హిమబిందు/ప్రథమ భాగం/21. పరిత్రాణము

వికీసోర్స్ నుండి

ఒకడు: అవునుస్వామీ! ఇట్టి మహాపవిత్రకార్యము చేయుటలో కొన్ని కష్ట కార్యములు చేయవలసి వచ్చినను వెనుదీయకూడదు. మనము దురుద్దేశముతో చేయుట లేదుగదా?

చండికుడు: ఇన్ని సంవత్సరములు వేదపారాయణముచేసి, శాస్త్రములు పఠించి, ప్రతిజ్ఞగైకొని యీనాడు నేను వెనుదీయుదునా? చంద్రస్వామిలేని కొరతలేదు. మనము ముఖ్యకార్యము నడుపవలసినదే.

మిగిలినవారందరును “నిజము నిజ” మని చెప్పిరి. అందరును ఆవేశపూర్ణులై యున్నారనియు, తన కార్యమునకు తోడ్పడెదరనియు, నా సభ నడుపు ప్రధానపురుషునకు దోచినంతట నా విషయమునుగూర్చిన సంభాషణమాని “మన మిక్కడనుండి వివిధములగు మార్గముల ధాన్యకటకము చేరవలయును. మహాయోగి, పుణ్యపురుషుడు, స్థాలతిష్యులవారు వారి పని కొనసాగు శుభముహూర్త మేగుదెంచినదనియు, దానిని గమనించుటకు మనమందరము రావలెననియు ముదల పంపినారు. మీరుదప్పనింక నెవ్వరిని తీసికొని రావలదు. రేపు త్రయోదశినాడు శుభముహూర్తము” అని యతడు పల్కెను.

21. పరిత్రాణము

సమదర్శి పోటుమానిసి. చురుకుపాలెక్కువ. వెనుకముందుచూడని సాహసి. తనకిచ్చిన ఆ అక్షౌహిణీసైన్యముగొని పిట్టను వెన్నాడు డేగవలె దుర్గమారణ్యములబడి రివ్వున పోజొచ్చెను. దిగంబరులు, క్రూర సత్వులగు రాక్షసులను ఆరణ్యక జాతివారు (ఇప్పటికిని బస్తరు సంస్థానపు దుర్గమారణ్యములలో నున్నారు. వారిని మేము చూడ గలిగితిమి) ఆ అడవులలో నుండిరి. ఆ మూకల స్నేహముచేసికొని వారికెన్నియో విచిత్ర వస్తువుల కాన్కలిడుచు, వారి మన్ననల గ్రహించుచు, తనజాడ పుళిందులకు తెలియకుండునట్లు కష్టతమములగు మార్గములనే రాక్షసులు చూప నడచిపోవుచు, సమదర్శి రెండు వారములలో మాళవరాజ్యపు సరిహద్దుల చేరునప్పటికి ఒక్క పుళిందుల మూక ఆతని నడ్డగించెను. కాని అర్జునగాండీవవినుర్ముక్త మహాశరమువలె పోవునాతనికి చిన్న సైన్యమొక లెక్కయా! ఆ మూకను చీల్చి చెండాడి ఉజ్జయినికి నాల్గు గోరుతముల దూరమువరకు నాక్రమించియున్న మాళవసైన్యములపై మబ్బులేని పిడుగులవలె దూకెను. కోటలోనున్న వినీతమతికి సమదర్శి సైన్యముల నడుపుకొని వచ్చినాడని వేగు తెలిసినది.

ఉజ్జయినీకోట చాల ముఖ్యమైనది. అది దేవనిర్మితమని ప్రతీతి. శ్రీముఖ శాతవాహనుని తండ్రి, సమదర్శి తండ్రి ప్రియదర్శి సేనాపతిగా ఉజ్జయినీపట్టణమును మహాసంగర మొనర్చి స్వాధీన మొనర్చుకొనెను. అప్పుడు మాళవాధిపతి నీరసముగ నున్నను చాలకాలము అద్భుతముగా కోట కాపాడుకొనగలిగెను. కాని తినుబండారములు నాశమొందుటచే కోట సాతవాహనునకు స్వాధీనమయ్యెను.

సమదర్శి ఆలోచనయొక్కటే. కోటచుట్టునున్న సైన్యములలో చాల భాగము తన్నెదిరించిన ఏ సైన్యమునెగ్గునో భగవంతునికెరుక. పుళిందులు, భోజులు, మగధ సైన్యములు, అవంతిదళములు సహాయము వచ్చుటచే మాళవ వాహిని ఉత్తుంగతరంగ పూర్ణసముద్రమువలె నున్నది. కోటలో వినీతమతికి భోజనాదికములు తగ్గిపోవుచున్నవి. సైనికులు వేనవేలు మడిసినారు. హీనబలులగుచున్నారు. ఆయుధసామగ్రి చాలవరకు నాశనమయినది. సర్వతో భద్రములు, జామదగ్న్యములు, బహుముఖములు, విశ్వశాఖతికములు, పర్జన్యకములు, ఊర్థ్వబాహువులు చెడిపోయినవి, చెడిపోవుచున్నవి. కాన వినీతమతి తప్పక నశించును.

