సత్యశోధన/మూడవభాగం/3. ఒరిపిడి

వికీసోర్స్ నుండి

3. ఒరిపిడి

ఓడలు రేవుకి చేరాయి. యాత్రికులంతా దిగిపోయారు. “తెల్లవాళ్ళు గాంధీమీద మండిపడుతున్నారు. వారి ప్రాణాలకు అపాయం కలుగవచ్చు. కనుక గాంధీని, వారి కుటుంబ సభ్యుల్ని రాత్రిపూట ఓడనుండి దింపండి. రేవు సూపరిండెంట్ టేటమ్ గారు రాత్రిపూట వాళ్ళను ఇంటికి భద్రంగా తీసుకు వెళతారు” అని ఎస్కాంబీగారు ఓడ కెప్టెనుకు కబురు పంపారు.

కెప్టెను నాకీ సందేశం అందజేశారు. నేను అందుకు అంగీకరించాను. ఈ సందేశం అంది అరగంట గడిచిందో లేదో టాటన్ గారు వచ్చి కెప్టెనుతో ఇలా అన్నాడు “గాంధీగారు నాతో రాదలచుకుంటే నా జవాబుదారీమీద వారిని తీసుకువెళతాను. గాంధీ గారిని గూర్చి ఎస్కాంబీగారు పంపిన సందేశాన్ని మీరు పాటించనవసరం లేదు. ఈ ఓడల యజమాని యొక్క వకీలు హోదాతో నేను చెబుతున్నాను” ఆ తరువాత ఆయన నా దగ్గరికి వచ్చి “మీకు ప్రాణాలంటే భయం లేకపోతే మీ భార్యాపిల్లల్ని బండిమీద రుస్తుంగారింటికి పంపించి, మనమిద్దరం కాలినడకన నడిచి వెళదాం. మీ మీద ఈగ కూడా వాలదని నా విశ్వాసం. ఇప్పుడు అంతటా శాంతి నెలకొని వుంది. తెల్లవారంతా వెళ్ళి పోయారు. మీరు దొంగవాడిలా చాటుగా వెళ్ళడం నాకిష్టంలేదు” అని అన్నాడు. నేను అందుకు సమ్మతించాను. నా భార్యాపిల్లలు ఏ బాధలేకుండా రుస్తుంజీ సేఠ్ గారింటికి చేరారు. నేను కెప్టెన్‌గారి దగ్గర సెలవు తీసుకొని లాటన్ గారితో పాటు ఓడదిగి రుస్తుంజీసేఠ్ గారి ఇంటికి బయలుదేరాను. వారి ఇల్లు అక్కడికి రెండు మైళ్ళ దూరాన వున్నది.

మేము ఓడనించి దిగేసరికి కొంతమంది తెల్లదొరల పిల్లలు గాంధీ గాంధీ అంటూ అరుస్తూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అయిదారుగురు చుట్టూ మూగి గాంధీ గాంధీ అని పెద్దగా అరవడం ప్రారంభించారు. లాటన్‌గారు గుంపు పెరుగుతుందేమోనని భావించి రిక్షావాణ్ణి పిలిచారు. రిక్షా ఎక్కడం నాకు యిష్టం లేకపోయినా రిక్షా ఎక్కడానికి సిద్ధపడ్డాను. కాని తెల్లవాళ్లు రిక్షావాణ్ణి చంపివేస్తామని బెదిరించేసరికి అతడు పారిపోయాడు. మేము ముందుకు సాగుతూ వుంటే గుంపు పెరిగి పోసాగింది. నడవడానికి చోటు లేదు. ముందుగా వాళ్ళు నన్ను, లాటన్ గారిని విడగొట్టి వేరుచేశారు. తరువాత నామీద రాళ్ళు, మురిగిపోయిన గ్రుడ్లు విసరడం ప్రారంభించారు. ఎవడో నా తలపాగాను ఎగరగొట్టాడు. కొందరు నన్ను కొట్టడం ప్రారంభించారు. నన్ను క్రిందికి పడత్రోశారు. నాకు స్మృతి తప్పింది. దగ్గరలోనేగల ఇంటి చువ్వలు పట్టుకొని నిలబడ్డాను. అలా నిలవడం కూడా కష్టమైపోయింది. ఇంకా దెబ్బలు తగులుతూనే వున్నాయి.

