హిమబిందు/ప్రథమ భాగం/22. ఆశ్రమము

వికీసోర్స్ నుండి

యుద్ధారంభమైన మూడుగంటలకు సమదర్శి సేనలు చెక్కు చెదరక భోజనాది వస్తు సామాగ్రితో దుర్గములోనికి చొచ్చిపోయెను. వినీతమతి సమదర్శిని కౌగలించు కొనియెను. కోటలో విజయనాదములు భేరీభాంకారములు మిన్ను ముట్టినవి. మాళవ సైన్యములు మొగములు వ్రేలవైచినవి.

మిడుతలదండువలెనున్న మాళవ సైన్యములు మరునాడు ధైర్యవిహీనములై యుద్ధము చేయనారంభించినవి. ఇంతలో సుశర్మ చక్రవర్తిపంపిన కొన్ని సైన్యములు వచ్చిచేరినవి. వానితో శివభూతివచ్చినాడు. అతడు మాళవాధి పతిని గలిసికొని యిట్లనియె: “మహారాజా! ఆంధ్రరాజు సైన్యములలో కొన్ని విడిపోవును. ఆతని కుమారుడు యువరా జీపాటికి నిర్వాణపథమునకు జేరి, బుద్ధుని గొలుచుచుండును. ఆ వార్త ఆంధ్రులకు తెలియజేయుటకు మేమే అంచెల నుంచినాము. ప్రతిష్టానము తక్షణము మన స్వాధీనము కాగలదు. మంజుశ్రీ యువరాజు కాగలడు. కాన మనకు భయములేదు. ఆంధ్రసైన్యము లింక కొన్ని నెలలవర కిచ్చటకు రాజాలవు. ఈలోన నీమూకలనుక్కడంచి మనము జాగ్రత్తపడి యెదము గాక. సార్వభౌముని సైన్యములు తేరుకొని వచ్చునప్పటికి కళింగమున సైన్యము లన్నియు తిరుగుబాటొనర్చును. విదేహరాజ్యము మనకు సహాయము నంపును. మన మహాసైన్యము లన్నియు కలసి ఆంధ్ర రాజ్యముపై దండెత్తి ఆ దేశమును ముక్కలు చేయవలయున. మంజుశ్రీ మనచేతిలోని కీలుబొమ్మ. ఫలవంతమగు ఆ రాజ్యమంతయు మన పాలిటిదగును కాన మనకేమి భయము” అని వచించెను.

మాళవుని మొగము విప్పారెను. ఆంధ్రసైన్యములకిక బాసటరాదనియు, కోటలోని సైన్యముల హతమార్చవచ్చుననియు, ధైర్యముగా నుండు డనియు, దొంగలవలె ఆంధ్ర సైన్యములు రాత్రి శిబిరములు చొచ్చినవి కాని, లేకున్నచో పేరులేకుండ మాసిపోయి యుండుననియు సైన్యమంతట చాటిరి. జయజయనాదములు సల్పిరి. మాళవ సైన్యములు మహా సంతోషమున తేలియాడెను.

కాని శివభూతి తన పటకుటీరమున నస్థిరుడై గూర్చుండి ఇంకను ప్రతిష్టానము నుండి వార్తలేమియు రాలేదేమని మనోవేదన ననుభవించుచుండెను. “ఏమో! ఏమైనదో! ఏమికానున్నదో?” యని యాతడు పది సారు లనుకొనియెను.

22. ఆశ్రమము

కతిపయ దినంబులకు ధాన్యకటకమున కృష్ణాతీరమందు మహా చైతన్యమునకు కొలదిదూరములోనున్న స్థౌలతిష్యాశ్రమమునకు మహేశా నందాది పండితులు చేరినారు. ఆ ఆశ్రమ భవనములన్నియు రాతివి. ఆ ఆశ్రమము చాల భాగ్యవంతమైనది. అన్నియు తోటలే. తోటల నడుమ ఆశ్రమగృహాలు, సమస్త ఫలపుష్పాదులు గల యా తోటలో ఒక భవనమున్నది. వృద్ధుడును, మహాయోగియు నగు స్థౌలతిష్యుల వారందు వసింతురు.

