సత్యశోధన/ఐదవభాగం/17. అనుచరులు

వికీసోర్స్ నుండి

17. అనుచరులు

ప్రజకిషోర్‌బాబు మరియు రాజేంద్రబాబుగారలది గొప్ప జోడి. వారిద్దరూ తమ అమితప్రేమచే నన్ను, తాము లేకపోతే ముందుకు సాగలేనంతగా నిర్వీర్యుణ్ణి చేసివేశారు. వారి శిష్యులు లేక అనుచరులు శంభూబాబు, అనుగ్రహబాబు, ధరనీబాబు, రామనవమీ బాబు మొదలగు వకీళ్లు దరిదాపు నా వెంటనే వుండేవారు. యిది బీహారీ సంఘం. రైతుల వాఙ్మూలాలు రాయడం వారి పని. ఆచార్య కృపలానీ మాతో కలవకుండా వుండగలరా? వారు స్వయగా సింధీలే అయినా బీహారులో వుంటూ బీహారీగా మారిపోయారు. వారి వలె ఒక ప్రాంతానికి సంబంధించిన వారు మరో ప్రాంతానికి వెళ్లి అక్కడివారితో కలిసిపోయి, తాము ఆ ప్రాంతంవారిలా మారిపోగలవారు బహుతక్కువ. ఆయన నాకు ద్వారపాలకుని వలె వ్యవహరించారు. చూడటానికి అసంఖ్యాకంగా వస్తున్నవారినుండి నన్ను రక్షించే బాధ్యత వారు వహించారు. అదే తమ జీవన సార్థకత అని భావించారు. ఆయన పరిహాసం చేస్తూ కొందరిని నా దగ్గరకు రాకుండా ఆపివేసేవారు. కొందరిని అహింసాత్మకంగా బెదిరించి ఆపేవారు. రాత్రిపూట ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించి అక్కడివారినందరిని నవ్విస్తూ, గుండెదిటవు లేనివారికి ధైర్యం చెబుతూ వుండేవారు.

మౌలానా మజహరుల్ హక్ నాకు సహాయకులుగా పేరు నమోదు చేయించుకున్నారు. నెలకు రెండు మూడుసార్లు వచ్చిపోతుండేవారు. వెనుకటి రోజుల్లోగల వారి దర్జాకు, ఆడంబరానికి యిప్పటి సాదా జీవనానికి ఎంతో వ్యత్యాసం వున్నది. మా దగ్గరకు వచ్చి మాలో కలిసిపోతూ వుండేవారు, చంపారన్‌లో పనిచేయడం ప్రారంభించిన తరువాత ఈ గ్రామాలలో విద్యాప్రచారం జరిగితే తప్ప ఇవి బాగుపడవనే నిర్ణయానికి వచ్చాము. ఎవరికీ చదువురాదు. పిల్లలు చదువులేక తిరుగుతుండేవారు. తల్లిదండ్రులు రెండు మూడు కాసుల కోసం నీలిమందు పొలాల్లో చచ్చేలా పనిచేస్తూ వుండేవారు. పురుషులకు రోజంతా పనిచేస్తే పది పైసల కూలి. స్త్రీలకు ఆరు పైసల కూలి, పిల్లలకు మూడు పైసల కూలి. నాలుగణాలు తెచ్చుకునే కూలీవాడు గొప్ప అదృష్టవంతుడుగా లెక్కింపబడేవాడు. సహచరులతో చర్చించి మొదట ఆరుగ్రామాల్లో పాఠశాలలు తెరిపించాను. గ్రామ పెద్ద యిల్లు యివ్వాలి. మాష్టారుకు అన్నం పెట్టాలి. మిగతా ఖర్చులు మేము భరించాలి. డబ్బు యివ్వలేదు కాని గ్రామస్తులు ధాన్యం యివ్వగల స్థితిలో వున్నారు. కనుక గింజలు ఇచ్చేందుకు గ్రామస్తులు సిద్ధపడ్డారు. యీ ఉపాధ్యాయులు ఎక్కడి నుండి వస్తారా అని ప్రశ్న బయలుదేరింది. బీహారులో జీతాలు లేకుండా పనిచేసే ఉపాధ్యాయులు లేరు, వున్నా తక్కువే. సామాన్యులైన ఉపాధ్యాయులకు పిల్లల్ని అప్పగించకూడదని నా అభిప్రాయం. ఉపాధ్యాయునికి చదువు రాకపోయినా ఫరవాలేదు గాని శీలవంతుడై వుండాలని గట్టిగా చెప్పాను.

