పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/అక్రూరునితో కుంతి సంభాషణ

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1514-శా.
"న్నా! తల్లులుఁ దండ్రులున్ భగినులున్ నల్లుండ్రు మద్భ్రాతలున్
నిన్నుం బొమ్మనువేళ నే మనిరి? మా నెవ్వల్ విచారింతురే?
యున్నారా సుఖయుక్తులై? మృగి వృక వ్యూహంబులో నున్న రే
న్నే నిక్కడ నున్నదానఁ గుమనః కౌరవ్యమధ్యంబునన్.

టీక:- అన్నా = సోదరా; తల్లులున్ = పినతల్లి పెదతల్లులు; తండ్రులున్ = పినతండ్రి పెదతండ్రులు; భగినులున్ = అక్కచెళ్ళెళ్ళు; అల్లుండ్రున్ = మేనల్లుళ్ళు; మత్ = నా యొక్క; భ్రాతలున్ = అన్నదమ్ములు; నిన్నున్ = నిన్ను; పొమ్మను = పంపించెడి; వేళన్ = సమయము నందు; ఏమి = ఏమని; అనిరి = చెప్పిరి; మా = మా యొక్క; నెవ్వల్ = ఆపదలను; విచారింతురే = తలచుకొందురా; ఉన్నారా = ఉన్నారా; సుఖ = సౌఖ్యముతో; యుక్తులు = కూడినవారు; ఐ = అయ్యి; మృగి = ఆడులేడి; వృక = తోడేళ్ళ; వ్యూహంబు = గుంపు; లోన్ = నడుమ; ఉన్న = ఉన్న; రేఖన్ = విధముగా; ఇక్కడన్ = ఇచ్చట; ఉన్నదానన్ = ఉన్నాను; కుమనః = దుష్టబుద్ధి గలవారు; కౌరవ్య = కౌరవుల; మధ్యంబునన్ = నడుమ.
భావము:- “అన్నా! తల్లులు, తండ్రులు, అక్కచెల్లెళ్ళు, అల్లుళ్ళు మా సోదరులు నిన్నిక్కడికి పంపేటప్పుడు నీతో ఏమి చెప్పి పంపారు? మా దుఃఖాలు వారు కంటున్నారా? వారందరూ సుఖంగా ఉన్నారా? నే నిక్కడ దుర్భుద్ధి గల కౌరవుల నడుమ తోడేళ్ళ గుంపు మధ్యలో ఆడుజింక ఉన్న విధంగా ఉన్నాను.

తెభా-10.1-1515-మ.
పించెన్ ఫణికోటిచే; లతికలం ట్టించి గంగానదిన్
నెఱిఁ ద్రోపించె; విషాన్వితాన్న మొసఁగెన్; నిద్రారతిం జెంది యే
ఱియుండం బొడిపించె నాయుధములన్మత్ప్రుత్రులం; దేమియుం
గొగాఁ డీ ధృతరాష్ట్రసూనుఁడు మహాక్రూరుండు కార్యంబులన్.

టీక:- కఱపించెన్ = కరిపించెను; ఫణి = పాముల {ఫణి - ఫణములు (పడగలు) కలది, సర్పము}; కోటి = సమూహము; చేన్ = చేత; లతికలన్ = తీగలతో; కట్టించి = బంధింపించి; గంగానదిన్ = గంగానదిలో; నెఱిన్ = పూర్తిగా; త్రోపించెన్ = తోయించెను; విష = విషముతో; అన్విత = కూడిన; అన్నమున్ = అన్నము, ఆహారము; ఒసగెన్ = పెట్టెను; నిద్రా = నిద్ర యందు; ఆరతిన్ = ఆసక్తిని; చెంది = పొంది; ఏమఱి = పరాకుగా; ఉండన్ = ఉండగా; పొడిపించెన్ = పొడిపించెను; ఆయుధములన్ = ఆయుధములతో; మత్ = నా యొక్క; పుత్రుల్ = కొడుకుల; అందున్ = ఎడల; ఏమియున్ = కొంచెమైనను; కొఱగాడు = సరిపడడు, అక్కఱకురాడు; ఈ = ఈ యొక్క; ధృతరాష్ట్రసూనుడు = దుర్యోధనుడు {ధృతరాష్ట్ర సూనుడు - ధృతరాష్ట్రుని కొడుకు, దుర్యోధనుడు}; మహా = మిక్కిలి; క్రూరుండు = క్రూరమైనవాడు; కార్యంబులన్ = పనుల సాగించుటలో.
భావము:- దృతరాష్ట్రుడి కొడుకైన దుర్యోధనుడు నా పిల్లలను పాములచే కరపించాడు; తీగలచే కట్టించి గంగానదిలో త్రోయించాడు; విషాన్నము తినిపించాడు; మైమరచి నిద్రపోయే సమయంలో ఆయుధాలతో పొడిపించాడు. వాడు మిక్కిలి క్రూరుడు. నా బిడ్డలంటే వాడికి బొత్తిగా సరిపడదు.

