కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఏడవ ప్రకరణము

రాజశేఖరుఁడుగారి బీదతనము- సుబ్బమ్మమరణము- బంధుమిత్రుల ప్రవర్తనము- రాజమహేంద్రవర ప్రయాణము- గ్రహణస్నానము.

పూర్వము పుస్తకములయందు- శ్లో|| ఆధివ్యాధిశతైర్జనస్య వివిధైరారోగ్యముమ్మాల్యతే| లక్ష్మీర్యత్ర ప్రతంతిత్ర విసృత ద్వారా ఇప వ్యాపదః|| ఇత్యాదులకు ధనమే యాపదలకెల్లను మూలమని బోధించు వచనములను జదువునపుడు పురాణవైరగ్యము గలిగి రాజశేరుఁడుగారు దారిద్ర్యమునుగోరుచు వచ్చిరి. లక్ష్మివలెఁ గాక యామెయప్పయైన పెద్దమ్మవారిప్పుడు నాశ్రితసులభురాలు గనుక, అతని కోరిక ప్రకారము దరిద్రదేవత వేంటనే ప్రత్యక్షమయి యాతని యభిమతమును సిద్ధింపఁజేసినది. కాని తాను మునుపను కొన్నరీతిని పేదరిక మాతని కంత సుఖకర మయినదిగాఁ గనిపించలేదు.ఇప్పుడు మునపటివలె నిచ్చుటకు ధనము లేకపోయినదిగనుగ, ఈ వరకు నాతని నింద్రుడవు చంద్రుఁడ వని పొగడుచు వచ్చిన స్తుతిపాఠకు లందరును మెల్లమెల్లగా నాతనిని విడిచి పెట్టి , అతని వలె ధనికులయి బాగుపడినవారి యొద్దకు ఁ బోసాగిరి. అయినను రాజశేఖరుఁడు గారు చేయి చాచి యాచించినవారి నూరక పొమ్మన లేక నోటితో లేదనునది చేతితోనే లేదనుచు, తమ కున్నదానిలోనే వేళకు వచ్చి యడిగిన వారికి భోజనము పెట్టుచుండిరి. అందుచేత నతిధి యెంతబీదవాఁడయిన నంత సంతోషించుచుండునే కాని మున్నుపటి వలె విందులకు విజయంచేయు మిత్రులవంటివా రెవ్వరు నిప్పుడు సంతోషపడుచుండలేదు. ఈ దానధర్మములకు సహితము కొంత ధనము కావలసియున్నది. కాఁబట్టి ఇంటగల యిత్తడి సామనులను కుదువ </poem> రాజశేఖర చరిత్రము

బెట్టి రాజశేఖరుడుగారు సొమ్ము తెచ్చుచుండిరి. అందుకే నానాటికి గృహమున గలసొత్తు తక్కువయి కాపాడవలసిన భారము తగ్గు చుండెను . ఇట్లు కొంతకాలము జరగగా నించుమింగా నింటగల జంగమ రూపమయిన సొత్తంతయు బుట్టలును తట్టలును కొయ్యలునుగా మాఱజొచ్చెను. అప్పుడు సహిత మాతడు యాచించినప్పుడు లేదని యెవ్వరిమనస్సులకును నొప్పి కలుగజేయ నిష్టములేనివాడయి, మున్నెప్పుడు ననత్య మన్నమాట నెఱుగనివాడయినను దరిద్రదేవతయొక్క యువదేశముచేత ధనదానములకు బదులుగా వాగ్దానముల మాత్రమే చేయ నారంభించెను . ఆహా ! మనుష్యుల చేత దుష్కార్యములను జేయించుటలో దారిద్ర్యమును మించినది మఱియొకటి లేదుగదా ? అతడీప్రకారముగా సర్వవిధములచేతను బాధపడుచున్నను, ఆసంగతి నొరు లెఱుగకుండుట కయి భోజన పదార్ధములలో దక్కువచేసియైన మంచిబట్టలను గట్టుకొనుచు అప్పుచేసియైన బీదసాదల కిచ్చుచు బయి కొకరీతి వేషముతో బ్రవర్తించుచుండెను. అది యేముమాయయో కాని లోకములో నెల్లవారును తాము సుఖపడుట కయి వహించుదానికంటె దాము సుఖము ననుభవించుచున్న ట్లితరులకు దోచుచున్నట్లు చేయుటకయియే విశేషశ్రద్ధను సహితము బిదతనమువలన గలుగు సౌఖ్యములను లాభములను వేదాంతగ్రంధములు వర్ణించిచెప్పుడు ధనము పాపమునకు గుదురని దూషింపుచున్నను , రాజశేఖరుడుగారు మాత్రము మనల నీ దారిద్ర్యదేవత యెప్పుడువదలునా యని నిమిష మొక యుగముగా గడుపుచుండిరి ; కాబట్టి యాత డింతవఱకును లక్ష్యముతో జూడని యదృష్ట దేవత నిప్పుడు మఱి మఱి ప్రార్ధింప సాగెను. దాని నాతదెంతయాసపడి వేడుచు వచ్చెనో యాయదృష్టదేవతయు నంతదూరముగా దొలగ నారంభించెను . ఏడవ ప్రకరణము

