సత్యశోధన/ఐదవభాగం/41. ఒక సంభాషణ

వికీసోర్స్ నుండి

41. ఒక సంభాషణ

స్వదేశీ పేరుతో ఉద్యమం ప్రసిద్ధికెక్కేసరికి మిల్లు యజమానులు నన్ను తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. భాయీ ఉమర్ సుభానీ ఒక తెలివిగల మిల్లు యజమాని. అందువల్ల అతడు తన తెలివి తేటలు నాకు బోధపరుస్తూ వుండేవాడు. ఇతరుల అభిప్రాయాలు కూడా నాకు తెలుపుతూ వుండేవాడు. అట్టివారిలో ఒక వ్యక్తి మాటల ప్రభావం సుభానీ మీద కూడా పడింది. నన్ను ఆయన దగ్గరకు తీసుకొని వెళతానని అన్నాడు. ఆయన సలహా ప్రకారం మేము ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాము. ఆయన యిలా సంభాషణ ప్రారంభించాడు. “మీ యీ స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది. ఆ ఉద్యమం వల్ల మిల్లు యజమానులం ఎంతో లాభం పొందాం. బట్టల ధర పెంచి వేశాం. ఎవ్వరూ ఏమీ అనలేని మాటలు మాట్లాడాం” అని అన్నాడు. “నేను ఆ విషయాన్ని గురించి విన్నాను. కాని అలా జరిగినందుకు విచారిస్తున్నాను” “మీ విచారం ఏమిటో ఎందుకో నాకు తెలుసు. మేము పరోపకారం చేసేందుకు వ్యాపారం చేయడం లేదు. డబ్బు సంపాదించడమే మా లక్ష్యం. మా భాగస్వాములకు మేము సమాధానం చెప్పాలి. వస్తువుల ధర వాటి గిరాకీ మీద ఆధారపడి వుంటుంది. దీనికి విరుద్ధంగా ఎవ్వడూ వెళ్ళలేడు. యీ ఉద్యమం వల్ల స్వదేశీ బట్టల ధర పెరుగుతుందని బెంగాలీలు తెలుసుకోవాలి” అని అన్నాడు.

“పాపం వాళ్ళు నా మాదిరిగా తేలికగా అందరినీ నమ్ముతారు. కనుక మిల్లు యాజమానులు స్వార్థపరులు కారని మోసం చేయరని స్వదేశీవస్త్రాల పేరిట విదేశీ వస్త్రాలు అమ్మరని వాళ్ళు విశ్వసించారు.” అని అన్నాను.

“మీరు అలా నమ్ముతారని నాకు తెలుసు. అందుకనే నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఇక్కడకు రావడానికి శ్రమపడ్డారు. అమాయకులైన బెంగాలీల వలె మోసంలో పడకండి” అని చెప్పి తన దగ్గర నేయబడుతున్న బట్టల నమూనాలు తెమ్మని ఒకరికి సైగ చేశాడు. మొదటి నమూనా రద్దీ అవి పారవేసే దూదితో నేయబడ్డ కంబళీ. దాన్ని చూపిస్తూ “చూడండి మేము దీన్ని కొత్తగా నేయించాం. ఇది బాగా అమ్ముడుపోతున్నది. రద్దీగా భావించబడే దూదితో తయారు చేయబడింది గనుక చవుకగా ఉంటుంది. వీటిని ఉత్తరాదికి కూడా పంపుతాం. మా ఏజంట్లు దేశం నాలుగు చెరగులా ఉన్నారు. అందువల్ల మాకు మీవంటి ఏజంట్ల అవసరం వుండదు. మరోమాట. మీ కంఠస్వరం చేరుకోని దూర దూర ప్రదేశాల్లో సైతం మా ఏజంట్లు వున్నారు. సామగ్రి అక్కడికి చేరుతుంది. భారతదేశానికి కావలసినంత బట్ట మేము తయారు చేస్తాం. అసలు స్వదేశీ అంటే ఉత్పాదనకు సంబంధించిన విషయం. మనకు అవసరమైన బట్ట మనం తయారు చేసుకోగలిగినప్పుడు మేలురకం బట్ట తయారు చేసుకోగలిగినప్పుడు, విదేశీ బట్టల దిగుమతి దానంతట అదే తగ్గిపోతుంది. అందువల్ల మీరు నడుపుతూ ఉన్న స్వదేశీ ఉద్యమం నడపవద్దని సలహా ఇస్తున్నాను. క్రొత్త మిల్లులు తెరిచేందుకు ప్రయత్నం చేయండి. మన దేశంలో స్వదేశీ వస్తువులు అమ్మకం చేసే ఉద్యమం సాగించడం అనవసరం. మనకు కావలసింది స్వదేశీ వస్తువుల ఉత్పత్తి. ఆ విషయం అర్థం చేసుకోండి.” అని అన్నాడు. నేను ఆ పనే చేస్తున్నాను. ఆశీర్వదిస్తారు కదూ!” “అదెలా! మీరు క్రొత్త మిల్లులు తెరవగలిగితే ధన్యవాదాలు పొందుటకు పాత్రులు కాగలుగుతారు” “ఆపని నేను చేయడం లేదు. నేను రాట్నం పనిలో లీనమైవున్నాను.” “అదేమిటి? రాట్నం ఏమిటి” అని అడిగాడు. నేను రాట్నం గురించి వివరించి చెప్పి “మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను, నేను మిల్లులకు ఏజంటుగా పనిచేయకూడదు. అందువల్ల లాభానికి బదులు నష్టం చేకూరుతుంది. మిల్లుల్లో తయారైన సామగ్రి నిల్వఉండదు. నేను ఉత్పత్తి అయిన సామగ్రిని అమ్మకం చేసేందుకు పూనుకోవాలి. ఇప్పుడు నేను ఉత్పత్తి కార్యక్రమానికి పూనుకున్నాను. ఇటువంటి స్వదేశీ వస్తువులంటే నాకు శ్రద్ధ. ఇట్టి సామగ్రి ద్వారా ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టవచ్చు, సంవత్సరం పొడుగునా ఖాళీగా ఉండే స్త్రీలకు పని కల్పించవచ్చు. వాళ్ళు వడికిన నూలుతో బట్ట నేయించాలి. ఆ విధంగా తయారైన ఖద్దరును ప్రజలచేత ధరింపచేయాలి. ఇదే నా అభిలాష. ఇదే నా ఉద్యమం. రాట్నానికి సంబంధించిన ఈ ఉద్యమం ఎంతవరకు విజయం సాధిస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు ఆరంభదశలో వుంది. కాని నాకు దానిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఏది ఏమన్నాగానీ, నష్టం మాత్రం ఉండదు. హిందూ దేశంలో తయారయ్యే బట్ట ఎంత వృద్ధి అయితే ఈ ఉద్యమం వల్ల అంత లాభం చేకూరుతుంది. ఈ కృషిలో మీరు చెప్పిన దోషం లేదని అనుకుంటున్నాను” అని స్పష్టంగా చెప్పివేశాను.

“ఈ విధమైన ఉద్యమం మీరు సాగిస్తూ ఉంటే నేను చెప్పవలసింది ఇక ఏమీలేదు. ఈ యుగంలో రాట్నం నడుస్తుందా లేదా అనునది వేరు విషయం. నేను మాత్రం మీ కృషి సఫలం కావాలని కోరుతున్నాను.” అని సంభాషణను ముగించాడు ఆ పెద్దమనిషి.