గరిమెళ్ళ వ్యాసాలు
గరిమెళ్ళ వ్యాసాలు
సంకలనం
బి. కృష్ణ కుమారి
తెలుగు విశ్వవిద్యాలయం
హైదరాబాదు
సంకలనం
బి. కృష్ణ కుమారి
తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ : 132
ప్రథమ ముద్రణ : జూలై, 1992
ప్రతులు : 1000
వెల : రూ. 30/-
ప్రతులకు :
తెలుగు విశ్వవిద్యాలయం
లలితాకళాక్షేత్రం
పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి
హైదరాబాదు - 500 004
ముద్రణ :
విమల్ ప్రింటర్స్,
గాంధీ నగర్
హైదరాబాద్.
భూమిక
తెలుగు భాషా సాహిత్య కళాసంస్కృతుల సర్వతోముఖవిలసనానికి, వికాసానికి, ఆంధ్రప్రదేశ రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ప్రకారం 1985 డిసెంబరు 2వ తేదీన రూపుదాల్చిన విశిష్ఠ విద్యా సంస్థ తెలుగు విశ్వవిద్యాలయం.
బోధన, పరిశోధన, ప్రచురణలతొ పాటు విస్తరణసేవ, రాష్ట్రేతరాంధ్రులకు, విదేశాంధ్రులకూ సహాయసహకారాలలో కల్పన వంటి బహుముఖీన కార్యక్రమాలను కూడా ఈ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నది.
పూర్వం ఉన్న అకాడమీలు, తెలుగు భాషా సమితి, అంతర్జాతీయ తెలుగు సంస్ధ విలీనం కావడంతో విశ్వవిద్యాలయం వివిధ పీఠాలు, కేంద్రాలు, విభాగాల సమాహరంగా వ్యవహరిస్తున్నది. తెలుగు జాతి వైభవోన్నతులకు అద్ధం పట్టే గ్రంధాల ప్రచురణ విశ్వవిద్యాలయ ప్రధాన ఆశయాల్లో ఒకటి.
విశ్వవిద్యాలయంలో విలీనమైన అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవిశ్రాంత కృషిద్వారా దేశసాహిత్య రంగంలో విశిష్టస్థానం సమకూర్చుకుంది. విలక్షణమైన వందలాది గ్రంధాలను ప్రచురించింది.
విశ్వవిద్యాలయం ఈ ప్రచురణ సత్ సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నది. గరిమెళ్ల శతజయంత్యుత్సవ ప్రారంభ సభలకి ఆయనకి నివాళి ఈ గ్రంధాన్ని మీ ముందుంచుతున్నది.
"గరిమెళ్ళ వ్యాసాలు" గ్రంధం గురించి -
ఈవ్యాససంకలనంలో ప్రజల పాటల గరిమెళ్ళకి మరోవైపు బలమైన వ్యాసరచయితని చూడవచ్చును.
స్వాతంత్య్ర సమరకాలంలో గళం విప్పి మహోజ్వల జాతీయగీతాలు పాడగా ప్రజల నుర్రూతలూగించి ఆంగ్లేయపాలకుల గుండెల్లో సింహస్వప్నమయ్యారు గరిమెళ్ళ నాటి దేశభక్తిపోరాటాన్ని 'మాకొద్దీతెల్లదొరతనం ' 'సైతాను ప్రభుత్వమిక సాగనీయకండోయ్ ' యనే చరణాల్లోదట్టించి ఫిరంగి గుండ్ల కన్న శక్తిమంతంగా గుండెలదిరేటట్లు సంధించాడు. పాటలు ఆపేసి భుక్తికోసం, తనభావాల అభివ్యక్తీకరణకోసం ఎక్కువగా రాజకీయ వ్యాసాలు రాశారు. అంతకుముందు భారతి, కృష్ణాపత్రిక ఇత్యాదుల్లో సాహిత్య వ్యాసాలు ప్రచురించారు.
