పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/ఇంద్రసావర్ణిమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి

14ఇంద్రసావర్ణిమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-427-వ.
మఱియు నట వచ్చు కాలంబున నింద్రసావర్ణి పదునాలవ మను వయ్యెడి; మను నందనులు గభీరవస్వాదులు రాజులును; బవిత్ర చాక్షుషు లనువారు దేవగణంబులును; శుచి యనువాఁ డింద్రుండును; నగ్ని బాహు శుచి శుక్ర మాగధాదులు ఋషులును నయ్యెదరు; అందు.
టీక:- మఱియున్ = ఇంకను; అటవచ్చు = ఆతరువాతరాబోవు; కాలంబునన్ = కాలమునందు; ఇంద్రసావర్ణి = ఇంద్రసావర్ణి; పదునాలవ = పద్నాలుగవ (14); మనువు = మనువు; అయ్యెడిన్ = అవుతాడు; మను = మనువు యొక్క; నందనులు = పుత్రులు; గభీర = గంభీరుడు; వసువు = వసువు; ఆదులున్ = మున్నగువారు; రాజులును = రాజులు; పవిత్ర = పవిత్రులు; చాక్షష = చాక్షషులు; అనువారు = అనెడివారు; దేవ = దేవతా; గణంబులును = గణములును; శుచి = శుచి; అనువాడు = అనెడివాడు; ఇంద్రుండునున్ = ఇంద్రుడు; అగ్నిబాహు = అగ్నిబాహుడు; శుచి = శుచి; శుక్ర = శుక్రుడు; మాగధ = మాగధుడు; ఆదులున్ = మున్నగువారు; ఋషులునున్ = ఋషులు; అయ్యెదరు = అవుతారు; అందున్ = ఆ కాలమునందు.
భావము:- ఆ తరువాత రాబోయేకాలంలో ఇంద్రసావర్ణి పద్నాల్గవ మనువు అవుతాడు. అతని కొడుకులైన గంభీరుడూ, వసువూ మొదలైనవారు రాజులు అవుతారు. పవిత్రులూ, చాక్షుషులూ దేవతలు అవుతారు. శుచి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. అగ్ని బాహువూ శుచీ, శుక్రుడూ, మాగధుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు.

తెభా-8-428-తే.
నర సత్రాయణునకు వితాన యందు
వము నొందెడి హరి బృహద్భానుఁ డనఁగ
విస్తరించుం గ్రియాతంతు విసరములను
నాకవాసులు ముదమంద రవరేణ్య!

టీక:- తనరన్ = అతిశయించి; సత్రాయణున్ = సత్రాయణున; కున్ = కు; వితాన = వితాన; అందు = అందు; భవమున్ = జన్మను; ఒందెడిన్ = పొందును; హరి = విష్ణువు; బృహద్భానుడు = బృహద్భానుడు {బహద్భానుః- ప్రకాశవంతమగు కిరణములచే విశ్వమును ప్రకాశింపజేయువాడు, విష్ణుసహస్రనామాలు 333వ నామం}; అనగన్ = అనెడిపేరుతో; విస్తరించున్ = పెంపొందింపజేయును; క్రియా = వేదవిధకర్మాచరణ; తంతున్ = తంత్రముల; విసరములను = సమూహములను; నాకవాసులు = దేవతలు; ముదమందన్ = సంతోషించగా; నరవరేణ్య = రాజా.
భావము:- ఆకాలంలో విష్ణువు సత్రాయణునకూ వితానకూ బృహద్భానుడు అనేపేరుతో పుట్టాడు. దేవతలు సంతోషించేటట్లు క్రియాకలాపాలను పెంపొందిస్తాడు.

తెభా-8-429-క.
తీశ! త్రికాలములనుఁ
బొడొందు మనుప్రకారములు చెప్పఁబడెం;
గఁ బదునలువురు మనువులుఁ
దె యుగములు వేయు నడవ దివ మజున కగున్."

టీక:- జగతీశ = రాజా; త్రికాలములనున్ = త్రికాలములందు; పొగడొందు = స్తుతింపబడెడి; మను = మనువులయొక్క; ప్రకారములు = విధానములు; చెప్పంబడెన్ = చెప్పబడినవి; తగన్ = చక్కగా; పదునలువురున్ = పద్నాలుగుమంది (14); మనువులున్ = మనువులు; తెగన్ = అంతరించిపోగ; యుగములు = యుగములు; వేయు = వెయ్యి; నడవన్ = గడవగా; దివము = దినము; అజున్ = బ్రహ్మదేవున; కున్ = కు; అగున్ = అగును.
భావము:- ఓ రాజా! మూడు లోకాలలోనూ ప్రఖ్యాతి పొందే మనువుల విధానాన్ని చెప్పాను. పద్నాలుగుమంది మనువులు అంతరించి వెయ్యి యుగాలు గడిస్తే బ్రహ్మకు ఒకదినం అవుతుంది.” అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు.

