అధ్యాయము - ౧౨

వికీసోర్స్ నుండి
భాగవతము - ప్రధమ స్కంధము
అధ్యాయాలు
1. ప్రారంభము
2. అధ్యాయము - ౧
3. అధ్యాయము - ౨
4. అధ్యాయము - ౩
5. అధ్యాయము - ౪
6. అధ్యాయము - ౫
7. అధ్యాయము - ౬
8. అధ్యాయము - ౭
9. అధ్యాయము - ౮
10.అధ్యాయము - ౯
11.అధ్యాయము - ౧౦
12.అధ్యాయము - ౧౧
13.అధ్యాయము - ౧౨
14.అధ్యాయము - ౧౩
15.అధ్యాయము - ౧౪
16.అధ్యాయము - ౧౫
17.అధ్యాయము - ౧౬
18.అధ్యాయము - ౧౭
19.అధ్యాయము - ౧౮
20.అధ్యాయము - ౧౯

ఉత్తరకు పరీక్షిత్తు జన్మించుట[మార్చు]

సీ.

గురునందనుండు సక్రోధుఁడై యేసిన బ్రహ్మశిరోనామ బాణ వహ్నిఁ

గంపించు నుత్తర గర్భంబు గ్రమ్మఱఁ బద్మలోచనుచేతఁ బ్రతికె నండ్రు

గర్భస్తుఁడగు బాలుఁ గంసారి యేరీతి బ్రతికించె? మృత్యువు భయము వాపి

జనియించి యతఁడెన్ని సంవత్సరము లుండె? నెబ్భంగి వర్తించె నేమి సేసె?

ఆ.

వినుము శుకుఁడు వచ్చి విజ్ఞాన పద్ధతి నతని కెట్లు సూపె నతఁడు పిదపఁ

దనశరీర మే విధంబున వర్జించె? విప్రముఖ్య! నాకు విస్తరింపు. 274


వ.

అనిన సూతుం డిట్లనియె. ధర్మనందనుండు చతుస్సముద్ర ముద్రితాఖిల జంబూ

ద్వీపరాజ్యంబు నార్జించియు, మిన్నుముట్టిన కీర్తి నుపార్జించియు, నంగనాతురంగ

మాతంగ సుభట కాంచనాది దివ్యసంపదలు సంపాదించియు, వీరసోదర విప్ర

విద్వజ్జన వినోదంబులం బ్రమోదించియు, వైభవంబు లలవరించియుఁ గ్రతువు

లాచరించియు, దుష్ట శిక్షణ, శిష్టరక్షణంబు లొనరించియు ముకుంద చరణారవింద

సేవారతుండై, సమస్త సంగంబులందు నభిలాషంబు వర్జించి, యరిషడ్వర్గంబు

జయించి రాజ్యంబు సేయుచు. 275


తే.

చందనాదుల నాఁకట స్రగ్గువాడు

దనివి నొందని కైవడి ధర్మసుతుఁడు

సంపదలు పెక్కు గలిగియుఁ జక్రిపాద

సేవనంబులఁ బరిపూర్తి సెందకుండె. 276


వ.

అంతం గొన్ని దినంబులకు నభిమన్యు కాంతాగర్భంబునందున్న డింభకుండు

దశమాన పరిచ్ఛేద్యుండై, గర్భాంతరాళంబున దురంతంబైన యశ్వత్థామ

బాణానలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచు. 277


ఉ.

కుయ్యడ శక్తిలే దుదర గోళములోపల నున్న వాఁడ ది

క్కెయ్యది? దా ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నేఁ

డి య్యిషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము? నన్నుఁ గావ నే

యయ్య గలండు? గర్భ జనితాపద నెవ్వఁ డెఱుంగు దైవమా! 278


క.

చిచ్చఱకోల వంశంబునఁ

జచ్చి బహిర్గతుఁడఁ గాని సమయమునను దా

నుచ్చలిత గర్భవేదనఁ

జచ్చును మాతల్లి ఘోర సంతాపమునన్‌. 279


క.

చెచ్చెర బాణ జ్వాలలు

వచ్చిన విష్ణుండు గావవచ్చు ననుచుఁ దా

ముచ్చటలు సెప్పు సతులకు

నిచ్చలు మాయవ్వ నేఁడు నిజమయ్యెడినో! 280


శా.

రాఁడా చూడ? సమస్త భూతములలో రాజిల్లువాఁ డిచ్చటన్‌

లేఁడా? పాఱుని చిచ్చఱమ్ము దొలఁగన్‌ లీలాగతిన్‌ ద్రోచి నా

కీఁడా? నేఁ డభయప్రదాన మతఁడూహింపన్‌ నతత్రాత మున్‌

గాఁడా? యెందఱిఁ గావఁడీ యెడల మత్కర్మంబు దానెట్టిదో! 281


వ.

