హిమబిందు/ప్రథమ భాగం/23. అభిచారము

వికీసోర్స్ నుండి

మాతని యూడిగపుగత్తె. ధన్వంతరివలె ఆతని దక్షిణహస్తమున అమృతకలశమున్నది. తక్షకునివలె ఆతని వామహస్తమున విషకుంభమున్నది.

స్థౌలతిష్యుని ఆశ్రమమునందు పురాణశ్రవణము, వేదాంతచర్చ, ధర్మశాస్త్రగోష్టి, సాహిత్యవిచారణ, ఆయుర్వేద, జ్యోతిష విచారణములు జరుగుచుండును.

సార్వభౌముడీ ఆశ్రమమునకు వలయు సౌకర్యములు అర్పించుచుండును. స్థాలతిష్యమహర్షి “నీ అర్పణయే నీకు నాశనము కాగల” దనిచిరునవ్వు నవ్వుకొను చుండును.

స్థాలతిష్యుని పూజామందిరమున ఎందరో పండితులు, మండలాధిపతులు, భూస్వాములు, మునులు, రాజకీయోద్యోగులు ఆ త్రయోదశినాడు చేరియుండిరి.

స్థాలతిష్యమహర్షి కృషభేశ్వరునియెదుట అలంకార రేఖావర్ణ సుందరమగు కాంకూరపత్ర కంబళిపై నధివసించి తపస్సు చేసికొనుచుండును. మండపమున చేరినవారందరు భక్తితో వివిధ కృష్ణాజినాద్యా సనములపై నధివసించియుండిరి.

స్థౌలతిష్యుడు తపస్సు చాలించి, నీరాజన సమర్పించుచు, అచ్చట నున్న సువర్ణఘంటికను దక్షిణహస్తమునగొని క్వంక్వణ నినదము చేసెను. ఆ మందిరమున పూజాపీఠమునకు ఎడమవైపున నున్న ద్వారమున విషబాల ప్రవేశించినది.

తోడనే పీఠముదాపుననున్న నలుగురు భక్తులలో నొకడు శంఖము నూదెను. ఒకడు జేగంట గణగణ వాయించెను. ఒక డొక భాంకారముపై “భం భం” నినాద మొనర్చెను. ఒకడు ఉచ్చైస్వనంబున సూక్తపాఠ మారంభించెను. పలువురు భక్తులాతని కంఠముతో దమ కంఠములు మేళవించిరి.

23. అభిచారము

అచటనుండి స్థౌలతిష్యమహర్షి ఆ మందిరముననే వేరొకయెడ ప్రజ్వలించుచున్న హోమకుండము కడ ఉత్తరాభిముఖుడై వ్యాఘ్రాజినముపై నధివసించి, గంభీరోచ్ఛాటనలతో అభిచారహోమము ప్రారంభించెను. ఆ అభిచార హోమము శత్రుమారణరూపమైనది.

“ఓ అగ్నివాయు సూర్య చంద్ర జలములారా!
మమ్మెవ్వడు ద్వేషించుచున్నాడో,
ఎవ్వని మేము ద్వేషించుచున్నామో,
అట్టివానిని మీ తాపశక్తిచే తపింపజేయుడు,
మీ దీప్తిశక్తిచే మండింపజేయుడు,
మీ దుఃఖదాయకశక్తిచే శోకింపజేయుడు,
మీ తేజశ్శక్తిచే నిస్తేజస్కునిగా జేయుడు.”
“ఓ విషశక్తీ! నీవు ఈ భయంకర సౌందర్య నారీరత్నమునందు
సంపూర్ణవేగముతో కూడుదువుగాక
ఓ కాలకూటవిషమా! నీవు లోకాలను దహింతువు. నీ దహనశక్తి మా
శత్రువును దహించివేయుగాక
ఓ దంష్ట్రాకరాళ మృత్యుమూర్తీ! నీ వీ బాలికయందు ప్రవేశింపుము.

