హిమబిందు/ప్రథమ భాగం/20. రహస్య సమావేశము

వికీసోర్స్ నుండి

సర్వసైన్యాధ్యక్షా! ఆ ప్రకారము సేనల నడుపుము. మేమును సిద్ధముగ నుండగలము. చారుగుప్తుడు మనతో వచ్చునది. కోశాధిపతికి మహామాత్యుడాజ్ఞల నంపునది. వలయునంతయు సిద్ధముచేయు యుద్ధ సంఘములకు ముదలనీయవలసినది. చైత్యాచార్యులు జయముగోరి బుద్ధ భగవానునకు పూజల సలుపునది. ప్రజాలోకము దైవారాధన చేయవలసినది. మరియు....

చారు: దేవా! తమకు అడ్డము చెప్పుచున్నాను. మన్నింపుడు. ఈ జైత్రయాత్ర కగు వెచ్చమంతయు చారుగుప్తుడు భరించగలవాడు.

20. రహస్య సమావేశము

బౌద్ధమతము విజృంభించియున్న కాలముననే వేదమతము పునరుద్ధరింప బ్రాహ్మణులు, ఋషులు, పండితపరిషత్తులు, ఆశ్రమములు ప్రయత్నము చేయుచునే యుండిరి. పండితులగు బౌద్ధ సన్యాసులకు కర్మకాండ మాత్రులగు బ్రాహ్మణులు బదులాడలేకపోయిరి. తిమిరమువలె గప్పిన ఈ పాడుమతమును నాశము చేసి, త్రయీభక్తిదేశమున నెలకొల్పుటెట్టులని వారాలోచనలు సలుపుచుండిరి. అనేక సభలు, సమావేశములు వారణాసి నైమిశారణ్యాది పవిత్రక్షేత్రముల జరుగుచుండెను, కొందరు భగవంతుడు మహాశక్తివంతుడు, ఆతడే సర్వము చక్కబరుచును అని వాదించిరి. కొందరు పురుషప్రయత్న ముండవలె ననిరి.

అశోకచక్రవర్తి నిర్యాణమందిన వెంటనే మౌర్య ప్రతిభ నానాటికి తగ్గిపోయెను. బౌద్ధ మతమును సామ్రాజ్యమతముగా నొనర్చి, యాత్రికుల, నాచార్యుల, భిక్కుల నంపి చీనా, తుర్కీస్థానము, పారసీకము, బ్రహ్మదేశము, సింహళములందా మతము నెలకొల్పి మహోన్నత దశకు తీసుకు వచ్చిన సార్వభౌముడు గతించుటనే అచ్చటచ్చట నణగియున్న వేదమతము పూర్వాచార సంప్రదాయములు తిరిగి విజృంభించెను. మౌర్యసంతతి రాజగు బృహద్రధుడు మగధ సింహాసన మధిష్టించియున్నప్పుడు పుష్యమిత్రుడను ఆతని సేనానాయకుడు రాజును చంపి తాను రాజై బ్రాహ్మణమతము పునరుద్ధరణ చేయ సంకల్పించెను. అప్పటినుండి సామ్రాజ్య సింహాసనమెక్కిన రాజులు వేదాచార పరాయణులగు వారే. పుష్య మిత్రునిసంతతిలో శుంగవంశములో తుదివాడగు సుమిత్రుని మిత్రదేవుడు వధించి రాజయ్యను. మిత్రదేవుని సంతతివారిని పదచ్యుతులజేసి మంత్రులగు కాణ్వవంశమువారు చక్రవర్తులైరి.

కాణ్వవంశమువారందరు వేదమతము పునరుద్ధరింప దీక్షవహించినవారు. అనేక పండితులీ రాజుల ప్రోద్బలమునను, పై మూడు వంశముల ప్రోత్సాహమునను వైదికధర్మనిష్టులై అత్యంత పురాతనములగు రామాయణ భారతాది గ్రంథములందు ఋషిప్రోక్తములవలె బౌద్ధమత ఖండనములను బ్రక్షేపించిరి. పురాతనములగు మనుధర్మాదిస్మృతుల దమ ఇష్టమువచ్చినట్లు మార్పు లొనర్పసాగిరి. రాజతంత్ర మందుకూడ నీ యావేశపరులు పాల్గొని వేదమత ముద్ధరింప సమకట్టిరి. గోదావరి నదికి పశ్చిమోత్తరముగా పదునేడు గోరుతముల దూరమునున్న మహావనశాల యను పట్టణమునందు క్రీస్తుశకము పూర్వము 74 వ సంవత్సరమునకు సరియైన బౌద్ధశకము 483 పరాభవ సంవత్సరమున ఫాల్గుణశుద్ధ ఏకాదశీదినంబున ఒక భవనమునందు పదమూడవ మూహూర్తమున పౌరసభాశాలవారు భేరి కొట్టకమునుపు పది పన్నెండుగురు పురుషులు సభ జేరియుండిరి. వారందరు క్రిందపరచిన రత్నకంబళులపై కూర్చుండి యుండిరి.