గొప్ప కవీ కళాకారుడు తన కాలం నాటి స్థితిని సిద్ధాంతీకరించడానికి విపులమైన రచనలు చేయకతప్పదు. తనలోని సరికొత్త అనుభవం, సామాజిక పరిస్థితి, అవసరాల రీత్యావివరణ ఇచ్చుకోక తప్పదు. అట్లాంటి వివరణే వ్యాసాల రూపంలో గరిమెళ్ళ ప్రచురించారు. ఈ వ్యాసాలు చాలా వరకు అంతకు ముందు తను రాసిన గేయాలలో తాను విడమరిచి చెప్పలేని అంశాలే కనిపిస్తాయి. ఐతే గేయాల్లో కనిపించేంతస్పష్టమైన తాత్వికత వ్యాసాల్లోకనిపించకపోయినా గరిమెళ్ళ ఆలోచనలు ఏమిటో, అతనే వైపో తెలిసిపోతుంది. తానున్నసమాజంలో అన్యాయం రూపుమాపి ఒకానొక సామ్యవాద వ్యవస్థ నెలకొనాలనీ, అది భారతదేశస్థితిగతులకు అనుగుణమైన దేశవాళీ సిద్ధాంతం వల్లే సాధ్యమవుతుం దనేది ఆయన భావన గరిమెళ్ళ ప్రజలను పాటల ద్వారా మేల్కొలిపారు. మేల్కొన్న తరువాత వాళ్ళు నడిచే మార్గాన్ని నిర్దేశించలేదు. నాటి దేశ రాజకీయాల దృష్ట్యానే వాళ్లని జాగృతం చేయాలన్నది అప్పటి ఆయన ఏకైక లక్ష్యం.
జాతీయోద్యమం ఎన్నోఆటుపోట్లకి గురవుతూ విమర్శలకి లోనవుతుంటే ఆ విమర్శలలోని వాస్తవాలను పరిశీలించారు. ప్రతి సమస్యనీ, విమర్శనీ ప్రజాదృక్పధం నుండి చూశారు తనని తానుకూడా ఆ ప్రజారాశిలో ఒకనిగా భావించారు. అంతేకాని ఆప్రజలకన్నా ఉన్నతునిగా ఎన్నడూ ఎక్కడా అనుకోలేదు. అందుకే అన్ని కష్టాలను, అంతదారిద్య్రాన్ని అవలీలగా ఎదుర్కోగలిగారు. తాను త్యాగం చేస్తూ ప్రజలనూ, పరిపాలకులనీ త్యాగం చేయాలనే ఉద్భోద చేశారు. తనలాగే ధనికులు కూడా మౌలికావసరాలు తీర్చుకొని తమ అదనపు ఆస్తిని ప్రజలకి పంచాలని ఆశించారు. ఐతే ధనస్వభావ దుర్గుణాన్ని (అంతర్జాతీయంగా కూడా) అంచనవేయడంలో మాత్రం పొరబాటు పడలేదు.
ఇక సాహిత్య వ్యాసాల గురించి-
శనివారపు సుబ్బారావు గారు వ్రాసిన 'పల్లెటూరి కధలు ' గ్రంధ సమీక్షని కూడా వ్యాసంగా గ్రహించి సంకలన కర్త ఇందులోచేర్చారు. 'నూతన సాహిత్య విజృంభణము ' (1928) వ్యాసంలో కవిత్వం గురించి రాస్తూ "వ్యర్ధ పద్య ప్రచురణ మెక్కువై నోటిలో నుంచి వచ్చెడి తుంపురలు అచ్చు పడుచున్నవేయని విచారింపవలసి వచ్చినది. " అని ఘాటుగానే విమర్శించారు. భావకవిత్వపు స్వర్ణోత్సవ కాలంలో అందుకు భిన్నంగా జాతీయ భావనతో సమరగీతాలురాసి ప్రచారం చేస్తూనే భావకవిత్వాన్ని పై విధంగా విమర్శించడం గరిమెళ్ళ సాహిత్య దృక్పధం తేటతెల్లం అవుతుంది.
