హిమబిందు/ప్రథమ భాగం/19. రహస్యాలోచన

వికీసోర్స్ నుండి

చారు : ఉండుతల్లీ! నే నాతనికి సమాధానము చెప్పెదను. అవునయ్యా, నాకు వానియందు మక్కువపోయినది. ఓడిపోయినవని కోపమనుకొందువేమో, అది కాదు. నాకు కొత్త జతలపై మక్కువ. మహాకాండూర నగరమున ఈమధ్య మావాడు ఇంద్రగోపుడు అత్యద్భుతమగు జతను కొనినాడట. కతిపయ దినములలో నవి యిచ్చటకు వచ్చును. ఆర్యావర్తమునగాని, దక్షిణాపథమందు గాని అట్టి పసరము లుండబోవని స్పష్టముగ నాకు తెలియవచ్చినది.

సమ: అయినచో వానిని తప్పక చూడవలెను.

చారు: మాళవముపై కేగు సైన్యమున నీకు ఉపసేనాధ్యక్షత నిచ్చినారు. చక్రవర్తి ఆజ్ఞాపత్రము నీ కందినదా?

సమదర్శి చటుక్కున గంతువేసి లేచి “ఏమిటి మామయ్యా! నిజముగా! నీ కెప్పుడు తెలిసినది?” అని ప్రశ్నించెను.

చారు: ఇప్పుడే. కేరళపక్షులువచ్చి నా చెవిలో చెప్పినవి.

హిమ: (నవ్వుచు) వెఱ్ఱిబావా! బాబయ్యగారు చేసిన పనికి వారితో ఒకరు చెప్పవలెనా?

సమ: మామయ్యా! నీ యనుగ్రహానికి వేయివేల నమస్కారములు. ప్రయాణ మెప్పుడు? ఎన్ని సైన్యములు? అహో! నా కత్యంత సంతోషముగ నున్నది. నా కా శాసన మెప్పుడు చేరును? అయినచో నే నింటికిబోయి ప్రయాణసన్నాహమున నుండెద.

అనుచు నాతడు చారుగుప్తునకు నమస్కరించి, సంతోషస్నేహముల వెనుకనుండి తొంగిచూచు దైన్యముతో హిమబిందు ముఖముదెస గాంచి ఆ బాలికచే ననుజ్ఞాతుడై వెడలిపోయెను. చారుగుప్తు డాతడు పోయినదిక్కున బొమముడితోడి యనాదర దృష్టుల బరపి, పుత్రికవంక జూచి, “అమ్మాయీ! నీ వీతనితో చనువుగా నుండుట తగ్గించివేయుము. శస్త్రజీవనుడు” అని తెలిపెను. “లేదు, బాబయ్యగారూ! చిన్నతనపు స్నేహమున చనవు” అని హిమబిందు నవ్వుచు పలికెను.

19. రహస్యాలోచన

శ్రీముఖసాతవాహనచక్రవర్తి, మహామాత్యుడు అచీర్ణునితో, సర్వ సేనాధ్యక్షుడు స్వైత్రునితో రహస్యాలోచనమందిరమున మంతన ముండెను. శ్రీముఖుడు పొడుగరి. ఆరడుగుల రెండంగుళముల మనిషి. జబ్బపుష్టిగలవాడు. సింగముతో ఆయుధము లేకయే పోరాడునంతటి పోటుమానిసి, పచ్చని దబ్బపండువంటి ఛాయకలవాడు. జుట్టు పొడుగుగ ఉంగరములు చుట్టుకొని వీపుమీదను, భుజములమీదను పడుచుండును. ఒక్కక్కసారి వలిపెములతో ముడులుగా రచియించుకొని, శిరోభూషణములచే అలంకరింపించు కొనును. కన్నులు మధ్యమ ప్రమాణములు కలవి. నాగమణులవలె తళతళలాడుచు, తీక్షణకాంతులచే నెదుటివాని హృదయము చొచ్చిపోగలవు. నాసిక గరుత్మంతుని ముక్కువలె పొడుగై మాటలాడునపుడు వట్రువలు తిరుగు సుందరమగు పెదవులను తొంగితొంగి చూచుచు ఆ వదనమునకు అందమిచ్చును. మీసమును, బవిరిగడ్డమును, విశాలఫాలమును అతని ముఖమునకు వన్నె తెచ్చినవి.

