సత్యశోధన/నాల్గవభాగం/28. నా భార్య యొక్క దృఢ చిత్తత

వికీసోర్స్ నుండి

ఉన్నదనీ ఒక పర్యాయం మూర్ఛపోయిందని వార్త అందింది. నా అనుమతి లేకుండా కస్తూరిబాయికి మందుల్లో కలిపి మద్యం కాని, మాంసం కాని ఇవ్వవద్దని డాక్టరుకు తెలిపాను. డాక్టరు జోహాన్సుబర్గుకు ఫోను చేశాడు. ఫోను అందుకున్నాను. “మీ భార్యకు మాంసం కలిపిన చారుగాని లేక బీఫ్ టీగానీ ఇవ్వడం అవసరమని భావిస్తున్నాను. దయయుంచి అనుమతించండి” అని డాక్టరు అన్నాడు.

“నేను అందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే కస్తూరిబాయి స్వతంత్రురాలు. అపస్మారక స్థితిలో లేకపోతే ఆమెను అడగండి. ఆమె ఆంగీకరిస్తే తప్పక ఇవ్వండి” అని సమాధానం ఇచ్చాను. “ఇలాంటి సమయాల్లో నేను రోగిని అడగను. మీరు ఇక్కడికి రావడం అవసరం. నాకు ఇష్టమైన పదార్థం రోగికి ఇచ్చే స్వాతంత్ర్యం మీరు నాకు ఇవ్వకపోతే నేను మీ భార్య ప్రాణాలకు బాధ్యత వహించను” అని డాక్టరు అన్నాడు. నేను ఆ రోజునే రైలు ఎక్కాను. డర్బను చేరాను. “మాంసం కలిపిన చారు పట్టిన తరువాతనే మీకు ఫోను చేశాను” అని డాక్టరు చెప్పాడు. “డాక్టరుగారూ! ఇది పూర్తిగా దగా” అని భావిస్తున్నాను అని అన్నాను. డాక్టరు దృఢమైన స్వరంతో ఇలా సమాధానం ఇచ్చారు. మందులు ఇచ్చే సమయంలో నేను దగాల్ని పట్టించుకోను. మేము డాక్టర్లం. మందులు ఇచ్చేటప్పుడు రోగుల్ని, వారి సంబంధీకుల్ని మోసం చేయడం పుణ్యమని భావిస్తాం అని ఆయన అన్నాడు. ఆ మాటలు విని నాకు విచారం కలిగింది. అయినా శాంతించాను. డాక్టరు నాకు మంచి మిత్రుడు, సజ్జనుడు కూడా. ఆయన, ఆయన భార్య నాకు ఎంతో ఉపకారం చేశారు. కాని ఈ వ్యవహారం నేను సహించలేకపోయాను.

“డాక్టర్‌గారూ! ఇక ఏం చేయదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఇష్టం లేకుండా ఆమెకు మాంసం పెట్టడానికి నేను సుతరాము అంగీకరించను. మాంసం తినకపోతే ఆమె చనిపోతే అందుకు నేను సిద్ధంగా ఉన్నాను” “మీ వేదాంతం నా ఇంట్లో నడవదు. మీరు మీ భార్యను నా ఇంట్లో ఉంచదలచుకుంటే నా ఇష్టం వచ్చిన ఆహారం పెడతాను. అవసరమైతే మాంసం పెడతాను. మీరు ఇందుకు ఇష్టపడకపోతే ఆమె నా ఇంట్లో మరణించడానికి నేను అంగీకరించను” అని డాక్టరు స్పష్టంగా చెప్పివేశాడు.