భక్తిభావాలకి పరిమితమైన గీతకవిత్వం దేశభక్తికోసం నడుం కట్టాలని చెప్పారు. 'సాంఘిక నవల ' (పే.65) వ్యాసంలో 'శైలికవికినైజమైఉండాలం ' టారు. 'పల్లెటూరి కధలు ' (పే.54) సమీక్షలో రచయిత అందమైన ఉన్నతవర్గం వారిని కాకుండా కింది వర్గం వారిని గురించి రాయాలని హెచ్చరిస్తారు. వాడుక భాష వల్ల జనసామాన్యభాష సాహిత్యంలోకి వస్తుందనీ అందుకు స్వాగతం పలకాలనీ అంటారు.
నాటి సాహిత్యవాతావరణంలోని లొసుగుల్నిఎత్తిచూపుతూనే సాహిత్యం నిర్వహించాల్సిన విధిని నొక్కి చెప్పారు. రచయిత బాధ్యతని ఆయన మాటల్లోనే చూద్దాం.
కేశవరంలో ప్రోగ్రెసివ్ రైటర్ల మహాసభలో అధ్యక్షోపన్యాసం చేస్తూ (పే.86) "మనకూ, కేవలం సాహిత్యలేఖకులకూ గల వ్యత్యాసం ఏమంటే వారు పరిశుభ్రమైన సోపానకులును, కళాభిమానులును అయి వుండగా మనము కళలను ప్రజాసేవకు, విజ్ఞానమునము, దేశపురోభివృద్దికి వినియోగించుటకై తయారై ఉన్నాము" అంటారు.
సాహిత్యం సాహిత్యం కోసమే అని కాకుండా అది ప్రజాభివృద్దికొసం అని నమ్మి దాన్ని ఆచరించినవారు గరిమెళ్ళ. తాను వ్యక్తం చేసిన ఆలోచనల్లోని అభివృద్ధికరమైన అంశాల్ని ఈనాటికి గ్రహించవలసిన పరిస్థితి ఉంది. ఆ రకంగా ఈవ్యాసాల అవశ్యకతని గుర్తించక తప్పదు.
కవిగా, రచయితగా, ఒక వ్యక్తిగా గరిమెళ్ళ స్పురణ, ప్రేరణ ఈనాటి పరిస్థితులకి మరింత అవసరం. అందుకే ఈ వ్యాస సంకలనం.
--జయధీర్ తిరుమలరావు డైరెక్టర్, ప్రచురణ శాఖ,
తెలుగు విశ్వవిద్యాలయం ముందుమాట
గరిమెళ్ళ సత్యనారయణ రచించిన "మాకొద్దీ తెల్లదొరతనము ' 'దండాలోయ్ మేముండ లేమండోయ్ ' మొదలైన పాటల్లో 'జాతీయోద్యమ కాలంలో దేశభక్తుల్ని సృష్టింఇన అపర కవిబ్రహ్మ కన్పిస్తాడు.
గరిమెళ్ళ 1926 నుంచి 1952 ఆగస్టు వరకు కృష్ణా పత్రిక, భారతి, ప్రజామిత్ర, ఆనందవాణి, డంకా, కిన్నెర మొదలైన పత్రికల్లో అనేక విషయాలను గురించి రాసిన వ్యాసాలు లభించాయి. ఈ వ్యాసాల్లో ఒక విమర్శకుడు దృగ్గోచరమవుతాడు. గరిమెళ్ళ వ్యాసాలు చదివే పాఠకుడు కూడా విమర్శనా దృష్టితోనే చదవాల్సుంటుంది. లేకపోతే గరిమెళ్ళ పట్ల గుడ్ది ఆరాధనతో గుడ్ది ద్వేషమో కలిగే అవకాశం వుంది.
స్థూలంగా చెప్పాలంటే గరిమెళ్ళ ఉద్యమాలు ఊపులో ఉన్నపుడు పాటలు రాశారు. ఉదృతి మందగించినపుడు వ్యాసాలు రాశారు.