ప్రథముడు: కనుక వేంగీపురమునందున్న సంచరణుడు ఇప్పుడేమియు పని చేయుటకు వీలులేదని మీరంటారు. అవునుగదా, మహేశ్వరానందా?

మహే: ఏమిచేయగలడు? మన సంచరణుడు తానై ఏమియు ప్రయత్నించలేడు. ఇక్కడ చుట్టుప్రక్కలకు ప్రాణము, శక్తి, సమస్తము నయిన యాతడు ఈ స్థానబలము తప్పినంతనే రెక్కలులేని పక్షివలె నయినాడు. ఎంత బలమున్ననేమి? ఎంత సంపదయున్న నేమి? అంగ బలముండవలె గదా. చంద్రస్వామి ఉన్నంతవరకు బౌద్ధుల ఆజ్ఞల, నుప దేశముల తూ.చా తప్పక నిర్వర్తించుచు మన ప్రయత్న మత్యంతాభివృద్ధి చేసినాడు. చంద్రస్వామి కారాగృహమునకు బోగానే సంచరణుని పని అయినది.

ప్రథముడు: అయితే చంద్రస్వామి విచారణ సంగతి యేమయినది? ఎట్టి దండము విధించిరి?

మహే: మాకింకను ఆ వార్త రాలేదు. ఇప్పటికిని చక్రవర్తి దినోత్సవములు జరుగుచున్నవి. ఎద్దుబండి పరీక్షలైనవి. ఆయన విచారణ ఆపుచేయునేమోనని కోటలో ప్రతీతి. ఒకవేళ విచారణమవసరములేకయే శిక్షింతురేమోయని కోటలోనున్న మన వేగులవాడు విశాఖుడు చెప్పినాడు. ఏది యెట్లగునో?

ప్రథముడు: రాజధాని యందున్న బ్రాహ్మణు లూరకుందురా? విచారణ లేకుండ శిక్షించుట ధర్మదూరమని చెప్ప సాహసించు మతాభిమానులు లేరా?

మహే: ధాన్యకటకముగూర్చి సోనుత్తరుడు చెప్పవలసినదే.

అందరును మహాపండితుడును, ప్రతిజ్ఞానిర్వహగర్వియు నగు సోనుత్తరస్వామి వైపుచూచిరి. సోనుత్తరుడు సామవేదము పాడినట్లీవిధమున వాక్రుచ్చెను. ధాన్యకటకము నందున్న బ్రాహ్మణులందరును రాజాభిమానులు. బ్రాహ్మణ నామధేయము కలిగిన పాషండులు, చార్వాకులు పైశాచస్వరూపులు. ఒక్కడైనా మహాపండితుడనైన నన్ను గౌరవము చేయరు. లేచి నమస్కారమునైన చేయరు సరిగదా నా మొగమైన చూడరు. నాకు కోపమువచ్చి “రండి. నాతో వాదమున” కని పిలిచితిని. ఆ శుంఠలు ప్రతి చెప్పరైరి. అయినప్పటికి చంద్రస్వామిని విచారణ చేయకుండ దండించుటకు చక్రవర్తికి గుండెలేదయ్యా ధర్మాతిక్రమణం చేయుటకు. అన్నిమతములయందును గౌరవము చూపుదునని ప్రతి సంవత్సరము మహాపరిషత్సభకు చెప్పుచుండునుగదా! ఆ మాట కిపుడు తప్పినచో నేనూర కొందునా? మీకు తెలియదా?”

ప్రథముడు: ఒకవేళ చంద్రస్వామిని విడుదల చేయకపోయినట్లయిన సంచరణునకు సహాయముగా మనలో దిట్టమైనవాని నొకని ఆ చుట్టు ప్రక్కల నెక్కడనో యుంచవలయును.

మహే: ఆ సంగతి మొదటినుండియు మహాభాగులు మనతో చెప్పనే చెప్పినారు. వారి ఉద్దేశ్యము కూడా చెడుగు చేయవలెనని కాదు. మనము చేయుకార్యము ఉత్కృష్టమైనది. పుణ్యదాయకము, మోక్షదాయకము. ఆదిమీనము వేదముల నుద్ధరించుట వంటిది. వేదోద్ధరణచేయుట సర్వేశ్వరునకు మహాప్రీతికరము. దానిని, సాధించుటయే మన లక్ష్యము. తక్కిన పాపపుణ్యములతో మనకు బనిలేదు. ఒకడు: అవునుస్వామీ! ఇట్టి మహాపవిత్రకార్యము చేయుటలో కొన్ని కష్ట కార్యములు చేయవలసి వచ్చినను వెనుదీయకూడదు. మనము దురుద్దేశముతో చేయుట లేదుగదా?