“అయితే ఆమెను తక్షణం తీసుకువెళ్ళమంటారా?” అని అడిగాను. “తక్షణం తీసుకువెళ్ళమని నేను అనలేదు. బంధనాలతో నన్ను బంధించవద్దని అంటున్నాను. అలా అయితే మేమిద్దరం రోగికి చేతనైనంతగా సేవ చేయగలం. మీరు నిశ్చింతగా వెళ్ళవచ్చు. ఇంత స్పష్టంగా చెబుతున్న మీరు అర్థం చేసుకోకపోతే ఇక చెబుతున్నా వినండి. మీరు మీ భార్యను తీసుకువెళ్ళండి” అని డాక్టరుగారు చెప్పివేశాడు. అప్పుడు నా వెంట మా ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. వాణ్ణి అడిగాను ‘మీ మాటే నా దృష్టిలో సరైనది. అమ్మను అడిగితే ఆమె మాంసం తినడానికి ఒప్పుకోదు’ అని మా అబ్బాయి అన్నాడు. నేను కస్తూరిబాయి దగ్గరికి వెళ్ళాను. ఆమె చాలా బలహీనంగా ఉన్నది. ఆమెను మాట్లాడించడానికి మనస్సు ఇష్టపడలేదు. అయినా ధర్మమని భావించి ఆమెకు విషయమంతా క్లుప్తంగా చెప్పాను. ఆమె దృఢనిశ్చయంతో ఇలా అన్నది “నేను ఏది ఏమైనా సరే మాంసం కలిపిన చారు పుచ్చుకోను. మానవజన్మ దుర్లభం. అది మాటిమాటికి లభించదు. అయినా మీ ఒళ్ళోచనిపోవడానికి ఇష్టపడతాను. కాని ఈ దేహాన్ని భ్రష్టం కానీయను” అని అన్నది. ఎన్నో విధాల ఆమెకు నచ్చచెప్పి చూచాను. “నా ఇష్ట ప్రకారం నడుచుకోవాలని నీకు నిర్బంధం లేదు. మనకు తెలిసిన ఫలానా హిందువులు మాంసం, మద్యం పుచ్చుకున్నారు అని కూడా చెప్పాను. కాని ఆమె మాత్రం సరే అని అనలేదు. నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి” అని అన్నది.

ఆమె మాటలునాకు సంతోషం కలిగించాయి. ఆమెను తీసుకు వెళ్ళడానికి భయం వేసింది. కాని గట్టి నిర్ణయానికి వచ్చి కస్తూరిబా అభిప్రాయం డాక్టరుకు చెప్పివేశాను. ఆయన మండిపడ్డాడు. “మీరు కసాయి భర్తగా కనబడుతున్నారు. ఇంత జబ్బుతో ఉన్న ఆమెకు ఈ విషయం చెప్పడానికి మనస్సు ఎలా ఒప్పింది? మీరు చేసింది సిగ్గుచేటు కాదా? ఇక చెబుతున్నా వినండి ఇక్కడి నుండి తీసుకువెళ్ళడానికి ఆమె అనుకూల స్థితిలో లేదు. ఆమె శరీరం ఏమాత్రం వత్తిడి తగిలినా తట్టుకోదు. త్రోవలోనే ఆమె ప్రాణం పోవచ్చు. అయినా మీ మొండిపట్టు వదలకుండా ఆమెను తీసుకువెళతాను అని అంటే మీరు సర్వతంత్ర స్వతంత్రులు. నేను ఆమెకు మాంసం కలిపిన చారు పట్టకుండా ఒక్కరాత్రి అయినా నా ఇంట్లో వుండనీయను. మీ ఇష్టం అని అన్నాడు. అప్పుడు చిటపట చిటపట చినుకులు పడుతున్నాయి. స్టేషను దూరాన ఉన్నది. డర్బను నుండి ఫినిక్సుకు రైల్లో వెళ్ళాలి. స్టేషను నుండి ఆశ్రమానికి సుమారు రెండున్నర మైళ్ళు నడిచి వెళ్ళాలి. ప్రమాదం పొంచి ఉన్నది. దేవుడి మీద భారం వేశాను. ఒక మనిషిని ఫినిక్సుకు ముందుగా పంపించాను. ఫినిక్సులో మా దగ్గర ‘హమక్’ ఉన్నది. హమక్ అంటే చిన్న రంధ్రాలు గల బట్టతో తయారు చేయబడ్డ ఉయ్యాల లేక డోలీ అన్నమాట. హమక్ చివరికొనలు వెదురు బద్దలతో కట్టి వేస్తే రోగి హాయిగా అందు ఊగుతూ పడుకోవచ్చు. ఆ హమక్, ఒక సీసా వేడిపాలు, ఒక సీసా వేడి నీళ్ళు, ఆరుగురు మనుష్యులను స్టేషనుకు పంపమని వెస్ట్ కు కబురు పంపాను. రైలు కదిలే సమయం సమీపిస్తున్నందున రిక్షా తెమ్మని మనిషిని పంపాను. భయంకరమైన స్థితిలో ఉన్న కస్తూరిబాయిని ఆ రిక్షాలో ఎక్కించుకొని బయలుదేరాను. భార్యకు ధైర్యం చెప్పవలసిన అవసరం నాకు కలగలేదు. నాకు ఆమె ధైర్యం చెప్పడమే గాక “ఏం ఫరవాలేదు. మీరు భయపడకండి” అని ప్రోత్సహించింది. ఆమె అస్థిపంజరం అసలు బరువే లేదు. ఆమె ఏమీ తినలేదు. గుటక దిగడం లేదు. రైలు పెట్టెదాకా వెళ్ళాలంటే ప్లాటుఫారం మీద చాలా దూరం నడిచి వెళ్లాలి. లోపలికి రిక్షా పోనీయరు. నేను ఆమెను ఎత్తుకొని పెట్టెదాకా తీసుకువెళ్ళాను. ఫినిక్సుకు ఉయ్యాల తీసుకువచ్చారు. దానిలో రోగిని పడుకోబెట్టాము. వత్తిడి తగలకుండా ఆమెను ఫినిక్సు చేర్చాం. జలచికిత్స ప్రారంభించాను. నెమ్మదిగా ఆమె శరీరం పుంజుకోసాగింది.

