంత కొద్దిశ్రమతో సాధ్యమైనంత గొప్పపనులు నిర్వహించడం ఉత్తమమార్గమనీ వృథాగా ధనం శక్తి వ్యయంచేయడం అధమమార్గమని ప్రసిద్ధంగానే వున్నది. విశిష్ట భావప్రపంచాన్ని గోచరింపజేసేది ఉత్తమకవిత్వమన్న సంగతి యిదివరకే నిరూపించాను. ఉత్తమమార్గానికి దూరులై గాఢంగా రంగులు పులిమే గుజిలీబ్నొమ్మల కర్తలవలె ఒక్క భావాని కెన్నోమాటలు గుప్పించి అర్థవిభుత్వాన్ని అంతంజేసి మాటలు దండగజేయడం పులమడం. దీన్నే వాచ్య మని అధమ మని భారతీయసాహిత్య వేత్తలు నిరసించారు.

    "వ్యంగ్యస్య అస్ఫుటత్వే అధమం కావ్యం (ప్రతాప)

అని విద్యానాథుడన్నాడు.

"ప్రాథమికానాం అబ్యాసార్ధినాం యది పరం చిత్రేణ వ్యవహారః
 ప్రాప్తాపరిణతీనాం తుధ్వనిరేవ ప్రాధాన్యేన కావ్యమితి స్థితం"

అని ఆనందవర్ధను డంటున్నాడు.

'అధమం యథా" అని

స్వచ్చందోచ్చలదచ్చకచ్చకుహరచ్ఛాతేతరాంబుచ్చటా
మూర్చన్మోహమహర్షిహర్షవిహితస్నానాహ్నికాహ్నాయ నః
భిద్యా దుద్యదుదారదర్దురదరీదీర్ఘా దరిద్రద్రుమ
ద్రోహోద్రేకమహోర్మిమేదురమదా మందాకినీ మందతాం (కావ్య)

(స్వచ్చందంగా పైకిలేస్తూ నిర్మలతీరనిమ్న ప్రదేశాల్లో అచ్చిన్న మైన నీటిసమూహంవల్ల పోతూవున్న మోహంగల మహర్షులచేత సంతొషంతో విహితమైన స్నానాహ్నికాలు గలదీ యెగిరే అద్బుతమైన కప్పలుగల తటాకందరాల్లో విజృంభిస్తున్న గొప్పఅలలచే సాంధ్రమైన మదంగలదీ అయిన మందాకిని మామాంద్యాన్ని పోగొట్టుగాక) దీన్ని యీఅధమకవిత్వానికి ఉదాహరణంగా కావ్యప్రకాశకారుడు మమ్మటుడు కనబరచాడు.

"అపూర్వకర్మచండాలం అయి ముగ్దే విముంచ మాం
 శ్రితాసి చందనభ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం" (ఉత్తర)

అని భవభూతి తెలిపిన భావాన్ని

"ఓ మౌగ్ధ్యగుణవిలసిత అయినా సీతా! నేను చండాలుడు సైతం చేయలేని నిష్ఠురకార్యాలు ధర్మంకొరకు ఆచరిస్తున్నాను. అట్లాటి నన్ను లౌకికసుఖోపలబ్దికొరకు ఆశ్రయించి తప్పక వ్యర్ధమనోరధ వయినావు చీ! నేను మహాఘోరపాపిని. అవ్యాజప్ర్రేమతో దుర్గమకాంతారాల్లో నాపాదాలను ఆరాధించిన సీతను విడుస్తున్నాను అహో! సీతా! ధర్మనిష్ఠురతచేత కిరాతుడనైన నన్ను నీవు భ్రాంతివశాన వరించావు" అని యీతీరున వాచ్యంజేసి మాటలు కుక్కడం పులమడం. ఇది కావ్యంలో అధమమార్గం.

"లీలాకమలపత్రాణి గణయామాస పార్వతీ" (కుమా)

అని కాళిదాసు తెలిపిన భావాన్ని "మనోహరలజ్జాలావణ్యసూచకంగా మధుర ప్రణయమనోజ్ఞమైన హృదయంతో దివ్యసౌందర్యవిలిసిత పార్వతి మధురహస్తాబ్జాలతో మధురకమలపత్రాలను మధురంగా గణనచేసింది" అని మాటలు పులమడం అధమకవిత్వం. చిత్తం తమోగుణ బహుళమై పరిణతి హీనమైనప్పుడు ఈఅధమకవిత్వం వెడలుతున్నది. మనజాతికి ఇప్పుడీస్థితే బహుళంగా నాకు కనబడుతున్నది.

ఈకాలపు కృతులనేకాలు ఈఅధమకోటిలోనే చేరుచున్నవి

"మధురమోహనమూర్తి మందహాసమున
 నద్భుతంబుగ లీన మైనట్టులుండ
 మధురహాసంబులో మాధురీప్రకృతి
 యానంద ముద్రిత మైనట్టులుండె
 మధురచంద్రికలలో మధురామృతంబు
 మధురామృతంబులో మధురరసంబు
 మధురరసంబులో మధురబావంబు
 మధురబావంబులో మధురరూపంబు
 మధురరూపంబులో మధురతేజంబు
 మధురమోహనకళా మహితమైవుండ
 మధురస్వరంబులో మధురగీతములు
 మధురగానంబులో మదిమేళగించి" (యేకాంతసేవ)

అని యీతీరున అయోమయపు పులుముడు యేకాంతసేవనిండా కనబడుచున్నది. ఈతీరుగా యేకాంతసేవలోనే కాకుండా ఈకృతికర్తల రచనలన్నీ యిట్లాటిపులుముడుతోనే విస్తారంగా నిండివున్నవి. యేకాంత సేవలో మొదటనుండి చివరవరకూ అంతా పులుముడు పేరివున్నది వాటిని ఉదాహరించడమంటే పుస్తకమంతా ఉదాహరించడమే గనుక వదలుతున్నాను. ఆనందంతో పాడుతా ననడానికి

"చిత్త మానంద మయమరీచికలసోల
 హృదయ మానంద భంగమాలికలదేల
 కనుల నానంద జనితాశ్రుకణములూర
 జగము నిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు"

అని కృష్ణపక్షకర్త యిరవై రెండుమాటలను పులిమినాడు.

"శోకభీకరతిమిర లోకైకపతిని
 కంటకకిరీటధారినై కాళరాత్రి
 మధ్యవేళల జీమూత మందిరంపుఁ
 గొలువుకూటాల నేకాంతగోష్ఠితీర్చి
 దారుణ దివాంధరోదన ధ్వనులశ్రుతుల
 పొంగి పొంగియు నుప్పొంగి పొరలిపోవు
 నావిలాపనిబిడగీతికావళీవి
 రావముల నర్థరాత్రగర్భమ్ము మఱియు
 మఱియు భీషణకాళిమోన్మత్తగాగ"

అని కృష్ణపక్షంలో అయోమయానికి ఉదాహరించిన పద్యాలు"

"కన్నీటి కెరటాల వెన్నెలేలా
 నిట్టూర్పు గాడ్పులో నెత్తావియేలా
 ప్రళయకాలమహోగ్ర భయదజీమూతోరు
 గళఘోరగంభీర ఫెళ ఫెళార్బటులలో మెరపేలా?
 అశనిపాతమ్ములో నంబువేలా
 హాలాహలమ్ములో నమృతమేలా
 ప్రబలనీరంధ్రాభ్రజనితగాఢధ్వాంత
 నిబిడహేమంతరాత్రీకుంతలములలో జుక్కేలా?
 శిథిలశిశిరమ్ములో జివురేలా
 పాషాణపాళిపై ప్రసవమేలా

వికృతక్రూరక్షుధాక్షుభిత మృత్యుకఠోర
వికటపాండురశుష్కవదనదంష్ట్రాగ్నిలో నవ్వేలా?

అని నిదర్శనపరంపరకు ఉదాహరించిన పఙ్త్కులూ పులుమడే అయివున్నవి. ఇదివరకు చూపిన "ఐక్యమౌదామె" "వియోగరాగం" "కవితాంశ" పులుముడు దోషంతో కూడివున్నవి.

"ప్రాజ్యపీఠపురీమహారాజ్యబాగ్య
 లక్ష్మి కొలువుదీర్చు చిరత్న రత్న ఖచిత
 భాసమానకల్యాణ సింహాసనంబు
 అది వెలమ శౌర్యమూర్తిరణావనీవి
 హారవిక్రమ కేళికానంతరమ్ము
 శాంతినుండు విలాసవిశ్రామవేది
 అది సభాసీనసకలబుధావతంస
 ఘనకవీశానవిజ్ఞానకాంతిమత్ప్ర
 సన్నవీక్షణ స్నాపిత స్వర్ణపీఠి
 అది మహీపతిఆమరాయావనీంద్ర
 కరకమల వీజ్యమాన చామరసమీర
 పులకిత భవన్మృదుభూషితంబు"

అని ప్రాజ్య బాగ్య భాసమాన, కల్యాణ, శాంతినుండు, మహీపతి అని ఇట్లా యెన్నో అనావశ్యకశబ్దాల గుప్పించిన పులుముడు కృష్ఠపక్షంనిండా వున్నది.

"శారదశర్వరీమధురచంద్రికసూర్యసుతాస్రవంతికా
 చారు వినీల వీచిక ప్రశాంతనిశాపవనోర్మి మాలికా
 చారితనీపశాఖికకృశాంగిని గోపిక నేను" (కృష్ణపక్షం)

అని యీమాదిరి వున్నవన్నీ పులుముడే అయివున్నవి. సాధారణంగా ప్రాకృతస్త్రీలూ హీనులు పోట్లాడేటప్పుడేమీతోచక పొతే నోరువిప్పి పుట్టేదాకా అడ్డగోలుగా తిట్టుమీద తిట్టు పదితిట్లు తిట్టి వూరుకుంటారు. ఈధొరణే యేకాంతసేవలోను ఇంకా ఈకాలపు అనేకకృతుల్లోను కనబడుతున్నది.

"ప్రేమాలయంబులో ప్రియు డాడువేళ
 ప్రేమడోలికలలో ప్రియు డూగువేళ
 ప్రేమామృతాబ్ధిలో ప్రియుడీదువేళ (యేకాంతసేవ)

యేమితోచకపోతే 'పాడిందేపాటరా' అనికొంతసేపు మాటలు దండగబెట్టే పద్యకర్తల ధోరని యిది. కృష్ణక్షంలోని

"చిత్తమానంద మయ మరీచికలసోల
 హృదయ మానంద భంగమాలికలదేల
 కనుల నానందజనితాశ్రుకణములూర".

అనే పంక్తుల ధోరణిగూడా అదే

విస్తరదోషంకింద నేను ప్రస్తావించిన కూచి నరసింహకృత వనవాసిలోని పాత్రల ఉపన్యాసాలు. రామరాజులోని పటాను అంత్యోపన్యాసం బళ్ళారి కృష్ణమాచార్యుల సారంగధరాదుల్లో అదికప్రసంగాలు అన్నీ పులుముడే అయివున్నవి.

ఉత్తమకావ్యాలు సయితం నన్నయ ఆరంభించిన పద్యాల్లోకి దిగేటప్పటికి పులుముడు పాలై చెడిపోయినవి. ఈ సంగతి ప్రథమఖండంలో మీమాంసచేశాను. గనుక యిక్కడ వదలుతున్నాను అమేయమై. అమితమై శ్రోతయొక్క పరిణతి ననుసరించి సంకోచవికాసాలు పొందుతూ దృశ్యాదృశ్యదశయందు గోచరమై సౌందర్యపిపాసువుల చిత్తవృత్తికి విశాలావకాశం కల్పిస్తూ భావప్రపంచాన్ని ప్రసాదించే ఉత్తమకావ్యరచన అనేక కారణాలచేత లుప్తమయిపోయి వాచ్యరచనమాత్రం మనకు నేటికాలాన మిగిలింది.

ఈవాచ్యదశను దాటిని కృతు లీకాలపువి మిక్కిలి అరుదుగా నాకు కనబడుతున్నవి పులమడానికి ఉదాహరణాలు చూపడమంటే కృతులను సంపూర్ణంగా ఉదాహరించడమే అవుతుంది గనుక ఆపని యిక మానుతున్నాను అసలు గుంపుగణం ప్రకాశగణం, దండగ్గణం మొదలైన వన్నీ వికృతం చేస్తుండగా నన్నయతో ఆరంభమైన ఆంధ్ర పద్యాలే ఆదినుండి పులుముడు దశతో అధమంగా వస్తున్నవి. అయితే ఆగణాలు మాత్రం శ్రీనాథకృతుల్లోవలె కృష్ణకర్ణామృతాదుల్లోవలె కొంత తగ్గి నేటికీ ఆ పులుముడుమాత్రం స్థిరంగా వున్నది. గుంపుగణం మొదలైనవాటిని ప్రథమఖండంలో వివరించాను గనుక యిక్కడ తెలపక వదలుతున్నాను. ఉత్తమత్వ మట్లావుంచినా, ఈఅధమమైన వాచ్యత్వదశను దాటి మధ్యదశకువచ్చిన కావ్యాలే తెలుగులో అరుదని నే ననుకొంటున్నాను.

అని శ్రీ ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో పులుముడుఘటనాధి కరణం సమాప్తం

శ్రీ ర స్తు.

వాఙ్మయ పరిశిష్ట భాష్యం

శబ్ద వాచ్యతాధికరణం

శబ్దవాచ్యత

ఈకాలపుకృతుల్లో శబ్దవాచ్యత అధికంగా, వెగటుగా, కనబడుతున్నది. శబ్దవాచ్యత అంటే యేమోవివరిస్తాను. ఒకడు తెలివిగలవాడు శక్తిమంతుడు అయితే అవి అతని కృత్యాలవల్ల, వివేకం తెలిపే మాటల వల్ల లోకానికి వ్యక్తమవుతుంది. కాని, నేను తెలివి గలవాడను. గొప్పవాడను అని చెప్పుకొన్నంతమాత్రాన గాడు.

"బ్రువతే హి ఫలేన సాధవో నతు వాక్యేన నిజోపయోగితాం". |(నైష)

అని శ్రీహర్షు డీసత్యాన్నే తెలుపుతున్నాడు చెప్పుకొన్న మాత్రాన అతడు గొప్పవాడూ, తెలివిగలవాడూ అని లోకం అనుకోకపోగా అతడు రోతమనిషి అని అసహ్యపడుతుంది. ఇట్లా చెప్పుకొనడమే శబ్దవాచ్యత. కవి సయితం సృష్టివల్ల ప్రకృతి చేష్టాసంభాషణాదులవల్ల వ్యక్తమయ్యే భావపరంపర చేత తన కావ్యమాధుర్యాన్ని ఆనందాన్ని లోకానికి ప్రసాదించవలెగాని ఊరికె మధురం, దివ్యం, మంజులం, కోమలం అని చెప్పడంవల్లగాదు అది శబ్దవాచ్యత అయి రోత పుట్టుతుంది. ఈ కాలపుకృతికర్తల్లో అనేకుల కివివేకం లేనట్లు కనబడుతున్నది. మాతృమందిరమనే నవలలోదివ్య మధుర ఆనంద అనే మాటలు పుస్తకమంతటా నిండివున్నవి.

యేకాంతసేవలో మటుకు ఇందాక నేను పులుముడుకు ఉదాహరించిన

"మధుర మోహనమూర్తి మందహాసమున
 నద్భుతంబుగ లీన మైనట్టులుండ

మధుర హాసంబులో మాధురీ ప్రకృతి
యానందముద్రితం బైనటులుండె
మధుర చంద్రికలో మధురామృతంబు
మధురామృతంబులో మధురరసంబు
మధుర రసంబులో మధుర రూపంబు
మధురభావంబులో మధుర రూపంబు
మధుర రూపంబులో మధుర తేజంబు
మధుర మోహనకళామహితమై వుండ
మధుర స్వరంబులో మధుర గీతములు
మధుర గానంబులో మదిమేళగించి" (యేకాంతసేవ)

అనే పఙ్త్కుల్లో ఒక్క చోట 18 మధురలు వ్రాశారు

"ఒక్కింత యానంద ముండునుగాక
 సుఖరం బగుగాక శుభమగుగాక
 ఆనంద మగుగాక యందమౌగాక"

అని మూడు పఙ్త్కుల్లో రెండానందులు వేసి తరువాత మూడు పఙ్త్కులుదాటి మళ్లీ

"నిరవధికానంద నిలయమైవున్న"

అని ఆనందను మళ్లీ వేశారు. ఈ కాలపుకృతుల్లో అధికంగా మంజుల మధుర నవ్య దివ్యమృదు, విశ్వమోహన, ఆనంద మనోజ్ఞ అని కుప్పలుగా కనబడుతున్నవి. ఇదంతా శబ్దవాచ్యతే అవుతున్నది.

పూర్వపక్షం

అవునుగాని కావ్యం మధురమైనదని మనోజ్ఞమైనదని చెప్పడానికి ఈ మధురలను బంధురలను ప్రయోగించలేదు. కవి ఈ పదాలను ప్రయోగించి మార్ధవం మీదా మాధుర్యం మీదా తనకుగల అభినివేశాన్ని తెలుపుతున్నాడు అంతేగాదు ఆ సందర్భాల్లో మాధుర్యం మార్ధవం వ్యక్తమవుతున్నవని చెప్పుతున్నాడు అట్లానే కఠోరత్వాన్ని తెలపడానికి క్రూర, కఠోర అని యిట్లాటి మాటలను ప్రయోగిస్తున్నాడు. దీంట్లో దోషం లెదంటారా?

సమాధానం

చెప్పుతున్నాను; వాస్తవంగా మాధుర్యం మీదా మార్ధవం మీదా అభినివేశం వుంటే కథాసృష్టిలో ఆబావాలను గర్భితం జేసి ప్రకృతి చేష్టాదులవల్ల వాటిని తెలుపవలెనుగాని ఊరికె మధురం, మంజులం, బంధురం అని చెప్పడం చేతగాదు. చెప్పినంతమాత్రాన లోకం అనుకోజాలదని పైగా వెగటుపడుతుందని తెలిపినాను. ఈ ఔచిత్యం యెరిగిన వాడు గనుకనే కవికాళిదాసు తపోవనాల శాంతిని మాధుర్యాన్ని తేజస్సును అత్యంతం అరాధించేవాడే అయినా రాముడడిగినప్పుడు

"అదష్టనీవారబలీని హిం స్రైః సంబద్దవైఖానసకన్యకాని,
 ఇయేష భూయః కుశవంతి గంతుం భాగీరరథీతీరతపోవనాని"

(రఘు)

(క్రూరమృగాలు తినని నీవారబలులు గలిగి మునికన్యలకు ప్రీతిజనకమై. దర్భలతో కూడివున్న భాగీరథీతీర తపోవనాలకు పోవలెనని ఆమె కోరింది) అని అన్నాడు "దివ్యమై పవిత్రమై శాంతినిలయమై" అని యీతీరున శబ్దవాచ్యత పాలుగా లేదు.

పూర్వపక్షం

అవునుసరే; ఊరికే నేను తెలివిగలవాడను గొప్పవాడను అని చెప్పుకుంటే రోత అన్నారు. ఒప్పుకుంటాము. నిజంగా తెలివిగల పనులు చేస్తూ గొప్పకార్యాలు సాధిస్తూ నేను గొప్పవాణ్ని నేను తెలివిగలవాణ్ని అని చెప్పుకుంటేయేమి? అది సత్యమే గదా. శ్రీనాథుడు కాశీఖండంలో మేమారెడ్ది తన్ను గురించి

"ఈక్షోణిన్ నినుబోలు సత్కవులు లేరీనేటి కాలంబులో
 ద్రాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరోభామినీ
 వక్షోజద్వయ గంధసారఘుసృణ ద్వైరాజ్యభారంబున
 ధ్యక్షించున్ గవిసార్వభౌమభవదీయ ప్రౌఢ సాహిత్యముల్" (కాశీ.)

అని చెప్పినట్లు వ్రాశాడు.

భవభూతి

   "చేతస్తోషకరీ శిరోనతకరీ విద్యానవద్యాస్తి నః"

అని అన్నాడు అట్లానే మృదుత్వాన్ని మాధుర్యాన్ని వ్యక్తపరుస్తూ మధురం దివ్యం మంజులం అంటే మంచిదేను; అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను: శక్తిమంతుడేదో సందర్భం వచ్చినప్పుడు ఇతరులు తూలనాడినప్పుడు, భవభూతివలె జగన్నాథుడివలె ఒకసారి రెండుసార్లు చెప్పుకుంటే రోతలేదు. కాని నిజంగా శక్తిమంతుడైనా మాటి మాటికి పుటపుటకూ నేను గొప్పవాణ్ని అని వాపోతుంటే రోతగానే వుంటుంది అసలింతకూ బూతవర్తమానాల్లో అద్వితీయుడైన కాళిదాసు

"మందః కవియశఃప్రార్ధీ గమిష్యామ్యపహాస్యతామ్"

అని వినతుడైనాడు ఒకరకపు మనుషులు జగన్నాథుడివంటివాండ్లు బయటపడి వెళ్లబెట్టుకుంటే ఒకటి రెండుసార్లకు రోతగా వుండదు. కాని పుటపుటకూ వాపోతే రోత అని సహృదయుల కందరికీ తెలిసిన సంగతే ఇట్లానే కవి తన మాధుర్య ప్రేమను మంజులత్వ ప్రేమను త్రెలియబరచడానికి ఆసందర్భాలు మధురమైనవని వ్యక్తం జేయడానికీ కొన్ని మధురలు, కొన్ని దివ్యలు వేస్తే రోత పుట్టదు. కాళిదాసు తపోవనాల పావనత్వం మీది అభినివేశం ఆపలేక

"పునానం పచనోద్ధూతైః" (రఘు)

అని పావనత్వాన్ని శబ్దంతో చెప్పినాడు. ఇట్లానే "పుంస్కోకిలోయ మ్మధురం చుకూజ" (కుమార) అని అన్నాడు.

ఇట్లా యెక్కణ్నైనా యీ మాటలు వుంటే రోతలేదు. కాని యిప్పటికృతులనేకాల్లో మధురలు, కోమలలు, దివ్యలు, ఆనందలు, మంజులలు. ముసిరి మూగి వెగటు పుట్టిస్తున్నవి ఈ కాలపు కృతికర్తలనేకుల కీ జౌచిత్యజ్ఞానం కనబడదు. పద్యం మొదలు పెట్టితే దివ్యలు, మధురలు, ఆనందులు మంజులలు ప్రణయలు, కోమలాలు వేస్తున్నారు.

"నీవు తరుణ మాధవుడవు నేను కోకిలను"

అని అన్నప్పుడు మధుమాసంలో కోకిల పంచమస్వరవిరావి అవుతుందని ప్రసిద్ధమే గనుక చక్కగా పాడుతాననే అర్ధం విదితమవుతుంది. తరుణమాధవుడవు అనడంతోనే మధుమాసశోభపూర్ణంగా గోచరిస్తున్నది. కాని కృష్ణపక్షకర్త యీ అభిప్రాయం తెలపడానికే

"తరుణ శృంగార మధురమాధవుడ నీవు
 కలికిపాటల కోయిలకులము మాది"

అని ఆరంభంలో శబ్దవాచ్యత పాలైనాడు.

ఇతడు మధురంగా పాడేదీ, పాడనిది యితడిపద్యాలే చెప్పవలసి వున్నవి. శృంగార, మధుర కలికిపాటలు, అని శబ్దవాచ్యతే గాకుండా పులుముడు దోషం గూడా చేశడు. ఇట్లాటివి కృష్ణపక్షం నిండా వున్నవి. ఈ కాలపుకృతులనేకాల్లో యీదోషం అధికంగా వున్నది.

"విశ్వమోహన రసపుంజ మృదులగీతి
 చారుసిత శీతచంద్రికాపూరమైన
 శారద మనోజ్ఞ యామినీ సమయమందు"

(భారతి సం.2. సం.2 పేజీ 108)

"సొగసైన పూవులు
 సొంపైన పూలు
 అందమైన మంచి చందనపూలు"

(భారతి సం.2. పుట 1-85)



"ప్రవిమలానంద మందానిల ప్రాశాంత
 ........ ........ ....... ........ ....... .......
 మధుర హేమంత చంద్రికామౌనగీతి
 ........ ........ ........ ........ ........ .......
 చల్లనై కన్నులరమోడ్చి శాంత దివ్య
 ప్రకృతి మంజులగాన స్రవంతిలొన
 .......... ........ ........ ....... ....... ........
 మృదుల నీరేజదళముల మేనుమరిచి"

భ.రామసోమయాజులు ప్లీడషిప్పుక్లాసు


(ఆంధ్ర హెరాల్డు వా.న 2-42)



"నవవసంతంపు లేమావి చిగురుటాకు
 నీడలనుహాయి గొంతెత్తిపాడుకొనెడు
 ......... .......... ........ ........ ....... .......
మధుర మోహనమూర్తిని మదిలిఖించు"

తె. కృష్ణమూర్తి యం. యేక్లాసు.(ఆంధ్రహెరాల్డు)

"ప్రణయవేణు వనములోన భ్రమరతతులు
 ....... ....... ...... ...... ....... .......
 మాధురీరస ముద్భవింపంగజాలు
 ........ ....... ....... ....... ....... ......
 యుష్మదానంద ధర్మనజ్యోత్స్న గాని"

యామర్తి సూర్యప్రకాశరావు. ఆంధ్రహెరాల్డు



"ఇంపుదళ్కొత్త నాటల సొంపుమీరె
 కమ్రపల్లవ కోమల కరములెత్తి
 ...... ...... ...... ....... ....... .......
 పిల్లలానంద చంద్రికల్ వెల్లివిరియ
 ..... ..... ....... ....... ...... ..... ......
 మంజులాలాపనవసుధా మధురమూర్తి
 ...... ....... ...... ...... ...... ..... .....
 నిల్చె నామది నానంద నిధి విధాన"

(పెద్దిబొట్ల రాచంద్రరావు బి.యల్. క్లాసు.


ఆంధ్రహెరాల్డు వాల్యు 1.నె 8 రు.38)



"మధురమాధుర్య రవమున మనముగరుగ
 పాడరావమ్మకోయిలా ప్రమదగీతి" (వాసంత)

"నీమనోహర రూపరామణీయకము
 నవనవానంద సౌందర్య లాలనము"

       

    

పెనుమర్తి వెంకటరత్నం (భారతి 2-7-156)


"నవ్యశరన్మనోజ్ఞసుందర సువిశాలమిద్ది
        ప్రణయ రాధిక -శేషాద్రి రమణ కవులు (భ్సారతి 3-5)

"నవవిక స్వరదివ్య సౌందర్యమూర్తి
 విశ్వసుందరి పరమపవిత్రమూర్తి" (కృష్ణపక్షం)

"నవ్యమోహన కోకిలానందగీతి
 దరివికస్వరసుమనోహరసుగంధ" (కృష్ణపక్షం)

"అమృతగాన మధుర మందాకినీ భంగమాలికాంబ
 శీకరవితాన మోహన చిత్రనటన
 పూర్ణవికసితజీవితపుష్పకమ్ర
 సౌరభమ్ముల జిమ్ముచున్నారొ యెల్ల
 దెసల భవదీయసుందర దివ్యరూప" (కృష్ణపక్షం)

"లలితసుకుమార మధుర బాలస్వరంబు
 లలిత మనోజ్ఞ కావ్యమంజులలతాంత
 మాలికాభరణా వినిర్మలవిశేష
 సుగుణ మాణిక్య దివ్యతేజోవిరాజ"

"ఎన్నడో మీరు పాడినదీ వసంత
 మధురజీవనగీతి హేమంతదీర్ఘ
 యామినీమధ్యవేళ యేమైననేడు
 నవ్యభాగీరథీ దివ్యనది విధాన" (కృష్ణపక్షం)

అని యీతీరున శబ్దవాచ్యత మిక్కిలి మెండుగా కనబడుతున్నది. తాటక ఘోరంగా రామలక్ష్మణుల యెదుట నిల్చున్నస్థితిని

"జ్యానినాదమధ గృహ్నతీతయోః
 ప్రాదురాస బహుళక్షపాచ్ఛవిః
 తాటకా చలకపాలకుండలా కాలికేవ నిబిడాబలాకినీ"

(వారి, జ్యానివాదం గ్రహించి, బహుళపక్షపు రాత్రిని బోలి, కపాలాలు కుండలాలుగా వేలాడుతుండగా కొంగలగుంపుతో గూడిన సాంద్రమేఘం వలె అది (తాటక) ప్రాదుర్భవించింది.

"ఉద్యతైకభుజయష్టిమాయతీం
 శ్రోణిలంబి పురుషాంతమేఖలాం
 తాం విలోక్య వనితావధే ఘృణాం
 పత్రిణా సహా ముమోచ రాఘవః"

(ఆయతమైన భుజదండాన్నియెత్తి పురుషుల పేగులు మొలలో వేలాడుతుండేదాన్ని చూసి బాణంతో గూడా స్త్రీవధలో దయను సయితం విడిచాడు) అని కాళిదాసు రఘువంశంలో ఘోర కుటిల నిష్ఠుర అని శబ్దవాచ్యతపాలుగాకుండా చిత్రించాడు కాని, కోపసందర్భ క్రౌర్య సందర్భం వస్తే ఘోరలు కుటిలలు క్రూరలు, దురంతలు నిష్ఠురలు ఈ కాలపుకృతి కర్తలనేకులు పులుముతారు.

"కౌర్య కౌటిల్య కలుష పంకంబువలన" (కృష్ణపక్షం)
 క్రౌర్య కౌటిల్యకల్పితకఠినదాస్య" (కృష్ణపక్షం)
"ఘోర దుఃఖతమంబున గుందునపుడు" (కృష్ణపక్షం)
"హృదయ దళనదారున మహోగ్రకార్యంబు దలచినావు" (కృష్ణపక్షం)

"ప్రళయ కాలమహోగ్ర భయదజీమూతోరు
 గళఘోరగంభీర ఫెళ ఫెళార్భటులతో
 ప్రబలనీరంధ్రాభ్రజనితగాఢధ్వాంత
 నిబిడ హేమంత రాత్రీకుంతలములలో
 వికృత క్రూర క్షు భితమృత్యుకఠోర
 వికటపాండుర శుష్కవదన దంష్ట్రాగ్నిలో|| (కృష్ణపక్షం)

"నైదాఘతీక్ష్ణ భ్ణానుభీకరకరానలచ్చట"
"అనంతశోక భీకర తిమిర లోకైకపతిని"
"వెక్కి వెక్కి రోదింతును"
"ఏడ్చివైతు ఎలుగెత్తి ఏడ్చివైతు"

ఈ తీరుగా యేడవకుండానే యేడుస్తానన్నట్లు శబ్ధవాచ్యత అనే దోషానికి కృష్ణపక్షకర్త తనకృతులను గురి చేశాడు.

"ప్రణయమేలోకమై పరగిన చోట
 ప్రణయ శకుంత దంపతులమై మనము
 ప్రణయలీలామృత రసతరంగముల
 ప్రణయడోలా పరంపరల మధ్యమున
 ప్రణయాన దోగుచు ప్రణయగీతములు
 ప్రణయంబు పల్లవింపఁగఁ బాడుకొనుచు
 ప్రణయ రూపానంద భాగ్యంబు గాంచి
 ప్రణయ శాసనమున ప్రణయ రాజ్యమ్ము
 పాలింతమికరమ్ము ప్రణయాధినాథ" (యేకాంతసేవ)

అని శబ్దవాచ్యతతో పులిమినారు ఇందులో 7 ప్రణయలు వదిలిపెట్టి తక్కినవి వ్రాశాను. అయోమయం, పులుముడు, శబ్దవాచ్యతచేరి కవిత్వం పోగలిగినంత అధమదశకు ఈ పంక్తులు పోయినవి. ఈ తీరును యీపని యీ కాలపుకృతుల్లో మిక్కుటంగా కనబడుతున్నదని. యిది వివేకం మాలిన పని అని చెప్పి యీ ప్రస్తావన చాలిస్తున్నాను.

"బహుళ పక్షపు రాత్రినిబోలి చెవులకు పుర్రెలు వేలాడుతుండగా పురుషుల పేగులు మొలతాడుగా తాటకి నిల్చున్నది" అన్నప్పుడు యెవరెంత వద్దని చెప్పినా అది భయంకరంగా వున్నదను కొంటాము. కాని కృష్ణపక్షకర్త

"శోకభీకరతిమిర లోకైకపతిని"
"ప్రళయ ఝుంఝూ ప్రభంజనం స్వామిని"

అని అంటే యెవరెంత చెప్పినా, ఆయన ఆస్వామి అనిలభీకరపతి అని అనుకోలేకుండా వున్నాను. యెందుకంటే ఆయన యెందుకు ప్రభంజనస్వామో యెట్లా భీకరపతో తెలియదు. కనుక వీటిని దండగ మాటల శబ్దవాచ్యత అంటున్నాను. ఇక మధురత్వం మంజులత్వం వున్నచోట్ల మధురం, మంజులం దివ్యం అని మధురపైన మంజుల, మంజులపైన కోమల, కోమలపైన కమ్రవేస్తుంటే నేను తెలివిగలవాడను నేను మేధావంతుడను నేను గొప్పవాణ్ని అని చెప్పుకొన్నప్పటివంటి వెగటుపని గనుక అది వెగటు శబ్దవాచ్యత అంటున్నాను. ఈ ఉభయ విధ శబ్దేవాచ్యతలు ఈకాలపు కృతుల్లో వున్నవి. ఇంకొక మాట చెప్పి యీ విషయం ముగిస్తున్నాను. ప్రణయమనేది కేవలం స్త్రీ పురుషుల అన్యోన్యాభిలాషకు వాచకమని నేటి కృతికర్తలనేకులు అనుకొంటున్నట్లు కనబడుతున్నది. ప్రణయమంటే ప్రీతిపూర్వకమైన ప్రార్దన. సాధారణంగా ప్రేమ, స్నేహం అని అర్ధం అంతేగాని స్త్రీపురుషులకు ప్రత్యేకించి వుంటే స్నేహం మాత్రమేగాదు. సాధారణస్నేహం ఇది సాధారనంగా అనేక స్థలాల్లో నాయక వ్యవహారంలో కోపంతో అనుబద్ధమై వుంటుంది. "మానోపిప్రణయేర్ష్యయోః" అని దశరూపకారుడు ప్రణయమానమని ఈర్ష్యామానమని మానం రెండు విధాలని అభిప్రాయం కోపపరతంత్రులైన నాయకులబెట్టు ప్రణయయమానం

"ప్రేమపూర్వకవశీకారః ప్రణయః" అనిధనికుడు ప్రణయాన్ని భంగం చేసేమానం ప్రణయమానం. ఇదే ప్రణయకోపం

"త్వామాలిఖ్య ప్రణయకుపితాం" (మేఘ) అని కాళిదాసు

"ప్రణయ కుపితాం దృష్ట్యా. అని వాక్పతిరాజు (దశరూపక వ్యాక్యలో ఉదాహృత్రం)

"ప్రణయకుపితయోర్ద్వయోః" (సంస్కృతచ్ఛాయ)

అని దశరూపక వ్యాఖ్యలో ఉదాహృతం

ప్రణయమనేది కేవలం స్త్రీ పురుషుల స్నేహమే గాదు. సాధారణస్నేహం. స్త్రీ పురుషుల ప్రీతిమాత్రం గాదు. సాధారణ ప్రీతి అయితే యెక్కువైన ప్రేమను ప్రణయమంటారు. 'ప్రేమనీతం ప్రకర్షం చేత్ తదా ప్రణయ ఉచ్యతే" అని అభియుక్తోక్తి. ఇది స్త్రీ పురుషుల ప్రేమకు మాత్రం సంబందించింది గాదని యిదివరకే తెలిపినాను. కాని యిది తక్కిన ప్రేమలనువలె స్త్రీపురుషులకు సంబందించిన ప్రీతిని సయుతం తెలుపుతుంది. గనుక ఆ అర్ధంలో సయితం పీతిప్రభృతి శబ్ధాలనువలె విజ్ఞులు వాడినారు.

"మునిసుతాప్రణయస్మృతిరోధినా
 మమచ ముక్తమిదం తమసా మనః" (శా-6)

(శకుంతలా ప్రణయాన్ని ప్రీతిని స్మరించకుండా చేసే తమస్సు నుండి నా మనస్సు విడుదల పొందింది) అని

"మయ్యేవ విస్మరణదారుణచిత్తవృత్తౌ
 వృత్తం రహః ప్రణయమప్రతి పద్యమానే" (శా-5.)

(రహస్యంగా జరిగిన ప్రణయాన్ని (స్నేహాన్ని) తెలుసుకోలేని విస్మరణదారుణచిత్తవృత్తుడనైన నాయందే) "భర్తృభిః ప్రణయసంభ్రమదత్తాం" (కిరా)

(భర్తలు ప్రేమాదరాలతో యిచ్చిన) యిట్లా ఔచిత్యవేత్తలక్కడక్కడ వచించడం కనబడుతున్నది. కాని యిది స్త్రీ పురుషులకు సంబందించిన ప్రేమనుమాత్రం తెలిపే శబ్దంగాదని చెప్పుతున్నాను అందుకే

"అపి ప్రసన్నం హరిణేషు తే మనః
 కరస్థదర్భప్రణయాపహారిషు" (కుమా)

(చేతిలోని దర్భలను స్నేహంతో అపహరించే జింకల మీద నీ మనస్సు ప్రసన్నంగా వుంటుందా?)

"కంఠాశ్లేషప్రణయిని జనే" (మేఘ)
 (కంఠాశ్లేషం కోరేమనిషి)

"సత్ర్కియాం విహితాం తావద్గృహాణ త్వం మయోద్యతాం
 ప్రణయాద్బహుమానాచ్చ సౌహృదేన చ రాఘవ" (రాయు)

(ప్రీతితో బహుమానంతో స్నేహంతో చేసే యీ సత్కారాన్ని స్వీకరించు విభీషణవచనం)

"తద్భూతనాధానుగ నార్హసి త్వం
 సంబంధినో మే ప్రణయం విహంతుమ్ . (రఘు.2)

(కనుక ఓ సింహమా! బంధువుడనైన నా ప్రణయం (యాచన) నీవు భంగం జేయదగదు)

"సాహి ప్రణయవత్యాసిత్ సపత్న్యోరుభయోరపి" (రఘు 10)
     (సుమిత్ర సవతులిద్దరి మీదా ప్రేమవతిగా వున్నది)

"అప్యనుప్రణయినాం రఘోఃకులే నవ్యహన్యత కదాచిదర్ధితా"

రఘు. 11)



(ప్రాణాలు యాచించేవారికోరిక గూడా రఘుకులంలో ఒకప్పుడూ సఫలీకృతంగా లేదు)

"తథేతి తస్యాః ప్రణయం ప్రతీతః
 ప్రత్యగ్రహీత్ ప్రాగ్రహరో రఘూణామ్. (రఘు 16)

(రఘువుల్లో శ్రేష్ఠుడైన కుశుడు అపురాధి దేవత యొక్క యాచనను అట్లానేనని సంతుష్టుడై స్వీకరించాడు)

"స్రోత్రోనహం పది నికామజలామతీత్య
 జాతః సఖే ప్రణయవాన్ మృగతృష్టికాయామ్. (శా 6)

(దోవలో బాగా జలం వున్న యేటిని దాటివచ్చి ఓ మిత్రుడా యెండమావి మీద ప్రీతిగలవాణ్ని అయినాను)

"సకల ప్రణయమనోరథసిద్ది శ్రీపర్వతో హర్షః" (హర్ష)

(సకలార్ధుల మనోరధసిద్దికి (మల్లికార్జునని వాసమగు) శ్రీశైలమైన హర్షుడు) అని యిట్లా యెన్నో వున్నవిగాని విస్తరభీతిచేత వదలుతున్నాను. పైన చూపిన తీరును అర్ధవిధులైన కాళిదాసాదులు విశదంజేశారు. కాని యిప్పటివారు ఔచిత్యజ్ఞానం కోల్పోయి ప్రణయమంటే స్త్రీ పురుషులకు సంబంధించిన ప్రేమేనని అనుకొంటున్నట్లు కనబడుతున్నది.

ప్రణయసౌధము (భా--3-3) కాంతనీకంటిరెప్ప లొక్కింతవిచ్చి

అని యిట్లా స్త్రీపురుషుల అన్యోన్యాభిలాషే ప్రణయమనుకొన్నట్లు ఇప్పటివారు ప్రణయాలతో నింపుతున్నారు. వీరిట్లా అనుకొన్నమాటే నిజమైతే అది అజ్ఞానం. అది ప్రీతిపూర్వకప్రార్ధనా వాచకమని సాధారణ స్నేహవాచకమని శృంగారంలో సాధారణంగా మానంతో అనుబద్ధమై వుంటుందని విశదపరచాను. ఇట్లా ప్రణయగీతమని ప్రణయినీగీతమని ప్రణయసౌధమని ప్రణయజానికి అని పేరుపెట్టడమే వెగటు పని. ఇది కేవలం వ్యంగ్యంగావలసిన కావ్యంలో సయితం పుస్తకం నిండా

"ప్రణయశకుంత దంపతులమై మనము
 ప్రణయ లీలామృత పసతరంగముల
 ప్రణయడోలాపరంపరల మధ్యమున

ప్రణయాన దోగుచు ప్రణయగీతముల
ప్రణయంబు పల్లవింపగ బాడుకొనుచు
ప్రణయ రూపానంద భాగ్యంబుగాంచి
ప్రణయ శాసనమున ప్రణయరాజ్యంబు
పాలింత మిక రమ్ము ప్రణయాధినాథ" (యేకాంతసేవ)

అని ప్రణయంప్రణయం ప్రణయమని పులుముతున్నారు
     
"ఏకోపి, జేయతే హంత కాళిదాసో న కేన చిత్
 శృంగారే లలితోద్గారే కాళిదాసత్రయీ కిము"

అని ప్రసిద్ధిజెందిన కాళిదాసు తనకావ్యాన్ని శృంగారకుమారసంభవమని గాని శృంగార మేఘదూతమనిగాని శృంగారశాకుంతలమనిగాని చెప్పలేదు. కాని యిప్పటి కృతికర్తలు కొన్ని పద్యాలువ్రాసి కక్కురితిపడి ప్రణయగీతమని ప్రణయసౌధమని ప్రణయజానకి అని శబ్దవాచ్యతపాలు చేస్తున్నారు. శృంగారశ్రీనాథమని శృంగారకాదంబరి అని అచ్చువేయడం ఔచిత్యరాహిత్యాన్నే విశదంజేస్తున్నవి. శృంగారనైషధమని వుండడమే చింత్యమైవుండగా శృంగారం ప్రధానంగా లేకున్నా శ్రీనాథచరిత్రను శృంగారశ్రీనాథమనడం బాణుడు కాదంబరి అన్న దాన్ని శృంగారకాదంబరి అనడం యీదోషంలోనే చేరుతున్నవి. ఇవన్నీ శబ్దవాచ్యతను ఆపాదించి వెగటూ రోత పుట్టిస్తున్నవి. భవభూతి "కరుణో రసంః"అని "అద్భుతరస:" అని యీతీరున రసాలను శబ్దవాచ్యత పాలుచేసినందుకు సయితం సమకాలపు అనాదరన కొంత యేర్పడివుంటుంది.

కావ్యజిజ్ఞాసలు వెలయించిన కాలంలో రసాదులకు శభ్దవాచ్యత దోషమని భవభూత్యాదులదోషాలవంటివే దోవజూపివుంటవి "రసగంగాధరం, రసార్ణవసుధాకరం" అని యిట్లా సాహిత్యగ్రంథాల్లోను, తక్కినస్థలాల్లో విచారసమయాల్లోను, కావ్యాల్లోను స్థాయి సంచారిభావాలను ప్రదర్శించేటప్పుడు కవులు శృంగారమని వీరమని అద్భుతమని కరుణమని, రోమాంచమని, నిర్వేదమని యెక్కడనో స్ఫుటప్రతీతికి ఆవశ్యమైతే తప్ప ఊరక మాటిమాటికి కక్కుర్తిపడి వెళ్లపెట్టితే శబ్దవాచ్యత అని అసహ్యపడ్డ భారతీయసాహిత్య వేత్తల భావమనోజ్ఞత వాస్తవంగా ఆరాధ్యమై వున్నది.

"రసస్యోక్తిః స్వశబ్దేన స్థాయిసంచారిణోరపి" అని విశ్వనాథుడు ఇట్లానే తక్కినసాహిత్యవేత్త లన్నారు. అందుకే లజ్జను ఎలపడానికి

"జాతా లజ్జావతీ ముగ్ధా ప్రియస్య పరిచుంబనే"

(ప్రియుడు ముద్దుపెట్టుకొనగానే ముగ్ద లజ్జావతి అయింది) అనడం కంటె

"ఆసీన్ముకుళితాక్షీ సా ప్రియస్య పరిచుంబనే" ఇతి లజ్జాయా అనుభావముఖేన కథనే యుక్తః పాఠః

(ప్రియుడు ముద్దుపెట్తుకొనగా ముకిళితాక్షి అయింది అని అనుభావముఖానచెప్పడం యుక్తం) అని సాహిత్యదర్పణకారుడు చెప్పుతున్నాడు. శబ్దవాచ్యతవల్ల వెగటు. భావానికమితత్వం, ఆపతితమై ఆ స్వాదానికి క్షతికలుగుతున్నది. అందుకే

"స్వశబ్దవాచ్యత్వం రసాదిప్రకర్షబోధప్రతిబంధకం"

అని సాహిత్యదర్పణవ్యాఖ్యాత రామచంద్ర తర్కవాగీశభట్టాచార్యుడు తెలిపినాడు.

కావ్యప్రదీపంలో "హా!మాతః" అని కరుణానికి ఉదాహరించిన శ్లోకానికి వ్యాఖ్యవ్రాస్తూ దాంట్లో "ఘర్ఘరమద్యరుద్ధకరుణాః" అనేభాగంలో వున్న "కరుణాః" అనేదానికి "సస్నేహాః" అని అర్ధం వ్రాసి "నాతో రసస్య శబ్దవాచ్యతాదోషః (కా. ప్ర. వ్యా) (అందువల్ల రసానికి శబ్దవాచ్యతాదోషం లేకుండాపోయింది) అని వైద్యనాథుడు వ్రాస్తున్నాడు.

ఇట్లా శబ్దవాచ్యతవున్న సందర్భాల్లో
"............ఆస్వాదానుత్పత్తిర్దోషత్వ బీజమితి సంప్రదాయ"
(ఆస్వాదానుత్పత్తి దోషత్వ బీజమని సంప్రదాయం)

అనికావ్యప్రదీపకారుడు వ్యక్తపరచాడు.

అనుచితమైన శబ్దవాచ్యత రోత అని చెప్పియీవిచారణ ముగిస్తున్నాను.

అనిశ్రీ - ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో శబ్దవాచ్యతాధికరణం సమాప్తం

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

దృష్టివిచారాధికరణం.

సంకుచితత్వం

లోకం వివిధప్రకృతులతో విచిత్రమైన వున్నది., కవి తనమనో విభుత్వం వల్ల ఉన్నతాలు ఉత్తమాలు అయిన ప్రకృతుల్లో ప్రవేశించి అంతరవీక్షణం చేసి ఈ ప్రకృతుల ప్రవృత్తులను లోకానికి ప్రసాదిస్తున్నాడు. అందుకే ఉత్తమపాత్రలను లోకానికి ప్రసాదిస్తున్నాడు. అందుకే ఉత్తమపాత్రలను కల్పించి మధ్యమాధమ పాత్రలవికృతత్వాన్ని ఉత్తమత్వస్ఫుటత్వానికి అంగంజేసి వారి రీతులను లోకాభ్యుదయదృష్టితో తెలుపుతున్నాడు. ఈతీరుగా కవి సంసృతిమిక్కిలి విశాలమై ఉన్నతమై వున్నది. ఇప్పటి కృతికర్త లనేకులు "చిన్ననాపొట్టకు శ్రీరామ రక్ష" అని శృంగారం మొదలైనవి యితరుల కెందుకు పోనియ్యవలెనని నాజానకి అని, నాప్రియురాలు అని, నా ప్రేమ అని నన్ను చిటికేసి సావిట్లోకి రమ్మన్నదని తమనే నాయకులను జేసుకుంటున్నారు.

"త్రోవలో దాని (ప్రియురాలి)రసన కంటకొనిపోదు"

(నాయని సుబ్బారావు, భారతి. 1-7)



"ప్రియతమావేరు చింతల విడిచి తడవు
 సేయ కిక నన్ను నక్కునజేర్చుకొనుము"

జంధ్యాల శివన్న శాస్త్రి



"కన్నులరవిప్పి నే నిన్ను గాంచినపుడె
 ఆర్ద్రహృదయంబుచలియించి యవశమాయె"

(పాపినేని వెంకటేశ్వరరావు)

"నడికిరేయిని కలలోన నాకు నీవు
 కానిపింపంగ మేల్కొంటికలతచెంది" (భారతి 2-7)

"నాదు ప్రేయసిం గూడి నేనడువ"

(పయిడిపాటి చలపతిరావు. భారతి2-11)



"భయము నాకేల యింత విశ్వమ్ములోన"

(భ.రామసోమయాజులు ఆంధ్ర హూల్డు 1-2)



"ఏల నాహృదయంబు ప్రేమించు నిన్ను" (కృష్ణపక్షం)

"విబుధులెల్లరు నన్ను విడిచిపోయినను
 హితు లందరునునన్ను వేసగించినను
 నాప్రేమభాగ్యంపు నవ్వువెన్నెలలు
 నాపైన ప్రసరింప నాకేమిభయము"

(గ. రామమూర్తి, భారతి 2-11)

ఈతీరుగా వీరి దృష్టి సంకుచితమై వీరికి ఉండదగిన భావాలే మవుతున్నవి. నాజీవితం నాప్రేమ నాజానకి మనమిద్దరమైక్యమౌదామె అని వీరి స్త్రీ తప్ప వీరికి మరివిశాలదృష్టే కనబడదు. లోకం వీరికి అవిదితమై కూపస్థమండూక సాదృశ్యం పొందినారు.