ఆలోచన మెండయినప్పుడు శ్రీముఖుడు అస్థిరుడగును. మొలనున్న కరవాళికా సువర్ణ మేఖలలపై చేతులువేయును. ప్రక్కనున్న విశిత కౌక్షేయకోశముపై దృష్టిసారించును. కిరీటరత్నకాంతులు దశదశల పర్వ దలయాడించును. అతని మొల కొక దుకూలమున్నది. మెడను హారములున్నవి. హస్తమున కంకణములు, బాహువుల గేయూరములు కలవు. అతడు మాటలాడునపుడు మణికుండలము లూగియాడి, భుజములు, మీసములు, గడ్డము కాంతులతో నిండిపోవును. తలత్రిప్పుచు ప్రభువు అందరి మోములను చురచుర చూచును.

శ్రీముఖుడు: నా ఉద్దేశ్యము మనము ప్రథమమున పుళిందుల పైకిపోయి వారికిబుద్ధిచెప్పి, యటువెనుక మాళవముపై దండువిడసిన మంచిదియని. లేనిచో మాళవముపైకి పోవు మనవెనుక నీ పుళిందులు క్రమ్మి అడుగు సాగనీయరు. ప్రప్రథమమున పుళిందులకు బుద్ధిచెప్పితిమా మాళవము సులభసాధ్యమగును.

అచీర్ణుడు: దేవర యాలోచన లెస్సగ నున్నది. రేపటి దినమున సైన్యసంఘములకు, జైత్రయాత్రాసంఘములకు శాసనములు పంపెదను.

సర్వ సైన్యములు నాయత్తమైన వెంటనే శుభముహూర్తము చూచి రణభేరి మ్రోగించెదముగాక!

స్వైత్రుడు: మహారాజా! వినీతమతికి బాసటగా సమదర్శినడుపున ఉజ్జయినికి కొన్ని సైన్యములు పంపుట లగ్గుగదా! త్వరలో సహాయము కావలెనని క్రమేలక వార్తాహరుడు తెచ్చినవార్త. లేనిచో దుర్గము బలహీనమై సమస్తసైన్యముతో నాతడు ఆహుతి కావలసిన ముహూర్తమరు దెంచునేమో? ఆతడు పంపినవార్త దేవరకు విశదము. ఆజ్ఞ!

శ్రీముఖుడు: సమదర్శి స్వతంత్రముగా సైన్యములు నడపగలుగు పాటివాడా? వీరుడు కావచ్చునుగాని తానై సైన్యమును నడపగలవాడా యని.

స్వైత్రుడు: అందునకు నేను పూట. మహామాత్యుల ఉద్దేశ్యము దేవర కనుగొనవచ్చును.

అచీర్ణుడు: సర్వ సేనాధ్యక్షులమాట బాగున్నది. ఉపసైన్యాధ్యక్షు లార్వురిలోను వినీతమతి మాళవమున, కాకుండుకులు ఈ నగరమున, అక్షఘ్నుడు కళింగమున, అఘబలుడు ప్రతిష్ఠానమున, చిత్రకుడు దక్షిణా పథమున, జఘన్వుడు సిద్ధపురమున నుండవలసినవారు. మనకు సమదర్శియో మరొకరో క్రొత్త ఉపసైన్యాధ్యక్షుడు కావలయును. ఆ విషయమును స్వైత్రులవారే చెప్పవలయును. నా వినికిడి సమదర్శియే సేనాపతు లందరిలోను తగినవా డని.

స్వైత్రుడు: రాష్ట్రికులతో యుద్ధమున సమదర్శి ఉపసైన్యాధ్యక్షునికంటే అద్భుతములొనరించినాడు. కాన అతడే దీనికి తగును.

శ్రీముఖుడు: మంచిది. అతని నెప్పుడు పంపెదరు?

ఇంతలో ద్వారముకడనుండి పారిపార్శ్వకుడు “జయము! జయము! మహారాజాధి రాజులకు” అని వక్కాణించెను. అచీర్ణుడు “లోపలికి రా” యనుటయు, నాతడు వచ్చి యందరకు సాష్టాంగనమస్కృతులొనర్చి “జయము! జయము! దేవర యాజ్ఞానుసారము వణిక్సంఘాధ్యక్షులు చారుగుప్తులవా రేగుదెంచినారు” అని మనవి చేసెను. సార్వభౌముడు తలనూపెను. అచీర్ణుడది చూచి “తోడ్కొనిరా” యని యాజ్ఞయిచ్చెను. చారుగుప్తుడు లోనికివచ్చి యందరకు నమస్కారములు చేసి, మహారాజునకు మోకరించి నమస్కార మాచరించెను. అందరును లేచిరి, శ్రీముఖుడు చారుగుప్తుని హస్తముల బట్టి లేవనెత్తి పార్శ్వమున నున్న పీఠముపై నధివ సింపజేసెను.