ఇవన్నియు స్ఫుటాక్షరముల నాతని దృగ్వీధిని నడయాడుచున్నవి. తనకడ నొక నెలకు సరిపడిన పుష్కలాహారపదార్థములు కలవు. గోధుమలు, బియ్యము, పప్పు ధాన్యములు, బెల్లము, కోళ్ళు, కౌజులు, మేకలు, గొఱ్ఱెలు, లేళ్ళునున్నవి. ఇప్పుడు కర్తవ్యమేమి? ఏది యెట్లయినను తాను కోటలోనికి చొచ్చుకొనిపోవలె, తనక్రింది సేనాధికారులు, చమూపతులు, దండనాయకులు అందరితో సమాలోచన చేసినాడు. కొందరు చక్రవర్తియే మహా సైన్యముతో వచ్చి తాకెనని బెదరించెదమనియు, కొందరు మన మచ్చటనుండియు, కోటలోనుండి వినీతమతియు తాకినచో నిరు సైన్యములు విరోధిసైన్యముల నుగ్గాడవచ్చుననియు దెల్పిరి. కాని సమదర్శియొక్కటే నిశ్చయించుకొనెను, ఝంఝామారుతముచే సముద్రము మహా భయంకరముగా నున్నను నావికుని సామర్థ్యమున ప్రమాదముగా బోవు నౌకవలె, కఱ్ఱను చీలగొట్టి చొచ్చిపోవు పరశుముఖము వలె, సమదర్శి మాళవ సైన్యముల జీల్చి కోటద్వారముకడకు బోవుటకు నిశ్చయించెను. ఏ ద్వారము కడకు తాను రానున్నాడో ఆ ద్వారముకడ సిద్ధముగనుండి గోపురద్వారము చటుక్కున తెరచి కొన్ని సైన్యములు వెలుపలికివచ్చి చీకాకుగూర్పవలె ననియు, రాత్రి అమిత వేగమున తాను వచ్చెదననియు గోటలోనికి వార్తనంపెను.

రాత్రిపండ్రెండుగంటలగునప్పటికి కోటచుట్టుచున్న మాళవసైన్యములతో సమదర్శి తలపడెను. పేరుగాంచిన ఆంధ్రమల్లులు అయిదువేల సంఖ్యవారు పంక్తికి నాల్గువందల చొప్పున కలసి ముందునడచిరి. వారి ఎడమచేత దేహమంతయు గప్పు ఖడ్గమృగచర్మపు డాళ్ళుండును. కుడిచేత తొమ్మిదిఅడుగుల పొడవుగల వాడిశూలము లుండును. మొలను చిన్నకటారి యుండును. వీరందరు శూరులు, గజసత్త్వులు, చావవలెగాని వారు వెనుకకు తిరిగిరారు. వారిని ఆంధ్ర సైన్యాధిపతులు, చక్రవర్తులు ప్రాణాపాయములు వచ్చునప్పుడే గాని ప్రయోగింపరు. అట్టి ధీరులు ఆంధ్ర సైన్యముల ఏబదివేలున్నారు. భారతీయ సైన్యములు యుద్ధము చేయునప్పుడు గజముల గజములు, అశ్వముల అశ్వములు రథముల రథములుదాకింతురు. నేడు సమదర్శి మల్లులకీవలావల అశ్వదళములుంచెను. వీనివెనుక రథములు, అన్నిటికి వెనుక ఏనుగులనుంచి యుపాయముమై మోహరము పన్నెను.

ఆంధ్రవాహిను లిట్లమిత వేగమునవచ్చి తాకుటచే మాళవ సైన్యములు చీకాకు నందెను. అటు చటుక్కున దుర్గమహాగోపురద్వారము తెరువబడి వినీతమతి సైన్యములువచ్చి తాకుటచే మాళవులు చిక్కుపడిరి. ఈ కల్లోలములో సమదర్శి సైన్యములు జవమున మాళవ సైన్యములోనికి చొచ్చిపోవుచున్నది. ఆంధ్రమల్లులు తమ త్రోవ కడ్డమైనవారినెల్ల శూలముల కెరచేయుచు మరల నా శూలము లాగుకొనుచు ముందునకు సాగిపోవుచుండిరి. వారి కిరుదెసల అశ్వదళములు పార్శ్వరక్షణ మొనర్చుచుండెను. హిమ పాతమువలె వచ్చు నా సైన్యము బారిపడి రిపులు నడపొడ మాసిపోవుచుండిరి. సమదర్శి ప్రళయ కాలరుద్రుని వలె నుండెను. మహానది ప్రవహించుచున్నట్లు పోవుచుండెను. అతని సైనికులు సింహములవలె పోరాడిరి. మాళవదళములు ఆ రాత్రి యేమరుపాటునకు వెఱుగుపాటు తోడుగా గలగుండువడి, దిక్కు తెలియక, పంచ బంగాళమై విచ్చిపోయినవి. సమదర్శి సైన్యములకు దారి యిచ్చినవి. యుద్ధారంభమైన మూడుగంటలకు సమదర్శి సేనలు చెక్కు చెదరక భోజనాది వస్తు సామాగ్రితో దుర్గములోనికి చొచ్చిపోయెను. వినీతమతి సమదర్శిని కౌగలించు కొనియెను. కోటలో విజయనాదములు భేరీభాంకారములు మిన్ను ముట్టినవి. మాళవ సైన్యములు మొగములు వ్రేలవైచినవి.