చండికుడు: ఇన్ని సంవత్సరములు వేదపారాయణముచేసి, శాస్త్రములు పఠించి, ప్రతిజ్ఞగైకొని యీనాడు నేను వెనుదీయుదునా? చంద్రస్వామిలేని కొరతలేదు. మనము ముఖ్యకార్యము నడుపవలసినదే.

మిగిలినవారందరును “నిజము నిజ” మని చెప్పిరి. అందరును ఆవేశపూర్ణులై యున్నారనియు, తన కార్యమునకు తోడ్పడెదరనియు, నా సభ నడుపు ప్రధానపురుషునకు దోచినంతట నా విషయమునుగూర్చిన సంభాషణమాని “మన మిక్కడనుండి వివిధములగు మార్గముల ధాన్యకటకము చేరవలయును. మహాయోగి, పుణ్యపురుషుడు, స్థాలతిష్యులవారు వారి పని కొనసాగు శుభముహూర్త మేగుదెంచినదనియు, దానిని గమనించుటకు మనమందరము రావలెననియు ముదల పంపినారు. మీరుదప్పనింక నెవ్వరిని తీసికొని రావలదు. రేపు త్రయోదశినాడు శుభముహూర్తము” అని యతడు పల్కెను.

21. పరిత్రాణము

సమదర్శి పోటుమానిసి. చురుకుపాలెక్కువ. వెనుకముందుచూడని సాహసి. తనకిచ్చిన ఆ అక్షౌహిణీసైన్యముగొని పిట్టను వెన్నాడు డేగవలె దుర్గమారణ్యములబడి రివ్వున పోజొచ్చెను. దిగంబరులు, క్రూర సత్వులగు రాక్షసులను ఆరణ్యక జాతివారు (ఇప్పటికిని బస్తరు సంస్థానపు దుర్గమారణ్యములలో నున్నారు. వారిని మేము చూడ గలిగితిమి) ఆ అడవులలో నుండిరి. ఆ మూకల స్నేహముచేసికొని వారికెన్నియో విచిత్ర వస్తువుల కాన్కలిడుచు, వారి మన్ననల గ్రహించుచు, తనజాడ పుళిందులకు తెలియకుండునట్లు కష్టతమములగు మార్గములనే రాక్షసులు చూప నడచిపోవుచు, సమదర్శి రెండు వారములలో మాళవరాజ్యపు సరిహద్దుల చేరునప్పటికి ఒక్క పుళిందుల మూక ఆతని నడ్డగించెను. కాని అర్జునగాండీవవినుర్ముక్త మహాశరమువలె పోవునాతనికి చిన్న సైన్యమొక లెక్కయా! ఆ మూకను చీల్చి చెండాడి ఉజ్జయినికి నాల్గు గోరుతముల దూరమువరకు నాక్రమించియున్న మాళవసైన్యములపై మబ్బులేని పిడుగులవలె దూకెను. కోటలోనున్న వినీతమతికి సమదర్శి సైన్యముల నడుపుకొని వచ్చినాడని వేగు తెలిసినది.

ఉజ్జయినీకోట చాల ముఖ్యమైనది. అది దేవనిర్మితమని ప్రతీతి. శ్రీముఖ శాతవాహనుని తండ్రి, సమదర్శి తండ్రి ప్రియదర్శి సేనాపతిగా ఉజ్జయినీపట్టణమును మహాసంగర మొనర్చి స్వాధీన మొనర్చుకొనెను. అప్పుడు మాళవాధిపతి నీరసముగ నున్నను చాలకాలము అద్భుతముగా కోట కాపాడుకొనగలిగెను. కాని తినుబండారములు నాశమొందుటచే కోట సాతవాహనునకు స్వాధీనమయ్యెను.

సమదర్శి ఆలోచనయొక్కటే. కోటచుట్టునున్న సైన్యములలో చాల భాగము తన్నెదిరించిన ఏ సైన్యమునెగ్గునో భగవంతునికెరుక. పుళిందులు, భోజులు, మగధ సైన్యములు, అవంతిదళములు సహాయము వచ్చుటచే మాళవ వాహిని ఉత్తుంగతరంగ పూర్ణసముద్రమువలె నున్నది. కోటలో వినీతమతికి భోజనాదికములు తగ్గిపోవుచున్నవి. సైనికులు వేనవేలు మడిసినారు. హీనబలులగుచున్నారు. ఆయుధసామగ్రి చాలవరకు నాశనమయినది. సర్వతో భద్రములు, జామదగ్న్యములు, బహుముఖములు,