సత్యశోధన/నాల్గవభాగం/1. చేసిన కృషి వ్యర్ధం

వికీసోర్స్ నుండి

నాలుగవ భాగం

1. చేసిన కృషి వ్యర్థం

మి.చేంబర్లేన్ మూడున్నర కోట్ల పౌండ్లు దక్షిణ ఆఫ్రికా దగ్గర తీసుకుందామని వచ్చాడు. ఇంగ్లీషువాళ్ళ, సాధ్యమైతే బోయర్ల మనస్సును కూడా జయించాలని ఆయన భావం. అందువల్ల భారతీయ ప్రతినిధులకు వ్యతిరేక సమాధానం వచ్చింది.

“స్వరాజ్యం అనుభవిస్తున్న అధినివేశరాజ్యాల మీద ఆంగ్ల సామ్రాజ్య ప్రభుత్వానికి గల అధికారం బహు స్వల్పమను విషయం మీరు ఎరుగుదురు. మీ ఆరోపణలు యదార్థమైనవనే తోస్తున్నది. నా చేతనైనంతవరకు మీకు సాయం చేస్తాను. మీరు మాత్రం అక్కడి తెల్లవారికి తృప్తి కలిగించాలి. వాళ్ళను సంతోషపరచాలి.” ఇదీ వారి సమాధానం.

ఈ సమాధానం వల్ల భారత ప్రతినిధి వర్గం మీద పిడుగు పడినంతపని అయింది. నాకు గల ఆశ పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఇప్పుడే తెల్లవారిందని భావించి “ఏమండీ! ఆశీర్వదించండి” అంటూ పని ప్రారంభించాలన్న మాట. అనుచరులందరికీ ఈ విషయం నచ్చ చెప్పాను.

అయితే చేంబర్లేన్ సమాధానం అనుచితమైనదా? తారుమారు చేసి మాట్లాడకుండా ఆయన సూటిగా స్పష్టంగా చెప్పాడు. నోరు ఉన్న వాడిదే రాజ్యమని ఆయన తీయని మాటల్లో చెప్పాడన్నమాట. అసలు మా దగ్గర నోరనేది వుంటే గదా! నోటి తూటాల తాకిడికి తట్టుకోగల శరీరాలు కూడా మాకు లేవు. మి. చేంబర్లేన్ కొద్ది వారాలు మాత్రమే ఉంటారని తెలిసింది. దక్షిణాఫ్రికా చిన్న ప్రాంతం కాదు. ఇదొక దేశం, ఇదొక ఖండం, ఆఫ్రికాలో ఆనేక ఉపఖండాలు వున్నాయి. కన్యాకుమారి నుండి శ్రీనగర్ వరకు 1800 మైళ్ళు ఉంటే, డర్బన్ నుండి కేప్‌టౌన్ వరకు 1100 మైళ్ళకు తక్కువ లేదు. ఈ ఖండంలో మి. చేంబర్లేన్ తుపాను పర్యటన జరపాలి. ఆయన ట్రాన్సువాలుకు బయలుదేరాడు. హిందూ దేశస్థుల కేసును తయారు చేసి నేను వారికి అందజేయాలి. ప్రిటోరియా ఎలా చేరడం? నేను సమయానికి చేరాలి, అనుమతి తీసుకోవాలి అంటే మనవాళ్ళ వల్ల అయ్యే పనికాదు. యుద్ధం ముగిశాక ట్రాన్సువాలు శిథిలమైపోయింది. అక్కడ తినడానికి తిండిగాని కట్టడానికి బట్టగాని లేదు. ఖాళీగా మూసిపడివున్న దుకాణాలను తెరిపించాలి. నింపాలి. ఇది నెమ్మదిగా జరుగవలసిన కార్యక్రమం. సామాను లభించేదాన్ని బట్టి ఇళ్ళు వదలిపారిపోయిన వాళ్ళనందరినీ తిరిగివచ్చేలా చూడాలి. అందు నిమిత్తం ప్రతి ట్రాన్సువాలు నివాసి, అనుమతి పత్రం తీసుకోవాలి. తెల్లవాళ్ళకు అడగంగానే అనుమతి పత్రం లభిస్తుంది. కాని హిందూ దేశస్తులకు లభించదు. యుద్ధ సమయంలో హిందూ దేశాన్నుండి, లంకనుండి చాలామంది ఆఫీసర్లు, సైనికులు దక్షిణాఫ్రికా వచ్చారు. వారిలో అక్కడ ఉండదలచిన వారికి సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత బ్రిటీష్ ప్రభుత్వ అధికారులది. అది వారి కర్తవ్యంగా భావించబడింది. క్రొత్త అధికారుల కమిటీలు ఏర్పాటు చేయాలి. అందు అనుభవం కలిగిన అధికారులకు తేలికగా స్థానం లభించింది. ఈ అధికారుల తీవ్ర బుద్ధి మరో క్రొత్త విభాగాన్ని నెలకొల్పింది. దానివల్ల వారికే ఎక్కువ స్తోమతు లభించడం సహజం. హబ్షీలకోసం వేరే విభాగం ఏర్పాటు చేశారు. ఇక ఆసియా వాసుల కోసం ఏర్పాటు చేయరా? తర్కం సరిగా వున్నందున అంగీకారం లభించింది. అయితే నేను అక్కడకు చేరేసరికి ఈ ఏర్పాటు జరిగిపోయింది. మెల్లమెల్లగా వల పన్నారు. పారిపోయిన వాళ్ళకు అనుమతి పత్రం ఇస్తున్న అధికారి ఇష్టపడితే అందరికీ ఇవ్వవచ్చు. కాని ఫలానా వాడు ఆసియా వాసి అని అతడికి తెలియడం ఎలా? ఈ క్రొత్త విభాగం సిఫారసు చేస్తే ఆసియా వారికి అనుమతి పత్రం లభించితే ఆ అధికారి బాధ్యత తగ్గుతుంది. అతడి మీద పని బరువు కూడా తగ్గుతుంది. ఈ తర్కం క్రొత్త విభాగం తెరిచే ముందు అందరి ఎదుట ప్రవేశ పెట్టబడింది. కాని క్రొత్త విభాగం తెరిచే ముందు అందరి ఎదుట ప్రవేశ పెట్టబడింది. కాని క్రొత్త విభాగం వారికి పనితోబాటు సొమ్ముకూడ కావలసి వచ్చింది. పనిలేకపోతే ఈ విభాగం అవసరం లేదని చెప్పి దాన్ని మూసివేస్తారు. అందువల్ల ఆ విభాగానికి పని అప్పజెప్పబడింది.