ఇంతలో అటు పోలీసు సూపరింటెండెంట్ గారి భార్య హఠాత్తుగా వచ్చింది. ఆమె నన్ను ఎరుగును. ఆమె ధైర్యవంతురాలు. త్వరగా వచ్చి నా దగ్గర నిలబడింది. అప్పుడు ఎండలేదు. అయినా ఆమె గొడుగు తెరిచి నాపై పట్టింది. దానితో గుంపు కొంచెం ఆగింది. నన్ను కొట్టాలంటే ముందు ఆమెను కొట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆవిధంగా నన్ను ఆమె కమ్మి వేసింది.

ఇంతలో ఒక భారతీయుడు ఇదంతా చూచి పరుగెత్తుకొని పోలీసు ఠాణాకు వెళ్లి సమాచారం అందజేశాడు. పోలీసు సూపరింటెండెంటు నన్ను రక్షించడంకోసం కొంతమంది పోలీసుల్ని పంపించాడు. వారు త్వరగా అక్కడికి చేరుకున్నారు దారిలోనే పోలీసుఠాణా వున్నది. నన్ను ఠాణాలో ఆశ్రయం పొందమని సూపరింటెండెంటు అన్నాడు. నేను అందుకు అంగీకరించలేదు. వారి తప్పు తెలుసుకొని వారే మౌనం వహిస్తారు. వారికి న్యాయబుద్ధికలుగగలదను విశ్వాసం నాకు వున్నది.” అని కృతజ్ఞతతో బదులు చెప్పాను. పోలీసులు నా వెంట వచ్చారు. వారి రక్షణ వల్ల మరేమీ హాని కలుగలేదు. రుస్తుంజీ గారి ఇంటికి చేరాను. నిజంగా నాకు పెద్ద దెబ్బలు తగిలాయి. ఒక చోట పెద్ద గాయం అయింది. ఓడ వైద్యులు దాదీ బరజోర్ గారు అక్కడే వున్నారు. వారు ఓపికతో నాకు సేవ చేశారు.

లోపల శాంతిగానే వున్నది. కాని బయట గొడవ ఎక్కువైంది. తెల్లవాళ్ళు ఇంటి ముందు ప్రోగై “గాంధీని మాకు అప్పగించండి” అని గొడవ చేయడం ప్రారంభించారు. పోలీసు సూపరింటెండెంటు అక్కడికి వచ్చాడు. ఇదంతా చూచి గొడవ చేస్తున్న వాళ్లనెవ్వరినీ ఏమీ అనకుండా వాళ్లందరికీ తలా ఒక మాట చెబుతూ వాళ్ళను అక్కడే నిలబెట్టివేశాడు.

అయినా ఆయన చింతాముక్తుడు కాలేదు. లోపలికి తన మనిషిని పంపి “గాంధీ! నీ మిత్రుని ధనం, ప్రాణం, గృహం, నీ భార్య, నీ బిడ్డలు మరియు నీ ప్రాణం దక్కాలంటే వెంటనే మారువేషంతో ఇల్లు విడిచి వెళ్ళిపొండి” అని వార్త పంపాడు