అట్టిసమయములోనే సుబ్బమ్మకు రోగముతురుగ బెట్టినది. డబ్బులేక యిబ్బంది పడుచున్న సమయములోనే యుపవాసమును నుప్పిడులునుచేసి తడిబట్టలు కట్ట్టుకొని రోగపడి యెక్కువ కర్చును దెచ్చి పెటినందున కామెమీద నెంతో కోపము వచ్చి రాజశేఖరుడుగారు విసుగు కొనుచుండగా, పనినిమిత్తమయివచ్చి తిరిగిపోవుచున్న యికబ్రాహ్మణుడు దగ్గఱనుండి వినియా మెనుదూషించిన లాభములేదని చెప్పి తాను వంట బ్రాహ్మణుడనుగా గుదిరెదననియు, ఆమెను మనసు వచ్చినన్నాళ్ళు రోగపడనిండనియు. జెప్పుటయేకాక వంటకు నలభీమ పాకములను మించునట్లుచేయ తా నున్నందున నిష్టమున్నచో నామె మృతినొందినను బొందవచ్చునన్న యభిప్రాయమును సహితము సూచనగా గనబఱచెను. అతని దెట్టిసత్యవాక్కోకాని యాదినము మొదలికొని తగు వైద్యుడు లేనందుననో, ఆబ్రాహ్మణుడీ పధ్యపానములు బరువుచు వచ్చి నందునో వ్యాధి ప్రబలి యొకనాడామెకు బ్రాణముమీదికి వచ్చెను . ఆదినము నక్షత్రము మంచిది కాదని పురోహితిడు చెప్పి నందున ఆమెను వీధిలోనికి గొనిపోయి గోడపక్కను భూశయనముచేసి యొకచాప యడ్డముపెట్టిరి. ఆమెయు రాత్రి జాముప్రొద్దుపోయిన తరువాత లోకాంతగతురాలయ్యెను, ఆదినము తెల్లవాఱినదనుకనింటనున్న వారందఱును పీనుగుతో జాగరము చేసిరి. మఱునాడు ప్రాతఃకాలమునుండియు సమస్తప్రయత్నములు చేసిరి . ఊరనున్న బ్రాహ్మణులలో నెవ్వరును సాహాయ్యమునకు వచ్చినవారుకారు. రాజశేఖరుడుగారు తామే వెళ్ళి యొకచోట బోగముదానియింట పీనుగులవిస్సన్నను పట్టుకొని సంగతిని దెలుపుగా అతడు బేరములకారంభించి పదియాఱురూపాయిలకు శవమును మోచుట కొప్పు 12 రాజశేఖర చరిత్రము

కొని లేచివచ్చెను. ఇప్పుడు సహిత మాంధ్రదేశపు బ్రాహ్మణులలో ముఖ్యముగా స్మార్తులలో నెరయింటనైన మృతినొందినప్పుడు బంధువులును కులమువరును తక్కినమతములయందువలె దమంతట వచ్చి సాయముచేయుట లేక పోగా వచ్చి బార్ధించునను రాక సాకులుచెప్పుటయు మొగ్స్ము చాటువేయుటయు బ్రాహ్మణజాతి కంతకు నవమానకరముగా నున్నది. సమస్తాపదలలోను హోరతరమయిన యీ యాపదకే యెవ్వరును తోడుపడనవు డొకమతములోనుండుటవలన బ్రయోజనమేమి ? ఉండకపోవుట వలన హానియేమి ? ఆదినము శవమింటనుండికదలునప్పటికి బగలు రెండుజాములయినది ! దహనముచేసి మరల వచ్చునప్పటికి బడమట నాలుగుగడియలపొృద్దున్నది. తరువాత విధ్యుక్తముగా పంచయనము మొదలయిన యవరకర్మ లన్నియు జరిగినవి .

మునుపటివలె రాజశేఖరుడుగారిని చూచుటకయి బంధువులును మిత్రువులును న్ంతగా వచ్చుట మానివేసిరి ; వీధిలో గనబడినపుడుసహితము చూడనట్టు తొలగిపోవుటకే ప్రయత్నించుచు విధిలేక కలిసికొని మాటాడునప్పుడు సంగ్రహముగా రెండుమూడు మాటలతోనే సరిపెట్టుచు వచ్చిరి ! పూర్వ మాయన మాటాడినపుడెల్లను ముఖస్తుతులను జేయువారు తరువాత సమ్మతిని గనబఱుచు శిరఃకంపములనుమాత్రము చేయుచు నాతనిమాటలను మందహాసముతో వినసాగిరి. కొన్నాళ్ళ కాశిరఃకంపములును మందహాసములను పోయి యారక యూకొట్టుట క్రింద మాఱినవి; అటుపిమ్మట నాయూకొట్టుటలు సహితము నడిగి హితబోధలు బలిసినవి; కాల క్రమమున హితబోధలు సహితమడుగంటి యొక రీతి పరిహాసములుగా బరిణమించినవి. రాజశేఖరుడుగారును దారాఉపుత్రాదులును ధనము లేనివా రయినను తామొక దుష్కార్యమునకయి ధతమును దుర్వినియోగము చెయలేదుగదా యని మనసులో నొకవిధ మయిన ధైర్యము నవలంబించి