ఆ విభాగానికి వెళ్ళి హిందూ దేశస్థులు దరఖాస్తు పెట్టుకోవాలి. చాలారోజుల తరువాత జవాబు వస్తుంది. ట్రాన్సువాలు వెళ్ళగోరే వారి సంఖ్య ఎక్కువగా వుంది. అందువల్ల దళారులు బయలుదేరారు. ఈ దళారులకు అధికారులకు మధ్య బీద హిందూదేశస్థుల వేలాది రూపాయలు స్వాహా అవుతున్నాయి. సొమ్ము ఇచ్చి గట్టి ప్రయత్నం చేయకపోతే అనుమతి పత్రం లభించడం లేదని చాలా మంది నాకు చెప్పారు. అవకాశం ఉన్నప్పటికీ ఒక్కొక్క మనిషి అనుమతి పత్రం కోసం వంద పౌండ్లు కూడా చెల్లించవలసిన స్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంలో నా కర్తవ్యం ఏమిటి? నా చిరకాల మిత్రుడగు డర్బన్ పోలీసు సూపరింటెండెంటు దగ్గరకు వెళ్ళాను. “మీరు అధికార పత్రం ఇచ్చే అధికారికి నన్ను పరిచయం చేయండి. నాకు అనుమతి పత్రం ఇప్పించండి. నేను ట్రాన్సువాలులో వున్నానని మీరు ఎరుగుదురు.” అని చెప్పాను. ఆయన వెంటనే నెత్తిన హాట్ పెట్టుకొని నా వెంట బయలుదేరారు. నాకు అనుమతి పత్రం ఇప్పించాడు. నా రైలు బయలుదేరడానికి ఒక గంట టైము మాత్రమే వున్నది. నేను మొదటనే సామాను సిద్ధం చేసి పెట్టుకున్నాను. సూపరింటెండెంట్ అలెగ్జాండరుకు ధన్యవాదాలు చెప్పి ప్రిటోరియాకు బయలుదేరాను. పడవలసిన కష్టాలు నాకు బోధపడ్డాయి. నేను ప్రిటోరియా చేరాను. దరఖాస్తు సిద్ధం చేశాను. డర్బనులో ప్రతినిధుల పేర్లు ఎవరినైనా అడిగారేమో నాకు గుర్తులేదు. ఇక్కడ క్రొత్త విభాగం పనిచేస్తున్నది. వాళ్ళు భారతీయ ప్రతినిధుల పేర్లు ముందుగానే అడిగి తెలుసుకున్నారట. అంటే నన్ను ప్రతినిధి వర్గానికి దూరంగా వుంచడమే దాని అర్థమన్నమాట. ఈ వార్త ప్రిటోరియాలో గల హిందూ దేశస్థులకు తెలిసింది.

ఇది దుఃఖకరమైన కథ. మనో వినోదం కల్పించే కథ కూడా. వివరాలు తరువాత వ్రాస్తాను.