శ్రీముఖుడు: వర్తకసార్వభౌమా! మాళవాధిపతి యేమి చేసెనో యెరుగుదువుగదా! ఇదివరకు మనచే విజితుడై కప్పము గట్టుచుండెను. తిరుగుబాటు చేయుచున్నాడని వినినంతనే వినీతమతిని పంపితిమి. ఆతనికి లొంగిపోయెనని వార్తాహరులు వచ్చియుండిరి. ఇంతలో ఏమరుపాటున పుళిందులచే తిరుగుబాటు చేయించి, భోజుల సహాయముగా గొనివచ్చి ఉజ్జయినిలోనున్న వినీతమతిని ముట్టడించెను. ఆతడు ధైర్యముతో కోట కాపాడుచున్నాననియు, త్వరలో సైన్యముతో సహాయము రానిచో తాను తన చమువులతో నశించిపోవలయుననియు వార్తాహరుల నంపుచున్నాడు. వినీతమతిని మాళవుడు ఓడించునట. పుళిందులు ప్రతిష్ఠాన నగరముపై దండు విడియనున్నారు. నీకు పుళిందులతోను, మాళవముతోను మహత్తరమగు వర్తకవ్యాపారమున్నది. నీ యాలోచన మా కత్యంతము ముఖ్యమైనది.

చారు: జయము దేవా! ఈ విషయమంతయు నేను శ్రద్ధగా నాలోచించితిని. కొన్ని సైన్యములను ముందు ప్రతిష్టానమునకు సహాయము పంపవలయును. మనము సర్వసైన్యములతో తరిమి నడచి మగధ పైకెత్తిపోయి అచట కాణ్వులకు, అగ్ని మిత్రుని సంతతివారికి బుద్ధిగరపి, వెనుక మాళవాధిపతిని నిర్జించి, ఆ వెనుక పుళిందుల నడంచి, భోజులపని పట్టించి వారి రాజ్యము మనము స్వాధీనము చేసికొనవలయును.

అచీర్ణుడు: అట్లయినచో పుళిందులు వెనుకనుండి మనయాత్ర సాగనీయరు గదా!

స్వైత్రుడు: చుట్టును శత్రువులు క్రమ్ముకొనియుండ మనము విరోధులపై బోవుట అపాయకరము. ఈలోపల మాళవమున వినీతమతి సంకట మధికమగును.

శ్రీముఖుడు: పుళిందు లెప్పుడును ప్రబలశత్రువులు.

చారు: మీరు తెలుపు కారణములు భయహేతువులుకావు. పుళిందులడవులు, కొండలు విడిచి సమప్రదేశములలోనికి వచ్చి శిక్షితులైన సైనికుల నెదిరింపలేరు. వారిని నడుపుటకు శిక్షితులగు సేనానాయకులు లేరు కావున వారివలన భయములేదు. మనము మగధమునకు కళింగము దారి ప్రయాణము సాగించెదము. విరోధులకు మన పోకడ తెలియవచ్చు మునుపే మగధ యందుండగలవారము. పుళిందుల నణుచుటకు ఆ అడవులలో మనకు చాలకాలము పట్టును. ఈలోన వినీతమతి దగ్ధమైపోవును. అటువెనుక ఏనుగులదండు అడవిబడినటుల, దావానలము కాంతారము చొచ్చునటుల వింధ్యాటవుల బడి పుళిందుల నుక్కడిగింపవచ్చును. పై భాగము లోబరచుకొని మనము అటునుండిరా, యువరాజు ఇటునుండి రా, మధ్య పుళిందులు చిక్కుకొనగలరు. భోజులుపూర్తిగ మాళవులకు బాసట కాకమునుపే మనము ఉజ్జయిని నుండవలయు. దీనివలన మనకు చెప్పరాని లాభ మింకొకటి యున్నది.

అచీర్ణుడు: ఏమది?

చారు: (సార్వభౌముని దిక్కు మొగంబై మధ్యమధ్య మంత్రిని, సేనానాయకుని జూచుచు) ఇది భరుకచ్చము. పశ్చిమ సముద్రపు రేవు పట్టణములలో ముఖ్యమైనది. దానిలాభము భోజులు పూర్తిగా అనుభవించుచున్నారు. ఇప్పుడు భోజరాజ్యము స్వాధీనము చేసికొని ఒక ప్రతినిధిని భరుకచ్చమున నుంచినచో, పాశ్చాత్యదీవులలో వర్తకము మచిలీపట్టణము నుండియు, మోటుపల్లినుండియు జరుగుటచే మనకు అమితనష్టము కలుగుచున్నది. కావున భరుకచ్ఛము ఆంధ్రచక్రవర్తుల స్వాధీనమందుండ వలయు.