ఆక్షేపం

అవునయ్యా. అని వారిని గురించిగాదు మరి యొకరినిమనసులొ పెట్టుకొని ఆరు అన్నట్లు వ్రాస్తున్నారంటారా?

సమాధానం

అది అసంబద్ధం వారెవరో యెందుకు చెప్పగూడదు? యెందుకు వ్యంగ్యంగానైనా తెల్పగూడదు? ఆమనస్సులో పెట్టుకొన్నది రావణుడూ ఉద్దిష్టనాయిక సీతా గావచ్చునుగదా. అట్టాటి తుచ్ఛరతి సహృదయులకు అనంగీకార్య మని నేను చెప్పవలసినపనిలేదు. కనుకనే కాళిదాసు "కశ్చిత్ కాంతా" అని ఉద్దిష్టనాయకుణ్ణినాయికను తెలిపినాడు. అసలు ఈరత్యాదిభావాలన్నీ అలంబనాన్ని అంటే నాయికను నాయకుణ్ణిబట్టే వుంటవని ముందు నిరూపించబోతున్నాను.

పూర్వపక్షం

అవునుగాని, దోషంకనబడేదాకా గుణి అనే అనుకోవలెను అనే న్యాయమున్నది. కనుక దుష్టనాయకుడని తేలేదాకా ఉత్తమ నాయకుడనే అనుకోవలెను. కనుక "నేను" అని వున్నప్పుడు అతడెవ్వరో ఉత్తమనాయకుడే నని యేల అనుకోరాదు? అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. అది అసంగతం తెలిసేదాకా గుణి అనుకొంటూవుండడం అనుచితం యేదైనా పదార్ధం విషమని తేలేదాకా అది అవిషమనే అనుకొనడం మూర్ఖత్వమే అవుతున్నది. యెందుకంటే అట్లా అనుకొనితింటే అది నిజంగా విషమైనప్పుడు అనర్థ ప్రాప్తికలుగుతున్నది. కనుక యేమీ తెలియనప్పుడు అది విషమనిగాని అనుకొనకతటస్థంగావుండడమే తెలివిగలపని. అట్లానే మనిషి దోషి అనిగాని గుణి అనిగాని తెలియనప్పుడు గుణి అనిగాని దోషి అనిగాని అనుకొనకతటస్థంగా వుండడం వివేకం అట్లానే "నేను" అన్నప్పుడు ఉత్తముడని గాని మధ్యముడనిగాని అధముడనిగాని అనుకోకుండా వుంటాము కనుకనే ఉత్తమత్వం మధ్యమత్వం అధమత్వం, అనేభావన లేమీలేకుండా, అన్యయానికి సరిపొయ్యే కృతికర్తే నాయకుడని అర్ధం చేసుకొంటాము. పద్యం అనర్థంగా వుండగూడదుగదా. ఆలంబనంలేని రసభావాలు స్థితిహీనమై అనన్విత మవుతున్నవి. యెవరైనా కృతికర్త ఆ "నేను" కు అర్థంతానుగాదంటే యెవరోచెప్పమంటాను. అప్పుడాలంబనం యొక్క మంచిచెడ్డలు విచారిస్తాను.

పూర్వపక్షం

అవునయ్యా ఇదే ఇప్పటివారిస్వేచ్ఛ. పాత్రలను సృష్టించకతమను గురించే వ్రాసుకుంటారు ఇట్లా పాశ్చాత్యులు వ్రాస్తారు; అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను పాశ్చాత్యులు అనేకు లిట్లా ఆత్మ నాయకత్వంతో చాటుపద్యాలవంటివి చిన్నవి పెద్దవి కృతులు వ్రాస్తున్నారని నే నెరుగుదును యెవరువ్రాసినా సత్యాన్ని తిప్పజాలవు. ఇట్లాటివి ఒక తీరుకవిత్వం అంటే నాకు విప్రతిపత్తి లేదు. అనుభవకవిత్వం ఆత్మనాయకకవిత్వం అని యేదో దానికి పేరుపెడతాము. కాని యిదివర కెవరూదీన్ని యెరగరని ఇది కొత్త అని, ఇది స్వేచ్చ అని స్వేఛ్ఛాకుమారుడని ఇది మహాకవిత్వమని అంటే అది కాదని దృష్టిసంకోచమని చెప్పుతున్నాను.

పూర్వపక్షం

అవునయ్యా. వీరు తమతమ అనుభవాలను వ్రాసి పెట్టుతున్నారు. వీరిచరిత్రలు శాశ్వతంగా లోకంలో వుంటవి వెనకటివాండ్ల చరిత్రలు తెలియక చిక్కుపడుతున్నాము గదా. వీరా చిక్కు తొలగిస్తున్నారు. వీరి చిత్తవృత్తి యిట్లాటిదని లోకానికి తెలుస్తుంది అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను మంచిది. చరిత్రలుంటే వుండవచ్చు ఇవి చరిత్రలంటే నాకు విచారణేలేదు. కవిత్వమన్నప్పుడే విచారణ. దేశాన్ని తమఃకూపంలో బడవేసే అవివేకాన్ని నిరోధించి స్వకాలమందలి ప్రజాప్రవృత్తిమీద ఆచరణరూపాన ప్రతిక్రియసాగించే వ్యక్తులు తమఖేదాన్ని తమ అనుభవాలను నిర్వేషంగా భర్తృహరివలె చెప్పవలసిన సమయాలు తటస్థించగలవు వాటికి లోకం అంధం కాజాలదు కాని, రసభావాల పరిపోషం, శిల్పం, వికసితలోకవృత్తప్రదర్శనం, మొదలైన వాటితో విశిష్టమైన కవితా సర్గానికి భర్తృహరివలె లోకప్రవృత్తి విషయమయి ఖేద మోదానుభవం చెప్పడం సంబంధించిందిగాదు. కవితా లోకంలో కాళిదాసు స్థానం భర్తృహరికిలేదు. శక్తిమంతులు అదీయిదీ రెండూ నిర్వహించవచ్చును. లేదా మహాకవులు కాళిదాసాదుల వలె తము సృజించినకవితా లోకంలోనే తమసందేశాలను స్ఫుటంగా వ్యంగ్యంగా పాత్రలద్వారా మధ్యమధ్య స్వీయవాక్యాలద్వారాప్రతి పాదించవచ్చును. భవభూతివలె కవితాభావనలలోనె నూతనత్వాన్ని "ఏకోరస।" అన్నట్లు తెలుపవచ్చుని కాని "నాకు" అని "నేను" అనిమాత్రం తమనే కవులు శృంగారాదులకు నాయకులను జేసుకున్నప్పుడు దృష్టి తప్పక సంకుచితం కాగలదు. ఇవి సొంత చరిత్రలంటే నాకు విచారణేలేదు. యెవరిచరిత్రలు వారు వ్రాసుకొనడానికి యేమీ ఆక్షేపంలేదు. కాని యిదంతా నూతనకవిత్వం ఉత్తమకవిత్వం అంటే, కాదు దృష్టిసంకోచ మంటున్నాను.

నేటి కృతికర్తలపద్యాల్లో ఈసంకుచితదృష్టే అధికంగా కంబడుతున్నది. పోతన, భర్తృహరులవలె తెలిపే ఆత్మదృష్టసత్యాలు లోకశ్రేయస్సుకు కారణమైనవి ఉన్నవేమో నని పరిశీలించాను గాని నాకు కనబడలేదు. ఆవిధపు సత్యాలెక్కడైనా ప్రకటితమైనవేమోనని చూస్తున్నాను అట్లాటి సత్య ప్రకటనానికి ధ్యానాచరణాలు ప్రధాన మవుతున్నవని యిదివరకే తెలిపినాను. ఆసమయంలోనే సత్యస్వరూపం సాక్షాత్కరిస్తున్నది.

యెంకిపాటలు, సుమబాలవంటివి కొన్నిమాత్రమే ఆత్మ నాయకత్వం చేత వచ్చిన సంకుచితదృష్టిలేనివి కనబడుతున్నవి. భక్తివంటి భావనను సయితం శ్రీభాగవతకర్త ప్రహ్లాదాదులకు సమర్పించి లోకానికి ప్రసాదించాడు. ఆలంబనంయొక్క ఉత్తమత్వాదులు శృంగారాదులకువలె కరుణానికీ, భక్తికీ, జడ,శిశు ప్రకృతులమీదిప్రేమ మొదలైన భావాలకు అంతగా ప్రధానంగావు. గనుకనే దాశరథీశతకప్రభృతులు మనకు ఉపాదేయంగా వున్నవి. అదీగాక భక్తికి ఆధారమైన భగవంతుడు సకలకల్యాణగుణసంపన్నుడు శిశుజడప్రకృతులమీది ప్రేమకు ఆధారమైన శిశుజడప్రకృతుల వినిర్మలత్వం ముగ్దసౌందర్యం మొదలైనవి అకలుషితధర్మాలు., కనుకనే వీటికి ఆలంబనంయొక్క ఉత్తమత్వాది విచారణ అంతగా ప్రధానం గాదంటున్నాను. శృంగారాదులకు ఆలంబనమైన నాయకులు నాయికలు కామపశుత్వం లోక నిశ్రేయసవిరోధి అయిన అధర్మపరత్వం మొదలైనవాటికి ఆకరులు తరుచుగా అవుతూవుండడం మనకు విదితమయ్యేవున్నది. కనుకనే భక్తిమొదలైనవి తప్ప శృంగారాదులు ఆలంబన ప్రధానంగా వుంటవంటున్నాను. అందువల్ల లోకంలో యేకదేశంలో వుండే భక్తిమొదలైన వాటివలెగాక సాధారణంగా సర్వమానవప్రకృతిని వశంజేసుకొని అభ్యుదయవినాశాలకు రెంటికి హేతువుకాగల శృంగారాదుల భావాల ప్రతిపాదనంలో కృతికర్త యెంతోవివేకాన్ని బుద్దిపరిణతిని ఔచిత్యాన్ని వినియోగించ వలసివుంటున్నది. అందుకే ఆలంబనవైవిద్య వికాసాలను గోల్పోయి ఉత్తమత్వాదులను ప్రతిపాదించకుండా శృంగారాదులకు తమనే నాయకులను జేసుకొన్న కృతికర్తలు సంకుచిత దృష్టులైరంటున్నాను.

ఆక్షేపం

అవునయ్యా యిట్లాటిదోషాలెన్ని వున్నా ఇప్పటి కాలపుకవిత్వం విలక్షణమైనది. వెనుకటికవులు ఆశ్వాసాలని సర్గలని కావ్యవస్తువును విభజించి పెద్ద పెద్ద కవ్యాలువ్రాసేవారు. ఇప్పటికవులు భావమే ప్రధానంగా చిన్న చిన్న కవ్యాలు వ్రాస్తున్నారు. ఇవి యింగిలీషు లిరిక్సు (Lyrics) నుబట్టి వ్రాసినవి. వీటిలో భావోద్రేకం ప్రభావం ఇవి వెనక మనకు లేవు. ఇప్పటికవుల చినకవ్యా లీలిరిక్కులకు చేరినవి. ఇదే భావకవిత్వం. ఇది కొత్త ఈకొత్తయే ఒకగొప్పగుణం. దోషాలన్నీ దీంట్లో అణగిపోతవి అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను, అది అసంభద్ధపుమాట భావకావ్యాలు మనకు చిరకాలంనుండివున్నవి. యెకభావాన్ని ప్రధానంగా ప్రతిపాదించే చిన్న కావ్యాలు మన వాఙ్మయంలో చిరకాలంనుండి వున్నవి. ఈ సంగతి విశదపరచడానికి ముందు ఈ కాలపు కావ్యాల్లో వున్న భాషావ్యతికంచ్చందో వ్యతిక్రమాలను గురించి కొంతవిశదం చేస్తాను.

అని శ్రీ ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో దృష్టివిచారాధికరణం సమాప్తం.

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

వ్యతిక్రమాధికరణం.

వ్యతిక్రమం.

ఛందోవ్యతిక్రమం. భాషావ్యత్రిక్రమం అనే దోషా లీకృతుల్లో కనబడుతున్నవి. వీటిని వివరిస్తాను. సంస్కృతంనుండి తర్జుమాతో ఆరబ్దమైన ఆంధ్రగ్రంధపఠనంలో సంస్కృతం ప్రవేశించడం సంభవమే గనుకను, అదిగాక ఆంధ్రులభాష సంస్కృతంతో మిళితమై వున్నది గనుకను, సంస్కృతం ఆంధ్రులకృతుల్లో కనబడడం స్వభావవిరుద్ధం గాదు. తెలుగు సంస్కృతంతో మిళితమైన భాష గనుక తర్జుమా చేసేటప్పుడు మూలగ్రంథకారుడి అభిప్రాయం యథాస్థితంగా వచ్చేటట్లు పద్యంలో వ్రాయడానికి ఒక్కొకచోటసంస్కృతం వాడడం వుచితంగానే వుండవచ్చును. యెందుకంటారా? పద్యానికిగల నియతస్థలంలో నియతగతిలో ఆమాట లక్కడ యిమిడి ప్రసన్నంగా వుండడం ఒక్కొక్కప్పుడు సంభవిస్తుంది. అయితే ఆంధ్రులభాష ప్రధానంగా తెలుగు. తెలుగుభాషాతత్వానికి విరుద్ధంగాకుండా వుండేమటుకే సంస్కృతం తెలుగులో యిముడుతుందిగాని తక్కినది యిమడని పదార్ధంగానే అసంబద్దంగానే వుంటుంది. తెలుగుభాషయొక్క తత్వం సాధారణంగా వ్యప్తపదత్వం పదాలు రెండు మూడు, అంతగా యెక్కువైతే నాలుగుకంటె యెక్కువ సాధారణంగా చేరవు. అవి సయితం సంస్కృతంలో వలెవిభక్తిలోపంతో దగ్గరికిచేరి బిగిసినవికావు. తెలుగులో దగ్గరగా చేరేపదాలన్నీ చాలామటుకు వ్యప్తపదాలే అయివున్నవి. సంస్కృతంలో సయితం వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసుడు మొదలైనవారి కావ్యాల్లో మూడు నాలుగు అయిదుమాటలకంటె యెక్కువగా చేరిన ఈగుంపులు అరుదుగా కానవస్తవి. అయితే విభక్తిలోపంతో యెన్నిమాటలైనా చేరి యేకంగా బిగియడానికి అవకాశం వుడడంచేత

"రుధిరకుతూహలి కేసరికిశోరలిహ్యమానకఠోరధాతకీస్తబకే'

(హర్ష)


అని "సమరకండూలనిబిడభుజదండకుండలీకృతకోదండిశింజినీ
       టంకారోజ్జాగరితవైరి నగర" (సాహిత్య ఉ)

అని యిట్లా సంస్కృతగ్రంథాల్లో రచిస్తూవచ్చారు. ఇట్లాటిపదసమూహాలు తెలుగుభాషకు విరుధ్దమైనవి. సంస్కృతం తెలుగుభాషాతత్వాన్ని అనుసరించి యిమిడేటంతవరకే వుచితంగా వుంటుంది గాని తక్కినది యిమడని అసంబద్దపదార్ధంగా వుంటుందని యిదివరకే తెలిపినాను. కనుక సాధారణంగా మూడునాలుగు అంతగా అయితే అయిదు మాటలకంటె యెక్కువైన సంస్కృతశబ్దాల చేరికలు తెలుగులో యిమడక అసంబద్ధమై హేయమవుతున్నవి. ఇదే భాషావ్వతిక్రమం. ఇది భారతంలో ఆరబ్ధమైంది. దీనిని గురించి విపులంగా ప్రధమఖండలో నన్నయాధికరణంలో వివరించాను గనుక యిక్కడ విస్తరభీతిచేత వదలుతున్నాను.

ప్రథమఖండంలో వుదాహరించిన వాటినుండి కొన్ని ఉదాహరణాల నిక్కడ చూపుతున్నాను.

"హరిహరా జగజానననార్క షడాస్యమాతృసరస్వతీ
 గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి" (భా. స. ఆ)

"ఘోరసం, సారవికారసంతమస జాలవిజృంభముబాపి" (భా. న. ఆ)

"మనో హర సుచరిత్ర పావనపయః పరిపూర్ణములైన"

(భా. న.ఆ)



"మదమాతంగతురంగకాంచనలసన్మాణిక్యగాణిక్యసం

పదలోలిన్" (భా. న.ఆ)

"పరమవివేకసౌరభవిభాసితసద్గుణపుంజవారిజో
 త్కరరుచిరంబులై" (భా. వ.ఆ)

"శశ్వదుపవాస మహావ్రతశీతపీడితా, చలమునిసౌఖ్యహేతు
 విలసత్ బడబాగ్ని శిఖాచయంబులన్" (భా. న. ఆ)

"దుర్వారోద్యమబాహువిక్రమరసాస్తోకప్రతాపస్ఫుర
 ద్గర్వాంధప్రతివీరనిర్మధన విద్యాపారగుల్." (భా. తి. వి.)

అని యిట్లా యీహేయమైన భాషావ్యతిక్రమం ఆరబ్దంకాగా
    
"అఖండ శశిమండలకుండలితకుసుమకోదండ కాండాసనహిండిత
 కరకుముదకాండ తాండవితపరాగమండలంబున"

అనే రీతి వసుచరిత్రాదుల్లో పెరిగి భాషకు వైరూప్యమాపాదించినవి ఈభాషావ్యతిక్రమం ఉపాదేయఫలాన్ని సాధిస్తే అంగీకరించ వచ్చును. గాని పులుముడు మొదలైనదోషాలనే ప్రతిపాదించడంవల్ల త్యాజ్యమంటున్నాను. ఈభాషావ్యతిక్రమంవల్ల కలిగిన అనర్ధాలు ఆంధ్రుల భాషాసంస్కారాలు పొందిన వైరూప్యం, క్షయా, ప్రధమఖండంలో తెలిపినాను ఈభాషావ్యతిక్రమం నేటికాలపుకృతుల్లో తరుచుగా కనబడుతూనే వున్నది.

"శారదశర్వరీమధుర చంద్రిక సూర్యసుతాస్రవంతికా
 చారు వినీల వీచికప్రశాంత నిశాపవనోర్మిమాలికా
 చారిత నీపశాఖినికృశాంగి" (కృష్ణపక్షం)

"నిజమాయావశీకృత సకల దేవ దానవ యక్ష గరుడ గంధర్వ
 విద్యాధరాదిసముదయుండై"
 (జనమంచి శేషాద్రిశర్మ విచిత్ర ఫాదుకాపట్టాభిషేకం)

"......శేఫాలికామాధవీ
 రేఖామంజులవాసనాలహరి పర్వెన్‌ప్రాతరానీతశో
 ఖాఖద్యోతవిలాసరాగలలితప్రంశుప్రభన్"

(భారతి అనార్కళి, విశ్వనాథ సత్యనారాయణ)



"పారావార ధరాధరోన్నతతరు వ్రాతాపగాఘోరకాం
 తారాకారములాసమస్తవనత్వప్రస్ఫుటన్మూర్తులా"

(భోగరాజు నారాయణమూర్తి, భారతి సం.4. సం.2)



"అక్షమాలికాదండకమండలు పుస్తకన్యస్తహస్తపం కేరుహుండును"

(మాతృమందిరము వేంకటపార్వతీశ్వరకవులు)



"సూనఫలభరిత తరుయుత కాననవల్లీమతల్లికా
 వాసకిరాతానీక నేతయై"

(కావ్యకుసుమావళి



"ఖలు డాత్మీయమహాట్టహాసనిబిడోగ్రద్వాన సమ్మూర్చితా
 బిలభూతప్రకరుండులోకభయదాక్షీణస్పులింగచ్చటా
 కులవీక్షాపరిభూతభీతక్రతుభుగ్వ్యాహుండు"

(కేసిరాజు వేంకటసుబ్బారాయకవి)



"నిఖిలరాజన్యమౌళికిరీటరత్న దినకరప్రభానీరాజిత
 నిజపాద పద్ముండును."

(తేకుమళ్ల రాజగోపాలరావు కనకవల్లి)



"సుగుణప్రాభవచంద్రికాంచితయశః శోభాయమానాంగికిన్"

తేకుమళ్ల రాజగోపాలరావు కనకవల్లి)



"ధరహాసామృతవీచికాపునరుదాత్తస్వాంతరంగ
 ప్రియోత్తరమున్" (సి.యస్. జయరావు పుష్పమాల. 1-3)

"లలితగ్రాసకిసాలచర్వణ సముల్లాసక్రియాజాతగం
 ధిలడిండీరకణచ్యుతిన్"

"చంచద్గరుద్భిన్న నిర్మలవీచీమృదుడోలికా
 పరినటద్రా జీవపత్రంబుగన్"

(దువ్వూరి రామిరెడ్డి. వనకుమారి.)



"ఆశ్చర్యకృద్బహుళోద్గ్రంథనిబంధన ప్రచురితప్రాపంచికైశ్వర్య
 ధూర్వహులైనట్టి"
(పం. రామచంద్రరావు, జీవితాదర్శం -- భారతి)

"విశ్వమోహన సుధాంశునిసర్గమనోజ్ఞచంద్రికాస్పదమగు"
(ప్రణయరాధిక. శ్రీశేషాద్రిరమణకవులు." భారతి)

అని యీతీరున హేయమైన భాషావ్యతిక్రమం కనబడుతున్నది.అయితే యిట్లా అసంబద్ధవు సంస్కృతం కుక్కుతున్నారే గాని దాని వెంటనే సంస్కృతభాషానభిజ్ఞత సయితం కనబడుతున్నది. వ్యాకరణం యింకా స్ఫుటంగా యేర్పడని తెలుగువంటి జీవద్భాషలకు శిష్ఠలోకమే ప్రమాణమైనా. సంస్కృతం వంటి అప్రవాహిభాషల విషయంలో శిష్టలోకవ్యవహారాన్ని ప్రసాదించే పాణిన్యాదుల తంత్రాలను గాని వాటి సంగ్రహాలనుగాని దర్శించక వాటిస్వరూపం గోచరించదు. అట్లా గోచరించనిదశలో సంస్కృతం వ్రాయడం మొదలు పెట్టితే వుజ్జాయింపు చూపి వ్రాయవలసివస్తుంది. ఆవుజ్జాయింపులో శబ్దరూప వినాశం అర్ధవినాశం సంభవిస్తున్నవి. ఇట్లాటివ్రాతలకు హేతువైనదాన్నే భాషానభిజ్ఞత అని నేనంటున్నాను. దీన్నిగురించి పరిశిష్ట ద్వితీయాధ్యాయంలో మరికొంత వివరిస్తాను. మనదేశంలో నేటికాలపు కృతుల్లో భారతీయ సంస్కారం నశించి జీవంబోయి శరీరం మిగిలినట్లుగా ఈవుజ్జాయింపు అసంబద్ధ సంస్కృతంమాత్రం మిగిలింది. నేటికాలపుకృతుల్లో భాషానభిజ్ఞత తరుచుగా కనబడుతున్నదన్నాను.

"వెలదీ యెవ్వతెవు నీప విటపీవనీలోన్" (కృష్ణపక్షం)
"వెదకెదు ఎవ్వతెవు నీప విటపీవనిలోన్" ..
"ఉపాధ్యాయిని" (సుజాత సం. 1. స. 3. కృష్ణపక్షం)
"ధనదారాపుత్ర" (వా.గోపాలకృష్ణయ్య. విద్యార్థిపత్రిక.1-1)
"మనోకేతకి" (భ.రాజేశ్వరరావు ప్రణయగీతములు-భారతి)
"తపోశక్తి...జిజ్ఞాసత్వము, తపోసంపత్తి"
            (వి.యన్.శర్మ.అవతారమూర్తులు.ఆంధ్రభారతి సం.1. సం.5.)
"అనుమానావతారముగఁ బరిగణింపబడెను”
            (సుసర్లఅనంతరావు, బేకనుపన్యాసములు.)
"పరిమళముల్ చెలంగఁగశుభస్కరమౌతను వల్లి యొప్ప"
          జ. శేషాద్రిశర్మ. విచిత్రపాదుకాపట్టాభిషేకం)
"మీయంగీకారము నాకపార సహాయము జేసెను"
           (జనమంచి శేషాద్రిశర్మ. విచిత్రపాదుకాపట్టాభిషేకం.)
"మత్పితృప్రతిష్ఠాపిత శైవలింగము గడంక భజించెదనాత్మవా రణాసీ పురి నేతభృంగిరిటశిష్యుని."
        (విశ్వనాథ సత్యనారాయణ, భారతి, ఆనార్కళి, సం.3. స. 3.)
"స్త్రీలే యుపాధ్యాయినులుగా, ఉపాధ్యాయినులు, ప్రబంధప్రణీ తృపంధను."
        (రావుబహదూరు కందుకూరు వీరేశలింగముపంతులు. స్వీయచరిత్రము II, 305, 292, 152)
"కొందరేపటిమయులేక బిరుదపద్దతిగొండ్రుయశోద్ధతిన్ గనన్"
            (భోగరాజు.నారాయణమూర్తి, భారతి,సం.4.సం.2.)
"వాల్గంటుల సత్సహాయములె కావలయుంగద పూరుషాళికిన్"
            (కావ్యకుసుమావళి 1. వేంకటపార్వతీశ్వరకవులు).
"శిరోపాళిన్"(ఆంధ్రభారతి, 1-6,పసుమర్తి, అనంతపద్మ నాభము)
"దారాపుత్రాభిమానులు భక్తిరసప్రాధాన్యత, నరసిహ్మావతారము"
            (ఎ.వి. నరసింహంపంతులు, శ్రీ గీతగోవిందము)
"అనుచున్ శంకరుడాభిడౌజముఖ......"
            (కేసిరాజు. వేంకటసుబ్బరాయకవి.)

        
 "వేంకటసుబ్బరాయ ప్రణీతంబైన యేకాదశీ మహిమా సర్వస్వము"
             (కేసిరాజు వేంకటసుబ్బారాయ కవి.)
"మనో చ్ఛేదవృత్తి, తపోక్తల్ దాల్ప
          (రాయప్రోలు సుబ్బారావు. 1 స్నేహలత. 2 సుజాత సం.1.సం.4)
"మగుడన్ స్వచ్ఛేతరాంగికిని ప్రేమాపుష్పసద్భంగికిన్"
          (తేకుమళ్ల రాజగోపాలరావు, కనకవల్లి.)
"మునివృత్తిచాలించి శ్రీశైలపర్వతమువెడలి"
          (తేకుమళ్ల.రాజగోపాలరావు. కనకవల్లి.)
"సంభరమున్‌జూపి తదైక్యతాగతి”
           (సి. యస్. జయరావు, పుష్పమాల.1-3)
"మత్స్యిభంగి" (జానపాటి పట్టాభిరామశాస్త్రి. నాగరఖండము 6.ఆ.)
"తటిల్ల తా జనితకళా సహాయమున"
"ప్రేమామహితాంతరీపముమై సొగియన్
విహరించుచిట్లనున్" (వనకుమారి, దువ్వూరిరామ రెడ్డి.)
"దేశక్షేమ దరిద్రతాయయమనోద్వేగక్షుధాబాధలున్"
          (జీవితాదర్శము, పం, రామచంద్రరావు)
"దారాపుత్రదురీషణావృతదురంతక్రూరసంతాపచింతారంగస్థలి."
          (కవిజిజ్ఞాస శ్రీ శేషాద్రిరమణకవులు)

అని యిట్లాటి వుజ్జాయింపు అసంబద్ధ సంస్కృతం నేటి కాలపుకృతుల్లో తరుచుగా గోచరిస్తున్నది. విటపివని, ఉపాధ్యాయి, ఉపాధ్యాయ, ఉపాధ్యాయాని, దారపుత్ర, మనఃకేతకి, తపశ్శక్తి, జిజ్ఞాస, జిజ్ఞాసుత్వము, తపస్సంపత్తి, సందేహావతారము, సంశయావతారము, శుభకర, శుభంకర. అపారసాహాయ్యము, వారాణసీ, వారణసి, ఉపాధ్యాయలు, ఉపాధ్యాయానులు, ప్రబంధప్రణీతృపథమును, యశుద్ధతి, సత్సాహాయములు, శిరఃపాళీ, దారపుత్ర, ప్రాధాన్యము. నరసింహావతారము, బిడౌజోముఖ, మహిమ సర్వస్వము, మనఉచ్ఛేదము, మనశ్ఛేదము, తపఉక్తుల్. ప్రేమపుష్ప, శ్రీశైలము, శ్రీపర్వతము, ఐక్యగతి, మత్సిభంగి, కళాసాహాయ్యమున, ప్రేమమహితాంతరీపమున దారపుత్ర, మనఉద్వేగ అని వుండవలెను. ఇంకా శిరచ్ఛేదం. ప్రభ్విణి, సరోజని మొదలైనవెన్నో అనేక గ్రంథాల్లో పత్రికల్లో వున్నవికాని విస్తరభీతిచేత వాటిని ఉదాహరించక వదలుతున్నాను. ఇక తెలుగులో అరసున్నలు గజడదబలు గసడదవలు, మొదలైనవికారాలు వెనకటివలెనే వున్నవి. పాతబడ్డ తుప్పుమాటలు మూలగొట్టుమాటలు మాత్రం లేక భాషయిప్పటికృతుల్లో ప్రసన్నత్వానికి వచ్చింది. ఈదశ శ్రీనాథాదుల కృతుల్లో. కృష్ణకర్ణామృతం, భర్తృహరిత్రిశతి, వేమనశతకం మొదలైన వాట్లో వున్నాయిప్పుడు సాధారణమైంది. ఇది సంతోషహేతువేగాని. పులుముడుమొదలైన దోషాలకాకరం కావడంవల్ల అది అచరితార్థమవుతున్నది.

ఛందోవ్యతిక్రమం.

గుర్వంతపాదాలూ, గుర్వక్షరబహుళాలూ, అయినా శార్దూలం మత్తేభం మొదలైన సంస్కృతవృత్తాలు తెలుగుభాషాతత్వాని కెంతమాత్రం అనుకూలమైనవి గావు. వీట్లో తెలుగుపద్యాలు వ్రాయడం ఛందోవ్యతిక్రమ మవుతున్నది. ఈఛందోవ్యతిక్రమమే భాషావ్యతిక్రమానికి హేతువు. ఛందోవ్యతిక్రమం భాషావ్యతిక్రమాన్ని భాషావ్యతిక్రమం ఛందోవ్యతిక్రమాన్ని పరస్పరం పెంచుకుంటూ వుండగా ఈ రెండూకలిసి తెలుగుభాషను ఛందస్సును వికృతంజేసి తద్వారా విజ్ఞానవికాసానికి అడ్డుపడుతూ ఆంధ్ర జాతిని వంచిస్తున్నది. భారతంలో యీ వ్యతిక్రమ మారంభమైనప్పటినుండి అడుగడుక్కూ వక్ష్యమాణాధికపదదోషంచేత దూషితమైన దీర్ఘవృత్తాలుశరణమై క్లుప్తంగా వ్యంగ్యవిభుత్వంతో రచించే ఉత్తమకవితామార్గానికి అంధులమై మనకు పద్యం వ్రాయడమే కవిత్వమయింది. ఇప్పటికి పద్యం వ్రాయడమే మనకు కవిత్వంగా వున్నది. గీతం, ద్విపద, రగడ, ఉత్కళిక మొదలైన వాటిని కొందరు వాడుతున్నా సంస్కృతవృత్తాల నింకా వదలలేదు. సంస్కృతంలో మందాక్రాంత, శార్దూలంవంటి వృత్తాల్లోనే కవితాశిల్పానికి భావం కొంత దీర్ఘంగా కనబడుతుంది.

మన సీసపద్యపు నాలుగుపాదాలమటుకే మందాక్రాంతకుగాని శార్దూలానికిగానిసరిపోతవి ఇంకా సీసానికి గీతపాదాలు నాలుగుతగిలిస్తే భావం మిక్కిలి దీర్ఘమై అప్పుడు కవిత్వచ్ఛాయపోయి ఉపన్యాసధోరణిలోకి దిగుతుంది. ఒక్కొక్కప్పుడు పద్యమెక్కువై దండగమాటలు నింపవలసి వస్తున్నది. శార్దూలాదివృత్తాలతో నిండివున్న మన తెలుగుకృతుల్లో ఛందోవ్యతిక్రమం వుదాహరించడం అనావశ్యకం గనుక ఉదాహరణాలను చూపక వదలుతున్నాను.

యతిభంగం.

యతి అంటే విచ్చేదం. సీసంవంటి దీర్ఘపద్యపుపాదాల్లో శ్రోతకు శ్రవణసుఖాన్ని పఠయితకు యత్నసుఖాన్ని యతి ఆపాదించి పద్యం యొక్క శ్రావ్యతకు సుగ్రహతకు మిక్కిలి తోడ్పడుతున్నది. ఈసంగతి సీసం, శార్దూలం, మందాక్రాంత మొదలైనవాటిని పఠించి కనుక్కోవచ్చును. కనుకనే ఉచితస్థలాల్లో యతిని ఉపదేశించిన భారతీయచ్ఛందోవేత్తలు పద్యరమ్యతను ప్రతిష్ఠించారంటున్నాను.

ఇట్లాటి నియమంనుండి తెలుగుపద్యం భారతంలోనే చ్యుతమై యిప్పటికీ నియమహీనంగానే వుంటున్నది.

"త్రేతాద్వాపరసంధినుద్ధతమదాంధీభూతవిద్వేషిజీ,
 మూతవ్రాత " (భా-ఆ.)

భారతంలో ఆరంభించిన యతిభంగ దోషం యిట్లా నేటికీ దూరంగాక తెలుగుపద్యాన్ని వికృతంచేస్తున్నది.

పాదభంగం.

వృత్తాన్ని పదచ్ఛేదయుతమైన పాదాలుగా విభజించి ఒక్కొక్క పాదం ఒక్కొక్క భాగంగా పింగళాదు లేర్పరచడంలో, పద్యంయొక్క గతివిశేషం, అర్థప్రదత్వం. శ్రావ్యత్వం మొదలైనగుణాలు పుష్టమవుతున్నవి. కనుకనే పాదాంతయతి నియతంగా భారతీయచ్ఛందోవేత్తలు పరిగణించారు. కాని యీపాదసౌందర్యం నన్న యభారతంలోనే లుప్తమైంది.

"విద్వన్ముఖ్యుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండుకృ
 ష్ణద్వైపాయను డేగుదెంచె" (స.భా)

"విద్యుద్దండము నిల్చి పొల్చినగతి న్విల్లందమైయుండ న
 స్మద్యోధావలి మానసంబున రణోత్సాహంబు రెట్టింపదృ
 ష్టద్యుమ్నుoడు." (తి. భా)

అని యిట్లా భారతంలో ఆరబ్దమైన పాదభంగం.

               
"నాదేశంబున వేరుపాతుకొనె సంఘప్రస్పుటాచారర
 క్షాదీక్షాపరతంత్రబుద్ధిలత" (జీవితాదర్శం).
"రేఖామంజుల వాసనాలహరి పర్వెన్ ప్రాతరానీతశో
 భాఖద్యోత విలాసరాగలలితప్రాంశు"
                                      (అనార్కాళి. భారతి)
 

అని యిట్లా యిప్పటికీ గోచరిస్తున్నది. పద్యాలు పాదసౌందర్య హీనమైనవి. కొన్ని పొడుగైన వొంటికాలిమనిషివలె చాంతాడువంటి పొడుగైనఒక్క పాదంతో వున్నవి. ఇట్లా పాదభంగంచేత పాదసౌందర్యం లుప్తమయి పద్యం వికృతమైంది.

వళిప్రాసల అనర్థాలు.

వళిప్రాసలు శబ్దాలంకారాలకు చేరిన అస్థిరధర్మాలు. ఇవి పద్యానికి అవశ్యకంగావు. వీటిని నన్నయాధికరణంలో వివరించాను. వీటిని ఆవశ్యకనియమంగా స్వీకరించినప్పుడివి పద్యానికి పనికిమాలినవే గాకుండా అనర్ధహేతువులుగూడా అవుతున్నవి. యతిభంగం పాదభంగం అనేకస్థలాల్లో యీవళిప్రాసలవల్లనే సంభవించి దండగ్గణం. భూమిగణం, గుంపుగణం, ప్రకాశగణం, సంబోధనగణం అధికవిశేషణగణం ఆపతితమై పద్యం భ్రష్టమైంది. యతిభంగ పాదభంగా లిదివరకే వివరించాను.

గొనకొని. పన్నుగ, మానుగ, ఓలి, ఒగి, మదినెంచ, మతినూహించ మొదలైనవి దండగణం. అవలి, సమూహం, నికరం, పిండు. తతి, వ్రాతం మొదలైనవి గుంపుగణం. యెసగు, యెసకమెసగు, చెన్నలరారు, చెన్నుమీరు, విలసిల్లు, రాజిల్లు, విలసత్, రాజత్, భ్రాజత్, లసత్, ఉజ్వలత్ మొదలైనవి ప్రకాశగణం, ఇలన్, ఇమ్మహిన్. ఇద్దరన్, అవనిన్, మొదలైనవి భూమిగణం. అనఘా. ఇద్దతేజ మొదలైనవి సంబోధనగణం. ఉద్యత్, ప్రోద్యత్, అతుల, అమలిన, అనుపమ, సార. స్ఫార, అమల మొదలైనవి అధికవిశేషణగణం. వక్ష్యమాణమైన శబ్దవాచ్యతాదోషం సయితం యీ అధికవిశేషణగణంలో చేరుతున్నది. ఈ గణాలు కొన్నిచోట్ల ఛందోవ్యతిక్రమంవల్ల కొన్ని చోట్ల వళిప్రాసల నిర్బద్ధమె పాదం పూర్తిగాక, వళిప్రాసలు పైనబడవలసివుండి, అటునాలుగు యిటునాలుగు అధికవిశేషణాలు వేసి వ్యంగ్యసౌందర్యం రూపుమాపి పైగా దండగ్గణం, గుంపుగణం మొదలైన వాటినిదింపి పద్యాన్ని పెంటబుట్టనుచేశాము. ఇట్లా పద్యాలు వ్యంగ్యశూన్యమై పిచ్చిదండగ మాటలతో నిండడంవల్లను. వీటిని సవిచారణగా చదవడం అవసరం గాకపోవడంవల్లను, తెలిసిందిలే అని శబ్దార్థవిచారణలేకుండా దాటవేసికొనిపొయ్యే ధోరణి బుద్ధిలో పాతుకొని పఙ్త్కిమననమంటేఅదెట్లావుంటుందని అడిగేదశకు ఆంధ్రులం వచ్చాము.

1. జననాధ వేటనెపమున, గొనకొని కణ్వాశ్రమమునకున్.

2. గొనకొని వీడునీకును శకుంతలకుం బ్రియనందనుండు.

3. పెట్టు నీవారాన్న పిండతతులు. (న.భా)

4. వర్జితకుసుమాక్షతావళులు (న.భా. దుష్యంతచరిత్రం)

5. సహకారములం గదళీతతులన్. ,,

6. తనరజనకుండు నన్న ప్రదాత. ,,

7. దుర్మతి కిహముం బరముఁ గలదె మదిఁబరికింపన్. ,,

8. ఇమ్ముగ సరస్వతీతీరమ్మున. ,,

9. దక్షిణ లిమ్ముగనిచ్చి. ,,

10. తగఁగవివాహంబెన్నం, డగునొకొయెన్నండు సంగమావాప్తి యుమా, కగునొకొ యనియెదం గోరుచు, నొగి నిటనుండిరి సుభద్రయును విజయుండున్. (న.భా)

11. మతిననురక్తయయివానిమానుగఁదనకుం, బతింజేసికొనియె..

12. తనునెరిగిన యర్థంబొరు, డనఘా యిది యెట్లు చెప్పుమన...

13. ఇమ్మహిం ద్రయోదశద్వీపమ్ములు దన శౌర్యశక్తి..

14.ఆలునుదాసియున్ సుతుడునన్నవి బాయనిధర్మముల్ మహిన్.."

15. మతిఁ దలఁపఁగ సంసారం, బతిచంచల. ,, 16. ధర్మతనూభవు నందునాటిరే, యిమ్ములఁ జల్పి. ,,

17. మతినూహింపనశక్యమైసవనమున్ మర్ధింతు రెందున్.(తి.భా.)

18. అతులోర్వీసురముఖ్యమంత్రహుతమాహాత్మ్యంబునన్. (న:భా)

19. అమల సువర్ణశృంగఖురమై. ,,

20. అమలిన తారకాసముదయంబుల నేన్న ను. ,,

21. నిరుపమ ధర్మమార్గ పరినిష్ఠితు లై . ,,

22. మా. తంగస్ఫూర్జిత యూధదర్శనసముద్యత్ క్రోధమై.(తి.భా.)

23. కాన తగం బొందుట కార్య మియుభయమున్. ,,

యీతీరుగా భారతంలో ఆరబ్దమైన యీదండగమాటలు యెర్రాప్రెగడ హరివంశంలో అంతకంటె అధికంగా విస్తరించినవి ఆముక్తమాల్యద నిండా గుంపుగణం మూలుగుతున్నది. కొన్నిచోట్ల ఒక్కొకపద్యానికే మూడునాలుగు గుంపులున్నవి. ప్రథమాశ్వాసంలో ఒక్క శుకకదంబము అనేపద్యంలో రెండుగుంపులు "తలపక్షచ్చట" అనేపద్యంలో మూడుగుంపులు "నిర్ఘరప్ర" అనేపద్యంలో నాలుగు గుంపులు నిండినవి

1. లలితోద్యానపరంపరా.

2. పెరపురాళి.

3. తలపక్షచ్ఛట గ్రుక్కి బాతువులు కేదారంపు కుల్యాంతర స్థలి నిద్రింపఁగం జూచి యారెకులుషః స్నాతప్రయాత ద్విజావలి పిండీకృతశాటులన్ సవి తదావాసంబు చేరంగ రేవులడిగ్గన్ వెసబారువానిం గని నవ్వున్ శాలిగోప్యోఘముల్. 4. వాలుగుమొత్తము.

5. అందుండున్ ద్వయుసద్మపద్మవదనుం డద్వంద్వు డశ్రాంతయో
   గాందూ బద్ధమధుద్విషద్ది బద్ధమధుద్విషద్ద్విరదు డన్వర్థాభిధానుండురు
   చ్ఛందో బృంద...

6. క్రుంకు మెడగుంపులు.

7. భాషితంబులుగాం దోడిబ్రాహ్మణౌఘ.

8. శుకకదంబముగొలుసులచే నిబద్దమై వారాంగనాగారకారబడఁగ
   గిరికానికాయంబు లరిశూన్యబహుపురహర్మ్యవాటికలఁ జెండాడుచుండ
   సురగాలిదవదగ్ధతరుపర్ణతతిరేఁపఁ బావురాలని డేగపదుపుదూరె
   నిద్రితద్రుచ్చాయనిలువకజరుగవెంబడిగనధ్వగపంక్తి పొరలువెట్టె
      
   క్షేత్రరపాలునకుదికినచీరలాఱు
   చాకిరేవు లగములయ్యి సకలదిశలు.

9. గోస్తనీమృదు గుళుచ్ఛస్తోమములతోడ.

10. నాదారని కూరగుంపు.

యీతీరుగా దండగమాటలు రోతలోకిదిగినవి. ఇవి విచిత్ర పాదుకాపట్టాభిషేకంవంటి యీకాలపుకృతుల్లో

     
"ఘనుడు వసిష్ఠమౌని నృపకాంతుని యింట పురోహితుండుగా
 ననిశము మంత్రిగాగఁ జెలువందుచు నుండుట కేమి హేతువో
 యనుపమ సత్కులంబు వెలయన్ జనియించు నటంచు నెంచిచే

కొనియేఁ బురోహితత్వమును గొంకక శ్రీశుని జూచుకోరికన్,"

"ఘోరరణోత్సుకుం గాంచినాడఁ- జూ,"

నిరతము సత్యవాక్కులననె నెమ్మి వచింపుచు శాస్త్రరీతులం

గరము నెఱింగి."
 
"ధరణీపాలక చంద్రుఁడీతఁడు, కృపం దాఁబూని యుర్వీజనో

త్కరమున్, రంజిలంజేయుచున్ జగతి జక్కంగాంచె.

"గనియెడు దృష్టిపాటవము. కన్నన దగ్గెను"
 
"యన్నరో వెన్నకన్నననయంబు మృదుత్వము గాంచుగాన నే

మన్నన గాంచెలోకమున మానిత పండితపొలిచే 'దరస్."
 
వీరకానన సముదయ నీతి: హోత్రు

డానతామర్త్యసముదయుం డట్టి పరశు."

"జనిఫలియించునంచెపుడు స్వాంతమునన్ దలపోయుదానఁజూ"

(జనమంచి శేషాద్రిశర్మకృతి, విచిత్రపాదుకాపట్టాభికే కం).

అని యిట్లావ్యాపించి వికృతరూపం చూపుతున్నవి

"వనరాజిపల్వలం "సపల్వలో త్తీర్ణవరాహ యూధాన్యావాస
 వృక్షోన్ముఖబర్హిణాని" "ప్రసీదశశ్వన్మలయస్థలిషు"

అని ప్రసక్తంగా వుచితమైనచోట్ల యివివుంటే రోతగాదుగాని అయినచోటా కానిచోటా దండగ్గా సమయాన అసమయాన వీటిని గుప్పించడం జుగుప్సకు హేతువగుతున్నది. ఇట్లాటి దండగమాటలు అ ప్రసక్తంగా యెక్కడవున్నా నింద్యమే అవుతున్నవి. అధిక విశేషణగణం తప్ప తక్కినదండగమాటలు కృష్ణకర్ణామృతం, శ్రీనాథాదులకృతులు మొదలైనవాటిలోవలె నేటికాలపు అనేక కృతుల్లో తగ్గడం సంతోషహేతువేగాని వీటి అన్నిటిబదులు అధికవి శేషణగణం ప్రబలింది.

"దివ్యనిర్మలరత్న దీపంబనైపుట్టి,
 లలిత మోహనకలాలాపంబనై పుట్టి"
           (నిర్వేదం. వేంకట పార్వతీశ్వరకవులు.. భారతి)

"ఉద్యద్యశః ప్రాదుర్యాచ్చసుధా" (భారతి)

"ఉరువై సృత్యతమిస్రపుంజ రచనో ద్యుక్తంబులౌ "

"సుస్థిరకాంతి స్థగితంబుగా"
           (పెమ్మరాజు లక్ష్మీపతి. భారతి. 2-9)

"క్రౌర్యకౌటిల్యకలుష పంకంబువలన" (కృష్ణపక్షం.)

"హృదయదళనదారుణ మహోగ్రకార్యంబుదలచిపోవు."(కృష్ణపక్షం)
 
"ఇంపుదళ్కొత్తపాటల సొంపుమీరె."
               (పెద్దిబొట్ల రామచంద్రరావు. బియల్ క్లాసు. ఆంధ్రహెరాల్డు.)
 
"రేఖామంజులవాసనాలహరి"
              (విశ్వనాధ సత్యనారాయణ, అనార్కళి. భారతి.)

యిట్లా యీకాలపుకృతులను అధికవిశేషణగణం కలుషితం చేస్తున్నది. వక్ష్యమాణమైన శబ్దవాచ్యత దండగమాటల కిందికి గూడా వస్తున్నదని యిదివరకే తెలిపినాను. అధికవిశేషణ రూపమైన దండగమాటలతో పాటు యతిభంగం. పాదభంగం, భాషావ్యతిక్రమం, ఛందోవ్యతిక్రమం ఈకాలపుకృతుల్లో అట్లానేనిల్చినవి. యతిభంగాన్ని, పాదభంగాన్ని ఛందోవ్యతిక్రమంలోనే చేర్చి యీమూటినీ నేనిందు ఛందోవ్యతిక్రమ మనివ్యవహరిస్తున్నాను. ఇవి కాలపుకృతులను మలినపరుస్తున్న సంగతిని విశదంచేశాను. ఈ ఛందోవ్యతిక్రమంయేతీరుగా దోషమై ఆంధ్రుల భాషాసంస్కారాలకు అడ్డుపడినదీ, నన్నయ ఆరంభించిన భాషావ్యతిక్రమాన్ని దండగ్గణాలను నిరోధించదలచి తిక్కన యెట్లా ప్రతిక్రియనడిపిందీ, ఆప్రక్రియలో అత డెట్లా పాదభంగఁ యతిభంగం విరివిగాచేసిందీ, చివరకు రేక్కంపమీద నడిచేమనిసి ముండ్డుతప్పించుకో లేనట్లు ఆదోషాల కెట్లా పాలుపడ్డదీ ప్రథమఖండంలో విపులంగా మీమాంసచేశాను గనుక యింతటితో వ్యతిక్రమదోష విచారణ చాలిస్తాను. అనుప్రాసాది శబ్దాలంకారాలవలె స్వయంగా ఆపతితమైన స్థలాల్లో తప్ప తక్కినచోట్ల వళిప్రాసల నిర్బద్ధమైత్రులు పాదభంగ యతిభంగాలు, దండగ్గణాలు మొదలైన క్షుద్రలక్షణాలకు హేతువలై పద్యాన్ని కలుషితంచేశేవి గనుక అవి అట్లాటి చోట్ల అత్యంతం హేయమని ఛందోవ్యతిక్రమం దూష్యమని దీనివల్ల పద్యం భ్రష్ట మయిందని యిప్పటికావ్యాల్లో మీ రనుకొన్న కొత్త లేక పొయినా యీదోషాలు కావ్యాలను వికృతంచేస్తున్నవని మరల చెప్పి యిక కావ్యజీవవిచారణ ప్రారంభిస్తాను.


