హిమబిందు/ప్రథమ భాగం/26. రాగారుణచ్ఛాయలు

వికీసోర్స్ నుండి

ఆతని కంఠము ఇంకను స్పష్టత తాల్చినది. మధురాభిషేకోచిత శంఖ వినిర్గత స్వనములై యాతని మాటలు వెలువడినవి.

“హిమబిందువా నీవు! ప్రపుల్లనీరేజహృదయస్థ ప్రాతఃకాల తుషార బిందువువా నీవు!”

అంత నాతని యా స్వప్న మధ్యమునుండి “బాలనాగీ దారి ఇమ్మనవే!” యన్న మాటలు వినవచ్చినవి. ఆతడులికిపడి తలయెత్తి స్వప్నలోకము పటాపంచలై మాయము కా, నెదుట హిమబిందుకుమారి నిజముగ నిలుచుండుట గమనించి సిగ్గునంది, చటుక్కున లేచి వెనుకకు తిరిగి పారిపోయినాడు.

26. రాగారుణచ్ఛాయలు

సువర్ణశ్రీకుమారుడు తన సౌధమున కెట్లెట్లో చేరెను. ధర్మనంది యిల్లు చతుశ్శాలాంతరమైన హర్మ్యము. ఈ హర్మ్యమునకు రెండు మేడలున్నవి. ఒకమేడ శుద్ధాంతజనము వసించునది. ఆ మేడ వెనుక స్త్రీజనాశ్రయమైన మండపగృహమును, సూతికాగృహమును ఉన్నవి. మేడల మీదకు పోవుటను రెండు సోపానపంక్తులు కలవు.

సువర్ణశ్రీకుమారుడు దక్షిణ సోపానపంక్తి నెక్కుచు సౌధములోని తన మందిరములోనికి పోయి యా మందిరముననున్న శయనాగారము చేరి పర్యంకమున బోర్లగిలపరుండి మహాచైత్యమందలి దివ్యదర్శనమును స్మరించుకొనుచు, భయపడుచు, ఉప్పొంగుచు వివిధాలోచనాధీనుడై జాగర స్వప్నవశుడైనాడు.

తనమాట ఆమె విని యున్మత్తునిగ భావించలేదుగదా! తా నట్లు చేసినాడేమి? తన ఇంటికి వచ్చిన యా బాలిక యింతటిలో నచ్చటి కెప్పుడు వచ్చినది? నిజముగ నామె యచ్చటికి వచ్చెనా? తలలోని కాంక్షయే యట్లురూపెత్తి వచ్చినదా? నిజముగ నామెయే వచ్చియుండవలయు. ఏలనన, యామెకు కొంచెము ఎడముగ వెనుక వేరొక్క బాలిక కనంబడినది. ఇంకను వెనుక దూరముగ నిరువురు వృద్ధ స్త్రీలమాటలు విననైనవి. తా నట్లు స్పష్టముగ ఉచ్చరించిన వాక్కుల విని యా దివ్యసుందరి నిజముగ తన్ను మతిహీనునిగ నెంచియుండును.

ఆమె పండు వెన్నెలలో పోతపోసిన స్వర్ణవిగ్రహమై సాక్షాత్కరించినది. ఆమె ఏమనుకొనిన నేమి? పూజా ద్రవ్యములే చెంతనున్నచో అట్టి యతిలోక సౌందర్యమునకు షోడశోపచారము లర్పించియుందునుగదా!

ఆమె యెక్కడ? తా నెక్కడ? వర్తకసామ్రాట్టయిన చారుగుప్తుని తనయ యేడ, దరిద్రశిల్ప బ్రాహ్మ కుమారుడైన తా నేడ?

మరల తన కా బాలిక సందర్శన మిచ్చునా? అతిలోక సౌందర్యమును పూజాపీఠిక నెక్కింపగోరని శిల్పియుండునా! ఆ దివ్యసౌందర్యము ఈ బీద యింటియందు వాసము చేయగలదా!

ఇంతలో అతనికి మహానసగృహమునుండి గంట విన్పించినది. తండ్రి గారి అర్చన పూర్తియైనదనుకొనుచు సువర్ణశ్రీ లేచి మేడమెట్లు దిగి స్నాన గృహమునకు పోయినాడు. పనికత్తె అచ్చట వేడినీళ్ళు తొలిపి పెట్టి యుంచినది. అంగ సంస్కారకుడు వచ్చి దేహమంతయు మార్జన నలంది ఉద్వర్తన మొనర్చి స్నానము జేయించినాడు, నాగబంధునికవచ్చి “అన్నా, యింత యాలస్యము చేసినావేమి, ఎచటకు పోయితివి? అట్లు మాయమై పోయినావు! నీ శిల్పగృహమునకు వారందరు వచ్చిరి. నీవు లేవైతివి. నీ కొరకు తోట యంతయు, దొడ్డియంతయు చెల్లి వెదకినది. నీవు అదృశ్యుడవైతివి. పాపము, నా స్నేహితురాలు కొంచెము భిన్న మైనదిసుమా! పలాయనమంత్రపారాయణ కథానాయకుడ వైతివేమి!” అని మేలమాడెను.

