హిమబిందు/ప్రథమ భాగం/25. సమావేశము

వికీసోర్స్ నుండి

25. సమావేశము

హిమబిందుకుమారి తన ఇంటికి వచ్చినదని తెలిసిన వెనుక సువర్ణశ్రీ కుమారుడు ఆ బాలికకు కనిపించుటకు సిగ్గుపడినాడు.

పాపము, వారిబండి వెనుకబడిపోయినది. తనగిత్తలు అద్భుత వేగము కలవి. సమవర్తిసేనాపతి తోలిన బండి ఆ సుందరిదని తెలిసినచో తాను రెండవవాడుగా వచ్చియుండునే! ఇప్పుడామెను చూచితీరవలయును. ఆ దివ్య సౌందర్యము చూచినంత మాత్రమున తనజన్మ మంతయు పవిత్రముకాదా!

కాని తా నె ట్లామెయెదుట బడగలడు? ఆమె తనను మొరకు వానిని, సౌందర్య హీనుని, వట్టి బొమ్మలు చెక్కుకొనువానిని ఆ దీర్ఘవినీల పక్ష్మముల నెత్తియైన చూచునా?

అవి కన్నులా, లోక మోహన నిశ్చల యామినీ మాయలు కాని! ఆ కన్నులలోని చూపులు, నిర్మల రాకాసుధాకర కళాకోటి! ఓహో తా నెట్లు ఆ చూపులలో అమృతత్వ మొందగలడు?

సువర్ణశ్రీ చల్లగా తన శిల్పమందిరమునుండి వినిర్గమించి, కృష్ణయొడ్డునే యెటకేని పోయినాడు.

అతడట్లు పోయి పోయి, ఎటుల పోవుచున్నదియు తెలియక, కోటి దీప కళికాప్రజ్వలమై దివ్యరూపమైన మహాచైత్యముకడ కరుదెంచినాడు.

ఆ చైత్యమును బౌద్ధశకము నూటపదునారవయేట మహాభక్తుడగు హిరణ్య వ్యాఘ్రపాదశాతవాహనుడు అప్పటి ధాన్యకటక నగరమునకు దూరమున కృష్ణాతీరమునకు కొలది దూరములో ప్రారంభించెనట.

అశోకచక్రవర్తి కాలమునకే ధాన్యకటక చైత్యము పేరునకు వచ్చి యుండెను. అప్పుడశోకుడా చైత్యమును పునర్నిర్మాణ మొనరింప శాతవాహన చక్రవర్తిని కోరి యుండెను. అశోకునకు సమకాలపు ఆంధ్ర ప్రభువు అజితదత్త శాతవాహనుడు. అత డా చైత్యమును ఇంకను పెంచి పెద్దదిగ నొనర్చెను.

అభయబాహు శాతవాహన చక్రవర్తి కాలమునాటి కా చైత్యము పూర్ణరూపము నంది బౌద్ధక్షేత్రమని పేరందెను.

శిల్పచక్రవర్తియు, శిల్ప బ్రాహ్మణవంశములో మహోన్నత యశో విరాజితుడును అయిన ధర్మనంది ఆ చైత్యమును దివ్యమొనర్చి ధర్మ చక్రములు, చతుర్ముఖములు, ఆయక స్తంభములు నిర్మించెను. ప్రదక్షిణాపథ మేర్పరచెను.

ప్రదక్షిణపథమును చుట్టి ప్రాకారరేఖ ధర్మనంది రచింప నారంభించి, శిష్యులచే ఊర్ధ్వస్తంభములు, సూచులు, ఆబంధికములు,ఉష్ణీషములు నిర్మించ ప్రారంభించినాడు.

బుద్ధధర్మము మహాస్థవిరవాద మనియు, మహాసాంఘికవాదమనియు రెండు మార్గముల ప్రవహించినది. మహా సాంఘిక వాదమున ఆంధ్రులు తమకున్న కళారక్తిచే, కళావేశముచే మహాచైత్యవాదము నిర్మించిరి.

ఈ శిల్పవాదము భారతవర్షమంతయు నిండి, యీ జంబూద్వీప మంతటి నుండియు శిల్పుల, ఆచార్యుల, శ్రవణకుల, భిక్షుల ఈ మహాపథ ప్రస్రవణ స్థానమైన ధాన్యకటకమునకు శిష్యులుగా పంపుచున్నది. ధర్మనంది మహాచైత్యవాదమునకు ముఖ్య శిల్పాచార్యుడు. అతని పవిత్ర హస్తము రచించిన త్రిరత్నములయిన పద్మములు, బోధివృక్షములు, చైత్యములును ప్రజ్ఞా స్వరూపములైన జాతక గాథలును లోక విఖ్యాతి నందినవి.