తెభా-8-430-వ.
అనినఁ బరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = రాజు; శుక = శుకుడు యనెడి; యోగ = యోగులలో; ఇంద్రన్ = శ్రేష్ఠున; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా శుకమహర్షి పద్నాలుగు మనువుల గురించి వివరించిన పిమ్మట, పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు. . .

తెభా-8-431-ఆ.
" పదంబులందు నీ మను ప్రముఖుల
నెవ్వఁ డునుచు? వార లేమి కతన
ధిక విభవులైరి? రి యేల జనియించె?
నెఱుఁగఁ బలుకు నాకు నిద్ధచరిత!"

టీక:- ఈ = ఈ; పదంబునన్ = పదవుల; అందున్ = లో; ఈ = ఈ; మను = మనువులైన; ప్రముఖులన్ = గొప్పవారిని; ఎవ్వడున్ = ఎవరు; ఉనుచు = నియమించును; వారలు = వారు; ఏమి = ఏ; కతనన్ = కారణముచే; అధిక = మిక్కిలి; విభవులు = వైభవములుగలవారు; ఐరి = అయితిరి; హరి = విష్ణువు; ఏల = ఎందులకు; జనియించెన్ = అవతరించెను; ఎఱుగన్ = తెలియునట్లు; పలుకు = చెప్పుము; నా = నా; కున్ = కు.
భావము:- “ఓ మునీంద్రా! శుకా! ఈ పదవులలో మనువులను ఎవరు నియోగిస్తారు. దేనివల్ల వారు అంతటి గొప్ప వైభవాన్ని పొందుతారు. ఆ మన్వంతరాలలో ఎందుకు జన్మిస్తాడు. నాకు తెలిసేటట్లు చెప్పు.”

తెభా-8-432-వ.
అనినం బారాశర్య కుమారుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; పారాశర్య = వ్యాసుని; కుమారుండు = పుత్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు.

తెభా-8-433-సీ.
"నువులు మునులును నుసుతు లింద్రులు-
మరులు హరి యాజ్ఞ డఁగువారు
యాజ్ఞాదు లందఱు రిపౌరుషాకృతు-
లా మనువులు దత్సహాయశక్తి
ముల నడుపుదు రొగి నాల్గుయుగముల-
డపటఁ గాల సంగ్రస్తమైన
నిగమచయంబును నిజతపోబలముల-
రలఁ గాంతురు ఋషిరులు; దొంటి

తెభా-8-433.1-తే.
గిది ధర్మంబు నాలుగు పాదములను
లిగి వర్తిల్లు; మనువులు మల నేత్రు
నాజ్ఞఁ దిరుగుదు; రేలుదు వని పతులు
గతి భాగించి తమతమ మయములను.

టీక:- మనువులున్ = మనువులు; మునులును = మునులు; మను = మునువుల యొక్క; సుతులున్ = పుత్రులు; ఇంద్రులు = ఇంద్రులు; అమరులు = దేవతలు; హరి = నారాయణుని; ఆజ్ఞన్ = ఆజ్ఞను; అడగు = లోబడి యుండెడి; వారు = వారు; ఆ = ఆ; యజ్ఞ = యజ్ఞుడు; ఆదులున్ = మున్నగువారు; అందఱున్ = అందరు; హరి = నారాయణుని; పౌరుష = అంశతో; ఆకృతులు = రూపుదాల్చినవారు; ఆ = ఆ; మనువులున్ = మనువు; తత్ = అతని యొక్క; సహాయ = సహాయము యనెడి; శక్తి = బలమువలన; జగములన్ = లోకములను; నడుపుదురు = పరిపాలించెదరు; ఒగిన్ = క్రమముగా; నాల్గు = నాలుగు (4); యుగముల = యుగముల; కడపటన్ = చివర; కాల = కాలముచేత; సంగ్రస్తము = మింగబడినవి; ఐన = అయిన; నిగమ = వేదముల; చయంబునున్ = సమూహములను; నిజ = తమ; తపస్ = తపస్సుల యొక్క; బలములన్ = శక్తిచేత; మరలన్ = మళ్ళీ; కాంతురు = దర్శించెదరు; ఋషి = ఋషులలో; వరులు = శ్రేష్ఠులు; తొంటిన్ = పూర్వము.
పగిదిన్ = వలె; ధర్మంబున్ = ధర్మమును; నాలుగు = నాలుగు (4); పాదములను = పాదములు; కలిగి = పొంది; వర్తిల్లున్ = నడచును; మనువులున్ = మనువులు; కమలనేత్రున్ = విష్ణునియొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞప్రకారముగ; తిరుగుదురు = వర్తించెదరు; ఏలుదురు = పరిపాలించెదురు; అవనిపతులు = రాజులు; జగతిన్ = లోకములు; భాగించి = పంచుకొని; తమతమ = వారివారి; సమయములను = సమయములందు.
భావము:- మనువులూ, ఋషులూ, మనువుల కొడుకులూ, ఇంద్రులూ, దేవతలూ విష్ణుదేవుని ఆజ్ఞకు లోబడి ఉంటారు. యజ్ఞుడు మొదలైనవారు అందరూ విష్ణుదేవుని అంశముతో రూపు దాలుస్తారు. అతని సహయంవల్ల మనువులు లోకాలను ఏలుతారు. క్రమంగా నాలుగు యుగాల చివర వేదాలను కాలం మ్రింగేస్తుంది. పుణ్యాత్ములైన ఋషులు తమ తపశ్శక్తి వలన మరల వేదాలను దర్శిస్తారు. పూర్వం వలె ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. విష్ణువు ఆజ్ఞ చెల్లుబడి అవుతుంది. తమతమ కాలాలలో రాజులు లోకాన్ని పంచుకుని పాలిస్తారు.

