సత్యశోధన/మూడవభాగం/11. నగరపారిశుధ్యం - క్షామనిధి

వికీసోర్స్ నుండి

11. నగర పారిశుద్ధ్యం - క్షామనిధి

సంఘమను శరీరంలో ఏ అవయవం చెడినా ప్రమాదమే. అది నాకు యిష్టం వుండదు. లోకులు దోషాల్ని కప్పి పుచ్చడం, వాటిని చూచీ చూడనట్లు ఊరకుండి మా హక్కుల్ని మాకిమ్మని ప్రభుత్వాన్ని కోరడం నాకు యిష్టం వుండదు. దక్షిణ - ఆఫ్రికా యందలి భారతీయుల మీద ఒక ఆక్షేపణ వుండేది. “భారతీయులు మడ్డి రకం. వారి యిండ్లు చెత్త చెదారంతో నిండి మైలగా వుంటాయి” అని మాటిమాటికీ తెల్లవాళ్ళు ఆక్షేపిస్తూ వుండేవారు. అందులో కొంత సత్యం వున్నది. నేను అక్కడికి వెళ్ళినప్పటినుండి ఈ ఆక్షేపణ ఎలా తొలగించడనూ అని యోచిస్తూ వున్నాను. కొంచెం ప్రయత్నించగా పేరు పడియున్న పెద్ద ఇండ్లన్ని పరిశుభ్రమైనాయి. కాని డర్బనులో ప్లేగు ప్రవేశించి ప్రకోపిస్తుందనే వార్త పుట్టింది. ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేయడం పడలేదు. అందుకు మునిసిపాలిటీ సమ్మతి కావాలి. అది మాకు లభించింది. మేము పని చేయడానికి పూనుకున్నాం. అందువల్ల మునిసిపాలిటీ వారి పని తేలిక అయింది. భారతీయుల కష్టాలు కూడా తగ్గాయి. ప్లేగు మొదలుగా గల జబ్బులు వ్యాప్తి చెందినప్పుడు అధికారులు జనం మీద విరుచుకుపడేవారు. ఇష్టులు కాని వారి మీద వత్తిడి ఎక్కువయ్యేది. భారతీయులు శుచిగా వుండటం ప్రారంభించిన తరువాత అట్టి కష్టాలు బాధలు తగ్గిపోయాయి

ఈ విషయంలో నేను కూడా చాలా కష్టాలు చవిచూచాను. హక్కుల కోసం నేటాలు ప్రభుత్వంతో పోరాటం నడుపుటకు వారి వల్ల ఎంత సాయం పొందగలిగానో, అంత సాయం వారి చేత వారి విధుల్ని అమలుచేయించుటకు కృషిచేసి వారి సాయం పొందలేకపోయాను. కొందరు నన్ను అవమానించారు. కొందరు వినయపూర్వకంగా ఫరవాలేదు ఫరవాలేదు అంటూ కాలం గడిపారు. చాలామంది తమ మురికిని తాము తొలగించుకొనేందుకు సిద్ధం కాలేదు. అలా చేసుకోవడం పెద్ద తప్పని భావించారు. అందుకోసం డబ్బు ఖర్చు పెట్టమంటే యింకా కష్టం “యీ రంగంలో జనంచే ఏమైనా పనిచేయించాలి అంటే ముందు మనకు ఎంతో ఓర్పు సహనం పుండాలి” అను పాఠం నేను నేర్చుకొన్నాను. సంస్కర్తకు కావలసింది కేవలం సంస్కరణం. ఏ సంఘంలో సంస్కారం చేయాలని కోరతామో ఆ సంఘంలో వ్యతిరేకత, తిరస్కారం, చివరకు ప్రాణాపాయం సైతం కలుగవచ్చునని భావించి అందుకు సిద్ధపడాలి. సంస్కర్త దేన్ని సంస్కారం అని భావిస్తాడో ప్రజలు దాన్ని వికారం అని భావించవచ్చు. వికారం అనుకున్నా సరేకాని, వారు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సంస్కరణం జరగదు.

ఇక మా పారిశుద్ధ్యానికి సంబంధించిన ఉద్యమం వల్ల భారతీయులకు ఇళ్ళు పరిశుభ్రంగా వుంచుకోవాలి అన్న విషయం కొద్దిగానో గొప్పగానో బోధపడింది. తెల్ల అధికారుల్లో మాయెడ కొంచెం గౌరవం పెరిగింది. భారతీయుల హక్కుల కోసం, అధికారాల కోసం ఎంత గట్టిగా ఉద్యమిస్తానో వారిని సంస్కరిoచడానికి అంతగా కృషిచేస్తూ వుంటానని వారికి బోధపడింది.

సంఘ మనోవికాసానికి మరొక పని చేయవలసి వచ్చింది. భారత దేశం ఎడ తమ కర్తవ్య నిర్వహణకు దక్షిణ - ఆఫ్రికా యందలి భారతీయుల్ని తయారు చేయవలసిన అవసరం వుందని గ్రహించాను. భారతదేశం పేద దేశం. అచటి వారు డబ్బు సంపాదస కోసం విదేశాలకు తరలి వెళ్లారు. భారత దేశానికి ఆపత్సమయంలో తాము సంపాదించిన డబ్బులో కొద్దిగా యివ్వడం ధర్మం కదా! 1897 వ సంవత్సరంలో ఇండియాలో క్షామం వచ్చింది. 1899వ సంవత్సరంలో దానికంటే పెద్ద క్షామం వచ్చింది. ఈ రెండు సమయాల్లోను దక్షిణ - ఆఫ్రికా నుండి పెద్ద సహాయం ఇండియాకు పంపించాము. మొదటి సారి చాలా సొమ్ము పంపాము. రెండవసారి మరింత సొమ్ము పంపాము. మేము తెల్లవారిని కూడా సాయం అడిగాము. వారు కూడా చాలా సహాయం చేశారు. గిరిమిటియాలు కూడా సొమ్ము విరాళంగా యిచ్చారు.

ఈ విధంగా రెండు క్షామాలు భారత దేశంలో సంభవించినప్పుడు సాయం చేసినట్లే ఆ తరువాత కూడా అనేక పర్యాయాలు సాయం చేశారు. అది వారికి అలవాటు అయిపోయిందన్నమాట.

ఈ విధంగా దక్షిణ - ఆఫ్రికాలో భారతీయులకు సేవచేస్తూ ఒకటి తరువాత మరొకటి అనేక విషయాలు నేర్చుకున్నాను. సత్యం అనేది మహావృక్షం. మనం దాన్ని ఎంత అధికంగా పోషిస్తే అది అంతగా ఫలాలు అందిస్తుంది. దానికి అంతం ఉండదు. దాన్ని తెలుసుకొని లోతుకు దిగిన కొద్దీ సేవారూపంలో రత్నాలు చేతికి దొరుకుతూ వుంటాయి.