సత్యశోధన/రెండవభాగం/28. పూనాలో

వికీసోర్స్ నుండి

28. పూనాలో

సర్ ఫిరోజ్‌షా మెహతా గారు నా పనిని సులభం చేశారు. బొంబాయి నుండి నేను పూనా వెళ్లాను. పూనాలో రెండు పక్షాలున్నాయని నాకు తెలుసు. నాకు అన్ని పక్షాలవారి సాయం అవసరం. లోకమాన్యుని దర్శించాను. “అన్ని పక్షాల సాయం కావాలని నీవు భావించడం మంచిది. ఈ విషయంలో ఎవ్వరికీ అభిప్రాయ భేదం వుండదు. కాని యిందుకు సభాపతిగా తటస్థుడు కావాలి. మీరు ప్రొఫెసర్ భండార్కరు గారిని దర్శించండి. వారు యిప్పుడు సభలకు రావడం మానుకున్నారు. ఏ సభలకూ రావడం లేదు. కాని మీ సభకు అంగీకరిస్తారని భావిస్తున్నాను. వారిని కలిసాక పర్యవసానం ఏమైందో నాకు తెలుపండి. నేను సంపూర్తిగా మీకు సాయం చేయాలని కోరుతున్నాను. మీరు ప్రొఫెసరు గోఖలేగారి దర్శనం చేయండి. నన్ను చూడటం అవసరం అయితే మీకు వీలు అయినప్పుడల్లా తప్పక వచ్చి నన్ను కలవండి” అని లోకమాన్యుడు అన్నారు. లోకమాన్యుని చూడటం నాకు అదే ప్రథమం. వారు యింత లోకప్రియులెట్లా అయినారో అప్పుడు నాకు తెలిసింది.

అక్కడ నుండి నేను గోఖలేగారి దగ్గరకి వెళ్లాను. వారు పెర్గుజన్ కాలేజీలో పున్నారు. నన్ను అమిత ఆప్యాయంగా చూచారు. ఆత్మీయుణ్ణి చేసుకున్నారు. వారితో పరిచయం కూడా ప్రథమ పర్యాయమే. నాకు ప్రధమ పర్యాయమే పరిచయం ఆయినా అది ప్రథమ పరిచయం అనిపించలేదు. ఎప్పటినుండో పరిచయం ఉన్నట్లు అనిపించింది. సర్‌ఫిరోజ్‌షా మెహతాగారు హిమాలయం, లోకమాన్యుడు సముద్రం, గోఖలే గంగ. ఇందు స్నానం చేయడం సులభం. హిమాలయంపై ఎక్కడం కష్టం. సముద్రంలో దిగాలంటే భయం కాని గంగ ఒడిలో ఆడుకోవచ్చు. దానిలో నావమీద పయనించవచ్చు. బడిలో చేర్చుకునేప్పుడు పిల్లవాణ్ణి పరీక్షించినట్లు గోఖలేగారు నన్ను పట్టి పట్టి పరీక్షించారు. ఎవరెవరి దర్శనం చేయాలో, ఎట్లా చేయాలో వివరంగా చెప్పారు. నా ఉపన్యాసం ఒకసారి చూస్తానని అన్నారు. కాలేజీ అంతా చూపించారు. “మీరు యిష్టం వచ్చినప్పుడు వచ్చి నన్ను కలవండి. ప్రొఫెసరు భండార్కరు గారిని కలసిన తరువాత ఏమైందో నాకు చెప్పండి అని సెలవిచ్చారు. గోఖలేగారు జీవించియున్నంత కాలం రాజనీతి విషయాల్లో నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించారు. కన్నుమూసిన తరువాత కూడా వారు ఆ విధంగా నా హృదయాన్ని ఆక్రమించేవున్నారు. మరెవ్వరూ ఇంతగా నా హృదయాన్ని ఆక్రమించలేదు. కుమారుణ్ణి తండ్రి ఏవిధంగా ఆదరిస్తాడో ఆవిధంగా ప్రొఫెసర్ భండార్కరు గారు నన్ను ఆదరించారు. రెండు జాములప్పుడు నేను వెళ్లి వారిని కలిశాను. శాస్త్రాలలో పరిశ్రమ చేసిన ఆ పండితునికి నేను ఆ సమయంలో కూడా పని చేయడం ఆనందం కలిగించింది. తటస్థుడైన సభాధ్యక్షుడు కావలయునను నా పట్టుదలను విని అది మంచిది మంచిది అను మాటలు వారి నోట సహజంగా వెలువడ్డాయి.