అని శ్రీ... ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో వ్యతిక్రమాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః

వాఙ్మయపరిశిష్టభాష్యం.

భావకావ్యాధికరణం.

యిట్లాటి దోషా లెన్నివున్నా యిప్పటికవుల "చిన్నకావ్యాలు పాశ్చాత్యుల లిరిక్కులవంటివని అవిభావకావ్యాలని. వీటిలోది భావకవిత్వ మని అది కొత్తే నని యాదోషాలన్నీ యీకొత్తలో అణిగిపోతవని చెప్పిన పూర్వపక్షానికి భావకావ్యాలు చిరకాలనుండి వున్నవని కొత్తగాదని చెప్పినాను. ఆసంగతి వివరిస్తాను.

సర్గబంధం లేని కావ్యాలు, చిరకాలంనుండి మనవాఙ్మయంలో వుంటున్నవి. ఘటకర్పరకావ్యం, సూర్యశతకం, బిల్హణకావ్యం, సౌందర్యలహరి, కాళహస్తీశ్వరశతకం, ఇవన్నీ యీకోటిలోనివి. వీటికే మనపూర్వులు ఉపకావ్యాలని ఖండకావ్యాలని పేరుపెట్టినారు.

"అసర్గబంధమపియదుపకావ్య ముదీర్యతే" "అసర్గబంధం సూర్యశతకాది". (ప్రతాప)

అని విద్యానాథుఁ డన్నాడు

"ఏకార్థప్రవణైః పద్యైః సంధిసామగ్ర్యవర్జితం
 ఖండకావ్యం భవేత్ కావ్యస్యైకదేశానుసారి చ" (సాహి)

(ఏకార్థ ప్రవణమై సంధిసామగ్ర్యరహితమైన పద్యాలసము దాయానికి కొన్ని లక్షణాలు తగ్గినకావ్యానికి ఖండకావ్య మని పేరు.)

"యథా భిక్షాటనం ఆర్యావిలాసశ్చ" (సాహి) అని విశ్వనాథు డన్నాడు. యీతీరుగా చిన్నకావ్యాలు విభాగరహితమైనవి, మనవాఙ్మయంలో చిరకాలంనుండి వున్నవి. కనుక ఆకారంచేత యిప్పటి చిన్నకావ్యాలు కొత్తవికావు.

పూర్వపక్షం.

అవునయ్యా, ఆకారంచేత కొత్తవికాకుంటె పోనియ్యండి. వనకుమారి, యెంకిపాటలు మొదలైనవి భావకవిత్వం. ఇది కొత్తది. యిది వరకు లేదు. ఇంగిలీషులో లిరిక్సునుచూచికొత్తగా యిప్పటివారు నిర్మించినది. భావకవిత్వం.

తటస్థాక్షేపం.

భావకవిత్వ మనడమె అసంగతం. శ్రీకాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రివారు వ్రాసినట్లు భావంలేనిది కవిత్వమే లేదు. కవిత్వ మెక్కడ వుంటుందో భావ మక్కడ వుండనే వుంటుంది."

సర్గబంధంలేని చిన్నకావ్యాలు చిరకాలంనుండి మనవాఙ్మయంలో వుంటున్నవి. ఘటకర్పరకావ్యం. సూర్యశతకం, బిల్హణకావ్యం, సౌందర్యలహరి, కాళహస్తీశ్వరశతగం ఇవన్నీ యీకోటిలోవి. వీటికే మనపూర్వులు ఉపకావ్యాలని, ఖండకావ్యాలని పేరు పెట్టినారు.

"అసర్గబంధమపి యదుపకావ్యముదీర్యతే" (ప్రతా.)

అసర్గబంధం సూర్యశతకాది అని విద్యానాధుడన్నాడు.

"ఏకార్థప్రవణైః పద్యైః' సంధిసామగ్ర్యవర్జితం,
 ఖండకావ్యం భవేత్ కావ్యస్యైకదేశానుసారీచ" (సాహి.)

(ఏకార్థప్రవణమై సంధిసామగ్ర్యరహితమైన పద్యాలసముదాయానికి కొన్ని లక్షణాలు తగ్గినకావ్యానికి ఖండకావ్యమని పేరు.)

"యథా భిక్షాటనం ఆర్యావిలాసశ్చ" (సాహి.) అని విశ్వనాథు డన్నాడు.

"న భావహీనోస్తి రసో న భావో రసవర్జితః,
 పరస్పరకృతాసిద్ది రసయో రసభావయోః" (సాహి)

అని సాహిత్యదర్పణకారుడు విశదంచేశాడు. ఇంగిలీషులో లిరికల్ కవిత్వాన్ని గురించి కూడా యిట్లానే సాహిత్యవేత్త లభిప్రాయపడ్డారు.

"Jonffroy was perhaps the first aesthetician to see quite clearly that lyrical poetry is really nothing more than another name for poetry itself, that it includes all the personal and enthusiastic part of what lives and breaths in the art of verse so that the divisions of pedantic criticism are of no avail to us in its consideration. We recognize a narrative or epic poetry; we recognize a drama; in both of these when individual inspiration is strong, there is much that trembles on the verge of the lyrical.But outside what is pure epic and pure drama, all or almost all is lyrical. (Encyclopedia Britannica.)

(లిరికల్ కవిత్వమనేది కవిత్వానికే మరియొక పేరని స్పష్టముగా కనుగొన్న ప్రథమసాహిత్య వేత్త "జాన్ఫ్రాయి" అని చెప్పవచ్చును. పద్యకళయందు ప్రాణభూతమైన లక్షణాలు లిరికల్ కవిత్వ మని అతడు విశదీకరించాడు. కనుక ఇది లిరికల్ కవిత్వ మని ఇది కాదని విభాగంచేయడం నిష్ప్రయోజనం. ఇది నాటకకవిత్వమని నిర్ణయించవచ్చును. ఇది థాకవిత్వమని నిర్ణయించవచ్చును. యీరెంటిలోను కవియొక్క స్వీయభావం ఉద్వేగం చెందినప్పుడు లిరికల్ కవిత్వాన్నే సమీపిస్తున్నది. యెపిక్కు, నాటకం, తప్ప తక్కిన కవిత్వమంతా దాదాపుగా అంతాలిరికల్ కవిత్వమేను) అని ఉక్తమవుతున్నది. కనుక సాధారణంగా కవిత్వమంతా భావకవిత్వమే. అందువల్ల యీభావకవిత్వం కొత్తదనే మాట అయుక్తమని తోసివేస్తున్నాము.

పూర్వపక్షం.

అవునయ్యా; కవిత్వమెక్కడవుంటుందో భావమక్కడవుండడం వాస్తవమైతే కానియ్యండి. యెవరేమన్నా లిరికల్ కవిత్వమని వొకశాఖపాశ్చాత్యవాఙ్మయంలో ప్రత్యేకంగా యేర్పడివున్నది. దానిలో భావోద్రేకం ప్రధానం. అవి చిన్నవి. వీటిననుసరించి మేమిప్పుడు భావకవిత్వమనే వొకశాఖను ప్రత్యేకించాము. ఇట్లా భావకావ్యాలనే పృథక్శాఖయిదివరకు మన వాఙ్మయంలోలేదు. భావకావ్యమనే పేరే యిదివరకు లేదు. ఇదే నూతనత్వం అని అంటారా.

సిద్ధాంతం.

చెప్పుతున్నాను. పూర్వపక్ష తటస్థాక్షే పాలకు కలిపి సమాధానం వివరిస్తాను. కవిత్వ మెక్కడవుంటుందోభావ మక్కడవుంటుందనే మాట వాస్తవమేను. భావకవిత్వం భావకావ్యం అనడం అసంగతంకాదు. మనవాఙ్మయంలో భావకావ్యం అనే పృథక్శాఖలేదని, అందువల్ల నూతనమని అనడం మిక్కిలి అసంబద్ధం. భావకావ్యం అనేది చాలా ప్రాచీనమయినది. అది మనవాఙ్మయంలో చిరకాలంనుండి వుంటున్నది. శిశుదేవజడప్రకృతివిషయమైన ప్రేమ విషాదాదులు సాహిత్య శాస్త్రంలో భావసంజ్ఞను పొందుతున్నవి. భావమంటే ముందు వివరిస్తాను. ఇట్లాటిభావం యెక్కడ ప్రధానంగా వ్యంగ్యమైవుంటుందో దానికి భావధ్వని అనిపేరు.

"రసభావతదాభాస భావశాంత్యాదిరక్రమః" (కావ్య.)

అని మమ్మటుడు.

"అక్రమః " అంటేఅసంలక్ష్యక్రమవ్యంగ్యధ్వని అని అర్థం, రసం ప్రధానంగావుంటే రసధ్వని అని, భావం ప్రధానంగావుంటే భావధ్వని అని యీతీరున కావ్యవ్యపదేశాలు. 

"ఇత్యుక్తదిశోద్రేకం ప్రాప్య రసస్య ప్రాధాన్యేపి ఆపాతతో యత్ర ప్రాధాన్యేన అభివ్యక్తో వ్యభిచారిణః స భావః"

—-, (సాహి)

(రసం ప్రధానమయినా ఉద్రేకంపొంది రసంకంటెయెక్కువప్రధానంగా విషాదాదులు అభివ్యక్తమయితే దానికి భావమని పేరు.)

అని సాహిత్యదర్పణకారుడు తెలుపుతున్నాడు --ఇతడే

"వాక్యం రసాత్మకం కావ్యం"

—-, (సాహి)

ఆని చెప్పి

"రస్యత ఇతి రస ఇతి వ్యుత్పత్తి యోగాతో భావతదాభాసాద యోపి గృహ్యంతే"

—-, (సాహి)

అని విశదపరచాడు. రసాత్మకకావ్యం భావాత్మకకావ్యం అనియీ తీరున భేదాలను విశ్వనాధుడు తెలుపుతున్నాడు. భగవంతుడి మీద గురువులమీద -తండ్రిమీద మిత్రుడిమీదావుండే ప్రేమకు భావమని పేరు. "ఆది. వ్యక్తమయ్యేకావ్యం భావాత్మకకావ్యం, భావకావ్యం, భావధ్వని,అని వ్యపదేశం పొందుతున్నది.

పూర్వపక్షం.

అవునయ్యా, మీరు సంస్కృతం నుండి భావకావ్యం ఉదాహరించారు. మే మనేది తెలుగులో భావకావ్యం కొత్తదని. సంస్కృతంతో మనకు పనేమిటీ? సంస్కృతం బంగాళీలు మహారాష్ట్రులు మొదలైనవారిది. దానితో మనకు పనిలేదు. మావి తెలుగువాట్లో కొత్తరకం అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను. మనము.. భారతీయులం.. సంస్కృతంమమీద బంగాళీలకు మహారాష్ట్రులకు యెంతహక్కువున్నదో మనకూ అంతే హక్కువున్నది అది. సర్వ భారతజాతులకు పితృపైతామహమయిన ధనం. ఆది ,బంగాళీలది మహారాష్ట్రులది, వారిది వీరిది, నాదిగాదు, అని దానికి దూరమైతిమా, భారతీయసంస్కారవిహీనులమై భారతీయులలో అధమాధములం కాగలము. ఈ అధమాధమదతే నేడు ఆంధ్రులకు ప్రాప్తించింది. భారతీయుల మని అను కుంటాముగాని భారతీయ సంస్కారానికి అత్యంతం అంధులమైనాము. మన కిప్పుడు వున్న కొద్ది తెలుగుపుస్తకాల్లో వున్నదే భారతీయసంస్కార మనుకొని వంచితులమైనాము.

భారతీయసంస్కారం భారతీయసాహిత్య జిజ్ఞాసలు యీ అధమదశలో మన విశ్వవిద్యాలయస్థానాల్లో నశించినవి గనుకనే కుళ్లినప్పుడు పుట్టే పురుగులవలె పులుముడు, అయోమయం. చిల్లరశృంగారం మొదలైన వాటితోకూడిన కృతులుపుట్టి ఆ పురుగులవలె సంచరిస్తున్నవి వేదమంత్రాలవద్ద నుండి. వేమన సూక్తులవరకు. కురుక్షేత్రంవద్దనుండి కోరబొబ్బిలివరకు ఆంధ్రులజీవనస్రవంతి ఆనుస్యూతంగా ప్రవహిస్తున్నది పోనియ్యండి యీచర్చ అట్లావుంచి చూచినా వెనకటి తెలుగు-కృతుల కంటె యిప్పటి వేమాత్రం-ముంచిదశలో లేవు మను, వసుచరిత్రలు అధమకావ్యాలయితే ఈవులుముడు అయోమయం శబ్దవాచ్యత మొదలైన దోషాలతో, అంతకంటే అధమాలై చిల్లరశృంగారంతో కూడివున్నవి గనుక యిప్పటికృతు , లేవిధంగాను మంచిదశలో లేవు.. భావం వ్యక్తమయ్యే కావ్యం భావధ్వని ఆని, భావకావ్య మనీ వ్యపదేశం పొందుతున్నదని, విశదీకరించాను.


"రతీర్దేవాదివిషయా" (కావ్యా)


అని మమ్మటుడన్నాడు


దేవమునిగురువిషయా చ రతి:" (సా.మి)

అని సాహిత్యదర్పణకారు డన్నాడు దేవాదివిషయమైన రతికి భావమని పేరని మమ్మటాదులు తెలిపినారు. శిశుప్రేమను వత్సలరసమని కొందరన్నా అదే దర్పణవ్యాఖ్యాతకు యిష్టమైనా, శిశుప్రేమను సయితం భావంలోనే మరికొందరు చేరుస్తారు.

"ఆదీపదాత్ పుత్రాదేరపి గ్రహణం ఇత్యన్యే" (సాహి)

అని వ్యాఖ్యాత ఉదాహరించాడు.ఆది పదంవల్ల ప్రకృతి: ప్రేమ సయితం భావమే అవుతున్నదనవచ్చును. సౌందర్యలహరి,ఋతుసంహారం, మహిమ్నస్తోత్రం మొదలైనవి యీభావకోటిలోనె చేరుతున్నవి. శిశుక్రందీయమని

"శిశుక్రందయమసభద్వన్ద్వేన్ద్ర జననాదిభ్యశ్చః. (పాణి)

అనేసూత్రంవద్ద పాణిని ఒక గ్రంథం పేరు ఉదాహరించాడు కాని అది యెట్లాటిదో చెప్పలేము.శిశువు యేడుపునుగురించిన అది, భావకావ్యమే అయివుంటుం దని పేరునుబట్టి చెప్పవచ్చును. ప్రియుడికి ప్రియురాలికి గలప్రేమకుమాత్రం పరిపుష్టదశలో రసమని అపరిపుష్ట దశలో భావమని పేరుపెట్టినారు. ఇప్పటివారు ఆసంప్రదాయం తెలియక తమచిన్న కావ్యాల్లో స్త్రీపురుషులప్రేమ పరిపూర్ణమైనాగూడా దాన్ని భావమేనని పిలిస్తే అది మనసాహిత్యదోషంమాత్రం గాదని భారతీయవిజ్ఞానం లేని దోషమని చెపుతున్నాను. కనుకనే

"ఈ కృతు లనేకములు భావగీతము లని ఇప్పుడు ప్రచారమునకు వచ్చిన కొత్త కవితాప్రపంచమునకు చేరినవి. సంస్కృతధాస్యమునుండి విముక్తుల మగుచున్నామని నానమ్మకం."

(తొలకరిపీఠిక. రామలింగారెడ్డి.)

"పాశ్చాత్యాదర్శముల ప్రోద్బలము దొరకునంతవరకు మన కవులు పాడినదే పాడవలసినవారైరి. నవీనమార్గరచనలలో ముఖ్య మైనది లిరిక్ అను ఆంగ్లేయరచనకు." (తృణకంకణ ప్రకాశకులు ) "నవ్యాంధ్ర కావ్యరీతులుకడచిన పదియేండ్లలో పొందియున్నవి."

(ఆంధ్ర హెరాల్డు - పురాణం. సూరిశాస్త్రి.)

"ఇంతవరకు మనకవులు సంస్కృతమునందు వివరించబడిన సంప్రదాయములను శిరసావహించి పని చేసిరి. ప్రాచీనసంప్రదాయముల యెడ గౌరవముతగ్గెను. నేడొక నూతనాధ్యాయము ఆరంభమగుచున్నది."

(నిడమర్తి సత్యనారాయణ. భారతి. సం. 3.)

అని వ్రాసినవి తెలియని అనుచితపుమాటలని విశదపరచాను.

అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర పరిశిష్టంలో

భావకావ్యాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః

వాఙ్మయపరిశిష్టభాష్యం.

జానపదపాత్రాధికరణం.

పూర్వపక్షం

అవునయ్యా, శబ్దార్థాలను బట్టిగాని వస్తువునుబట్టిగాని, భావాన్నిబట్టిగాని, యికాలపు చిన్నకావ్యాలు కొత్తవిగాకుంటే కాకపోనియ్యండి. పాత్రలనుబట్టి కొత్తవి. యెందుకంటే యీచిన్న కావ్యాల్లో యెంకి, వనకన్య, యీతీరుగా పాత్రలున్నారు. పూర్వకావ్యాల్లో దుష్యంతుడు, యక్షుడు, పార్వతి, సీత, మాలతి యిట్లాటివాండ్లున్నారు. ఈకాలపువాటిలోసాధారణప్రజలలోనుండి పాత్రలను స్వీకరిస్తున్నారు. ఇదే వీటి కొత్తఅంటారా?

సమాధానం.

ఇక్కడ వినిపిస్తున్నాను. కొత్తది అయితే అవునుగాక. కొత్తదయినమాత్రాన మంచి దెట్లా అవుతుంది? స్వస్థతకంటె రోగంకొత్తది, నిర్మలంగా వుండడంకంటే పైన దుమ్ముపడడం కొత్త , ఇవన్నీ కొత్తఅయినా మంచివిగావని సాధారణబుద్దికే తెలుస్తుంది. కాళిదాసువంటి కవివుంటే యీకాలంలో

"నవీనమిత్యేవ న సాధు సర్వం".

అని చెప్పివుంటాడు. అనాగరకదశనుండి నాగరకదశకు వస్తున్న పాశ్చాత్యులకు నవీనం అనేది మంచిదిగా వుంటే వుండవచ్చునుగాని ఆధ్యాత్మిక తేజస్సు తపస్సుధర్మం వీటితోపాటు విజ్ఞానం కావ్యప్రస్థానం మొదలైన మానసజిజ్ఞాసలు వీటిలో ఉచ్చోచ్చదశనందిక్రమంగా క్షీణిస్తున్న మనకు అందులో ఆంధ్రులకువచ్చేది అనేక సందర్భాల్లో ఇప్పటివరకు క్షయంగానే వుంటున్నది. ఇంతకూ చెప్పదలంచిం దేమంటే కొత్తదంతా మంచిదిగాదని కొత్త కొత్త అని మురియడం అవివేకమని తెలుపుతున్నాను. భారతవర్ష క్షయాన్ని గురించి దుఃఖపడ్డ విబుధులు సత్యాన్ని ప్రకటించినట్లే కనబడుతున్నది.

అవునయ్యా. వీటిని యింగిలీషులో. (Pastoral Poetry) పాస్టరలు పొయెట్రీ అని అంటారు కనుక ఇది మంచిది అని అంటారా? అది అసంబద్ధం. ఇంగిలీషులో దాన్నే పేరుతో పిలిస్తే నేమి? ఆ పేరువుంటే అది మంచిదని యేమి ప్రమాణం? దానీలో విషయం చర్చించి మంచి చెడ్డలు నిర్ణయించుకోవలసివుంటుంది. ఇక విచారణచేస్తాను.

పాత్రలు.

అయినా సాధారణప్రజల్లోనుంచి పాత్రలను స్వీకరించడం యికాలపువారు చేసే కొత్తపనేమో విచారిస్తాను. రామాయణంలో శబరిని వాల్మీకి స్వీకరించాడు. రఘువంశంలో

"హైయంగవీనమాదాయ ఘోషవృద్దానుపస్థితాన్" (రఘు.)
          
అని గొల్లవాండ్లను;
               
"వనేచరాణాం వనితాసఖానాం
 దరీగృహోత్సంగ నిషక్తభాసః" (కుమార)
          
అని వనకన్యలను, స్వీకరించాడు
               
"వియోగదుఃఖానుభవానభిజైః
       కాలే నృపాశం విహితం దదద్భిః,
 ఆహార్యశోభారహితైరమాయై
       రైక్లిష్ట పుంభిః ప్రచితాన్‌స గోష్ఠాన్.
 స్త్రీభూషణం చెష్ఠితమప్రగల్భం

     
        చారూణ్యవక్రాణ్యపివీక్షితాని,
ఋజూంశ్చ విశ్వాస కృతః స్వభావాన్
        గోపాంగనానాం ముముదే విలోక్య
ఆమంద్రమన్దధ్వనిదత్తతాలం
        గోపాంగనానృత్యమనందయత్ తం" (భట్టి)
        
అని భట్టి తన కావ్యంలో జానపదస్త్రీలను వర్ణించాడు.

"కోశాతకీపుష్పగుళుచ్ఛకాంతిభి
 ర్ముఖైర్వినిద్రో ల్బణబాణచక్షుషః,
 గ్రామీణ వధ్వస్త మలక్షితాజనై
 శ్శిరంవృతీనా ముపరి వ్యలోకయన్,
  గోష్ఠేషు గోష్ఠీకృతమండలాసనాన్
  సనాదముత్థాయ ముహుస్సవల్గతః,
  గ్రామ్యానపశ్యత్ కపిశం పిపాసతః
  స్వగోత్రసంకీర్తనభావితాత్మనః
 
పశ్యన్ కృతార్థైర పివల్లవీజన్
         జనాధినాథం నయయౌవితృష్ణతాం
ఏకాంతమౌగ్ధ్యానవబుద్ధవిభ్రమం
         ప్రసిద్ధ విస్తార గుణైర్విలోచనైః,
ప్రీత్యా నియుక్తాన్ లిహతీస్త్సనంధయాన్
         నిగృహ్య పారీ ముభయేనజానునోః,
వర్ధిష్ణుధారా ధ్వనిరోహిణీః పయ
         శ్చిరన్నిదధ్యౌ దుహతః స గోదుహః,
సవ్రీహిణాం యావదుపాసితుం గతాః
         శుకాన్ మృగైస్తావదుపద్రుతశ్రియాం,

కైదారికాణామభితః సమాకులాః
        సహాసమాలోకయతి స్మ గోపికాః" (మాఘ)
      
అని మాఘుడు గ్రామస్త్రీలను, గొల్లలను గొల్లవనితలను ప్రశంసించాడు.

"విలాసా నాగరస్త్రీణాం న తథా రమయన్తి నః,
 యథా స్వభావసిద్ధాని వృత్తాని వనయోషితాం"

అనిఒకకవి వనకన్యకల చేష్టల ముగ్ధరమణీయత్వాన్ని ప్రశంసించాడు.

మనదేశంలో.

"జొన్నచేలో మంచి సొగసుకత్తెను జూచి
"నిన్నటాలనుంచి నిద్రలేదు" అని.
"యెట్లా పోనిస్తేవోయి మట్లావోరి చిన్నదాన్ని"

అని మొదలైన యాలపాటల్లోను బ్రాహ్మణేతరజానపదపాత్రలు ప్రాచీన కాలంనుండి గోచరిస్తున్నారు. కనుక వీటిలో నూతనత్వంయేమీలేదు.

అవునయ్యా, వీరిని పూర్వులు అప్రధానంగా స్వీకరించారు. వీరు ప్రధాన పాత్రలుగా ఇప్పటి కావ్యాలల్లో వున్నారు. కనుక ఇదికొత్త అని అంటారా? అది సరిగాదు.

"ఓరోరిబండోడ వొయ్యారిబండోడ"

అనే కృతుల్లో వారే ప్రధానం. అవునుగాని అవి చిన్నకృతులు. యెంకిపాటలు మొదలైనవి పెద్దవి అనిఅంటారా? అపుడు చిన్నవి పెద్దవి అనే అనవలెనుగాని కొత్త అని అనడం అసంగతం. కొత్త అని ఒప్పుకున్నా, కొత్త అన్నమాత్రాన మంచిదనే నిశ్చయంలేదని యిదివరకేచెప్పినాను.

అని శ్రీ... ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో జానపదపాత్రాధికరణం సమాప్తం.

శ్రీ గణేశాయ నమః

వాఙ్మయ పరిశిష్టభాష్యం

శృంగారాధికరణం

అవునయ్యా. కొత్తగాకుంటే గాకపోనీయండి, సాధారణప్రజలు కాపులు నాయకులుగావున్న మాకావ్యాలకవిత్వం మంచిదంటారా?

వినిపిస్తున్నాను. ఈకవిత్వాన్ని యిక విచారణచేస్తాను. యెంకిపాటల నీచిన్నకావ్యాలకు మచ్చుగా దీసుకొని విచారిస్తాను. ఈ కాలపు కావ్యాలను చాలావాటిని పరిశీలించాను. వీటిలో శృంగారం ప్రధానంగా వున్నది. కనుక శృంగారవిచారణే యిక్కడ చేస్తాను. ఈ విచారణనే వీర్యానికి రౌద్రానికి అద్భుతానికి అట్లానే అన్వయించుకోవలెను. హాస్యం, భయం, భీభత్సం, కరుణం వీటికి యెటువంటి పాత్రలున్నా విరోధం లేదు గనుకను మామూలుమనుషులు సయితం యీ రసాదుల కావ్యాల్లో ప్రధానపాత్రలుగా వుండవచ్చును గనుకను వీటీని చర్చించడం మాని తక్కిన ఉదాత్తరసాలకు ప్రతినిధిగా శృంగారం తీసుకొని చర్చిస్తాను. ఆదిగాక యీకాలపు వనకుమారి, యెంకిపాటలు, ప్రణయాంజలి మొదలైనవాటిలో శృంగారమే వున్నది. వీటిని గురించి

"యెంకిపాట లనెడి ... కవితాకల్పప్రసూనముల విషయమునందు గూడ...

యెంకిపాటలు ఈ ఇరువదవశతాబ్దిని మన యీ ఆంధ్రవాఙ్మయ కల్పశాఖికను ప్రసవించిన సర్వాంగపరిపూర్ణ పరిణతీవిలసితంబు లగు దివ్యప్రనూనరాజములుగాని పూపబెడంగులపచరించు పసరుమొగ్గలు గావు... దివ్యతాపూర్ణములగు భావసీమలందు ప్రయత్న విశేషమును ప్రోదిచేయబడిన ప్రాభవసంపదల చెన్నలరారు పుష్పరాజములుగాని అంతంతమాత్రపు 'అరవిరు లెన్నటికిని గావు.. ఇంతయేలప్రియపాఠకులు ఈపూజాకుసుమములో నేయొకదానిని చిత్తగించి నను ఈనామాటలు అతిశయోక్తులు ఎంతమాత్రమునుగావని యెరుంగ గల్గుటయేగాక" అని యెంకిపాటల పీఠికాకర్త వ్రాశాడు.

"పాటలు అప్రయత్నంగావచ్చేటట్లు ప్రసాదించిన యెంకికి కృతజ్ఞుడనా? ప్రోత్సాహముచేసి వీపుతట్టిన అధికార్లవారికా? కవితా కళా రహస్యాలు తెలియజెప్పిన మాబసవరాజు అప్పారాయనికా? మువ్వురకును.".

అని యెంకిపాటలకర్త యీయెంకిపాటల రచనవల్లకలిగిన సంతోషంలో కృతజ్ఞత యెవరికి చూపవలసినదీ తోచక కొంతసేపు అనిశ్చయంతో వున్నాడు.

"యెంకిపాటలు పదిమందికీ వినుపించినవారు, దేశోద్ధారకులు శ్రీయుత కాశీనాధుని నాగేశ్వర్రావు పంతులుగారు...యీ పుస్తకం అచ్చులో యెంతో అభిమానంచూపి రెండుమాసములు తమ మూడుపత్రికలలోను ఉచితముగా అడ్వరుటైజుచేయునట్లు ఆర్డరు దయచేసినారు. వారి కెంతో కృతజ్ఞుడను ." " శ్రీశ్రీశ్రీ రాజా వెంకటాద్రి అప్పారావు బహద్దరుగారు యీపాటలు విని ఆనందించేవారు.

"ఆంధ్రపండిత మండలివారు నన్ను ఆహ్వానించి గౌరవించారు." "తర్కవ్యాకర్ణశాస్త్రవేత్తలగు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రులుగారు తమకు తామే కోరి యీపాటలు చక్కగా అచ్చువేయించి నందుకు.. కృతజ్ఞుడను."

అని వారివారిపొగడ్తలను యెంకిపాటలకర్త వ్రాశాడు. శృంగారమనే ఒకపుస్తకం అచ్చువేయించిన జీ, యన్. శాస్త్రీ అండుకంపెనీ, తపాల పెట్టె 11(). చిరునామాగల శ్రీగంటి సూర్యనారాయణశాస్త్రివారు. "ప్రథమమునుండి నాకెన్నో విధాల సహాయముచేయుచున్న శ్రీ దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వర్రావుపంతులుగారికి నాప్రణామాంజలి. నా కనేకవిధముల సహాయసంపత్తి నొసగుచున్న ప్రాణమిత్రులగు బసవరాజు వెంకటప్పారావు, దువ్వూరిసాంబమూర్తి, యేడిద సూర్యనారాయణగార్లకు శతహస్రవందన కుసుమార్పణములకన్న నేనేమి యుపకరింపగలను."

అనిప్రకటించారు. ఈ తీరుగా వీరందరు ఈశృంగారాన్ని యెంకిపాటలను మెచ్చుకోవడమేగాకుండా భారతి పత్రికనిండా ప్రణయజానకి అని ప్రణయినీగీతాలని ప్రణయగీతాలని ప్రణయసౌధమని విరివిగా కనబడుతున్నవి. వీరిట్లా ప్రీతి జూపిన వీటితత్వమేమిటి అని వీటినన్నిటిని శ్రద్దతో పరిశీలించాను. ఇక వీటివిచారణ ఆరంభిస్తాను.

యెంకిపాటలకథ.

యెంకినినాయుడు వరిస్తాడు. ఆమె మొట్టమొదట బెట్టుచూపి తరవాత అతడికి వశమవుతుంది. రాత్రుల్లో చేలో నాయుడుంటే యెవరికీ తెలియకుండా అతడికొరకు నీటుగా వస్తుంది. మంచెకింద గోనెపట్ట వేసుకొని యిద్దరు కలుస్తారు. ఆమె కులుకుచూపులు చూపిస్తుంది. తెల్లవారబొయ్యేవేళ యింటికిబోయి యేమీ యెరగన ట్లుంటుంది. కొన్నాళ్లకు యిద్దరూ పెండ్లాడుతారు. తరువాత యిద్దరికి వియోగం సంభవిస్తుంది. యెంకినాయుడికోసం రాత్రులయందు యేటి వొడ్డుకుపోయి అతణ్ని తలుచుకుంటుంది. తరువాత మళ్లీ కలుస్తారు. తిరుపతికి పోతారు. మళ్లీ వియోగం. ఇద్దరూ ఒకరికోసం వొకరు తాపపడతారు. తిరిగి కలుస్తారు. కొద్దిరోజుల్లో కడుపుతో వుంటావని నాయు డంటాడు. అందుకు నాకు యినాము లియ్య మంటాడు. పుస్తకంలో కథ ముగుస్తుంది.

గాక శృంగారం అనే గ్రంథంలో ఒక్కొక్కరు కొన్ని కొన్ని పద్యాలు రచించారు." రజస్వలకాకముందే చన్నులువచ్చినవి."

"జోడుగుండ్లబారననెద దోచె గొత్తచనులు" అని.
"పొదరు గుబ్బలరైక నెగదన్ని పయ్యంట." అని.

"నాచన్నులు, నా వెండ్రుకలు, నాముఖం, నాపెదవి నీవే నని బాసజేసి ఆమాటతీర్చకపోవడం మంచిదేనా" అని.

"సావిట్లొగాజులుసప్పుడయినట్లు, సిటి కేసిరమ్మని చెయ్యూపినట్లు"

అని యిట్టాటివి కనబడుతున్నవి. ఇక భారతిలో ప్రణయగీతాలు, ప్రణయసౌధాలు, ప్రణయజానకి. మూగినోములు మొదలైనవాటిలో

"అది నడిచేటపుడు జీరాడుకుచ్చెళ్లు రేపే దుమ్ములో ఒకరేణువు నయితాను."

(నాయని సుబ్బారావు, భారతి. 1-7-61.)

"ఏమి చేయుచు నుండునో యింటిలోన, నాదుజానకి నా రతనాల బొమ్మ".

(అధికార్ల సూర్యనారాయణ, భారతి. 1-2)

"ఎప్పుడు ప్రియుడువస్తాడా, ఎప్పుడాముద్దుమొగంచూస్తానా అని ఆతురపడుతున్నాను."

(సౌదామిని భారతి. 1-1.)

"ఓకాంతా నన్నొక్కసారి చూడు. నీకటాక్షామృతంలో రాలే చినుకులను తాగనియ్యి, నీచూపుభిక్షపెట్టు".

(ప్రణయసౌధం, మామునూరు నాగభూషణరావు. భారతి 3-3.)

ఓప్రియురాలా!

"నీవు నన్నుచూడవచ్చేటపుడు ప్రణయరసంతో నీపాదాలు కడుగుతాను, నామనఃపుష్పహారం నీమెడలో వేస్తాను. నా హృదయదీపకళికతో హారతిస్తాను. ప్రణయగీతాలు పాడుతాను. నీపాదాలదగ్గరవాలే పూజాపుష్పాన్నౌ తాను. నాకు స్వర్గంవద్దు. నీనీడలోవుంటే చాలు. నాకు గంగాజలం వద్దు. నీ మధురామృతంలో అమృతపు చినుకునైతా, నాకింద్రపదవి వద్దు. నీకంటిలో పాపనైతా."

              

(ప్రణయగీతాలు, భండారు రాజేశ్వరావు. భారతి. 2-2.)


"నాకు రెక్కలుంటే నీవద్దవ్రాలి నిన్ను ముద్దు పెట్టుకుంటాను."

              

(నాదెండ్ల వెంకట్రావు, భారతి. -2-2.)


"ఓతరుణీ నీకౌగిట్లో జేరి తనువుమరుస్తాను. నామీద ఆకాశం

 పడ్డా భయంలేదు.

(ప్రణయోన్మాదం. పాణిని. భారతి. 1.3.)


"నాప్రణయగాన శబ్దాలకు విశ్వమంతా చలించి నిట్టూర్పు

 విడిచింది."

(వేదుల సత్యనారాయణ శాస్త్రి, భారతి. 1-3.)


"గువ్వజంట చింతచెట్టుమీద సరసమాడుతున్నవి.
 చప్పుడైనపుడెల్లా నీవే వస్తున్నావని చూస్తు న్నాను."

                   

(సౌదామిని, భారతి. 1-10.)


"కలికి ఒండొండుకోరనీ వలపుదక్క."

        

(పువ్వాడ శేషగిర్రావు, చోడవరపు జానకిరామయ్య, భారతి.)


"దానిచీరె కొంగు రాచుకున్నది. నిద్రపట్టదు. దానిచూపులు
 దానికులుకులు ఎదురుకొంటున్నవి."

        

(కవికొండల వెంకటరావు, భారతి. 2-10.)


"నన్ను విబుధులువిడిచినా, నామిత్రులువిడిచినా నాప్రేమభాగ్యఁ
 వుంటే నా కేమిభయం."

        

(గరిగిపాటి రామమూర్తి, భారతి. 2-11.)


"ముద్దులొలుకు నీరూపుపిల్లా, మూర్ఛదెచ్చెనేమో పిల్లా."

                                                     

(భారతి. 1-12)


"నిన్ను వలచుట జానకీ నేను నేను." (భారతి, 1-11.)

అని అంటున్నారు. పైవాటిలో అక్కడక్కడ మూలపద్యాలను నేను గద్యంలో ఉదాహరించను. యెంకిపాటలు, శృంగారమనే గ్రంథం భారతిలో ప్రణయగీత, ప్రణయసౌధ, ప్రణయోన్మాద ప్రభృతులు వెలువరించిన శృంగారం యిది. మంచిదీ దీనితత్వమేమిటి? ఇది హేయమా? ఉపాదేయమా? అని యిక విచారిస్తాను.

శృంగారం.

కుమారస్వామి అన్నట్లు సర్వప్రాణులకు ఆనందజనకమైన మాన్మధానురాగంమీద ఆధారపడివున్నది గనుక శృంగారం మనకు ఉపాదేయ మవుతున్నది.

"స్త్రీతి నామాపి మధురం" అని అభినవగుప్తపాదులంటున్నారు.
"శృంగార ఏవ మధురః పరః ప్రహ్లాదనో రసః" (ధ్వన్యా.)

అని ఆనందవర్ధనుడు. వాల్మీకి కాళిదాసాదులు ఆశృంగారాన్ని ప్రతిపాదించి ఉత్తమకావ్యాలను మనకు ప్రసాదించారు. కనుక శృంగారం ఉపాధ్యం .

తటస్థాక్షేపం.

శృంగారం గ్రాహ్యంకాదు. అది ఆనందజనకం గనుక గ్రాహ్య మంటారా! భోజనాదులు సయితం ఆనందజనకమే. భోజనాన్ని ఆధారంచేసి యెందుకు కావ్యం రచించరాదు.?

        
1. "అన్నం బ్రహ్మేతి వ్యజానాత్" (తైత్తి. భృ)
        
2. "అన్నేన జాతాని జీవంతి" (తైత్తి. భృ.)
        
3 "ఆదిత్యో హ వై ప్రాణోరయిరేవ చంద్రమా!" (ప్రశ్నో)
    
4. తస్తై సహోవాచ ప్రజాకామోవై ప్రజాపతిః స తపోతప్యత
   సతపస్తప్త్వాస మిధున ముత్పాదయతే రయిం చ.(అన్నం)
   ప్రాణం చేత్యేతౌమే బహుధాప్రజాః కరిష్యత ఇతి. (ప్రశ్నో)
        
5. "యోయో హ్యన్నమత్తి యోరేతః సిగ్బవతి తద్భూయ ఏవ భవతి" (ఛాందో)
        
6. సోపోభ్యతపత్ తాభ్యోభితప్త భ్యో మూర్తి రజాయత యావై
   సామూర్తి రజాయతాన్నంవైతత్. (ఔతరే)

7. అన్నంననింద్యాత్ తద్ర్వతం ప్రాణోవా అన్నం శరీర
   మన్నా దం..అన్న వానన్నాదో భవతి మహాన్ భవతి.
   ప్రజయాపశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్‌కీర్త్యా (తైత్తి. భృ)
       
8. అన్నం న పరిచక్షీత తద్ర్వతం ఆపోవా అన్నం జ్యోతి
   రన్నాదం. (తైత్తి భృ)
       
9. అన్నం బహుకుర్వీత తద్ర్వతం పృథివీవా ఆన్నం ఆకా
   శోన్నాదః. (తైత్తి. భృ.)
     
10. తస్మాద్యయా కయాచవిధయా బహ్వన్నం ప్రాప్నుయాత్. (తైత్తి.భృ)
     
11. అహమన్న మహమన్న మహమన్నం అహమన్నాదో
    హమన్నాదో హమన్నాదః (తైత్తి .భృ.)

1. అన్నం బ్రహ్మమని తెలుసుకోవలెను.

2. అన్నం వల్లనే భూతాలు జీవిస్తూవున్నవి.

3. ఆదిత్యుడు ప్రాణం అన్న చంద్రుడు.

4. ప్రజా కాముడై ప్రజాపతి తపస్సుచేశాడు. తపస్సజేసి ఒక జంటను ఉత్పాదించాడు. అన్నమూ ప్రాణమూ అనేవి నాకు ప్రజను కలిగిస్తవి అని కబంధికి విప్పలాదుడు చెప్పినాడు.

5. యెవడు అన్నం తింటున్నాడో యెవడు రేతస్సేకం చేస్తున్నాడో వాడు విస్తరిస్తున్నాడు.

6. ప్రజాపతి నీళ్లనుండి తపస్సుచేశాడు. అట్లా అభితప్తమైన నీళ్లనుండి మూర్తి పుట్టింది. పుట్టినమూర్తే అన్నం.

7. అన్నాన్ని నిందించవద్దు. అది బ్రహ్మవేత్తకు వ్రతం. ప్రాణం అన్నం శరీరం అన్నాదం. అన్నం గలవాడు అన్నాన్ని భక్షించే ప్రాణం గలవాడవుతున్నాడు. సంతానం చేత పశువులచేత బ్రహ్మతేజస్సు చేత గొప్పవాడవుతున్నాడు. కీర్తిచేతను గొప్పవాడవుతున్నాడు.

8. అన్నాన్ని పరిహరించగూడదు. అది బ్రహ్మవేత్తకు వ్రతం. వుదకాలే అన్నం. జ్యోతిస్సు అన్నాన్ని భక్షించేది.

9. అన్నాన్ని గౌరవించవలెను. అది బ్రహ్మవేత్తకు వ్రతం. భూమే అన్న స్వరూపం. ఆకాశం అన్నాన్ని భక్షించేది.

10.యేప్రకారం చేతనైనా విస్తారమయిన అన్నాన్ని పొందవలసినది.

11. నేను అన్నాన్ని. నేను అన్నాన్ని. నేను అన్నాన్ని. నేను అన్నాన్ని భక్షించేవాణ్ని. నేనుఅన్నాన్ని భక్షించే వాణ్ని. నేను అన్నాన్ని భక్షించే వాణ్ని.

అనియీతీరున ఉపనిషత్తులు అన్న మాహాత్మ్యాన్ని ప్రశంసిస్తున్నవి. ఛాందోగ్యంలో ఉషస్తి ప్రతిహర్త నడిగితే అన్న మే దేవత అంటాడు. వేదపురుషుడు తెల్లకుక్కరూపంతో అన్నమాహాత్మ్యం బకుడికి ఉపదేశిస్తాడు. ఇంకా ఉపనిషత్తుల్లో అన్న ప్రశంసవున్నది. ఇట్లా ప్రశస్తమైన భోజనాన్ని కావ్యంలో యెందుకు వర్ణించరాదు? కాని భోజనాన్ని ప్రధానవస్తువుగా తీసుకొని కావ్యాలను రచించడంలేదు అట్లా రచిస్తే జుగుప్సగా వుంటుంది. అట్లానే శృంగారాన్ని కూడా ప్రధానాంశంగా తీసుకొని కావ్యం రచించడం అప్రశస్తం.

"ఆహార నిద్రాభయమైధునాని."

అని అన్నట్లు భోజనం మైధునేచ్ఛాయివన్నీ పశుకృత్యాలు. ఈపశుగుణం యొక్క తృప్తికోసం యెవరికి లభించినరీతి వాండ్లు పాటుపడతారు. ఇది చెప్పుకోతగ్గ విషయంగాదు. అందుకే

          
"లాటీనేత్రపుటీపయోధరఘటీ రేవాతటీ నిష్కుటీ,
 పాటీరద్రుమవర్ణనేన కవిభిర్మూఢైర్దినం నీయతే."

(లాటస్తీ నేత్రపుటాలను కుండలవంటి స్తనాలను నర్మదానదీతీరానవున్న పొదరిండ్లను, చందనవృక్షాలను, వర్ణిస్తూ మూఢులు కవులు దినాలు గడుపుతారు) అని ఒకరు కావ్యకోటినే నిరసించారు.

"న చ సభ్యేతరవాదచుంచవః" (త్రిశతి)

(సభ్యేతరమైన వాక్కులను చెప్పడంలో నిపుణులంగాము) అని భర్తృహరి కవులమాటలను నిరసిస్తున్నాడు.

ఈ పశుకృత్యాలను ఆధారం జేసుకొని పరిణతబుద్దులు కావ్యంలో ప్రవృత్తులుకావడం అనుచితం. పశుత్వాన్ని అణగదొక్కడానికే భారతీయ విజ్ఞానమంతా సర్వశక్తిని వినియోగిస్తున్నది. యోగసాంఖ్య వేదాంత ప్రముఖశాస్త్రాలు ఈపనికే యత్నిస్తున్నవి. అట్లాటి స్థితిలో కవులు లోకాభ్యుదయ హేతువులైన ఆమహాప్రయత్నాలకు తోడ్పడడానికి బదులు పశుత్వాన్ని ప్రేరేపించే కామాన్ని ఆధారం చేసుకొని ప్రవర్తించడం సర్వధా అప్రశస్తం. కనుక శృంగారం యెంతమాత్రం గ్రాహ్యంకాదు అని అంటే.

సిద్ధాన్తం.

చెప్పుతున్నాను; భోజనాన్ని ఆధారంజేసుకొని కావ్యం వ్రాయనట్లే కామాన్ని ఆధారం చేసుకొని కావ్యం వ్రాయరాదనడం సరిగాదు. భోజనం. సంభోగేచ్ఛ. నిద్ర, భయం, ఇవన్నీ పశుకృత్యాలన్న మాట సత్యం. అయితే జగత్సంతతికి, అంటే, జగత్తుయొక్క అవిచ్ఛిన్నతకు, భోజనభోగేచ్ఛలు రెండూ ప్రధానమైనవిగా వున్నవి.

"బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్."

అని వాక్యాలతో జన్మపరంపరను ఆపి జగత్తును విచ్ఛిన్నంజేసే బ్రహ్మ మీమాంసా మార్గ మొకటి వున్నా,

"ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సీః" (తైత్తి.) అనేశ్రుతివాక్యాల ఊతతో నిత్యనైమిత్తిక కామ్యకర్మలను ప్రేరేపించి జగత్తుయొక్క అవిచ్ఛిన్నతను ఆరాధించే ప్రవృత్తిమార్గం లోకంలో చిరప్రతిష్ఠితమై వున్నది.

"సా భావయిత్రీ భావయితవ్యా భవతి తం స్త్రీంగర్భంబిభర్తి
 సోగ్రఏవకుమారం జన్మనోగ్రేధిభావయతి సయత్ కుమారం
 జన్మనోగ్రేధిభావయతి ఆత్మానమేవ తద్భావయతి...ఏవం సంత
 తాహీ మే లోకాస్తదస్య ద్వితీయజన్మ." (ఐతరే)

అని ఐతరైయోపనిషత్తు ఆదేశించిన జగత్సంతతిని,(జగదవిచ్ఛిన్నతను)

"ధర్మం జైమినిరతఏవ." (బ్రహ్మ)

అని పూర్వపక్షవాదులు సయితం గౌరవార్థం ప్రస్తావించిన జైమిని, జ్ఞానానికి కర్మాంగత్వ మారోపించి ప్రవృత్తినే ప్రతిష్ఠించిన జైమిని. వాస్తవంగా ఆరాధించిన వాడవుతున్నాడు.

"సంతతిః శుద్ధవంశ్యా హి పరత్రేహ చ శర్మణే"

అన్న కాళిదాసవాక్యాలు ఈ జగదవిచ్ఛిన్నతయొక్క రూపాన్ని తెలుపుతున్నవి.

             
1. "స్వాద్వన్న భక్షకామేన వేషోయం యోగినాం ధృతః."
             
2. స్థితోసి యోషితాం గర్భే తాభిరేవ వివర్దితః
   అహో కృతఘ్నతా మూర్ఖ కథం? తా ఏవ నిందసి. (మండనః.)
          
3. యాసాంస్తన్యం త్వయా పీతం యాసాం జాతోసియోనితః
   తాసు మూర్ఖతమ స్త్రీషు పశువద్రమసే కథం.?
       
4. మన్యే మైధునకామేన వేషోయం కర్మిణాం ధృతః. (శంకరః.)

1. రుచిగల ఆహారం తినగోరినవాడిచేత యోగివేషం స్వీకృత మగుతున్నది.

2. స్త్రీలగర్భంలో వుండి స్త్రీలచేతనే వివర్ధితుడవై ఓమూర్ఖుడా వారినే యెట్లా నిందిస్తావు? అహోకృతఘ్నత

(మండనుడు)

3. యెవరిస్తన్యం తాగినావో యెవరి యోనిలోనుండి పుట్టినావో ఆస్త్రీలతోనే ఓమూర్ఖతముడా పశువువలె యెట్లా రమిస్తావు?

