సత్యశోధన/నాల్గవభాగం/42. నొప్పి తగ్గేందుకు

వికీసోర్స్ నుండి

42. నొప్పి తగ్గేందుకు

నరాల నొప్పి తగ్గలేదు. కొంచెం కంగారు పడ్డాను. మందులవల్ల నొప్పి తగ్గదని, ఆహారంలో మార్పు వల్ల బయటి ఉపచారాలవల్ల నొప్పి తగ్గుతుందని భావించాను. 1890 లో అన్నాహారం మరియు యితర ఉపచారాల ద్వారా చికిత్స చేసే డాక్టర్ ఎలిన్సన్ గారిని పిలిపించాను. ఆయన వచ్చాడు. నా శరీరం వారికి చూపించాను. పాలను గురించిన నా నిర్ణయం తెలియజేశాను. ఆయన నాకు ధైర్యం చెప్పాడు పాలు అక్కర్లేదు. కొద్దిరోజులపాటు జిగురుపదార్థాలు తినవద్దు అని చెప్పాడు. ఒట్టి రొట్టె, పచ్చికూరలు, ఉల్లిపాయలు, పచ్చకూర, నారింజపండు తినమని చెప్పాడు. ఈ కూరలతో పాటు సొరకాయపచ్చడి తినవలసి వచ్చింది. మూడు రోజుల గడిచాయి. పచ్చికూరలు పడలేదు. ఈ ప్రయోగం పూర్తిగా చేసే స్థితిలో నా శరీరం లేదు. పైగా అట్టి శ్రద్ధ కూడా కలుగలేదు. 24 గంటలు కిటికీలు తెరిచివుంచమని, గోరువెచ్చని నీటితో స్నానం చేయమని, నొప్పిగా వున్న చోట తైలంతో మర్దన చేయమని, అరగంట సేపు తెరపగాలిలో తిరగమని సలహాయిచ్చాడు. ఈ సలహా నాకు నచ్చింది. నేను వున్న యింటి కిటికీలు ఫ్రెంచి పద్ధతిలో వున్నాయి. వాటిని పూర్తిగా తెరిస్తే వర్షపునీరు ఇంట్లోకి రాసాగింది. వెంటిలేటర్లు తెరుచుకోవు. అందువల్ల వాటి అద్దాలను తొలగించి వేసి 24 గంటలు గాలివచ్చేలా ఏర్పాటు చేయించాను. వర్షం జల్లులు లోపలికి రాకుండా వుండేలా కిటికీ తలుపులు కొంచెంగా మూసి వుంచాను. దానితో ఆరోగ్యం కొద్దిగా కుదుటపడింది. అయితే పూర్తిగా కుదుటపడలేదు. అప్పుడప్పుడు లేడీ సిసిలియా రాబర్ట్స్ నన్ను చూచేందుకు వస్తూ వుండేది. నా చేత పాలు త్రాగించాలని ఆమె భావించింది. నేను త్రాగనని తెలుసుకొని అట్టి గుణాలు గల పదార్ధాలు మరేమైనా వున్నాయా అని అన్వేషణ ప్రారంభించింది. మాల్టెడ్‌మిల్కును గురించి మిత్రుడు తెలిపి అందుపాలు కలవవని సరిగా తెలుసుకోకుండానే ఆమెకు చెప్పాడు. అది రసాయన పదార్ధంతో తయారు చేయబడ్డ పాలగుణం కలిగిన గుజ్జు. ఆమెకు నా నిర్ణయం యెడ అపరిమితమైన ఆదరం కలదని నాకు తెలుసు. అందువల్ల ఆమె తెచ్చిన ఆ గుజ్జును నీళ్ళలో కలిపి పుచ్చుకున్నాను. పాలరుచి పూర్తిగా అందువున్నది. ఎడం చేతికి బదులు పుర్ర చెయ్యి పెట్టు అన్నట్లున్నది యీ తతంగం. సీసామీదగల చీటి చదివాను. పాలతో తయారుచేయబడిన వస్తువు అని స్పష్టంగా అందు వ్రాసివున్నది. అందువల్ల ఒక్క సారి వాడి దాన్ని మానవలసి వచ్చింది. ఈ విషయం లేడీ రాబర్ట్స్‌నుకు జాబుద్వారా తెలిపి ఏమీ అనుకోవద్దని వ్రాశాను. ఆమె వెంటనే పరుగెత్తుకు వచ్చి జరిగిన దానికి మన్నించమని కోరింది. ఆమె మిత్రుడు అసలు లేబులు చదవనేలేదన్నమాట. మీ వంటి మంచి మనస్సు గల సోదరి ఆప్యాయతతో అందజేసిన వస్తువును వదిలినందుకు క్షమించమని ఆమెను వేడుకున్నాను. తెలియక ఒక్క పర్యాయం పుచ్చుకున్నందుకు పశ్చాత్తాపపడమని, ప్రాయశ్చిత్తం చేసుకోనని కూడా ఆమెకు తెలియచేశాను.

ఆమె వల్ల కలిగిన మధురస్మృతులు యింకా వున్నాయి. కాని వాటిని వదిలి వేస్తున్నాను. ఆపదలో సాయపడ్డ యిటువంటిస్మృతులు అనేకం వున్నాయి. భగవంతుడు దుఃఖమనే చేదు మందులు త్రాగించి వాటితో పాటు తీయని స్నేహమనే పథ్యం కూడా రుచి చూపుతాడని శ్రద్ధాళువులు గ్రహింతురుగాక. డాక్టర్ ఎలిన్సన్ నన్ను చూచేందుకు రెండోసారి వచ్చారు. యీ సారి ఎక్కువ స్వాతంత్ర్యం యిచ్చారు. నునుపుతనంగల ఎండు ద్రాక్ష, వేరుశెనగపప్పుతో తయారయ్యే వెన్న తీసుకోమని చెప్పారు. పచ్చికూరలు రుచించకపోతే ఉడకబెట్టి అన్నంలో కలిపి తినమని చెప్పారు. ఆహారంలో ఈ మార్పు నా ఒంటికి బాగా పనిచేసింది.

కాని నొప్పి మాత్రం పూర్తిగా తగ్గలేదు. డాక్టర్ మెహతా అప్పుడప్పుడు వచ్చి చూచి వెళుతూ వున్నారు. “నేను చెప్పిన ప్రకారం చికిత్స చేయించుకుంటే తక్షణం నయం చేస్తా” అని ఆయన ఎప్పుడూ అంటూ వుండేవాడు. ఒకనాడు మి. రాబర్ట్స్ వచ్చి ఇండియా వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఈ పరిస్థితిలో మీరు నేటలీ వెళ్లడం కష్టం. ముందు ముందు చలి మరీ తీవ్రం అవుతుంది. యిక మీరు మీ దేశం వెళ్ళండి. జబ్బు నయం అవుతుంది. అని గట్టిగా చెప్పాడు. అప్పటి వరకు యుద్ధం సాగుతూ వుంటే మీకు అందు పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇక్కడ మీరు చేసిన సహకారం తక్కువైంది కాదు” అని అన్నాడు. ఆయన సలహా అంగీకరించి హిందూ దేశానికి బయలుదేరాను.