స్థౌలతిష్యులవా రాంధ్ర బ్రాహ్మణుడు. ఆపస్తంబసూత్రుడని పెద్దలందరు. తక్షశిలయందు, వారణాసియందు, నైమిశారణ్యమునందు పెక్కు సంవత్సరము లధ్యయన మొనర్చి, యందందు గురుత్వము సలిపి స్వగ్రామమగు కృష్ణాతీరస్థ రాజశైలమున వార్ధకము గడుపుచుండెను. ఇట్టి మహానుభావుడగు యోగి తిరిగి విచ్చేసినాడని వినినంతనే మహా రాజాధిరాజు శ్రీముఖసాతవాహనుడు స్వయముగ నచ్చటికి విచ్చేసి ఆయనకు సకల సౌఖ్యముల సమకూర్చుట కనుమతినీయ బ్రార్థించెను. స్థాలతిష్యులు శాలివాహన సార్వభౌము నాశీర్వదించి, “మహారాజా! మీరు బౌద్ధ మతావలంబకులు. వేదములు పౌరుషేయము లనియు, యజ్ఞయాగాదిక్రతువులు హింసాత్మకములనియు, కర్మకాండ దూష్యమనియు వచింతురు. కలియుగ లక్షణములు మీ పాలనమున మూర్తిదాల్చుచున్నవి. మెలకువ నొందుట శ్రేయస్కరము. ఆంధ్ర వంశోద్ధారక! శాతవాహన వంశకులతిలకా! వృద్ధుడనగు నామాట వినుము. అనాదియగు వేదముల పుట్టుక నెవరు నిర్ణయింపగలరు? మీ శ్రమణకుడు వాక్రుచ్చిన భావనలు, నీతిబోధయు వేదములయందు లేవా? వేదనింద యొనర్చు నాస్తికధర్మమూని ఈ జాతిని భ్రష్టమొనర్పకుము. మహాచక్రవర్తులగు హరిశ్చంద్రాది నృపులవలె వేదధర్మ ప్రతిష్ఠచే యశము సముపార్జించుకొనుము. బౌద్ధదీక్షను వీడి పరబ్రహ్మదీక్షను గొనుము. భారతవర్షము నుద్ధరింపుము. సకలార్యలోకమట్టి చక్రవర్తికై ఎదురుచూచుచున్నది. మీచే రాజసూయంబు సల్పించెద. ఆగ్నిసమానుడు అర్థశాస్త్రవేత్త, కౌటిల్యుడు చంద్రగుప్తుని సామ్రాజ్యాభిషిక్తుని చేసినట్టు మిమ్ము నీ జంబూద్వీప సార్వభౌమ పదమున కభిషిక్తుని జేసెదను.” ఈ ముక్కలని వృద్ధుడగు తపస్వి తేజోవంతములగు తన తీక్షణ దృష్టుల శాతవాహనుని మోముపై బరపెను.

సాతవాహనుడు చిరునవ్వు నవ్వెను. స్థాలతిష్యులు పట్టుదలగలిగిన ఆర్ష మతాభిమాని అని మహారాజెరుగును. “ప్రేమతత్వమే అహింసావ్రతోదరణమే మూల సూత్రముగదా యీ మతమున? ఇందలి పాపమేమి మహాఋషీ? బౌద్ధమతమునందు అశోకచక్రవర్తి కాలమునుండియు సామ్రాట్టులు దీక్ష వహించిరి. సమస్త మతములవారిని సమదృష్టితో పరిపాలించుచున్నారు. నే డా పద్ధతి మార్చుటకు మాకు కారణమేమియు కనబడదు. కాన మమ్ము క్షమింపుడు. స్నేహభావముతో మెలగితిరి. మహాభాగా! ఈ విషయమున మీతో తర్కింపజాలను. మమ్మనుగ్రహింపుడు” అని చక్రవర్తి వేడుకొనెను.

సోనుత్తర చండికాది పండితులు వచ్చిన యీదినమందు స్థౌలతిష్యుని భవనమునం దొక్కమందిరమున నందరును సమకూడిరి. ఆ భవనమునందు విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, ప్రజాపతి, మహేశ్వరి, గజలక్ష్మీ మొదలగు దేవతల విగ్రహములు కలవు. లింగమూర్తి పానవట్టమునం దొకచో ప్రత్యక్షమై యుండెను.