4. మైథునకాముడిచేత గృహస్థవేషం స్వీకృతమవుతున్న దనుకొంటాను. (శంకరుడు)

అని యీతీరున కర్మబ్రహ్మ మిమాంసలకు జరిగిన వివాదం జగత్సంతతికి ఆధారమైన స్త్రీపురుష సంయోగాన్ని కర్మమీమాంస యెట్లాపూజించేదీ తెలుపగలదు. ఇట్లాటి జగదవిచ్చిన్నతకు అవశ్యకమై ప్రాణధారణ సాధనమైన ఆహారం సంస్కృతి సాధనమైన సంయోగం రోతగాక, ఉపాదేయత్వాన్నే పొందుతున్నవి. ఆహారాన్ని గూడా విదూషకుడి సందర్భంలో కవులు స్వీకరిస్తూవచ్చారు. ఆహారాన్ని వాల్మీకి అయోధ్యాకాండంలో 91 వ సర్గంలో భరద్వాజుడు భరతుడికి ఆతిథ్యమిచ్చినఘట్టంలో మనోహరంగా వర్ణించాడు. అయితే తరతమ భావంచేత ఆహారంకంటె సంయోగమే జగత్సంతతికి (జగదవిచ్చిన్నతకు) సన్నిహిత కారణం ప్రధానకారణం అయివున్నది. జగస్థితి కారకుడైన శ్రీవిష్ణువును శృంగారానికి అధిదైవతంగా భావించడంలో యీఅభిప్రాయమే వ్యక్తమవుతున్నది. బుభుక్షకంటె సంభోగేచ్చ యెక్కువ ప్రధానంగా స్వీకృతం కావడం ఉచితమంటున్నాను. ఇంతటి మహిమగల శృంగారం కావ్యంలో ప్రధానమని భారతీయులు ఉత్కృష్టమైన ప్రవృత్తిధర్మానికి కావ్యాన్ని అనల్పసాధనంజేసి లోకాభ్యుదయానికి తోడ్పడడంలో వారి అమేయజ్ఞానాన్ని వెలయించారు. "క్రౌంచద్వంద్వవియోగోత్థః శోకః శ్లోకత్వమాగత:"

అని ఆనందవర్ధనుడు కీర్తించిన క్రౌంచద్వంద్వవియోగం అధారంగా సీతారామ సంయోగ వియోగాలను వెలయించిన వాల్మీకికృతిని లోకంలో వున్న సమస్తకావ్యజాతంలో మహోన్నతస్థానం పొందదగ్గ రామాయణాన్ని ప్రశంసిస్తూ

"యత్ర ప్రవృత్తికాస్త్రార్ధం సమ్యగేవ నిరూపితః"

(పారాశర్యోపపురాణం)

(యెక్కడ ప్రవృత్తిశాస్త్రార్ధం బాగా ప్రకాశితమయిందో)

అని అన్నారు సంయోగంతో వియోగం సంబద్ధమైనది గనుక వియోగం సంయోగ సంబంధి అయి సంయోగవియోగాలు రెండూ శృంగార మవుతున్నవి ఈ తీరుగా శృంగారం గ్రాహ్యంమాత్రమేగాకుండా సమస్త జగత్థ్సితికి హేతువుకావడంవల్ల ప్రధానమనిగూడా నిరూపించాను. ఇట్లా ప్రవృత్తిమార్గాన్ని చేపట్టిన కావ్యం ప్రవృత్తి హేతుభూత మయిన సంయోగాన్ని స్వీకరించడం అత్యంతం ఉచితమన్నాను. ఇందుకే భారతీయులు కవిత్వోన్నతికి ఆకరమైన నాటకంలో శృంగారం (వీరమైనా) ప్రధానమన్నారని వ్యాఖ్య చేస్తున్నాను. వీరాన్ని గురించి నాటకాధి కరణంలో వివరించాను గనుక యిక్కడ వదలుతున్నాను. వేదాంతజిజ్ఞాసలు సంపూర్ణంగా బలం ప్రాపించినతరువాత శాంతాన్ని గూడా రసకోటిలో సాహిత్య వేత్తలు స్థిరపరిచినట్లు కనబడుతున్నవి. భరతుడు శాంతరసం చెప్పకపోయినా

"నిర్వేదస్థాయిభావః శాంతోస్తి నవమో రసః" (కావ్య)

అనిమమ్మటాదులు శాంతాన్ని ప్రతిపాదించినవిధం

"నిర్వేదస్యామంగళప్రాయస్య ప్రథమమను పాదేయత్వే 7 పి ఉపాదానం వ్యభిచారిత్వే 7 పి స్ధాయిత్వాభిదానార్ధం" (కావ్య) అని దాన్ని సమర్ధి చిన విధం. శాంతం రసకోటిలో స్థిరపడ్డమార్గాన్ని చూపుతున్నవి.

ఈ సంగతి సంపూర్ణంగా వాఙ్మయదర్శనంలో మరియొకచోట మీమాంస చేశాను. గ్రంథవిస్తర భీతిచేత యిక్కడ వదలుతున్నాను. ఇది యింత ప్రధానమైనది గనుకనే.

"శృంగార ఏవ మధురః పరః ప్రహ్లాదనో రసః"

అనిధ్వనికారుడు కీర్తిస్తున్నాడు.

ఇక యెంకిపాటలు, శృంగారం, భారతిలో ప్రణయజానకి, ప్రణయగీతం, ప్రణయగానం, మొదలైనవాటిలోని శృంగారతత్వమేమిటి? అని విచారిస్తాను.

శృంగారే విచారణ

శృంగారం లోకసంతతికి (అవిచ్చిన్నతకు) ప్రేరకమని అందువల్ల మనకు గ్రాహ్యమని అన్నాను. ఇది ధర్మతత్పరులయందు నిష్ఠమైనప్పుడు లోకాభ్యుదయహేతువై ఉపాదేయ మవుతున్నది. ధర్మతత్పరమైన జగత్సంతతి అభీష్టంగాని అధర్మ తత్పరమైన జగత్తు యొక్క అవిచ్చిన్నత త్యాజ్యమెకదా. కనుక దర్మతత్పరులలో నిష్ఠమై శృంగారం ఉత్తమత్వం ఆరోహిస్తున్నది.

పూర్వపక్షం

శృంగారం లోకసంతతికి ప్రేరకం కావడంవల్ల గ్రాహ్యమంటే మేము వొప్పుకోము అది కుమారస్వామి రత్నాపణంలో అన్నట్లు సర్వప్రాణి హృదయంగమం గనుక గ్రాహ్యం. అందుకే

"శృంగార ఏవ మధురః పరః ప్రహ్లాదనో రసః" (ధ్వన్యా) (శృంగారమే మధురం; అత్యంతం ప్రహ్లాదనం అయిన రసం అని ఆనందవర్ధను డన్నాడు)

"స్త్రీతి నామాపి మదురం" (స్త్రీ అనేపేరే మధురమైనది.)

అని అభినవగుప్తపాదులు అన్నాడని మీరే ఉదాహరించారు.

"జ్ఞాతాస్వాదో వివృతజఘనాం కో విహాతుం సమర్ధః"(. మేఘ)

(ఇది వరకు రుచిచూచిన వాడెవడు వివృతజఘనను విడువ సమర్ధుడు?) అన్న కాళిదాసువచనం ప్రసిద్ధమేగదా! ఇక

1. "ఉరసి నిపతితానాం స్రస్త ధమ్మిల్లకానాం
    ముకుళితనయనానాం కించిదున్మీలితానాం
   ఉపరి సురతఖేదస్విన్న గండస్థలానాం
   అధరమధు వధూనాం భాగ్యవంతః పిబంతి.

2. ఆవాసఃక్రియతాం గాంగే పాపహారిణి వారిణి,
    స్తనద్వయే తరుణ్యా వా మనోహారిణి హారిణి.

3. మాతృర్య ముత్సార్య విచార్య కార్య
   మార్యాస్సమర్యాదమిదం వదంతు.
   సేవ్యా నితంబా కిము భూధరాణాం
   ఉత స్మరస్మేరవిలాసినీనాం.

4. ప్రణయమధురా: ప్రేమొదారా రస్యాశ్రయతాం గతాః
    ఫణితిమధురా ముగ్దప్రాయాః ప్రకాశితసమ్మదాః
   ప్రకృతిసుభగా విస్రంభార్ధాః స్మరోదయదాయినో
   రహసి కిమపి స్వైరాలాపా హరంతి మృగీదృశాం.

5. ఆదర్శనే దర్శనమాత్ర కామా
    దృష్ట్వా పరిష్వంగసుఖైకలోలా.

  ఆలింగితాయాం పునరాయతాక్ష్యాం
  ఆశాస్మహే విగ్రహయో రభేదం

1. వక్షస్సు మీదవాలి కొప్పు జారగా ముకుళితనయనలై కొద్దిగా ఉన్మీలితలై ఉపరిసురతంచేత చెమర్చిన గండస్థలాలతో వుండే వధువుల పెదవితేనెను భాగ్యవంతులు తాగుతారు.

2.పాపహారి అయిన గంగవారియందైనా వాసంచెయ్యి లేదా? మనోహరి. హారి అయిన తరుణీస్త నద్వయమందైనా వాసం చెయ్యి

3. మాత్సర్యంవదలి కార్యం విచారించి మర్యాదతో ఆర్యులారా! ఈ సంగతి చెప్పండి భూధరాల నితంబాలు సేవ్యమా? స్మరస్మేరవిలాసినుల నితంబాలు సేవ్యమా?

4. ప్రణయమధురం అనురాగరమ్యం రసాశ్రయం ఫణితి మధురం. సౌకుమార్య భరితం ప్రకాశితసమ్మదం స్వలావరుచిరం విస్రంభార్ధం స్మరోదయప్రదం అయిన మృగీనేత్రల స్వైరాలాపాలు యేకాంతంలో అనిర్వాచ్యంగా మనస్సును హరిస్తవి.

5. చూడనంతసేపు చూస్తే చాలునని వుంటుంది. చూసిన తర్వాత కౌగిలించుకొని సుఖ మనుభవించవలె నని వుంటుంది. ఆయతాక్షి కౌగిలిలోకి రాగానే విగ్రహాల అభేదాన్ని అపేక్షిస్తాము.

అని యిట్లా భర్తృహరి ప్రతిపాదించిన శృంగారమనోహరత్వం ఇంకా వివరించవలసిన పనిలేదు. ఈతీరుగా శృంగారంయొక్కగ్రాహ్యత్వం దాని మాధుర్యాన్ని బట్టేగాని ధర్మానుబంధిత్వాన్ని బట్టికాదు అని అంటారా?

సిద్ధాన్తం.

చెప్పుతున్నాను, శృంగారం మాధుర్య హేతువుచేతనే గ్రాహ్యమైతే ఒకజారుడు పరకాంతతో కూడినప్పటి శృంగారం మనకు గ్రాహ్యంగా వుండవలెను. సీతాద్రౌపదీ విషయకమైన రావణకీచకుల రతి మనకు మనోహరంగా వుండవలెను. చోరులు ,దగాకోరులు, హంతకులు వీండ్ల శృంగారం మనకు గ్రాహ్యంగా వుండవలెను. కాని యీ శృంగారం హేయమనేసంగతి సహృదయుల కందరికీ విదితం. అవునయ్యా పరకాంతతో జారుడుకూడినప్పటిశృంగారంకూడా గ్రాహ్యమెందుకు కాదు? గ్రాహ్యమేను అని అంటారా? చెప్పుతున్నాను. అది లోకస్థితికి సంఘ క్షేమానికి హానికరం గనుక దాన్ని మనం ద్వేషిస్తాము. ఇది సాధారణవిషయం గనుక దీన్ని విస్తరించి మీమాంస చేయవలసిన పనిలేదు. దుష్టులశృంగారం సంస్కారవంతులకు గ్రాహ్యంగా వుండదు. జారులకు జారశృంగారం రుచించవచ్చును. కాని దుష్టుల ప్రీతితో మనకు పనిలేదు. కావ్యంలో సహృదయానందమే ప్రమాణం. సహృదయులకు దుష్టుల శృంగారం అగ్రాహ్యమని నిరూపించాను. కనుక శృంగారం మాధుర్య హేతువుచేతనె గ్రాహ్యంగాదంటున్నాను.

పూర్వపక్షం.

మీరు నాయకులను ప్రధానంగా విచారిస్తున్నారు. అక్కడ నాయకుడు దుష్టుడైనా శిష్టుడైనా దానితో మనకు పనిలేదు. రసాస్వాదసమయంలో వీడు రాముడు. వీడు వావణుడు. ఈమె తార, ఈమె సీత, ఈమె స్వీయ, ఈమె పరకీయ, అనే పరిచ్ఛేదమే వుండదు. స్త్రీపురుషసాధారణ్య ప్రతీతి తప్ప మరేమీవుండనేరదు. కనుకనే

"పరస్య న పరస్యేతి మమేతి న మమేతి చ.
 తదాస్వాదే విభావాదేః పరిచ్ఛేదో న విద్యతే (సాహి)


ఇది పరుడికి సంబంధించినది. ఇది పరుడికి సంబంధించినదిగాదు. ఇది నాకు సంబంధించినది. ఇది నాకు సంబంధించినది కాదు. అని కావ్యంలో విభావాదుల పరిచ్ఛేదమే వుండదు.

"సాధారణ్యేన రత్యాదిరపి తద్వత్ ప్రతీయతే" (సాహి)
   
"రత్యాదులు సాధారణ్యభావనవల్ల ప్రతీతమవుతున్నవి." అని సాహిత్యదర్పణకారుడన్నాడు. కనుక విభావాదులకు దుష్టాదుష్టత్వం మేమొప్పుకోము. ఆ విచారణే సాహిత్యంలో అసంబద్ధం. అది ధర్మ శాస్త్రంలో చేస్తే చేయండి అని అంటారా?

సిద్ధాంతం



వినిపిస్తున్నాను; మధువు ఆస్వాదితమయ్యేటప్పుడు తద్భావన తప్ప ఇది గిన్నె. ఈగిన్నె వెడల్పింత. దీన్ని యీలోహంతో చేశారు అనే విచారణ వుండదు. మధుమాధుర్యమే ఆనిమిషంలో మనో వ్యాప్తమై వుంటుంది. అని తెల్పడం యెట్లాటిదో రసాస్వాదనసమయంలో విభావాదులపరిచ్చేదం వుండదనడం అట్లాటిది. మధువు తియ్యగావున్నా దాన్ని కుష్ఠి పులినీళ్ల చేతితో తాకి విషలిప్తమైన గిన్నెలో బోశాడు అని తెలిసినప్పుడుగూడా, మధ్వాస్వాదనసమయంలో మధుమాధుర్య భావనతప్ప మరేమి వుండదనేమాటల ప్రేరణవల్ల అకుష్ఠి స్పృశించి విషపుగిన్నెలో పోసిన మధువును తాగము. మధువు మధురమవునుగాక దాన్ని ఆస్వాదించేటప్పుడు అన్యవిచారణవుండకపోవుటనుగాక కాని దాని వుపాదిదుష్టమని తెలిసినప్పుడు తప్పక అది అగ్రాహ్యమే అవుతున్నది. తెలియక అట్లాటిదుష్టశృంగారకావ్యం పఠిస్తామా? మనఃకాలుష్యం మొదలైన నాంతరీయకఫలాలు తప్పక సిద్ధిస్తున్నవి. ఇంతకూ

"తదాస్వాదే" (రసాస్వాదే)

అన్నప్పుడు దూష్యోపాధివిరహితమైన రసాసృవాద మని రసశబ్దానికి అర్ధం. యెందువల్లనంటే; దూష్యోపాధివున్నప్పుడు అది రసాభాస మవుతుందని ఆ కృతికర్తే.

"అనౌచిత్యప్రవృత్తత్వ ఆభాసో రసభావయో:" (సాహి)

అనిచెప్పుతున్నాడు. కనుక సాధారణ్యవాదంచేత దుష్టశృంగారం సమర్ధితంకాదు.

పూర్వపక్షం

అవునయ్యా దుష్టులశృంగారం అగ్రాహ్యమంటున్నారు శిల్పానికి కళకూ ధర్మాధర్మ విచారణ అనావశ్యకం. పాడేకోకిలకు పాడడమే వ్యాపార ఫలం అయినట్లు కవికూడా శిల్పాన్ని కళను ప్రవర్తింపజేసి అదేవ్యాపారంగా అదే ఫలంగా వర్తిస్తున్నాడు. అతినికి ధర్మంతో పనిలేదు. అని అంటారా? చెప్పుతున్నాను.

సిద్ధాన్తం

శిల్పానికీ కళకూ కూడా అనందమే పరమార్థమని వొప్పుకున్నా అట్లాటి ఆనందానికి వెనక ధర్మ గుప్తంగా వుంటూనేవున్నది. దేవాలయాలమీది అసభ్య ప్రతిమల అధర్మ విశిష్టమైన శిల్పం సంస్కారవంతులకు ఆ..........యకంగా నే సంగతి ఋజువు చేయవలసిన పనిలేదు. కనుకనే సామాజికుల ఆనందానుభవానికి వెనక ధర్మంగుప్తంగా వున్నదంటున్నాను. అవునయ్యా ధర్మంగాని అధర్మంగాని లేని సరశ్చంద్రోద యాదులవర్ణనలు సంస్కారవంతులైన సామాజికులకు ఆనందమియ్యవా అంటే అట్లాటివాటిలో గూడా సత్వసౌందర్యరక్తి విశుద్దప్రకృతి ప్రేమ. అనే పావనధర్మాలు లగ్నమయ్యేవున్నవి.

మనుష్యప్రకృతి

కాని; యిట్లాటి ధర్మా ధర్మప్రవృత్తిలేని స్థావరప్రకృతికంటె మనుష్య ప్రకృతి సంస్కారవంతుడైన కవి సమీపించేటప్పటికి, లోకస్థితికి హేతుభూతమైన ధర్మం. దానికి విఘాతం కలిగించే అధర్మం. తప్పించుకో వీలులేనంత అఖండాకృతిలో సర్వస్థలాల గోచరిస్తున్నవి. ప్రవృత్తి మార్గంలో వున్నంతవరకు సత్వరజస్తమనస్సుల ప్రవృత్తులతో శబళితమైన యీమనుష్యప్రకృతి నుండి దుష్టత్వాదుష్టత్వాదులను, సుగుణ దుర్గుణాలను ధర్మాధర్మాలను, అపహ్నవించలేము. అవి వెంటనంటి అగ్నికి ఉష్ణగుణం వలె వుంటునేవున్నవి కనుకనే వాటిని అపహ్నవించలేమంటున్నాము. అందువల్ల మనుష్యప్రకృతిని విషయంగాచేసిన కవి, శిల్పకళ ఆనందఫలకాలైనప్పటికీ మనుష్యప్రకృతినంటి వున్నధర్మాధర్మాదులను అపహ్నవించ లేడంటున్నాను. శిల్పానికి శిల్పస్థితే ప్రయోజనంగాని వేరే ప్రయోజనం లేదంటారా? అది అసంబద్ధం యెవరికో ఒకరికి శిల్పసృష్టియే ప్రయోజనం అయితే కానియ్యండి ఆశిల్పసృష్టికి హేయత్వం ఉపాదేయత్వం ఆనాందాదిఫలాలవల్లనే సిద్ధిస్తున్నవి. కోకిలపాడుతున్నది. గదా అని యెవడూ వినడు. అది ఆనందజనకంగా వుండడం వల్లనే వింటాడు. అట్లానే కవి వ్రాశాడు గదా అని మొగమాటంచేత యెవడూ కావ్యాలను చదవడు, నాటకాలను చూడడం, ఆనందం కొరకు చదువుతాడు. శిల్పం ఆనంద ప్రదమైనప్పుడే ఉపాదేయమవుతుందంటున్నాను. శిల్పానికి శిల్పస్థితే ప్రయోజనమనేమాట అంగీకరించవీలులేదు. దాని గ్రాహ్యత్వాగ్రాహ్యాత్వాలు ఆనందప్రభృతి ప్రయోజనాంతరాలను ఆక్షేపించివున్నవి. ఆనందం ధర్మాధర్మవ్యవస్థితమని యిదివరకే విశదపరచాను. ఇంతకూ చెప్పదలచిందేమంటే శృంగారస్థితే శృంగారప్రయోజన మనేమాట అసంబద్ధమని, శృంగారం మధురం గనుకనే గ్రాహ్యం గాదని, అదిమధురమైనా వుపాధి దూష్యంగా నప్పుడే గ్రాహ్యమని, చెప్పుతున్నాను. కనుకనే చోరుల, హంతకుల జారుల శృంగారం హేయ మంటున్నాను.

జగత్సంతతి

శృంగారం జగత్సంతతికి సాధనమని అందుకే ప్రవృత్తిమార్గానికి ఉపోద్బలంగా వీరశృంగారాలు ప్రధానమైన బారతీయ కావ్యప్రస్థ నం వర్తిస్తున్నదని వ్యాఖ్యచేశానని చెప్పినాను. జగత్తులో మనుషులు సుఖంగోరుతారుగాని దుఃఖం పీడా గోరరు. హంతకులు చోరులు పరధనాపహర్తలు. మోసగాండ్లు ఇట్లాటివాండ్లస్థితి లోకానికి పీడాకరమని అందరికీ విదితం. ఇట్లాటివాండ్లుండేలోకం అవిచ్ఛిన్నంగా వుండడానికి బదులు విచ్ఛిన్నమైపోతేనే మంచిదని తోచక మానదు కనుకనే జగత్సంతతి సిద్ధాంతంలో ఇట్లాటి దుష్టులశృంగారం మిక్కిలి హేయమంటున్నాను. దయ. సత్యం, తేజస్సు, స్వాతంత్ర్య౦ ఇట్లాటి కల్యాణగుణాలు వెలిసేలోకం స్వర్గతుల్యంగా వుంటుంది. సుఖ హేతువౌతుంది. సర్వప్రాణిస్పృహణీయమై స్వర్గ్యమైనదాన్ని యెవరు కోరడు? నిత్యనైమిత్తికకామ్యకర్మలచేత జైమిని లోకానికి ప్రాపింపజేయ యత్నించిన ఫలం యీదృశసుఖగర్భితమైయే వున్నది. దయ, సత్యం ప్రేమ, తేజస్సు స్వాతంత్ర్యం ఇట్లాటి కల్యాణగుణాలు వెలిసే స్థితి ధర్మం అర్ధకామాలను అతిక్రమించినపుడే లోకానికి సిద్ధిస్తున్నది. కనుకనే లోకసంతతికి పరమసాధనమైన శృంగారానికి ధర్మరక్షకులను, లోకరంజకులను తేజస్వంతులను ఆలంబనం చేశారని చెప్పుతున్నాను.

అదిగాక లోకానికి అంతటిశ్రేయస్సు సమకూర్చేవారి శృంగారం మనకు ఆనందప్రదంగా వుంటుంది. లోకసంగ్రహంకొరకు పాటుపడే మహాత్ములను మనం ఊరేగిస్తాము. అందుకే ధర్మరక్షకు లయిన రాజులు, మంత్రులు, ధర్మపరాయణులైన ఇతరులు భారతీయకావ్యంలో శృంగారనాయకులుగా వెలయగలిగినారు. అర్ధకామాలు ధర్మానికి అణగినప్పుడే ధర్మం స్థిరవికాసంతో ప్రకాశిస్తున్నది. ధర్మంతో సమస్త కల్యాణగుణాలూ వికాసం పొందుతున్నవి.

ముందు శృంగారాధిదేవతగా వెలయబోతూ అరణ్యస్థలిలో ప్రియసంయోగం కొరకు తపస్సాచరించే పార్వతియందు ప్రియుడైన పరమేశ్వరుడికి కామాన్ని తొక్కినిల్చున్న ధర్మమే గోచరించి.

"అనేన ధర్మః సవిశేషమద్య మే
 త్రివర్గసారః ప్రతిభాతి భావిని,
 త్వయా మనో నిర్విషయార్ధకామయా
 యదేక ఏవ ప్రతిగృహ్య సేవ్యతే".

(ఓపార్వతీ! ఇందువల్ల ధర్మమే త్రివర్గసారమైనట్టు నాకు తోస్తున్నది. యెందువల్లనంటే; అర్థకామాలు తలపెట్టకుండానే ధర్మాన్ని ఒక్కదాన్నే ప్రతిగ్రహించి నీవు ఆరాధిస్తున్నావు) అని అంటాడు.

ఓ పార్వతీ! ధర్మార్ధకామాల్లో ధర్మసారత్వం నేడు నాకు కనబడుతున్నది. అర్ధకామాలను అధఃకరించిన నీవు దాన్ని (ధర్మాన్ని) ఒక్కదాన్నే అరాధిస్తున్నావు అని అభిప్రాయం తెలుపుతాడు. పశుత్వద్యోతకమైన కామం అడుగుకుపోయిన తరవాత ధర్మం ఆలంబనం అయిన సమయాన పార్వతీపరమేశ్వరుల సంయోగాన్ని కుమారసంభవంలో ఆరాధించిన కాళిదాసు

"అప్యర్థకామౌ తస్యాస్తాం ధర్మ ఏవ మనీషిణః" (రఘు)

ఆ దిలీపమహారాజుకు అర్ధకామాలుగూడా ధర్మమే అయినవి.

అని వేరొక చోట అంటాడు ఇట్లా అర్ధకామాలను సేవకులుగా జేసుకున్న ధర్మసారత్వాన్ని కాళిదాసు అనేకస్థలాలల్లో తన కవితాసర్గంలో ప్రకటిస్తాడు. కేవలం కామిని అగ్నివర్ణుణ్ని అంతఃపురంలోవుండి ప్రజలకు దర్శనం సయితం ఇయ్యక కాలుమాత్రం చూపి స్త్రీలోలుడై వున్నవాణ్ని చిత్రించి అతడు చివరకు క్షయపుట్టి చచ్చినాడని ముగించాడు. పడకటింటిలో ఆకస్మికంగా స్త్రీ కనబడగా నీకొంగురాచుకున్నది. నాకు నిద్రపట్టదని అనిపించక ధర్మదేవతను ఆరాధిస్తూ

"కా త్వం శుభే కన్య పరిగ్రహో వా
 కిం వా మదభ్యాగమకారణం తే.
 ఆచక్ష్వ మత్వా వశినాం రఘుణాం
 మనఃపరస్త్రీవిముఖప్రవృత్తి". (రఘు.)

(ఓకల్యాణీ నీవెవరు? నీ వెవరిభార్యవు? రఘువంశరాజులు పరస్త్రీవిముఖులైన విజితవిషయులని తెలిసిగూడా నీవెందుకు వచ్చావు?) అని కుశుడిచేత కాళిదా సనిపిస్తాడు.

కామాన్ని దహించిన పిమ్మట బ్రహ్మతేజస్సుతో వెలిగే పరమేశ్వరుడిచేత, సంయోగం కొరకు కామాన్ని అతిక్రమించి తపస్సు చేస్తున్న పార్వతిని, పవిత్రురాలిని కాళిదాసు చేయిస్తాడు. శాకుంతలంలో శృంగారనాయకుడైన దుష్యంతుడి ధర్మారాదనను.

"ధర్మ్యాః తపోధనానాం
 ప్రతిహతవిఘ్నాః క్రియాః సమాలోక్య
 జ్ఞాస్యసి కియద్భుజో మేరక్షతి మౌర్వీ కిణాంక ఇతి." |(శాకుం.)

(తపోధనులయొక్క ధర్మవిహితమైన క్రియలు ప్రతిహతవిఘ్నాలైవుండడం చూసి "నామౌర్వీకిణాంకమైన భుజ మెంతదూరం రక్షిస్తున్న దనే సంగతి తెలుసుకోగలవు.)

"సాఖలు విదిత భక్తిం మాం
 మహర్షేః కథయిష్యతి". (శాకుం.)

విదితభక్తిని నన్ను మహర్షికి ఆమె తెలుపుతుందిగదా.)

"తపోవన నివాసినాం ఉపరోధో మాభూత్"

(తపోవననివాసులకు ఉపరోధం కలుగకుండును గాక) అని యీతీరున వ్యక్తపరుస్తాడు. ఉత్తరరామచరిత్రలో భవభూతి విప్రలంభ శృంగార నాయకుడైన శ్రీరాముడి ధర్మతత్పరత్వాన్ని

"స్నేహం దయాంచ ప్రీతించ యదివా జానకిమపి
 ఆరాధనాయ లోకానాం ముంచతో నాస్తి మే వ్యధా." (ఉత్తర)

(ప్రజలను ఆరాధించడానికి స్నేహాన్నివిడిచినా దయనువిడిచినా ప్రీతిని విడిచినా, చివరకు జానకిని విడిచినాగూడా నాకు చింతలేదు.) అని వినిపిస్తాడు. కాదంబరిలో బాణుడు శృంగారసందర్భ లో అంగకథలో వచ్చే పుండరీకుడివిషయాన సయితం పవిత్రగుణధర్మాలను ప్రస్తావిస్తాడు.

మహోశ్వేతమీదివాంఛచేత పుండరీకుడు మృతుడుకాగా

"హాధర్మ! నిష్పరిగ్రహోసి, హాతపోనిరాశ్రయమసి, హాసర స్వతి. విధవాసి, హాసత్వం అనాథమసి." (కాదం)

(హాధర్మమా! నిష్పరిగ్రహమైనావు. హాతసస్సా! నిరాశ్రయ మైనావు. హాసరస్వతి! నీనాథుడు పోయినాడు. హాసత్యమా! అనాధ మయితివి" అనే కపింజలవిలాసంలో పుండరీకుడి సత్యధర్మ పరత్వాది గుణాలను విశదీకరిస్తాడు.

ధర్మం అనంతరూపమైనది తపస్సు, దయ, సత్యం, అహింస, పరదారవిముఖత్వం, పరధనపరాఙ్ముఖత్వం సత్కార్యదీక్ష మొదలయిన అనంతరూపాలతో ధర్మదేవత వెలసివున్నది. మాధవుడు చారుదత్తుడు అగ్నిమిత్రుడు చంద్రాపీడుడు అందరు ధర్మసంబంధంగల వారే అయివున్నారు. మృచ్ఛకటికలోని చారుదత్తుడి ధర్మపరతంత్రత్వం మొదలైనవి వివరించడం గ్రంథవిస్తరహేతువని వదలుతున్నాను. ప్రాచీనభారతవర్షంలో రాజత్వం ధర్మరక్షకత్వం సమానాధికరణాలుగా వుండేవి. అధర్మి అయినరాజును వేనుణ్నివలె పదచ్యుతుణ్ణి చేసేవారు. నాయకుడికి స్పుటధర్మరక్షకత్వం ప్రతిపాదితంగాక శాకుంతలాదుల కన్న తక్కువ కక్ష్యలో చేరుతున్న మేఘదూతలో సయితం.

"యక్షశ్చక్రే జనకతనయాస్నానపుణ్యోదకేషు
 స్నిగ్దచ్చాయాతరుషు వసతింరామ గిర్యాశ్రమేమ." (మేఘ)

అని జానకీ స్నానపావనమైన వుదకాలుగలచోట వసతిచేసుకున్నాడని అతడి జానకీపాతివ్రత్యంమీది ఆసక్తి రూపమైనధర్మాన్ని విశదపరుస్తాడు.

"యాచ్ఞామోఘా వరమధిగుణే నాధమే లబ్దకామా"

అని అనిపించి ఉత్తములైన గుణవంతులమీది ప్రేమరూపమైన ధర్మాన్ని స్పష్టపరుస్తున్నాడు. శృంగారానికి ధర్మసంబంధి నాయకుడి ఆవశ్యకత యింతటిది గనుకనే సాహిత్యవేత్తలు

"అనురక్తలోకః తేజోవైదగ్ధ్య.
        శీలవాన్ నేతా త్యాగీ కృతీ." (సాహి)

"ఉత్తమప్రకృతిపాయః
        రసః శృంగార ఇష్యతే" (సాహి)

"లోకోత్తర నాయకాశ్రయేణ
        శృంగారస్య పరిపోషాతిశయః" (సాహి)

అని నిరూపిస్తున్నారు శ్రీరాముడు. నలుడు, ఉదయనుడు యిట్టి ధర్మ పరతంత్రులు శృంగారనాయకులై భారతీయకావ్యంలో శృంగార తత్వాన్ని ప్రబోధిస్తునారు.

పూర్వపక్షం

అవునయ్యా; అనురాగమార్గాలు కట్టుబాట్లకు లోనయ్యేవిగావు ఒకధర్మరక్షకుణ్ని ఒక స్త్రీ ప్రేమించవలెనంటే సంభవించవచ్చును సంభవించకపోవచ్చును కనుక ధర్మరక్షకత్వంతో శృంగారానికి సంబంధఁ లేదు; హృదయమార్గాలు దుర్గ్రహాలు అని అంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను ధర్మపరాయణ అయిన యేస్త్రీనైనా సరే దర్మ రక్షకుడైన పురుషుడు ప్రేమించి తీరవలెనని గాని ధర్మ రక్షకుడైన యేపురుషుణ్ణి అయినా ధర్మపరాయణ అయిన స్త్రీ ప్రేమించితీరవలెనని గాని నేను నియమం చెప్పలేదు. హృదయమార్గాలు దుర్లహా లన్నమాట సత్యం. అయితే చిత్తనైర్మల్య మొకటివున్న తరువాత యేదేవత నారాధించినా ఆ ఆరాధనం చరితార్ధమవుతున్నది. అట్లానే హృదయక్షాళనమైన తరువాత యెవరిని ప్రేమించినా అది ఉపాదేయమై ఆశృంగారం లోకశ్రేయస్సును బలపరుస్తున్నది. లేదా ఆశృంగారం కేవలం పశుకృత్యమై ఇంద్రియక్షోభం, ఆత్మవినాశం మొదలైన హేయఫలాలకు హేతువగుతున్నది అందుకే ధర్మక్షాళనం ఆవశ్యకమని విశదపరిచాను. హృదయం ధర్మక్షాళితమైన తరువారు యేస్త్రీ యేవిశుద్ధుణ్ని ఉద్యహిస్తుందో యేపురుషుడు డేవిశుద్ధను వరిస్తాడో యెవరు నిర్ణయించగలరు?

చిత్తనైర్మల్య మొకటివున్న తరువాత యేదేవత హృదయాన్ని అదిస్థిస్తుందో! హృదయమార్గాలు దుర్గ్రహమన్నాము.

"మహేశ్వరే నా జగతామధీశ్వరే
 జనార్దనే వా జగదంతరాత్మని
 న వస్తుభేదప్రతిపత్తిరస్తి మే
 తథాపి భక్తి స్తరుణేందుశేఖరే" (త్రిశతి)

"జగదధీశ్వరుడైన మహేశ్వరుడియందుగాని, జగదంతరాత్మ అయిన జనార్దనుడియందుగాని, నాకు వస్తుభేద ప్రతిపత్తి లేదు. అయినప్పటికీ తరుణేందు శేఖరుడియందే నాకు భక్తి" అని}}

"శైవా వయం నఖలు తత్ర విచారణీయం
 పంచాక్షరీజపపరా వితరాం తథాపి
 చేతో మదీయమతసీకుసుమావభాసం
 స్మేరాననం స్మరతి గోపనధూకిశోరం"

(మేము శైవులం అందులో విచారించవలసినది లేదు. మేము అధికంగా పంచాక్షరీజపరాయణులం అయినప్పటికీ నాచేతన్సు అతసీ కుసుమావభాసుడూ స్మేరాననుడూ అయిన గోపవధూకిశోరుణ్ని స్మరిస్తున్నది) అని భర్తృహరి లీలాశుకులూ అన్నట్లు వాస్తవంగా హృదయమార్గాలు దుర్గ్రహం.

"వ్యతిషజతి పదార్థాన్ అంతర: కోపి హేతు:" (మాలతీ)

(యేదో ఒక అనిర్వాచ్యమైన అంతరహేతువు పదార్ధాలను కలుపుతున్నది) అని భవభూతి ఈసత్యాన్నే ప్రకటిస్తున్నాడు. ఇంతకూ చెప్పదలచిన దేమంటే హృదయానికి ధర్మక్షాళనం హృదయమార్గాల దుర్గ్రహత్వంతో సంబద్ధమయ్యే వున్నదని శృంగారం ఉపాదేయం గావడానికి లక్షితం గావలె నని చెప్పుతున్నాను.

సాధారణులు - చిల్లర శృంగారం

ఇక సాధారణుల శృంగారాన్ని చర్చిస్తాను. ధర్మంగాని అధర్మంగాని యెరగక యెవరిపొట్టవాండ్లు పోసుకునేవాండ్లు సాధారణులు వీరు కాముకులైనప్పటి శృంగారాన్ని చర్చిస్తాను వీరిశృంగారం గ్రాహ్యమా అని విచారణచేస్తాను. లోకశ్రేయస్సుకు త్యాగంచూపే మహాత్ములను గౌరవించి ఊరేగించి వారిఆనందమే మనకు తృప్తిగా ప్రవర్తిస్తామని వారిశృంగారం మనకు గ్రాహ్యమై వర్తిస్తున్నదని విశదపరచాను.

"ఆరాధనాయ లోకస్య"

అన్న శ్రీరాముడు ఉత్తరరామచరిత్రలోను సర్వధర్మాలకు నిలయంగా

"అనేన ధర్మః సవిశేషమద్య మే
 త్రివర్గసారః ప్రతిభాతి భావిని"

అనేమాటలు వెలువరించజేసి వెలువరించగలిగిన లోకపితలు పార్వతీ పరమేశ్వరులు కుమార సంభవంలోను ఉత్తమశృంగార నాయకులై భారతీయకావ్యంయొక్క ఔత్కృష్ట్యాన్ని ప్రకటిస్తున్నారని తెలిపినాను. ఇక కేవలం సాధారణకాముకులు వారి పెండ్లాన్ని ముద్దుపెట్టుకొని బుజాలమీద యెక్కించుకుంటే యెక్కించుకో వచ్చును. అది మనకు విచార్యంగాదు ఇట్లాటికాముకుడు పూలదండలువేసుకొని కులుకుతుంటే పూల రంగడంటాము ఒకప్పుడు అట్లాటి కేవలకామేచ్ఛారూపమైన పశుభావాలే మనలోప్రేరితంకాగలవు. ధర్మతత్పరులైన ధీరుల శృంగారం మనకు ఇట్లాటి భావనలను కలిగించదు. పైగా నిర్మలదాంపత్యం మీద అభిలాష అవిర్భవింపజేస్తుంది. అందుకే పత్నులతోకూడిన ఋషులను పరమేశ్వరుడు చూచినపుడు.

"తద్దర్శనాదభూచ్చంభోః భుయాన్ దారార్థమాదరః"

(వారిని చూడడంవల్ల శివుడికి భార్యా స్వీకారంమీద ఆదరం హెచ్చుగా గలిగింది) అని కాళిదాసన్నాడు. యెందుకు? కామతృప్తికి గాదు.

"క్రియాణాం ఖలు ధర్మ్యాణాం సత్పత్న్యో మూలకారణం"

(ధర్మసహితమైన క్రియలకు సత్పత్నులేగదా మూలకారణం అని వెంటనే కాళిదాసంటాడు. కేవలకామరూపమైన వృత్తి ప్రేరితమైతే యేమంటారా? కేవల కామం విషయలోలత్వాన్ని విషయలోలత్వం బుద్ది నైర్యల్యానికి ఆచ్చాదనాన్ని ఆత్మవినాశాన్ని కలిస్తున్నవి అది కేవలం పశువృత్తి. అగ్ని పర్వతంనుండి పొంగే ప్రవాహంవలె లేచిన బిల్హణుడి అద్యాపి స్మరణాలు సర్వలోకంలో కాముకశృంగారకోటిలో ప్రథమ స్థానం ఆక్రమించదదివున్నా అవి బిల్హణుడికి కాళిదాసాదుల కీర్తివంటి ఉత్తమకవితాకీర్తినితేలేదు. చివరకు ఆతనిమనస్సు మోటుదనాన్ని తెలిపే కథనుగూడా లోకం అతనికి తగిలించింది.

"రాజుద్వారే భగాకారే విశన్తి ప్రవిశన్తి చ
 .....వత్ పండితాః సర్వే బిల్హణో వృషణాయతే"

అనేకథ ఆతని మోటుకామపు ప్రవృత్తికి తగేవున్నట్లు నాకు తోస్తున్నది. కేవల కాముకత్వం విషయలోలత్వాన్ని విషయలోలత్వం ఆత్మవినాశాన్ని కలిగిస్తవి గనుక అపేక్ష్యం గాదంటున్నాను. అది గాక శృంగారం మిక్కిలి సునిశితమైనది. అది యేమాత్రం హద్దుమీరినా మితిమీరినా క్షోభమేకలుగుతున్నది. లోకంలో అనేకమైన హింసలు పీడలు, హత్యలు అలజడులు దేహాత్మల నైర్మల్యవినాశాలు ఈశృంగార దుర్వినియోగంవల్ల గోచరిస్తున్నవి. ఇది ధర్మసంబంధి అయినప్పుడే లోక శ్రేయస్సుకు తోడ్పడుతున్నది. అర్ధకామప్రేరితమాయెనా అత్యంతం అనర్ధ హేతువగుతున్నది. ఇది ముడిదశలో మోటుపనులనే వెలువరిస్తున్నదిగాని ఉదాత్తస్వరూపాన్ని ప్రకటించజాలదు. ఈ ప్రాకృత ప్రవృత్తిలో మనకు విచార్యంగాదు. కోళ్లు కుక్కలుకూడా యీప్రవృత్తిలో వుంటున్నవి కనుకనే సాధారణుల శృంగారం గ్రాహ్యంకా దంటున్నాను. "చెన్నపట్టణంలో" అనే మొదలయిన యిప్పటినవల అనేకంలోను భారతిమొదలయిన పత్రికల్లోని "పరీక్ష" సర్వదర్శినిలోలక్కులు" మొదలైన కథలవంటి కథల్లోను వుండేది యీ అనుపాదేయమైన శృంగారమే అయివున్నది.

ఆనుషంగిక ఫలాలు

శృంగారం ఆధారంగా ఉదాత్తభావోన్మీలనం అయినప్పుడే అది వుపాదేయం. అది అధారంగా కొన్ని పశువృత్తులు కలియడం మొదలైనవి మాత్రంబయట బడ్డప్పుడు క్షుద్రశృంగార మవుతున్నది.

"ఆరాధనాయ లోకస్య"

అని అనగలిగిన ధర్మతేజస్సుతో పరిణతులైన ఉత్తమనాయకులందు గాని ఉదాత్తబావోన్మీలనంగలదు ఇది లేని కేవలం కలియడం గిల్లడం గిచ్చడం చుంబించడం కౌగిలించడం మొదలైన వృత్తులు శృంగారానికి క్షుద్రఫలా లంటున్నాను. ఇవి వినదగ్గవి చెప్పుకో దగ్గవికావు. కనుకనే ఈకోటిలోచేరిన ఉదాత్తత్వం లేక

"రజస్వలకాకముందే చండ్లువచ్చినవి
 పొగరుగుబ్బలరైక నెగదన్ని
 నీచన్నులు నీవెండ్రుకలు నాకువశం చేస్తానని చేయలేదు
 సావిట్లోకి సిటి కేసి రమ్మని చెయ్యూపి నట్లు"

అని కేవల పశువృత్తులను రేపే. గంటి సూర్యనారాయాణశాస్త్రివారు ప్రకాశింపజేసిన శృంగారం అనే పుస్తకంలోను.

"అదినడిచేటప్పుడు కుచ్చెళ్లు రేపేదుమ్ములో రేణువునైతా"
 (నాయని సుబ్బరావు)
"జానకి నారత్నాలబొమ్మ యేంజేస్తున్నదో"
 (అధికార్ల సూర్యనారాయణ)
"యెప్పుడు ప్రియుడువస్తాడా! యెప్పుడుమొగం చూస్తానా,"
(సౌధామిని)

"ఓకాంతా నన్నుజూడూ

(మామునూరి నాగభూషణరావు)


"నన్నెవరేమంటేనేమి నీప్రేమబాగ్యంవుంటే నాకేమిభయం"

                                      

(గరిగిపాటి రామమూర్తి)


"నాకు రెక్కలుంటే నీవద్దవచ్చి వాలి ముద్దుపెట్టుకుంటాను"

                          

(నాదెండ్ల వెంకట్రావు)


"ఓతరుణీ నీకౌగిట్లోచేరి తనువుమరుస్తాను
 నామీద ఆకాశంపడ్డా భయంలేదు
 నా ప్రణయగాన శబ్ధాలకు విశ్వమంతాచలించి
 నిట్టూర్పు విడిచింది."

                          

(వేదుల సత్యనారాయణశాస్త్రి)


"చింతచెట్టుమీద గువ్వజంట సరస మాడుతున్నది
 చప్పుడైనప్పుడెల్ల నీవేవస్తున్నావని చూస్తున్నాను

                                    

(సౌదామిని)


"కలికీ నీవలపుదప్ప నాకు మరేమీవద్దు

               

(పువ్వాడ శేషగిరిరావు.చోడవరం జానకిరామయ్య.)


"దాని చీరకొంగు రాచుకున్నది నిద్రపట్టదు"

                                  

కవికొండల వెంకట్రావు


"ముద్దులొలుకు నీరూపు పిల్లా, మూర్చదెచ్చా వేమో పిల్లా"

అని యీతీరున భారతిలోని ప్రణయగీతం, ప్రణయసౌధం, ప్రణయోన్మాదం మొదలైనవాట్లో వ్యక్తమవుతున్నవి. కేవలం పశుత్వం వెల్లడించేవి అయిన యీమాటలన్నీ వినదగినది చెప్పుకోదగినది కాని క్షుద్రశృంగారమైవున్నవి. శాస్త్రగ్రంథాల్లో శబ్దవృత్తులు మొదలయినవాటికి లక్ష్యంగా ఉదాహరించే చాటుపద్యాలవంటివి యివంటారా? నాకు విప్రతిపత్తిలేదు. యివి వొక నూతనకవిత్వం ఉత్తమకవిత్వం అంటున్నందున విచారణ శృంగారం ఆధారంగా ఉదాత్తభావోన్మీలనం అయినప్పుడే అది మనకు స్వీకార్యమన్నాను. విశ్వనాథు డన్నట్లు ఉత్తమప్రకృతులై అనురక్తలోకులై శీలవంతులై ధర్మతేజస్సుతో పరిణతులై ఉత్తమ సంస్కారప్రాప్తితో ఉదాత్తులైన నాయకులందే ఇట్లాటి దశసిద్ధిస్తున్నది. అప్పుడాశృంగారం శ్రోతవ్యమవుతున్నది. దానివల్ల ఆనందమేగాక నాయకనిష్ఠమైన వీరత్వ తేజశ్శాలిత్వ శీలవత్వాదులమీద అనురక్తీవాటివల్ల లోకాభ్యుదయానికి అనుకూలమైన కల్యాణగుణాభిరతీ నాంతరీయ కఫలాలుగా సిద్దిస్తున్నవి. యీసంగతి రఘువంశకుమారసంభవోత్తర రామచరిత్రాదులవల్ల విదితమవుతూనేవున్నది. వీట్లో వృత్తాంతం యొక్క శ్రవణం యిట్లాటి ఆనుషంగిక ఫలాల ప్రదానానికి సమర్థమయ్యే వున్నది. ఇట్లానే ఉదాత్తనాయికానిష్ఠమైన కల్యాణగుణాలపై అనురక్తిసయితం ఆనుషంగికంగా సిద్దిస్సున్నది.

ప్రాకృతులు--కామప్రేమ

కేవల కాముకులశృంగారం క్షుద్రమని నిరూపించాను. ఇక కేవలం ప్రాకృతదశలోవుండే మనుషులశృంగారం క్షుద్రమనిచెప్పవలసిన పనిలేదు. కేవల కాముకుల్లోను ప్రాకృతుల్లోను రూపప్రేమే ప్రధానమవుతున్నది. ఈరూపప్రేమ అవయవసన్ని వేశం మొదలైన బహిరాకారంమీద ఆధారపడి వుంటుంది. యీ ఆకారానికి వికృతిగలిగినప్పుడు ప్రేమకూడ వికృతి జెందవలసివస్తుంది. కారణగుణం కార్యంలో సంక్రమించడం ప్రసిద్దిమేగదా. యీప్రాకృతమైన కామప్రేమ పశుప్రేమ. వీటి నన్నిటిని దాటి ప్రేమ గుణాలమీద అధారపడ్డప్పుడే పవిత్రమైన లోకాభ్యుదయానికి హేతువగుతున్నది. రూపంమీద ఆధారపడ్డ ప్రేమ విషయలోలత్వానికి మాత్రం హేతువగుతున్నది. కనుకనే కవికుల గురువు కాళిదాసు

"అరూపహార్యం మదనస్య నిగ్రహాత్" (కుమార)

(రూపహార్యుడుకాని పినాకపాణిని పార్వతి పతిగా కోరుతున్నది)

అని రూప ప్రేమ యొక్క హేయత్వాన్ని వ్యక్తంచేస్తాడు

ధర్మసంబంధంగాని అధర్మ సంభంధంగాని యేమీ లేకుండా తినడం కనడం పరమప్రవృత్తిగా పెట్టుకున్న సాధారణుల శృంగారం సయితం అగ్రాహ్యమే అవుతున్నది. వీరులు సత్యవాదులు దయావంతులు పరదారవిముఖులు లోకానికి అపేక్ష్యులుగాని తినడం కనడం పరమవృత్తిగా, పెట్టుకున్న పశుతుల్యులు అపేక్ష్యులుగారు. యేదో విధంగా స్వార్ధాన్ని అణచి లోకశ్రేయస్సుకు ధర్మంకొరకు త్యాగం జూపగలిగినప్పుడే ధర్మరక్షకత్వం ధర్మ పరత్వం సిద్ధిస్తున్నవి. ధర్మం అనంతముఖాలతో వెలసివున్నదని యిదివరకే చెప్పినాను. అదిగాక ప్రాకృతుల్లో ఆశృంగారం ఆధారంగా కులకడం, కలియడం, తహతహపడడం ఇట్లాటివి మాత్రమే బయటబడతవి. ప్రాకృతులు నాయకులుగావున్న యెంకిపాటలు మొదలైనవీస్థితినే తెలుపుతున్నవి.,

"కామాతురాణాం న భయం నలజ్జా"
అన్నట్లు యెంకిపాటల్లో నాయుడు బావ
"పదిమందిలో యెంకిపాటనే పాడంగ"

అని తనకాంతను గురించిన పాటను లజ్జవిడిచి పదిమందిలో పాడేకేవల కామి;యింతేకాదు. ఇతడు పరకాంతతో వరసలాడే వెకిలిమనిషి.

"పొరుగమ్మతో నేను వరసలాడేవేళ"

అని అంటాడు. యితడు సంస్కారహీనుడైన ప్రాకృతుడని యింకా ముందునిర్ణయిస్తాను. ఈకోటిలోనివారు గనుకనే యీ యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాట మొదలైనవాట్లో

"కన్ను గిలికిస్తాది, నన్ను బులిపిస్తాది."

