సత్యశోధన/ఐదవభాగం/40. రాట్నం దొరికింది

వికీసోర్స్ నుండి

40. రాట్నం దొరికింది

గుజరాత్ ప్రాంతంలో తెగతిరిగిన తరువాత గంగాబెన్‌కు గాయక్వాడ్‌కు చెందిన బీజాపూరులో రాట్నం దొరికింది. అక్కడ చాలా కుటుంబాల వారి దగ్గర రాట్నాలు వున్నాయి. కాని వాటిని వాళ్ల అటకమీద పెట్టి వేశారు. వాళ్ళు వడికిన నూలు ఎవరైనా తీసుకొని, వాళ్లకు ఏకులు ఇస్తే వాళ్ళు నూలు వడికేందుకు సిద్ధంగా వున్నారని గంగాబెన్ చెప్పింది. నాకు అమిత సంతోషం కలిగింది. అయితే దూదితో తయారు చేసిన ఏకులు పంపడం, కష్టమైపోయింది. కీ.శే. ఉమర్‌సుభానీతో మాట్లాడగా ఆయన తన మిల్లునుండి ఏకులు పంపుతానని మాట యిచ్చాడు. ఏకులు గంగాబెన్ దగ్గరకు పంపాను. దానితో వడుకునూలు బహువేగంగా తయారవడం చూచి నివ్వరబోయాను.

భాయి ఉమర్ సుభానీ ఉదార హృదయుడు కనుక ఉదార బుద్ధితో ఏకులు యిచ్చి సహకరించాడు. అయితే హద్దంటూ వుంటుంది కద! డబ్బు యిచ్చి ఆయన దగ్గర ఏకులు కొనడానికి సంకోచించాను. అంతేగాక మిల్లులో తయారైన ఏకులతో నూలు వడికించడమా? అది పెద్ద దోషమని మిల్లులో తయారయ్యే ఏకులు తీసుకుంటే మిల్లులో తయారయే నూలు తీసుకోవచ్చుగదా! అందు దోషం ఏముంటుంది? మన పూర్వీకుల దగ్గర మిల్లుల్లో తయారయే ఏకులు వుండేవికాదు గదా? మరి వాళ్ళు ఏకులు ఎలా తయారు చేసుకునేవారో? అయితే యిక ఏకులు తయారు చేసేవారిని కూడా వెతకమని గంగాబెన్‌కు చెప్పాను. ఆమె ఆ బాధ్యత కూడా వహించి ఒక దూది ఏకే వాడిని వెతికి తెచ్చింది. అతనికి నెలకు 35 లేక అంత కంటే కొంచెం ఎక్కువ జీతం ఇచ్చి వుంచా. ఏకులు తయారు చేయడం పిల్లలకు నేర్పించాం. ప్రత్తి కావాలని బిచ్చం అడిగాము. సోదరుడు యశవంతప్రసాద్ దేశాయి ప్రత్తి మూటలు తెచ్చే బాధ్యత వహించారు. గంగాబెన్ ఖద్దరు పనిని బాగా నడిపించింది. వడికిన నూలుతో బట్టల నేత ప్రారంభమైంది. బీజాపూర్ ఖాదీ అనే దానికి పేరు వచ్చింది.

ఆశ్రమంలో చరఖా వెంటనే ప్రవేశించింది. మగన్‌లాల్ యొక్క పరిశోధనాశక్తి రాట్నంలో చాలా మార్పులు చేసింది. రాట్నాలు, కదుళ్ళు ఆశ్రమంలో తయారయ్యాయి. ఆశ్రమంలో తయారైన మొదటి ఖద్దరు బట్ట గజం ఖరీదు 17 అణాలు పడింది. నేను లావుపాటి నూలుతో తయారైన ఖాదీ గజం 17 అణాలు చొప్పున మిత్రులకు అమ్మాను. బొంబాయిలో కనబడ్డ వాళ్ళందర్నీ అడుగుతూ వున్నాను. అక్కడ నూలువడికే ముహిళలు యిద్దరు దొరికారు. వాళ్ళకు ఒక --- నూలు ఒక రూపాయి చొప్పున యిచ్చాను. నేను ఖాదీ శాస్త్రంలో యింకా పూర్తిగా అనుభవం లేనివాడను. నాకు చేతితో వడికిన నూలు కావాలి. వడికే స్త్రీలు కావాలి. గంగాబెన్ వాళ్లకు యిస్తున్న ధరతో పోలిస్తే నేను మోసగింపబడ్డానని తేలింది. సోదరీమణులు తక్కువ సొమ్ము తీసుకొనేందుకు అంగీకరించలేదు. అందువల్ల వాళ్లను వదిలి పెట్టవలసి వచ్చింది. అయితే వాళ్ళ వల్ల ప్రయోజనం చేకూరింది. వాళ్ళు శ్రీ అవంతికాబాయికి, శ్రీ రమీబాయి కామదార్‌కు, శ్రీశంకర్‌లాల్ బాంకరు గారి తల్లికి, శ్రీ వసుమతిబెన్‌కు నూలు వడకడం నేర్పారు. నాగదిలో రాట్నం మోత వినబడసాగింది. యీ యంత్రం జబ్బుపడ్డ నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసింది. ఇది మానసికం అన్న విషయం నిజం అయినా మనస్సు నందలి ఒక భాగం మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేసిందంటే చిన్న విషయం కాదు గదా? నేను కూడా రాట్నం చేతబట్టాను. అంతకంటే మించి ఈ రంగంలో ముందుకు పోలేకపోయాను.