ఫినిక్సు చేరుకున్న రెండు మూడు రోజులకు ఒక స్వామీజీ వచ్చాడు. నా పట్టుదలను గురించి ఆయన విన్నాడు. మా ఇద్దరికీ నచ్చచెప్పడం ప్రారంభించాడు. మణిలాలు, రామదాసులు ఇద్దరూ స్వామీజీ వచ్చినప్పుడు అక్కడే ఉన్నారని నాకు గుర్తు. మాంసాహారం తప్పుకాదని స్వామీజీ లెక్చరు ప్రారంభించాడు. మనుస్మృతి యందలి కొన్ని శ్లోకాలు వినిపించాడు. జబ్బులో వున్న భార్య ముందు ఈ రకమైన మాటలు మాట్లాడటం నాకు నచ్చలేదు. అయినా సభ్యతను దృష్టిలో పెట్టుకుని వూరుకున్నాను. మాంసాహారం సరియైనదేనని చెప్పడానికి మనుస్మృతి యందలి శ్లోకాలు వల్లించవలసిన అవసరం లేదు. ఆ శ్లోకాలు నాకు తెలుసు. అవి ప్రక్షిప్తాలు అనే వాదనను గురించి కూడా నాకు తెలుసు. అవి ప్రక్షిప్తాలు అయినా కాకపోయినా మాంసరహిత ఆహారం విషయమై నేను దృఢమైన నిర్ణయానికి వచ్చేశాను. దానికి తిరుగులేదు. పైగా కస్తూరిబాయి దృఢచిత్తత నాకు స్ఫూర్తినిచ్చింది. పాపం ఆమెకు శాస్త్రాల గొడవ ఏం తెలుసు? ఆమె దృష్టిలో తండ్రి తాతల ప్రవర్తనే ధర్మం. అదే ఆమెకు ప్రమాణం. మా పిల్లలకు తన తండ్రి అభిప్రాయాలు బాగా తెలుసు. అందువల్ల వాళ్ళు స్వామీజీని ఆటలు పట్టించసాగారు. చివరికి కస్తూరిబాయి అందుకొని “స్వామీజీ! మీరు ఏం చెప్పినా సరే, నేను మాత్రం మాంసం ముట్టను. మాంసం తిని జబ్బు నయం చేసుకోవడానికి ఇష్టపడను. ఇక నా మెదడు కొరక్కండి. దయయుంచి నన్ను వదలండి. మిగతా విషయం నా బిడ్డల తండ్రితో తరువాత మాట్లాడండి” అని ఖరాఖండిగా చెప్పేసింది.