సత్యశోధన/మూడవభాగం/19. గోఖ్లే గారితో ఒక మాసం - 3

వికీసోర్స్ నుండి

19. గోఖ్లేగారితో ఒక మాసం - 3

కాళీ మాత నుద్దేశించి చేయబడుతున్న భయంకరమగు ఈ యజ్ఞాన్ని చూచిన తరువాత బెంగాలీ ప్రజల జీవిత విధానాన్ని గురించి తెలుసు కోవాలనే కోరిక కలిగింది. బ్రహ్మసమాజ మత గ్రంధాలు బాగా చదివాను. వారి ఉపన్యాసాలు విన్నాను. వారు వ్రాసిన కేశవ చంద్రసేన్ గారి జీవిత చరిత్రను ఆసక్తితో చదివాను. సాధారణంగా బ్రహ్మసమాజానికి, అసలు బ్రహ్మాసమాజానికి గల భేదం తెలుసుకున్నాను. పండిత శివనాధశాస్త్రిగారిని దర్శించాను. ప్రొఫెసర్ కాధవటేగారితో కలిసి మహర్షి దేవేంద్రనాధ టాగూరు గారిని దర్శించుటకు వెళ్ళాను. కాని ఆ సమయంలో వారు ఎవ్వరికీ దర్శనం యివ్వడంలేదని తెలిసింది. అందువల్ల వారి దర్శనం కాలేదు. కాని వారి ఇంట్లో జరిగే బ్రహ్మసమాజోత్సవానికి ఆహ్వానింపబడి వెళ్ళి ఆ ఉత్సవాల్లో పాల్గొన్నాను. అక్కడ శ్రేష్టమైన బెంగాలీ సంగీతం విన్నాను. అప్పటినుండి బెంగాలీ సంగీతం అంటే నాకు ఆసక్తి బాగా పెరిగింది.

బ్రహ్మసమాజాన్ని గురించి తెలుసుకున్న తరువాత శ్రీ వివేకానందస్వామి వారి దర్శనం చేసుకోకుండా ఎలా ఉండగలను? అత్యుత్సాహంతో బేలూరు మఠం నడిచి వెళ్ళాను. ఎంతదూరం నడిచానో నాకు ఇప్పుడు గుర్తు లేదు. ఏకాంత స్థలం పున్న ఆ మఠం చూచి నేను చాలా ఆనందపడ్డాను. అక్కడికి వెళ్ళిన తరువాత స్వాముల వారు జబ్బుపడి కలకత్తాలో వున్నారని తెలిసింది. ఈ సమాచారం విని నిరాశపడ్డాను. తరువాత సోదరి నివేదిత గారి ఇంటి జాడ తెలుసుకొని వెళ్ళి ఆమెను దర్శించాను. ఆమె వైభవం చూచి నిలువునా నీరైపోయాను. మాటలోను పలుకులోను కూడా మా ఇద్దరికి పొంతన కుదర్లేదు. నేను ఈ విషయం గోఖ్లేగారికి చెప్పాను. “ఆమె” తేజస్సుగల వనిత. మీ ఇద్దరికి కుదరదు అని గోఖ్లేగారు అన్నారు.

మరోసారి పేస్తన్‌జీ గారి యింట్లో మేమిద్దరం సమావేశమయ్యాము. ఆమె అక్కడ వుండగా నేను వెళ్లాను. ఆమె పేస్తన్‌జీ వృద్ధమాతకు ఉపదేశం ఇస్తున్న సమయం అది. అనుకోకుండా నేను ఇద్దరికీ మధ్య దుబాసి అయినాను. సోదరి నివేదితకు నాకు భావైక్యత లేకపోయినా, ఆమెకు హిందూ మతం యెడ గల అగాధ ప్రేమను గమనించాను. ఆమె రచించిన గ్రంథాలు ఆ తరువాత దక్షిణ ఆఫ్రికా కార్యాలయం కోసం కొన్నాను. కలకత్తా లోని నాయకుల్ని దర్శించడానికి మిగతా అర్ధదినం, ధార్మిక సంస్థల్ని, ఇతర సార్వజనిక సంస్థల్ని దర్శించేందుకు వెచ్చించాలని నిర్ధారించుకున్నాను.