నా మాటలు పూర్తి అయ్యాక వారు యిట్లా అన్నారు. “నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టడం లేదని ఎవర్ని అడిగినా చెబుతారు. కాని మిమ్మల్ని విముఖుణ్ణి చేయలేను. మీ వాదం న్యాయమైనది. మీ ఉద్యమం స్తుత్యం. మీ సభకు నేను రాను అని అనలేను. శ్రీయుతులు తిలక్‌గారిని, గోఖలే గారిని దర్శించారు. మంచిపని చేశారు. ఈ యిరుపక్షాలవారూ నన్ను ఆహ్వానిస్తే వస్తాను. సమయ నిర్ణయానికి నన్ను అడగవలసిన పని లేదు. వారికెప్పుడు అనుకూలమో నాకు అప్పుడే అనుకూలం. మీకు ధన్యవాదాలు, ఆశీర్వాదాలు”

చడీచప్పుడు గాకుండా ఆడంబరం లేకుండా ఆ విద్వాంసులు, ఆ మహాత్యాగులు సభ జరిపి నన్ను ప్రోత్సహించి పంపారు.

నేనక్కడి నుండి మద్రాసు వెళ్లాను. మద్రాసు ప్రజలు నా రాక విషయం తెలిసి ఎంతో సంతోషించారు. బాల సుందరం కథ సభను ఆకట్టుకుంది. నా ఉపన్యాసం పెద్దదైంది. అంతా ముద్రిత ఉపన్యాసమే. సభ ఒక్కొక్క శబ్దాన్ని మనస్సుకు పట్టించుకొని విన్నది. సభ ముగిసిన తరువాత పచ్చ పుస్తకం కోసం జనం ఎగబడ్డారు. మద్రాసులో అవసరం అవుతుందని భావించి కొన్ని మార్పులు చేసి మరో 10 వేల ప్రతులు ముద్రింపచేశాను. అవన్నీ వేడి వేడి రొట్టెల్లా అమ్మకం అయ్యాయి. పదివేల ప్రతులు అవసరం లేదనిపించింది. ప్రజల ఉత్సాహం మీదనే నేను ఎక్కువగా ఆధారపడ్డాను. నా ఉపన్యాసం ఇంగ్లీషు వచ్చిన వారికోసం గదా! వారికిన్ని ప్రతులు అక్కరలేదని నా అభిప్రాయం. మద్రాసులో స్టాండర్డు పత్రికా సంపాదకులు, కీర్తి శేషులునగు పరమేశ్వరన్ పిళ్లెగారు నాకు అక్కడ ఎంతగానో సాయం చేశారు. వారు విషయాన్ని చక్కగా చదివారు. అనేకసార్లు తమ ఆఫీసుకు నన్ను తీసుకువెళ్లారు. సలహాలు యిచ్చారు. హిందూ పత్రికాధిపతులు జి. సుబ్రహ్మణ్యంగారి దర్శనం చేసుకున్నారు. డాక్టరు సుబ్రహ్మణ్యం గారి దర్శనం, సానుభూతి లభించింది. పరమేశ్వరన్ పిళ్లెగారు తమ పత్రికల్లో వెంటనే రమ్మని పిలుపు, ఈ విషయాన్ని గురించి నా యిష్ట ప్రకారం వ్రాయుటకు అంగీకరించారు. నేను కూడా వారొసంగిన సౌకర్యాన్ని బాగానే వినియోగించుకున్నాను. సభ పచ్చయప్ప హాల్లో జరిగినట్లు డాక్టర్ సుబ్రహ్మణ్యంగారు అధ్యక్షత వహించినట్లు గుర్తు.

ఉపన్యాసం ఎక్కువగా ఇంగ్లీషులో జరిగినా, స్వగృహంలో లభించే ప్రేమ, ఉత్సాహం మద్రాసులో నాకు లభించాయి. ప్రేమ, ఛేదించలేని బంధం ఏమీ ఉండదు గదా?