సత్యశోధన/మూడవభాగం/21. బొంబాయిలో నివాసం

వికీసోర్స్ నుండి

21. బొంబాయిలో నివాసం

నేను బొంబాయిలో వుండి బారిస్టరీ చేస్తూ దానితో బాటు ప్రజా సేవ చేస్తూ వుండాలని గోఖ్లేగారి కోరిక. ఆ రోజుల్లో లోక సేవ అంటే కాంగ్రెస్ సేవ అన్నమాట. అప్పుడు గోఖ్లేగారు ఒక సంస్థను స్థాపించారు. దాని పని కేవలం కాంగ్రెస్ పనులు చేయడమే.

నా కోరిక కూడా అదే. కాని బారిస్టరీలో ఆత్మవిశ్వాసం తక్కువ. పూర్వానుభవాల్ని నేను మరచిపోలేదు. కేసుల కోసం వాళ్ళను వీళ్ళను ప్రాధేయపడటం నాకు నచ్చదు.

అందువల్ల మొదట నేను రాజకోటలోనే మకాం పెట్టాను. అక్కడ నా హితైషులు, నన్ను ఇంగ్లాండుకు పంపిన వారు నగు కేవల్‌రాం మావజీదవే గారు మూడు కేసులు తెచ్చి యున్నారు. అందు రెండు అప్పీళ్ళు. కాఠియావాడ్ జుడిషియల్ అసిస్టెంట్ దగ్గర వాటి విచారణ జరుగుతున్నది. మిగిలినది అసలు దావా. అది జామ్ నగర్‌లో జరుగుతున్నది. అది పెద్ద దావా. ఈ దావాలో గెలిపిస్తానని పూచీ పడలేనని చెప్పాను. ‘ఓడిపోయేది మేము కదా! నీవు శక్తి కొద్ది పనిచేయి. నేను నీతో వుంటాను!’ అని కేవలరాం గారు అన్నారు. ప్రతిపక్షాల వకీలు కీ.శే సమర్ధ్. నేను కేసు క్షుణ్ణంగా చదివాను. నాకు ఇండియన్‌లా బాగారాదు. కేవలరాంగారు నాకు నూరి పోశారు. “ఎవిడెన్సు ఆక్టు విధానమంతా ఫిరోజ్‌గారికి కరతలామలకం. ఆయన గొప్పవాడు కావడానికి అదే కారణమని నా మిత్రులు, దక్షిణ ఆఫ్రికాకు వెళ్లక పూర్వం నాకు చెబుతూ వుండేవారు. ఈ సంగతి నేను గుర్తుంచుకొని దక్షిణ ఆఫ్రికాకు వెళ్లేటప్పుడు టీకాలతో సహా దాన్ని బాగా పఠించాను. ఇంతేగాక నాకు దక్షిణ ఆఫ్రికాలో మంచి అనుభవం కలిగింది.

నేను దావా గెలిచాను. అందువల్ల నా విశ్వాసం దృఢపడింది. అప్పీళ్ళ విషయంలో నాకు భయం లేదు. వాటిలో కూడా గెలిచాను. ఇక బొంబాయి వెళ్ళినా భయం లేదని ధైర్యం కలిగింది.

ఈ విషయం ఎక్కువగా చెప్పేముందు తెల్ల అధికారుల అత్యాచారం, అజ్ఞానం గురించి కలిగిన అనుభవం చెబుతాను. ఈ జ్యుడిషియల్ అసిస్టెంటుగా వున్న ఒక దొర ఎప్పుడూ ఒక చోట వుండడు. ఈయన త్రిపాదిలా ఎక్కడెక్కడికి తిరుగుతూ వుంటాడో వకీళ్ళు, క్లయింట్లు కూడా అక్కడక్కడికి తిరుగుతూ వుండాలి. తమ చోటు విడిచి వచ్చే వకీళ్లకు ఫీజు ఎక్కువ యివ్వవలసివున్నందున క్లయింట్లకు ఖర్చు అధికమైపోత్నుది. ఇదంతా విచారించవలసిన అవసరం జడ్జీకి లేదు కదా!

వేరావల్ అను గ్రామంలో అప్పీలు విచారణ జరుగనున్నది. అక్కడ ప్లేగు ముమ్మరంగా వుంది. రోజుకి 50 మందికి ప్లేగు తాకుతూ వున్నదని గుర్తు. జనాభా దరిదాపు 5,500. దాదాపు గ్రామమంతా శూన్యం. నేను ఒక శూన్యంగా వున్న సత్రంలో విడిది చేశాను. అది గ్రామానికి కొంచెం సమీపాన వుంది. కాని పాపం పార్టీలు ఎక్కడ పుంటారు? బీదవారైతే ఇక వాళ్ల రక్షకుడు భగవంతుడే.