యున్న దానితోనే తృప్తివహించి యుండఁగా, వారి సౌఖ్యమునుగని యోరువలేనివారు కొందఱు మితృలని పేరు పెట్టుకొనివచ్చి వారును వీరును మిమ్ము దూషించుచున్నారని చెప్పి వారినెమ్మదికి భంగము గలిగించుచు వచ్చిరి; రాజశేఖరుఁడుగారు చేసిన వ్యయమును బూర్వము దాతృత్వ మని వేయినోళ్ళఁబొగడినవారే యిప్పుడు దానిని దుర్వినియోగమని నిందింపసాగిరి; ఆయన వలనఁ బూర్వ మెన్నివిధములనో లాభములను బొందినవారుసహితము రాజశేఖరుఁడుగారు వీధిలోనుండి నడచుచున్నప్పుడు వ్రేలితోజూపి యీయనయే తనధనమునంతను బాడుచెసికొని జోగియైన మహానుభావుఁడని దగ్గఱ నున్నవారితోఁ జెప్పి నవ్వ మొదలుపెట్టిరి. ఈవఱకును సీతను దనకొమారుని కిమ్మని నిర్బంధించుచు వచ్చిన దామోదరయ్య, యిప్పు డాపిల్లను దన కొడుకునకుఁ జేసికోమని వారివీరిముందఱను బలుకఁజొచ్చెను; ఆసంగతి కర్ణపరంపరచే రాజశేఖరుఁడుగారివఱకును వచ్చినందున ఆయన యొకఁ దినము పోయి యడుగఁగా తా నీసంవత్సరము వివాహముచేయ ననిచెప్పెను. సుబ్రహ్మణ్యమంతటి యదృష్టవంతుఁడు లోకములో మఱియెవ్వరును లేరని జాతకమువ్రాసిన సిద్ధాంతియే యాతనికిఁ గన్య నిచ్చెదనన్నవారి యింటికిఁ బోయి యాతనిది తాను జూచినవానిలోనెల్ల జబ్బుజాతక మని చెప్పి పిల్లనీకుండఁ జెసెను. రాజశేఖరుఁడుగారు ధనము లేక బాధపడుచుండియు నొరులనడుగుట కిష్టములేనివారయి యూరకుండఁగా నిజమైనమిత్రుఁ డొకఁడైన నుండకపోవునాయని యెంచి మాణిక్యాంబయు సుబ్రహ్మణ్యమును రాజశేఖరుఁడుగారికడకుఁ బోయి నారాయణమూర్తినిగాని మఱియెవ్వరి నైనను గాని బదు లడిగి యేమాత్ర మయిన సుబ్బమ్మమాసికమున కయితెం డని ప్రార్థించిరి. ఆయన వారిమాటను దీసివేయలేక దామోదరయ్యను, నారాయణమూర్తిని, మిత్రులవలె నటించి తన వలన లాభమును పొందిన మఱికొందఱిిని బదు లడిగి చూచెనుగాని, అక్కఱలేనప్పుడు వెనుక మేము బదులిచ్చెదము మేము బదులిచ్చెదమని యడుగనిదే పలుమాఱు సంతోషపూర్వకముగాఁ జెప్పుచు వచ్చినవారు, ఇప్పుడు నిజముగాఁ గావలసి వచ్చినది గనుక పోయియడిగినను వేయిక్షమార్పణలు జెప్పి విచారముతో లే దనిరి. పలువురు రాజశేఖరుఁడుగారి యింటికి వచ్చుట మానుకొన్నను, గొంతకాలమువఱకును గొందఱు వచ్చుచుండిరి. కాని తమ్మేమయిన ఋణ మడుగుదురేమో యని యిప్పు డావచ్చెడువారు కూడ రాకుండిరి. కాఁబట్టి మును పెప్పుడును మనుష్యులతో నిండియుండి రణగుణధ్వని గలిగియుండెడి రాజశేఖరుఁడుగారి గృహ మిప్పుడు త్రొక్కిచూచువారులేక నిశ్శబ్దముగా నుండెను. అయిన నాస్థితియందది చిరకాల ముండినదికాదు; దాని స్తంభముహూర్తబలమెట్టిదో కాని తరువాత మరల సదా మనుష్యులతో నిండి మునుపటికంటెను సమ్మర్దము గలిగి బహుజనధ్వనులతో మాఱుమోయుచుండెను. మునుపు మనసులో నొకటి యుంచుకొని పయి కొకటి చెప్పుచుఁ గపటముగాఁ బ్రవర్తించువారితోను, బట్ట యిమ్మని కూడు పెట్టుమని యాచించు దరిద్రులతోను నిండి యుండెనుగాని యిప్పుడు మనసులో నున్నదానినే నిర్భయముగా మొగముమీఁద ననెడు ఋజువర్తనము గల వారితోను బట్టలును భోజనపదార్థములు గొన్నందున కయి యీవలసిన సొమ్మిమ్మని యధికారమును జూపు భాగ్యవంతులతోను నిండియుండ నారంభించెను. గృహమునకు మనుష్య సమృద్ధి కలిగినట్టుగానే రాజశేఖరుఁడుగారికి వస్తుసమృద్ధియు నానాఁటి కధికముగాఁ గలుగనారంభించెను. మునుపటివలెఁ బగటిపూటయందుఁ బదార్థసందర్శన మంతగాఁ గలుగకపోయినను, తదేకధ్యానముతో నున్నందున రాత్రులు కలలయందుమాత్రము తొంటికంటె సహస్ర గుణాధికముగాఁ కలుగుచుండెను. ఆబాధ లటుండఁగా మున్ను రుక్మిణి శిరోజములను తీయించకపోవుటయే బాగుగ నున్నదని శ్లాఘించిన శ్రోత్రియులే యిప్పు డాతనినిఁ బలువిధముల దూషించుటయే కాక సభవారికి నూఱురూపాయ లపరాధము సమర్పించుకోని యెడల శ్రీశంకరాచార్యగురుస్వామికి వ్రాసి జాతిలో నుండి వెలివేయించెదమని బెదరింపఁజొచ్చిరి. ఋణప్రదాతలతో నిండియుండి యిల్లొక యడవిగా నున్నందునను, వీధిలోనికిఁ బోయిన సుగుణములనుసహితము దుగు౯ణములనుగానే పలుకుచు హేళనచేయు మహాత్ములతోను నిండియుండి యూ రొకమహాసముద్రముగా నున్నందునను గౌరవముతో బ్రతికినచోటనే మరల లాఘవముతో జీవనము చేయుటకంటె మరణ మయినను మేలుగాఁ గనఁబడినందునను, ఏలాగునైనను ఋణవిముక్తి చేసికొని యూరువిడిచి మఱియొకచోటికిఁ బోవలె నని ఆయన నిశ్చయించుకొనెను. కాఁబట్టి వెంటనే రామశాస్త్రియొద్దకుబోయి యింటి తాకట్టుమీద నయిదువందల రూపాయలను బదులు పుచ్చుకొని, సొమ్ము సంవత్సరమునాటికి వడ్డీతోఁగూడ దీర్చునట్టును, గడువునాటికి సొమ్మియ్యలేనిపక్షమున నిల్లాతనికిఁ గ్రయ మగునట్టును పత్రమును వ్రాసి యిచ్చెను. ఆప్రకారముగా సొమ్ము బదులుతెచ్చి దానిలో నాలుగువందల రూపాయలతో ఋణములనన్నిటిని దీర్చివేసెను. బదులిచ్చిన మఱుసటినాటినుండియు నిల్లుచోటుచేసి తన యధీనము చేయవలసిన దని రామశాస్త్రి వర్తమానమును పంపుచుండెను. పూర్వము స్కాందపురాణమును జదివి నప్పటినుండియు రాజశేఖరుఁడుగారిఁ మనసులోఁ గాశీయాత్ర వెళ్ళ వలె నని యుండెను. ఆకోరిక యిప్పు డీవిధముగా నెఱవేఱనున్నందునకు సంతోషించి, రాజశేఖరుఁడుగారు సకుటుంబముగా గంగాస్నానము చేసివచ్చుటకు నిశ్చయించి తారాబలమును చంద్రబలమును బాగుగనున్నయొక చరలగ్నమునందుఁ బ్రయాణమునకుఁ ముహూర్తముపెట్టి "ప్రతపన్నవమిపూర్వే" యని యుండుటచేత తిథిశూల లేకుండఁ జూచుకొని "నపూర్వేశనిసోమేచ" యనుటచేత వారశూల తగులకుండ ఫాల్గునశుద్ధ త్రయోదశీ బుధవారమునాఁడు మధ్యాహ్నము నాలుగుగడియల ప్రొద్దువేళ బయలుదేఱుటకు బండి నొకదానిని గుదిర్చి తెచ్చిరి. వారీవఱకుఁ జేసిన యాత్ర లన్నియు గోదావరియొడ్డుననుండి యింటియొద్దకును, ఇంటియొద్దనుండి గోదావరియొడ్డునకునేకాని యంతకన్న గొప్పయాత్రలను జేసినవారుకారు.

బండిని తెప్పించి వాకిటఁగట్టిపెట్టించి ప్రయాణముహూర్తము మించిపోకమునుపే బండిలో వేయవలసిన వస్తువులను వేయవలసినదని రాజశేఖరుఁడుగారు పలుమాఱు తొందరపెట్టినమీఁదట మాణిక్యాంబ తెమలివచ్చి బండినిండను సుద్దతట్టలను బుట్టలను చేఁదలను నింపి మఱియొకబండికిఁ గూడఁ జాలునన్నిటిని వీధిగుమ్మములో నుంచెను; బండిలో నెక్కవలసిన యిత్తడిపాత్రములును బట్టలపెట్టెలును లోపలనే యుండెను; ఇంతలో రాజశేఖరుఁడుగారు వచ్చి యాబుట్టలు మొదలగువానిని బండిలోనుండి దింపించి వారు వెళ్ళిపోవుచున్నారని విని చూడవచ్చిన బీదసాదలకుఁ బంచిపెట్ట నారంభించెను. ఆవఱకు లోపలనుండి కదలి రాకపోయినను రాజశేఖరుఁడుగారు వస్తువులను బంచిపెట్టుచున్నా రన్నమాటను విన్నతోడనే యిరుగుపొరుగుల బ్రాహ్మణోత్తములు వాయువేగమునఁ బరుగెత్తుకొనివచ్చిరి. బండిలో స్థలముచాలక క్రిందనుంచిన తట్టలు మొదలగు వానిని మాణిక్యాంబయుఁ దన్ననుసరించుచున్నవారికిఁ బంచి పెట్టెను. తరువాతఁ బెట్టెలును నిత్తడిసామానులును బండిలో నెక్కింపబడినవి; మునుపు నాలుగుబండ్లలో నెక్కించిననుసరిపోని సామానులిప్పు డొక్కబండిలోకే చాలక దానిలో నలుగురుగూరుచుండుటకు స్థలముకూడ మిగిలెను. రాజశేఖరుఁడుగా రెంత తొందరపెట్టుచున్నను మాణిక్యాంబ తనకాప్తురాం డ్రయిన యొకరిద్దఱు పొరుగు స్త్రీలవద్ద సెలవుపుచ్చుకొని వచ్చుటకే ప్రత్యేకముగా నాలుగుగడియలాలస్యము చేసెను. ఈలోపుగా మంచములను బండిగూటిపయిని గట్టించి, పిల్లలను బండిలో నెక్కించి, రాజశేఖరుఁడుగారు కోపపడినందున మాణిక్యాంబ వచ్చి బండిలోఁ గూరుచుండెను. బండివాని యొద్దకు వచ్చినప్పటినుండియుఁ గొంచెము వట్టిగడ్డిపరకలతోను కావలసినంత జలముతోను మితాహారమును గొనుచు పథ్యముచేయుచున్న బక్కయెడ్లు మెల్లగా బండిని లాగనారంభించెను. బండివాఁడును వానివెనుకనేనడచుచు మేఁతవేయుటలోఁ బరమలుబ్ధుఁడుగానేయున్నను కొట్టుటలోమాత్రము మిక్కిలి యౌదార్యమును గనఁబఱుపసాగెను. ఊరిబయలవఱకునువచ్చి, రాజశేఖరుఁడుగారివలన బిచ్చములను గొన్న నిరుపేదలయిన తక్కువజాతులవారు పలువిధముల వారిని దీవించి, విచారముతో వెనుకకు మరలిపోయిరి. నల్లమందు వేసికొనుటచేతనో త్రాగుటచేతనో సహజమైన మత్తతచేతనో యీమూడును గూడఁ గలియుటచేతనో త్రోవపొడుగునను తూలుచుఁ గునుకు పాట్లుపడుచు నడుచుచున్న బండివాఁడు మొత్త నెక్కి కూరుచుండి, బండిలోనివారికిఁ గావలసినంత పరిమళమును ఆకాశమునఁ జిన్న మేఘములును గలుగునట్టుగా సగముకాలియున్న ప్రాఁతపొగచుట్టలను నాలిగింటిని గుప్పుగుప్పునఁ గాల్చి బండిలోనిపెట్టెకుఁ జేరగిలఁబడి హాయిగా నిద్రపోయెను. బండియు మెల్లగా ప్రాకుచున్నట్టే కనఁబడుచుండెను; ఇంతలోఁ జీఁకటియుఁ బడెను. కొంతసేపటికి రాజశేఖరుఁడుగారు క్రిందఁ జూచునప్పటికి బండికదలుచున్న జాడకనఁబడలేదు. అప్పుడు కుంభకర్ణునివలె నిద్రపోవుచున్న యాబండి వానిని లేపఁబూనుకోగా, కేకలేమియుఁ బనిచేసినవుకావు కాని వాని కాలిమీఁద కొట్టినదెబ్బలుమాత్రము వానిని కదలి యొక్క మూలుగు మూలిగి మఱియొక్క ప్రక్కఁ బరుండునట్లుచేసినవి. మహాప్రయత్నముమీఁద వానిని లేపి క్రిందదిగి చూచువఱకు బండి త్రోవతప్పివచ్చి యొకపొలములో మోఁకాలిలోతు బురదలో దిగఁబడియుండెను. అప్పుడందఱును దిగి యావఛ్ఛక్తి నుపయోగించి రెండుగడియలకు బండిని రొంపిలోనుండి లేవనెత్తి మార్గమునకు లాగుకొనివచ్చిరి. కాని యెడ్లుమాత్రము తాము బండిని గొనిపోవుస్థితిలో లేక తమ్మే మఱియొకరు గొనిపోవలసిన యవస్థయందుండెను. కాఁబట్టి చీఁకటిపడువఱకు బండి శ్రమచేసి వారినిలాగుకొని వచ్చినందునకుఁ బ్రత్యుపకారముగా నిప్పుడు చీఁకటిపడ్డందున వారే బండి నీడ్చుకొనిపోవలసిన వంతువచ్చెను. ఇట్టియవస్థ పగలు సంభవింపక రాత్రి సంభవించినందున కెల్లవారును మిక్కిలి సంతోషించిరి. అందఱిబట్టలకును బురదచేతఁ జిన్నవియుఁ బెద్దవియు నైనపలువిధము లైనపుష్పము లద్దఁబడినవి; బండిలో నెక్కివచ్చినవారి కెట్లున్నను చూచువారు లేకపోయిరికాని యున్నయెడల వారికెంతయైనవినోదము కలిగియుండును. బండివాడు భీమునివంటివాఁడు గనుక రాజశేఖరుఁడుగారి సహాయ్యముచేత బండిని సులభముగా నీడ్చుచుండగా, సుబ్రహ్మణ్యము వెనుకజేరి యెడ్లను స్త్రీలను నడిపించుకొని వచ్చెను. వారు నడిచియే