అని గతాగత ప్రాణుండై శిశువు చింతించు సమయంబున. 282


సీ.

మేఘంబు మీఁది క్రొమ్మెఱుఁగు కైవడి మేనిపై నున్న పచ్చని పటమువాఁడు

గండ భాగంబులఁ గాంచన మణిమయ మకరకుండల కాంతి మెలయువాడు

శరవహ్ని నణఁగించు సంరంభమునఁ జేసి కన్నుల నునుఁగెంపు గలుగువాఁడు

బాలార్క మండల ప్రతిమాన రత్న హాటక విరాజిత కిరీటంబువాఁడు

తే.

గంకణాంగద వనమాలికా విరాజ మానుఁ డసమానుఁ డంగుష్ఠమాత్రదేహుఁ

డొక్కగదఁ జేతఁదాల్చి నేత్రోత్సవముగ విష్ణుఁ డావిర్భవించె నవ్వేళ యందు. 283


వ.

ఇట్లు భక్తపరాధీనుండైన పరమేశ్వరుం డావిర్భవించి, మంచు విరియించు

మార్తాండు చందంబున శిశువునకు దశదిశలం దన చేతి యఖండిత మహోల్కా

జాల సన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగ జిఱ జిఱం ద్రిప్పి,

వ్రిపుని చిచ్చఱమ్ము వేఁడిమి పోఁడిమిఁ జెఱిచి, డింభకుని పరితాప విజృంభణంబు

నివారించి, గర్భంబు కందకుండ రక్షించి యర్భకునికి నానందంబు గల్పించిన. 284


మ.

గదఁ జేఁ బట్టి పరిభ్రమించుచు గదాఫూతంబునన్‌ దుర్భయ

ప్రదమై వచ్చు శరాగ్నిఁ దుత్తుమురుగా భంజించి రక్షించు నీ

సదయుం డెవ్వఁడొకో! యటంచు మదిలోఁ జర్చింపుచున్‌ శాబకుం

డెదురై చూడ నదృశ్యుఁడయ్యె హరి సర్వేశుండు విప్రోత్తమా! 285


వ.

అంత ననుకూల శుభ గ్రహోదయంబును, సర్వ గుణోత్తర ఫల సూచకంబునైన

మంచి లగ్నంబునం బాండవ వంశోద్ధారకుండైన కుమారుండు జన్మించిన,

ధర్మనందనుండు ధౌమ్యాది భూసురవర్గంబు రప్పించి, పుణ్యాహంబు సదివించి,

జాతకర్మంబులు సేయించి, కుమారు జన్మమహోత్సవ కాలంబున భూసురులకు

విభవాభిరామంబులైన గో భూ హిరణ్య హయానేక గ్రామంబులును స్వాదు

రుచి సంపన్నంబులైన యన్నంబులు నిడిన, వారలు ధర్మపుత్రున కిట్లనిరి. 286


చ.

పకటిత దైవయోగమునఁ బౌరవసంతతి యంతరింపగా

వికలత నొందనీక ప్రభవిష్ణుఁడు కృష్ణుఁడనుగ్రహించి శా

బకు బ్రతికించెఁ గావున నృపాలక బాలకుఁ డింక శాత్రవాం

తకుఁ డగు విష్ణురాతుఁ డన ధాత్రిఁ బ్రసిద్ధికి నెక్కుఁ బూజ్యుఁడై. 287


వ.

అనిన భూదేవోత్తములకు నరదేవోత్తముండిట్లనియె. 288


శా.

ఓ పుణ్యాత్మకులార! నా పలుకు మీ రూహింపుఁడా మ్రొక్కెదన్‌

మా పెద్దల్‌ చిరకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై

యీ పిన్నాతఁడు వారిఁ బోలెడిఁ గదా! యెల్లప్పుడున్‌ మాధవ

శ్రీపాదాంబుజ భక్తియుక్తుఁడగుచున్‌ జీవించునే? చూడరే! 289


వ.

అనిన విని నరేంద్రా! భవదీయ పౌత్రుండు మనుపుత్రుండైన యిక్ష్వాకు

చందంబునం బ్రజల రక్షించు. శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్య

ప్రతిజ్ఞుండు నగు. డేగ వెంటనంటిన బిట్టు భీతంబై వెనుకకు వచ్చిన కపోతంబుఁ

గాచిన శిబిచక్రవర్తిభంగి శరణ్యుండును,వితరణ ఖనియు నగు. దుష్యంత

సూనుండైన భరతు పగిది సోమాన్వయ జ్ఞాతివర్గంబులకు యజ్వలకు ననర్గళ కీర్తి

విస్తరించుచు, ధనంజయ కార్తవీర్యుల కరణి ధనుర్ధరాగ్రేసరుండగు, కీలి

పోలిక దుర్దర్షుండగు. సముద్రుని తెఱంగున దుస్తరుండగు. మృగేంద్రుని కైవడి

విక్రమశాలియగు. వసుమతిం బోలె నక్షయ క్షాంతి యుక్తుండగు. భానుని లాగు

ప్రతాపవంతుండగు. వాసుదేవు వడువున సర్వభూత హితుండగు. తల్లిదండ్రులమాడ్కి

సహిష్ణుఁడగు. మఱియును. 290


సీ.