ఇక ఏకులు ఎలా వస్తాయి? శ్రీరేవాశంకర్ ఝబేరీగారి బంగళా దగ్గరనుండి ప్రతి రోజూ ఒక దూదేకుల వాడు వెళుతూ వుండేవాడు. అతణ్ణి నేను పిలిచాను. అతడు పరుపుల కోసం దూదిని ఏకుతూ వుండేవాడు. అతడు ఏకులు తయారు చేసి యిస్తానని అంగీకరించాడు. అయితే మజూరీ ఎక్కువ అడిగాడు. నేను అంగీకరించాను. యీ విధంగా తయారైన నూలుతో తయారైన హారాన్ని వైష్ణవులకు డబ్బు తీసుకుని దేవుడికి హారంగా వాడుటకు అమ్మాను. శివాజీ బొంబాయిలో చరఖా క్లాసులు ప్రారంభించాడు. యీ ప్రయోగాలకు డబ్బు బాగా ఖర్చు అయింది. శ్రద్ధాళువులగు దేశభక్తులు డబ్బు ఇచ్చారు. నేను ఖర్చు చేశాను. ఆ ఖర్చు వ్యర్ధం కాలేదని వినమ్రంగా మనవి చేస్తున్నాను. మేము చాలా నేర్చుకున్నాం. కొలతబద్ద మాకు దొరికింది. ఇక నేను ఖాదీమయం అయిపోవాలని తహతహలాడాను. నేను కట్టుకున్నబట్ట దేశపు మిల్లు నూలుతో తయారైంది. బీజాపూరులోను, ఆశ్రమంలోను తయారవుతున్న ఖద్దరు బట్ట బాగా లావుగా వుండి 30 అంగుళాలు పన్నా కలిగి ఉన్నది. ఒకనెల లోపల 45 అంగుళాల పన్నా గలిగిన ఖద్దరు ధోవతి తెచ్చి ఇవ్వకపోతే లావుపాటి ఖద్దరు తుండుగుడ్డ కట్టుకోక తప్పదని గంగాబెన్‌కు చెప్పాను. పాపం ఆమె కంగారు పడింది. సమయం తక్కువ. అయినా ఆమె అధైర్యపడలేదు. నెలరోజులలోపల ఏభైఅంగుళాల పన్నా గల రెండు ఖాదీ ధోవతులు తెచ్చి నా ఎదుట వుంచింది. నా దారిద్ర్యం తొలిగిపోయింది. ఈ లోపున లక్ష్మీదాస్‌భాయి, లాటీ అను గ్రామం నుండి రామ్‌జీభాయి మరియు ఆయన భార్యయగు గంగాబెన్ అను పేర్లు గల అంత్యజులను ఆశ్రమం తీసుకువచ్చాడు. వారిచేత పెద్ద పన్నా గల ఖద్దరు తయారు చేయించాడు. ఖద్దరు ప్రచారానికి ఈ భార్యాభర్తలు యిద్దరూ చేసిన సేవ అసామాన్యమైనది. వాళ్ళు గుజరాత్‌లోను, గుజరాత్ బయట చేతితో వడికిన నూలుతో బట్ట నేయడం చాలామందికి నేర్పారు. ఆమె చదువుకోలేదు. కాని మగ్గం ముందు కూర్చొని నేత పని ప్రారంభించినప్పటినుండి అందులీనమైపోయేది. ఎవ్వరితోను మాట్లాడటానికి యిష్టపడేదికాదు.