వెళ్ళినయెడల జాములోపలనె రాజమహేంద్రవరము వెళ్ళిచేరియుందురు గాని బండినికూడ నీడ్చుకొని పోవలసివచ్చినందున రాత్రి రెండుయామములకు రాజశేఖరుఁడుగారి పినతండ్రికుమారుఁడగు రామమూర్తిగారియిల్లు చేరిరి. అప్పుడందఱును మంచినిద్రలో నుండిరి; కాఁబట్టి బండిచప్పుడు కాఁగానే తలుపు తీయఁగలిగినవారుకారు. కొంతసేపు తలుపువద్ద బొబ్బలుపెట్టినమీఁదట చావడిలోఁబరున్నవారెవ్వరో లేచివచ్చి తలుపుతీసిరి. రాజశేఖరుఁడుగారి మాట వినఁబడినతోడనే లోపలిగదిలోఁ బరుండియున్న రామమూర్తిగారు లేచివచ్చి, అన్నగారిని కౌఁగలించుకొని వారావఱకే వత్తురని కనిపెట్టుకొనియుండి జాముప్రొద్దుపోయిన మీఁదటనుగూడ రానందున, ఆదినము బయలుదేఱలేదని నిశ్చయించుకొని భోజనములుచేసి తామింతకుమునుపే పడుకొన్నా మని చెప్పి యంతయాలస్యముగా వచ్చుటకుఁ గారణ మేమని యడిగిరి. తాము చెప్పనక్కఱలేకయే తమబట్టలును మోఁకాలివఱకును బురదలో దిగఁబడినకాళ్ళును జెప్పసిద్ధముగానున్న దానినిమాత్ర మాలస్యకారణముగాఁ జెప్పి బండిని దామీడ్చుకొనివచ్చినసంగతినిమాత్రము చెప్పక రాజశేఖరుఁడుగారు దాచిరి. అప్పుడీయవలసిన బండికూలి నిచ్చివేసి బండివానిని పొమ్మనిచెప్పఁగా వాఁడు తాను విశేషముగా శ్రమపడితి ననియు తనబండియెడ్లంతటి మంచివి మఱెక్కడను దొరకవనియుఁ జెప్పి తన్నును తనయెడ్లను గొంతసేపు శ్లాఘించుకొని బహుమతిరావలెనని యడిగిన తడవుగ మాటాడనిచ్చినయెడల మాటవెంబడిని బండిని తాములాగుకొనివచ్చిన మాటను చెప్పునేమోయను భయమున సామానుదిగినతోడనే బహుమతినిసహిత మిచ్చి రాజశేఖరుఁడుగారు వెంటనే వానిని బంపివేసిరి. క్రొత్తగా మగఁడు పోయినవారిని పుణ్యస్త్రీలు భోజనము లయిన తరువాత మొదటిసారి చూడరాదు గనుకను, ఆరాత్రి మంచిదినము కాదుగనుక, సువాసినుల నందఱను గదిలోనికిఁ బోయి తలుపు వేసికొం డని చెప్పి యొక విధవ ముందుగా రుక్మిణిని లోపలికిఁ దీసికొనివచ్చి మఱియొక గదిలోనికిఁ బంపి తలుపు దగ్గఱగా వేసెను. తరువాత లోపలినుండి యాఁడువారు వచ్చి మాణిక్యాంబ మొదలైనవారిని పడమటింటిలోనికిఁ దీసికొని పోయి రుక్మిణికి దటస్థించిన యవస్థ కయి యేడుపులు మొదలైనవి చల్లారినపిమ్మట, వారినిమిత్త మావఱకు చేసిన వంట మిగిలియున్నది కాన వారికి వడ్డించి రాజశేఖరుఁడుగారినిమిత్త మప్పుడత్తెసరు పెట్టిరి. అందఱును భోజనము లయినతరువాత మూడుజాములకు పరుండి సుఖనిద్రచేసిరి.

రాజశేఖరుఁడుగారు కొన్నిదినములు రామమూర్తిగారి లోపలనే యుండిరి. ఒకనాఁడు పడవమీఁద గోవూరునకుఁ బోయి యచటఁ బూర్వము గౌతముఁడు తపస్సు చేసినస్థలమును, మాయగోవు పడినచోటును జూచి గోపాదక్షేత్రమున స్నానము చేసి రాత్రికి మరల వచ్చిరి; మఱియొకనాఁడు కోటిలింగక్షేత్రమున స్నానమునకుఁ బోయి యచట నొక శాస్త్రులవలనఁ బూర్వ మాంజనేయు లొక లింగము నెత్తుకొని పోయి కాశీలో వేయుటయు అప్పటి నుండియు కాశికాపట్టణము ప్రసిద్ధిగనుటయు మొదలగుగాఁగల కథను వినిరి. ఇంకొకనాఁడు రాజరాజనరేంద్రుని కోటకుఁ బోయి అందులోఁ బూర్వము చిత్రాంగిమేడయున్న తావును సారంగధరుఁడు పావురముల నెగరవేసిన చోటును జూచి, పూర్వము రాజరాజనరేంద్రున కమ్మవారు ప్రత్యక్ష మయి నీ వెంతదూరము వెనుక తిరిగిచూడకుండ నడుతువో యంతదూరము కోట యగునని చెప్పుటయు, అతఁడాప్రకారముగా నడచుచు వెనుక గొప్ప ధ్వని