నాసక్క నెంకీ, జాము రేతియేళ నీటుగా వొస్తుంటె
వొయ్యార మొలికిస్తుంది కులుకు సూపెడతాది
కులుకుతా నన్నేటో పలుకరించాలి
కనుబొమ్మ సూడాలి కమ్మగుండాలి" (యెంకిపాట)

"కడుపుకోసం మొక్కుకోవే చంద్రమ్మ"
                                        (వెంకయ్య చంద్రమ్మపాట)

"కొద్దిలో వరహాల కొడుకునేత్తేవంటి"

"(మంచెకింద)గోనెపట్టాయేసి గొంగడిపై నేసి
 కులాసగుంటాది" (యెంకిపాట)

"అంటింత చెట్లలో తంటాలుపడలేము
 పాతగొంగడి సింపి తేరో రెంకయ్య"
          (యెంకయ్య చంద్రమ్మపాట)

అని యిట్లాటి మనోవృత్తులు ప్రాకృతులు గనుకనే ప్రధానంగా బయటబడుతున్నవి. అనురక్త లోకత్వం తేజశ్శాలిత్వం సంస్కారప్రాప్తి యిట్లాటి స్పృహణీయగుణాలువున్న వ్యక్తియందు నిష్టమైతే ఆశృంగారవృత్తాంతం మనకు శ్రోతవ్యమై ఆనందమేగాక వీరత్వ తేజశ్శాలిత్వాలమీద అనురక్తి వాటివల్ల కలిగే లోకాభ్యుదయానికి అనుకూలమై వుండే కల్యాణగుణాభిరతీ నాంతరీయకఫలాలుగా శృంగారంవల్ల సిద్ధిస్తున్నవని యిదివరకు విశదపరచాను. పొరుగుకాంతలతో వరసలాడడం పెండ్లాము యెదురు గావుంటే నాకు చాలుననడం నీవన్నెసిన్నియలు సూపేవా అనడం కులకడం సోకూ తిరణాలబోవడం మంచెకింద తిప్పలుపడడం (నా తిప్పతీశ్వరుడు లేడా అని) అంటింతచెట్లలో తంటాలుపడలే మనడం యివే యెంకిపాటలు మొదలైనవాటివంటి శృంగారంలో వ్యక్తమయ్యేవి. శాకుంతలంలో శకుంతలకు ఆశ్రమవాసమూలాన ప్రాప్తించిన సంస్కారం, అందువల్ల సిద్ధించిన ముగ్దప్రకృతిప్రేమ గురుజనరతి. యిట్లాటివాటి వల్ల కలిగే చిత్తవిశ్రాంతినైర్మల్యాదులు అనుభూతుమై అట్లాటి కల్యాణగుణాలమీది అభిరతి ఆనుషంగికంగా సిద్ధించేదే అయివున్నది. ఇట్లాటివి మనతోబుట్టువులకు కూతుండ్లకుసిద్దిస్తే మంచిదనుకుంటాము. కాని మనకూతుండ్లు మనతోబుట్టువులు రాత్రులయందు యింట్లో వాండ్ల కన్నుగప్పి చేలకుపోయి మంచెకిందా చెట్లల్లో రహస్య కార్యాలు చేయవలెనని కోరము. యిటువంటి శృంగారం క్షుద్రమని ప్రధానంగా స్వీకార్యం కాదని అంటున్నాను.

పూర్వపక్షం

అవునయ్యా;

"గుడికి చండమెడతావుంటె నాయెంకి" (యెంకిపాట)
"తీర్ధాల కెందుకూ యాత్రలెందుకూ
 దేవుడంతటమనకు లేడేచంద్రమ్మ"
                     (యెంకయ్య చందమ్మపాట)
"సొమ్ము లేలంటాది నాయెంకి" (యెంకిపాట)

అని యీపాటల్లో వున్నవి. యీతీరుగాదైవభక్తి, వేదాంతం, సొమ్ములకోసం భర్తను వేధించకపోవడం స్పృహణీయగుణాలు కదా. ఆనుషంగికఫలాలు యెంకయ్య చంద్రమ్మపాటలో యెంకిపాటలోగూడా ఆపేక్ష్యమైనవి వుంటున్నవి గనుక యివి స్వీకార్యమేనంటారా?

సమాధానం

చెపుతున్నాను;

అదిసరిగాదు, సొమ్ములకోసం వేధించకుండా తమకు లభించిన వాటితోటే అందాలు దిద్దుకొనడం గుడికి దంణం బెట్టడం మొదలైనవి సాధారణ కార్యాలు. అదిగాక గుడికి దంణంబెట్టడం సొమ్ములకోసం వేధించకుండావుండడం మొదలయినవి ఉత్తమనాయికల్లోను సిద్ధిస్తవి. ఇంతకంటే అధికంగా ఉదాత్తగుణోన్మీలనమూ సిద్ధిస్తుంది. అధమపాత్రల్లోవుండే సాధారణమైన స్వీకార్యగుణాలూ అంతకుపైగా ఉత్తములకు స్వతస్సిద్ధంగావుండే ఉత్తమగుణాలూ కలిసి ఉత్తముల యందే సిద్ధించేటప్పుడు ఉత్తములను వదలి అధములను స్వీకరించడం అనుచితకార్యం.

"నిన్నునమ్మివుంటాను నాయుడుబావా
 చింతచెట్టుపై నున్న నారాయణమ్మా
 చిగిరుకోస్తున్నావ నారాయణమ్మా
సన్నపన్నగాజులేవి నారాయణమ్మా
 నీచిన్ని చిన్ని చేతులాకు నారాయణమ్మా"

అనే యీపాట క్షుద్రశృంగారకోటినికూడా అతిక్రమించింది.

"ఏతే సత్పురుషాః పరార్థఘటకాః స్వార్థాన్ పరిత్యజ్య యే
 సామాన్యాస్తు పరార్థమద్యమభృతః స్వార్థా విరోధేనయే
 తేమీ మానుపరాక్షసాః పరహితం స్వార్థాయ విఘ్నంతి యే
 యేతుఘ్నంతినిరర్థకం పరహితం తే కే నజానీమహే". (భ.త్రి)

అని భర్తృహరి అధములను అతిక్రమించినవారికి పేరుకుదరక వదలినట్లు నేను శృంగారంయొక్క ఉత్తమత్వక్షుద్రత్వాలను నిరూపించి వీటినతిక్రమించిన యీనారాయణమ్మ నాయుడుబావల శృంగారం వంటి శృంగారానికి యిక్కడ పేరుపెట్టక వదులుతున్నాను. ముందు సందర్భంవచ్చినచోట దీన్ని దుష్టశృంగారమని వ్యవహరిస్తాను. కేతిగాడు బంగారక్కల శృంగారం వీండ్ల శృంగారానికి జత అయినది. అదిగాక నాయకులు ఉత్తములు పరిపాకవంతులు అయినప్పుడు వారిశృంగార సందర్భంలో

"వ్యతిషజతి పదార్థాన్ అంతరః కోపి హేతుః
 న ఖలు బహిరుపాధీన్ ప్రీతయః సంశ్రయంతే"

(యేదో వొక అంతరకారణంవల్ల అనురాగం వుత్పన్న మవుతున్నది. అనురాగానికి బాహ్యోపాధులు సంశ్రయంగావు)

(మకరందుడు -మాలతీ.)

"సతాం హి సందేహపదేషు వస్తుషు

 ప్రమాణమంతః కరణప్రవృత్తయః"

(శా)


 

(సందేహపదమైన విషయాల్లో సాధువుల అంతఃకరణం ప్రమాణం)

"కమివహి మధురాణాం మండనం నాకృతీనాం
 రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శాబ్దాన్
 పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతుః
 తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం

 భావస్థిరాణి జననాంతసౌహృదాని"

(శాకుం)

(నిజంగా మధురాకృతుల కేది మండనంగాదు? సుఖితంగా వుండిగూడా ప్రాణి రమ్యపదార్ధాలనుజూచి మధురశబ్దాలనువిని పర్యుత్సుకం కావడమనేది అనంశయంగా భావస్థిరాలైన జననాంతర సౌహృదాలను చిత్తంతో అజ్ఞాతంగా స్మరించడేమేను.)అని యిట్లాటి. ఉదాత్త భావాలు ఉన్మీలితంకాగవలవు. యెంకిపాటలు మొదలైనవాటివంటి ప్రాకృతుల శృంగారంలో

"మెళ్లో పూసలపేరు. తల్లో పూవులసేరు
 కళ్లెత్తితే సాలు కనకాబిసేకాలు"
"రాసోరింటికైన రింగుతెచ్చేపిల్ల

అని మోటుమనఃప్రవృత్తే వ్యక్తం కాగలదు. యింతకూ చెప్పదలచిందేమంటే ప్రణయగీతాలు ప్రణయసౌధాలు మొదలయినవి. యెంకిపాటలు మొదలయినవి.భారతిలోని "పరీక్ష" "సర్ఫదర్శిలోలక్కులు" మొదలయిన కథలు "చెన్నపట్టణములో" మొదలయిన నవలలు ప్రకటించేది క్షుద్రఫలకమైన శృంగారం గనుక క్షుద్రమని. సంస్కారవంతులకు ప్రధానంగా ఉపాదేయంకాదని చెప్పుతున్నాను; శృంగారానికి ధర్మసంబంధంలేనప్పుడు తేజోహీనమవుతున్న దని అది యెంకయ్య చంద్రమ్మ పాట, యెంకిపాటలవంటి వాటిలో పశుకృత్యంగా వుంటున్నదని విశదపరిచాను.

అయితే ఇట్లాటి సాధారణకృత్యాలు, సాదారణశృంగారం లోకంలో వుంటున్నవే. వాటిసంగతి యేమంటే అవి ప్రశంసించతగ్గవి కావంటున్నాను. ముద్దు పెట్టుకొని పురుషుడూ. స్త్రీకలిసి పరుండడం విడిపోయి వొకరినొకరు వెతుక్కొనడం. యివే శృంగారస్వీకరణానికి ప్రధానంగాదు. అవి ధర్మ బద్ధుల్లో నిష్ఠమై, అవి ఆధారంగా ఉదాత్తభావోన్మీలనం అయినప్పుడు శృంగారం స్వీకార్య మవుతున్నది. ఆకలికావడం అన్నంతినడం విశేషంకాదు. ఆ అన్నంతినేవాడు ధర్మపరతంత్రుడై ఆ ఆన్నంమూలాన బలంకలిగి అది లోకాభ్యుదయానికి హేతువైనప్పుడు ప్రశస్యమవుతున్నది. అందుకే ధర్మపరతంత్రుడియొక్క త్యాగియొక్క ఐశ్వర్యం ప్రశస్యమవుతున్నది.

"త్యాగాయ సంభృతార్థానాం"

అని యీసత్యాన్నే కాళిదాసు వినిపిస్తున్నాడు.

ముద్దుపెట్టుకుని స్త్రీ పురుషులు కలిసి పరుండడం, విడిపొయి ఒకరినొకరు వెతుక్కొనడం యివే శృంగారస్వీకరణానికి ప్రధానం గావన్నాను. ఇవి వుపేక్షించ దగ్గ సాధారనకృత్యా లంటున్నాను. ఈకృత్యాలు ఆధారంగా ఉదాత్తభావోన్మీలనం అయినప్పుడే అవి మనకు స్వీకార్యావుతున్నవి. శృంగారం పరిణతనాయకనిష్ఠమైనప్పుడే యిట్లాటిదశ సిద్ధిస్తున్న దని సాధారణుల్లో అది ముడిశృంగారం గానే వుంటున్నదని విశదంచేశాను. కనుక చిత్తసంస్కారంలేని సాధరణుల శృంగారం క్షుద్రమని మనకు ప్రధానంగా స్వీకార్యం గాదని అంటున్నాను.

తటస్థప్రశ్న

అవునయ్యా ధర్మరక్షకులశృంగారం లోకకల్యాణహేతువు గనుకనే స్వీకార్యమని మీరన్నారు. సాధారణదంపతుల్లో ధర్మసంబంధ మున్నది. అది యెట్లానంటారా? దాంపత్యమే ఒక ధర్మం అదిగాక వారిమనశ్శుద్దే ఒకధర్మం. చలించని ప్రేమ ధర్మంగాక మరేమిటి? అద్దాలు మనకెందు కని నాయుడికంట్లో మొగం జూసి బొట్టుపెట్టుకుంటుంది. యెంకి యిటువంటిప్రేమ ఒకధర్మం.

"యేన మూలహరో, ధర్మః సర్వనాశాయ కల్పతే"

(మను)

అని స్మృతికర్తలు నిందిస్తున్న వ్యభిచారాన్నీ దీన్ని పోల్చినప్పుడు ఈదాంపత్యం యెక్క గొప్పతనం వ్యక్తమవుతున్నది. సాధారణులైనా వారిదాంపత్యమే ఒకధర్మం గనుక అదిగూడా స్వీకార్యమే నంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను; పాతివ్రత్యం ధర్మమంటే మేము వొప్పుకుంటాము. అయితే పాతివ్రత్యానికి ఆమహిమ గృహస్థా శ్రమ మహిమ వల్ల చేకూరింది. భారతీయుడి గృహస్థాశ్రమం. ఆ ఆశ్రమంలో నిర్వహించే ధర్మపరంపర సర్వలోకానికి ఆరాధ్యమైనవి.

"క్రియాణాం ఖలు ధర్మ్యాణాం

 సత్పత్న్యో మూలకారణం "

(కుమార)

(ధర్మ్యాలయిన క్రియలకు సత్పత్నులే మూలకారణం)

అని కాళిదాసు ఈగృహస్థాశ్రమధర్మస్వరూపాన్ని తెలుపుతున్నాడు. లోకస్థితిహేతుభూతమయిన ధర్మంయొక్క ఆచరణం యీఆశ్రమానికి ప్రధానం కావడం వల్ల దాంపత్యానికి అధర్మమహిమ వచ్చింది. అందుకే

"సర్వేషామపి చైతేషాం వేదస్మృతివిధానతః
 గృహస్థ ఉచ్యతే శ్రేష్ఠః సత్రీనేతాన్ బిభర్తిహి
 యథా నదీనదా స్సర్వే సాగరే యాంతి సంస్థితిం

 తదైవాశ్రమిణస్సర్వే గృహస్థే యాంతి సంస్థితిం"

(మను)

(వేదస్మృతి విధానంవల్ల యీ అన్ని ఆశ్రమాల్లో గృహస్థుడే శ్రేష్ఠుడని చెప్పబడుతున్నాడు. తక్కిన మూడు ఆశ్రమాలవారిని యితడే భరిస్తున్నాడు. నదీనదాలన్నీ సముద్రంలో యెట్లా సంస్థితిని పొందుతున్నవో అట్లానే తక్కిన ఆశ్రమాలవారు గృహస్థుడియందు సంస్థితిని పొందుతున్నారు) అని మనువు కీర్తిస్తున్నాడు.

"భవేద్ధర్మపరాయణ:"

(నీభర్త ధర్మపరాయణుడు కావలసినది) అని స్త్రీలను ఆశీర్వదిస్తున్నారు.

వివాహానికి ఫలం ధర్మం వీరసంతతి. అంటే వీరావిచ్చిన్నత.

"పనసదొనలవంటి బిడ్దలు కనడానికా నీనోము" అని మూగినోములో అధికార్ల సూర్యనారాయణవారు అన్నట్లు పనసదొనల వంటి శిశువులను కనమని భారతీయులు దీవించరు.

"వీరపసవినీ భవ"అని దీవిస్తున్నారు.

ధర్మావలంబనమైన వీరసంతతిని అవిచ్ఛిన్నంచేసేది గార్హస్థ్యమని బారతీయులభావం.

"క్రియాణాం ఖలు ధర్మ్యాణాం సత్పత్న్యో మూలకారణం."

అని యిదివరకు నేను వుదాహరించిన కాళిదాసువాక్యాలు గార్హస్థ్యంలోని యీధర్మోన్ముఖత్వాన్నే ప్రశంసిస్తున్నవి.

"కామాత్మతా న ప్రశస్తా నచైవేహాస్త్యకామతా" (మను) (కామాత్మతప్రశస్తంకాదు. అయితే కామాత్మత లేకుండా వుండడం లేదు) అని మను వన్నట్లు ధర్మ కామాలచేరికే గృహస్థాశ్రమానికి పూజ్యత్వాన్ని ఆపాదిస్తున్నది.

"ధర్మేణాపి పదం శర్వే కారితే పార్వతి ప్రతి

 పూర్వాపరాధభీతస్య కామస్యోచ్చ్వసితం మనః

(కుమా 6)

అని కామం ధర్మంచేత పవిత్రితమైన తరువాత పరమేశ్వర గార్హస్థ్యాన్ని ప్రతిపాదించిన కాళిదాసీసత్యాన్నే వినిపిస్తున్నాడు.

ఇంతేగాని కేవలకామంవల్ల ఒకపురుషుడు ఒకస్త్రీ కలిసివుండడమే విశేషంగాదు. కనుక ఉత్తమోత్తమమైన ఆశ్రమధర్మాల ఆనులేని కేవలకాముకులు కలయిక అచంచలంగానీ, చంచలంగానీ, గాఢంగానీ, అగాఢంగానీ, మాయికంగానీ, ఆమాయికంగానీ అది ప్రధానంగా స్వీకార్యంగాదు.

ఆక్షేపం

సరేగాని యిది మేమంగీకరించము మీరెన్ని చెప్పినా శృంగారానికి ధర్మసంబంధం మేమొప్పుకోము. యెందుకంటారా? కొందరన్నట్లు శృంగారంలో జరిగేది ఆత్మలసంయోగం. అదే అక్కడ ప్రధానంగాని దైహికసంయోగం గాదు. ఆత్మ సర్వపరిశుద్ధం. దానికి ప్రధానంగా స్వీకార్య మేనంటే

సమాధానం

చెప్పుతున్నాను ఆమాట సరిగాదు శృంగారంలో ఆత్మలసం యోగమే ప్రధానమైతే ఒకస్త్రీ, ఒక పురుషుడూ యెందుకు?ఆడ ఆత్మ మగ ఆత్మ వేరుగాలేవుగదా. ఇద్దరూ స్త్రీలే? యెందు కొకరినొకరు ప్రేమించుకొనగూడదు? ఇద్దరికీ ఆత్మ లున్నవి. ఆఆత్మలసంయోగ మెందుకు శృంగారంకాగూడదు? ఇద్దరూ పురుషులే యెందు కొకరినొకరు ప్రేమించుకొనగూడదు? ఇద్దరికీ ఆత్మలున్నవి. ఆఆత్మలసంయోగమెందుకు శృంగారం కాగూడదు? ఇవన్నీ అయోమయపు అసంబద్ద వచనాలు. అందుకే భారతీ సాహిత్యవేత్తలు ఆత్మలసంయోగం ప్రియులైన స్త్రీపురుషుల విషయంలో గాక జీవాత్మ పరమాత్మలవిషయంలో ప్రతిపాదించారు. అది భగవద్రతి స్త్రీపురుషుల రతినుండి వేరుగా నిర్వచించడానికి దాన్ని భావంలో చేర్చారు. "రతిర్దేవాది విషయా భావః ప్రోక్తః కాంతాది విషయాతువ్యక్తః శృంగారః? అని కావ్య ప్రకాశకారు డీ అంశం తెలుపుతున్నాడు. కనుక ఆత్మసంయోగమని సాధారణులశృంగారం స్వీకార్యమనడం అనుచితం.

ఆక్షేపం

అవునయ్యా శృంగారం ఆత్మలసంయోగానికి సంబంధించింది కాకుంటే కాకపోనియ్యండి పురుషుడు స్త్రీనిగాని స్త్రీ పురుషుణ్నిగాని ప్రేమించడం సౌందర్యాభిమానంచేత. అదే దాంట్లో ప్రధానం. సౌందర్యానికి ధర్మాధర్మవిచారన అనావశ్యకం అందువల్ల సాధారణుల శృంగారం కూడా ప్రధానంగా అంగీకార్యమేనంటారా?

సమాధానం

వివరిస్తాను. సౌందర్యాభిమానానికి శృంగారం సంబంధించినదైతే సుందరులైన తల్లి, కూతురు, చెల్లెలు, పినతల్లి, పినతల్లి కూతురు ఇట్లాటివాండ్ల నెందుకు ఆ అభిమానానికి విషయం చేసుకోగూడదు? వారి సౌందర్యాన్ని అభిమానిస్తూ తృప్తిపడుతూ వుండవ్చచ్చునుగదా పోనీయండి. పాణిగ్రహణం చేసిన నాయికవిషయంలోనైనా కేవల నేత్ర సమారాధనమే లక్ష్యమంటే నాయకుడికి వలెనే నాయికకుగూడా అదే పరమార్థంగా వుండవలె నని యేమి నియమం? ఇద్దరూ ఒకటే చిత్తవృత్తిగలవారై వారికి నేత్రసమారాధనమే లక్ష్యమైతే అసమగ్రమైన దైనప్పటికి కొంతవరకు సంయతమనస్పత్వమనే ధర్మం ధర్మాభావవాదికి అనిష్ఠమైనది సిద్దించనే సిద్ధిస్తున్నది. కనుక అట్లాటిచొట్ల నాకు విప్రతిపత్తి లేదంటున్నాను. కాని సాధారణంగా అన్యోన్యరక్తులైన తరుణస్త్రీ పురుషులవిషయంలో చక్షుఃప్రీతి అంతటితో అంతంగాదు మనస్సు సోపానపరంపరంను ఆరోహించడం సాధారణప్రవృత్తి.

"ఆదర్శనే దర్శనమత్రకామాః
 దృష్ట్వా పరిష్వంగసుఖైకలోలాః
 అలింగితాయాం పునరాయతాక్ష్యా
 ఆశాస్మహే విగ్రహయోరభేదం" (తిశ)

అని హరి జెప్పినమాట లీయాథార్ద్యాన్నే తెలుపుతున్నవి. ఇది సాధారణప్రవృత్తి అన్నాను సంయోగమే ఈప్సితఫలంగా గల వియోగశృంగారం సయితం సంయోగం యొక్క అన్యరూపమే గనుక దాన్ని వేరుగా విచారించవలసిన పనిలేదు. ఈసంయోగం పధానం గానీయండి అప్రదానం గానీయండి కామనంబంధే అవుతున్నది. కేవలకామంయొక్క దుఃస్వరూపాన్ని యిదివరకే విశదంచేశాను. కనుక సౌందర్యవాదంచేత సాధారణులశృంగార ప్రధానంగా స్వీకార్య మనడం అనుచితం

ఆక్షేపం

సౌందర్యాభిమానవాదం పొతే పోనీయండి.మీరు భగవద్రతి వొప్పుకున్నారుగదా? పురుషుణ్ని భగవంతుణ్ణిగా తలచి స్త్రీ సమీపిస్తున్నది. ఇది జీవాత్మపరమాత్మలసంయోగ మనుకోగూడదా? అప్పుడు సాధారణులశృంగారంగూడా ప్రధానంగా సీకార్యమవుతున్నది అని అంటారా?

సమాధానo

చెప్పుతున్నాను; మీరన్నమాట సరిగాదు. పురుషుణ్నే స్త్రీ యెందుకు దైవంగా భావించవలెను? ఒక రాయిని ఒక చెట్టును. ఒక గోడను కాదా ఒక స్త్రీని యెందుకు దైవంగా భావించరాదు? అది యెందుకు శృంగారం కాగూడదు? యెవరైతే నేమి పురుషుణ్నే భావించిందంటారా? అది వంచన సువర్ణమైతే నేమి సుద్ధమన్నైతేనేమి సువర్ణమే కావలెననేటటువంటి అప్రశస్తపుమాట. ప్రియులైన స్త్రీకి పురుషుడికి ప్రకృతిసిద్ధమైన బంధాన్ని ఆధారం చేసుకొని పురుషుడియందు పరమాత్మ దర్శనాన్ని స్త్రీ సాధిస్తున్నదంటారా? ఇట్లా పరమాత్మ దర్శనమే ప్రాప్యమై విషయసక్తతనుండి ముక్తులైతే ఇదివరకు చూపినట్లు ధర్మా భావవాదికి అంగీకార్యంగాని ఇంద్రియజయం.భగవత్సేవ అనే ధర్మాలు సిద్ధిస్తూనే వున్నవి. ఆసందర్భంలో ఆరతి శృంగారసంజ్ఞనువదలి బావసంజ్ఞను పొందుతున్నది. కనుక నాకు విప్రతిపత్తిలేదు.స్త్రీ పురుషుల శృంగారం యిక్కడ నాకు విచార్యవిషయంగాని భగవద్రతిగాదు. ప్రథమఖండంలో భక్తిమతవిచారణలో ఆభక్తిమతమందలి వల్లభసం బంధాన్ని దాని హేయోపాదేయతలను వివరించాను. ఇక్కడ ఆవిచారణ వదులుతున్నాను; భగవద్రతి అనే ఉదాత్తలక్ష్యం యెప్పుడు వెనక బడి హద్దుదాటి మనస్సు విషయసక్తమవుతున్నదో అప్పుడే కామ ప్రవృత్తి ఆరబ్దమవుతున్నది. ఈ కేవల కామప్రవృత్తియొక్క దుష్ఫలాల నిదివరకే విశదీకరించాను కనుక భగవత్త్వారోపవాదం చేత సాధారణుల కామప్రవృత్తి స్వీకార్యమనడం అప్రశస్తం.

ఆక్షేపం

అవును సరే; కొందరన్నవిధాన ప్రియతముడైన నాయకుణ్ని కవి స్వీకరిస్తాడు. కమలం ప్రియతమంగనుక గ్రహిస్తున్నాడు. బొగ్గులు ముండ్లు పెంటప్రియంగావు గనుక స్వీకరించడు. ప్రియతముడు సాధారణుడు కావచ్చును. ధర్మసంబంధి అయిన అసాధారణుడూ కావచ్చును. ఇక్కడ చేయవలసినది ప్రియాప్రియత్వవిచారణగాని ధర్మాధర్మవిచారణగాదు అని ఆంటారా?

సమాధానం

చెప్పుతున్నాను; ఆమాట అసంబద్ధం కవికి కేవలకాముకుల సాధారణుల ప్రవృత్తియొక్క అనుపాదేయత యిదివరకే నిరూపించాను. గనుక అట్లాటి ప్రవృత్తియందు ఆసక్తివుండడం కవియొక్క పరిపాకాభావాన్ని ప్రాకృతత్వాన్ని తెలుపుతుంది. అసాధారణులు శృంగారంలో కవికి ప్రియతములంటే విప్రతిపత్తేలేదు. నేను ప్రతిపాదిస్తున్న అంశమే అది. పరిణతచిత్తుడైన కవిదృష్టికి ఆనగల అసాధారణుల స్వరూపాన్ని పరామర్శించి వారిట్లాటివారని నేను తెలిపినాను. ధర్మసంబంధంలేని కేవల కాముకులు సాధారణులుపోగా శృంగరంలో మిగిలిన అసాధారణు లేవిధంగానైనా నేను తెలిపిన ధర్మసంబంధంగలవారే అవుతున్నారు ధర్మంయొక్క అనంతముఖత్వ మిదివరకే తెలిపినాను. కనుక యింతకూ చెప్పదలచిం దేమంటే. ఆత్మసంయోగమనడం, అభిమాన మనడం, ఆరోపమనడం, అట్లా ననడం,యిట్లా ననడం యివన్నీ విషయసక్తతకు కొత్తపేర్లు పెట్టడమయినా అవుతవి. లేదా యిదివరకు తెలిపినట్లు అయోమయపు అసంబద్ధవచనాలైనా అవుతవి. ఆత్మల సంయోగం వుండనీయండి? అబిమానం వుండనీయండి? ఆభిమానం వుండనీయండి? ఆరాధనం వుండనీయండి? యేమైనా వుండనీయండి? సాధారణంగా ప్రియులైన స్త్రీ పురుషుల కలయిక నుండి స్త్రీత్వపురుషత్వాలసత్తను వేరుచేయలేమంటున్నాను. సాహిత్య వేత్తల స్త్రీపురుషసాధారణ్య రూపమైన ఈ స్త్రీత్వపురుషత్వాలు నిర్మలోపాధితోకూడినప్పుడు వాటి కలయిక లోకాభ్యుదయ హేతువవుతున్నది. హేయోపాధులతో కూడినప్పుడు అనర్థహేతువవుతున్నది. ప్రాకృతుల శృంగారంయొక్క అనుపాదేయత తెలిపినాను. అనౌచిత్య ప్రవృత్తమైన పరకీయారత్యాది శృంగారాభాసానికి దుష్టశృంగారానికి ఇక్కడ ప్రసక్తి లేదు గనుక దాన్ని విచారించలేదు అశ్లీలసురతాదులు, గ్రామ్యవృత్తులు వెగటుగా ప్రధానంగా వర్ణించడం యెందైనా ఔచిత్య పరిపాలనానికి త్యాజ్యమనే సంగతి నైషధతత్వజిజ్ఞాసలో విశదం చేశాను. కనుక ఆమీమాంస వదలుతున్నాను.

శృంగారం సాధారణుల్లో కేవలకాముకుల్లో కలియడం కులకడం, తహతహ పడడం మొదలైన ముడిపనులనే వెలువరిస్తుందని తినడం, కనడం. పరమార్థంగా వుండే వృత్తి అనుపాదేయమని యిదివరకే విశదం చేశాను. శృంగారం ఆధారంగా ఆనందమేగాక ఉదాత్త భావోన్మిలనం వీరత్వతేజశ్శాలిత్వాదులమీద అనురక్తీ వాటివల్ల కలిగే లోకాభ్యుదయానికి అనుకూలమైన కల్యాణగుణాభిరతీ ఆనుషంగిక ఫలాలుగా సిద్ధించినప్పుడే అది గ్రాహ్యమని. పరిణత నాయకులందే ఆదశ సిద్ధిస్తున్నదని చెప్పినాను. ప్రకృతానికి వస్తాను.

సాధారణుల జానపదుల ధర్మసంబంధిగాని కామప్రేమ ఈతీరుగా ఉదాత్తప్రేమవలె ముఖ్యమైనది గాదు. అయితే అమాయికులయిన ప్రాకృతులప్రేమ కొంతవరకు మనోహరంగానే వుంటుంది. కనుకనే భారతీయులు దీనిని వదలక కావ్యంలో అప్రధానంగానైనా స్వీకరించాను. అంటే అంగంగా స్వీకరించి మధ్యమధ్యసందర్భంవచ్చినచోట ప్రస్తావిస్తూ వచ్చారు. అమాయికులైన సాధారణుల ముగ్ధప్రేమ మనోహరంగానే వుంటుందని, కనుకనే భారతీయులు దీన్ని కావ్యంలో అంగంగా గ్రహిస్తూ వచ్చారని విశదపరచాను. ఈసాధారణులు నీచులని భారతీయులు తిరస్కరింపలేదు.

"పుష్పాసవాఘూర్ణితనేత్రశోభి
 ప్రియాముఖం కింపురుషశ్చుచంబ" (కుమార)

(ప్రియురాలు పాటలుపాడుతూవుంటే పుష్పాసవంతాగడంవల్ల కైపెక్కిననేత్రాలతో వున్న ప్రియురాలి మొగాన్ని ఆపాటలమధ్యన కింపురుషుడు ముద్దుపెట్టుతున్నాడు)

1. కోశాతకీ పుష్పగుళుచ్ఛకాంతిభి
   ర్ముఖైర్వినిద్రోల్బణబాణచక్షుషః
   గ్రామీణ వధ్వస్తమలక్షితాజనై
   శ్చిరం వృతీనా ముపరి వ్యలోకయన్. (మాఘ)
   
2. పశ్యన్ కృతార్థై పరివిల్లవీజనో
    జనాదినాథం న యయౌవితృష్ణతాం
    ఏకాంతమౌగ్ధ్యా నవబుద్దవిభ్రమ
    ప్రసిద్ధ విస్తార గుణై ర్విలోచనైః (మాఘ)
   
3. స వ్రీహిణాం యావదపాసితుం గతాః
   శుకాన్ మృగైస్తావదుపద్రుతశ్రియాం
   కైదారికాణా మభితః సమాకులాః
   సహాసమాలోకయతి స్మ గోపికాః (మాఘ)

1) వికసించి విపులమైన నల్లగోరంటపూవువంటి కండ్లుగల గ్రామీణవధువులు పొట్లపూలకాంతిగల ముఖాలతో జనులకు కానరాకుండా చాటునవుండి ఆవరణాలమీదుగా కృష్ణుణ్ణి చూశారు. 2. అతివిశాలాలై అత్యంతముగ్దతచేత విలాసా లెరుగని నేత్రాలు సకృద్ధర్శనంచేత కృతార్ధాలైనప్పటికీ ఆనేత్రాలతో కృష్ణుణ్ణి చూసి గోపాంగనాజనం తనియలేదు.

3. శుకాలను వారించబొయ్యేటప్పటికి జింకలు సస్యాన్ని చెడగొట్టుతుండగా వరిపొలాలవద్ద అటు ఇటు తొక్కులాటపడుతున్న గోప స్త్రీలను కృష్ణుడు చూశాడు అని

"వనేచరాణాం వనితాసఖానాం
 దరీగృహోత్సంగ నిషక్తభాసః
 భవంతి యత్రౌషధయో రజన్యాం
 అతైలపూరాః సురతప్రదీపాః" (కుమార)

గుహల్లో వెలుతురుకలుగజేస్తూవుండే ఓషధులు రాత్రుల్లో వనితాసఖులైన వనేచరులకు తైలంలేని సురతప్రదీపా లవుతుంటవి.

"స్త్రీభూషణం చేష్టిత మప్రగల్భం
 చారూణ్యవక్రాణ్యపి వీక్షితాని,
 ఋజాంశ్చ విశ్వాసకృతః స్వభావాన్
 గోపాంగనానాం ముముదే విలోక్య (భట్టి)

"వివృత్తపార్శ్వం రుచిరాంగహారం
 సముద్వహచ్చారు నితంబరమ్యం,
 ఆమంద్రమంథధ్వని దత్తతాళం
 గోపాంగనానృత్య మనందయత్తం " (భట్టి)

(గోపాంగనలయొక్క అప్రగల్భమైన చేష్టితాన్ని స్త్రీలకు భూషణ ప్రాయమైన దాన్ని చూసి రాముడు ఆనందించాడు. అవక్రాలు కాకపోయినప్పటికీ సుందరమైన చూపులను విశ్వాసాన్ని గలిగించే ఆగోపాంగనల ఋజుస్వబావాలను చూచి సంతొషించాడు. వివృత్తపార్శ్వమైనది సుందరమైన అంగహారం గలది పైకిలేస్తూవుండే నితంబంచేత రమ్యమైనది. కవ్వానికి అనుకూలమయిన తాళంగలది, అయిన గొల్లభామల నృత్యం శ్రీరాముణ్ని ఆనందపరచింది.

"విలాసా నాగరస్త్రీణాం న తథా రమయంతి నః
 యథా స్వభావసిద్దాని వృత్తాని వనయోషితాం"

(నాగరస్త్రీలవిలాసాలు స్వభావసిద్ధమైన వనవనితలవృత్తాల వలెమమ్ము ఆనందపరచలేవు.) అని

యిట్లాటి అమాయికప్రేమ మనోజ్ఞత్వాన్ని భారతీయులు ఔచిత్యాన్ని పాటించి అనేకవిధాల దర్శించారు. జింకలు తుమ్మెదలు మొదలైన సాధుతిర్యక్కులు సయితం ఈప్రేమమాధుర్య విషయాన భారతీయుల ఉదారదృష్టికి నీఛంగా కనబడలేదు.

"మధు ద్విరేఫః కుసుమైకపాత్రే
 పపౌ ప్రియాం స్వా మనువర్తమానః
 శృంగేణ సంస్పర్శనిమీలితాక్షీం
  మృగీమకండూయత కృష్ణసారః

 దదౌ రసాత్ పంకజరేణుగంధి
 గజాయ గండూషజలం కరేణుః,
 అర్ధోపభుక్తేన బిసేన జాయాం
 సంభావయామాస రథాంగనామా (కుమా)

(తుమ్మెద ప్రియురాలితోగూడా ఒకే పువ్వులో మధువును తాగించి: ఆడజింక స్పర్శసుఖాన కండ్లుమూసుకుంటూ వుండగా మగజింకకొమ్ములతోరాచింది; ఆడయేనుగు పంకజరేణుగంధి అయిన గుండూషజలాన్ని మగయేనుగ కిచ్చింది; చక్రవాకం సగం కొరికిన తామర తూడును ప్రియురాలికి ఆదరంతో యిచ్చింది.)

అని కాళిదాసు యీసాధుతిర్యక్ ప్రకృతిప్రేమను చిత్రించాడు. క్రౌంచద్వంద్వంయొక్క నిరతిశయానందం వాల్మీకికి సంతోషం కలిగించింది గనుకనే దానికి విఘాతంకల్పించిన బోయ ప్రేమద్రోహిగా కనబడ్డాడు.

"అంతస్సంజ్ఞా భవన్త్యేతే సుఖదుఃఖసమన్వితాః" (మను)

(వృక్షాలు అంతస్సంజ్ఞగలవి అయి సుఖదుఃఖసమన్వితాలుగా వున్నవి) అని మనువు ప్రబోధించినట్లు వనప్రకృతిసుఖాదులను కనుగోగలిగిన భారతీయులు అమాయికమైన తరుగుల్మాదులయందు సైతం ఆమనోహరప్రేమ మాధుర్యాన్ని ఆనందానుభూతితో చూడగలిగినారు.

"లతా వధూభ్యస్తరవోప్యవాపుః
 వినమ్రశాఖా భుజబంధనాని"
 
 చెట్లుగూడా లతావధువులవలన వినమ్రశాఖాభుజాశ్లేషాలు పొందినవి (కుమా)

అని మధుమాసంలో ఆ ప్రకృతి వికాసాన్ని కాళిదాసు ప్రసంసించాడు.

ఈతీరుగా ఆర్ధ్రనేర్ద్రాలతో తరులతాదులవాద్ద నుండి ప్రకృతి శిఖరమైన ధర్మనాయకుడివరకూ అనుస్యూతమైన జీవసౌందర్యా విచ్ఛిన్నతను దర్శించి కావ్యప్రస్థానాన్ని ఔచిత్య విలసితంజేసి ఇక అవకాశం లేదోమో ననిపించేటంత మహావికసిత దశను ప్రాపింపజేసిన భారతీయుల విజ్ఞానపరిపాకం అమేయమై వున్నది. కేవలం ముగ్ధప్రకృతిని చిత్రించే ఖండకావ్యాలను సయితం ఋతుసంహారంవంటి వాటిని వెలయించి ఉదాత్తకావ్యాపేక్షచేత వాటికి ఉచితమైన స్ధాన మిచ్చారు. తిర్యగ్జడప్రాకృతుల శృంగారాన్ని కావ్యంలో అప్రధానంగా స్వీకరించిన భారతీయుల భావానికి ఈతీరుగా నేను వ్యాఖ్యజేశాను. అదిగాక చిల్లర మనుషుల్లో పశువుల్లో శృంగారవీరాదుల మహాభావాలు పరిపోషం పొందలేవు అదిమాద్యాంతలన్నీ కొద్దిలోనే సరిపుచ్చుకుంటవి. యేవో నాలుగు మాటలు మాట్లాడి దీపమార్పడంతో అంతవవుతుంది కనుకనే యిట్లాటిరతి రసాభాసమన్నారు.

పూర్వపక్షం

అవునయ్యా:

"స్వకాంతారమణోపాయే కోగురుర్మృగపక్షిణాం"

(స్వకాంతలను ఆనందపరచడంలో మృగపక్షులకు గురువెవరు?) అని కామసూత్రవ్యాఖ్యలో జయమంగళుడి వృద్దవాక్య మన్నట్లు పరస్పరం అనురాగంగల కామినీ కాముకుడూ సమావేశం అయినప్పుడు ఆశృంగారలీలలు అద్భుతంగా వాటంతట అవే ఆవిర్భవిస్తవి. అందుకే ప్రహణనాలను చెప్పుతూ

"ప్రవృత్తే రతిసంయోగే రాగ ఏవాత్రకారణం
 స్వప్నేప్వపి న దృశ్యంతే భావాస్తే తే చ విభ్రమాః
 సురతవ్యవహారేషు యే స్యుః తత్క్షణకల్పితాః" (వా. కా)

సురతవ్యవహారంలో తత్ క్షణకల్పితమై వెలువడే ఆభావాలూ విభ్రమాలూ స్వప్నంలోగూడా కనబడవు. రతిసంయోగం ప్రవృత్త మయ్యేటప్పుడు ప్రేమే ఆభావాలకూ విభ్రమాలకూ కారణం అని వాత్స్యాయను డన్నాడు.

ఇట్లాటి శృంగారలీలలు స్వాభావికమైవుండగా అవి తిర్యక్కులకు మ్లేచ్ఛులకు లేవనడం అనుచితం. వారికి అనుభావాదులు లేవనడం అక్రమం

"తిర్యజ్మ్ల చ్ఛగతోపి వా"

అని సాహిత్య వేత్తలు వాండ్లరతిని ఆభాసమనడానికి వేరే కారణమున్నది. వాండ్లు వారిదృష్టిలోనీచులు. వాండ్లపైన వారికిద్వేషం. అందువల్ల రసాభాసమన్నారు. మ్లేచ్ఛులు ఆర్యులకు పరమశత్రువులుగదా

"న మ్లేచ్చభాషాం శిక్షేత" (శ్రు)

"న మ్లేచ్చితవై" (శ్రు)

అని మ్లేచ్ఛులను ద్వేషించిన ఆర్యులు వారిశృగారాన్ని యెట్లా సహించగలరు? అందువల్ల మ్లేచ్ఛుల రతి రసాభాసమన్నారు అంతేగాని వాస్తవంగా వారికి అనుభావాదులు వికసితం గాకపోవడం వల్లకాదు. అని అంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను; వాండ్లకూ శృంగారలీలలు వుండవచ్చును. శృంగారలీలలు మీరన్నట్లు వున్నవనే వొప్పుకుందాము. అంతమాత్రాన ఆశృంగారం ఉపాదేయంగా దని అది పరిణతనాయకనిష్ఠమైనప్పుడు ఆనందమేగాక ఉదాత్తభావోన్మీలనాదిరూపమైన ఆనుషంగికఫల ప్రాప్తి కలుగుతున్న దని వివరించాను అసలింతకూ పశువుల్లో నీచుల్లో అనుభావాదిసామగ్రి వికసితంగాదు. రసాభావనిరూపణం ఆర్యులు, మ్లేచ్ఛులమీదికోపంవల్ల చేసిందికాదు. పరిణతులు ధర్మరక్షకత్వ ధర్మపరతంత్రత్వాలతో వెలసే బ్రాహ్మణులు కావచ్చును. వైశ్యులు కావచ్చును. శూద్రులు కావచ్చును. ఆర్యేతరులు కావచ్చును. దుష్యంతుడు క్షత్రియుడు మేఘదూతలో యక్షుడు బ్రాహ్మణుడుగాడు ఆర్యుడుగాడు. కుమారసంభవంలో పరమేశ్వరుడికి కులమే లేదు "వపు ర్విరూపాక్ష్య మలక్ష్యజన్మతా"

అని కాళీదాసీ అంశం ప్రస్తావిస్తాడు. కనుక ఆర్యులు అభినివేశంవల్ల చెప్పినా రనడం అక్రమం.

"తిర్యజ్మ్లే చ్ఛగతోపి వా"

అన్నప్పుడు మ్లేచ్ఛశబ్దం నీచత్వద్యోతకంగాని కులవాచిగాదు. జగన్నాధపండితరాయలవంటివాడు

"యవనీ నవనీతకోమలాంగీ
 శయనీయే యది లభ్యతే కదాచిత
"అవనీతల మేవ సాధు మన్యే
 న వనీ మాఘవనీ విలాసహేతు:"

అని మ్లేచ్ఛస్త్రీరతిని శ్లాఘించాడు. ఆశబ్దం నీచత్వద్యోతకంగాని కులవాచిగాదు కనుకనే సాహిత్యదర్పణకారుడు

"అధమపాత్ర తిర్యగాదిగతే"

అని మ్లేచ్ఛశబ్దంచేత ఉద్దిష్టమైన అర్థాన్ని వ్యాఖ్యాతుల్యంగా వివరించాడు. మ్లేచ్ఛశబ్దం అధమత్వద్యోతకంగాని కులవాచిగాదు. అధములైన చిల్లరమనుష్యులకంటె ధర్మసంబంధంగల పరిణతులు కావ్యశృంగారానికి యెక్కువ వుచితులని జనప్రకృతి మనోజ్ఞత్వం సాధారణుల ప్రేమమౌగ్ధ్యం భారతీయకావ్యాల్లో అంగంగావుండి ఔచిత్యవిలసితా లవుతున్నవని సాహిత్యవేత్తల అభిప్రాయం. దీన్ని నిరూపించాను. పరిణతిలేని చిల్లరమనుషులు బ్రాహ్మణులైనా గూడా వారు అధములే నని వారిశృంగారం సాహిత్యజిజ్ఞాసల్లో రసాభాసనామాన్నే పొందుతున్నదని అంటున్నాను. చిల్లరబ్రాహ్మణులు తక్కిన చిల్లర మనుషుల శృంగారం వారికి భారతీయసంస్కారం లేని చిల్లరమనుష్యులకూ యింపుగానేవుంటే వుండవచ్చును గాని అది పరిణతబుద్ధులైన సాహిత్య వేత్తల జిజ్ఞాసల్లో రసాభాససంజ్ఞనే పొందుతున్నదంటున్నాను. మానవప్రకృతిలో శృంగారం కామసంబంధి. ఇది ధర్మంమీద నిల్వక పోయెనా విషయలోలత్వం యెదుర్కొనడంసహజం. ఇక వేరే మధ్య మార్గంలేదు. ఇక మధ్యమర్గం పరిపోషంలేక సాధారణ విషయలోలత్వపర్యవసాయి అయినప్పటిది ఇది కావ్యానికి అర్హమైంది గాదు. కామంవల్ల శ్రేయోవిఘాతం క్షోభం విదితమే అయివున్నవి. శృంగారం మిక్కిలి సునిశితమైన దని అది ప్రాకృతులచేతిలోదుర్వినియోగపడడానికి ఉన్ముఖమై వుంటుందని కనుకనే శృంగారనాయకుడికి అనురక్తలోకత్వలోకో త్తరగుణోత్తరత్వాదులు అవశ్యకమని అన్న బారతీయసాహిత్యవేత్తల మాటలో అఖండసత్యం గర్భితమైవున్నదని వ్యాఖ్య ఛేశాను. వీరరౌద్రాద్భుతశాంతాలకు గూడా ఉత్తమనాయకు డవసరమన్న సాహిత్యవేత్తల అభిప్రాయాన్ని వివరించడం అప్రసక్తం. దాన్ని నాటకాధికరణంలో పూర్తిగా వ్యాఖ్యచేశాను. కనుక ఇక్కడ వదలుతున్నాను. కరుణహాస్యభయానక భీభత్సాలకు ఈతీరుగా లోకోత్తరగుణోత్తరనాయకులు ఆవశ్యకులుకారు. యెంతటిక్రూరుడైనా క్లేశాలపాలయితే అప్రయత్నంగానే అయ్యోపాపమంటాము. యెంతటి దుష్టుడైనా చచ్చాడని వినగానే అయ్యో అని విచారం తెలుపుతాము. రావణుడివంటితుచ్ఛుణ్ని అనేకమైన ఆపదలకు కారణమైన వాణ్ని, రాముడు చంపేదాకా ఉత్సాహవంతుడైదీక్షతో వున్నాడు గాని చనిపోగానే విభీషణుడు

"శోకవేగపరీతాత్మా విలలాప విభీషణః" (వా. రా)

అని దు:ఖపడ్డట్లు వాల్మీకి ప్రాణిసాధారణస్వభావాన్ని చిత్రిస్తున్నాడు. దుష్టులవిపత్తే యిట్లా జాలిపుట్టిస్తే యిక సాధారణుల విపత్తు జాలిపుట్టిస్తుందని చెప్పవలసిన పనిలేదు. కనుకనే యెంకిపాటల్లోని

"దూరాన నారాజు కేరాయిడౌనో
 ఈ రోజు నారాత లేరాలపాలో
 సీమసిటు కనగానె సెదరిపోతదిమనసు
 కాకమ్మ సేతైన కబురంపడారాజు
 దూరాన నారాజు కేరాయిడౌనొ
 కళ్లకేటో మబ్బు
 గమ్మిన ట్లుంటాది
 నిదరల్లె నావొల్లు నీరసిస్తున్నాది
 దూరాన నారాజు కేరాయిడౌనొ
 ఆవు లంబాయంట అడలిపోతుండావి
 గుండెల్లొ వుండుండి గుబులుబిగులౌతాది
 దూరాన నారాజు కేరాయిడౌనొ
 తులిసెమ్మ వొరిగింది తొలిపూస పెరిగింది
 మనసులొ నాబొమ్మ మసకమసకేసింది
 దూరాన నారాజు కేరాయిడౌనొ (యెంకిపాటలు)

"ఏగుడికి పోయినా హీనజాతంటారు
 ఈశ్వరుడి కేజాలిరాదే చంద్రమ్మ
 యెంతపాపం జెసినానే చంద్రమ్మ
 యెండకొండాలేక నిండు సీకటిలేక

 ముండ్లలో నేడబోతావే చంద్రమ్మ
 ముందు గోదావరున్నాదే చంద్రమ్మ

 గోవింద యని నీవు గోదావరిలోబడి
 దేవతల్లో గలిసి నావా చంద్రమ్మ
 నే నింక బతికెవున్నానా చంద్రమ్మ
                                 (యెంకయ్య చంద్రమ్మపాట)

అనేమాటలు జాలిపుట్టిస్తున్నవి

"గోవుమా లచ్చిమికి కోటిదంణాలు
 మనిసికైనాలేని మంచిపోకిళ్లూ
 యెంకితోకూకుండి యింతసెపుతుంటే
 తనతోటి మనిసల్లె తలతిప్పుతాది
 గోవుమాలచ్చిమికి కోటిదణ్నాలు

అనేమాటలు అమాయిక తిర్యక్ప్రకృతిని గురించినవి బావావున్నవి. ఈకరుణాదులకుగూడా కొంతవరకైనా పరిణతిగల నాయకులున్నప్పుడు పరిణతభావోన్మీలనానికి కవికి అవకాశం యేర్పడుతుంది లేదా యెంకి పాటల్లోవలె యెంకయ్య చంద్రమ్మపాటలోవలె మామూలు యేడ్పే మామూలు తలపులే వ్యక్తమవుతవి. కరుణాదులకు ఉత్తమనాయకుల ఆవశ్యకతలేదు గనకనే లొకోత్తరగుణోత్తరనాయకులు లేకున్నా పాశ్చాత్యుల ట్రేజడీలనే కరుణభయానక భీభత్స విశిష్టమైన రూపకాలు శ్రోతవ్యంగా ద్రష్టవ్యంగా వుంటున్నవి. ఈచర్చ యింత కెక్కువ అప్రస్తుతం గనుక చాలిస్తున్నాను. ఉత్తమశృంగారానికి ఉత్తమనాయకులు ఆవశ్యకమని నిరూపించాను.

