సాక్షి మూడవ సంపుటం/మా మాట

వికీసోర్స్ నుండి

మా మాట

మంచి రచనలు అందించాలనీ,

మంచి అభిరుచి పెంపొందించాలనీ,

పాఠకులు కలకాలం తమ సొంత గ్రంథాలయంలో మంచి పుస్తకాలు పెట్టుకొని పదే పదే వాటిని చదువుకోవడానికి దోహదం చెయ్యాలనీ - మా చిరకాల వాంచితం.

ఈ ప్రయత్నంలో మా సోదర సంస్థ ' న్యూ స్టూడెంట్స్ బుక్ సెంటర్ ' యిప్పటివరకు చాలా విజ్ఞాన దాయకమైన పుస్తకాలను, ఉత్తమ సాహిత్య గ్రంథాలను ప్రచురించి, చేతనైనంత కృషి చేస్తూందని మీకు తెలుసు.

ఇప్పుడు మా నూతన సంస్థ ' అభినందన పబ్లిషర్స్ ' ఒక సాహసం చేస్తోంది. అయితే, ఈ సాహసం ఆనందకరమైనది. ఒకరకంగా గర్వకారణమైనది. అదే, ' కవిశేఖర ' పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన ' సాక్షి ' వ్యాసాలను ప్రచురించి - అభిమాన పాఠకులకు అందించడం.

కొందరు - కథలు వ్రాసి, గొప్ప కథకు లనిపించుకున్న వారున్నారు. కొందరు నవలను వ్రాసి గుర్తింపు, గౌరవం పొందిన వారున్నారు. అలాగే కవులనిపించుకుని రాణకెక్కిన వారున్నారు. కాని - ' వ్యాసం ' అనే ప్రక్రియకు అపూర్వమైన సాహిత్యగౌరవం తెచ్చిపెట్టి - పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న మహా రచయిత బహుశా పానుగంటి వారొక్కరే. నాటకం వ్రాసి గురజాడవారు గిరీశం పాత్రను చిరంజీవినిచేస్తే, పానుగంటివారు వ్యాసాలను ఉపన్యాసాలుగా, ఉపన్యాసాలను వ్యాసాలుగా జలకాలాడించి - జంఘాలశాస్త్రి పాత్రను చిరంజీవిని చేశారు. ఈ వ్యాసాలలో పానుగంటి వారి శైలి, విషయ విన్యాసం చూస్తుంటే, చురకత్తి కొసను మల్లెదండ వ్రేలాడ దీసి నట్టుంటుంది. 1913లో కొంతకాలం, 1920లో కొంతకాలం ' సాక్షి ' వ్యాసాలను ఆయన రచించారు. ఎందరో అసంఖ్యాక పాఠకుల్ని ఆకర్షించారు. అలరించారు. పానుగంటే సాక్షి, సాక్షే పానుగంటి అనిపించారు.

తొలుత ఈ వ్యాసాలను పిఠాపురం రాజావారు ముద్రించి ప్రచారం చేశారు. ఆ తరువాత మద్రాసులోని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్‌వారు ఆరు సంపుటాలుగా ప్రచురించారు. ఈ విషయాలు జరిగి దాదాపు నలబై సంవత్సరాలు గడిచాయి. (వావిళ్లవారికి సంబంధించినంతవరకు)

ప్రస్తుతం ఆ ఆరు సంపుటాలు ' సాక్షి ' వ్యాసాలను - అక్షరం పొల్లుపోకుండా మొత్తం - మూడు సంపుటాలుగా పాఠకులకు అందించగలిగే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తున్నాం.

1920 లెక్కవేసుకున్నా, ఈ వ్యాసాల రచన జరిగి ఇప్పటికి 70 ఏళ్లు కావస్తోంది. వీటి భాష గ్రాంథికం. విషయాలు ఎంత ఆసక్తి కరమైనవైనా, ఎంత హాస్యరస ప్రధానంగా వున్నా, ఈ నాటి పాఠకులకు ఈ ' సాక్షి ' ని చేరువ చెయ్యాలంటే, వ్యావహారిక భాషలో, ప్రతి వ్యాసం సారాంశం ముందు ' టూకీ ' గా అందిస్తే బాగుంటుందని తోచింది. ఈ మా లక్ష్యం చెప్పగానే సహకరించి, వ్యాసాలన్నిటికి 'క్లుప్త కథనాన్ని' వ్రాసి యిచ్చిన మిత్రులు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు. మా ప్రచురణ సంకల్పం తెలిపిన వెంటనే ఆనందంతో ఆశీర్వదించి పీఠిక వ్రాసి యిచ్చినవారు మహాకవి, కళా ప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు, ఇటువంటి ఆదరాభిమానాలతోనే ఈ సంపుటాలకు ముఖపత్ర రచన చేసినవారు ప్రముఖ చిత్రకారులు శ్రీబాపుగారు. ఈ సంపుటాలు అందంగా - అచ్చుతప్పులు లేకుండా - పాఠకులకు అందించాలని ఆశించి, శ్రమించి సహకరించిన వారు పండిత మిత్రులు పి.జగన్నాధరావుగారు. వీరికి మా 'హార్ద' కృతజ్ఞతులు.

ఇన్నాళ్లకు మళ్లీ 'సాక్షి' వ్యాసాలను వెలువరించమంటే, చాలా అందంగా చెయ్యాలని ఆత్యాధునిక ముద్రణ పద్ధతిని అనుసరించాం. ఇది బరువైనదైనా 'పరువైనదని' సాహసించాం. ఈ సంపుటాలను మీ చేతిలో సవినయంగా సగౌరవంగా ఉంచుతున్నాం. ప్రోత్సహించి, ఆశీర్వదించమని విన్నవించుకొంటున్నాం.

"సాక్షి మూడు సంపుటాల వ్యాసాల సాక్షిగా"

"తెలుగు సాహిత్యానికి సాక్షి నామసంవత్సరం"

డైరెక్టర్ ఆఫ్ పబ్లిషింగ్

అభినందన పబ్లిషర్స్

బి.బాబ్జి

డైరెక్టర్