యగుచుండఁగాఁ గొంతసేపటికి మనస్సు పట్టలేక వెనుక తిరిగిచూచుటయు, చుట్టును బంగారుకట్టుతో నించుమించుగా ముగియవచ్చిన కోట యంతటితో నిలిచిపోవుటయు, మొదలుగాఁగల కథను దగ్గఱనున్న వారివలన విని, రాజశేఖరుఁడుగారు సారంగధరుని కాళ్ళను జేతులను, నఱికిన స్థలమునే జూచిరావలె నని బయలుదేఱి సారంగధరుని మెట్టకుఁ బోయి యక్కడ నొకనిమ్మచెట్టుక్రింద సారంగధరుని కాళ్ళను చేతులను ఖండించిన చాపరాతిని దానిచుట్టును గడ్డిసహితము మొలవక నున్నగా నున్న ప్రదేశమును దాని సమీపముననే సిద్ధుఁడు సారంగధరుని గొనిపోయి స్నానముచేయించిన కొలఁకును జూచి వచ్చిరి. రాజమహేంద్రవరములో నున్న కాలములో రాజశేఖరుఁడుగారు పట్టణములో నుండెడిజనులకును పల్లెలలో నుండెడిజనులకును నడవడియందేమి వ్యత్యాసముండునో చూడవలె నని యెల్లవారియొక్క చర్యలును బరీక్షింపసాగిరి; కాఁబట్టి యిప్పుడిప్పు డాయనకు నిజమయిన ప్రపంచజ్ఞానము కొంతవఱకుఁ గలుగ నారంభించెను. ఆపట్టణములో___ఎరువడిగి తెచ్చుకొనియైనఁ జేతికి మురుగులు నుంగరములును వేసికొని, చాకలివానియొద్ద పడిదెకుఁ దెచ్చుకొనియైనను విలువబట్టలను గట్టుకొనువారె మిక్కిలి గౌరవమునకుఁ బాత్రులుగా నుండిరి. లోపల సారమేమియు లేకపోయినను జెవులకు మంచి కుండలములను జేయించుకొని తలకు గొప్పశాలువను జుట్టుకొన్నవారు మహాపండితులుగా నుండిరి. ఎల్లవారును ధనికుల యిడ్లకుఁ బోయి జీవితకాలములో నొకప్పుడు దేవాలయము త్రొక్కి చూడకపోయినను భగవన్నామమును కలలో నైనను స్మరింపకపోయినను వారిని పరమభాగవతోత్తము లని భక్తాగ్రేసరు లని పొగడుచుంటిరి; నిజమైన విద్వాంసులయొక్కయు కవీశ్వరులయొక్కయు నోళ్ళును కడుపులును సదా శ్లోకములతోను పద్యములతోను మాత్రమె నిండియుండెనుగాని బాహ్యదంభము లేకపోవుట చేత నన్నముతో నొకప్పుడును నిండి యుండలేదు; దినమున కెనిమిది దొమ్మరగుడిసెలలో దూఱినను, స్నానము చేసినట్టు జుట్టుచివర ముడివైచుకొని బిళ్ళగోచులను బెట్టుకొని తిరుగువారు పెద్దమనుష్యులని పొగడొందుచుండిరి. వేయేల? చాటున లక్షదుష్కార్యములు చేయుచున్నను, బాహ్యవేషధారణమునందు మాత్రము లోపము లేకుండనున్నచో వారి ప్రవర్తనమును సంపూర్ణముగా నెఱిఁగియు వట్టివారి కందఱకును సభలోసహితము మంచి నడవడి గలవారికిఁ చేయుదానికంటె నెక్కువ మర్యాదను జేయుచుండిరి. నీతివిషయమున వారి ప్రవర్తన మెంతహేయ మయినదిగా నున్నను, మతవిషయము నందుమాత్రము పయికి భక్తులుగానే కనఁబడుచుండిరి. నిలువ నీడలేక బాధ పదుచుండెడి ప్రాణమిత్రుల కొక కుటీరమును గట్టించి యియ్యలేనివారు సహితము, రాతివిగ్రహములు కాపురముండుటకయి వేలకొలఁది వెచ్చబెట్టి దేవాలయములు కట్టించుచుండిరి; కట్టించినవారు పోయినతరువాత వసతులు లేక పాడుపడిన దేవాలయములను నూట యిరువదిమూటిని లెక్కపెట్టి రాజశేఖరుఁడుగారు కోటిలింగములకుఁగూడ బూర్వమెప్పుడో దేవాలయములు పాడయినందున నాప్రకారముగా నిసుకదిబ్బలయందుఁ బడియుండినవై యుండవచ్చునని సంశయించిరి; అక్కడ వేశ్యలు తప్ప మఱియెవ్వరును స్త్రీలు చదువకుండిరి; అట్టివా రభ్యసించిన విద్యయంతయు వ్యభిచారమును వృద్ధిచేసి పురుషులను దమ వలలలోఁ బడవేసుకొని పట్టణము పాడు చేయుటకొఱకే పనికి వచ్చుచుండెనుగాని జ్ఞానాభివృద్ధికిని సన్మానప్రవర్తనమునకును లేశ మయినను తోడు పడుచుండలేదు.