అని శ్రీ ఉమాకాన్తవిద్యా శేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో శృంగారాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం

క్షుద్రకావ్యాధికరణం

చిల్లరకావ్యాలు, క్షుద్రకావ్యాలు

శృంగారం లోకశ్రేయస్సుకు సంబంధించిందని జగత్సంతతికి ఆధారమైన ప్రవృత్తిధర్మప్రతిష్ఠకు సాధనంగా శృంగారం ప్రవర్తిస్తున్నదని చిల్లరమనుషులు పాత్రలైతే యీఉదాత్తఫలాలుపోయి రసం పరిపోషం చెందక కావ్యం భ్రష్టమవుతున్న దని వ్యక్తంచేశాను. ఈ తీరుగా భ్రంశంపొందినవాటికి క్షుద్రకావ్యాలని చిల్లరకావ్యాలని వ్యపదేశం చేస్తున్నాను.

పూర్వపక్షం

వాచ్యం ప్రధానమైన కావ్యాన్ని క్షుద్రమని సాహిత్యవేత్తలన్నారు. మీరు చిల్లరపాత్రల శృంగారకావ్యాన్ని క్షుద్రమంటున్నారు ఇది సంప్రదాయ సమ్మతంగాదంటారా?

సిద్ధాంతం

చెపుతున్నాను నిజమే అర్ధవిచారాన్ని అనుసరించి అవ్యంగ్యమైన కావ్యాన్ని క్షుద్రమన్నారు. కావ్యంయొక్క క్షుద్రత్వం పాత్రలనుబట్టిగూడా నిర్ణయించవచ్చును. ఇట్లా అధమపాత్రనిష్ఠమైన శృంగారానికి రసాభాసమని సాహిత్యవేత్తలు పేరుపెట్టినారు. వారి సంజ్ఞప్రకారం యిది రసాభాసకావ్య మవుతుంది. రసాభాసకావ్యమనే పేరు ఈచిల్లర పాత్రల శృంగాం కావ్యాలకు మీకు సమ్మతమైతే దాన్నే స్వీకరించవచ్చును. నేను వీటిని క్షుద్రకావ్యాలంటున్నాను. అభిప్రాయం వొకటే గనుక పేరుబాబాధకం గాదంటున్నాను. ధర్మరక్షకత్వంగాని ధర్మప్రతిష్ఠగాని లేని చిల్లరమనుషుల శృంగారం క్షుద్రం గనుక ఆకావ్యం క్షుద్రమంటున్నాను.

క్షుద్రకావ్యాలు

యెంకిపాటలు మొదలైనవాట్లో చిల్లరపాత్రలశృంగారం గనుక అవి రసాభాసకావ్యాలంటున్నాను. చిల్లరకావ్యం శృంగారరసాభాష కావ్యం, క్షుద్రకావ్యం యీమూడు నేను సమానార్థంలో ప్రయోగిస్తున్నాను. రసాభాసకావ్యమన్న చోట శృంగార రసాభావమని సమన్వయం. ధుష్టుల శృంగారం అత్యంతం దూష్యం గనుక

"కావ్యాలాపాంశ్చ వర్జయేత్"

అనే వచనానికి గురి అవుతున్నది. నారాయణమ్మ నాయుడుబావ పాటలో నారాయణమ్మను లేవదీసిన జారుడైన నాయుడుబావకు పరకీయ మీది రతిని ఆపాట తెలుపుతున్నది. భారతిలో పకటితమైన శ్రీ ముక్కపాటి నరసింహశాస్త్రి కృతి లక్ష్మి అనే కథలో పరకాంత అయిన లక్ష్మిచేతిని ప్రకాశంపట్టుకొని యేమంటావంటే "కొన్నాళ్లకింద అయితే నీతోయెక్కడికైనా వచ్చేదాన్ని యిపుడు వయసుముదిరింది" అని అతడు పోయినతరువాత యేడుస్తుంది. యిట్లాటి తుచ్ఛస్త్రీల తుచ్ఛులశృంగారం

"సన్నాసన్నా గాజూలేవే నారాయణమ్మా నీ
 చిన్నాచిన్నా చేతులాకు నారాయణమ్మా".

అని యీఫక్కి మాటలకూర్పు కొంతసొంపుగావున్నా హేయకోటిలో చేరుతున్నవి. ఇట్లాటిశృంగారానికిదివరకు పేరు పెట్టకవిడిచినా యిక్కడ దుష్టశృంగారమని దీన్ని వ్యవహరిస్తున్నారు. తారాశశాంకవిజయం, నారాయణమ్మ నాయుడుబావపాట ముక్కపాటి నరసింహశాస్త్రి లక్ష్మి, యివన్నీ ఒకటేరకం. చివరనాలుగు నీతిమాటలున్నా వీటికి గ్రాహ్యత్వం సమకూర్చవు. విషంమీద నాలుగు తేనెబొట్లు వేసినంతమాత్రాన విషానికి విషత్వంబోదు. పైగాతేనెగూడా విషసంపర్కంచేత కలుషితమవుతున్నది. కనకనే యివి హేయకోటిలో చేరుతున్నవంటున్నాను.

ఇక తక్కినవి చిల్లరపాత్రలశృంగారం గలవి యెంకిపాటలు మొదలైనవి క్షుద్రకావ్యాలన్నాను. వెంకయ్య చంద్రమ్మపాట, ఓరోరి బండోడిపాట మొదలైనవి యెంకిపాటల కోటిలోనివి. ఇవన్నీ ఈచిల్లర కావ్యాలే అయువున్నవి. ఈక్షుద్రకావ్యాలను యెంకిపాటలు మొదలైనవి మచ్చుగా విమర్శించాను ధర్మసంబంధం యెంకికి నాయుడుబావకు యెంకయ్యకు చంద్రమ్మకు వ్రాయక పోయినా ఉన్నదనుకోగూడదా అంటే అది అసంబద్ధం. వ్రాయకపోతే ఉన్నదని యెట్లా అనుకొనడం? అట్లయితే అసలు కావ్యం వ్రాయకుండానే వ్రాశాడను కోవచ్చు. కనుక అవి అసంబద్దపుమాట లంటున్నాను. యెంకినాయుడూ సంస్కారంలేని చిల్లరమనుషులని యింకా ముందు నిర్ణయించబోతున్నాను. యెంకమ్మ చంద్రమ్మపాట మొదలైనవి యెంకిపాటలు యిట్లానే సాధారణనాయకుల శృంగారంగల "చెన్నపట్టణంలో" వంటినవలలు, భారతి పత్రికలో ఆకోటిలోని "పరీక్ష" వంటి కథలు చిల్లరకావ్యాలని వ్యక్తపరచాను. భగవంతుడిమీద రతి శిశుప్రేమ ముగ్ధప్రకృతిప్రేమ, ఉత్తమూలభావ దశాశృంగారం వీటికన్నిటికీ భావధ్వని అని సాహిత్య సంప్రదాయంలో పేరు. భావకావ్యమని కూడా అనవచ్చును. ఈ భావకావ్యాలు ఖండాఖండభేదంతో (మహాకావ్యమని ఖండకావ్యమని భేదంతో) ఉదాత్తకావ్యకోటిలోనే భారతీయసంప్రదాయాన్ని అనుసరించి చేరుతున్నవి.

భారతిలోని వెంకటేశవచనాలు, కృష్ణకర్ణామృతం, సౌందర్యలహరి, ఋతుసంహారం, సూర్యశతకం మూకవిరచితమైన మూకపంచాశతి, ధూర్జటి కాళహస్తిశతకం. ఇవన్నీ భావకావ్యకోటిలోవి. నేటికాలపు కావ్యాల్లో కొమాండూరి కృష్ణమాచార్యకృతి పాదుకాస్తవం భారతిలోని గౌతమీస్రవంతి, వడ్డాది సుబ్బారాయకృతి భక్తచింతామణి, యివన్నీ భావకావ్యాలే అయివున్నవి. పరకీయారతిగల రసాభావం వర్జ్యమని అదే అనుచిత శృంగారమని దుష్టమని యిట్లాటి దోషంలేని చిల్లరజానపదులశృంగారం జింకలు పక్షులు తుమ్మెదలు మొదలైన వాటి శృంగారం కొంతవరకు ఆస్వాద్యమే నని యిదివరకు వ్యక్తపరచాను. కనుకనే

"రసభావౌ తదాభాసౌ
 భావస్య ప్రశమోదయౌ
 సంధిశ్శబలతా చేతి
 సర్వేపి రసనాద్రసాః (సాహి)

అని అన్నారు ఇట్లా చిల్లరజానపదుల శృంగారం జింకలు మొదలైన వాటి శృంగారం కొంతవరకు ఆస్వాద్యం గనుకనే కావ్యంలో అంగంగా స్వీకరించా రని అదే ప్రధానమైతే ఆకావ్యం ఉదాత్తభావోన్మీలనాన్ని ఆనుషంగిక ఫలప్రాప్తిని కోల్పోయి క్షుద్రమవుతుందని యిదే చిల్లరశృంగారమని విశదంచేశాను.

అని శ్రీ ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర పరిశిష్టంలో

క్షుద్రకావ్యాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం

అనౌచిత్యాధికరణం

అనౌచిత్యం

ఈకాలపు శృంగారం యీతీరుగా ప్రాయికంగా చిల్లరశృంగారమని అది ప్రతిపాదితమైన కావ్యం చిల్లరకావ్యం క్షుద్రకావ్య మని నిరూపించాను. ఇదిగాక అనౌచిత్యమనే దోషం కూడా యీకాలపు కృతుల్లో కనబడుతున్నది ప్రకృతిభేదాన్ని అనుసరించి చేష్టాసంభాషణాదులను ప్రతిపాదించడం ఔచిత్యం. ఇది చెడినా రసభంగమవుతున్నది. యీసంగతినే

"అనౌచిత్యాదృతే నాన్యత్ రసభంగస్య కారణం"

(అనౌచిత్యంకంటె రసభంగానికి వేరే కారణంలేదు) అని ఆనందవర్ధనుడు చెపుతున్నాడు. ఔచిత్యం చెడితే వైరస్యం కలుగుతుంది. అనౌచిత్యం అందుకే రసభంగ హేతువని సాయిత్యవేత్త లంటున్నారు.

"ఓహో! శ్రీరాముడిహస్తాలకు ఉపచరిస్తున్న యీ
 గోపీధమ్మిల్ల కుసుమమాలలనురచించే ఆఅయోధ్యా
 నగరపు పుష్పలావికలభాగ్య మేమనవచ్చును."
    
"ఆ అయోద్యలో శ్రీరాముడి పదస్పర్శ ప్రతిదినమూ
 అనుభవించే ఆకృష్ణవేణి పుణ్యపరిపాకమహో!
 అలోకసామాన్యంగదా మనోహరమైన రాముడి

      
వేణునాదం చెవులబడగానే పరవశలై పరుగెత్తివచ్చి
ఆయన హృదయాన హృదయం జేర్చి సొక్కే
అయోధ్యాభామిను లెంత తపస్సుజేశారో"

అని వర్ణించేటప్పుడు కృష్ణవేణి మీదిశ్లేష, పుష్పలావికలకృతార్ధత గోపీధమ్మిల్లమనోజ్ఞత్వం, వేణుగానమహిమ, భామినుల పారవశ్యం, ఇవన్నీ యెక్కడికక్కడికి ఆహ్లాదకరంగానే వున్నా కొంచెమాలోచిస్తే యిదంతా అసంబద్ధ ప్రలాపమని తేలుతుంది. కృష్ణానది అయోధ్యలో వుండడమేమిటి? ఉన్నా

"న రామః పరదారాంశ్చ చక్షుర్భ్యామపి పశ్యతి" (వా. రా)

(రాముడు పరదారలను కండ్లతోగూడా జూడడు.)

అని వాల్మీకీ అమృతుణ్ణి చేసిన రాముడికి పరకాంతాస్పర్శమనే వ్యంగార్థమేమిటి? అయోధ్యలో గోపికలేంది? ఉన్నా ఆగోపీధమ్మిల్లాలతో శ్రీరాముడి కేమి పని? రాముడు వేణుగానానికి ప్రసిద్దుడా? అయినా ఆయనమీద భామినులుపడి పరవశలు కావడం మెంత అసత్యం? అని ఆమాటల్లో వుండే అసంబద్ధతలు స్పుటపడతవి. రాముడికి పరకాంతాస్పర్శ అనుచితం. అయోధ్యలో కృష్ణానదివున్నదనడం అనుచితం. ఇట్లానే తక్కినవన్నీ అనుచితాలు. దేశానికి, కాలానికి పాత్రకు, ఉచితంగాని పై అసంబద్ధతలు కొంచెమైనా వివేకం వున్నవాండ్లకు రోతపుట్టించక మానవు. అందుకే అసంబద్ధతతొ నిండిన పైమాటలవంటి మాటలు రసవంతంగావున్నట్లు స్థిరపడడానికి స్థిరమైన బుద్ధిహీనత్వం వుండవలెను. కనుక అనౌచిత్యంవున్నా అది తెలియకుండా ఉండడానికి బుద్ధిహీనత్వం అవసరం. వివేకవంతులకు అనౌచిత్య రోతపుట్టిస్తుంది. దేశభేదం, కాలభేదం, పాత్రభేదం, అవస్థాభేదం వీటి నన్నిటిని వివేకంతోపాలించినప్పుడే కావ్యం ఔచిత్యవంతమవుతుంది. లేదా అనౌచిత్యం పాలై భ్రష్టం కాగలదు. ఈకాలపుకావ్యాల్లో యీ అనౌచిత్యం తరుచుగా కనబడుతునే వున్నది. వనకుమారి అనే ఖండకావ్యంలో ఒకక్షత్రియుడు రాజ్యం గోలుపోయి అడవిలో తనకూతురితో నివసిస్తుంటాడు. తండ్రిని తప్ప ఆపిల్ల మరి యేపురుషుణ్ని యౌవనం వచ్చేదాకా యెరగదు. ఆపిల్ల గొర్రెలుకాస్తూ కొండలోయల్లో తిరుగుతుంటే ఒకక్షత్రియకుమారుడు కనబడతాడు తరువాత కొన్నాళ్లకు యిద్దరూ పెండ్లాడతారు. వనకుమారి తండ్రి చచ్చి పడివున్నసమయాన వనకుమారి ఒకపక్కన నిద్రిస్తుంటే యీక్షత్రియుడు

"సరసీలోలతరంగడోలల శరచ్చంద్రాంశు పూరంబురౌ
 ప్యరమం జిల్కగ బాలశైవలపుదీవల్ గ్రాలు నున్బాన్పునన్
 నెరయందూగు మరాళబాలికవలెన్ నిర్మాయికాస్యంబుతో
 హరిణీలోచన నిద్రవోయెడిని"

అని

"మంజిమజిల్కు కపోలపాళుల జికురములాక్రమించ సరసీరుహలోచన"

అని ప్రియురాలిని వర్ణిస్తాడు వర్ణించి

"ఈ రాజమనోహరాస్యకరిరాజసమంచితయానప్రేమకున్
 భాజనమైధరాభరణ భవ్యసుఖంబుల నెల్ల నేడే సం
 యోజనముం బొనర్తు"

అని అంటాడు.

ఈచావుదశలో ఈతడి మన్నథవికారం మిక్కిలి రోతగదా అందులో "ఆలు గొర్రెలు గాస్తురున్నారడం అవివేకం. రాజ్యమంతా పోయి అడవికి వస్తూ గొర్రెలునెత్తిన పెట్టుకొని రాజువస్తాడనడం అంతకంటె అవివేకం. ఇట్లాటి అప్రశస్తాలు దేశాన్ని పాత్రాన్ని దశను తెలిసికొన్నవివేకంతో వ్రాసిన అంశాలుగావు. ఇట్లానే షేక్స్పియరునాటకాల్లో తండ్రినితప్ప పరపురుషుణ్ని యెరగకుండా వున్న ఒక కన్య కథ వున్నది. అనుకరించవలననే వుత్సాహంలో వనకుమారికర్తకు వివేకంపోయింది. ఇట్లానే మరికొందరు పాశ్చాత్యులను మొదలైనవారికని అనుకరించబోయి పులుముడు అయోమయం చిల్లరశృంగారం వీటితొ కూడిన క్షుద్రకృతులు రచించారు. వనకుమారికర్త యింకా భారతవర్షానికి పాత్రలకు తగని వ్యవస్తా చేష్టలు తగిలించి కావ్యాన్ని అనౌచిత్యంపాలుచేశాడు. దీంట్లో పాత్రలు ఒకరితోనొకరు మాట్లాడేటప్పుడు యేకాంతంగా మాట్లాడేటప్పుడు ఆఅవస్థకు ఆప్రకృతికి తగని అనౌచిత్యాలింకావున్నా గ్రంథవిస్తరభీతిచే చర్చించక వదులుతున్నాను. కూచినరసింహకృతి వనవాసిలో పావకుడు బాల్యంగడవగానే వనంలోకి పోయి సన్యాసిఅవుతాడు. ఇతడికి చిదానందుడు గురువు. వనంలో తిరుగుతుంటే ఒకదేవదూత కనబడతాడు. మర్రిచెట్టుకు చిన్న కాయలుంటే ఆసంగతినిగురించి జిజ్ఞాస ఆరంభిస్తాడు. చిరకాలంనుండి ఉపనిషత్కర్తలు బాదరాయణుడు, బోధాయనుడు, బారతవర్షారణ్యాలను బ్రహ్మతేజస్సుతో నింపిన యెందరో మహాతపశ్శాలులు, తెలిపిన కర్మతత్వం బ్రహ్మతత్వం, జీవాత్మ పరమాత్మల భేదాభేదం, శమదమాది వైరాగ్య సాధనసంపత్తీ యివన్నీ జగద్విదితమై వుండగా యీసన్యాసి అవన్నీ తెలియక లావుకాయ యెందుకు పుట్టలేదనే వేదాంతవిచారణం చేస్తున్నాడు. ఇట్లాటిదాన్నే చొప్పదంటు శంక అని మన ఆంధ్రదేశపువిజ్ఞులు అంటారు. గురువు శిష్యుడికి ఉపదేశిస్తుంటే అదంతావినక బర్రెదూడ చొప్పదంటుతినడంచూచి యింతపొడగుదంటు ఆ కాస్త దూడకడుపులొ యెట్లాపడుతుందని శంకించాడట. ఈమర్రికాయశంక ఆరకంలోనే చేరుతున్నది. ఈసన్యాసి లావుకాయలేకాస్తే మనుషుల మీదపడి చావరా అని మర్రికాయశంకకు దేవదాత సమాధానం చెప్పుతాడుకాని లావాటికాయలుకాసే పెద్దచెట్లెన్నో వున్నవి. బెజవాడలో గవర్నరుపేట రోడ్దుమీద వీటిని చూడవచ్చును. కొబ్బరిచేలకు లావాటికాయలున్నవి ఈ సన్యాసి యెంతటివాడో ఆదేవదూత అంతటివాడు. భారతవర్షకథలో ఇట్లాటి అవివేకి సన్యాసులను చెప్పడం అవివేకం. ఇంతకూ విచారిస్తే వీరు బారతవర్షీయులు కారని తెలిసింది. ఆంగ్లభాషలో హర్మిటును జూచి వ్రాశానని కృతికర్త వ్రాశాడు. పాశ్చాత్యసన్యాసులకు పాశ్చాత్యనామాలేవుంచి వారిని ఆదేశస్థులుగానే చెప్పితే ఉచితంగా వుండేది ఇట్లాటి సన్యాసులవర్ణించిన ఆదేశపు పార్నెలుకవి అనౌచిత్యానికి పాలుగాలేదు. కాని వనవాసికర్త బ్రహ్మ విజ్ఞానంతో విలసిల్లిన నైమిశారణ్యాలవంటి భారతవర్షపు అరణ్యాలను భారతవర్షపు నామాలను ఆయూరోప్పాత్రలకు తగిలించి కావ్యాన్ని అనౌచిత్యం పాలుకావించాడు. ఈదేవదూతా పావకుడా తుషాదుడి యింటికి ఆతిధ్యానికిపొతే వీండ్లిద్దరినీ వంట యింట్లోకిబంపి మెతుకులు మీ అంతట మీరు గీరుకొని తిని నీళ్లుదాగిపోండి అని సేవకుణ్ని వారికి కావలిపంపుతాడు. పదినిమిషాలే తిననియ్యవలెను. పదకొండవనిమిషాన వాండ్లను బైటికి సాగనంపవలెను అని అంటాడు. భోజనంచేసేటప్పుడు కొంద రాలస్యంగా తింటారు. కొందరు తొందరగా తింటారు. నెయ్యి యెక్కడవున్నదో మజ్జిగ యెక్కుడవున్నవో యెట్లా తెలుస్తుంది. ఇట్లాటి ఆతిథ్యం భారతీయులకు అత్యంతం అనుచితం. పాశ్చాతుల్లో రొట్టె ముక్కలు మొదలైనవి అబల్లమీదనె పడివుంటవి ఆబల్లమీదనే గ్లాసుల్లో నీళ్ళుంటవి గనుక యిది సరిపోతుంది కాని దీన్ని బారతీయపాత్రలకు తగిలించడం ఉచితంగాదు. కథలు తర్జుమా చేయవచ్చును. కాని యీతీరుగా గాడిదెకు యెద్దుతోక తగిలించి నట్లు పాశ్చాత్యజీవితానికి భారతవర్షనామాలను స్థలాలను తగిలించి కావ్యాన్ని అనౌచిత్యం పాలుచేయడం వివేకంమాలినపని.

వేంకటపార్వతీశ్వరుల మాతృమందిరం, శ్రీరాం రామబ్రహ్మకృతి వాసంతిక యిట్లానే దేశకాలాలతో సంబంధం లేకుండా అనౌచిత్యం పాలౌ వైరస్యాన్ని కలిగిస్తున్నవి. వైరస్యానికి హేతువులు తెలిపినాను. నేటికాలపుకావ్యాల్లో అందులో ఇంగిలీషుసంపర్కం తగిలినకావ్యాల్లో యీ అనౌచిత్య దోషం హెచ్చుగా కనబడుతున్నది. యెంకిపాటలు మొదలైనవాట్లో అనౌచిత్యం కనబడుతున్నది. అనౌచిత్యం వివరిస్తాను. యెంకయ్య చంద్రమ్మ పాట మొదలైనవాటికి యీవిచారణను అన్వయించుకోవలెను. నాయుడుబావ తోట వ్యవసాయం మొదలైనవి చేసుకునే ఒకజానపదుడు. గురుజనసేవ, విద్యాగోష్ఠి యిట్లాటివల్ల కలిగిన సంస్కారంలేనివాడు.

"రామకుష్టా యని
 సీకటై పోవాలి"
"గోవుమా లచ్చిమి"
"జాము రాతిరియేళ
 సెందురుణ్ణీ తిట్టు
 సూరి యుణ్ణీ తిట్టు
 కూకుండనీదు"

అని నాయుడు మాట్లాడుతాడు సంస్కారంగలవాం డ్లెవ్వరూ ఇట్లా మాట్లాడరు. రామకృష్ణా అని, చీకటై, మహాలక్ష్మీ,మాలక్ష్మీ, జామురాత్రివేళ, చందురిణ్ణి, సూర్యుణ్ణి కూచోనియ్యదు అని యీతీరున అంటారు. చదువుకోని కమ్మకుమ్మరి మొదలైన తెగలవారు పైవిధంగా మాట్లాడుతారు. ఆకోటిలోనివా డితడని కృతి తెలుపుతున్నది. పైమాటలవల్ల చదువు మొదలైనవాటివల్ల కలిగె సంస్కారంలేని మనిషి అని స్పష్టమవుతున్నది.

"తోటకాడేవుండు తొరగొస్త
 నీకోసరమె సెవుతాను.
 వొంకపోగానె మావోడొస్తడమ్మా
 అద్దములో సూత్తుంటె
 సెందురూడా

మద్దెసెంద్రుడెమనకు పెద్దమనిసి
సుక్కెక్కడున్నాదొ."

అని యీతీరున నాయుడిమాటల రకపుమాటలే మాట్లాడే ఈయెంకికూడా చదువు మొదలైనవాటివల్ల కలిగే సంస్కారంలేని మనిషి అని స్పష్టమవుతున్నది ఇట్లాటి అపరిణతుడికీ

"ఒక్క నేనే నీకు నాయెంకీ
 పెక్కు నీవులు నాకు నాయెంకీ.
 ఇన్నిపొంకాలున్న యెంకివే నీవు
 ఇంత నాగుండెలో యిమిడిపో లేదా
 మాటలో మనసులో మంచిలో యెంకి
 సొగసు నీదోసారె అగపడవనాకు"

అనేమాటలు అనుచితం అని ఆపాత్రలదశకు తగనివి. దేశకాలవస్థాప్రకృతులకు విరుద్ధంగావున్నవి. కనుకనె అనౌచిత్యమంటున్నాను. ఇట్లానే నాయుడికోటిలోనే చేరి పరిపాకం లేని నాయికకు

"గాలికైనా తాను కౌగిలీనన్నాడు"
"వోసూపె వోరూపె వోనవ్వెరాజా
 యిన్నింట పోవాలె యెటుసెదిరినాదొ
 అద్దములో నారాజ అంతనీరూపు
 ఇంత ముత్తెములోన ఇరికె నేలాగు"

అనేవి అనుచితాలు. ఈ విషయంలో సహృదయుల అంతఃకరణమే ప్రమాణం. ప్రాకృతులకు పరిణతులకు స్ధూలరూపంలో భేదం యెట్లావున్నా మనః పరిణతిలో మటుకు ప్రస్పుటభేధం వ్యక్తమవుతున్నది. జలం యొక్క ద్రవశిలావాతావస్థలు మెరుపులు మొదలైన భౌతికపరిణామాలు, వాక్కు, వాగ్విశేషాలు అంతఃకరణవృత్తిలీలలు ఇవన్నీ ప్రాకృతులకు అజ్ఞాతంగా గోచరిస్తున్నా స్థూలదృష్టితో ప్రవర్తిస్తుంటారు. కాని పరిణతుల కవి వొక్కొక్కటే అనేకవిధమైన విచారణలకు విషయాలై సత్యాలుతిరిగి ఆభిన్నత్వాలఐక్యం వాయువుయొక్క విభుత్వం, ఆశ్లేషాయోగ్యత్వం ఇవన్నీ పరిణతబుద్ధుల మనో వ్యాపారాల విషయాలు కనుకనే ఇవి ఈయెంకిపాటలనాయకులకు అనుచితమని ఈ అనౌచిత్యం గోరుచుట్టుమీద రోకటిపోటువలె క్షుద్రత్వానికి తోడయిందని చెపుతున్నాను.

పూర్వాపక్షం

అవునయ్యా ,కావ్యంలో

"భటవృత్తివాడవై పల్కితి విట్లు
 కామభూపతిపాద కమలంబులాన
 కరిచేత త్రొక్కింతు గట్టిగా నిన్ను
 భట్టువాడవుగాన బ్రతుక నిచ్చితిని.

  ...... ........ ........ ......... .........
 మశకాళితేనెలో మడిసినరీతి
 మిడుతలు చిచ్చులో మిడిసిపడ్డట్లు
 మాచేత చచ్చును మన్నీలుబలము" (పల్నాటివీరచరిత్రం)

అని నాయకురా లన్నట్లు శ్రీనాథుడువ్రాశాడు. అయితే నాయకురాలు ఆభాష మాట్లాడిందని యెవరనగలరు? కవి అట్లా వ్రాస్తాడు. కవిశిల్పి. అతనికిష్టమైన భాషలో వ్రాస్తాడు. అది ఆపాత్రలభాష అని అనుకోగూడదు. కనుక రామకృష్టాయనీ "సీకటై లచ్చిమి సెందురుణ్ణి, సూరెయుణ్ణి" అని యీతీరున కవి వ్రాశాడని అవే నాయకుడిమాట లని అనుకోగూడదు. కనుక ఆమాటలు ఆధారంగా నాయకుడు సంస్కారంలేని మోటువాడని నిశ్చయించలేము అని అంటారా?

సిద్ధాంతం

వ్రాస్తున్నాను; ఈఅనౌచిత్యాని కెట్లావున్నా యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాటలు ఇట్లాటివాటి క్షుద్రత్వానికిగూడా వీటినాయకులు సంస్కారహీనులని చిల్లరమనుషులని విశదపడడం అవసరం గనుక యెంకిపాటలు ఉదాహరణంగా ఈవిషయం వివరిస్తాను. శ్రీనాథుడు "కవిసార్వభౌముడ ఘనతగన్నట్టి, శ్రీనాథుడునువాడ శివభక్తిపరుడ" అని తన భాషను అంతటా ప్రదర్శిస్తాడు. ఈ భాషనే పాత్రలకుగూడా వాడుతాడు అప్పుడది కవిభాషగాని పాత్ర భాషగాదని స్పష్టంగా తెలిపిన వాడవుతున్నాడు. అదిగాక కవిభాష

"ప్రభువులలో మాప్రభువులును కవులూ రసికులూ
 అయిన శ్రీ శ్రీ శ్రీ రాజా వెంకటాద్రి అప్పారావు
 బహద్దరుగారు యీపాటలు విని ఆనందించేవారు.
 వారి వంశ మాచంద్రార్కము నిలుచుగాత మని పరమేశ్వ
 రుని ప్రార్ధిస్తున్నాను. మా ప్రెసిడెంటుగారు శ్రీయుత
 కోలవెన్ను రామకోటీశ్వరరావుగారి ద్వారా వారి
 దయకు బదులు నావందనము లర్పిస్తున్నాను"

అని కవి తన భాషను ఉపోద్ఘాతంలో వ్రాశాడు.

"వస్తుండగా". (ఉపోద్ఘాతం.)

"నీటుగొస్తావుంటె". (యెంకిపాట.)

అని యిట్లా కవిభాషా పాత్రభాషా భిన్నంగావున్నవి. ఇంతకూ యెంకిపాటల్లో పాత్రలే మాట్లాడుతారు. కనుక యీపాటల్లో వున్నది పాత్రభాషే నంటున్నాను.

పూర్వపక్షం.

అవునయ్యా; నాటకాల్లో రాజుకు సంస్కృతంవాడుతారు. అయితే ఆరాజు సంస్కృతం మాట్లాడుతాడని అర్థమా? నాటకంలో కవిచెప్పేది వుండదుగదా. అంతా పాత్రసంభాషణమేగదా అయినప్పటికీ ఆసంభాషణలవల్ల అది ఆపాత్ర నిత్యవ్యవహారంలో వాడేభాష అని నిశ్చయించలేకున్నాము. అది కేవలం కవిసమయాన్ని అనుసరించి యేర్పడ్డభాష కనుక పాత్రలసంభాషణం అన్నమాత్రాన అది వారినిత్య వ్యవహారభాష అని చెప్పలేము గనుక

"కూకుండనీదు"

"సెందురుణ్ణి"

ఇవి నాయకుడి నిత్యవ్యవహారభాష అని నిర్ణయింపలేము. ఆమాటలవల్ల అతడు చదువురాని మోటువాడనడం సాధ్యసమమనే హెత్వాభాసం. నీడద్రవ్యం, చలనమున్నదిగనుక; అనే ఉదాహరణంలో వలె ఋజువుచేయవలసిన ఒక అంశానికి అట్లానే యింకా ఋజువుచేయవలసిన మరియొకఅంశాన్ని హేతువుగా చెప్పడం సాధ్యసమం ఇట్లాటిదాన్నే Fallacy of Undue Assumption అని పాశ్చాత్యతార్కికులంటారు. ఇక్కడ నాయుడు చదువురానివాడనడం ఋజువు చేయవలెను. "కూకుండనీదు" "సెందురుణ్నీ" ఇవి ఆతని నిత్యవ్యవహారభాష గనక అనడం హేతువు. ఇవి అతడినిత్యవ్యవహారభాష అనడం కూడా ఋజువు కావలసిన అంశమే. అది ఇంకా ఋజువుకాలేదు. కనుక ఇట్లాటిదాన్ని సాధ్యసమమనే హేతువుగా హేత్వాభాసమని వైయాయికులు నిరూపించారు. ఈ తీరుగా హేత్వాభాసాన్ని స్వీకరించి నాయకుడు చదువురాని మోటువాడంటే మేమొప్పుకోము అని అంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను; నాటకంలో పాత్రలసంభాషణం పాత్రల నిత్య వ్యవహారసంభాషణం కాదనడం అసంబద్ధం. పాత్రలకు ఉచితమైన భాష వుండవలెననే వుద్దేశంతోనే రాజు మొదలైనవారికి సంస్కృతం నీచులు మొదలైనవారికి ప్రాకృతభేదాలను తత్తద్దేశాల ననుసరించి చెప్పవలె నని భారతీయసాహిత్యవేత్త లంటున్నారు.

"దేశభాషాక్రియావేష లక్షణ్యాః స్యుః ప్రవృత్తయః"
 లోకాదేవావగంతవ్యా యథౌచిత్యం ప్రయోజయేత్"
"పిశాచాత్యంతనీచాదౌ పైశాచం మాగధం తథా
 యద్దేశ్యం నీచపాత్రంతు తద్దేశ్యం తస్యభాషితమ్. (సాహి)

(దేశభేదంచేత భిన్నమైనభాష చేష్ట వేషం ఇట్లాటి నాయక వ్యాపారాలు ప్రవృత్తులు. వీటిని లోకంవల్లగ్రహించి ఔచిత్యాన్ని అనుసరించి కూర్చవలసింది. పిశాచాలకు అత్యంతనీచులకు పైశాచం మాగధం, ఉపయోగించవలెను. నీచపాత్రం యేదేశానికి సంబంధించివుంటే ఆదేశభాష ఆపాత్రానికి వాడవలెను) అని అన్నారు. ఈతీరున ఆ ఆ దేశాల పాత్రలభాష తత్తద్దేశాల నిత్యవ్యవహారంలోనిదిగాదనే అభిప్రాయం అవివేకమూలమని స్పష్టపరచాను. యెంకిపాటల్లోది నాయుడిబావభాషే ననడానికి నాటకప్పాత్రలబాష నిత్యవ్యవహారభాష కాదనే అడ్డుకారణాన్ని తోసివేస్తున్నాను. రాజులు మొదలైనవారు సంస్కృతం నిత్యవ్యవహారంలో వాడుతారా అంటే సంస్కృతం ఒకవేళ వాడితే అట్లానేవాడుతారని సమాధానం. ఛందస్సు వల్ల యేర్పడే క్రమం, అడావుడి, వ్యత్యాసం మొదలైనవితీసివేస్తే సంస్కృతం మాట్లాడేటప్పుడు ఆభాషే మాట్లాడుతారంటున్నాను. అంటే నోరు తిరక్కపోవడం మొదలైన దోషాలు లేనిదశలో ఆసంస్కృతమే మాట్లాడుతారని అభిప్రాయం. ఈనాయుడు తెలుగుదేశస్ధుడే గనుక అతడు తెలుగుమాట్లాడుతాడా మాట్లాడడా అనే విచారణే లేదు. ఛందస్సు అడావుడీ వ్యత్యాసం మొదలైనవి తీసివేస్తే అతడికి అతడిదేశభాగంలో అతడిదశకు సిద్ధమైన భాషనే మాట్లాడినా డని అనుకొనడం కంటె, వేరే మార్గం లేదు. "రామకృష్ణా! చందురుణ్ణి" అని అనవలసివుండగా రామకుష్ట, సెందురుణ్ణి అని యిట్లా అనడం ఛందస్సు కక్కురితిగాదు ఛందస్సు అడావుడీగాదు. అది అతడిభాష కాదనడానికి మరేహేతువులు లేవు కనుక అవి నాయకుడి భాషే అని నిర్ణయిస్తున్నాము.

ఆక్షేపం

అవునయ్యా: యెంకయ్య చంద్రమ్మపాటలోవలె కవిదే ఆభాష అంటాము అప్పుడు పాత్రల నిత్యవ్యవహార భాష అనేవాదం పోతుంది గదా. పాత్రలది ఆభాష కాకపోవచ్చును. కవి తనభాషను పాత్రలకు ఆరోపిస్తున్నాడు. కనుక పాత్రలు అపరిణతు లనడం నిల్వదు అని అంటారా?

సమాధానం

చెబుతున్నాను. కవిది ఆబాషఅయితే అది అతడి నిత్య వ్యవహారభాష అంటారా? అప్పు డతడు అది నిత్యవ్యవహారభాష అయిన అపరిణతవలయంలో చేరుతున్నాడు. ప్రకృతివైపరీత్యంవల్ల అనుచితమైన భావాలు ప్రక్షిస్తా లనవలసివస్తుంది. ఇక అపరిణతుడైన కవికి పరిణతనాయకసృష్టి అసంభవం గనుక నాకు విప్రపత్తి లేదంటున్నాను. అతడు అసాధారణుడు, కనుక ఆభాషలోనే పరిణతభావాలు అతిడికి ఉత్పన్నమైనదంటారా? దేశకాలప్రకృతులతో సంబద్ధంకాని అసాధారణత్వం ఔచిత్యవిచారణనుండే దూరమవుతున్నదని చెప్పుతున్నాను. కనుక యిక్కడ అట్లాటి దాని విచారణేలేదు. అవునయ్యా ప్రకృతిచేత ఉచితుడు అయినా అతడు ఆభాషను కావ్యంలో వాడవలెనని సమయమేర్పరుచుకొన్నాడు. అది అతడి సామయికభాష దాంట్లోనే రామాయణాదులుకూడా వ్రాస్తాడు. అని అంటారా? అది ప్రత్యక్షవిరోధం గనుక అనౌచిత్యమంటున్నాను. అపరిణతనాయకులకు పరిణత శబ్దార్ధాలు ప్రవృత్తి తగిలించడంవలె పరిణత నాయకులకు అపరిణతుల శబ్దార్థాలు ప్రవృత్తి తగిలించడం ప్రత్యక్షవిరోధం గనుక ఘట్టకుటీప్రభాతన్యాయంచేత అనౌచిత్యమే యెదుర్కొంటున్నది. పరిపాకవత్ప్రభవత్వరూపమైన శబ్దార్థపరిణతి నెవరు వారించగలరు? పాత్రలకు తగిలించకుండా కవే ఆబాషలో సామయికంగా పరిణత భావాలు ప్రదర్శించినప్పుడే మంటారంటే కవియొక్క ఆసమయమే అనౌచిత్యం పాలైందంటున్నాను. కనుక అనౌచిత్యం తప్పని దువుతున్నదని చెప్పుతున్నాను.

పూర్వపక్షం

అవునయ్యా; కవివిషయం మాకావశ్యకంగాదు. ప్రకృతి వైపరీత్యం గాని, విరోధంగాని యిక్కడలేదు. కవి ఔచిత్యాన్ని ప్రదర్శించాడు దాన్ని తెలుపుతున్నాము. నాయుడు సంస్కారవంతుడే అయినా యెంకిచదువువల్ల కలిగే సంస్కారంలేని మోటుమనిషి. యెంకితో కలుస్తున్నాడు గనుక యెంకిబాష మాట్లాడుతున్నాడు. ఇందులో యెంకే ప్రధానం. అందుకే యెంకిపాటలని దీనికి పేరు పెట్టినారు. దీంట్లోది యెంకిభాషగాని నాయుడిభాషగాదు. హనుమంతు డిట్లానే రామలక్ష్మణులతో సంస్కృతం మాట్లాడుతాడు. కాని హనుమంతుడిభాష సంస్కృతం గాదుగదా నాటకాల్లో సయితం కార్యసందర్భాన్ని అనుసరించి యీతీరున భాషావ్యతిక్రమం జరగడం కద్దు అందుకే

'కార్యతశ్చోత్తమాదీనాం కార్యో భాషావ్యతిక్రమః"

(కార్యసందర్భాన్ని అనుసరించి ఉత్తమాదులకు సయితం భాషా వ్యతిక్రమం చేయవలసివుంటుంది) అని దశరూపకకర్త అంటున్నాడు. దీన్నే సాహిత్య దర్పణకర్త ఉదాహరించిన ఘట్టంలో వ్యాఖ్యాత

"ఉత్తమస్య రాజాంతఃపురచారిత్వే మాగధీ"

అని ఉత్తములకు కొన్నిచోట్ల ప్రాకృతభాషను వాడవలెనని అభిప్రాయం తెలిపినాడు. యెంకితొకూడేసందర్భం గనుక నాయుడు యెంకిభాష మాట్లాడినాడు. కనుక అది నాయుడిభాషగాదు. అందువల్ల

"సెందురుణ్ణి కూకుండనీదు రామకుష్ట"

అని యిట్లాటి మాటలు మాటలాడినాడన్న మాత్రాన అతడు చదువురాని సంస్కారహీను డనడానికి వీలులేదు. అని అంటారా?

సిద్ధాంతం

వివరిస్తున్నాను; యెంకితోమాట్లాడే సందర్భం గనుక యెంకిభాష మాట్లాడినాడని నాయుడు సంస్కారవంతుడే నని అంటే ఒప్పుకోము. యెంకితో మాట్లాడని యేకాంతసందర్భాల్లోగూడ అత డీభాషనే మాట్లాడినాడు. అక్కడిమాటల రూపమేగాక అభిప్రాయం గూడా సంస్కారహీనులైన మోటువాండ్ల అభిప్రాయదశను దాటజాల లేదు.

"యాడుంటివే యాడుంటివే
 పూతోరిపందిట్లో సీతాయియెల్తుంటె
 నీతళుకుగేపకాన నాతలతిరిగిందోలె
 మెళ్లోపూసలపేరు తల్లోపూవులపేరు
 కళ్లెత్తితేసాలు కనకాబిసేకాలు"

అని మొదలయిన మామూలు ప్రాకృతశబ్దాలు వ్యక్తమవుతవి. ఇట్లా అంతటా యేకాంతంగా మాట్లాడేటప్పుడు చదువురాని శబ్దార్ధాలనే వెలువరిస్తాడు.

"నీవెల్లి పోయినావంటే పచ్చినై"

అని యీతీరున చదువుకోనివాండ్ల శబ్దార్థాలనే వ్యక్తపరుస్తాడు గనుక చదువురాని మోటువాడంటున్నాను.

పూర్వపక్షం

అవునయ్యా. అట్లా మాట్లాడవలె నని మాట్లాడినాడు అంతే గాని అతడు పరిణతుడేనంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను; అతడు ఆతీరున కృత్రిమంగామాట్లాడినాడని కవి యెక్కడాతెలుపలేదు. అయినా నాయకుడు కావ్యంలో ఉపనిబద్ధుడైనంతమటుకే మనకు విచార్యంగాని తక్కిన అతనిఒడ్డు పొడుగు, అతిడిచుట్టలపొగ, అతడిచెప్పుల కిర్రు, అతడిజిత్తులు మాట్లాడవలె నని మాట్లాడడం ఇవన్నీ విచారించడం అప్రమత్తం. అయినా మీరన్నట్లు అతడు సంస్కారవంతుడైనా, ప్రాకృతుడివలె నటించాడని ఒప్పుకొని విచారించినా నాకు విప్రపత్తిలేదు. నాకు కావలసినది కావ్యంలో వున్నమటుకే గనుకను, నేను కావ్యవిచారణమటుకే చేస్తున్నాను గనుకను, కావ్యంలోమటుకు అతడు సంస్కారంలేని మోటువాడనే స్పష్టం గనుకను అతడు అపరిణతుడనే అంటున్నాను. కావ్యానికి ఔచిత్యం ఆయువుపట్టు వంటిదని అదిలేకుంటే అనౌచిత్యం సంభవించి రసభంగహెతువవుతుందని వివరించాను. యేతర్కంచేతనైనా అతడు పరిణతుడనే ఒప్పుకొంటే కావ్యమంతా అనౌచిత్యం పాలౌతుంది సర్వానౌచిత్యంకంటే యేకదేశానౌచిత్యమేకావ్యకర్తలకు అనుకూలంగదా. అస లింతకు ప్రాకృతుడని నిరూపించాను. సాధారణంగా అంతటా అపరిణతమైన శబ్దార్థాలు వెలువరించిన కృతిలో

"పెక్కునీవులునాకు,
 మాటలో మనసులో మంచిలో యెంకి
 సొగసునీవోసారె అగపడవనాకూ"

అనే యిట్లాటివి అనౌచిత్యాన్ని ఆపాదిస్తున్నదని తెలుపుతున్నాను.

"ఏకోహిదోషో గుణసన్నిపాతే
 నిమజ్జతీందోః కిరణేష్వివాంకః" (కుమార)

అని కాళిదా సన్నట్లు ఈఅనౌచిత్యదోషం ఉపేక్షించవచ్చునంటే వీలులేదు. కావ్యమంతా చిల్లరశృంగారంతో క్షుద్రంగా వున్నపుడు గుణసన్నిపాత మెక్కడిది? ఆక్షుద్రత్వానికి ఈఅనౌచిత్యం తోడ్పడుతున్నది చిల్లరశృంగారంవల్ల ఆపతితమయ్యే క్షుద్రత్వ మిదివరకే నిరూపించాను. కావ్యానికి ఔచిత్యం ఆయువుపట్టని అదిలేకుంటే అనౌచిత్యం సంభవించి రసభంగ హేతువౌతుం దని తెలిపినాను. యెంకిపాటల్లో ఔచిత్యం ఇట్లా భంగమయి గోరుచుట్టుమీద రోకటిపో టన్నట్లు క్షుద్రత్వానికి అనౌచిత్యం చేరిందని విశదీకరించాను. ఇట్లానే వెంకయ్య చంద్రమ్మ పాటలోను

"యెందులో జూచినా యెలుతురుండాదంట
 యెరిగితేసూపించిపోరో రెంకయ్య
 లేకుంటె నిన్నిడువలేరా యెంకయ్య||
 సప్తసముద్రాల్లో సారముంటాదంట
 తెచ్చి పెడుతువుగానిరారో రెంకయ్య
 లేకుంటె నిన్నుడువలేరా వెంకయ్య||
 తెలిసందమామలో తియ్యపానకముంది
 తెచ్చిపెడుదువుగాని రారో రెంకయ్య
 లేకుంటె నిన్నిడువలేరా యెంకయ్య॥

అనేవి అనౌచిత్య ప్రతిపాదకాలని తెలుసుకోవలెను. ఇక

"శిరసునామీదేసి సిరునవ్వునవ్వితే
 సింతలన్నీ మరిసినావే చంద్రమ్మ"
                                     (యెంకయ్య చంద్రమ్మపాట)
"యెంకిగాలొక సారి యిసిరినాసాలు
 తోటంతరాజల్లె తొవ్విపోసెను." (యెంకిపాటలు)
"నీనీడలోపలా దేవుడుండాడంట
      నానీడలోగలిసిపోరా వెంకయ్య" (యెంకయ్య చంద్రమ్మ)
"నీనీడలోనే మేడకడత నాయుడుబావా" (యెంకిపాట)
 నీవొళ్లు నావొళ్లు నిజముగావొకటైతె
 పైనసుక్కలు నవ్వినాయే చంద్రమ్మ
 పాపచంద్రుడు నవ్వినాడే చంద్రమ్మ
                                    (యెంకయ్య చంద్రమ్మపాట)
"సెంద్ర వొంకలొ యేమి సిత్రమున్నాదే
 వొంకపోగానె మావోడొస్తడమ్మా (యెంకిపాట)

మావోడి మనసట్టె మరుగుతాదమ్మా
పండు యెన్నెల్లోన పక్కకేసినసాప
పందిరీమంచమైనాదే చంద్రమ్మ (యెంకయ్యపాట)
పచ్చన్ని సేలోకి పండు యెన్నెల్లోన
నీలిసీరాగట్టినీటుగొస్తావుంటె (యెంకిపాట)
"మల్లీ యెప్పటల్లె తెల్లారబోతుంటె
సందురుణ్నీ తిట్టునాయెంకి
సూరియుణ్ణీ తిట్టునాయెంకి"
"బద్రాసెలంనేను బయలెల్లిపొతాను
నువ్వుగూడా యెంటరారో రెంకయ్య"
                                         (యెంకయ్య చంద్రమ్మ)
"పడవెక్కి బద్రాద్రిపోదామా
బద్రాద్రి రాముణ్ని సూదామా" (యెంకిపాటలు)
"సిమ్మాచలపుసామి సేవించుకొత్తాము
కొంపగోడూయిడిసిరారో రెంకయ్య
అంపకాలేసెప్పిరారో రెంకయ్య"
                                  (యెంకయ్య చంద్రమ్మపాట)
"ఆవుల్ని దూడల్ని అత్తోరికాడుంచి
మూటాముల్లీగట్టి ముసిలోళ్లతో సెప్పి
యెంకీ నాతోటిరాయే మన యెంకటేశ్వరుణ్ని
యెల్లి సూసొద్దాము" (యెంకిపాట)

అని యిట్లా తిరణాలవేడుకలు కొన్ని యింపైనమాటలు తీర్థయాత్రా ప్రశంసలూ వున్నా అసలీకృతులే క్షుద్రశృంగారం గనుక

"వపుష్యలలితే స్త్రీణాం హారోభారాయతే పరం"

అన్నట్లు ఇవి కృతులకు ఉపాదేయత్వం తేజాలవు.