ఆ సంపూర్ణ జోత్స్నాకాంతిలో సువర్ణశ్రీ తన తండ్రిగారి శిల్ప చాతుర్వమును జూచుచు, ఉప్పొంగిపోవుచు, తన శిల్పపుంబనుల గమనింపుచు, ఆ పనులలో తక్కిన శిష్యుల పనితనముకన్న ఎన్నియోరెట్లు మిన్నయగు పనితనమున్నను, తన తండ్రిగారి పనితో పోల్చిచూచిన, తన పనితనములో ఏదో అపరిణతి యున్నదని యనుకొనెను.

ఈ ఆలోచనలచే మై గుబాళింప, ఆతడు ఆ పవిత్రచైత్యము ఎదుట సాష్టాంగపడి లేచి మోకరించెను. తన జనకుని మహోత్తమ రచనా ప్రజ్ఞ ధారణచేసిన ఒక బాలికా రూపముకడ నాత డధివసించి తన తల్లి శక్తిమతీదేవి పోలికలనందు గుర్తించినాడు. ఈ విచిత్రరహస్యము ఇంతకాల మెట్లుదాగున్నది?

ఆర్యకస్తంభ చూళికా వ్యాజమున దేవీప్రతిమగా తన తండ్రి యౌవనవతియైన తన తల్లి శిల్పచిత్రమును రచించినాడు. త్రిభంగియై కుబేరాక్షీ వృక్షము నానుకొని లతవలె వంగి, ఎడమచేత లేతకొమ్మ విలాసముగ బట్టుకొని, కుడిచేత లీలాపాటలీపుష్పము ధరించి హృదయము లీలగా స్పృశించుచు, జటాశిఖ ధరించి, సర్వాలంకారయై, యా బాలిక తోరణశిఖావాతాయనాంతర్గతాలంకార శిల్పరూపమున విన్యసింపబడి యున్నది.

సుందరీమణులగు లతాంగులకును, శిల్పమునకు నుండు అద్భుత సమయ రహస్యములు సువర్ణశ్రీకుమారున కెన్నడు ప్రత్యక్షము కాలేదు. ఇప్పుడాతని సర్వశిల్ప శాస్త్రమంత్రము లొక్కసారి పవిత్రగానశ్రుతులై స్పందనమొనర్చినవి. ఆ విగ్రహమును తదేకదీక్షతో గమనించుచు సువర్ణశ్రీ లేత రావి చెట్టువలె నిలుచుండిపోయినాడు. సమున్నత శరీరియైన యా బాలకుడు స్వర్గమునుండి దిగివచ్చిన దేవకుమారునివలెనున్నాడు. ఆతని హృదయములో శిల్పశక్తి ఊర్మికలై, ప్రవాహములై ఉప్పొంగి మహాప్రళయమైనది. ఆతడు సర్వము మరచినాడు. ఆ శక్తి ప్రవాహములు ప్రవహించి, వేరొకపుణ్యభూమి నుండి ప్రవహించి వచ్చిన సురదీర్ఘకానదీమతల్లియైన ప్రేమశక్తితో సంగమమైపోయినవి. ఆ ద్విప్రయాగ మూర్తియగు నొకదేవి యచ్చట దర్శనం బిచ్చినది. మనోహరగంధ మలయ పవనములు సువర్ణుని చుట్టివేసినవి.

ఆ దివ్యమూర్తి నాట్యదేవతవలె ప్రత్యక్షమై, వివిధాంగహార మనోజ్ఞ రేఖా విలాసినియై, సంపూర్ణరాగరంజిత మనోజ్ఞ గీతికాగానాభినయ కంఠియై, విద్యున్మాలినీహార చలిత పీనవక్షయై తోచినది.

ఆ మూర్తి నాట్యము చాలించి ఎదుట నిలిచినది. సువర్ణశ్రీ ఆ స్వప్నసుందరివైపు బలపూర్ణములై, మహానాగములవలె శక్తివంతములై, మనోహర ప్రౌఢరేఖాసమన్వితములైన తన రెండుచేతులు చాచి మోకరించినాడు.

“ఓ శిల్పదేవీ! సకలమనోజ్ఞ భావపరిపూర్ణరూపా! సర్వరాగనర్తిత కల్యబాల! పరీమళ పుష్పాలంకార వైభవోపేత పారిభద్రతరుమూర్తీ! నీవు ఈ వెన్నెలలో నాకు ప్రత్యక్షమైనావా?” అని అస్పష్టవాక్కుల నమస్కరించినాడు.