నేనొక రోజున డాక్టరు మల్లిక్ గారి అధ్యక్షతన జరిగిన సభలో బోయర్ యుద్ధంలో భారతీయుల సేవాబృందం చేసిన పనిని గురించి ఉపన్యసించాను, “ఇంగ్లీష్‌మన్” పత్రికాధిపతి పరిచయం ఇప్పుడు కూడ నాకు ఉపయోగపడింది. సాండర్సుగారికి ఇప్పటికీ సుస్తీగానే వుంది. అయితే 1896 లో నాకు ఏవిధంగా సాయం చేశారో ఇప్పుడు కూడా అదేవిధంగా సాయం చేశారు. నా ఈ ఉపన్యాసానికి గోఖ్లేగారు సంతోషించారు. డాక్టరు రాయ్‌గారు నా ఉపన్యాసాన్ని ప్రశంసించే సరికి యింకా సంబరపడ్డాను. నేనీ విధంగా గోఖ్లేగారి గొడుగు నీడన వుండటం వల్ల బెంగాల్ ప్రాంతంలో నాపని తేలిక అయింది. బెంగాల్ నందు గొప్ప గొప్ప కుటుంబాల వారితో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. చిరస్మరణీయాలైన సంగతులు ఈ కాలానికి సంబంధించినవి చాలా వున్నాయి. కాని వాటిని ఇక్కడ వివరించడం లేదు. ఈ సమయంలో బ్రహ్మ దేశ (బర్మా) వెళ్లి వచ్చాను. అక్కడి వూంగీలను (సన్యాసుల్ని) కలిశాను. వాళ్ల సోమరితనం చూచి నాకు నవ్వు వచ్చింది. బంగారు పెగోడాలు (గోపురాలు) చూచాను. దేవళంలో లెక్కలేనన్ని కొవ్వొత్తులు వెలుగుతూ వున్నాయి. అవి నాకు నచ్చలేదు. గర్భాలయంలో పరుగెత్తుతున్న ఎలుకల్ని చూచేసరికి దయానందస్వామి వారి అనుభవం గుర్తుకు వచ్చింది. బ్రహ్మదేశంలో స్త్రీ ఉత్సాహాన్ని చూచి సంతోషించాను. కాని పురుషుల మాంద్యం చూచి విచారించాను. బొంబాయి ఎట్లా హిందూ దేశం కాదో, అట్లే రంగూను బ్రహ్మదేశం కాదని చూచి తెలుసుకున్నాను. హిందూ దేశంలో మనం ఇంగ్లీషు వర్తకులకు కమీషన్ ఏజంట్లుగా భావించి వ్యవహరిస్తున్నట్లే, ఇంగ్లీషు వాళ్లు అక్కడి వర్తకులతో కలిసి బ్రహ్మదేశం వాళ్ళను కమీషన్ ఏజంట్లుగా చేసుకొన్నారని నాకు బోధపడింది. బ్రహ్మదేశాన్నుండి తిరిగి వచ్చిన తరువాత గోఖ్లేగారి దగ్గర సెలవు తీసుకున్నాను. వారిని విడిచి పెట్టడం ఎంతో కష్టమనిపించింది. అయితే నాకు బెంగాలులో లేక కలకత్తాతో పని అయిపోయింది. అన్ని పనుల కంటే ముందు హిందూ దేశంలో మూడో తరగతి రైలుబండ్లలో ప్రయాణం చేసి ఆ తరగతిలో ప్రయాణించేవారి కష్టాలు తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఈ విషయం గోఖ్లేగారికి విన్నవించాను. వారు వెంటనే నవ్వారు కాని నా అభిప్రాయాలు తెలుసుకొని సంతోషించారు. ముందు కాశీకి వెళ్ళి అనిబిసెంట్ గారి దర్శనం చేసుకొందామని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఆమె జబ్బుపడి మంచం పట్టి వున్నది.

మూడోతరగతి రైలుబండి ప్రయాణానికి తగిన సరంజామా సిద్ధం చేసుకోవలసి వచ్చింది. లడ్లు, పూరీలు నింపిన టిఫిన్‌బాక్సు ఒకటి గోఖ్లేగారు బహూకరించారు. పన్నెండు అణాలు పెట్టి ఒక సంచి కొన్నాను. ఒక రకమైన చాయగల ఉన్నికోటు (పోరుబందరు ప్రాంతంవారు ధరిస్తారు), ఒక తువాలు, ఒక ధోవతి, ఒక చొక్కా దాన్లో వుంచాను. కప్పుకునేందుకు ఒక కంబళీ తీసుకున్నాను. ఒక లోటా కూడా తీసుకుని ప్రయాణమైనాను.

గోఖ్లేగారు, రాయ్‌గారు నన్ను సాగనంపడానికి రైలు స్టేషనుకు వచ్చారు. రావద్దని బ్రతిమిలాడాను. కాని వారు నా మాట వినలేదు. “నీవు ఒకటో తరగతిలో ప్రయాణిస్తూవుంటే నేను రాను. కాని ఇప్పుడు రాక తప్పదు” అని గోఖ్లేగారు అన్నారు.

ప్లాటుఫారం మీదకు వస్తూ వున్నప్పుడు గోఖ్లేగారిని ఎవ్వరూ ఆపలేదు. వారు పట్టు పాగా చుట్టుకున్నారు. కోటు తొడుక్కున్నారు. డాక్టర్‌రాయ్ గారు బెంగాలీ దుస్తుల్లో వున్నారు. ఆ కారణంవల్ల టిక్కెట్టు కలెక్టరు వారిని మొదట ఆపి వేశాడు. కాని గోఖ్లేగారు “నా మిత్రులు” అని చెప్పిన మీదట రానిచ్చారు. ఈ విధంగా వారిద్దరు వచ్చి నన్ను సాగనంపారు.