ఒకే రోజున పరస్పర విరుద్ధమైన రెండు పరిస్థితులు నాకు తటస్థపడ్డాయి. ప్రాణభయం కేవలం కల్పితం అని భావించి లాటనుగారు నన్ను బహిరంగంగా రమ్మన్నాడు. అందుకు నేను అంగీకరించాను. కాని యిప్పుడు ప్రాణభయం ఎదురుగా కనబడుతున్నది. మరో మిత్రుడు అందుకు విరుద్ధంగా సలహా యిస్తున్నాడు. దీనికి నేను సమ్మతించాను. నా ప్రాణాలకు ముప్పు వాటిల్లు నను భయంతో, మిత్రునికి అపాయం కలుగునను భయంతో, నా భార్యా బిడ్డలకు ప్రమాదం కలుగునను భయంతో నేను సమ్మతించానని ఎవరు అనగలరు? మొదట నేను ధైర్యంతో ఓడ దిగి గుంపును ఎదుర్కోవడం. తరువాత మారు వేషంలో తప్పించుకొని వెళ్ళిపోవడం రెండూ ఒప్పిదాలే అని ఎవరు అనగలరు? అయితే ఆయా విషయాల యోగ్యతలను నిర్ణయించడం అనవసరం. ఈ విషయాలను పరిశీలించి, యిందువల్ల నేర్చుకోవలసింది ఏమైనా వుంటే నేర్చుకోవడమే మంచిది. ఒకడు ఒక్కొక్క సమయంలో ఎలా ప్రవర్తిస్తాడో చెప్పడం కష్టం. మానవుని బాహ్యాచరణను మాత్రం గమనించి అతని గుణగణాల్ని నిర్ణయించడం సరికాదని, అది అసమగ్రమని మనం గ్రహించాలి.

ఇక నేను పలాయనానికి పూనుకొన్నాను. దెబ్బల బాధ మరచిపోయాను. నల్లపోలీసు వేషం వేశాను. తలపై దెబ్బలు తగులకుండా ఇత్తడి సిబ్బి పెట్టుకొని దాని మీద మద్రాసు ఉత్తరీయం తలపాగాగా చుట్టి బయలుదేరాను. నావెంట యిద్దరు పోలీసు గూఢచారులు వున్నారు. అందొకడు భారతీయ వర్తకుని వేషం వేశాడు లేక భారతీయుడుగా కనబడేందుకు ముఖాన రంగుపులుముకున్నాడని చెప్పవచ్చు. మరొకడు ఏం వేషం వేశాడో నాకు గుర్తులేదు. ప్రక్క సందుగుండా వెళ్లి ఒక దుకాణం చేరుకున్నాం. ఆ దుకాణం గిడ్డంగిలో గల బస్తాల మధ్యగా దారి చేసుకొని వెళ్లి దుకాణం ద్వారం దాటి గుంపుకు దొరక్కుండా బయట పడ్డాం. వీధి చివర నాకోసం బండి సిద్ధంగా వున్నది. ఆ బండి ఎక్కి పోలీసు ఠాణా చేరుకున్నాము. నేను సూపరింటెండెంటుగారికి, పోలీసు గూఢచారులికి ధన్యవాదాలు అర్పించాను.

ఒక వంక నేను గుంపును తప్పించుకు పోతూవుంటే మరోవంక సూపరిండెంట్ అలెగ్జాండరుగారు. “పదండి ముందుకు పట్టుకువద్దాం చెట్టు కొమ్మకు వేలాడతీద్దాం” అని పాట పాడుతూ జనాన్ని ఆపుతూ వున్నాడు. నేను పోలీసు స్టేషనుకు సురక్షితంగా చేరానను వార్త అందగానే అలెగ్జాండర్ స్వరం మార్చి “ఏమండోయ్! లేడి పారిపోయింది యిక పదండి మీమీ ఇండ్లకు” అని జనాన్ని నిరుత్సాహపరచడం ప్రారంభించాడు. దానితో కొందరికి కోపం వచ్చింది. కొందరికి నవ్వు వచ్చింది. చాలామంది ఆయన మాటల్ని నమ్మలేదు. “అయితే మీలో కొందరు లోపలికి వెళ్ళి చూచి రండి. గాంధీ వుంటే మీకు అప్పగిస్తాను. లేకపోతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలి. మీరెవ్వరు రుస్తుంజీ గృహానికి నష్టం కలిగించరని, గాంధీ భార్యా బిడ్డల జోలికి పోరని నాకు తెలుసు” అని అన్నాడు.