'రాజకీయాలనుంచి కవిత్వ విషయాలు ఎన్నుకోవాలి ' అని చెప్పిన గరిమెళ్ళ చివరివరకు రాజకీయాలకు చేరువలోనేవున్నారు. ఆయన వ్యాసాల్లోంచి రాజకీయాలను విడదీసి చూపటం, ఇవి రాజకీయమైనదని ఎత్తి చూపటం కష్టం. అన్నివ్యాసాల్లో రాజకీయ స్పర్శ వుంటుంది. ఆయన రాసిన వ్యాసాలను విభజించే ప్రయత్నం చేసి, ఆ యా వ్యాసాల్లో ప్రధానంగా వున్న అంశాలను బట్టి 2 భాగాలుగా విభజించవచ్చు.
1. సాహిత్యం. 2. రాజకీయం.
గరిమెళ్ళ కవి, గాయకుడు, రచయిత, అందువల్ల ఆ కవి, గాయకుడి సాహిత్యాభిప్రాయాలను తెలియచేసే వ్యాసాలను మొదటి భాగంలో చేర్చడం జరిగించి.
సాహిత్య వ్యాసాలు 1928 నుంచి 1938 వరకు లభించాయి. మనం యిపుడు పేర్కొంటున్న ఆధునిక సాహిత్యాన్ని (కందుకూరి నుంచి తరువాత వచ్చిన సాహిత్యాన్ని) నూతన సాహిత్యంగా గుర్తించి, ఆ సాహిత్యాన్ని అనేక కోణాలనుంచి పరిశీలిస్తూ 'నూతన సాహిత్య విజృంభణము ' తో యీ సంకలనం మొదలవుతుంది. తిరువళ్ళువరు రచించిన తిరుక్కురళ్ కావ్యాన్ని 'అర్ధత్రయ సర్వస్వము' అనే పేరుతో 7 భాగాలుగా ప్రకటించ నిశ్చయించి మొదటి భాగానికి రాసిన ముందుమాట, సమీక్షా వ్యాసాలు మొదలైనవి పై దానిననుసరించాయి. 'ప్రపంచ మంతా అక్షరాలూ-అంకెలే' అనేది 25-10-38 న పశ్చిమ గోదావరి జిల్లా కేశవరంలో 'ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివు రైటర్ల మహాసభ'లో (అభ్యుదయ రచయితల సంఘం మహాసభ కాదు) చేసిన అధ్యక్షోపన్యాసం. ప్రజల్లో అక్షరాస్యత పెరగాల్సిన అవశ్యకతని, దానికై రచయితలు చేయవలసిన కృషిని ఇందులో చర్చించారు.
గరిమెళ్ళ కవిగాను, రచయితగాను కూడా ప్రజల్లో రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచడానికి కృషి చేశారు. దేశ రాజకీయాల గురించి, రాజకీయ పార్టీల గురించి, ఆంధ్ర రాష్త్రం ఏర్పాటు గురించి, రాజకీయాలను ప్రభావితం చేసే ఆర్థిక పరిస్థితుల గురించి, ఆయన అభిప్రాయాలను ప్రతిబింబించే వ్యాసాలు రెండవ భాగంలో పొందుపరచబడ్డాయి.
1926లో అప్పటి శాసన సభలలో ప్రవేశించుటకై జస్టిసు పార్టీవారు, స్వరాజ్య వాదులు, సముచిత సహకార వాదులు తమ తమ నినాదాలతో, ప్రచారాలతో బయల్దేరినపుడు ఆయా విషయాలను చర్చించిన 'భ్రమ పెట్టని వారెవరు?' అనే వ్యాసంతో ఈ భాగం ప్రారంభమవుతుంది. ఈ భాగంలో ఒకటి రెండు వ్యాసాలు మినహా మిగిలినవన్నీ 1947 నుంచి 1952 వరకు వచ్చినవి. అప్పటి కాంగ్రెస్, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు, కమ్యూనిజం మొదలైన విషయాలకు సంబంధించిన వ్యాసలు ఈ భాగంలో ఉన్నాయి. ఇందులో వ్యాసాలను పాఠకుల సౌలభ్యం కొసం తారీఖుల వారీగా కాకుండా విషయాల పరంగా ఒకచోట చేర్చటం జరిగింది.
ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధి అయ్యేట్టు కృషి చెయ్యాలన్నా, ఆ దేశ అర్థిక పరిస్థితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని గరిమెళ్ళ మర్చిపోలేదు. ఆర్థికాభివృద్ధిని సాధించటానికి, ఉన్న పరిస్థితిని చక్కదిద్దుకోవటానికి ఏదేశానికైనా ప్రణాళికలు అవసరం. అమెరికా, రష్యా, బ్రిటను, ఇండియా మొదలగు వారి ప్రణాళికల గురించి చర్చించిన వ్యాసం 'ప్రణాళికలు' మొదలైన ఆర్థిక వ్యాసాలు ఇందులో ఉన్నాయి. స్వాతంత్ర్యానంతర భారత దేశంలో ఆర్ధిక పరిస్థితుల్లో వచ్చిన మార్పునే ఆర్ధిక వ్యాసాలు ఎక్కువ చిత్రించాయి. స్వార్థ పరులకే పరిస్థితులెంత బాగా వుపయోగపడుతున్నాయో చెపుతూ ప్రజలు సుఖపడాలంటే నాశనం కావలసిన అధర్మం ఎంతో వుందంటూ చెప్పే 'ధర్మమేవ జయతే' అనే వ్యాసంతో యీ సంకలనం ముగుస్తుంది.
ఈ వ్యాసాల్ని పఠించేటప్పుడు అప్పటి రాజకీయ, సామాజిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వుంటుంది. 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రలో పర్యటించి ఉపన్యాసాలిచ్చారు. ఆ సమయంలో వారు హిందూ పునరుద్ధరణ భావాల్ని కూడా ప్రచారం చేశారు. వారి ఉపన్యాసాలకు ఉత్తేజితులై రాజకీయాలవైపు మళ్ళిన వారిలో గరిమెళ్ళ ఒకరు. ఆ అభిప్రాయాలు ఆయనను చివరి వరకు వదలలేదు. అందుకే ప్రాచీన వర్ణవ్యవస్థలో ఉన్నది వర్గ వ్యవస్థే అన్న వాదాన్ని ఖండిస్తూ అది వర్గ వ్యవస్థ కాదనీ, అక్కడ దాస్యం, బానిసత్వం లేవనీ, అది ప్రభు సేవక దర్జా అనీ సమర్థిస్తారు. భారతదేశం రెండుగా చీలిందనే కోపంతో దానికి మొత్తం బాధ్యత ముస్లిం నాయకులదే అంటారు. గ్రామ సంస్కృతిని గొప్ప చెయ్యటం, నౌకరీ చెయ్యటాన్ని చిన్నచూపు చూడడం (నీచంగా చూశారనాలేమో) చేశారు. రష్యాలో వచ్చిన సొషలిస్టు ప్రభుత్వం, అది సాధించిన ప్రగతి అన్నీ బాగానే వున్నాయి గాని మన దేశాని కొచ్చేసరికి 'దేశవాళీ ' కావాలి అంటారు. దేశాన్ని బాగు చెయ్యటానికి ఎవరో 'అవతార మూర్తి ' దిగిరావాలంటారు.
సమకాలీన పరిస్థితులు మనుషుల్ని ఎంత బలంగా ప్రభావితం చేస్తాయో గరిమెళ్లరచనలు చదివితే అర్థమవుతుంది. 'రాజకీయాలనుంచి కవిత్వ విషయాలు ఎన్నుకోవాలి' అన్న గరిమెళ్ళ భావ కవిత్వం ప్రభావానికి లోనై 'వలపు-వగలు' అనే గీతం రాశారు. జానపద బాణీల్లో పాటలు రాసి ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన గరిమెళ్ళ పద్యకావ్యాల ప్రభావంలో పడి 'వేగి ప్రొద్దు తలంపులు' అని దీర్ఘ మాలికలు రాశారు. పై రెండు తప్ప అట్టివి ఇక లభించ లేదు కనుక ఆ ప్రభావాలనుంచి బయట పడ్డారనే అనుకొవాలి.