తెభా-8-434-వ.
మఱియుం బ్రాప్తులయిన వారల నింద్రపదంబులను, బహుప్రకారంబుల దేవపదంబులను, హరి ప్రతిష్ఠించుచుండు; వారలు విహిత కర్మంబుల జగత్త్రయంబునుం బరిపాలింతురు; లోకంబులు సువృష్టులై యుండు.
టీక:- మఱియున్ = ఇంకను; ప్రాప్తులు = ప్రాప్తముగలవారు; అయిన = ఐన; ఇంద్ర = ఇంద్ర; పదంబు = పదవి; లోన్ = అందు; బహు = అనేక; ప్రకారంబులన్ = విధములుగ; దేవ = దివ్యమైన; పదంబులనున్ = పదవులలో; హరి = నారాయణుడు; ప్రతిష్ఠించుచుండున్ = నియమించుచుండును; వారలున్ = వారు; విహిత = నిర్ణయింపబడిన; కర్మంబులన్ = కార్యములతో; జగత్రయంబునున్ = ముల్లోకములను; పరిపాలింతురు = పరిపాలించెదరు; లోకంబులు = లోకములు; సువృష్ఠులు = సుభిక్షములు; ఐ = అయ్యి; ఉండు = ఉండును.
భావము:- విష్ణువు శక్తిమంతులను ఇంద్ర పదవిలోనూ, పెక్కు విధాలైన దేవతల పదవులలోనూ నెలకొల్పుతాడు. వారు తమకు నిర్ణయింపబడిన నియమాలతో మూడులోకాలనూ ఏలుతారు. లోకాలు సుభిక్షంగా ఉంటాయి.

తెభా-8-435-సీ.
యోగీశరూపుఁడై యోగంబుఁ జూపుచు-
మౌని రూపమునఁ గర్మంబుఁ దాల్చు
ర్గంబు చేయుఁ బ్రజాపతి రూపుఁడై-
యింద్రుఁడై దైత్యుల నేపడంచు
జ్ఞానంబు నెఱిఁగించుఁ తుర సిద్ధాకృతిఁ-
గాలరూపమునఁ బాకంబు చేయు
నానావిధములైన నామరూపంబులఁ-
ర్మలోచనులకుఁ గానఁబడఁడు

తెభా-8-435.1-ఆ.
నిన రూపములనుఁ నురూపముల నింక
నఁగనున్న రూపయము నతఁడు
వివిధుఁడై యనేక వృత్తుల వెలిఁగించు
విష్ణుఁ డవ్యయుండు విమలచరిత! "

