పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కంసునిభార్యలు విలపించుట

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1386-వ.
అంతం గంసాదుల కాంతలు భర్తృమరణదుఃఖాక్రాంతలై కరంబుల శిరంబులు మోదికొనుచు నశ్రుసలిలధారాపరిషిక్త వదనలై సదనంబులు వెలువడి వచ్చి వీరశయ్యా నిద్రితులైన విభులం గౌఁగిలించుకొని సుస్వరంబుల విలపించి; రందుఁ గంసు భార్య లిట్లనిరి.
టీక:- అంతన్ = అటు పిమ్మట; కంస = కంసుడు; ఆదులు = మున్నగువారి; కాంతలు = భార్యలు; భర్తృ = భర్త యొక్క; మరణ = చావుకై; దుఃఖ = దుఃఖముచే; ఆక్రాంతలు = ఆక్రమింపబడినవారు; ఐ = అయ్యి; కరంబులన్ = చేతులతో; శిరంబులన్ = తలలు; మోదికొనుచున్ = మొత్తుకొనుచు; అశ్రు = కన్నీటి; సలిల = జలముల; ధారా = ధారలచే; పరిషిక్త = బాగా తడపబడిన; వదనలు = ముఖములు కలవారు; ఐ = అయ్యి; సదనంబులున్ = ఇండ్లనుండి; వెలువడి = బయటపడి; వచ్చి = వచ్చి; వీరశయ్యా = యుద్ధభూమి యందు; నిద్రితులు = మరణించినవారు; ఐన = అయిన; విభులన్ = భర్తలను; కౌఁగిలించుకొని = ఆలింగనము చేసికొని; సుస్వరంబులన్ = మంచిరాగములతో; విలపించిరి = ఏడ్చిరి; అందున్ = వారిలో; కంసు = కంసుని యొక్క; భార్యలు = భార్యలు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- అంతట కంసుడు మొదలగువారి భార్యలు భర్తల మృతికి శోకాక్రాంతలై చేతులతో తలలు బాదుకుంటూ కన్నీటిధారలతో తడిసిన ముఖాలతో తమ తమ మందిరాల నుండి వచ్చారు. వీరశయ్యలందు దీర్ఘనిద్ర చెంది ఉన్న తమ పతులను పరిష్వంగం చేసుకుని, చక్కటి గద్గద కంఠధ్వనులతో ఏడ్చారు. వారిలో కంసుడి భార్యలు ఇలా అన్నారు. . .

తెభా-10.1-1387-సీ.
"గోపాలసింహంబు గోపించి వెల్వడి-
నిను గజేంద్రుని భంగి నేడు గూల్చె
యాదవేంద్రానిల మాభీలజవమున-
నిను మహీజము మాడ్కి నేల వ్రాల్చె
వాసుదేవాంభోధి వారి యుద్వేలమై-
నిను దీవి కైవడి నేడు ముంచె
దేవకీసుతవజ్రి దేవత లలరంగ-
నినుఁ గొండ క్రియ నేడు నిహతుఁ జేసె

తెభా-10.1-1387.1-తే.
హా! మనోనాథ! హా! వీర! హా! మహాత్మ!
హా! మహారాజ! నీ విట్లు తుఁడవైన
నుచు నున్నార మక్కట! మ్ముఁ బోలు
ఠినహృదయలు జగతిపైఁ లరె యెందు?

టీక:- గోపాల = కృష్ణుడు అనెడి; సింహంబు = సింహము; కోపించి = కోపగించి; వెల్వడి = బయలుదేరి; నినున్ = నిన్ను; గజ = ఏనుగులలో; ఇంద్రుని = శ్రేష్ఠుని; భంగిన్ = వలె; నేడు = ఇవాళ; కూల్చెన్ = చంపెను; యాదవేంద్ర = కృష్ణుడు అనెడి {యాదవేంద్రుడు - గొల్లప్రభువు, కృష్ణుడు}; అనిలము = వాయువు; ఆభీల = భయంకరమైన; జవమునన్ = వడితో; నినున్ = నిన్ను; మహీజము = వృక్షము; మాడ్కిన్ = వలె; నేలగూల్చెన్ = చంపెను; వాసుదేవ = కృష్ణుడు అనెడి; అంభోధి = సముద్రపు; వారి = నీరు; ఉద్వేలము = చెలియలికట్టదాటినది; ఐ = అయ్యి; నినున్ = నిను; దీవి = ద్వీపము; కైవడిన్ = వలె; నేడు = ఇవాళ; ముంచెన్ = ముంచివేసెను; దేవకీసుత = కృష్ణుడు అనెడి; వజ్రి = ఇంద్రుడు; దేవతలు = దేవతలు; అలరంగన్ = సంతోషించునట్లుగా; నినున్ = నిన్ను; కొండ = పర్వతము; క్రియన్ = వలె; నేడు = ఇవాళ; నిహతున్ = కొట్టబడినవానిగా; చేసెన్ = చేసెను.
హా = అయ్యో; మనోనాథ = భర్తా; హా = అయ్యో; వీర = శూరుడా; హా = అయ్యో; మహాత్మా = గొప్పమనసు కలవాడ; హా = అయ్యో; మహారాజ = మహారాజ; నీవు = నీవు; ఇట్లు = ఇలా; హతుడవు = చనిపోయినవాడవు; ఐనన్ = అయినచో; మనుచున్ = జీవించుచు; ఉన్నారము = ఉన్నాము; అక్కట = అయ్యో; మమ్మున్ = మమ్ములను; పోలు = పోలెడి; కఠిన = కఠినమైన; హృదయలు = మనసుకలవారు; జగతి = లోకము; పైన్ = అందు; కలరె = ఉన్నారా, లేరు; ఎందు = ఎక్కడ కూడ.
భావము:- “ఓ ప్రాణనాయకా! కోపంతో వచ్చిన గోపాలుడనే సింహం గజేంద్రుడి వంటి నిన్ను హతమార్చింది కదా. హా శూరుడా! యదునాథుడనే గాలి దారుణమైన వేగంతో వీచి మహా వృక్షము లాంటి నిన్ను నేలపై కూలగొట్టింది కదా. ఓ మహానుభావా! వాసుదేవుడనే సముద్రజలం చెలియలకట్టను దాటి పొంగి వచ్చి దీవి వంటి నిన్ను ఇప్పుడు ముంచేసింది కదా. రాజేంద్రా! దేవకీపుత్రుడనే దేవేంద్రుడు దేవతలు సంతోషించే విధంగా కొండవంటి నిన్ను సంహరించాడు కదా. అయ్యో! నీవిలా చనిపోయినప్పటికీ మేము ఇంకా బ్రతుకే ఉన్నాము. అక్కటా! మా అంత కఠిన హృదయం కలవారు భూమిమీద ఎక్కడైనా ఉన్నారా?

తెభా-10.1-1388-క.
భూముల కెగ్గుచేసిన
భూతంబులు నీకు నెగ్గు పుట్టించె వృథా
భూ మగు మనికి యెల్లను
భూద్రోహికిని శుభము పొంద దధీశా!

టీక:- భూతములు = జీవుల; కిన్ = కు; ఎగ్గు = కీడు; చేసినన్ = చేయగా; భూతంబులు = జీవులు; నీ = నీ; కున్ = కు; ఎగ్గు = కీడు; పుట్టించెన్ = కలిగించెను; వృథాభూతము = వ్యర్థమైనది; అగు = అయిన; మనికి = జీవితము; ఎల్లను = అంతయు; భూత = ప్రాణులకు; ద్రోహి = ద్రోహముచేయువాని; కిని = కి; శుభము = మేలు; పొందదు = కలుగదు; అధీశ = రాజా.
భావము:- ప్రాణులకు నీవు కీడుచేయగా, ఆ ప్రాణులే నీకు కీడు చేశాయి. ప్రాణులకు ద్రోహం చేసినవాడికి మేలు కలుగదు. బ్రతు కంతా వ్యర్థమవుతుంది.

తెభా-10.1-1389-క.
గోపాలకృష్ణుతోడను
భూపాలక! మున్ను తొడరి పొలిసినవారిన్
నీ పాల బుధులు చెప్పరె
కోపాలస్యములు విడిచి కొలువం దగదే."

టీక:- గోపాల = గొల్లవాడైన; కృష్ణు = కృష్ణుని; తోడను = తోటి; భూపాలక = రాజ; మున్ను = ఇంతకు మునుపు; తొడరి = తలపడి; పొలిసిన = చచ్చిన; వారిన్ = వాళ్ళను; నీ = నీ; పాలన్ = దగ్గర; బుధులు = పెద్దలు; చెప్పరె = చెప్పలేదా; కోప = కోపము; ఆలస్యములున్ = జడత్వములను; విడిచి = వదలివేసి; కొలువందగదే = సేవించవలసినది కదా.
భావము:- కంసమహారాజా! భూమండలాన్ని ఏలే వాడవు కదా. గోవుల పాలించే వాడైన శ్రీకృష్ణుడిని ఇంతకు ముందు ఎదిరించిన వారందరూ మరిణించిన విషయం బుద్ధిమంతులు ఎవరూ నీకు చెప్పలేదా? క్రోధము జడత్వమూ వదలిపెట్టి గోవిందుని సేవించవలసింది కదా.”