సత్యశోధన/ఐదవభాగం/39. ఖాదీపుట్టుక

వికీసోర్స్ నుండి

39. ఖాదీ పుట్టుక

1908 వరకు నేను రాట్నాన్నిగాని, మగ్గాన్ని గాని చూచినట్లు జ్ఞాపకం లేదు. కాని రాట్నం ద్వారా హిందూదేశపు ఏ దారిద్ర్యాన్ని పారత్రోలవచ్చో ఆ ఉపాయంతోనే స్వరాజ్యం కూడా పొందవచ్చునను విషయం అందరూ గ్రహించారు. 1901లో దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశం వచ్చాను. అప్పటికి నేను రాట్నం చూడలేదు. ఆశ్రమం తెరవగానే మగ్గం ఏర్పాటు చేశాం. మగ్గం వల్ల యిబ్బంది కలిగింది. మాకు దాన్ని గురించి ఏమీ తెలియదు. మగ్గం తెప్పించినంత మాత్రాన పని అవుతుందా? మేమంతా కలం వీరులం లేక బేరసారాలు చేసేవాళ్ళం. అలాంటి వాళ్ళం అక్కడ చేరాం. నేతపనివాడు ఒక్కడు లేడు. అందువల్ల మగ్గం తీసుకురాగానే నేత నేర్పడానికి పనివాడు కావలసివచ్చాడు. కాఠియావాడ్ మరియు పాలస్‌పుర్ నుండి మగ్గాలు వచ్చాయి. నేర్పేవాడు కూడా ఒకడు వచ్చాడు. అతడు తన పనితనాన్ని వ్యక్తం చేయలేదు. అయితే మగన్‌లాల్ గాంధీ చేబట్టిన పనిని తేలికగా వదిలి పెట్టే మనిషి కాదు. ఆయన పనిమంతుడు. ఆయన నేతపనిని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆశ్రమంలో ఒకరి తరువాత మరొకరు నేత పనివాళ్ళు తయారైనారు.