టీక:- యోగి = యోగులలో; ఈశ = ప్రభువు; రూపుడు = స్వరూపముగలవాడు; ఐ = అయ్యి; యోగంబున్ = యోగమహత్వమును; చూపుచున్ = ప్రదర్శించుచు; మౌని = ముని; రూపమునన్ = ఆకృతిలో; కర్మంబున్ = కర్మములను; తాల్చు = ధరించును; సర్గంబున్ = సృష్ఠిని; చేయున్ = చేయును; ప్రజాపతి = ప్రజాపతి; రూపుడు = స్వరూపముగలవాడు; ఐ = అయ్యి; ఇంద్రుడు = ఇంద్రుడు; ఐ = అయ్యి; దైత్యులన్ = రాక్షసులను; ఏపున్ = అతిశయమును; అడంచున్ = అణచివేయును; జ్ఞానంబున్ = జ్ఞానమును; ఎఱింగించున్ = ఉపదేశించును; చతురన్ = నేర్పుతో; సిద్ధ = సిద్ధుని; ఆకృతిన్ = రూపముతో; కాల = కాలముయొక్క; రూపమునన్ = స్వరూపముతో; పాకంబున్ = పరిపక్వమును; చేయున్ = కలిగించును; నానా = అనేక; విధములు = రకములు; ఐన = అయిన; నామ = పేర్లు; రూపంబులన్ = రూపములతో; కర్మలోచనుల = విషయాసక్తుల; కున్ = కు; కానబడడు = కనిపించడు;
చనిన = గడచిన కాలపు; రూపములనున్ = స్వరూపములను; చను = జరుగుతున్నకాలపు; రూపములన్ = స్వరూపములను; ఇంక = ఇంకను; చనగనున్న = జరగబోయెడి; రూప = రూపముల; చయమునన్ = సమూహములను; అతడు = అతడు; వివిధుడు = వేర్వేరురూపములనుండువాడు; ఐ = అయ్యి; అనేక = పలువిధముల; వృత్తుల = వర్తనలతో; వెలిగించున్ = ప్రకాశించును; విష్ణుడు = హరి; అవ్యయుండు = హరి; విమలచరిత = స్వచ్ఛమైనవర్తనగలవాడా.
భావము:- ఓ పుణ్యాత్ముడా! పరీక్షిత్తూ! శాశ్వతుడైన విష్ణువు యోగీంద్రుని రూపంతో యోగం బోధిస్తాడు. మౌని రూపంతో కర్మానుష్ఠాన్ని ప్రబోధిస్తాడు. ప్రజాపతి రూపంతో సృష్టిస్తాడు. ఇంద్రుడై రాక్షసుల గర్వాన్ని అణచివేస్తాడు. సిద్ధ స్వరూపంతో జ్ఞానం ఉపదేశిస్తా.డు కాల రూపంతో కడతేరుస్తాడు. అవ్యయుడైన ఆ విష్ణువు పెక్కు పేర్లుతో పెక్కు రూపాలతో కూడి ఉంటాడు. అతడు విషయాసక్తుల కంటికి కనిపించడు. అతడు జరిగిన కాలంలోనూ జరుగుతున్న కాలంలోనూ జరగబయే కాలంలోనూ పెక్కురీతుల వేర్వేరు రూపాలతో ప్రకాశిస్తాడు".

తెభా-8-436-వ.
అనిన భూవరుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; భూవరుండు = రాజు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఈ విధంగా మన్వంతరాల గురించి తెలిపిన శుకమునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. .

తెభా-8-437-మ.
"లి నంభోరుహ నేత్రుఁ డేమిటికినై పాదత్రయిన్ వేఁడె? ని
శ్చలుఁడున్ బూర్ణుఁడు లబ్ధకాముఁడు రమా సంపన్నుఁడై తాఁ బర
స్థలికిన్ దీనునిమాడ్కి నేల చనియెం? ప్పేమియున్ లేక ని
ష్కలుషున్ బంధన మేల చేసెను? వినం గౌతూహలం బయ్యెడిన్."

టీక:- బలిని = బలిని; అంభోరుహనేత్రుడు = విష్ణువు; ఏమిటి = ఎందుల; కిన్ = కు; పాద = అడుగుల; త్రయిన = మూటిని; వేడెన్ = కోరెను; నిశ్చలుడున్ = నిర్వికారుడు; పూర్ణుడున్ = పూర్ణపురుషుడు; లబ్ధకాముడు = పరిపూర్ణ కాముడు; రమాసంపన్నుడున్ = లక్ష్మీదేవియనేడి సంపదగలవాడు; ఐ = అయిన; తాన్ = అతను; పర = ఇతరుల; స్థలి = చోటిన; కిన్ = కు; దీనుని = దరిద్రుని; మాడ్కిన్ = వలె; ఏలన్ = ఎందులకు; చనియెన్ = వెళ్ళెను; తప్పు = తప్పు; ఏమియున్ = ఏమాత్రము; లేక = లేకుండిన; నిష్కలుషున్ = పాపహీనుని; బంధనము = బంధించుట; ఏలన్ = ఎందుకని; చేసెను = చేసెను; వినన్ = వినుటకు; కౌతూహలము = కుతూహలము; అయ్యెడిన్ = కలుచున్నది.
భావము:- “బలి చక్రవర్తిని పద్మనేత్రుడైన విష్ణుమూర్తి దేనికోసం మూడడుగుల నేల యాచించాల్సి వచ్చింది? ఆయన పూర్ణపురుషుడు, పూర్ణకాముడు, నిర్వికారుడు, సంపత్కారి అయిన లక్ష్మీదేవి భర్తా కదా. అంతటి వాడు ఇలా దరిద్రుని వలె పరాయివాడు బలి వద్దకు ఎందుకు వెళ్ళాడు? ఏ తప్పూ చేయని బలిని ఎందుకు బంధించాడు? ఈ కథ వినాలని కుతూహలంగా ఉంది”