తెభా-10.1-1516-మ.
లుఁడుం గృష్ణుఁడు నెన్నఁడైనఁ దమలో భాషించి మేనత్త బి
డ్డకున్ మేలు తలంతురే? వగపులన్ య్యంగఁ బాలై రయో
జాతాక్షుఁడు భక్తవత్సలుఁ డిలాక్రంబు భాగించి యి
మ్ము నిప్పించునె నా కుమారకులకున్ ముఖ్యప్రకారంబునన్."

టీక:- బలుడున్ = బలరాముడు; కృష్ణుడున్ = కృష్ణుడు; ఎన్నడు = ఎప్పుడు; ఐనన్ = అయినా; తమలో = వారిలోవారు; భాషించి = మాట్లాడుకొని; మేనత్త = మేనత్త యొక్క; బిడ్డల్ = కొడుకుల; కున్ = కు; మేలు = క్షేమమును; తలంతురే = తలచుకొనెదరా; వగపులన్ = దుఃఖములతో; డయ్యంగన్ = కృశించుటను; పాలైరి = చెందారు; అయో = అయ్యో; జలజాతాక్షుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; భక్తవత్సలుడు = కృష్ణుడు {భక్తవత్సలుడు - భక్తుల యెడ వాత్సల్యము కలవాడు, విష్ణువు}; ఇలాచక్రంబున్ = భూమండలమును, రాజ్యమును; భాగించి = భాగము పంచి; ఇమ్ములన్ = చక్కగా; ఇప్పించునె = ఇప్పించునా; నా = నా యొక్క; కుమారకుల = పుత్రుల; కున్ = కు; ముఖ్య = గామిడి, శ్రేష్ఠమైన; ప్రకారంబునన్ = రీతిగా.
భావము:- బలరాముడు కృష్ణుడు ఎప్పుడైనా ఇద్దరూ మాట్లాడుకునే టప్పుడు మేనత్తబిడ్డల క్షేమం స్మరిస్తారా? పుండరీకాక్షుడు భక్తవత్సలుడు అగు శ్రీకృష్ణుడు ఉండగా, అయ్యో! మా బిడ్డలు దుఃఖముల పాలై కృశింపవలసి వచ్చిందే. భక్తవత్సలుడగు శ్రీహరి రాజ్యాన్ని పంచి వారి భాగం భాగించి నా పుత్రులకు చక్కగా ఇప్పిస్తాడా?”

తెభా-10.1-1517-వ.
అని పలికి కృష్ణునిఁ జిత్తంబున నిల్పి నమస్కరించి సంకీర్తనంబు చేసి “సర్వాత్మ! సర్వపాలక! పుండరీకాక్ష! శరణాగతనైన నన్ను రక్షింపు రక్షింపు” మని వగచుచున్న కుంతికి నక్రూరుండు విదురసమేతుండై ప్రియవచనంబుల దుఃఖోపశమనంబు చేసి వీడ్కొని బంధుమిత్ర మధ్యంబున సుఖోపవిష్టుండైన ధృతరాష్ట్రున కిట్లనియె.
టీక:- అని = అని; పలికి = చెప్పి; కృష్ణుని = కృష్ణుని; చిత్తంబునన్ = మనసులో; నిల్పి = ఉంచుకొని; నమస్కరించి = నమస్కారము చేసి; సంకీర్తనంబు = స్తుతించుట; చేసి = చేసి; సర్వాత్మ = సమస్తము నీవైనవాడ; సర్వపాలక = సర్వులను పాలించువాడ; పుండరీకాక్ష = పద్మాక్షుడా; శరణాగతను = శరణువేడు దానను; ఐన = అయిన; నన్ను = నన్ను; రక్షింపు = కాపాడు; రక్షింపుము = కాపాడు; అని = అని; వగచుచున్ = దుఃఖించుచున్న; కుంతి = కుంతీదేవి; కిన్ = కి; అక్రూరుండు = అక్రూరుడు; విదుర = విదురునితో; సమేతుండు = కూడుకొన్నవాడు; ఐ = అయ్యి; ప్రియ = ఇంపైన; వచనంబులన్ = మాటలతో; దుఃఖ = దుఃఖమును; ఉపశమనంబు = అణచుటను; చేసి = చేసి; వీడ్కొని = సెలవు తీసుకొని; బంధు = బంధువులు; మిత్ర = స్నేహితులు; మధ్యంబునన్ = నడుమ; సుఖ = సుఖముగా; ఉపవిష్టుండు = కూర్చున్నవాడు; ఐన = అయిన; ధృతరాష్ట్రున్ = ధృతరాష్ట్రున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలికి తన మనస్సులో శ్రీకృష్ణుని నిల్పుకుని, నమస్కరించి, కీర్తించి “ఓ కమలపత్రనయన! నీవు సర్వాత్మకుడవు, సర్వపాలకుడవు, ప్రపన్నరాలను అయిన నన్ను కాపాడవయ్యా” అని దుఃఖిస్తున్న కుంతీదేవికి ఇంపైన మాటలతో విదురుడు, అక్రూరుడు దుఃఖం శాంతింప చేసారు. ఆమె వద్ద వీడ్కోలు తీసుకున్నారు. బంధుమిత్రుల మధ్యన సుఖముగా కూర్చుండి యున్న దృతరాష్ట్రుడితో అక్రూరుడు ఇలా అన్నాడు.