జనంలో నుండి యిద్దరు ముగ్గురు లోపలికి వెళ్ళి చూచి బయటకి వచ్చి గాంధీ లేడని జనానికి చెప్పారు. కొందరు అలెగ్జాండరును భూషించారు. కొందరు దూషించారు. ఇక చేసేదేమీ లేక అంతా ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. కీ.శే. చేంబర్లేను గారు గాంధీని కొట్టిన వాళ్ళను శిక్షించమని నేటాలు ప్రభుత్వానికి తంతి పంపారు. ఎస్కాంబీగారు నన్ను పిలిపించారు. నాకు తగిలిన దెబ్బలకు విచారం ప్రకటించారు. మీ వెంట్రుకకు హాని కలిగినా నేను సహించను. లాటనుగారు చెప్పిన ప్రకారం నడుచుకోక, నేను చెప్పిన ప్రకారం నడుచుకొనియుంటే అసలు ఈ దుఃఖకరమైన ఘట్టం జరిగేదేకాదు. ఘాతకుల్ని మీరు గుర్తించితే వాళ్ళను నిర్భందించి శిక్షిస్తాం. చేంబర్లేనుగారు కూడా అలాంటి తంతి పంపించాడు అని అన్నారు.

“ఎవ్వరిమీద కేసు పెట్టడం నాకు యిష్టం లేదు. ఆ జనంలో ఇద్దరు ముగ్గురిని గుర్తు పట్టగలను. కాని వారిని శిక్షిస్తే నాకేమి లాభం? వారిని దోషులని నేను అనను. హిందూ దేశంలో నేను తెల్లవారిని నోటికి వచ్చినట్లు నిందించానని, లేనిపోని మాటలు చెప్పి ఎవరో వారిని రెచ్చకొట్టారు. అట్టి వారి మాటలు నమ్మి వారు రెచ్చిపోయారు. ఇందు వారి తప్పు ఏమీ లేదని భావిస్తున్నాను. అసలు దీనికంతటికీ కారకులు మీ నాయకులు, మన్నించండి. మీరే యిందుకు బాధ్యులు. మీరు ప్రజలను సరియైన మార్గాన నడిపించాలి. అట్టిమీరే రూటరు మాట నమ్మి నాకు వ్యతిరేకంగా వ్యవహరించారు. నేనేదో ఇండియాలో చేశానని విచారించకుండా మీరు వ్యవహరించారు. తత్ఫలితమే యీ కాండ. అందువల్ల నేనెవ్వరినీ శిక్షించతలచలేదు. నిజం తెలిసినప్పుడు వారు తప్పక పశ్చాత్తాప పడతారనే విశ్వాసం. నాకు వున్నది.” అని నేను అన్నాను.

‘అయితే ఈ మాటలే వ్రాసి యివ్వండి. మీరు వ్రాసి యిచ్చే మాటలు చేంబర్లేను గారికి తంతిద్వారా తెలియజేస్తాను. తొందరపడి వ్రాసిమ్మని నేను కోరాను. లాటనుగారితోను, తదితర మిత్రులతోను సంప్రదించి ఏది ఉచితమో అదే చేయండి. మీరు ఘాతకులపై కేసు పెట్టని ఎడల అందరినీ సులువుగా శాంతింప చేయవచ్చు. ఆ విధంగా చేస్తే మీ గౌరవ ప్రతిష్టలు తప్పక పెరుగుతాయి’ అని ఎస్కాంబీగారు అన్నారు.

“ఈ విషయంలో నా మాట ఖాయం. మీ దగ్గరకు రాకముందే నేను యిట్టి నిర్ణయానికి వచ్చాను. నన్ను కొట్టిన వారిమీద కేసు పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు కోరిన ప్రకారం ఇప్పుడే వ్రాసి యిస్తాను” అని చెప్పి అవసరమైన పత్రం వ్రాసి వారికి యిచ్చి వేశాను.