"కమ్మవారి చిన్నదాని నయ్యానేను
 జొన్నకోత కోస్తావ పిల్లానీవు"
 సన్నాసన్నాగాజులేవే నారాయణమ్మా
 నీచిన్నాచిన్నా చేతులాకు నారాయణమ్మా"

అని నారాయణమ్మ నాయుడుబావపాటలోను లక్ష్మి అనేకథలోను వుండే మంచిమాటలు జారకాంత సౌశీల్యంవంటివి గనుక విచార్యం గావని చెప్పి యీచర్చ ముగిస్తున్నాను.

"మా అభినవాంధ్ర కవిమిత్రమండలి వారందరు నాప్రాణ మిత్రులు" అని యెంకి పాటలకర్త తెలిపిన అభినవాంధ్రకవిత్వ మిదే అయితే దీంట్లో వున్నది ఆధునికత్వంగాని అభినవత్వం గాదని దీన్ని అభినవమన్నా ఆధునికమన్నా యిట్లాటివి చిరకాలంనుండీ వున్నవని ఇవే ఉత్తమ కవిత్వమనుకొనడం అజ్ఞానమని ఈ ఆధునిక కవిత్వం చాలవరకు దుష్టమని ఈకృతుల్లో చాలామట్టుకు శృంగారం చిల్లరశృంగారమై క్షుద్రమైనదని ఈరకపు క్షుద్రకవిత్వానికి చేరినయిట్లాటి మండల్లు అంతగా శ్లాఘ్యమైనవి గావని ఇది కవిమిత్రమండలి అయినప్పుడు ఈకవులను ఉత్తమ మార్గాలకు ప్రేరించడం ఈ మిత్రుల ధర్మమై వుండగలదని చెప్పుతున్నాను.

అని శ్రీ- ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్రపరిశిష్టంలో

అనౌచిత్యాధికరణం - సమాప్తం

వాఙ్మయపరిశిష్టభాష్యం

తత్త్వార్థాధికరణం

పూర్వపక్షం

అవునయ్యా; యెంకిజీవాత్మ, నాయుడు పరమాత్మ, యెంకయ్య పరమాత్మ, చంద్రమ్మ జీవాత్మ, ఇది వీటి తత్వార్థం. కనుక మీవిమర్శ అంగీకరించ వీలు లేదంటారా?

సమాధానం

చెప్పుతున్నాను;

"ఓరోరి బండోడ వొయ్యారిబండోడ
 ఆగూబండోడా నిల్వూబండోడ?
"లచ్చుమయ్యా నీమచ్చామాయో"
"యెట్లాపోనిస్తివోయి మట్లావోరి చిన్నదాన్ని"

అనే యిట్లాటి వాటికన్నిటికీ తత్త్వార్థం వున్నదనవచ్చును. అదంతా యెందుకు? లంజకొడకా అని తిట్టి దానికి తత్వార్థం వున్నదనవచ్చును. లంజ అంటే ప్రకృతి. కొడుకు అంటే పరిణామం. లంజకొడకా అంటే ప్రకృతిపరిణామమైన ఓమనిషీ అని అర్థం అనవచ్చును.

పరకీయను సాధ్విని నీవు నన్నంగీకరించమని కోరి నలుగురూ తన్నవచ్చినప్పుడు నన్నంటే నాలోవున్న పరమాత్మను. నీవంటే నీలోవున్న జీవాత్మ అని అర్థం చెప్పవచ్చునుగాని అవి తప్పించుకొనే భీరువచనాలని మరికొన్ని యెక్కువ తాడనాలు సంభవిస్తవి. ఇట్లాటి వెర్రివేదాంతాల పేరుతో దేశంలో అనేక దురాచారాలు ధర్మభ్రంశాలు జరుగుతున్నవి.

"అనాథబాలరండానాం కాగతిః పురుషోత్తమ
 అహం వేదాంతిరూపేణ.................

అని యిట్లాటి భ్రష్ట ప్రామాణికవచనాలు సయితం తలచూపుతున్నవి. అంతా ఒకటేనని నీకూ నాకు భేదంలేదని నీవొళ్లూ నావొళ్లూ కలిస్తే అద్వైతమవుతుందని దుష్టకార్యాలందు ప్రవృత్తిసయితం పైమాదిరి వేదాంత దుర్వినియోగంవల్ల తటస్థిస్తున్నది. శ్రీభాగవతంవంటి గ్రంథమే ఆ మార్గాలకు అనేకుల కాధారమైనప్పుడు తక్కిన క్షుద్రాలసంగతి చెప్పవలసినపనిలేదు కృతికర్త ప్రవృత్తినిబట్టి కృతితత్వం నిర్ణయించడం ఉచితం.

కృతికర్తలు ఆచరణచేత విరాగులుగా వానప్రస్ధులుగా తత్వజ్ఞానులుగా వుంటూ యేదైనా పాటపాడి దానికి వేదాంతార్థమంటే వొప్పుకొంటాము. యెందుకంటే వారిచిత్తవృత్తే తత్వజిజ్ఞాస కనుకనె

"సన్నంపుదిడ్డివాకిట పున్నమవెన్నెలబైటా
 కిన్నెరరవము వింటినీ"

అని బ్రహ్మగురుకోటిలో వారుపాడితే వ్యంగ్యం అయోమయంలో పడనంతవరకు యెట్లానో తత్వగ్రహణం అంగీకరిస్తాము. అవి ఒక కామి యొక్క సొంతమాటలైతే మన్మధాలాపా లాడుతున్నా డంటాము. విచార్యమాణమైన యీపాటలకర్తలకు వానప్రస్థత్వంగాని విరాగిత్వం గాని జనకాదులవంటి తత్వపరాయణమైన ప్రవృత్తిగాని ఉన్నట్లు ప్రసిద్ధి లేదు. కృతికర్తల ప్రవృత్తినిబట్టి యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మ పాట మొదలైనవి వేదాంతమన వీలులేదంటున్నాను. యెంకయ్య చంద్రమ్మపాట కర్తయెవ్వరో తెలియనే తెలియదు.

కృతికర్తల ప్రవృత్తితో మనకేమిపని? చంద్రమ్మపాట కర్తయెవ్వరో తెలియదని మీరే అంటున్నారు. కృతిలో తత్త్వార్థముంటే చాలు. అని అంటారా? అది వేదాంతమైతే మాతమ్ముణ్ణి మాకియ్య రయ్యోయేమిటి? నీవు నావల్ల కొడుకునుకంటావు. నా కినాములియ్య మనడమేమిటి? కోడిగూసేసరికి కొంపకెల్లాలి యేమిటి? తోటకునీళ్లు చల్లడమేంది? కులకడమేంది? దీపమార్పడమేందీ? మంచెకింద గొంగడి వేసుకొని తిప్పలుపడడమేంది? వూచబియ్యం బెడతరారో రెంకయ్య యేమిటి? అంటింతచెట్లతో తంటాలుపడలేమేమిటి? తోలుచెప్పులు కుట్టినానే చంద్రమ్మ యేమిటి? ఆకుమళ్లకు నీవు రావేచంద్రమ్మ యేమిటి? కొడుకుకోసం మొక్కుకోవే చంద్రమ్మ యేమిటి? వొంటాముదము దెచ్చి వుడికించి నీకాలు సరిచేసి దరిమేనురారోరెంకయ్య యేమిటి? అప్పు డీపాటలన్నీ అర్ధహినాలై అయోమయంలో బడతవి. చిల్లర శృంగారం తప్పించబోతే అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు అయోమయత్వం అపతితమవుతుంది. అయోమయత్వాదికరణంలో ఈదోషాన్ని వివరించాను. పాటలకర్తల వేదాంతప్రవృత్తి యెట్లావున్నా యిట్లాటిపాటలు పాడేవారు తమపశుకామప్రవృత్తులకు అనుకూలంగా వీటిని పాడడం విశదమైన సంగతి కాదు కూడదు. వీట్లో వున్నది వేదాంతమేనంటే చెప్పుతున్నాను. వేదాంతమని గట్టిగా చెప్పితే నాకిప్పుడు విచారణే లేదంటాను. కావ్యమని శృంగారమని కవిత్వమని అన్నప్పుడే నాకు కావ్యవిచారణ యిక్కడ ప్రసక్తిస్తుంది. అప్పు డిది చిల్లరశృంగారమని క్షుద్రశృంగారమని నిర్ణయించాను. వేదాంత మంటారా? అసంబద్ధపుమాట లాడి యివి వేదాంతమనడం తప్పించుకునే తేలికవుపాయమంటాను. లేదా మరియొక సందర్భంలో వేదాంతవిమర్శ చేసేటప్పుడు దీంట్లో వేదాంతమేమిటి ? ఈవేదాంతం కొత్తదంటారా? కొత్తదయితే యెంతవరకు అసంబద్దత లేకుండావున్నది? భక్తిమతంలో జీవేశ్వరుల రమణీవల్లభ సంబంధం యెంతవరకు ఉచితం? అది యిక్కడయెట్లా విని యుక్తమైనది? దానివల్ల సంభవించే శ్రేయోనర్ధాలేవి? ఈపాటల మతం కొత్తదైతే యెంతవర కంగీకార్యం? అని వేరే విచారణచేస్తాను. ఇది కావ్యమని, కవిత్వమని, శృంగారమని అన్నప్పుడే నాయీవిచారణ ప్రస్తక్తం చేస్తున్నాను. కావ్యవిచారణ చేసి యివి చిల్లరశృంగార మని క్షుద్రశృంగారమని స్పష్టపరచాను.

అని శ్రీ ఉమాకాన్త విద్యా శేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో తత్త్వార్ధాధికరణం సమాప్తం

శ్రీగణేశాయనమః,

వాఙ్మయపరిశిష్టభాష్యం.

వనకావ్యాధికరణం.

పూర్వపక్షం.

అవునయ్యా, పోనియ్యండి, క్షుద్రంగానియ్యండి, అనౌచిత్యం వుండనీయండి. ఇంగిలీషులో (Pastoral Poetry) పాస్టరల్ పోయట్రీ అని వున్నది . అది చాలాగొప్పది. గొల్లలు మొదలైన పాత్రలుంటారు. ఆవులు, లోయలు మొదలైనస్థలాలు అందులో వర్ణితమవుతవి. ఈయెంకిపాటలు మొదలైనవి అట్లాటివి. కనుక మంచివి. చేలు, కాపులు, కాపుకన్నెలు, మన ఆంధ్రదేశంలో, మనోహరమైన అమాయికజీవితాన్ని ప్రదర్శిస్తున్నారు. జొన్నచేలు, కంకులు, మంచెలు. కాపుకన్నెలవలపులు, విలాసాలు యెవరిని ఆకర్షించవు? ఇది {Pastoral Poetry}పాస్టరలు పొయట్రి కనుక మంచిదంటారా!


సిద్దాంతం.

అది అసంబద్ధం. అవి మంచివిగాదని చిల్లరశృంగారం ప్రధానంగా అనుపాదేయ మని తెలిపినాను. పాస్టరలు పొయట్రి అనే పేరు తిరిగి వినిపించినమాత్రాన వీటి క్షుద్రత్వం యెట్లాపోతుంది? అయినా దీన్ని గురించి వివరిస్తాను. అడవులు లోయలు మనోహరా లన్న మాట నేను తిరస్కరించను. మనుష్యులు రజస్తమస్సుల ప్రవృత్తిచే దూషితమై సంకీర్ణమైన పట్టణాలకంటె ప్రశాంత నిర్మలాలై ప్రకృతి రమణీయమైన అడవులు వాస్తవంగా కవికి ఆరాధ్యాలు. అందుకే వాల్మీకి కాళిదాసు భవభూతివంటి కవులు పట్టణాలను దూరాన వదలి అరణ్యసీమలనే తమ కవిత్వానికి ఆలవాలంచేశారు. తైత్తిరీయా రణ్యకం బృహదారణ్యకం అని ఈతీరున విజ్ఞానానికి సయితం అరణ్య సంబంధం బారతీయ సంప్రదాయం వినిపిస్తున్నది. భారతవర్షాన్ని పవిత్రం జేసిన నైమిశారణ్యం ప్రసిద్దమైనది. వాల్మీకి కవితకు మూడుపాళ్లు అరణ్యమే సీమ. కాళిదాసు కుమారసంభవాన్ని కొండలు, అడవులు వీటి వర్ణనతో ఆరంభిస్తాడు. మహోదాత్తనాయిక అయిన గౌరి కొండకన్నె ఆమెప్రేమ కొండల్లోనే పవిత్రమవుతుంది. శాకుంతలాన్ని కవి అరణ్యంతో ఆరంభించి అరణ్యంలోనే అంతం చేస్తాడు. రఘువంశంవంటి రాజుల చరిత్రలోగూడా కవి ఆదియందు కథ కల్పించి వనసీమలను వశిష్ఠాశ్రమాన్ని నిల్పుకొనితన కవితకు అమృతత్వం కలిగిస్తాడు. యక్షుడికథ కొండల్లో, ఛాయాతరువుల్లో ఆరంభమవుతుంది. విక్రమోర్వశీయ మాళవికాగ్ని మిత్రాలు. కాళిదాసుడి వనప్రకృతిప్రేమను స్ఫుటంగా వ్యక్తపరుస్తున్నవి. ఇంతకూ చెప్పదలచిందేమంటే అడవులను ప్రకృతిని ప్రేమించడానికి క్షుద్రపాత్రలకూసంబంధం అవినాభావరూపమైనదిగాదని. ఉదాత్తనాయకులతోనే భారతీయులు వనప్రకృతిని ఆరధించారు. అదిగాక పరిణతచిత్తులైన ఉదాత్తనాయకులు వనప్రకృతిశోభను ఆస్వాదించే విధం చిల్లరమనుషుల విదానానికంటే భిన్నమైనది. వనప్రకృతిశొభను ఆస్వాదించే విధం చిల్లరమనుషుల విధానానికంటె భిన్నమైనది. వనప్రకృతిశోభలు హృదయాన్ని అధిష్ఠించిన ఉత్తమ నాయకులు కావ్యాన్ని పావనంచేయ బట్టే సీతను ఆడవికిపంపిన పిమ్మట రాముడు దండకలో ప్రవేశించిన సందర్భంలో

"దండకారణ్యమా? ఇది" "ఒకచోట స్నిగ్ధశ్యామా
 లై ఒక చోట భీషణాభోగరూక్షాలై ప్రతిస్థలంలో
 ఝూత్కృతులచేత ఘోషిల్లేదిక్కులు గలిగి అగస్త్యా
 శ్రమ పరిద్గర్తకాంతారమిశ్రాలై పరిచితభూములైన
 దండకారణ్యభాగా లివిగో కనబడుతున్నవి"

"అరణ్యకులకు గృహులము స్వధర్మరతులము అయి
 జన్మఫలభూతవిషయాల్లో రసజ్ఞులమైన మేము వెనక
 నివసిస్తుండిన యీవనమహో! యీనా డెట్లాదృష్టమైనది!"

"అవే యీవిరువన్మయూరాలైన గిరులు, అవే యీ
 మత్తహరిణాలైన వనస్థలాలు, అవే యీ ఆమంజు
 వంజుళలతలై నీరంధ్రనీపనిచుళాలైన సరిత్తటాలు"

"ఆపర్ణశాలలవద్ద గోదావరీపయస్సులో వితతమైన
 శ్యామలతరులక్ష్మితో వానాంతం రమ్యంగావున్నది"
"ఇక్కడనే ఆపంచవటి అయ్యో; వదలిపెట్టి పోతున్నా
 పంచ వటీస్నేహం బలవంతానవలె లాగుతున్నది" (ఉ.రా)

అన్న విశిష్ఠభావాల ఉన్మీలనానికి అవకాశం కలిగింది. ఇక కాపు కన్నెలు ఆవులమందలు జొన్నకంకులు మనోహరంగానా అంటే చెప్పుతున్నాను; బ్రాహ్మణుల యజ్ఞశాల లెందుకు మనోహరంగావు? వివిధమైన చిత్రపదార్థాలతో వుంటే కోమటిదుకాణా లెందుకు వర్ణించరాదు. కాపుకావ్యం, గొల్లకావ్యం, బ్రాహ్మణకావ్యం, కోమటికా,వ్యం యెందు కుండరాదు? పోనీయండి? జొన్నచేలు కంకులు స్వభావసిద్ధమైనవి గనుక అన్నిటికంటె మనోహరమైనవంటే ఒప్పుకొంటాను. చాకళ్లు, మంగళ్లు, బోయలు, అన్ని తెగలవారూ వ్యవసాయం చేసుకొని జీవించేవా రెందరో వున్నారు. కాపులు రెడ్లు వ్యవసాయంమాని రాజసేవచేసేవాం డ్లెందరో వున్నారు. అదిగాక తెనాలితాలూకాలొ యెందరో కమ్మవారు పౌరోహిత్యంగూడా చేస్తున్నారని విన్నాను. ఇట్లాటి సందర్భంలో చేలసౌందర్యంతో కాపుకన్నెలను కాపుబావలనే కలవడం అర్థంలేనిపని. బ్రాహ్మణకన్యలు మంగలికన్యలు, కోమటికన్యలు చాకలికన్యలు రెడ్దికన్యలు అందరూ చేనితో సంబంధించివున్నారు. సంబంధించకవున్నారు. కనుక ఒక కాపుకన్నెలు చేలూ అంటే ఆమాట తోసివేస్తున్నాను.

చేలతో కాపుకన్నెలను కాపుబావలను మాత్రమే కలపడం అక్రమం. కులవాచిత్వం లేకుండా పాశ్చాత్యదేశాల్లో చేలపనిచేసేవాండ్ల కందరికీ అన్వయించే Peasant వంటిదిగాదు. కాపుశబ్దం. Peasants (కృషీవలులు) ప్రతిపాదితులు కావడానికి యిక్కడ మనం ఒక్కకులానికి మాత్రం సంబంధించిన కాపుకన్నెలను స్వీకరించడం అనుచితం. ఇది పాశ్చాత్యసరణుల బాహ్యకారాన్ని చూచి చేసే తెలివి తక్కువ పని అంటున్నాను. అవునయ్యా కాపుకన్నెలు పరంపరంగాచేలతో సంబంధించి వున్నారు. ఇప్పటికీ చేలతో సంబంధించిన వారిలో వారిసంఖ్యే యెక్కువ గనుక కాపుకన్నెలనే తీసుకొంటున్నామంటారా? అంటే అనండి.

కాపుకన్నెలను కాపుబావలను గాని అట్లాటి బ్రాహ్మణ్యకన్యలను బ్రాహ్మణబావలనుగాని చిరకాలంనుండి పశువులమందలకు సంబంధించిన గొల్లకన్యలను గొల్లబావలను గాని నాయకులను జేసి యెంకిపాటలవలె కావ్యం వ్రాస్తే ఉదాత్తభావోన్మీలనానికి అవకాశం వుండదని ఇది వరకే విశదంచేశాను. పాశ్చాత్యులు సయితం ఈపాస్టరులు కావ్యాల అప్రధానత్వాన్ని గ్రహించారు.

"Pastoral relying for its distinctive features upon the accidents rather than the essentials of life failed to justify its pretensions as a serious and independent from of art. The trivialtoy of a courtly coterie, it attempted arrogate to itself the position of a Philosophy and in so doing exposed itself to the ridicule of the succeeding ages"

(తన విశిష్టలక్షణాలకు జీవితంయొక్క ప్రధానతత్వంమీద కాకయాదృచ్ఛికమైన అంశాలమీద ఆధారపడే పాస్టరులు కవిత కళయొక్క ఉత్కృష్ఠ స్వరూపంగా స్వతంత్రస్వరూపంగా, ఉండజాలకపోయింది. రాజమందిరమందలి భోగిగణంయొక్క చిల్లరబొమ్మ అయిన యీకవిత తత్వజిజ్ఞాసాగౌరవాన్ని అహంకృతితో పొందగోరి పిమ్మటి తరాలవారి యెకతాళికి గురిఅయింది) అని పాస్టరల్ పొయట్రీ & పాస్టరల్ డ్రామా (Pastoral Poetry and Pastoral Drama) అనే గ్రంథంలో వాల్డర్ డబ్లియు గ్రెగ్(Walter W.Gregg)తెలుపుతున్నాడు. యాథార్థ్య మెరగక (Pastoral) పాస్టరల్ అని యేమేమో అకాండతాండవంచేసి కావ్యక్షుద్రత్వానికి అంధులుకావడం ఆంధ్రులసంస్కార దారిద్ర్యాన్నే తెలుపుతున్నది.

ఇట్లా క్షుద్రపాత్రలశృంగారం ప్రతిపదితమాయెనా అది చిల్లర శృంగారకావ్యమౌతుందని నిరూపించాను. అదిగాక అడవులు కొండలు మొదలైన ప్రకృతిశోభలు క్షుద్రలోకంతో సంబద్ధం కా నక్కరలేదని భారతీయులు కవితకు విజ్ఞానానికి ఆరణ్యసీమలే ఆకరంచేసి ఆరాధించారని తెలిపినాను. కనుక యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాటలు ఇట్లాటివి చిల్లరశృంగారపు క్షుద్రకావ్యాలని తిరిగి చెప్పుతున్నాను.

అని శ్రీ. ఉమాకాన్తవిద్యా శేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో వనకావ్యాధికరణం సమాప్తం

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం

నాయకాధికరణం.

ఆక్షేపం.

అవునయ్యా; యెంకిపాటలవంటి క్షుద్రశృంగారమన్నారు. ఇక వర్తమానాల్లో యెవరిది ఉదాత్తశృంగారం? ఇప్పటి ఆంధ్రదేశపురాజుల్లో జమీందారుల్లో సాధారణమనుష్యుల్లోకంటె యెక్కువ ధర్మరక్షకత్వం కనబడదు. అందరూ ఒకటే దశలో వున్నారు. ఇక ఉదాత్త నాయకులేరీ? అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను; నాయకుణ్ని నెదుక్కోవలసినపని కవిది. ఉచిత నాయకుణ్ని సృజించండి. చేతకాకుంటే వీలులేకుంటే మానండి. వర్తమానంలో యెవరైనా ధర్మరక్షకులు ఉదాత్తశృంగారనాయకులు కనబడితే స్వీకరించండి. అసలు భారతవర్షంలోనే అనేక శతాబ్దులకిందటనే ఆరంభమయిన ధర్మపతనం నేడు అనేకవిధాల ఆంధ్రదేశంలో నల్దిక్కులా విరివిగాగోచరిస్తున్నది. జాతిస్వతంత్రమై సర్వసమృద్ధమై ధర్మార్థ కామాలు అకలుషితాలై వర్తిస్తున్న దశలోవలె జాతిపతితమై జీవితం కుళ్లుడుతో వున్న దశలోఉత్తమకవితోదయానికే అనుకూల్యాలుండవు. మన పద్యం సయితం మురికిలక్షణాలతో వికృతమైవున్నదని పద్యం వ్రాయడమే కవితగాదని పద్యంవ్రాయడం విద్యగాదని యిదివరకే చెప్పినాను. మనస్సు జాతిసాధారణమైన ఈప్రాతికూల్యభారాన్ని తొలగించుకొని స్వచ్ఛవికాసాన్ని పొందడం యేఅలోకసామాన్య పురుషుడియందో తప్ప సాధారణంగా గోచరించదు. ఇక మనస్సును చీకటివలె ఆవరించే కామం బీజమైన శృంగారంయొక్క నిర్మలస్వరూపాన్ని దర్శించగలగడం. జాతిలో వర్తమానంలో దానికి తగిన ఆలంబనం దొరకడం దుర్లభంగావచ్చును. భారతవర్షపు తక్కినజాతుల్లో యెట్లావున్నా మన ఆంధ్రులయందు ఆర్యమైన వీరత్వం నశించింది. స్వపురుషార్ధరక్షణ చేసుకొనలేని పిరికిపందలాజాతియొక్క శృంగారం నిస్తేజం. వీరత్వం లేనిచోట యేసుగుణం యేధర్మం తలయెత్తజాల దన్నమాట సత్యం వీరత్వం నశించి ఆర్యపవృత్తి చ్యుతమైపోయిన ఆపద్దశలో ఆ ఉదాత్తగుణప్రభోదానికి బదులు కవికి పిరికిజాతి శృంగారమందు తత్పరత వాస్తవంగా గర్హ్యమే అవుతున్నది. అయితే యీదశలో జాతియందు స్త్రీలూ పురుషులూ కలియడం జరుగుతూనే వున్నదిగదా అంటే అది క్షుద్రకోటిలోది గనుక కవికి ప్రధానంగా అనుపాదేయమంటున్నాను. తక్కిన రసాల్లో ప్రస్తుతం ఉపాదేయమైనవాట్లో అభినివేశం తీర్చుకొనడానికి అది అంగంగా స్వీకార్యమైతే కావచ్చును. కాని ప్రధానంగా స్వీకారం గాదంటున్నారు.

కావ్యరచన ఉద్దిష్టమైతే రసనిర్ణయం. రసానికి ఉచితుడైన నాయకుడి నిర్ణయం తదనుగుణమైన వస్తుసృష్ఠి మొదలైనవన్నీ కవికి సంబంధించిన ధర్మాలని చెప్పి యీవిమర్శ చాలిస్తున్నాను. కరుణాదుల్లో ఉత్తమేతరులు సయితం విరుద్దులుగారు గనుక ఆరసాలకు వర్తమానులు ఉచితులు గావచ్చును. అదంతా కవికార్యమని వదలుతున్నాను. కావ్యం సృష్టమైనప్పుడు ఇది మంచిది. ఇది దుష్ఠం. ఇది క్షుద్రశృంగారం. ఇది పులుముడు అని యిట్లావిచారణచేసి సాహిత్యవేత్తలుచెప్పడం సంభవిస్తున్నది.

అని శ్రీ ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో నాయకాధికరణం సమాప్తం

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం

దయాధికరణం

పూర్వపక్షం

ఈయెంకిపాటలవంటివి యెంకయ్యచంద్రమ్మపాటలవంటివి కాపుల మీద మనకు దయకల్గించడానికి పనికి వస్తవి గనుక గ్రాహ్యమంటారా? అది సరిగాదు. ఈకాలంలో విదేశీయసంస్కారం క్రింద అణిగి దుర్దశలో వున్న మనమీదనే కాపులు సానుభూతి చూపవలిసి వున్నారు. వారు మన కంటె యేవిధంగాను శోచ్యదశలోలేరు. ఒకవేళ మీరన్నట్లు సానుభూతికలిగించడం వుద్దేశమైతే పశుకామాన్నే ఆధారంగా చేయవలసిన అవశ్యకత లేదు. సంసారపుచరిత్రలను ముడికామం వదలి తక్కిన అనేకమార్గాల చిత్రించవచ్చును. కామంమాత్ర మెందుకు స్వీకార్యంగాదు అని అంటారా? అది ధర్మశబళితం కానప్పటి దుష్ఫలాలిదివరకే విశదీకరించాను. కనుకనే దాన్ని చిల్లరశృంగారమని క్షుద్రకోటిలో చేర్చాను. కరుణాదులను స్వీకరించి వారికథలు చిత్రించవచ్చును. వారిగార్హ్యస్థ్య సంబంధమైన కథలు మొదలైనవి వ్రాయవచ్చును. వాటిలో ఈకాలపు సంఘచరిత్ర ఇమిడివుంటుంది గనుక గ్రాహ్యంగానే వుంటవి వాటి నప్పుడు చరిత్రకథలనిగాని మరివొకమాదిరి రచనలనిగాని అనుకుంటాము వాటిలో ప్రధానంగా రసభావాలను అన్వేషించము కావ్యమని వ్రాసినపుడు గద్యంగానీ పద్యంగానీ దాంట్లో ప్రధానంగా రసభావాలు ఆవశ్యకమవుతున్నవి. అప్పుడు శృంగారం హీననాయకమాయెనా క్షుద్రమవుతున్నది. కావ్యమార్గం వదలి మరేమాదిరి చరిత్రలు కథలు మొదలైనవి పద్యంలోగాని గద్యంలోగాని వ్రాసినా ఆవిచారణ నాకిక్కడ ఆవశ్యకంగాదు.

అని శ్రీ-ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో దయాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టబాష్యం.

స్థిత్యధికరణం

పూర్వపక్షం

అవునయ్యా, ఇట్లాటి పాటలు మొదలైనవి వెనుకటినుంచి వున్నవని మీరే అన్నారు. ఇట్లాటివి వుండకుండా యెక్కడికి పోతవి. వీటిస్థితిని యెవ రడ్డగించగలరు? ఇవి వుండనేగూడదని మీ అభిప్రాయమా అంటే?

సమాధానం

చెప్పుతున్నాను; ఇట్లాటివి ఉండగూడదని యెవరు చెప్పగలరు? లోకంలో అన్నీవున్నవి ముండ్లు, మలం, విషం, పూలు, గంధం, అమృతం, భక్ష్యం, అభక్ష్యం అన్నీ లోకంలో వుండేవే అయివున్నవి. అట్లానే అన్నిరకాలకృతులు లోకంలో వుంటుంటవి. యెవరాపగలరు? అయితే వీటితత్వ మిది? ఇది మంచి, ఇదిచెడ్డ అని నిర్ణయించి వివేకం చేయడం సాహిత్యంయొక్క పని.


అని శ్రీ.. ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో స్థిత్యధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

ఉద్దేశాధికరణం.

ఆక్షేపం

అవునయ్యా ఇవి ప్రాకృతులకోసం ఉద్దేశించినవి అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను; అప్పుడు మీమాంసేలేదు. ఉత్తమకవిత్వం మంటే కాదని క్షుద్రమని చెపుతున్నాను. అప్పుడు సయితంప్రాకృతులను ఆదశలొనే వుంచే యిట్లాటి పాటలకంటె వారు ఉత్తమదశను పొందడానికి అనుకూలించేరీతి కృతులు వారికెక్కువ ఉపయోగపడతవని వారి కివి ఉపకారంకంటె అపకారమే యెక్కువ చేస్తవని చెప్పుతున్నాను.

అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో ఉద్దేశాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

గీతాధికరణం.

అవునయ్యా; ఇప్పటివి పాడితే బాగుంటవి. ఇట్లా వెనకటివి పాట కనుకూలమైనవి గావంటారా? అది అసంబద్దం. (Lyre) లైరుమీద పాడడం గ్రీసుదేశంలో ఆదినవుండేది. తరవాతభావవేగంగల వాటినన్నిటినీ పాడినాపాడకున్నా లిరిక్సు అని కావ్యకోటిలో చేర్చారు. ఈ పాశ్చాత్యవిధాన మెట్లావున్నా పాటపాడడం కవితకు ముఖ్యం గాదు. అది పఠనమాత్రాననే రసాస్వాద జనకమవుతుంది. గతివిశేషాదులచేత లక్షితమైన పద్యంగానీ కవితకుపాట ముఖ్యంగాదు. పాట పాడడమే ముఖ్యమని ఒప్పుకుందాము. గీతాలు కందాలు మొదలైనవన్నీ పాటకనుకూలమైనవే అవివెనకటినుండే వున్నవి. వీటిలో కొత్తయేమీలేదు. రామాయణాన్ని రామలక్ష్మణులు పాడినారనే వాల్మీకిచెపుతున్నాడు. కనుక పాటవిశేషం దీంట్లో యేమీలేదు. నాటకపు పద్యాల నన్నిటినీ పాడుతూనే వున్నారు గదా. కాదుకూడదు పాడుతుంటే యిప్పటివి మనోహరంగా వుంటవంటారా? పాడితే యేది మనోహరంగా వుండదు? గరికెతో పచ్చడి చేసి గరికెపాటి అగ్రహారం సంపాదించారని మాప్రాంతాల్లో చెప్పుకుంటారు. అది తిరగమాతగింజల రుచిగాని గరికెదికాదు. పాడితే అన్నీ బాగావుంటవి. నన్నుచూడరా నన్నుచూడవే అని రాగం మీద రాగం వేసి పాటగాండ్లు పాడుతుంటే బాగానేవుంటుంది. ఆబాగు రాగానిదని అంటాము. పాడితే బాగు గనుక ఉత్తమకవిత్వంమనడం ఒప్పుకోమని తిరస్కరిస్తున్నాను.

అని శ్రీ..ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో గీతాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

భావనాధికరణం.

పూర్వపక్షం.

అవునయ్యా; మీరేదైనా అనండి. ఇప్పటిది రొమాంటికు, అంటే భావనాపటువైన, కవిత (Romantic Poetry). ఇది కొత్తది గనుక వెనకటి కవితకంటె చాలా మంచిది అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను. రొమాంటికు కవిత భారతవర్షానికి కొత్తగాదంటున్నాను. మనకూ ఆర్యావర్తానికీ గలసంబంధం గ్రీకు భిన్నులైన యూరోపునివాసులకూ గ్రీసుకూ గల సంబంధకంటె విలక్షణమైనది. బారత వర్షసాహిత్యవిజ్ఞానానికి గ్రీకులాటినుభాషల విషయాలకూ అనుచితసాదృశ్యం కల్పించుకొనడం. యూరోపుఖండ సాహిత్య చరిత్రను భారత వర్షానికి అవిచారితంగా తగిలించడం దాన్ని అప్రశస్తంగా అనుకరించడం అజ్ఞానం. భారతవర్షానికి రొమాంటికు కవిత (Romantic Poetry) కొత్తగాదన్నాను. ఇతిహాసదశ ననుసరించి మితార్ధంలో (Romantic Poetry) రొమాంటికు పొయట్రీ అనే మాటల నెట్లా అన్వయించినా బావనావృత్తితో ఉదాత్తభావప్రకర్షంగలది రొమాంటికు కవిత అని సాహిత్య వేత్తల అభిప్రాయం. ఈసంగతినే (Romantic movement in English Poetry) రొమాంటిక్ మూమెంట్ ఇన్ ఇంగ్లీష్ పొయట్రీ అనే గ్రంథంలో "The great poets of every age but the eighteenth have been romantic. What are Chaucer Shakespeare and Coleridge, if not romantic"

(అన్నికాలాల్లోను మహాకవులందరు రొమాంటికు కవులే అయివున్నారు. చాసరు, షేక్‌స్పియరు, కోల్రిడ్జిరొమాంటికు కవులుగాక మరెవరు?) అని

"What is really meant by all the phrases and by the name of the Romantic Movement, is simply reawakening to a sense of beauty and strangeness in natural things and in all the impulses of the mind and the senses"

ఈసమాసాలు రొమాంటికు మూమెంటు అనేపేరు వాస్తవంగా తెలిపేదేమంటే మనస్సుయొక్క తక్కిన యింద్రియాలయొక్క స్వభావగతుల్లోను ప్రకృతి సిద్ధపదార్థాల్లోను సౌందర్యాన్ని, వైలక్షణ్యాన్ని గోచరింప జేసే భావనావిస్తృతిని పొందించగల ప్రబోధం తప్పమరేమీగాదు". అని

"The quality which distinguishes the poetry of the beginning of the nineteenth century, the poetry which we roughly group together as the Romantic movement is the quality of its imagination and this quality is seen chiefly as a kind of atmosphere which adds strangeness to beauty."

"రొమాంటికు సరణి అనే పేరుగలిగి క్రీస్తు శకం 19-వ (కలి 50-వ) శతాబ్ది ప్రథశతాబ్ది ప్రథమభాగాన ఆకృతిపొందినకవితయొక్క విశేషలక్షణం దాని (ఉదాత్తభావాప్రకర్షరూపమైన), భావనాస్తృతి. సౌందర్యానికి వైలక్షణ్యమను సంధానం చేసే సంవిధానమే యీ విశేషంగా దృష్టమవుతున్నది" అని "That it may be affirmed that in studying this period , we are able to study whatever is essential in poetry"

ఈ తీరుగా ఈ కవితా ఘట్టాన్ని చదివేటప్పుడు ఇంగ్లీషు కవిత్వంలో ప్రధానమైనదంతా, అంటే కవితలో ప్రధానమైనదంతా చదువగలుగుతున్నామని స్పష్టంగా చెప్పవచ్చును) అరి ఆర్ధరు సైమన్సు (Arthur Symons) విశదం చేస్తున్నాడు. భావనా విభుత్వంతో విశిష్టమైన కవిత అంతా రొమాంటికు కవిత అని సాహిత్యవేత్తల అభిప్రాయమన్నాను. భారతవర్షకవితలో ఉదాత్త భావ ప్రకర్షరూపమైన భావనావిస్తృతి చిరకాలం నుండి సంగతమైవున్నది.

"కాచిత్ కవినా నవా దృష్టిః" (ధ్వ. న్యా)
"నూతనైర్వైచిత్ర్యైర్జగంత్యా సూత్రయంతి" (ద్వ. లో)

అని యిట్లా సౌందర్య విలక్షణ్యతత్పరత భారతీ సాహిత్యంలో ప్రాచీన కాలాన్నే విజ్ఞాత విషయం ఇక భావనా విస్తృతిని ఉద్‌బోధించే విశేషం భారత వర్ష ప్రకృతిలోనే వున్నది. అత్యున్నతంగా నభశ్చుంబి అయి నిల్చున్న హిమాలయం, రజత ప్రభలతో ఉదగ్రమై హృదయాలను అధిష్ఠించే కైలాస శృంగం, మానస సరస్సు, హిమగిరి ఉపత్యకలు. అధిత్యకలు, ప్రభూత శక్తితో భూమికి అవతరించే భాగీరథి ప్రభృతి మహానదులు నైమిశం, బదరీవనం, సాంద్రారణ్య పరివృతమైన వింధ్యాచలం, సీతాపావితమై న గోదావరి తీర భూములు ధర్మస్థిరమైన శ్రీరామచరణం చిహ్నితం చేసిన ఆశ్రమస్థలులు ఋషులు, తపస్సీమలు, శ్రీశైలం. భారత వర్ష కవికి సిద్ధోపదేష్టలై భావనా విభుత్వాన్ని ఉదాత్త భావ ప్రకర్షాన్ని ప్రసాదిస్తున్నవి. ఉతరరామ చరిత కంటె రొమాంటికు కవియెవ్వరు.? యూరోపు ఖండ సాహిత్య దృష్టి ప్రకారం వాల్మీకి ,వ్యాసుడు, భవభూతి ఇట్లాటి కవులందరు రొమాంటికు కవులే అయివున్నారు. అయితే వారి బావసరణులు వేరుగా వచ్చును. ఇట్లాటి యీ భేదాన్నే (Romantic Revolt) రొమాంటికు రివోల్టు అనే గ్రంథంలో "We are bound to admit that we apply the term "Romantic" to words worth in a sense very different from that in which we use it of Coleridge, in Rousseau or Herder in a sense very different from that in which we give to Chateaubriand or Burger or Tieck"

(రొమాంటికు అనే పదాన్ని వర్డ్సువర్తుకు వర్తింపజేసి దానికంటే భిన్నమైన అర్ధంలో కోలగిడ్జికి షెటూబ్రియాండు, బర్గరు టీకు అనే వారికి వర్తింపజేసే దానికంటే భిన్నమైన అర్ధంలో రూసో హార్డురులకు అన్వితం జేస్తున్నామని మన మొప్పుకొనక తప్పదు) అని చార్లెసు యెడ్వినువాహను (Charles Edwin Vaughan) వ్యక్తం చేస్తున్నాడు. రొమాంటికు-అంటే-ప్రకృష్ట భావనా పాటన విశిష్టమైన - కవిత భారత వర్షానికి కొత్తగాదని ఉత్తర రామచరిత్ర కర్తృ ప్రభృతులు రొమాంటికు కవులని విశదపరచాను. అయితే కలిశకం 49- వ శతాబ్ది (క్రీస్తుశకం 18-వ శతాబ్ది) ప్రథమ భాగంలో యూరపు దేశాల్లో కావ్య రచనయందేర్పడ్డ భావజాడ్యం అక్కడ తిరస్కార్యమైనట్లు నన్నయాదుల భారతాభాసాలు మొదలైనవాటిలో ఆరంభించి రాను రాను వికృతరూపం పొంది తెలుగుకృతుల నావరించి వున్న బావజాడ్యం వాస్తవంగా త్యాజ్యమేను. ఆంధ్ర జాతియొక్క సర్వేతిహాసంతో ఈ భావజాడ్యం సంబద్దమైవున్నది.

దీన్ని వాఙ్మయసూత్రంలో ప్రధమ ద్వితీయ ఖండాల్లో విశదంచేశాను. తెలుగు దేశపు ఆ భావజాడ్యం తిరస్కార్యమైతే యిప్పటికృతుల్లో వున్న చిల్లర శృంగారం పులుముడు శబ్దవాచ్యత అయోమయం దృష్టి సంకోచం, ఊగుడు మాటలు మొదలైన కల్మషం అంతకంటే నూరు రెట్లక్కువగా తిరస్కార్యమంటున్నాను. యూరోపు ఖండ సాహిత్య చరిత్ర భారత వర్ష సాహిత్య చరిత్ర అనుకొని భారత వర్షపు సాహిత్యానికి అంధులై చిల్లర శృంగారం పులుముడు అయోమయం మొదలైన వాటి పాలుగావడం అజ్ఞానం. భావనావిభుత్వంతో ఉదాత్త భావ ప్రకర్ష రూపమైన రొమాంటికు కవిత భారత వర్ష సాహిత్యంలో చిరకాలం నుండి ప్రతిష్టమై వున్నదని తెలిపినాను. వాచ్యరమణీయతా ప్రకారమైన యీ రొమాంటికు కవిత భారత వర్ష దృష్టి ప్రకారం సాధారణంగా కొంచె మెచ్చుతక్కువగా భారత వర్ష సాహిత్యంలో గుణీభూత వ్యంగ్య కోటిలో చేరుతున్నది. కాళిదాసాదుల్లో గుణీభూత వ్యంగ్య దశ గూడా గడచి సత్వోన్నతి గల వ్యంగ్య దశగూడా గుణీభూత వ్యంగ్యం కంటే పరిణతమైనది. కవితకు భారతవర్షసాహిత్యంలో చిరకాలం కిందటనే వర్తించగలిగింది. కవితా దశలు జాతుల సంప్రదాయాలతో సంబద్ధమయ్యే వున్నవి.

సత్వశ్రేయః పరమత్వాన్ని అనుభవించగలిగిన భారతవర్షం కవితలో తదను రూపమైన వ్యంగ్యదశను దర్శించగలిగింది. యూరోపు ఖండం యొక్క యేసంప్రదాయాల పరివర్తనం వల్ల కవితకు ప్రస్పుటంగా యీ దశా పరిణామం సిద్ధిస్తుంది? అనే విచారణ నాకిక్కడ అప్రసక్తం యూరోపు ఖండ సాహిత్య ప్రశంస యింతటితో వదులుతున్నాను.

అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖర కృతిలో వాఙ్మయ సూత్ర

పరిశిష్టంలో భావనాధికరణ సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయ పరిశిష్టభాష్యం

ఉపోద్ఘాతాధికరణం

పూర్వపక్షం

అవునయ్యా. యెంకిపాటలను కృష్ణపక్షాన్ని, యేకాంతసేవ మొదలైనవాటిని వాటి ఉపోద్ఘాతకర్తలు ప్రశంసించారు. కనుక అవి ప్రశస్తమైనవి అని అంటారా?

తటస్థాక్షేపం

ఈ తీరుగా విదితమవుతున్నది. ఈ ఉపోద్ఘాతాలే అప్రశస్తాలు. విషయ విమర్శం చేసే ఉపోద్ఘాతాలు కూడవని కాదు. కాని యివి వేరు మార్గపువి అయివున్నవి. కనుక అప్రశస్తాలన్నాను. ఆ సంగతి వివరిస్తాను. పూర్వ కాలంలో కొందరు కృతివ్రాస్తే రాజులను ఆశ్రయించి ధనం సంపాదించే వాండ్లు. ఈ కాలపు కృతికర్తలు ఉపోద్ఘాత కర్తలను ఆశ్రయించి కీర్తి సంపాదించ యత్నిస్తున్నారు. దీంట్లో ఒక రిజుట్లోగుండా ఒకరు వెళ్ళిపోతున్నారు. ఒకరు రామలింగారెడ్ది వారిచేత వ్రాయిస్తే మరియొకరు నల్లవాండ్ల కంటే తెల్లవాండ్లైతే బాగుంటుందని పెద్ద యెత్తెత్తి అడివి బాపిరాజు ప్రభృతులవలె తెల్లవారిచేత వ్రాయిస్తున్నారు. కృతికర్తలు పొగడడం నిర్వివాదం యెంకి పాటల కర్తమటుకు యెంకిపాటల కర్త వరుసగా తన పాటలు మొదలు విన్నవారిని, బుజాలు తట్టిన వారిని, తనను పొగడిన అనసూయ, సుజనరంజని, జ్యోతి, సాహితి యీ పత్రికల ప్రవర్తకులను శారదను వరసగా నమస్కారాల పాటతో కీర్తించాడు. పాటలు విన్న శ్రీ శ్రీ శ్రీ రాజా వెంకటాద్రి అప్పారావు బహద్దరు గారి వంశం ఆ చంద్ర తారార్కం నిలవవలెనని ప్రార్థించాడు. అభినవాంధ్ర కవి మండలికి తనను గౌరవించినందుకు ఆంధ్ర పండిత మండలికి యొక్కువేశాడు. ఇక ఉపోద్ఘాత రచయితకు నమస్కారాలు ఆగవలసినది లేదుగదా. అన్నిటికంటే చిత్రం తపాలా పెట్టె 110 నెంబరు గల జి.యన్. శాస్త్రి అండు కంపెని అనే కంపెని యజమానులను శ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రివారిని "తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలగు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రులు గారు తమకు తామై కోరి" అని వ్రాసి చివరన కృతజ్ఞతా సమర్పణం చేశాడు. వీరు తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలౌనా కాదా? అని నా విచారణగాదు. అట్లాటి శాస్త్రవేత్తలైతే సంతోషమే. మన దేశంలో యెందరు తర్క వ్యాకరణ వేత్తలుంటే అంత శ్రేయస్సుగదా. కాని యీ పాటలు అచ్చు వేయించడానికీ తర్క వ్యాకరణ శాస్త్రాలకూ యేమీ సంబంధం లేదు. తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలు గూడా ఈ పాటలను మెచ్చుకొన్నారు అని తనను తాను పొగడు కొనడం ఉద్దేశంగా కనబడుతున్నది. అదే నిజమయితే ఆ వుద్దేశ్యం వ్యర్ధం. యెందుకంటే కావ్య సౌందర్యం తర్కానికి గాని వ్యాకరణానికి గాని సంబంధించింది గాదు అందుకే

"నైనం వ్యాకరణజ్ఞమేతి పితరం న భ్రాతరం తార్కికం."

(కావ్యకన్య తండ్రి అని వైయాకరణుడ్నీ అన్నయ్య అని తార్కికుణ్నీ సమీపించదు)అని బిల్హణుడన్నాడు.

"శబ్దార్థ శాసనజ్ఞాన మత్రేణైవ న వేద్యతే
 వేద్యతే సహి కావ్యార్థతత్వజ్ఞై రేవ కేవలం"

(వ్యాకరణం, తర్కం, చదివితే కావ్య జీవిత స్వరూపం తెలియదు. అయితే కావ్యార్థ తత్వజ్ఞులే దాన్ని కనుగోగలరు) అని ఆనంద వర్ధనుడు చెప్పుతున్నాడు. కాని యీ ఔచిత్య జ్ఞానమంతా కోల్పోయి తన సంతోషాన్ని పట్టలేక తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలు అని పొగడినారు. ఈ తీరుగా యిస్తివాయినం పుచ్చుకొంటి వాయినం అని కృతికర్తలు పొగిడి కొన్ని స్థలాల్లో ఆశ్రయించి తమను పొగిడించుకుంటున్నారు. ఆశ్రయించిన కృతికర్తలను ఉపోద్ఘాతకర్తలు శ్లాఘిస్తున్నారు. లేదా ఆశ్రయించిన దోషానికి వారికండ్ల నీళ్ళు తుడవవలెనని వారిని కొనియాడుతున్నారు. ఈ ఉపోద్ఘాతకర్తలు కృతికర్తల పేరుతో పాటు మా పేరు గూడా కష్టం లేకుండా వ్యాప్తిలోకి వస్తుందని ఉపోద్ఘాతం వ్రాయడమే గొప్ప అనుకొని భువన మోహనలు విశ్వమోహనలు వేసి వ్రాస్తున్నారు. వీరు పొగడడంలో ఒక రిజుట్లో నుంచి ఒకరు వెళ్ళిపోతున్నారు. యెంకి పాటలు ఉపోద్ఘాతకర్త

"కవితా కల్ప ప్రసూనమునందలి"
"కవితాకల్ప ప్రసూన విషయము"
"తేనె వాకలనూరించు"
"దివ్య ప్రసూన రాజములుగాని"
"అమృత ఘటికలు"
"పుష్పరాజములు"
"దివ్య సౌరభ సురభితములై"
"లాలిత్య సౌకుమార్య సౌరభ్యములను వెదజల్లుమంజరులను"
"దివ్య మహిమా విలసితములు. పరిణతీ విలసితములు"

అని శబ్దవాచ్యతాదోషానికి పాలై

"దివ్యమహిమా విలసితములు. పరిణతీ విలసితములు"

అని తప్పులు కూడా వ్రాసి పుష్పాలను వెదజల్లడమే కాకుండా

"ఈ విధములగు దివ్య ప్రసూనముల నర్పించి మనల నానందసాగరమున నోలలాడించుటయును చూడగలిగిన ననుబోటుల జీవితములు ధన్యములు ధన్యములు" అని పొగడ్తలో చివరి మెట్టెక్కినాడు. కావ్యకుసుమావళి ముఖబంధ కర్తయిన్ని మాటలెందుకు "This is the age of Venkataparvatheeswara Kavulu" ఇది వేంకట పార్వతీశ్వర కవుల సమయం అని యీ కాలాన్నే వేంకటపార్వతీశ్వర కవుల వశంచేశాడు. ఇక యేకాంతసేవ ఉపోద్ఘాతకర్త

"నూతనాంధ్ర సారస్వతములో నిట్టి కావ్యము వేఱొక్కటి లేదని నానమ్మకం" అని అన్నాడు.