ఓ సౌందర్యనిధులైన దేవతలారా! ఈ బాలిక ప్రతి అవయవము నందు,
ప్రతి ఇంద్రియమునందు, ప్రతి శక్తియందు ఆవేశింతురుగాక
ఓ ఉషోదేవతా! నీ వీ బాలిక ముఖమగుదువుగాక
ఓ చంద్రమూర్తీ! నీ వీ బాలిక వపువగుదువుగాక
ఓ మిత్రావరుణులారా! మీ రీ కన్య రెండు నేత్రము లగుదురుగాక
ఓ అగ్నీ! నీ వీ బాల కన్నులలో వెలిగెదవుగాక
ఓ మేరుపర్వతమా! నీ వీ యువతి స్తనముల శోభింతవుగాక
ఓ నదీ దేవతలారా, మీ రీ బాలిక నూగారులగుదురుగాక
ఓ శచీదేవీ! నీ వీ బాలిక పెదవులపై నర్తించెదవుగాక
ఓ ఆకాశమా! నీ వీ సుందరి నడుమునందు చేరుము
ఓ మరుద్దేవతలారా! మీ రీ యువతి ఉచ్చ్వాస నిశ్వాసములయందు మసలుదురుగాక
'ఓ మంత్రమా! నీవు మహాశక్తిచే మా విరోధుల నీ బాలికకడకు ఆకర్షింపుము.
నీవామె వాక్కులో, చూపులో, పెదవులలో, ఆమె స్తనములలో చేరుము.
ఈ బాలిక శరవేగ యగుగాక
ఈ సుందరి శ్రీకృష్ణ శాతవాహనుని అగ్ని శలభము నాకర్షించి నట్లు ఆకర్షించుగాక
ఈ బాలిక శ్రీకృష్ణశాతవాహన విగ్రహమునకు వలయగుగాక
ఈ సుందరి శ్రీకృష్ణసాతవాహనుని మృత్యువగు గాక
ఈ యువతి శ్రీకృష్ణసాతవాహనుని దగ్ధముచేయుగాక!”

అనుచు నభిమంత్రించుచుండ నా బాలిక మైమరచి, ఊగిపోవుచు, పద్మాకృతియగు రంగవల్లిలో నిలిచియుండెను.

ఆ బాలికపై స్థౌలతిష్యుడు మంత్రజలము జల్లినాడు. ఆమెను చుట్టి ప్రయోగహస్తము పట్టినాడు.

మధ్యాహ్నమార్తాండునివలె తేజరిల్లు మోముతో స్థౌలతిష్యుడప్పుడు సభ్యులదిక్కు మొగంబై,

“ఈ బాలిక దివ్యాస్త్రము
ఈమె ప్రయోగింపబడిన మృత్యువు
స్వచ్ఛమై స్నిగ్ధకాంతులలో మెరయు
నక్షత్రము లామె కన్నులు.

“అందు వెడలు చూపులు మృదులసువాసనాలహరీపూర్ణములగు మనోజ శరములు కావు, భయంకర దావాగ్నికీలలు.

పక్వబింబము లా యధరములు, ప్రవాళకాంతులు, కల్యబాలా పరమ సౌందర్య నర్తనములు, అవి సుధానిధానములు కావు, తక్షకవదనదంష్ట్రాయితములు.

సమస్తజీవరాసులకు ప్రాణరస మర్పించు పావననదీనదంబులకు పుట్టినిళ్ళు ధరాధరములా? మదగజకుంభములా? ఈ సుందరీవక్షోజములు, ఇవి దుగ్ధాంభోధి మథనసంజాతామృతకలశములు కావు, కాలకూటవిష కుంభములు.

ఆ దేహమున జాంబూనదరజఃపరాగములు రేగుచున్నవి. ఏమిమార్దవము! తరుణకేతకీ కోమలమగు నిది అగ్నితప్తకనక క్రకచము. రూపెత్తిన యీ పరమాద్భుతశిల్పాశయము, యీ మనోహర మృత్యువు, యీ సమ్మోహనశాపము, యీ రమణీయాగ్ని కీల, యీ మహోజ్వలవిద్యుజ్జిహ్వ యీ బాలిక!”