స్థౌల్యతిష్య మహర్ష్యాశ్రమమునందు శిలామందిరాలలో తాపసులు, పండితులు, వేదవేదాంగ పారంగతులు, సర్వశాస్త్రవేత్తలు కుటుంబములతో నివసించియుండిరి. విశాలభవనములలో, మండపములలో, వృక్షచ్ఛాయాపీఠములలో బ్రహ్మచారులు దీక్షతో సర్వశాస్త్రములు అభ్యసించుచుండిరి. వారితోపాటు ఆశ్రమమున వేరొకచోటనున్న బాలికావిద్యా మందిరములో అనేకులు బాలికలు సర్వవిద్యలు నేర్చుచుండిరి. ఖేదనము, అశ్వారోహణము, రథచోదనము, గజ విద్య మొదలైనవి నేర్పుచుందురు. ఆశ్రమ మధ్యభాగమున కృష్ణానదీతీరమందు యజ్ఞయాగాది క్రతువు లొనరింపబడుచుండును. స్థౌలతిష్యులు సర్వవిద్యా మహార్ణవ స్వరూపులు. వేదము లాయన ముఖమునందు ప్రజ్వరిల్లుచుండును. వేదభాష్యము లాయన ఫాలమున తేజరిల్లును. ఉపనిషత్తులన్నియు ఆయన చూపులలో తాండవించును. ప్రస్థానత్రయ మాతని హృదయము. అధర్వణవేద మాతని యూడిగపుగత్తె. ధన్వంతరివలె ఆతని దక్షిణహస్తమున అమృతకలశమున్నది. తక్షకునివలె ఆతని వామహస్తమున విషకుంభమున్నది.

స్థౌలతిష్యుని ఆశ్రమమునందు పురాణశ్రవణము, వేదాంతచర్చ, ధర్మశాస్త్రగోష్టి, సాహిత్యవిచారణ, ఆయుర్వేద, జ్యోతిష విచారణములు జరుగుచుండును.

సార్వభౌముడీ ఆశ్రమమునకు వలయు సౌకర్యములు అర్పించుచుండును. స్థాలతిష్యమహర్షి “నీ అర్పణయే నీకు నాశనము కాగల” దనిచిరునవ్వు నవ్వుకొను చుండును.

స్థాలతిష్యుని పూజామందిరమున ఎందరో పండితులు, మండలాధిపతులు, భూస్వాములు, మునులు, రాజకీయోద్యోగులు ఆ త్రయోదశినాడు చేరియుండిరి.

స్థాలతిష్యమహర్షి కృషభేశ్వరునియెదుట అలంకార రేఖావర్ణ సుందరమగు కాంకూరపత్ర కంబళిపై నధివసించి తపస్సు చేసికొనుచుండును. మండపమున చేరినవారందరు భక్తితో వివిధ కృష్ణాజినాద్యా సనములపై నధివసించియుండిరి.

స్థౌలతిష్యుడు తపస్సు చాలించి, నీరాజన సమర్పించుచు, అచ్చట నున్న సువర్ణఘంటికను దక్షిణహస్తమునగొని క్వంక్వణ నినదము చేసెను. ఆ మందిరమున పూజాపీఠమునకు ఎడమవైపున నున్న ద్వారమున విషబాల ప్రవేశించినది.

తోడనే పీఠముదాపుననున్న నలుగురు భక్తులలో నొకడు శంఖము నూదెను. ఒకడు జేగంట గణగణ వాయించెను. ఒక డొక భాంకారముపై “భం భం” నినాద మొనర్చెను. ఒకడు ఉచ్చైస్వనంబున సూక్తపాఠ మారంభించెను. పలువురు భక్తులాతని కంఠముతో దమ కంఠములు మేళవించిరి.

23. అభిచారము

అచటనుండి స్థౌలతిష్యమహర్షి ఆ మందిరముననే వేరొకయెడ ప్రజ్వలించుచున్న హోమకుండము కడ ఉత్తరాభిముఖుడై వ్యాఘ్రాజినముపై నధివసించి, గంభీరోచ్ఛాటనలతో అభిచారహోమము ప్రారంభించెను. ఆ అభిచార హోమము శత్రుమారణరూపమైనది.

“ఓ అగ్నివాయు సూర్య చంద్ర జలములారా!
మమ్మెవ్వడు ద్వేషించుచున్నాడో,
ఎవ్వని మేము ద్వేషించుచున్నామో,
అట్టివానిని మీ తాపశక్తిచే తపింపజేయుడు,
మీ దీప్తిశక్తిచే మండింపజేయుడు,
మీ దుఃఖదాయకశక్తిచే శోకింపజేయుడు,
మీ తేజశ్శక్తిచే నిస్తేజస్కునిగా జేయుడు.”
“ఓ విషశక్తీ! నీవు ఈ భయంకర సౌందర్య నారీరత్నమునందు
సంపూర్ణవేగముతో కూడుదువుగాక
ఓ కాలకూటవిషమా! నీవు లోకాలను దహింతువు. నీ దహనశక్తి మా
శత్రువును దహించివేయుగాక
ఓ దంష్ట్రాకరాళ మృత్యుమూర్తీ! నీ వీ బాలికయందు ప్రవేశింపుము.