"శ్రీనాథుని యఖండ చమత్కృతియే యీ కవి కూడా కలిగి యుండెనని తలచెద."

అని బాపిరాజు తొలకరి పీఠిక వ్రాసిన కూల్ట్రేవారు అన్నారు.

"గుణముననింతకంటే శ్రేష్ఠమైన కృతులు మన భాషలో పెక్కులు లేవు. ఈ మహనీయసృష్టిప్రభావమునకును ప్రకాశమునకును జేరినవారిలో నీ కవులు ముఖ్యముగా గణనీయులు.

ఆర్యాంగ్లేయాది వాఙ్మయముల సారములబీల్చి" అని లక్ష్మీకాంత తొలకరి ఉపొద్ఘాతకర్త రామలింగారెడ్డి వారు పొగడుతున్నారు. కనుక ఇట్లా ఆశ్రయించి పొగిడించుకొన్న పీఠికలు, పీఠికలు వ్రాయుడమనే గొప్పపదవి దొరికింది యింతే చాలునని పీఠికాకర్తలు వ్రాసే పొగడ్తలు విచారించదగ్గవి కావు. గనుక ఈ పీఠికలు అవిచార్యమంటున్నాను. మమ్మిక పొగడుతారు గదా అని కృతికర్తలు పీఠిక వ్రాయడమనే అపూర్వ గౌరవం యిచ్చినందుకు ప్రత్యుపకారంగా స్తుతి చేయవలెనని పీఠికాకర్తలు మీరు పెద్దలంటే మీరు పెద్దలని అన్యోన్యగౌరవము ప్రకటించుకున్న యీ ప్రశంసలు విచార్యం గావు.

కృతికర్తలు ఉపోద్ఘాతకర్తలను ఆశ్రయించి స్తుతిస్తే కృతికర్తల కంటే యెక్కువగా ఉపోద్ఘాతకర్తలు దివ్యలు మధురలు ఆనందలు వేసి పొగడుతున్నారు. ఇవి పాటించదగ్గవి కావంటే

సమాధానం

తెలుపుతున్నాను; పూర్వపక్షానికి తటస్థాక్షేపానికి కలిపి ప్రతివచనం చెప్పుతాను. కృతికర్తలందరు ఉపోద్ఘాతకర్తలను ఆశ్రయించారో లేదో పొగిడినారో లేదో చెప్పలేదు. చాలామంది కృతికర్తలు ఉపోద్ఘాతకర్తలను ఆశ్రయించడం నేనెరుగుదును. కొన్ని సంవత్సరాల క్రిందట ఒక కృతికర్త పీఠిక వ్రాయమని నన్ను ప్రార్థించి చాలా పర్యాయాలు నన్ను కలుసుకొని నాకు పుస్తకం యిచ్చాడు. నేను మీకు పనికి వచ్చే పీఠిక వ్రాయలేనని ఆ పుస్తకం చదివి చెప్పినాను. తరువాత కొన్నాళ్లకు ఆ పుస్తకం ఒక ప్రసిద్ధుడి ఉపోద్ఘాతంతో ప్రశంసలతో బయటికి వచ్చింది. ఒక పెద్ద పద్య గ్రంథాన్ని ఆంధ్రీకరించిన పండితుడు ఉపోద్ఘాతం వ్రాయమని నన్ను కోరినాడు. నేను గుణదోష విచారణలు రెండూ చేస్తాను మీ పుస్తకం పంపండి అన్నాను. నాకా పుస్తకం ఆయన పంపలేదు.

నాతో అదివరకు పరిచయం లేని మరివొకరు మా యింటికి వచ్చి అచ్చుపడని తన పుస్తకాన్ని గురించి కొన్ని పంక్తులు వ్రాసియియ్యమని కోరినాడు. తన పుస్తకంలో కొంత వినిపించాడు. ఆ పుస్తకం యొక్క అనావశ్యకత, అనౌచిత్యం, తెలపగా ఆయన ఉపోద్ఘాత విషయకమైన తన కోరికను ఉపసంహరించుకొని పోయినాడు.

ఈ మధ్య కొందరు కృతికర్తలు తన పుస్తకాలను అట్టలు కట్టని వాటిని పంపి ముద్రాలయంలో నుండి యింకా బైటికి రాలేదు. మీ పీఠిక వచ్చేదాకా అట్టకట్టించకుండా వుంటాము. కనుక సాధ్యమైనంత త్వరలో వ్రాసి పంపవలెనని కోరినారు.

"నాపీఠిక మీ ఉద్దేశాలను అనుసరించి వుడవను కొంటాను. కావలెనంటే వ్రాసి పంపుతాను. నాకు వ్యవధి కావలెను." అని ప్రతివచనం వ్రాశాను. వారు మళ్ళీ ఉపోద్ఘాత ప్రస్తావనతో ఉత్తరం వ్రాయలేదు; ఈ తీరుగా పీఠికల కోసం కృతికర్తలు ఆశ్రయించడం సాధారణమైన పనిగా వున్నది. అయితే యెంకిపాటలు యేకాంత సేవ మొదలైన వాటికి ఉపోద్ఘాతాలు ఆశ్రయించి స్తుతించి వ్రాయించినవో కావో నాకు తెలియదు. వారే కారణం చేత వ్రాసినా వారు వ్రాసిన వ్రాతలకు నేను బాధ్యుణ్ణి గాను. సర్వాదేశాలకు సర్వకాలాలకు అన్వయించే సత్యాలతో గర్భితమైన భారతీయ సాహిత్య విచారణలను విశదపరచి నా నిర్ణయాలను తెలిపినాను. అవి అసత్యమని యెవరైనా వాదిస్తే వాటికి సమాధానం వుంటే చెప్పుతాను; లేదా నా మాటలు అసత్యమని ఒప్పుకొని వారి వాక్యాలను వినయంతో శిరసావహిస్తాను. అని మాత్రం మనవి చేస్తున్నాను.

అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖర కృతిలో వాఙ్మయ సూత్ర

పరిశిష్టంలో ఉపోద్ఘాతాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయ పరిశిష్ట భాష్యం

దోషసామ్యాధికరణం

అవునయ్యా. బంగాళీల్లో, పాశ్చాత్యుల్లో ఇట్లాటివి వున్నవి. వాటిని చూసి మీరు వ్రాశారేమో బంగాళీలో ఇంగిలీషులో వుంటే అవి మంచివి కదా వాటిని చూసి వ్రాసినవి గూడామంచివే కావలెను అని అంటారా! చెప్పుతున్నాను అవును వాటిని చూచి మీరు కొన్ని వ్రాసి వుండవచ్చును.

మనదేశంలో పేరు చెప్పకుండా యితరుల అభిప్రాయాలను వాక్యసంచయాలను రచనలను తాము వ్రాసినట్లు వ్రాసి ఆత్మవంచనా లోకవంచనా చేయడం తరుచుగా కనబడుతున్నది. దానికి ఉదాహరణ చూపుతాను. గొల్లపూడి శ్రీరామశాస్త్రిగారు రసవిచారమని భారతి సంచిక 3 సం 1 లో ఒక వ్యాసం వ్రాస్తూ

ఇక నాట్యమునందు శాంతమునకు స్థానము లేదనువారి మతమును గురించి చర్చించెదము గాక. భారతాదులు శాంతమునకు స్థాయి భావనిరూపణ మొనరింపలేదు. కనుక శాంతమును రసములలో పరిగణించుటకు వీలులేదని కారణము చెప్పుటకు వలను పడదు. ఆయన నిర్వేదము శాంతమునకు స్థాయియని నుడివియున్నాడు. నాట్యమునందెనిమిదిరసములని చెప్పిన మమ్మటాచార్యుడును

"నిర్వేదస్యామంగళప్రాయస్య ప్రథమమనుపాదేయ
 త్వే౭పి ఉపాదానం వ్యభిచారిత్వే౭పి స్థాయిత్వాఃభిధా
 నార్థంతేన నిర్వేదస్థాయిభావః శాంతోపి నవమోస్తి రసః

అని వచించియున్నాడు. పోనీ శాంతమునకు విభావాది సామగ్రి గలదా అని యందురా? కలదు. వైరాగ్యపరమేశ్వరాను గ్రహసత్పురుష సేవాదులు విభావములు యమనియమాదులను భావములు. మతిస్మృతి చింతాధృతి వితర్కాదులు సంచారి భావములు అయినను సర్వజనా దరణీయము కాకపోవుటచే నశ్లాఘ్యమందురా? రాగద్వేష కలుషితాంతః కరణులగు వారికి రుచింపకపోయినను వీతరాగులకు ప్రేమాస్పదమే గదా. రాగద్వేష కలుషితులకు రుచింపమి హేతువు నంగీకరించెదమేని శృంగారము వీతరాగులకు రుచింపక పోవుటచే నద్దానికిని ఆంక్ష అనివార్యమే అగును. కనుక రసములు తొమ్మిదని స్పష్టపడుతున్నది. ఈ శాంతరసము శ్రవ్యమునందు అంగీకరింపబడినను అభినేయమగు నాట్యమున నిషిద్దమే కదా అను నాక్షేపమునకు సమాధానము మిగిలివున్నది. ఇద్దానికి జగన్నాధపండితులు చెప్పిన జబాబెంతయు శ్లాఘాపాత్రమగుట దాని నిట వివరించెదగాక"

అని వ్రాశారు. "తొమ్మిదని స్పష్టపడుచున్నది" అనే వరకు వీరు ఆ క్షేపాలకన్నిటికి స్వయంగా సమాధానాలు చెప్పినట్లు, చివరదానికి జగన్నాధుడి జవాబును చెప్పబోతున్నట్లు. ఇదంతా ఈ వ్యాసకర్తే వ్రాసినట్లు మనకు ఈమాటల వలన బోధపడుతున్నది. కాని సత్యం విచారించగా పై ఆక్షేపాలు వికల్పించుకొన్నది గాని వాటికి సమాధానం చెప్పింది గాని, వీరు గాదని స్పష్టపడుచున్నది. రత్నాపణంలో కుమారస్వామి సోమయాజి ఆ ఆక్షేపాలను వికల్పించుకొని సమాధానం చెప్పినాడు.

"నాద్యః నిర్వేద ఏవ" శాంతస్యస్థాయి భావ ఇతి మునినాంగీ
 కృతత్వాత్, తచ్చానేక రససాధారణస్య వ్యభిచారిణః సహతోపి
 అమంగళ ప్రాయత్వేపి సజాతీయాగ్రగణ్యత్వం ప్రాధాన్యేన
 కంచి ద్రసవిశేషం ప్రతి అసాధారణస్థాయిత్వం బోధయితు
 మితి ప్రతిపాదనాత్ తదుక్తం కావ్యప్రకాశే నిర్వేదస్యా

మంగళ ప్రాయస్య ప్రథమ మనుపాదేయత్వే ప్యుపాదానం

                                                

వ్యభిచారి


త్వేపి స్థాయిత్వాభిధానార్థం తేనానిర్వేద స్థాయిభావః శాంతోపి నవమోస్తి రస ఇతి. సద్వితీయః వైరాగ్యాదిసామగ్ర్యాః సులభత్వాత్. తథాహి. వైరాగ్య పరమేశ్వరానుగ్రహ ప్రాచీన కుశల పరిపాకసత్పురుష సేవా వేదాంత విచారాదయో విభావాః యమ నియమాదయోనుభావాః మతిస్మృతి చింతా ధృతివితర్కాదయో వ్యభిచారిణః సతృతీయః రాగద్వేషకలుషితాంతఃకరణా నామచర్వణీయత్వేన అశ్లాఘ్యత్వేపి వీతరాగాణాం తదభావాత్ యది కతిపయాశ్లఘ్యత్వమాత్రేణ రసత్వాత్ ప్రచ్యవేత్త ర్హి వీతారాగాణామశ్లాఘ్య ఇతి శృంగారోపి ప్రచ్యవతా తస్మాన్నవైవ రసా ఇతి సిద్ధం (రత్నా)

అని కుమారస్వామి సోమయాజి రత్నాపణంలో వివరించాడు.

ఈ పంక్తులనే శ్రీ రామశాస్త్రివారు తనవిగా భారతిలో వ్రాశారు. ఇక వీరు ఈ కాలపు వారి రచనలను దొంగిలించి ఈ వ్యాసాన చేర్చిన అంశాలు తెలపడం అనవసరం గనుక ఇంతటితో వదలుతున్నాను.

చివరకు పత్రికల్లో వేసే హస్యాలు కూడా పేరు చెప్పకుండా ఇతరులవి స్వీకరించి తమవిగా వంచన చేస్తున్నారు. "ఆంధ్రపత్రికకు ప్రత్యేకం" అనే శీర్షిక కింద మూడు తమాషాలు కనబడినవని ఆనాడే వెలువడిన తెలగ పత్రికలో యీ తమాషాలే కనబడ్డవి. తమాషాకర్తలు తమాషాల మాతృకలను పేర్కొందురుగాక అని శ్రీ మల్లాది వేంకటకృష్ణశర్మ వారు కలిశకం 5028 మార్గశీర్ష శుద్ధ సప్తమి గురువారం (క్రీ.శ. 1927 డిసెంబరు 1-వ తేది) త్రిలింగ పత్రికలో వ్రాసినదాన్ని చదివినాను. ఇట్లా చిల్లర వ్యాసాలు వద్ద నుండి విషయ ప్రధానమై విచారణల దాకా అనేకులు ఇతరుల వాటిని దొంగిలించి పేర్లు చెప్పకుండా తమదైనట్లు ప్రకటించుకొంటున్నారు. పత్రిక వ్యాసాల్లోనే గాక సాధారణ పద్య కృతుల్లోను, గద్యకృతుల్లోను ఇతిహాసాల్లోను ఈ పని విపులంగా కనబడుతున్నది.

"దుష్టకీర్తనకాంతార దూరగమన
 పాంసుల యగువాక్కు పరిశుభ్రపఱతు నిక
 హరి కథాలాపగంగ రంగమ్మతల్లి
 హేమకల్పకవల్లి సాధ్విమతల్లి"

అని జీవయాత్రలో శ్రీ కంచనపల్లి కనకమ్మవారు తన పద్యంగా వ్రాశారు.

"అసత్కీర్తనకాంతార పరివర్తనపాంసులాం
 వాచం శౌరి కథాలాపగంగయైవ పునీమహే."

అని శ్రీ భాగవతకర్త వ్రాసిన దాన్నే యీమె తనదిగా వ్రాసుకొన్నది. ఆంధ్రుల్లో చాలాకాలం నుండి వున్న యీ పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకొనే పాడు ఆచారం నేటి కాలానా విస్తరించింది. తక్కినవాటిని విస్తర భీతి చేత యిక్కడ ఉదాహరించక వదలుతున్నాను.

సంప్రదాయావిచ్ఛేదానికి విద్యానాథాదుల వంటివారు స్వీకరించిన ప్రసిద్ధ శాస్త్రపంక్తుల విచారణ యిక్కడ ప్రసక్తించదు. ఆ శాస్త్ర గ్రంథాల్లో సయితం సాధారణంగా "ఇతి భాష్యకారః, ఇతివృత్తికార, లోచనకారైరుక్తం తదుక్తందండినా" అని యిట్లా తాము స్వీకరించిన వాటి కర్తలను తెలుపుతూనే వచ్చారు. సూత్రకర్తలు సయితం ఇతరుల అభిప్రాయాలను తెలిపినప్పుడు వారి పేర్లు ఉదాహరిస్తూ వచ్చారు. రఘువంశానికి అన్వయబోధిని వ్రాసిన శారదారంజన రాయలవారు.

"ఇంద్రో వహ్నిః పితృపతి ర్నైఋతిర్వరుణోనిలః
 ధనదః శంకరశ్చైవ లోకపాలాః పురాతనాః"

అనే అగ్ని పురాణశ్లోకాన్ని "అథనయనసముత్థం" అనే శ్లోకం కింద ఉదాహరిస్తూ రాధాకాంతులవారు కల్పద్రుమంలో ఉదాహరించినదాన్ని స్వీకరించానని తెలిపినారు. అగ్నిపురాణంలో దీన్ని శారదారంజనుడు తానే చూసినట్లు ఉదాహరించలేక కాదు. రాధాకాంతు డుదాహరించినది చూసి ఉదాహరించాడు గనుక అట్లా తెలిపి విద్యాకృషి గౌరవం కనబరచాడు. ఇక ప్రకృతానికి వస్తాను.

ఉక్తవిధాన ఇతరుల నుండి రచనలను గ్రహించి వారి పేరు చెప్పకుండా తాము వ్రాసినట్లు ప్రకటించి ఆత్మవంచన లోకవంచన చేయడం మనదేశంలో చిరకాలం కిందనే ఆరబ్దమయి యిప్పుడు మితిమీరి పోయించి. ఇట్లా యిప్పుడు దొంగిలించి అసలు వారిపేరు చెప్పకుండా వ్రాసిన రచనలను రచనైక దేశ-----, తెలియక పోవడం చేత పత్రికల ప్రవర్తకులు కృతిపతులు ఆ వ్రాతలను అట్లానే ప్రకటిస్తున్నారు. అవి కృతికర్తలవనుకొంటున్నారు. ఆర్జవం, సత్య పరాయణత వదలి పరిణతి లేని రచయితల భారతీయ సాహిత్యతత్వానికి అంధులైన పద్యకర్తలు స్వకీయ విచారణలేని వ్యాఖ్యాతలు అనేకులు ఈ తీరుగా బయలుదేరి దేశాన్ని దేశం యొక్క విజ్ఞాన వికాసాన్ని వంచిస్తున్నారు. కొందరు హీందీలో యేదో చూసి ఇది వకకొత్తగా వుంటుందని దీనితో మనం కొంత పేరు సంపాదించవచ్చునని దాన్ని పత్రికలో వేసి సంతొషిస్తున్నారు. బంగాళీలో యేదో చూసి దీనితో కొంతపేరు పొందవచ్చునని దాన్ని పత్రికల్లో పడుతున్నదని నాకు కీర్తి వస్తున్నదని యెవరి బులుపు వారు తీర్చుకొంటున్నారు. గాని అందువల్ల దేశానికి దేశీయులకు దేశ విజ్ఞానానికి జరిగే వంచన తెలిసికొనడం లేదు.

పూర్వపక్షం

అవునయ్యా ,ఇతరులవి యెత్తి వ్రాసుకొంటే యెవరికేమీ హానీ లేదు అది నింద్యంగాదంటే.

సమాధానం

చెప్పుతున్నాను స్వకీయపరిపాక బలం చేత, కృషివశాన, కొన్ని భావాలు, అంశాలు కొందరు పరిణతచిత్తులు ప్రకటిస్తారు. వాటినితరులు యెత్తి వ్రాసుకొనేటప్పుడు వారి పేరు చెప్పడం, చిత్తపరిపాకాన్ని కృషిని గౌరవించడమే కాక విజ్ఞాన ప్రవృద్ధికి హేతువు కూడా అవుతున్నది. అవి వీరిభావాలు, ఇవి వీరు కనుగొన్న అంశాలు, లోకకల్యాణానికి విద్యా వర్థనానికి అనుకూలమైన భావాలను, అంశాలను నేను కొన్నిటిని ప్రకటింతును గాక! అని చోదన కలగగలదు. ఇట్లాటి నూతనాంశాలను కనుగొనడం, భావాలను ప్రసాదించడం విద్వద్గోష్టులో విద్యాభ్యాసం చేసి ధ్యానబలం సమకూర్చుకొన్న పిమ్మటగాని జరగదు. ఈ తీరుగా ఉత్తమ విద్యావ్యాప్తి, నూతనాంశాలు, భావాల ఉపలబ్ది మనకు ప్రాప్తించగలవు. యేమీ లేక పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకోవడం వల్ల చిత్త పరిపాకాన్ని, కృషిని అగౌరవించడమే కాకుండా, నూతనాంశాలు, బావాలు ప్రసాదించే శక్తి జాతికి నశించి విజ్ఞానకృషికుంఠితమై యెత్తి వ్రాసుకొనే దశతోనే అది సమాప్త మవుతున్నది. పేరు చెప్పకుండా యెత్తివ్రాసుకొనడమే విద్య అనుకొనడం వల్ల విద్యావంచన సంభవిస్తున్నది. ఈ తీరుగా విద్యాజాడ్యం తనది కానిది అనడం వల్ల లోక వంచన ఆత్మవంచన ఆపతితమవుతున్నవి.

అంతేకాక భారతీయులము ఆర్యులమైన మనము ఆంధ్రులము స్వకీయమైన భారతీయ సంస్కారం యొక్క మహిమను యెంతవరకు దర్శించాము? ఈ తీరుగా హిందీ, బంగాళీ మరాటీ మనకెన్నాళ్లు శరణ్యం? ఇట్లా అక్కడా యిక్కడా యేదో అపహరించి విద్యాజాడ్యంతో యెన్నాళ్ళు సంచరిస్తాము? భారతీయ విజ్ఞానోన్మేషోద్యమంలో ఇతరుల అంటే బంగాళీలు మరాటీలు మొదలైనవరి యొక్క కృషి ఫలాన్ని పిరికిగా సంగ్రహిస్తుండడం తప్ప ఆ ఉద్యమంలో మనము కార్యకర్తలుగా నిల్వవలసిన యోగ్యత మనకు అవసరం గాదా? అని మనను మనము పరిశోధించుకొనడం ఆవశ్యకమని మనవి చేస్తున్నాను. ఇతర భాషల్లో ఉపాదేయ గ్రంథాలుంటే తర్జుమా చేసి వాఙ్మయాన్ని సంపన్నం చేయవచ్చును. కాని ఆ గ్రంథ కర్తల పేరు చెప్పుకుండా, వాటిని యెత్తి వ్రాసి ప్రకటించడం, అదేవిద్య అనుకొనడం ఆత్మవంచన, విజ్ఞానవంచన, లోకశ్రేయోవంచన అవుతున్నవి.

ఇంతకూ చెప్పదలచిందేమంటే యితరుల రచనలను చూసి పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకొన్నవి అనేకం వున్నవి. నేనిప్పుడు విచారిస్తున్న వనకుమారి, యేకాంతసేవ, యెంకిపాటలు మొదలైనవి పాశ్చాత్యులనుండి బంగాళీల నుండి పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకొన్నవాట్లో అనుకరించినవాట్లో చేరినా చేరకున్నా వాటి అనౌచిత్యాలు, అనౌచిత్యాలు కాకపోవు. పులుముడు, శబ్దవాచ్యత, అయోమయత్వం, అసంబద్ధత, అనుచిత చ్చందస్సు, వికృతభాష, పాత్ర సృష్ట్య భావం చేత ఆత్మ నాయకత్వం చేత కలిగే దృష్టి సంకోచం. చిల్లర శృంగార, క్షుద్రత్వం యివి యెక్కడవున్నా పాశ్చత్యుల్లో వున్నా బంగాళీలలో వున్నా దోషాలేనంటున్నాను. దొషసామ్యమే నంటున్నాను. ఇవి పాశ్చాత్యులకృతుల్లోగాని బంగాళీ కృతుల్లోగాని మరెక్కడనైనా గాని వున్నట్లు మీకు కనబడితే అక్కడక్కడల్లా నా విచారణలు వినిపించవలెనని ప్రార్థిస్తున్నాను. దోషాలెక్కడ వున్నా అవి సిద్ధాంతాలసత్యాన్ని బాధించవు.

అని శ్రీ. ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో దోష సామ్యాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం

చిహ్నాధికరణం

పూర్వపక్షం.

అవునయ్యా. నేడు రవీంద్రుడు, మహాత్ముడు, ఇట్లాటి గొప్పవారు ఉద్భవించారు. ఉచ్చదశ మళ్లీవచ్చేటట్లుకనబడుతున్నది. అట్లానే ఆంధ్రదేశంలోగూడా ఈకొత్త పద్యకర్తలు, శుభచిహ్మమని యెందుకనుకోగూడదు అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను ఆదేశాలమాట నేను చెప్పను. అక్కడి విశ్వవిద్యాలయాల విధానంలో భారతీయసంస్కారం ఇట్లా హీనంగా లేదు. ఆంధ్రదేశంలో అట్లాటి శుభచిహ్నాలకు అవకాశం లేదు. ఇక ముందు కలుగుతుందేమో చెప్పలేను. ఆంధ్రదేశంలో చిరకాలం కిందటనే భారతీయసంస్కారం క్షీణించింది. నన్నయాదులు మనకు ఇచ్చిన భారతాదులు సయితం స్వరూపం గోల్పోయిన వికారాలు నన్నయాదుల భారతం, భాస్కరాదుల రామాయణం భారతరామాయణాల శుష్కాకృతులుగాని భారతరామాయణాలు గావు. ప్రాచీన గ్రంథాల్లో యేపురాణమూ మనకు యథార్థస్వరూపంతో లభించలేదు. నన్నయ తిక్కన యెఱ్ఱాప్రగడ రచించిన భారతకథల సంగ్రహం మూల మహాభారతంయెదుట "అనంతరత్నప్రభవమైన" హిమాలయం ముందు చిల్లరరాళ్ల గుట్టవలె వున్నది.

శ్రీ ఆనందముద్రాలయంవారు ప్రకటించిన శ్రీతేవపెరుమాళ్లయ్య కృతి రామాయణం ఆమూలవాక్యాలతో అక్కడక్కడ కూడివున్నా మూలంయొక్క యథార్థస్వరూపాన్ని చాలామట్టుకు చూపుతున్నది. ఇట్లాటివి స్వల్పసంఖ్యాకాలు మాత్రమే మూలంయొక్క యథార్థ స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నవి. గ్రంథాల యథార్థస్వరూపం దర్శించినప్పుడే వాటిని మనము చదివినవారు మవుతున్నాము. నన్నయాదులు భారతం చదివినామంటామా? మనము భారతం చదవనివారమే అవుతున్నాము. భాస్కరరాదుల రామాయణం చదివెనామంటామా? మనకురామాయణ స్వరూపం గోచరించనిదే అవుతున్నది. ఇక భారతీయ కావ్యకోటిలో అధమాలనదగిన మనువసుచరిత్రాదులచేత కావ్యవిషయాన ఆంధ్రదేశం వంచితమై నేటికి ఆంధ్రదేశం కథాసంగ్రహాల అధమ కావ్యాలదశను దాటలేదు. ఇక ప్రసిద్ధభారతీయ విద్యాస్థానాలు చిరకాలం కిందటనే నశించినవి. మద్రాసు విశ్వవిద్యాలయం వచ్చినప్పటి నుండి పాఠశాలల్లో మనకిజీవం గోల్పోయిన పురాణకథలే యీఅధమ కావ్యాలే సర్వభారతీయ వాఙ్మయం సర్వభారతీయ సంస్కారం అయినవి. సంస్కృతంద్వారా యెవరోకొందరు శిక్షితులైనా అప్రశస్తమైన అభ్యాసమార్గాలవల్ల విద్యాలయాల్లో అనుచితవిద్యాసరణుల వల్ల ఆశిక్షసయితం దేశంయొక్క సాధారణదశను దాటజాలలేదు. విశ్వవిద్యాలయపు అంధతవల్ల భారతీయసంస్కారం సంపూర్ణంగా విద్యాశాలల్లో కుంఠితమయింది. ఆత్మీయసంస్కారం వున్నప్పుడే పరసంస్కారసమ్మేళనం నూతనదృష్టివికాసాన్ని పరసంస్కారాన్ని ఆత్మీయంచేసుకొనగలశక్తిని సమకూరుస్తుంది. లేదా స్వత్వమేనశించి పరసంస్కారదాస్యం సంభవించి జాతికి మూలక్షయమే ఫలమవుతున్నది. మన ఆంధ్రదేశంలో విద్యాస్థానాల్లో భారతీయసంస్కారం నశించిన యీదశలో మనము గర్వించ దగ్గది యేమీ లేదంటున్నాను. ప్రకృతిని గుడ్డిగాను పురుషుణ్ణికుంటి గాను చిత్రించిన ఒకపటాన్ని బందరులో ఆంధ్రులకళాశాలలో వున్న ఒక బంగాళీ గీశాడని అది కొత్తపద్ధతిగా బాగావున్నదని ఒకమిత్రుడు నాతో అన్నాడు. అది సాంఖ్యదర్శనంలో ప్రసిద్ధవిషయమని

"పురుషస్య ధర్శనార్ధం కైవల్యార్ధం తథా ప్రధానస్య
 పంగ్వంధవదుభయోరపి సంయోగః తత్‌కృతః సర్గః" (సా. కా)
 "అంధేన పంగుః స్కంధమారోపితః ఏవం శరీరారూఢ
 పఙ్గుదర్శితేన మార్గేణ అంధో యాతి పంగుశ్చ అంధ
 స్కంధారూఢః ఏవం పురుషే దర్శనశక్తిరస్తి పంగు
 వన్న క్రియా ప్రధానే క్రియాశక్తిరస్తి అంధవన్న దర్శనశక్తిః"
                                                        (గౌ. పా)

(పురుషుడు దర్శనార్థం, ప్రధానం కైవల్యార్థం, పరస్పరం కూడుతున్నారు. వీరిద్దరికి కుంటికి గుడ్డికి కలిగినట్లు సంయోగం కలుగుతున్నది. ఈసంయోగంవల్ల యేర్పడ్డది సృష్టి)అని

(అంధుడు కుంటిని బుజమెక్కించుకొన్నాడు. కుంటివాడు చాపిన మార్గాన అంధుడు నడుస్తాడు. అంధుడి బుజమెక్కిన కుంటిగూడా నడిచినవా డవుతున్నాడు. ఇట్లా కుంటికివలె పురుషుడికి దర్శనశక్తివున్నది గాని క్రియాశక్తిలేదు. అంధుడికివలె ప్రధానానికి క్రియాశక్తివున్నది గాని దర్శనశక్తి లేదు.) అని.

ఈశ్వర కృష్ణసాంఖ్య కారికలోను గౌడపాదభాష్యంలోను వున్న సంగతిని తెలిపి భారతీయసంస్కారం ఆంధ్రులకువుంటే యిట్లాటి నూతన చిత్రాలు బంగాళీలకంటె యెక్కువవా చిత్రించగలరన్నాను.

ఇప్పుడు బారతీయవిజ్ఞానం సంస్కృతభాషలోగుప్తమైవున్నది ప్రస్తుతం భారతీయసంస్కారంతో అంటే సంస్కృతంతో యేమత్రమైనా పాఠశాలల్లో కళాశాలల్లో బహువిద్యార్థులకు పరిచయం కలిగించే విద్యాక్రమం అత్యంతం ఆవశ్యకం. ఉదాత్తవాఙ్మయంగల ప్రసిద్ధప్రాచీన బాషల్లో దేనినైనాపాఠశాలలో గాని కళాశాలలోగాని విద్యార్థి చదివి తీరవలెననే యేర్పాటుంటేనేగాని ఆదశ సిద్ధించదు. మనదేశంలో అట్లాటి శుభచిహ్నాలుగాని సంస్కారోదయ మవుతున్నదనే ఆశగాని లేదంటున్నాను. ఇకముం దేర్పడుతుందేమో చెప్పలేను. బొంబాయి కలకత్తా విశ్వవిద్యాలయాలతో అక్కడి విజ్ఞానోన్మేషంతో ఇక్కడి ఆంధ్రమద్రాసు విశ్వవిద్యాలయాలకు ఇక్కడి సంస్కారదారిద్ర్యానికి సాదృశ్యంలేదు. కనుక మనము మురిసి చంకలు కొట్టుకొనడం అవివేకం, పులుముడు, అయోమయం, చిల్లరశృంగారం, శబ్దవాచ్యత దృష్తిసంకోచం, హీనదశను తెలుపుతున్నవంటున్నాను. ఇట్లాటి క్షుద్రకృతులు బంగాళీలలోవున్నా మరాటీలలో వున్నా హెందీలోవున్నా యెక్కడవున్నా సత్యసిద్ధాంతాలను అతిక్రమించజాలవు. దోషం యెక్కడవున్నా దోషమేగాని గుణంకాదు. పాశ్చాత్యులకు పైనచెప్పినవి గుణమేమోగాని కావ్యప్రస్థానం మహోచ్చదశనందిన భారతీయులకు మాత్రం అవన్నీ దోషాలేనని స్పష్టపరచాను.

అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో చిహ్నాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయ పరిశిష్టభాష్యం.

బుద్ద్యధికరణం.

పూర్వపక్షం.

అవునయ్యా. ఇవి ప్రజాప్రభుత్వపురోజులు యెవరిబుద్దికి తోచినట్లు వాండ్లు వ్రాస్తారు అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. ప్రజాప్రభుత్వమైనా మరేప్రభుత్వమైనా చదువుకోకుండా వుండడమే ప్రజాప్రభుత్వపు లక్షణమనుకొనడం అనుచితం. ప్రజాప్రభుత్వం ఉచ్చదశలోవున్న దేశాల్లో సయితం విద్యాస్థానాలు, ఆచార్యులు, విద్యాభ్యాసం ఇవన్నీ వున్నవి. వారివారి దేశీయమైన సంస్కారాన్ని వారువారు పొందుతున్నారు. దానికి ఆనుషంగికంగా విదేశీయసంస్కారం పొందుతారు. అట్లానే మనవిద్యాస్థానాల్లో భారతీయసంస్కారంపొంది దానికి ఉపోద్బలంగా విదేశీయసంస్కారం గూడాపొంది తరువాత యేమైనా చెప్పండి. పత్రికాప్రవర్తకులుగాండి, కృతికర్తలుగాండి, చరిత్రకారులుగాండి, యెవరైనా గాండి అప్పుడు ఆకార్యాలు దేశానికి హితమాపాదిస్తవి అని చెప్పుతున్నాను. భారతీయమేమిటి అంటారా? అదియేమో ఇక్కడ తర్కించడానికి అవకాశంలేదు. నాదృష్టిభేదాధికరణంలో పూర్తిగా వివరించాను. అక్కడ చూడవలెనని చెప్పుతున్నాను.

అని శ్రీ..ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో బుద్ద్యధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

ప్రజాధికరణం

పూర్వపక్షం.

అవునయ్యా, మేము ప్రజలకు మేలుచేసేవారము. అందుకోసం యిట్లా తోచినదంతా రాస్తాము అని అంటారా?

సమాధానం

నేను ప్రజలకు మేలుచేసే తరగతికి నన్ను నేనే యెక్కించు కొనలేనుగాని ప్రజల్లో ఒకడనని మాత్రం చెప్పుతున్నాను. ప్రజల్లో ఒకడైనా మీరు వ్రాసేదంతా చిల్లరశృంగారం పులుముడు, శబ్దవాచ్యత, అయోమయం, అని అది తుచ్ఛమని అంటున్నాను. మేము మేలుచేసే వారమని యింకా గర్వపడతారా మేలు చేయదలచిన మీకు మేలు చేసేతరగతివాడినని నేను గర్వపడగలను. కాని యివన్నీ అసంబద్ధపు మాటలు. ఒకరికి మేలుచేయడానికి ముందు మిమ్మును మీరు బాగుచేసుకోండి అని చెప్పుతున్నాను.

"స్వయం తీర్ణః పరాంస్తారయతి"

అని హితం పెద్దలు చెప్పుతున్నారు. ప్రజలకు సేవ జేయదలచితే భారతవర్షం సర్వోచ్చదశలో వున్నప్పటి మహాప్రష్టల వాల్మీకి వ్యాస కాళిదాసాదులకృతులు సుబోధమయ్యే పరిపాకం ప్రజలకు కలిగించడానికి యత్నించండి. అంతేగాని చిల్లర శృంగారం పులుముడు అయోమయం చూపి ప్రజలను వంచించ వద్దని చెప్పుతున్నాను.

అని శ్రీ..ఉమాకాన్తవిద్యశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో ప్రజాధికరణం సమాప్తం

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

సమకాలాధికరణం.

పూర్వపక్షం.

అవునయ్యా; సమకాలపువారలు మెచ్చరే గదా అని అన్నట్లు మీరు సమకాలికులు గనుక వీటిని మెచ్చరు

"యే నామ కేచిదిహ నః ప్రథయత్యవజ్ఞాం,
 జానంతి తే కిమపి తాన్ ప్రతి నైష యత్నః.
 యథా స్త్రీణాం తదా వాచాం సాధుత్వే దుర్జనో జనః?"

అనిభవభూతి
  
"దిజ్నాగానాం పథిపరిహరన్"

అని కాళిదాసు
   
"మద్వాణి మా కురు విషాదమనాదరేణ,
 మాత్సర్యమగ్న మనసాం సహనాఖలానాం."

అని జగన్నాథుడు ఈతీరుగా తమకావ్యాలనువిమర్శించేవారిని గురించి అన్నారు మాకావ్యాలు మంచి వేనంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. క్షుద్రకులటలు సయితం ఈవాదం ఆధారం జేసుకొని పరిశుద్ధురాలైన సీతను లోకులు దూషించలేదా? అట్లానే మమ్మునుదూషిస్తున్నారు. అని వాదించ వచ్చును గదా? ఇది అసంబద్దవాదం ప్రాచీనుల్లో భవభూతి మొదలైన వారిని నిందించారు. నిజంగా కుత్సితకవులునూ నిందించారు. భవభూతి మొదలైనవారిని నిందించిన సంగతి విదితమే గనుక వాటిని మళ్లీ ఉదాహరించలేదు.

"ఆకీర్తివర్తనీం త్వేవం కుకవిత్వవిడంబనామ్" (కా.సూ.వృ)

అని వామనుడు కుకవితను నిందిస్తున్నాడు.

"బూడిదెబుంగలైయొడలు పోడిమిదక్కి మొగంబు వెల్లనై
 వాడల వాడలందిరిగి వారును వీరును చొచ్చుచోయనన్
 గోడల గొందులందొరిగి కూయుచునుండెడి కొండవీటిలో
 గాడిదె! నీవునుంగవివిగావుగదా అనుమానమయ్యెడున్"
                                           (ప్రభాకరశాస్త్ర్యుదాహృతం!)

అని కుత్సితకవులు నిందితులవుతున్నారు. సమకాలపువారు నిందిస్తారనేదే కావ్యానికి ఒక యోగ్యతగాదు. ఇట్లా వాదించడమే సవ్యభిచార మనేహేత్వాభాసమని నైయాయికలు చెప్పుతున్నారు.

ఈహేత్వాభాసమిది. వీరు ఉత్తమకవులు సమకాలంలో నిందితులు గనుక. భవభూతి కాళిదాసాదులవలె, అని వీరివాదం. ఈవాదం తోనే అధమకవులనిగూడా తేల్చవచ్చును.

వీరు అధమకవులు. సమకాలంలో నిందితులు గనుక, కొండవీటి గాడిదెవలె ఈతీరుగా పరస్పరవిరుద్ధమైన రెండుసిద్ధాంతాలు తేలుతున్నవి. గనుక ఈవాదం హేత్వాభాసంతో కూడివున్న దన్నాను. ఇప్పటి కృతు లనేకం పులుముడు అయోమయం, చిల్లరశృంగారం మొదలైన దోషాలతో కూడినవని నేను విశదపరచాను. ఇవి ఆదోషాలతో నిండివుండ లేదని వివరిస్తే, ఆమాటలు ఉచితమైన ప్రతివచనంగా వుంటే స్వీకరిస్తాను. మళ్లీ సమాధానంవుంటే చెప్పుతాను. లేదా ఆమాటలు శిరసా వహిస్తానంటున్నాను.

అని శ్రీ..ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో సమకాలాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

|ప్రకాశాధికరణం.

పూర్వపక్షం.

మీరు గుణాలు కనబరచలేదు. మీరుదోషాలు ప్రదర్శిస్తున్నారు. దోషాన్వేషణం మంచిదిగాదు. శివుడు విషం కంఠంలోఉంచి ప్రకాశానికి తీసుకొనిరాక చంద్రుణ్ని నెత్తినపెట్టుకొని ప్రకటిస్తున్నాడు. అట్లా మీరు దోషాలను దాచవలసింది. కాని దోషాలను ప్రకటిస్తున్నారు. అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. శివుడి ఉదాహరణం యాచకులు దానానికి పోయినప్పుడు దోషాలేమైనావుంటే క్షమించి మాగుణాలకే మెచ్చుకొని దానంజెయ్యమని చెప్పడానికి పనికివస్తుంది. శరణాగతులను కాపాడేటప్పుడు వారిదోషాలను గణించ నవసరంలేని సమయం వస్తుంది. అట్లాటి సందర్భాల్లో దోషాన్వేషణం అనావశ్యకం అందుకే

"దోషో యద్యపి తస్య స్వాత్ సతామేతదగర్హితం" (రా)

అని విభీషణుడి విషయంలో శ్రీరాము డంటాడు. కాని కావ్యవిచారణలో దోషనిర్ణయం అవశ్యకమే అవుతున్నది. కాకుంటే సాహిత్య గ్రంథాల్లో దోషప్రకరణమే అనుచితమై వుంటుంది.

"తదల్పమపి నోపేక్ష్యం కావ్యే దుష్టం కదాచన
 స్యాద్వపుః సుందరమపి శ్విత్రేణైకేన దుర్బగం." (కా ద)

(కావ్యంలో దోషం కొద్దిదైనా ఉపేక్షించరాదు. శరీరం సుందరమైనదైనా ఒక్కకుష్ఠంచేత దుర్భరమవుతున్నది)

అని దండి అంటున్నాడు.

"సభాం వా న ప్రవేష్టవ్యం వక్తవ్యం నా సమంజసం
 అబ్రువన్ విబ్రువన్ వాపి నరో భవతి కిల్బిషి" (మను)

(సభలో ప్రవేశించరాదు. ప్రవేశించిన తరువాత సత్యమే తెలుపవలెను. అసలు చెప్పకున్నా, వక్రమార్గంలో చెప్పినా నరుడు పాపి అవుతున్నాడు.) అని మనువుచెప్పుతున్నాడు. పులుముడు, అయోమయం, క్షుద్రశృంగారం మొదలైనవాటిచేత లోకం వంచిత మవుతున్న దని తెలిసినప్పుడు సత్యప్రకటనం ధర్మమని అనుకొంటున్నాను. ఇకగుణాలవిషయం నాకు కనబడ్దవరకు చెప్పినాను. మరేవైనా గుణాలువుంటే యెవరైనా చెప్పితేవింటాను. అవి దోషాలని స్థిరపడితే అవిదోషాలని విన్నవిస్తాను. గుణాలైతే సంతోషిస్తాను. మనవారు పరిణతబుద్ధులై సంస్కారపరిపాకంతో గుణవత్కావ్యాలు రచిస్తే యెవరికి ఆనందదాయకంగాదు?

అని శ్రీ..ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలోవాఙ్మయసూత్ర

పరిశిష్టంలో ప్రకాశాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

ఇచ్ఛాధికరణం.

అవునయ్యా; మీరేమన్నా చెప్పండి? మాయిష్టమైనవి మేము వ్రాస్తాము. మాకీవిచారణలో పనిలేదు. అదే ఉత్తమకవిత్వమంటాము అని అంటారా?

సమాధానం

వివరిస్తాను అవును. ఇష్టం వచ్చినట్లనవచ్చును. అయితే

"స్వాధీనో రసనాంచలః పరచితాః శబ్దాః కియంతః క్వచిత్,
 క్షోణీంద్రో న నియామకః పరిషదః శాంతాః స్వతంత్రం జగత్
 తద్యూయం కవయో వయం వయమితి ప్రస్తావనాహుంకృతి
 స్వచ్ఛందం ప్రతిసద్మ గర్జత వయం మూకవ్రతాలంబినః"

(సా. ద. పీఠికలో ఉదాహృతం)

నాలికస్వాధీనం, కొన్ని శబ్దాలు పరిచితమైవున్నవి. యెక్కడా రాజునియామకుడు లేడు. పరిషత్తులు శాంతంగావున్నవి. కనుక మేముకవులమంటే మేముకవులమని ప్రతిగృహంలో మీరింకగర్జించండి మేము మౌనంగా వుంటాము అని బుధులన్నట్లు అసంబద్ధాలాపాలను ఉపేక్షించవచ్చును. లేదా లోకం వంచితమవుతున్నదని తెలిసినప్పుడు దీని తత్వమిది యదార్థ్యమిది అని సత్యాన్ని ఆరాధిస్తూ సత్యపరతంత్రులు చెప్పవచ్చును.

అని శ్రీ..ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో ఇచ్ఛాధికరణం సమాప్తం.

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

సంస్కారాధికరణం

నేటికాలపు కవిత్వాన్ని విచారణచేసి అదిప్రాయికంగా దృష్టి సంకోచంచేత హీనంగా వున్నదని, పులుముడు, అయోమయం, శబ్దవాచ్యతమొదలైన దోషాలతో దూషితమైనదని, నేటికాలపు కృతులు ప్రాయికంగా చిల్లరశృంగారమని క్షుద్రాలని కావ్యంపతితదశలో వున్నదని విశదపరచాను. సాతవాహనుల కాలం శతశతాబ్దులకింద గడిచింది. వొరంగల్లు వైభవం విశేషబలప్రదంకాకుండానే అంతరించింది. తరువాత ఆంధులు భారతవర్షంలో అజ్ఞాతసీమల్లో అణగిపోయినారు. దక్షిణాన కాంచి, మధుర, ఉత్తరాన ఇంధ్రప్రస్ధం, ఉజ్జయినీ, కౌశాంబి, పాఠలీపుత్రం విదిశ, ధార మొదలైన నగరరాజులవలె సర్వభారతవర్షాన్ని ఆకర్షించిన మహారాజధానులకుగాని, రామేశ్వరం, ప్రయాగ, అయోధ్య, ద్వారకమొదలైన పట్టణాలవలె సర్వభారతవర్షం సన్నివిష్టమయ్యే మహాక్షేత్రాలకుగాని, నవద్వీపం, కాశి, కాశ్మీర, శారదాపీఠంమొదలైన పవిత్రస్థలాలవలె సర్వభారతవర్షాన్ని పాదాక్రాంతం జేసిన మహావిద్యాస్థానాలకుగాని ఆంధ్రదేశం ఆకరంగాలేదు. రెడ్లకింద కొంచెంతలయెత్తనారంభించి తిరిగి దైవోపహతమయింది. వెనక చాళుక్యుల చేతిలోవలె, రాజ్యాలగతులు క్షణక్షణం వ్యత్యస్తమయి క్షుబ్ధావస్థయందున్న దశలో విదేశీయులైన విజయనగరరాజుల వశమైనాము. పురాణేతిహాసాల ఛాయలు సంస్కృతచ్ఛందస్సుతో పులుముడు భాషావ్యతిక్రమం ఛందోభంగం మొదలమైన ఘోరదోషాలతో నిర్బద్ధవళిప్రాసల అనర్థాలతో నిండిన మను, వసు, చరిత్రలవంటి క్షుద్రకావ్యాలే మనకు సర్వభారతీయసంస్కారమై, పద్యం వ్రాయడమే కవిత్వమయింది. అదే పరమవిద్య అయింది. ఆ పద్యంసయితం అశాస్త్రీయమైన మురికిలక్షణాలతో వికృతమైంది. ఈతీరుగాభారతవర్షంలో అధములమై భారతీయ విజ్ఞానానికి దూరులమై వంచితులమైనాము. దేశంలో భారతీయ సంస్కారప్రవాహాలు యింకిపోయినవి. విద్యాపీఠాలు అస్తమించినవి. గురుకులాలు రూపుమాసినవి. భారతీయసంస్కారం లేని కేవల పాశ్చాత్య సంస్కారం బలప్రదంగాక ఆత్మవిముఖత్వాన్ని పరసంస్కారదాస్యాన్ని మనకు ఆపాదిచినవి. ఈదశలో ఆంధ్రదేశంలో వెలువడుతున్న కృతులు యెండునేలను మొలచిన గిటకగడ్డివలెను, యిమడక వెళ్లిపోయిన ఆహారంవలెను వుండవలసివచ్చినవి. బురదగుంట నుండి పైకివచ్చిక్షాళనానికి శుద్ధజలం లభించకతిరిగే పతితుడివలె సంకిలమైన అపరిణత బుద్ధులతో కృతుల రచనలు చేస్తున్నాము. దేశీయవిద్యాశాలలుగానీ రాజకీయవిద్యాశాలలుగానీ భారతీయసంస్కారం నిర్భంధంగా ప్రధానంగా విదేశీయసంస్కారం అంగంగా దేశీయులకు ప్రసాదించినప్పుడే యీపంకం మనకు తొలగి మనం స్వచ్ఛదీప్తితో భారతజాతుల్లో ఉత్తమస్థానం ఆక్రమించగలము. నన్నయాదుల భారతంమొదలైనవి భారతీయ సంస్కారంయొక్క శుద్ధస్వరూపం కావంటున్నాను. భారతీయ సంస్కార పరిపాకంపొంది స్వచ్ఛ దీప్తితొ భారతజాతుల్లో ఉత్తమస్థానం ఆక్రమించ గలిగినప్పటి కృతులుగాని చిత్రాలుగాని మరేమిగాని మరేవిగాని ఒక ఆంధ్రులనెగాక సర్వభారతవర్షాన్ని సర్వలోకాన్ని నూతనసందేశాలతో పవిత్రం చేయగలవు! ఆనిమిషానికే నేను ప్రతీక్షిస్తున్నాను. జన్మాంతరంలోనైనా ఆనిర్మలదశ చూడగలననే ఆశతో విశ్వాసంతో ఆంధ్రులసంస్కారానికి సేవను ఆకాంక్షిస్తున్నాను.

అనిశ్రీ..ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో నేటికాలపుకవిత్వమనే ప్రథమాధ్యాయంలో సంస్కారాధికరణం

సమాప్తం

అధ్యాయంగూడా సమాప్తం.