పులకితానందశిరీషవృక్షమగు నాతని విగ్రహ మా వెన్నెలలో శ్రుతియై మంజుశ్రీ మూర్తివలె తేజరిల్లి పోయినది. ఆతని కంఠము ఇంకను స్పష్టత తాల్చినది. మధురాభిషేకోచిత శంఖ వినిర్గత స్వనములై యాతని మాటలు వెలువడినవి.

“హిమబిందువా నీవు! ప్రపుల్లనీరేజహృదయస్థ ప్రాతఃకాల తుషార బిందువువా నీవు!”

అంత నాతని యా స్వప్న మధ్యమునుండి “బాలనాగీ దారి ఇమ్మనవే!” యన్న మాటలు వినవచ్చినవి. ఆతడులికిపడి తలయెత్తి స్వప్నలోకము పటాపంచలై మాయము కా, నెదుట హిమబిందుకుమారి నిజముగ నిలుచుండుట గమనించి సిగ్గునంది, చటుక్కున లేచి వెనుకకు తిరిగి పారిపోయినాడు.

26. రాగారుణచ్ఛాయలు

సువర్ణశ్రీకుమారుడు తన సౌధమున కెట్లెట్లో చేరెను. ధర్మనంది యిల్లు చతుశ్శాలాంతరమైన హర్మ్యము. ఈ హర్మ్యమునకు రెండు మేడలున్నవి. ఒకమేడ శుద్ధాంతజనము వసించునది. ఆ మేడ వెనుక స్త్రీజనాశ్రయమైన మండపగృహమును, సూతికాగృహమును ఉన్నవి. మేడల మీదకు పోవుటను రెండు సోపానపంక్తులు కలవు.

సువర్ణశ్రీకుమారుడు దక్షిణ సోపానపంక్తి నెక్కుచు సౌధములోని తన మందిరములోనికి పోయి యా మందిరముననున్న శయనాగారము చేరి పర్యంకమున బోర్లగిలపరుండి మహాచైత్యమందలి దివ్యదర్శనమును స్మరించుకొనుచు, భయపడుచు, ఉప్పొంగుచు వివిధాలోచనాధీనుడై జాగర స్వప్నవశుడైనాడు.

తనమాట ఆమె విని యున్మత్తునిగ భావించలేదుగదా! తా నట్లు చేసినాడేమి? తన ఇంటికి వచ్చిన యా బాలిక యింతటిలో నచ్చటి కెప్పుడు వచ్చినది? నిజముగ నామె యచ్చటికి వచ్చెనా? తలలోని కాంక్షయే యట్లురూపెత్తి వచ్చినదా? నిజముగ నామెయే వచ్చియుండవలయు. ఏలనన, యామెకు కొంచెము ఎడముగ వెనుక వేరొక్క బాలిక కనంబడినది. ఇంకను వెనుక దూరముగ నిరువురు వృద్ధ స్త్రీలమాటలు విననైనవి. తా నట్లు స్పష్టముగ ఉచ్చరించిన వాక్కుల విని యా దివ్యసుందరి నిజముగ తన్ను మతిహీనునిగ నెంచియుండును.

ఆమె పండు వెన్నెలలో పోతపోసిన స్వర్ణవిగ్రహమై సాక్షాత్కరించినది. ఆమె ఏమనుకొనిన నేమి? పూజా ద్రవ్యములే చెంతనున్నచో అట్టి యతిలోక సౌందర్యమునకు షోడశోపచారము లర్పించియుందునుగదా!

ఆమె యెక్కడ? తా నెక్కడ? వర్తకసామ్రాట్టయిన చారుగుప్తుని తనయ యేడ, దరిద్రశిల్ప బ్రాహ్మ కుమారుడైన తా నేడ?

మరల తన కా బాలిక సందర్శన మిచ్చునా? అతిలోక సౌందర్యమును పూజాపీఠిక నెక్కింపగోరని శిల్పియుండునా! ఆ దివ్యసౌందర్యము ఈ బీద యింటియందు వాసము చేయగలదా!

ఇంతలో అతనికి మహానసగృహమునుండి గంట విన్పించినది. తండ్రి గారి అర్చన పూర్తియైనదనుకొనుచు సువర్ణశ్రీ లేచి మేడమెట్లు దిగి స్నాన గృహమునకు పోయినాడు. పనికత్తె అచ్చట వేడినీళ్ళు తొలిపి పెట్టి యుంచినది. అంగ సంస్కారకుడు వచ్చి దేహమంతయు మార్జన నలంది ఉద్వర్తన మొనర్చి స్నానము జేయించినాడు,