“నీ వేళాకోళముల కేమిలే!”

“నావి వేళాకోళములు; తాను పారిపోవుట వీరవిక్రమమట. ఇంటికి చుట్టములు, స్నేహితులు వచ్చినచో పారిపోవు పెద్దమనిసితనము మా అన్నగారిది. ఆ శిల్ప మట్టిది, యీ శిల్ప మిట్టిది అని నీవు చెప్పనక్కర లేదా?”

“ఓ మగవీరుడు చెల్లీ, నీకు తెలియదా! నీ వేల చెప్పవైతివి? ఎవరో శుద్ధాంతకాంతా జనము వచ్చిరట! నేను వారియెదుటబడి యిది యిది, అది అది అని చెప్పవలెనట!

“ఎవ్వరికిని ఏమియు చెప్పనక్కరలేదులే శుద్ధాంతకాంతాజనము, వీరవిక్రమ విహారజనము ఎవరైన వచ్చినప్పుడు మా అన్నగారు లేడి పిల్లవలె బెదరి, చెంగున నురికి పొదలలో మాయమైపోవునట. ఈ ధైర్యమే కాబోలు మొన్న శకటపందెములో నెగ్గించినది.”

ఇంతలో సిద్ధార్థినిక వీరున్న తావునకు వచ్చినది.

సిద్ధా: అన్నా! నీ వెచ్చటికి పోయినావు? హిమబిందును, ఆమె అమ్మమ్మయు, ఆమె మేనత్తయు నాయనగారి బొమ్మలును, నీ బొమ్మలును దీక్షతో గమనించినారు. హిమబిందు అక్కను, నన్ను ఎన్ని ప్రశ్నలు వేసినదని! అక్కయెంతో చిత్రముగ మాట్లాడినది.

నాగ: నే నేమి చిత్రముగా మాట్లాడినానే? ఇంత వెఱ్ఱిదానవు. నాకు చెల్లెలివై పుట్టినా వేమే! హిమబిందు నిన్నట్లు ముద్దు పెట్టుకొనినప్పుడు నీ వంత సిగ్గుపడితివేమి?

సువర్ణ: ప్రపంచములో అందరును నీకు సిగ్గుపడువారే.

సువర్ణ శ్రీకుమారుడు భోజనమునకై దుకూలము ధరించి, అలంకార గృహమున కేగి యచ్చట మార్జనకునిచే తల దువ్వించుకొని, ముడి రచియింపించుకొని, పైన చీనాంబరమును కప్పుకొని తిలకము దిద్దుకొని, యీవలకు వచ్చునప్పటికి మహాలియు, శక్తిమతీదేవియు, సిద్ధార్థినికయు, నాగబంధునికయు ప్రత్యక్షమైరి.

నాగ:అమ్మా! అన్న భయపడి పారిపోయినాడే.

సిద్ధా:అన్న భయపడుటేమి! ఎవరో ఆడవారు వచ్చినారు గదాయని ఎచ్చటికో వెళ్ళినాడు.

నాగ: అవును. బెదరిన లేడివలె వెళ్ళినాడు.

శక్తి:ఊరుకోవే తల్లీ! కొత్తవారి యెదుటపడుటకు అన్నకు కొంత సిగ్గువేసిన, దాని నంతగడబిడ చేసెదవేమి?

నాగ: అన్న శిల్పములు చూచుటకు వారు వచ్చిరాయెను. పోనీ, నా స్నేహితురా లీయనకు క్రొత్తా? తన చుట్టును మేమందరము నాట్యము చేసితిమి కదా!

మహా:ఉండవమ్మా తల్లీ! అన్నగారి నట్లు దుయ్యపట్టుకొంటి వేమి? నీవు లేవా, అన్నియు చెప్పుటకు? వారు సువర్ణుని చూచుటకు వచ్చిరా, బొమ్మలు చూచుటకు వచ్చిరా?

సిద్దా: అమ్మా, అక్క యెప్పుడును నన్ను, అన్నను యీ విధముగానే వేళాకోళములు చేయుచుండునే. నాకు ఎప్పుడో కోపమువచ్చును. నేను నాన్నగారితో చెప్పితీరెదను. సువర్ణ: అందరు ఇచ్చట చేరినారు. అచ్చట నాయనగా రీపాటికి జపము చాలించి యుందురు. పదండి భోజనములకు. అమ్మయు, మహాలియు వడ్డనమాటే మరచిరి.