ఇందుకోసం వాలంటీర్లు కావాలని ప్రకటించాను. గంగాధరరావు దేశపాండే నా ప్రకటనకు స్పందించి బాబా సాహెబ్ సామణ్ మరియు పుండలీక్‌ని పంపారు. బొంబాయి నుండి అవంతికాబాయి గోఖలే వచ్చారు. దక్షిణాది నుండి ఆనందీబాయి వచ్చింది. నేను ఛోటేలాలు, సురేంద్రనాధ్, నా చిన్న పిల్లవాడు దేవదాసును పిలిపించాను. మహదేవదేశాయి, నరహరిపారీఖ్ గారలు వచ్చి కలిశారు. మహా దేవదేశాయి భార్య దుర్గాబెన్, నరహరిపారిఖ్ భార్య మణిబెన్ కూడా వచ్చారు. కస్తూరిబాయిని కూడా పిలిపించాను. యింతమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాండ్రు సరిపోతారని భావించాను. శ్రీమతి అవంతికాబాయి, ఆనందీబాయి, చదువుకున్నవారే కానీ మణీబెన్ పారీఖ్, దుర్గాబెన్ దేశాయి గార్లకు కొద్దిగా గుజరాతీ వచ్చు. కస్తూరీబాయికి చదువురానట్లే లెక్క. వీరు పిల్లలకు హిందీ ఎలా నేర్పగలరు? వీరు పిల్లలకు వ్యాకరణం చెప్పనవసరం లేదు, నడవడిక నేర్పితే చాలు. అని వారికి చెప్పాను. వ్రాయడం, చదవడం కంటే వాళ్లకు పారిశుద్ధ్యాన్ని గురించి చెప్పాలి. హిందీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో పెద్ద తేడా లేదని మొదటి తరగతిలో అంకెలు నేర్పమని అందువల్ల నీకు కష్టం ఉండదని చెప్పాను. తత్‌ఫలితంగా మహిళల క్లాసులు బాగా నడిచాయి. మహిళలకు ఆత్మ విశ్వాసం పెరిగింది. వాళ్లు తమ క్లాసులకు ప్రాణం పోశారు. వాళ్లు బాగా పాఠాలు చెప్పారు. యీ సోదరీమణుల ద్వారా గ్రామ మహిళలతో కూడా మాకు బాగా పరిచయం పెరిగింది. నాకు చదువుతో తృప్తి కలుగలేదు. గ్రామాలలో మురికి అధికంగా వున్నది. గ్రామం వీధుల్లో పెంటకుప్పలూ, బావుల దగ్గర బురద, దుర్వాసన యిళ్లముందు భరించలేని పరిస్థితులు. పెద్దలు కూడా పారిశుద్ధ్యాన్ని గరపడం అవసరమని భావించాను. చంపారన్ జనం రోగాలతో బాధపడుతున్నారు. సాధ్యమైనంతవరకు గ్రామ ప్రజలను సరియైన త్రోవకు తేవాలనీ, పారిశుద్ధ్యం నేర్పాలనీ, వారి జీవితంలో ప్రవేశించి కార్యకర్తలు వారికి సేవ చేయాలని నా అభిప్రాయం. యిందుకు డాక్టర్ సహాయం అవసరం. గోఖలేగారి సొసైటీకి చెందిన డాక్టర్ దేవ్ గారిని పంపమని కోరాను. వారికీ నాకూ ప్రేమ సంబంధం ఏర్పడింది. ఆరుమాసాల పాటు వారి సేవ లభించింది. వారి పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పనిచేయవలసి వచ్చింది. తెల్లదొరలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు పనిచేయవలసి వచ్చింది. తెల్లదొరలకు వ్యతిరేకంగా చేయబడుతున్న ఆరోపణల్లో పాల్గొనవద్దని, రాజకీయాల్లో పడవద్దని ఎవరైనా ఆరోపణలు చేసేవారు వస్తే నా దగ్గరకి పంపమని, మీ క్షేత్రం దాటి వెళ్లవద్దని అందరికీ చెప్పాను. చంపారన్‌లో యిట్టి అనుచరుల నియమబద్ధత అత్యద్భుతం. సూచనలను ఉల్లంఘించిన ఉదాహరణ ఒక్కటికూడా లేదు.