మేము మాబట్టలు స్వయంగా నేసుకొని ధరించాలి. అందువల్ల మిల్లు బట్టలు మానివేశాం. ఆశ్రమవాసులు మిల్లు నూలుతో మగ్గం మీద నేసిన బట్ట కట్టుకోవడం ప్రారంభించారు. యీ వ్రతనిర్వహణలో చాలా విషయాలు తెలుసుకున్నాం. హిందూ దేశపు నేతపనివారి జీవనం, వారి రాబడి, నూలు సంపాదించాలంటే కలిగే కష్టాలు ఆ వ్యవహారంలో వారు మోసపోతున్న విధానం, రోజురోజుకు ఏవిధంగా అప్పుల పాలవుతున్నారో ఆ తీరు మొదలుగా గల వివరాలన్నీ బోధపడ్డాయి. అందరికి అవసరమైన బట్టంతా నేసుకునే స్థితిలో లేము. అందువల్ల బయటి నేతవారిచేత బట్ట నేయించి అవసరమైనంత తెచ్చుకోవాలి. దేశపు మిల్లుల్లో తయారైన నూలుతో నేయబడ్డ నేతబట్ట తేలికగా దొరకదు. విదేశీనూలుతో నేత వాళ్ళు సన్నని బట్టలు నేసేవారు. దేశవాళీ మిల్లుల్లో తయారయ్యే నూలు సన్నగా వుండేది కాదు. మనమిల్లులు సన్నని నూలు తయారుచేసేవికాదు. దేశపు మిల్లుల నూలుతో బట్టనేసి యిచ్చే నేతవాళ్ళు అతికష్టం మీద బహుకొద్దిమంది దొరికారు. అయితే దేశపు మిల్లుల నూలుతో తయారుచేసే బట్ట మొత్తం కొంటామని ఆశ్రమం తరుపున మేము హామీ యివ్వవలసి వచ్చింది. ఈ విధంగా తయారుచేసి కట్టుకున్న బట్టను గురించి మిత్రుల్లో బాగా ప్రచారం చేశాము. ఈ విధంగా మేము నూలు మిల్లుల దమ్మిడీ ఖర్చులేని దళారులం అయిపోయాం. మిల్లుల్ని గురించి తెలుసుకున్నాం. వాటి వ్యవస్థ, అక్కడి వాళ్ళ బాధలు తెలిశాయి. స్వయంగా నూలు వడకడం, ఆ నూలుతో బట్టనేయడం మిల్లుల లక్ష్యం. మిల్లులు మగ్గాల వారికి సాయం చేయవు. చేసినా యిష్టం లేకుండా చేసేవన్నమాట. ఇదంతా చూచిన తరువాత వడుకుపని మనమే ఎందుకు చేయకూడదా అని ఆలోచించాము. మన చేతులతో నూలు వడకనంతవరకు మనం పరాయివారికి బానిసలమేనని తెలుసుకున్నాం. మిల్లు నూలుకు ఏజంట్లమై దేశ సేవ చేస్తున్నామని అనుకోవచ్చునా? మాకు బోధపడలేదు. అయితే రాట్నమూ మాకు దొరకలేదు. రాట్నం మీద నూలు వడికే వారు దొరకలేదు. నారపీచుతో పురికొస తయారు చేసే రాట్నాలు మా దగ్గర వున్నాయిగాని వాటితో దారం తీయవచ్చని మాకు తెలియలేదు. ఒక పర్యాయం కాళిదాసువకీలు ఒక సోదరిని వెతుక్కొని తీసుకువచ్చాడు. ఈమె నూలు వడికి చూపిస్తుందని చెప్పాడు. క్రొత్త పనులు నేర్చుకోవడంలో నిపుణుడైన ఒక ఆశ్రమవాసిని ఆమె దగ్గర వడకడం నేర్చుకొనేందుకే పంపాము. కాని ఆ కళ మా చేతికందలేదు.

రోజులు గడుస్తున్నాయి. నాకు తొందర ఎక్కువైంది. ఆశ్రమానికి వచ్చే ప్రతి మనిషినీ యీ విషయం గురించి అడగడం ప్రారంభించాను. అయితే వడుకు వ్యవహారమంతా స్త్రీ సొత్తేనని తేలింది. వడుకు తెలిసి ఏమూలనో పడియున్న స్త్రీలను స్త్రీలే పట్టుకోగలరని తేలింది. 1917లో గుజరాతీ సోదరుడు ఒకడు నన్ను భడోంచ్ శిక్షాపరిషత్తుకు తీసుకువెళ్ళాడు. అక్కడ మహాసాహసియగు మహిళ గంగాబాయి నాకు కనబడింది. ఆమెకు పెద్దగా చదువురాదు. కాని చదువుకున్న స్త్రీలకంటే మించిన తెలివి, ధైర్యం ఆమెకు వున్నాయి. ఆమె అస్పృశ్యతను కూకటి వ్రేళ్ళతో సహా పెకిలించి పారవేసింది. ఆమె దగ్గర డబ్బుకూడా వున్నది. ఆమె అవసరాలు చాలా తక్కువ. శరీరం బాగా బలంగా కుదిమట్టంగా వున్నది. ఎక్కడికైనా సరే నిర్భయంగా వెళ్లి వస్తుంది. సంకోచించదు. గుర్రం స్వారీకి సిద్ధపడేది. ఈ సోదరితో గోధరా పరిషత్తులో నాకు పరిచయం ఏర్పడింది. నా బాధను ఆమెకు తెలిపాను. దమయంతి ఏవిధంగా నలుడి కోసం తెగతిరిగిందో ఆ విధంగా రాట్నం కోసం తిరిగి దాన్ని తెస్తానని ప్రతిజ్ఞచేసి ఆమె నా నెత్తిన గల బరువును దించినంత పనిచేసింది.