తండ్రిగారును, సువర్ణశ్రీయు, ముప్పదినలువురు విద్యార్థులును భోజనము చేసిన వెనుక సేవకుడు కరదీపిక చూపించుచుండ, వారందరు ధర్మనంది శిల్పవిద్యాగారమునకు బోయినారు. అచ్చట దంతాసనముపై కృష్ణాజినముపై ధర్మనంది వసించెను. చుట్టును కుడ్యములనంటియున్న శాద్వలాసనములపై విద్యార్థులును, సువర్ణశ్రీయు నధివసించిరి.

ధర్మనంది గ్రంథపీఠముపై భూర్జపత్రశిల్ప శాస్త్ర గ్రంథమునుంచి, అదిచూడకయే బాలుర కుపదేశింప నారంభించెను. భరతనాట్య సూత్రములు, శిల్పసూత్రములు, రూపరచనా ప్రమాణము, అంకము, ధారణము, రూప ప్రతిరూపములు, మాన ప్రతిమానములు, దేవతా మనుష్య గుహ్యక వానరాదిప్రమాణములు, ఉత్తమపురుష లక్షణములు, స్త్రీల యాకారములు, పద్మ సుఖ వీర యోగాది వివిధాసనములు, అభయ, వరద జ్ఞానాదిముద్రలు, లంబ లీల లోలాది హస్తములు, సమద్విత్రి అతిభంగాది భంగిమములు, పద్మ పద్మపత్ర మత్స్య కురంగ చక్రవాకాది లోచనభేదంబులు, గరుడ సమ శుక తిలపుష్పికాది నాసికాభేదంబులు - ధర్మనంది గంభీరకంఠమున ఆ పవిత్ర సమయమున శిష్యుల కుపదేశించెను.

ఈ పాఠము జరుగుచున్నంతసేపును సువర్ణశ్రీకుమారుని మనస్సు హిమబిందు తన యింటికి వచ్చుట, తాను పారిపోవుట, స్థూపముకడ మరల నా బాలికను సందర్శించుట, ఏవేవో పిచ్చిమాటలు తాను పలుకుట, ఆమె “దారి యిమ్మనవే!” యనుట ఈ దృశ్యములన్నియు నాతని మనోనయనాల ఎదుట ప్రవాహతరంగములరీతి ఒకటి వెంటనొకటి వచ్చి మాయము కాసాగినవి.

27. వసంత సౌరభము

పదునారు సంవత్సరములు నిండి పదునేడవ సంవత్సరము రాబోవు తరుణ వయస్సున బాలికలకు వసంతోదయ ప్రారంభము. ఆ వసంతము నందు సౌరభము లలమికొన ఉప్పొంగి వికసించబోవు మల్లికాకుట్మలము హిమబిందు.

చిన్నతనమునుండియు మహారాజకుమారికలకు జరుగని వేడుకలు, లాలనలు, ముద్దులు, మురిపెములు హిమబిందునకు నెల నెలకు జరిగినవి.

హిమబిందుతల్లి ప్రజాపతిమిత్ర. ఈమె సర్వభారతీయ దేశములతో వర్తకమొనర్చు కీర్తిగుప్త వణిక్సంపన్నుని కుమార్తె. కీర్తిగుప్తుల వారు ధాన్యకటకనగరమునందు విశాలమైన రాజవీధిలో తన భవనము నిర్మించుకొని వర్తకము చేయుచుండెను. ప్రతిష్ఠానమునందు, పాటలీపుత్రమునందు, ఉజ్జయిని యందు, పిష్ఠపురము, దంతిపురము, కాంచి మధుర, తాత్రలిప్తి, భరుకచ్ఛము, కౌశాంబి, మహాశకవతి, కన్యాకుబ్జము, పురుష పురము, ప్రయాగ, పుష్కలావతి, కాశీ, తపిక, తక్షశిల మొదలైన ప్రసిద్ధనగరములందు తన వర్తకస్థానముల నేర్పరచుకొని మహోత్తమ వణిక్సంపన్నుడని పేరుపొందినాడు.

ఆ దినములలో గాంధారమున యవనులు రాజ్యము చేయుచుండిరి. యవన వర్తకుడైన డెమిత్రియసును, కీర్తిగుప్తుడును గాఢమిత్రులైనారు. వీరి వస్తువులు వారు, వారి వస్తువులు వీరు వర్తకమునకై మార్చుకొనుచుండిరి. వర్తకమున కంతయు వ్యవహార