హిందూ పునరుద్దరణ భావాల ప్రభావం వున్నా, ఆర్థిక దుస్థితి జీవితాన్ని పట్టి పీడించినా 'మాకొద్దీ తెల్లదొరతనము ' అని గొంతెత్తినపుడు ఏ ప్రజల పక్షపాతో చివరివరకు కూడా గరిమెళ్ళ అదే ప్రజల పక్షపాతి. తెల్లదొరతనాన్ని ఎదిరించటానికి ఎలాగైతే వెనుకాడలేదో, అలాగే స్వతంత్ర భారత ప్రభుత్వ చర్యలను, నాయకులను విమర్శించటానికి, ప్రశ్నించటానికి భయపడలేదు. ప్రజాశ్రేయస్సుని గరిమెళ్ళ ఎంతలా కాంక్షించాడో ఏదో ఒక రూపంలో ఇందులో ఉన్న వ్యాసాల్లో కనబడుతుంది.
గరిమెళ్ళ వ్యాసాల్ని సంకలనం చేసి, ముందుమాట రాసే అవకాశాన్ని నాకిచ్చిన తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డా. సి. నారాయణరెడ్దిగారికి, తదితర అధికారులకు నా ధన్యవాదాలు.
- బి. కృష్ణకుమారి
కృతజ్ఞతలు
గరిమెళ్ళ వ్యాసాలను సేకరించటంలో సంకలనం చేయటంలో, సహకరించి సలహాలిచ్చిన-
డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆర్కైవ్స్, హైదరాబాద్, మద్రాసు కార్యాలయాల అధికారులకు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్, సారస్వత నికేతనం, వేటపాలెం, గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం, రాజమండ్రి, గంగిరెడ్డి గ్రంథాలయం, అనపర్తి, ఆంధ్ర సాహిత్య పరిషత్, ప్రభుత్వ ప్రదర్శనశాల మరియు పరిశోధనా కేంద్రం, కాకినాడ, ఠాగూర్ గ్రంథాలయం, విజయవాడ, తెలుగు విశ్వవిద్యాలయం, గ్రంథాలయాల అధికారులకు.
డా॥ చల్లా రాధాకృష్ణ శర్మ, డా|| జయధీర్ తిరుమలరావు, శ్రీ పరకాల పట్టాభిరామారావు, సజ్జా వెంకటేశ్వర్లు, చలసాని ప్రసాద్, కె. వి. రమణారెడ్డిగార్లకు.
ఎపుడు వెనక్కి తిరిగినా వెన్నెల్లా నవ్వుతూ కన్పించే 'సుధ'కీ,
హృదయ పూర్వక కృతజ్ఞతలు.
- బి. కృష్ణకుమారి
విషయసూచిక
సాహిత్యం
| 1 |
| 32 |
| 43 |
| 54 |
| 59 |
| 68 |
| 80 |
రాజకీయం
| 87 |
| 95 |
| 102 |
| 108 |
| 117 |
| 127 |
| 139 |
| 146 |
| 153 |
| 157 |
| 163 |
| 169 |
అనుబంధం
| 174 |
గరిమెళ్ళ సత్యనారాయణ జీవిత విశేషాలు
జననం: : 1893
తల్లిదండ్రులు : సూరమ్మ, వెంకట నరసింహం
జన్మ స్థలం : శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట, గోనెపాడు గ్రామం
విద్యాభ్యాసం : ప్రియాగ్రహారం, విజయనగరం, మచిలీపట్నం
వృత్తి: : విజయనగరం ఉన్నతపాఠశాలలో ఉపాధ్యాయుడుగాను గంజాం జిల్లా కలెక్టరుగారి కార్యాలయంలో గుమాస్తాగాను గృహలక్ష్మీ, ఆనందవాణిమొదలైన పత్రికల్లో ఉపసంపాదకుడు గాను, కొన్ని పత్రికలకు ప్రీలాన్సుజర్నలిస్టుగాను పని చేశారు. -
స్వాతంత్ర్యోద్యమంలో పాటలు రాసి పాడినందుకు 9-2-1922న అరెస్టు కాబడి రెండేండ్లు కారాగార వాస శిక్ష అనుభవించారు.
మరణం : 18-12-1952 మద్రాసులో
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse