పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికల కాత్యాయని సేవనంబు

వికీసోర్స్ నుండి

తెభా-10.1-808-వ.
ఇట్టి నితాంతంబగు హేమంతంబున మొదలినెల తొలిదినంబు నందు నందుని మందంగల గోపకుమారికలు రేపకడ లేచి చని కాళిందీజలంబులం దోగి; జలతీరంబున నిసుమునం గాత్యాయనీరూపంబుఁ జేసి, సురభి కుసుమ గంధంబు లిడి, ధూపదీపంబు లిచ్చి, బహువిధోపచారంబులు సమర్పించి.
టీక:- ఇట్టి = ఇటువంటి; నితాంతంబు = గాఢమైనది; అగు = అయిన; హేమంతంబునన్ = హేమంతఋతువు నందు; మొదలి = మొదటి; నెల = మాసము; తొలిదినంబున్ = మొదటిరోజు; అందున్ = లో; నందుని = నందుని యొక్క; మందన్ = వ్రేపల్లెలో; కల = ఉన్నట్టి; గోప = గోపికా; కుమారికలు = యువతులు; రేపకడ = ఉదయమే; లేచి = నిద్రలేచి; చని = వెళ్ళి; కాళిందీ = యమునానదీ; జలంబులన్ = నీటిలో; తోగి = స్నానములు చేసి; జల = నీటి; తీరంబునన్ = ఒడ్డు నందు; ఇసుమునన్ = ఇసుకతో; కాత్యాయనీ = కాత్యాయనీదేవి యొక్క; రూపంబున్ = బొమ్మను; చేసి = చేసి; సురభి = మంచి సువాసనలు కల; కుసుమ = పూలు; గంధంబులు = సువాసన ద్రవ్యములను; ఇడి = సమర్పించి, పూజించి; ధూప = ధూపమును {ధూపము - అగరవత్తులు పొగను చూపుట అనెడి దేమునికి చేసెడి సేవ}; దీపంబులు = దీపములను {దీపము - వెలిగించిన దీపమును చూపుట అనెడి దేమునికి చేసెడి సేవ}; ఇచ్చి = ఇచ్చి; బహు = అనేక; విధ = రకములైన; ఉపచారంబులున్ = నైవేద్యములను; సమర్పించి = నివేదించి.
భావము:- ఇలా ఆరంభమైన ఆ హేమంతఋతువు మొదటి నెల మార్గశీర్షంలోని తొలి రోజున నందుని మందలో ఉన్న గోపకన్యలు వేకువనే నిద్ర లేచారు; కాళిందీ నదికి వెళ్ళి స్నానాలు చేసారు; నది గట్టున గౌరీదేవి ప్రతిమను రూపొందించారు; సురభి కుసుమాలతో అలంకరించారు; చందనం పూసారు; ధూపదీపాలు, రకరకాల నైవేద్యాలు సమర్పించారు.

తెభా-10.1-809-క.
"ఓ! కాత్యాయని! భగవతి!
నీకున్ మ్రొక్కెదము మేము నే డనుకంపన్
మా కిందఱకును వైళమ
శ్రీకృష్ణుఁడు మగఁడు గాఁగఁ జేయుము తల్లీ!

టీక:- ఓ = ఓహో; కాత్యాయనీ = పార్వతీ దేవి {కాత్యాయని - వ్యుత్పత్తి, కతి అయనాని మోక్షమార్గాస్సంతీతి విచారయతీతి కత్యయనః, కత్యయనస్సాపత్యంస్త్రీ కాత్యాయనీ. మోక్షమార్గములెన్ని కలవని విచారించువాడు కత్యయనుడు (బ్రహ్మవేత్త),వాని యందు పుట్టినామె కనుక కాత్యాయనీ బ్రహ్మవిద్య, బ్రహ్మవిద్యాస్వరూపిణీః.}; భగవతి = పార్వతీ దేవి {భగవతి - షడ్గుణైశ్వర్య సంపన్నురాలు, పార్వతీదేవి}; నీ = నీ {షడ్గుణైశ్వర్యములు - 1మహత్వము 2ధైర్యము 3కీర్తి 4శ్రీ 5జ్ఞాన 6వైరాగ్యములు}; కున్ = కు {షడ్గుణములు - 1సర్వజ్ఞత 2సర్వస్వతంత్రత 3అనాదిబోధ 4నిత్యతృప్తి 5నిత్మలుప్త 6అనంతములు}; మ్రొక్కెదము = నమస్కరించెదము; మేము = మేము; నేడున్ = ఇవాళ; అనుకంపన్ = దయతో; మా = మా; కున్ = కు; ఇందఱకున్ = ఇంతమందికిని; వైళమ = శీఘ్రముగా; శ్రీ = సంపత్కరుడైన; కృష్ణుడు = కృష్ణుడు; మగడు = భర్త; కాగన్ = అగునట్లు; చేయుము = చేయుము; తల్లీ = అమ్మ.
భావము:- “భగవతీ కాత్యయని! దయతో మా కందరికీ శీఘ్రంగా శ్రీకృష్ణుణ్ణి పతిగా ప్రసాదించమ్మా.

తెభా-10.1-810-క.
ల్లి! మాకుఁ గృష్ణుఁడు
చేతోవిభుఁ డైననాడు చెలువల మెల్లన్
నేతివసంతము లాడుచు
జార జేసెదము భక్తి చాతురితోడన్."

టీక:- ఓ = ఓ; తల్లి = అమ్మ; మా = మా; కున్ = కు; కృష్ణుడు = కృష్ణుడు; చేతోవిభుడు = పెనిమిటి {చేతోవిభుడు - చేతస్ (చిత్తమునకు) విభుడు, భర్త}; ఐన = అయిన; నాడున్ = రోజున; చెలువలము = అందగత్తెలము; ఎల్లన్ = మేమందరము; నేతి = నేతితో; వసంతములు = వసంతములు {వసంతము లాడుట - వినోదముగా ఉత్సవాదు లందు ఒకరిపైనొకరు జలము మున్నగునవి జల్లుకొనుట}; ఆడుచున్ = ఆడుతు; జాతరన్ = ఉత్సవము; చేసెదము = చేయుదము; భక్తి = భక్తి కలిగుండుట లోని; చాతురిన్ = నేర్పు; తోడన్ = తోటి.
భావము:- ఓ తల్లీ! శ్రీకృష్ణుడు మాకు ప్రాణేశ్వరుడు అయిన రోజు మే మందరమూ నేతివసంతాలు ఆడుతూ పరమ భక్తితో నీకు జాతర చేస్తాం.”

తెభా-10.1-811-వ.
అని నమస్కరించి హవిష్యంబులు గుడుచుచు ని వ్విధంబున మాసవ్రతంబు సలిపి; రందొక్కనాడు.
టీక:- అని = అని; నమస్కరించి = నమస్కరించి; హవిష్యంబులున్ = నేతిప్రసాదములను; కుడుచుచున్ = తినుచు; ఈ = ఈ; విధంబునన్ = లాగున; మాసవ్రతంబున్ = నెల రోజు లాచరించు నోము; సల్పిరి = చేసిరి; అందున్ = దానిలో; ఒక్క = ఒకానొక; దినంబునన్ = రోజున.
భావము:- అని దేవికి నమస్కరించి, హవిషాన్నాలు భుజించారు. వారు ఇలా ఒక నెల కాత్యాయనీ వ్రతం కొనసాగించారు.

తెభా-10.1-812-మ.
ణుల్ ప్రొద్దుల మేలుకాంచి సఖులన్ రం డంచు నాత్మీయ నా
ములం జీరి, కుచద్వయీ భరములన్ ధ్యంబు లల్లాడఁగాఁ
బ్రదోద్దామ గజేంద్రయాన లగుచుం ద్మాక్షునిం బాడుచున్
మునాతీరముఁ జేరఁబోయిరి గృహీతాన్యోన్య హస్తాబ్జలై.

టీక:- రమణుల్ = స్త్రీలు; ప్రొద్దులన్ = ఉదయమే; మేలుకాంచి = నిద్రలేచి; సఖులన్ = స్నేహితురాళ్ళను; రండు = రండి; అంచున్ = అని పిలుచుచు; ఆత్మీయ = వారివారి; నామములన్ = పేరులతో; చీరి = పిలిచి; కుచ = పాలిండ్ల; ద్వయీ = జంట యొక్క; భరమునన్ = బరువుచేత; మధ్యంబులు = నడుములు; అల్లలాడగాన్ = ఊగిపోతుండగా; ప్రమోద్దామ = అధికమైన సంతోషము చేత; గజ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠములవంటి; యానలు = నడకలు కలవారు; అగుచున్ = అగుచు; పద్మాక్షునిన్ = కృష్ణుని; పాడుచున్ = స్తుతించుచు; యమునా = యమునానదీ; తీరమున్ = గట్టు; చేరన్ = దగ్గరకు; పోయిరి = వెళ్ళిరి; గృహీత = పట్టుకోబడిన; అన్యోన్య = ఒండొరుల; హస్త = చేతులు అనెడి; అబ్జలు = పద్మములు కలవారు; ఐ = అయ్యి.
భావము:- ఒకరోజు గోపికలు తెల్లవారగట్ల మేల్కొన్నారు. “రండి రండి” అని తమ స్నేహితురాళ్ళను పేరు పేరున పిలుచుకుంటూ, చనుగవ బరువుకి నడుములు ఊగిస లాడుతూ ఉండగా, ఒకరి చేయి మరొకరు పట్టుకుని బయలుదేరారు కమలాక్షుని మీద పాటలు పాడుతూ సమద గజేంద్ర గమనులై యమునానదీ తీరానికి చేరుకున్నారు.