“అక్కడ ప్లేగు వుండటం వలన విచారణను మరోచోటుకి మార్చమని దొర గారిని కోరవచ్చును.” అని ఒక వకీలు మిత్రుడు నాకు తంతి పంపాడు. నేనా విధంగా కోరగా ప్లేగుకు భయపడుతున్నారా అని దొర అడిగాడు.

“ఈ విషయంలో మీరు మా భయాన్ని గురించి యోచించవద్దు. మా సంరక్షణోపాయం మాకు తెలుసు. కాని క్లయింట్ల గతి ఏమిటి?” అడిగాను.

హిందూ దేశంలో ప్లేగు స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంది. దీనికి భయమెందుకు? వేరావల్ ఎంతో మంచిది (దొర గ్రామానికి దూరంగా రాజభవనం లాంటి డేరాలో వున్నాడు) ఈ విధంగా బయట వుండటం అందరికీ నేర్పాలని యిలా చేస్తున్నాను.

ఇది ఆయన వేదాంతం. దీని ముందు యిక నా మాట చలామణి ఎలా అవుతుంది. “గాంధీగారు చెప్పింది గుర్తు పెట్టుకొని వకీళ్ళకు, పార్టీలకు నిజంగా కష్టం కలుగుతూ వుంటే నాకు చెప్పండి” అని దొర శిరస్తాదారుకు చెప్పాడు. దొర తాను చేస్తున్నది ఒప్పే అనుకొని అలా చేస్తున్నాడను విషయం నిజం. కాని నల్లవాళ్లు పడుతున్న ఇబ్బందుల ముందు అది ఏపాటిది? ఆయనకు బీదవారగు నల్లవారి అవసరాలు, అలవాట్లు, స్వభావాలు, ఆచారాలు ఎట్లా తెలుస్తాయి? రూపాయల మీద నడిచే వాడికి పైసల సంగతి ఎలా తెలుస్తుంది! ఎంత ప్రయత్నించినా ఏనుగు చీమను గురించి తెలుసుకోలేదు. అదే విధంగా ఏనుగులవంటి తెల్లవాళ్ళు చీమలాంటి నల్లవాళ్లను తెలుసుకోవాలన్నా వాళ్ళను తీర్చిదిద్దాలన్నా సాధ్యం కాదు.

ఇక స్వవిషయం. పైన తెలిపిన విధంగా నామీద నాకు విశ్వాసం కలిగింది. కొంతకాలం రాజకోటలోనే వుందామని భావించాను. ఇంతలో కేవలరాంగారు నా దగ్గరకు వచ్చి “నిన్నిక్కడ వుండనీయను. నీవు యిక బొంబాయిలో వుండవలసి వస్తుంది.” అని అన్నాడు.

“అయితే అక్కడ కేసులేవీ? నా ఖర్చు మీరు భరిస్తారా!”

“అహా, నీ ఖర్చులు నేను భరిస్తాను. అవసరమైనప్పుడు పెద్ద పెద్ద బారిస్టర్లను ఇక్కడికి తీసుకువచ్చినట్లు నిన్ను తీసుకు వస్తాను. వ్రాతకోతల పనులన్నీ అక్కడికి పంపిస్తాను. బారిస్టర్లను పెద్దవాళ్ళను చేయడం, చిన్నవాళ్ళను చేయడం ప్లీడర్ల చేతిలో పని కాదా! జాంనగర్‌లోసు, వేరావలులోను నీ పనిని సరిగ్గా నిర్వహించావు. ఇక మాకు చింత లేదు. లోకారాధన చేయవలసిన వాడవు. ఇక నిన్ను కాఠియావాడులో వుండనీయం. ప్రయాణం ఎప్పుడో చెప్పు.”

“నేటాలునుండి నాకు కొంత పైకం రావాలి. అది రాగానే నేను బొంబాయి వెళతాను”

పైకం రెండు వారాల్లో వచ్చింది. నేను బొంబాయి వెళ్ళాను “ఫేయిన్ గిల్ బర్టు అండ్ సయానీస్" అను ఆఫీసులో చేంబరు అద్దెకు తీసుకొని అక్కడే బసచేశాను.