హిమబిందు/ప్రథమ భాగం/24. శలభము

వికీసోర్స్ నుండి

రూపెత్తిన యీ పరమాద్భుతశిల్పాశయము, యీ మనోహర మృత్యువు, యీ సమ్మోహనశాపము, యీ రమణీయాగ్ని కీల, యీ మహోజ్వలవిద్యుజ్జిహ్వ యీ బాలిక!”

స్థౌలతిష్యుడు కంపితహస్తము చాచి “పండితులారా! ఈమె నాముద్దుల మనుమరాలు. నా కుమారున కీమె యొక్కతే సంతానము. నేను నా పుత్రు నెట్లు ప్రేమించియుంటినో, నా ప్రేమకు పాత్రుడై యాతడెట్లు శుశ్రూష చేసెనో అది లోకమున కెరుక.” స్థౌలతిష్యులకు కన్నుల నీరు తిరిగినది. బొటనవ్రేలిచే నాతడు బాష్పముల విదిలించెను. “అట్టి మహాపండితుడు, సుకుమారరత్నము దివంగతుడైనాడు. మహాపతీవ్రత నా కోడలుపతి చిహ్నతో సహగమనము జేసినది. తల్లిదండ్రుల ప్రేముడికి దూరమైన ఈ శిశువు మదేకగతి; ఈ వృద్దుడు తదేకగతి. ఈమెను మనయజ్ఞమునకు ధార పోసితిని. ఈమె దేహ ప్రాణములు, మౌనము అంతయు జగద్ధాత్రి లోక పావని యగు మహాశక్తికి అర్పించినాను. తండ్రి చంద్రబాలయని నామకరణముచేసెను.” స్థాలతిష్యుని కన్ను లంత జాజ్వల్యమానమై “ఈమెను పరమేశ్వరుని కంకిత మిచ్చితిని. నా నిధానమును వైదిక ధార్మాగ్నిలో కల్పితిని. ఈమెయే మన సర్వవాంఛలను దీర్చు కల్పవృక్షము. ఈమెయే ఈ పుణ్యభూమిని పవిత్రమొనరింపజన్మించిన కామధేనువు.”

ఆతని తెల్లని గడ్డము, ఊర్ధ్వశిఖ రచించిన ధవళ జటాజూటము, పండువంటి దేహచ్ఛాయ ఇటునటు ఊగిపోయినవి.

24. శలభము

అంత నందరును జూచుచుండగనే చళుకవిషయపుగోడెవలె బలసియున్న పడుచువాడును, నాగవిషయమున గృధ్రమండలాధిపతియు నగు మలయనాగప్రభువు సోమపానము చేసి మత్తిల్లిన క్రతుకర్తవలె లేచినాడు. కండలు కట్టిన తన రెండుచేతులు ముందుకు చాచి, కెంపెక్కిన చూపులు విషకన్యకమోమున నిలిపి, ఉన్మత్తుడై అగ్నిని కౌగలింపబోవు శలభమువలె, వ్యాఘ్రమును జూచి మృత్యువశమున దద్వివృతాస్యమున నులుకు లేడివలె ఇతరులు అడ్డుపడులోపల ఆ బాలవంక పరుగిడిపోయి యామెను కౌగిలించి యామె పెదవులు ముద్దిడబోయినాడు.

ఆ బాలిక భుజములు రెండును గట్టిగా నదిమిపట్టినాడు. మృదుల వల్లికామ తల్లికవలె నున్న యా విషకన్య యా కర్కశహస్తపీడనమున కోరువ జాలక, ఆతని చుంబనమున కేవగించుకొని తల వెనుకకు వంచినది. ఆమె నిశ్వాసములు భయంకర భుజగిపూత్కారములై మలయనాగుని నాసికారంధ్రములలోనుండి, తెరచియున్న నోటిలోనుండి లోనికి బోయినవి. సభాసదు లింతలో నా దురాచారుని చేతులనుండి బాలికను విడిపించిరి.

మలయనాగుడు ఆ విషవాయువుల పీల్చినలిప్తలో కనులు తిరుగ, నోట నురుగులు గ్రమ్మ చాపచుట్టవలె నేలపై విఱచుకపడెను.

సభ్యులందరు గొల్లుమనిరి. చంద్రబాల క్రోధరూపిణియై రోజుచు ఇటునటు ఊగిపోవుచుండెను. ఆ బాలికకేశపాశము ఊడిపోయి, మేఘములు క్రిందికి దిగునట్లు సువ్వునపడిపోయెను. తప్తజాంబూనదకలశముల వంటి ఆమె వక్షోజములు పైకి ఉబుకుచు తగ్గుచున్నవి. ఆమె మహాప్రళయము, భయంకర కాళికాదేవి, ఆమె శివత్రిశూలము, ఆమె చక్రధార!