శ్రీముఖుడు: బాగు! నీవు వర్తక చక్రవర్తి వనిపించుకొంటివి. నీవు చెప్పినదంతయు నాకు నవగతమైనది. మహామాత్యా! ఈవణిక్ శ్రేష్టుని యాలోచన లెస్సగానున్నది. సర్వసైన్యాధ్యక్షా! ఆ ప్రకారము సేనల నడుపుము. మేమును సిద్ధముగ నుండగలము. చారుగుప్తుడు మనతో వచ్చునది. కోశాధిపతికి మహామాత్యుడాజ్ఞల నంపునది. వలయునంతయు సిద్ధముచేయు యుద్ధ సంఘములకు ముదలనీయవలసినది. చైత్యాచార్యులు జయముగోరి బుద్ధ భగవానునకు పూజల సలుపునది. ప్రజాలోకము దైవారాధన చేయవలసినది. మరియు....

చారు: దేవా! తమకు అడ్డము చెప్పుచున్నాను. మన్నింపుడు. ఈ జైత్రయాత్ర కగు వెచ్చమంతయు చారుగుప్తుడు భరించగలవాడు.

20. రహస్య సమావేశము

బౌద్ధమతము విజృంభించియున్న కాలముననే వేదమతము పునరుద్ధరింప బ్రాహ్మణులు, ఋషులు, పండితపరిషత్తులు, ఆశ్రమములు ప్రయత్నము చేయుచునే యుండిరి. పండితులగు బౌద్ధ సన్యాసులకు కర్మకాండ మాత్రులగు బ్రాహ్మణులు బదులాడలేకపోయిరి. తిమిరమువలె గప్పిన ఈ పాడుమతమును నాశము చేసి, త్రయీభక్తిదేశమున నెలకొల్పుటెట్టులని వారాలోచనలు సలుపుచుండిరి. అనేక సభలు, సమావేశములు వారణాసి నైమిశారణ్యాది పవిత్రక్షేత్రముల జరుగుచుండెను, కొందరు భగవంతుడు మహాశక్తివంతుడు, ఆతడే సర్వము చక్కబరుచును అని వాదించిరి. కొందరు పురుషప్రయత్న ముండవలె ననిరి.

అశోకచక్రవర్తి నిర్యాణమందిన వెంటనే మౌర్య ప్రతిభ నానాటికి తగ్గిపోయెను. బౌద్ధ మతమును సామ్రాజ్యమతముగా నొనర్చి, యాత్రికుల, నాచార్యుల, భిక్కుల నంపి చీనా, తుర్కీస్థానము, పారసీకము, బ్రహ్మదేశము, సింహళములందా మతము నెలకొల్పి మహోన్నత దశకు తీసుకు వచ్చిన సార్వభౌముడు గతించుటనే అచ్చటచ్చట నణగియున్న వేదమతము పూర్వాచార సంప్రదాయములు తిరిగి విజృంభించెను. మౌర్యసంతతి రాజగు బృహద్రధుడు మగధ సింహాసన మధిష్టించియున్నప్పుడు పుష్యమిత్రుడను ఆతని సేనానాయకుడు రాజును చంపి తాను రాజై బ్రాహ్మణమతము పునరుద్ధరణ చేయ సంకల్పించెను. అప్పటినుండి సామ్రాజ్య సింహాసనమెక్కిన రాజులు వేదాచార పరాయణులగు వారే. పుష్య మిత్రునిసంతతిలో శుంగవంశములో తుదివాడగు సుమిత్రుని మిత్రదేవుడు వధించి రాజయ్యను. మిత్రదేవుని సంతతివారిని పదచ్యుతులజేసి మంత్రులగు కాణ్వవంశమువారు చక్రవర్తులైరి.

కాణ్వవంశమువారందరు వేదమతము పునరుద్ధరింప దీక్షవహించినవారు. అనేక పండితులీ రాజుల ప్రోద్బలమునను, పై మూడు వంశముల ప్రోత్సాహమునను వైదికధర్మనిష్టులై అత్యంత పురాతనములగు రామాయణ భారతాది గ్రంథములందు ఋషిప్రోక్తములవలె బౌద్ధమత ఖండనములను బ్రక్షేపించిరి. పురాతనములగు మనుధర్మాదిస్మృతుల దమ ఇష్టమువచ్చినట్లు మార్పు లొనర్పసాగిరి. రాజతంత్ర మందుకూడ నీ యావేశపరులు పాల్గొని వేదమత ముద్ధరింప సమకట్టిరి. గోదావరి నదికి పశ్చిమోత్తరముగా పదునేడు గోరుతముల దూరమునున్న మహావనశాల యను పట్టణమునందు క్రీస్తుశకము పూర్వము 74 వ సంవత్సరమునకు సరియైన బౌద్ధశకము 483 పరాభవ సంవత్సరమున ఫాల్గుణశుద్ధ ఏకాదశీదినంబున ఒక భవనమునందు