సమదర్శనంబున జలజాతభవుఁ దనఁ బరమ ప్రసన్నత భర్గుఁ డనఁగ

నెల్లగుణంబుల నిందిరావిభుఁడన నధిక ధర్మమున యయాతి యనఁగ

ధైర్యసంపద బలి దైత్యవల్లభుఁ డన నచ్యుత భక్తిఁ బ్రహ్లాదుఁ డనఁగ

రాజితోదారత రంతిదేవుండన నాశ్రిత మహిమ హేమాద్రి యనఁగ


తే.

యశము నార్జించుఁ బెద్దల నాదరించు నశ్వమేధంబు లొనరించు నాత్మసుతుల

ఘనులఁ బుట్టించు దండించు ఖలులఁబట్టి మానధనుఁడు నీమనుమండు మానవేంద్ర! 291


భుజంగప్రయాతము.

హరించు గలి ప్రేరితాఘంబు లెల్లన్‌

భరించున్‌ ధరన్‌ రామభద్రుండు వోలెన్‌

జరించున్‌ సదా వేదశాస్త్రానువృత్తిన్‌

వరించున్‌ విశేషించి వైకుంఠు భక్తిన్‌. 292


వ.

ఇట్లు పెక్కేండ్లు జీవించి, భూసుర కుమారక ప్రేరితంబైన తక్షక సర్ప విషానలం

బునం దనకు మరణంబని యెరింగి, సంగవర్జితుండై, ముకుంద పాదారవింద భజ

నంబు సేయుచు శుకయోగీంద్రునివలన నాత్మవిజ్ఞాన సంపన్నుండై, గంగా

తటంబున శరీరంబు విడిచి, నిర్గత భయ శోకంబైన లోకంబు ప్రవేశించును. అని

జాతక ఫలంబు సెప్పి, లబ్ధకాములై భూసురులు చనిరి. అంత. 293

క.

తనతల్లి కడుపు లోపల

మును సూచిన విభుఁడు విశ్వమున నెల్లఁ గలం

డనుచుఁ బరీక్షింపఁగ జను

లనఘుఁ బరీక్షిన్నరేంద్రుఁడండ్రు నరేంద్రా! 294


ఆ.

కళలచేత రాజు గ్రమమునఁ బరిపూర్ణుఁ

డైన భంగిఁ దాత లనుదినంబుఁ

బోషణంబు సేయఁ బూర్ణుఁడయ్యెను ధర్మ

పటల పాలకుండు బాలకుండు. 295


వ.

మఱియు ధర్మజుండు బంధుసంహార దోషంబు వాయుకొఱకు నశ్వమేధ

యాగంబు సేయందలంచి, ప్రజలవలనం గరదండంబుల నుపార్జితంబైన విత్తంబు

చాలక చిత్తంబునం జింతించునెడ, నచ్యుతప్రేరితులై భీమార్జునాదులు, దొల్లి

మరుత్తుండను రాజు మఖంబుచేసి పరిత్యజించి నిక్షేపించిన సువర్ణ పాత్రాదికం

బైన విత్త ముత్తర దిగ్భాగంబు వలన బలవంతులై తెచ్చిన, నా రాజసత్తముండును

సమాయత్త యజ్ఞోపకరణుండై, సకల బంధుసమేతంబుగఁ గృష్ణుని

నాహ్వానంబు చేసి, పురుషోత్తము నుద్దేశించి మూఁడు జన్నంబులు గావించె.

తదనంతరంబ కృష్ణుండు బంధు ప్రియంబు కొఱకుఁ గరినగరంబునం

గొన్ని నెలలుండి, ధర్మపుత్రాదులచే నామంత్రణంబు వడసి, యాదవ

సమేతుండై ధనంజయుండు తోడరా నిజనగరంబునకుఁ జనియె. 296



భాగవతము స్కందములు భాగవతము స్కందములు
భాగవతము - ప్రధమ స్కంధము | భాగవతము - ద్వితీయ స్కంధము | భాగవతము - తృతీయ స్కంధము | భాగవతము - చతుర్ధ స్కంధము | భాగవతము - పంచమ స్కంధము | భాగవతము - షష్ఠ స్కంధము | భాగవతము - సప్తమ స్కంధము | భాగవతము - అష్టమ స్కంధము | భాగవతము - నవమ స్కంధము | భాగవతము - దశమ స్కంధము | భాగవతము - ఏకాదశ స్కంధము | భాగవతము - ద్వాదశ స్కంధము