సభ్యులందరు భీతులై వైవర్ణ్యమొందిన మోములతో దావానలము జూచు అరణ్యమృగములవలె వణకిరి. స్థౌలతిష్యులు వికృతానందముతో కలకలలాడు పెదవుల నొకశంఖ మొత్తుటయు, పలువురు సేవకులు విచ్చేసి యా శవమును తరలించిరి.

మలయనాగుడు ఆంధ్రదేశములో నివసించు కొన్ని నాగవంశములకు ప్రభువు. ఆంధ్రార్యులకంటె ముందుగనే ఆంధ్రదేశమునంతను నాగులాక్రమించుకొని యుండిరి. ఉన్నతశరీరులు, శ్యామలాంగులు నగు నాగులుత్తరభూములనుండి వచ్చి దక్షిణాపథమును రామాయణ కాలానంతరమందాక్రమించిరి. అంతకుముందే స్వల్పసంఖ్యాకులగు నాంధ్రర్యులు కృష్ణవేణి ముఖప్రాంతమున నివసించియుండిరి. పాండవకాలము నాడార్యులు విరివిగా వచ్చి నాగదేశము జొచ్చి నాగులతో సంబంధబాంధవ్యముల నెరపు చుండిరి. ఉలూపి కథయు, పురుకుత్సుని గాథయు నిట్టీవియే.

నాగులకు సామంతరాజ్యము లుండెను. అట్టివారిలో మలయనాగు డొకడు. నాగులందరు బౌద్ధమతావలంబకులే. కాని పట్టుదల కలిగిన బ్రాహ్మణులు కొందరు వీరికి ఆర్యదీక్షల నిచ్చి తమవైపునకు త్రిప్పుకొని వారిచే మిక్కుటమగు సహాయము నందుచుండిరి.

సభ్యులలో భయ మిసుమంతయు తగ్గలేదు. మహావనశాల గ్రామమున సభా కార్యక్రమము నిర్వర్తించిన వ్యక్తి లేచి భక్తియు, భయమును గదిరిన కన్నులతో స్థౌలతిష్యుని దిక్కు మొగంబై యిట్లనియె. మహా ఋషీ! మలయనాగుడు నాగులలో నుత్తమవంశ్యుడు. ఆతడు మాయమగుట ప్రజలకును, ఆంధ్ర రాజునకును తెలిసినచో మన జీవయాత్రలు ధాన్యకటకపాతాళగృహంబుల గడుపవలసినదే! ఇప్పుడు మనకు దారియేరి?”

స్థౌల: ఓ శివస్వాతీ! నీవు మాగధుడ వగుట తెలిసిపోయినది. మలయనాగుని దేహము ఓషధీరసంబుల చెక్కు చెడకుండును. ఏ భక్తునకు ఫాలనేత్రుడు, సర్వసృష్టి కారణుడు, మహాలింగమూర్తి సర్వవిషశక్తుల నిచ్చెనో యాతని కా పరంజ్యోతి వాని విరుగుడుల ప్రసాదింపడా? హాలాహల విషంబుల నవలీలగ ద్రావిన లోకేశ్వరుడు విషనివారణ మంత్రముల నాతని పాదముల భజించు భక్తులకు సమకూర్చడా? అప్పుడే మలయ నాగుని శరీరము ఓషధులచే తడుపబడెను. మహా విషపూరితయగు నా బాల నా ప్రాణములకు ప్రాణము, నా కోర్కెలకు నిధానము. చంద్రబాల యొక్క నిశ్వాసముల వడిని తగ్గింప ఒక వారము దినములు పట్టును. అంతవరకు నా తుచ్ఛుడటుల పడియుండవలసినదే.

ఆ వృద్ధుడు కన్నుల విస్ఫులింగములు రాలుచుండ, ఉచ్చైస్వనమున నిట్లనియె: “సభాసదులారా! మీరే యిట ధర్మవ్యవహర్తలు కండు. నా బాలను పరమేశ్వరున కంకిత మొనర్చితిమి. పవిత్రవేదమత పునరుద్ధరణ మహా కార్యమునకు నియోగించిన యీ శుభాంగియెడల పాతక మొనర్ప నెంచిన ఈ కర్మ చండాలుడు జీవింపవలసినదేనా? జీవమిచ్చినపక్షమున దైవాయుధమగు నీ బాలయందు మరల మరులుకొని మన ప్రయత్నములు భగ్నముచేయడా?”