అక్కడ సప్తమివఱకు నుండి రాజశేఖరుఁడుగారు కాశీకివెళ్ళుటకు ప్రయాణ మయిరిగాని, సంవత్సరాదివఱకు నుండుఁడని రామ మూర్తిగారు బలవంతపెట్టినందున నాతనిమాట తీసివేయలేక యొప్పుకొనిరి. పాల్గుణబహుళ అమావాశ్యనాఁడు పగలు మూడుజాములవేళ సంపూర్ణ సూర్యగ్రహణము పట్టెను. జనులందరును గోదావరిలో పట్టుస్నానము చేసి తమ పితరులకు తర్పణము లిచ్చుచుండిరి; కొందరు పుణ్యముకొఱకు నవగ్రహజపములు చేయుచు బ్రాహ్మణులకు నవధాన్యములును దానము చేయుచుండిరి; కొందఱు ఛాందసులును వృద్ధాంగనలును సూర్యునకు విపత్తువచ్చె నని కన్నుల నీరుపెట్టుకొనసాగిరి; వారిలో దెలిసినవార మనుకొనువారు సూర్యునకుఁ బట్టిన పీడను వదలఁగొట్టుట కయి మంత్రములను జపించుచుండిరి; వారి కంటెను దెలివిగలవారు గ్రహణకాలమునందు తమ కడుపులలో జీర్ణముకాని పదార్థము లుండిన దోషమనియెరిఁగి దానిముందు మూడుజాముల నుండియు నుపవాసములు చేయుచుండిరి; ఎల్లవారును భోజనపదార్థము లుండు పాత్రములో దర్భగడ్డిని వేయుచుండిరి; కదుపుతో నున్న స్త్రీలు పైకి వచ్చినయెడల అంగహీను లయిన పిల్లలు పుట్టుదు రని యెంచి పెద్దవా రట్టిస్త్రీలను గదులలోఁ బెట్టి తాళము వేసి కదలమెదలవల దని యాజ్ఞాపించిరి; మఱికొందఱు మంత్రవేత్తల మని పేరు పెట్టుకొన్నవారి కేమయిన నిచ్చి మంత్రోపదేశమును బొంది శీఘ్రముగా సిద్ధించుట కయి ఱొమ్ములబంటి నీటిలో జపము చేయుచుండిరి. గ్రహణకాలమున నోషధులయందు విశేషగుణ ముండునని యెంచి కొందఱుమూఢులు స్నానము చేసి దిసమొలలతో జుట్టు విరియఁబోసికొని చెట్లకు ధూపదీపములు సమర్పించి వేళ్ళను దీయుచుండిరి; గ్రహణ సమయమున దానము చేసిన మహాపుణ్యము కలుగు నని చెప్పి బ్రాహ్మణబ్రువులు తమ బట్టలు తడియకుండఁ బయి కెగఁగట్టుకొని మోకాలిలోతు నీళ్ళలో నిలుచుండి సంకల్పమును జెప్పుచు మూఢులయొద్దను స్త్రీలయొద్దను జేరి నీరుకాసులను గ్రహించుచుండిరి. పూర్వాచారమును బట్టి రాజశేఖరుఁడుగారు తామును స్నానము చేసిరిగాని , పయిని చెప్పిన కృత్యమును జేయువా రందఱును మూఢులని యెంచి గ్రహణవిషయమయి యచ్చటి పండితులతో వాదములు చేయ నారంభించిరి. అతఁడు జ్యోతిషశాస్త్రమును నమ్మినను పురాణములనుమాత్రము శాస్త్రవిరుద్దముగా నున్నప్పుడు నమ్మకుండెను. కాఁబట్టి - శ్లో|| పశ్చాద్భాగా జ్జలదవదధ స్సంస్థితో భేత్యచంద్రో || భానోర్భింబం స్ఫురదసితయా ఛాదయత్యాత్మమూర్త్యా || అను సిద్దాంతశిరోమణీ శ్లోకమును, శ్లో||ఛాదకో భాస్కరస్యేందు రథస్థో ఘనవద్భవేత్! భూఛ్ఛాయాంప్రాఙ్ముఖశ్చంద్రో విశత్యస్య భవేదసౌ - అను సూర్యసిద్ధాంతశ్లోకమును జదివి, భూగోళమున కుపరిభాగమున సూర్యుడుండునపుడు చంద్రుడు తన గతివిశేషముచేత సూర్యునకును భూమికిని నడుమ సమకళయందు వచ్చునేని సూర్యగ్రహణము కలుగునుగాని రాహువు మ్రింగుటచేత గలుగదనియు పౌరాణికులు చెప్పినదే గ్రహణమునకు గారణ మయినయెడల రాహుకేతువుల మనసులలోని యభిప్రాయములను దెలిసికొనుటకు మనము శక్తులము కాముకాబట్టి గ్రహణ మిప్పుడుకలుగు నని ముందుగా దెలిసికోలేక పోయి యుందుమనియు, సూర్యగ్రహణ మమావాస్యనాడును చంద్రగ్రహణము పూర్ణిమనాడునుమాత్రమే పట్టుటకు గారణ ముండదనియు, రాహుకేతువు లాకాశమున నెప్పుడును గనబడకపోవుట యెలరు నెఱుంగుదుగాన సూర్యచంద్రులను మ్రింగగలిగినంత పెద్దవియే యయి యుండినయెడల గ్రహణసమయమున నవేల కనబడకుండుననియు, రాహువే మ్రింగునేని మన పంచాంగరీతిగా నీగ్రహణ మొకదేశమున గనబడి మరియొకదేశమున గనబడక పోవుటకు హేతు వుండదనియు, రాజశేఖరుఁడుగారు బహుదూరము వాదించిరి. అక్కడ నున్న పండితులలో నెవ్వరికిని యుక్తులుతోఁచక పోయినను, విశేషముగా కేకలుమాత్రము వేసిరి. అక్కడ నున్నవారికా వాదమేమియుఁ దెలియలేదు. కనుక బిగ్గఱగా నఱచినందున శాస్త్రులపేళ్ళవారే గట్టివా రని మెచ్చుకొని రాజశేఖరుఁడుగారి వాదము బౌద్ధవాద మని దూషించిరి. ఒకరిని వెక్కిరించుటవలనఁ గలుగవలసిన సంతోషము తప్ప మఱియొకవిధమైన సంతోషము తమకు లేదుగనుక, విద్యాగంధ మెఱుఁగని మూర్ఖశిరోమణులు రాజశేఖరుఁడుగారిని బహువిధములఁ బరిహసించి పొందఁదగిన యానందమునంతను సంపూర్ణముగా ననుభవించిరి. ఇంతలో గ్రహణమోక్షకాలము సమీపించినందున నెల్లవారును విడుపుస్నానమునకై పోయిరి. శుద్ధమోక్ష మయినతరువాత ముందుగా స్నానము చేసివచ్చి యాఁడువారు వంట చేసినందున దీపములు పెట్టించి యెల్లవారును ప్రథమభోజనములను జేసిరి.