సత్యశోధన/ఐదవభాగం/16. కార్యవిధానం

వికీసోర్స్ నుండి

16. కార్య విధానం

చంపారన్ పరిస్థితుల్ని వివరించడమంటే చంపారన్ రైతుల చరిత్రను వివరించడమే. ఆ వివరాలన్నీ యీ ప్రకరణాలలో పేర్కొనడం సాధ్యం కాదు. చంపారన్‌లో జరిపిన పరిశీలనంతా అహింసా ప్రయోగమే. అందుకు సంబంధించిన వివరాలు అవసరమైనంత వరకే వివరించాను. మొత్తం వివరాలు తెలుసుకోదలచిన పాఠకులు బాబూ రాజేంద్ర ప్రసాద్ యీ సంగ్రామాన్ని గురించి వ్రాసిన గ్రంథం చదవవచ్చును లేక యుగధర్మ్ ప్రెస్ ద్వారా ప్రకటించబడ్డ ఆ గ్రంధపు గుజరాతీ అనువాదం చదవవచ్చు.

ఇక అసలు విషయానికి వద్దాం. గోరఖ్‌బాబుగారి యింటి దగ్గర వుండి నేను యీ పరిశీలనా కార్యక్రమం నిర్వహించియుంటే వారు యిల్లు వదిలి పెట్టి వెళ్లవలసి వచ్చేదే. మోతీహారీలో కిరాయి చెల్లించినా యిల్లు యిచ్చే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. అందుకు భయమే కారణం. కాని ప్రజకిషోర్‌బాబు వ్యవహారదక్షులు. ఆయన అద్దెకు ఒక పెద్ద భవనం సంపాదించారు. మేమంతా ఆ యింటికి వెళ్లాం. అక్కడ డబ్బు లేకుండా పని జరిగే పరిస్థితి లేదు యిటువంటి ప్రజాకార్యక్రమాలకు ప్రజల దగ్గర విరాళాలు తీసుకునే పద్ధతి ప్రారంభం కాలేదు. ప్రజకిషోర్‌బాబు, వారితో బాటు వున్న మిత్రమండలి వారంతా వకీళ్లే. వాళ్లు తమ ఖర్చులు తామే భరిస్తూ. అవసరమైతే మిత్రుల దగ్గర డబ్బు తీసుకోకూడదని నా దృఢనిర్ణయం. వాళ్ల దగ్గర డబ్బు తీసుకుంటే ఉద్యమ అర్థం మారిపోతుందని నా అభిప్రాయం. యీ కార్యక్రమం కోసం దేశప్రజల్ని కూడా డబ్బు అడగకూడదని నా నిర్ణయం. అలా తీసుకుంటే వ్యవహారానికి రాజకీయరంగు పులిమే ప్రమాదం వున్నది. బొంబాయి మిత్రుల నుండి 15 వేల రూపాయలు ఇస్తామని ఒక తంతి వచ్చింది. కృతజ్ఞతలు తెలిపి వాళ్ల కోరికను నిరాకరించాం. బాగా ఆలోచించి చంపారన్ బయటవుండే బీహారుకు చెందిన ధనికుల దగ్గర ప్రజకిషోర్‌బాబు బృందం సాధ్యమైనంత డబ్బు ప్రోగుచేయాలని, లోటుపడితే డాక్టర్ ప్రాణజీవన్‌దాస్ మెహతాగారి దగ్గర డబ్బు తీసుకొని భర్తీ చేస్తానని నేను చెప్పాను. అవసరమైనంత డబ్బు వ్రాసి తెప్పించుకోమని డాక్టర్ మెహతాగారు మొదటే నాకు వ్రాశారు. దానితో డబ్బును గురించి చింత తొలగిపోయింది. తక్కువ డబ్బు ఖర్చు పెట్టి యీ సమస్యను పరిష్కరించాలని మా నిర్ణయం. అందువల్ల ఎక్కువ డబ్బు అవసరం పడలేదు. రెండు లేక మూడు వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బు అవసరం లేదని భావించాను. వసూలు చేసిన డబ్బులో అయిదు వందలో లేక వెయ్యి రూపాయలో మిగిలినట్లు నాకు గుర్తు. ఆ రోజుల్లో మా సహచరుల అలవాట్లు విచిత్రంగా వుండేవి. నేను రూజీవారి ప్రవర్తనను గురించి ఛలోక్తులు విసురుతూ వుండేవాణ్ణి. వకీళ్ళ మండలికి వంట విడివిడిగా తయారవుతూ వుండేది. రాత్రిపూట 12 గంటల వరకు భోజనం చేస్తూ వుండేవారు. ఎవరి ఖర్చు వారు భరించినా నాకు వాళ్ల పద్ధతి నచ్చలేదు. మా అందరి మధ్య స్నేహబంధం గట్టిగా బిగుసుకున్నందున ఎవరెన్ని చెప్పినా, ఎవరేమన్నా మా బంధనం వదులుకాలేదు. నేను విసిరే మాటల బాణాల బాధను నవ్వుతూ వారు సహించేవారు. చివరికి నౌకర్లందరినీ పంపించివేయాలని, భోజన నియమాల్ని అంతా పాటించాలని నిర్ణయం చేశాం. అందరూ శాకాహారులు కారు. రెండు కుంపట్లు ప్రారంభిస్తే ఖర్చు పెరుగుతుంది. అందువల్ల ఒకే కుంపటి వెలగాలని, శాకాహార భోజనం తయారుచేయాలని, భోజనం బహుసాదాగా వుండాలని నిర్ణయించాం. దానితో ఖర్చు బాగా తగ్గిపోయింది, కార్యశక్తి పెరిగింది. సమయం కూడా బాగా కలిసివచ్చింది.

మా పని బాగా పెరిగిపోయింది. రైతులు గుంపులు గుంపులుగా వచ్చి తమ గాధలు వ్రాయించసాగారు. వ్రాసుకునేవారి దగ్గర గుంపులుగా జనం పెరిగిపోయారు. ఇల్లంతా జనంతో నిండిపోయింది. చూడడానికి వచ్చే జనాన్నుంచి నన్ను రక్షించడం కోసం నా సహచరులు ఎంతో శ్రమపడ్డారు. యిక గత్యంతరం లేక సమయం నిర్ధారించి నన్ను బయటకి తీసుకురాసాగారు. ఆరు లేక ఏడుగురు వకీళ్లు రైతులు చేప్పే కధలు రాసుకుంటూ వుండేవారు. అయినా సాయంకాలానికి రాతపని పూర్తి అయ్యేది కాదు. యింతమంది వాఙ్మూలాలు అనవసరం కాని వారు చెప్పింది రాసుకుంటే రైతులు తృప్తిపడతారు. కధలు వ్రాసేవారు కొన్ని నియమాల్ని పాటిస్తూ వుండేవారు. ప్రతి రైతును ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేవారు. సమాధానం సరిగా చెప్పలేని వారి వాఙ్మూలం రాసుకోకూడదనీ నిరాధారమైన కధలు కూడా రాసుకోకూడదనీ నిర్ణయించాం. అందువల్ల యదార్ధమైన గాధలు, ఆధారాలు గల కధలే రాసుకోవడం జరిగింది.

ఈ వాఙ్మూలాలు రాసుకునేటప్పుడు గూఢచారి పోలీసులు తప్పక వుండేవారు. మేము కావాలంటే వాళ్లు ఆగిపోయేవారే. కాని మేము వాళ్లను రానియ్యాలని, వారి విషయంలో వినమ్రంగా వ్యవహరించాలని, అవసరమైన సమాచారం వాళ్ళకు అందజేయాలని నిర్ణయించాం. వాళ్ల కండ్ల ఎదుట రైతులు కధలు చెబుతూ వుండేవారు. యిందువల్ల రైతులకు ధైర్యం వచ్చింది. గూఢచారి పోలీసులంటే జనం విపరీతంగా భయపడుతూ వుండేవారు. వారి భయం పోయింది. వాళ్లు చెప్పే కథల్లో అతిశయోక్తులు తగ్గిపోయాయి. అబద్ధాలు చెబితే పోలీసులు పట్టుకుంటారనే భయంతో రైతులు నిజం చెబుతూవుండేవారు. తెల్లదొరల్ని భయపెట్టి వారిని పారద్రోలడం నా లక్ష్యం కాదు. వారి హృదయాలను జయించాలనే ఉద్దేశ్యంతో నా యీ సంగ్రామం సాగింది. ఫలానా దొరకు వ్యతిరేకంగా వాఙ్మూలాలు వచ్చాయని తెలియగానే జాబులు వ్రాసి వారికి తెలియజేయడమేగాక, వారిని కలిసి మాట్లాడుతూ వుండేవాణ్ణి. తెల్లదొరల బృందాన్ని కలసి వారి సాక్ష్యాలు కూడా సేకరించడం ప్రారంభించాను. వారిలో కొందరు నన్ను అసహ్యించుకునేవారు. కొందరు తటస్థంగా వుండేవారు. కొందరు మంచిగా వ్యవహరించేవారు.