స్థౌలతిష్యుడు కంపితహస్తము చాచి “పండితులారా! ఈమె నాముద్దుల మనుమరాలు. నా కుమారున కీమె యొక్కతే సంతానము. నేను నా పుత్రు నెట్లు ప్రేమించియుంటినో, నా ప్రేమకు పాత్రుడై యాతడెట్లు శుశ్రూష చేసెనో అది లోకమున కెరుక.” స్థౌలతిష్యులకు కన్నుల నీరు తిరిగినది. బొటనవ్రేలిచే నాతడు బాష్పముల విదిలించెను. “అట్టి మహాపండితుడు, సుకుమారరత్నము దివంగతుడైనాడు. మహాపతీవ్రత నా కోడలుపతి చిహ్నతో సహగమనము జేసినది. తల్లిదండ్రుల ప్రేముడికి దూరమైన ఈ శిశువు మదేకగతి; ఈ వృద్దుడు తదేకగతి. ఈమెను మనయజ్ఞమునకు ధార పోసితిని. ఈమె దేహ ప్రాణములు, మౌనము అంతయు జగద్ధాత్రి లోక పావని యగు మహాశక్తికి అర్పించినాను. తండ్రి చంద్రబాలయని నామకరణముచేసెను.” స్థాలతిష్యుని కన్ను లంత జాజ్వల్యమానమై “ఈమెను పరమేశ్వరుని కంకిత మిచ్చితిని. నా నిధానమును వైదిక ధార్మాగ్నిలో కల్పితిని. ఈమెయే మన సర్వవాంఛలను దీర్చు కల్పవృక్షము. ఈమెయే ఈ పుణ్యభూమిని పవిత్రమొనరింపజన్మించిన కామధేనువు.”

ఆతని తెల్లని గడ్డము, ఊర్ధ్వశిఖ రచించిన ధవళ జటాజూటము, పండువంటి దేహచ్ఛాయ ఇటునటు ఊగిపోయినవి.

24. శలభము

అంత నందరును జూచుచుండగనే చళుకవిషయపుగోడెవలె బలసియున్న పడుచువాడును, నాగవిషయమున గృధ్రమండలాధిపతియు నగు మలయనాగప్రభువు సోమపానము చేసి మత్తిల్లిన క్రతుకర్తవలె లేచినాడు. కండలు కట్టిన తన రెండుచేతులు ముందుకు చాచి, కెంపెక్కిన చూపులు విషకన్యకమోమున నిలిపి, ఉన్మత్తుడై అగ్నిని కౌగలింపబోవు శలభమువలె, వ్యాఘ్రమును జూచి మృత్యువశమున దద్వివృతాస్యమున నులుకు లేడివలె ఇతరులు అడ్డుపడులోపల ఆ బాలవంక పరుగిడిపోయి యామెను కౌగిలించి యామె పెదవులు ముద్దిడబోయినాడు.

ఆ బాలిక భుజములు రెండును గట్టిగా నదిమిపట్టినాడు. మృదుల వల్లికామ తల్లికవలె నున్న యా విషకన్య యా కర్కశహస్తపీడనమున కోరువ జాలక, ఆతని చుంబనమున కేవగించుకొని తల వెనుకకు వంచినది. ఆమె నిశ్వాసములు భయంకర భుజగిపూత్కారములై మలయనాగుని నాసికారంధ్రములలోనుండి, తెరచియున్న నోటిలోనుండి లోనికి బోయినవి. సభాసదు లింతలో నా దురాచారుని చేతులనుండి బాలికను విడిపించిరి.

మలయనాగుడు ఆ విషవాయువుల పీల్చినలిప్తలో కనులు తిరుగ, నోట నురుగులు గ్రమ్మ చాపచుట్టవలె నేలపై విఱచుకపడెను.

సభ్యులందరు గొల్లుమనిరి. చంద్రబాల క్రోధరూపిణియై రోజుచు ఇటునటు ఊగిపోవుచుండెను. ఆ బాలికకేశపాశము ఊడిపోయి, మేఘములు క్రిందికి దిగునట్లు సువ్వునపడిపోయెను. తప్తజాంబూనదకలశముల వంటి ఆమె వక్షోజములు పైకి ఉబుకుచు తగ్గుచున్నవి.