మహేశ్వరానందుడు: స్వామీ! ఈతని మరణ మెట్లు కప్పిపుచ్చగలము? స్థౌల: రెండు దినములలో నొక రథము ఈతని శరీరమును ఈతని పురమునకు గొనిపోగలదు. ఊరిబయట చేత నొక కత్తితో నీతడు పడియుండును. ప్రక్కనే నాకడనున్న పామొకటి రెండు తుండెములై కాలికడ పడియుండును. అతని కాలిమీద పాముకాటు స్పష్టముగ కనబడును.

అక్కడనుండు సభ్యులకు దేహము జలదరించెను.

వికృతహాసముచే బీభత్సమగు తాతగారి మోము చూచుచు చంద్రబాల చటుక్కున వచ్చి యాతని పాదములకడ మోకరించి వానిపై మోముంచి కన్నుల నీరు వెల్లువలు గానిట్లు పలికెను: “తాతయ్యగారూ! ఈ తుచ్ఛుడు నిజముగా మరణించినాడా? నావలననే వీనికి జావు మూడినదా? నేనే వీనిపాలిటి మృత్యువునైతినా?” అని వాపోయెను.

స్థౌలతిష్యుడు విసుగుదలతో నామెను లేవనెత్తెను. ఈమె ఓర్వలేకపోవుట యేమి? ఈ బాలిక తనచేతిలోని - కాదు, విధిచేతులలోని - శస్త్రము. నాశనముచేయుట, నాశనము చేయకపోవుట ఆ పని దీనిది కాదు. చిన్నతనము నుండియు నీమెకు హృదయము నశించునటుల తానొనర్చినాడు. ఈమె సుకుమారాంగములందు, మానసమునందు క్రూరత్వము నింపినాడు. మృత్యువును పూరించినాడు. పసితనమునందు లేగదూడల, హరిణముల ప్రాణములు హరించి ఆటగా కిలకిల నవ్వెడిది.

ఈ బాల కిప్పు డీ జాలి యేల పొడమెను? స్థౌలతిష్యుని భ్రూయుగ్మము దరిచేరినది. ఆతని విశాలఫాలమున దున్నిన భూమియందువలె ముడతలు వేనవేలు జనించినవి. ఈ కన్యకాహృదయమున కింకను క్రూరత్వమే పోసెదగాక యని యాత డాలోచించుకొనెను.

“ఓ విషకన్యా! నీవు అగ్నికీలవు, విషకలికవు, మృత్యుధారవు. నీ దేహము కౌగలించిన పాపి నరకమునకుబోవును. నీవు ఉన్నతకులమున జన్మించిన మహాశక్తివి. ఈశ్వరార్పితవు. పరమపవిత్రవు. ఈ నీచుడునీపై చేయి వైచి కలుషమొనర్చినాడు. మహాగ్నికీలను గౌగిలించినవాడు బ్రతుకునా? ఆవితథమైన విధియెత్తికోలున కడ్డముపడి యీ నిర్భాగ్యుడు హతుడైనాడు. వీని నెవ్వరు రక్షింపగలరు? ఈశ్వరనివేదితమును ముట్టిన యీ కుక్కకై వగవకుము. వీనిపాపమే దీనికి మిత్తియైనది. సదాశివగర్భాలయమున వెలుగు దీపార్చివలే నీవు పరమపవిత్రవు. నీపావిత్య్రము రక్షించు కొనుము.”

చంద్రబాల ఆతని మరణమునుగూర్చి యాలోచించుచు మిన్నకుండెను. సభ్యులు భయము గదురు హృదయములతో తలలూపిరి.

స్టౌలతిష్యులంత “ఈ ముహూర్తమున దోష మున్నది కాన వేరొక్క ముహూర్తము నిర్ణయింపబడును” అనెను. ప్రాయశ్చిత్తార్చన జరిగినది. పారాయణ మొనర్చిరి. దీపారాధన అయినది. నైవేద్యార్పణ జరిగెను. స్థౌలతిష్యులా పుష్పముల విషబాలమూర్ధమున నుంచి గాన మొనర్చెను.

“చండమహానల ఫాలవిలోచన!
కాలకాల! ఖలగర్వవిదారణ!
అండజవాహనమిత్ర! శుభంకర!
హర! హర! హర! హర! యీశ
మహేశ మహేశ మహేశ!”