మిడుతలదండువలెనున్న మాళవ సైన్యములు మరునాడు ధైర్యవిహీనములై యుద్ధము చేయనారంభించినవి. ఇంతలో సుశర్మ చక్రవర్తిపంపిన కొన్ని సైన్యములు వచ్చిచేరినవి. వానితో శివభూతివచ్చినాడు. అతడు మాళవాధి పతిని గలిసికొని యిట్లనియె: “మహారాజా! ఆంధ్రరాజు సైన్యములలో కొన్ని విడిపోవును. ఆతని కుమారుడు యువరా జీపాటికి నిర్వాణపథమునకు జేరి, బుద్ధుని గొలుచుచుండును. ఆ వార్త ఆంధ్రులకు తెలియజేయుటకు మేమే అంచెల నుంచినాము. ప్రతిష్టానము తక్షణము మన స్వాధీనము కాగలదు. మంజుశ్రీ యువరాజు కాగలడు. కాన మనకు భయములేదు. ఆంధ్రసైన్యము లింక కొన్ని నెలలవర కిచ్చటకు రాజాలవు. ఈలోన నీమూకలనుక్కడంచి మనము జాగ్రత్తపడి యెదము గాక. సార్వభౌముని సైన్యములు తేరుకొని వచ్చునప్పటికి కళింగమున సైన్యము లన్నియు తిరుగుబాటొనర్చును. విదేహరాజ్యము మనకు సహాయము నంపును. మన మహాసైన్యము లన్నియు కలసి ఆంధ్ర రాజ్యముపై దండెత్తి ఆ దేశమును ముక్కలు చేయవలయున. మంజుశ్రీ మనచేతిలోని కీలుబొమ్మ. ఫలవంతమగు ఆ రాజ్యమంతయు మన పాలిటిదగును కాన మనకేమి భయము” అని వచించెను.

మాళవుని మొగము విప్పారెను. ఆంధ్రసైన్యములకిక బాసటరాదనియు, కోటలోని సైన్యముల హతమార్చవచ్చుననియు, ధైర్యముగా నుండు డనియు, దొంగలవలె ఆంధ్ర సైన్యములు రాత్రి శిబిరములు చొచ్చినవి కాని, లేకున్నచో పేరులేకుండ మాసిపోయి యుండుననియు సైన్యమంతట చాటిరి. జయజయనాదములు సల్పిరి. మాళవ సైన్యములు మహా సంతోషమున తేలియాడెను.

కాని శివభూతి తన పటకుటీరమున నస్థిరుడై గూర్చుండి ఇంకను ప్రతిష్టానము నుండి వార్తలేమియు రాలేదేమని మనోవేదన ననుభవించుచుండెను. “ఏమో! ఏమైనదో! ఏమికానున్నదో?” యని యాతడు పది సారు లనుకొనియెను.

22. ఆశ్రమము

కతిపయ దినంబులకు ధాన్యకటకమున కృష్ణాతీరమందు మహా చైతన్యమునకు కొలదిదూరములోనున్న స్థౌలతిష్యాశ్రమమునకు మహేశా నందాది పండితులు చేరినారు. ఆ ఆశ్రమ భవనములన్నియు రాతివి. ఆ ఆశ్రమము చాల భాగ్యవంతమైనది. అన్నియు తోటలే. తోటల నడుమ ఆశ్రమగృహాలు, సమస్త ఫలపుష్పాదులు గల యా తోటలో ఒక భవనమున్నది. వృద్ధుడును, మహాయోగియు నగు స్థౌలతిష్యుల వారందు వసింతురు.

స్థౌలతిష్యులవా రాంధ్ర బ్రాహ్మణుడు. ఆపస్తంబసూత్రుడని పెద్దలందరు. తక్షశిలయందు, వారణాసియందు, నైమిశారణ్యమునందు పెక్కు సంవత్సరము లధ్యయన మొనర్చి, యందందు గురుత్వము సలిపి స్వగ్రామమగు కృష్ణాతీరస్థ రాజశైలమున వార్ధకము గడుపుచుండెను.