శుకసప్తతి/ఎనిమిదవ యుపకథ

వికీసోర్స్ నుండి

తే.

తనదు కథలకుఁ దరళికాతరళనయన
యాదిగాఁగల్గు నంతఃపురాబ్జముఖులు
పుష్పహాసప్రముఖమంత్రిపుంగవులును
వచ్చి యుండుటఁ దెలిసి యవ్వామనయన.

505


మ.

సభవారెల్లను సద్దుమాని వినుఁడీ సర్వంసహామండల
ప్రభుతోఁ దెల్పెద విక్రమార్కనృపచంద్రా సావధానంబుగా
శుభదం బీకథఁ జిత్తగింపవలె నంచుం దెల్పఁ జొచ్చె న్సుర
ర్షభకేళీవనికామరందరసవాచాప్రాచురీచాతురిన్.

506

ఎనిమిదవ యుపకథ

క.

గంధవతీ నామకము వ
సుంధర నొకపురము కరము శోభిలు భాస్వ
త్సైంధవచయాతిపత్రిత
బంధురమణిసౌధకేతుపటపటలం బై.

507


క.

ఆనగరరత్న మేలు
న్మానధనుం డనఁగఁ బరఁగు మానవపతిత
త్సూనుం డభిమానధనా
ఖ్యానవనీయుండు వెలయు నధికప్రజ్ఞన్.

508


తే.

అతఁడు జనకుని వెనుకఁ బట్టాభిషేక
మవధరించి నిజామాత్యులాప్తకోటి
యనుదినంబును విన్నవించిన వివాహ
మొల్ల నని నిస్పృహుండయి యుండె నంత.

509


క.

చనవరు లందఱు నొకనాఁ
డనఘా కల్యాణ మొల్ల ననుకారణమే

మని యడిగిన వారలదెసఁ
గనుఁగొని యభిమానధనుఁ డకల్మషఫణితిన్.

510


క.

ఇట్టిది యడుగనె తగదీ
పట్టున మీ కెఱుక లేక పలుమాటు మొఱల్
వెట్టెదరు గానఁ దెలిపెద
గట్టిగఁ గామినుల నమ్మఁగారాదు మదిన్.

511


క.

పురుషజనవంచనార్థము
సరసిజసంభవుఁడు తనదుసామర్థ్యముచే
నిరుపమముగ నిర్మించెను
దరుణుల మాయోపజీవితాచణగతులన్.

512


తే.

జవ్వనము రాకమునుపె విశ్వప్రపంచ
మంతయును హృద్గత మొనర్చి యడఁచికొందు
రేమి యెఱుఁగని కరణి నహీనబాల్య
చేష్టఁ బ్రకటింతు రవనీరాజీవముఖులు.

513


సీ.

చిన్నారిచన్నుల కన్న మున్నుగఁ దోఁచు
     లోకప్రమోషణలోలచింత
కలికి చూపులవాఁడికన్న మున్నుగ మించు
     గురుజనోజ్జ్వలతృణీకరణపటిమ
కటితటీచక్రంబు కన్న మున్నుగఁ దీఱు
     ననృతవాక్యస్థాపనాత్మశక్తి
చెన్నారు మైమిన్న కన్న మున్నుగఁ బొల్చు
     జనవిస్మయప్రదసాహసంబు


తే.

గాఢచాతుర్యధుర్యతకన్న మున్న
పొడముఁ గంభీరజారసంభోగవాంఛ

కమలముఖులకు యౌవనాగమము కన్న
మున్ను గాఁగల్గు పాపసమూహమెల్ల.

514


క.

టెక్కులు గలవాఁడైనం
జక్కనివాఁడైన రతులఁ జతురుం డైనం
దక్కరు మగనికి నిక్కం
బక్కట జారునికిఁ దక్కినటువలె యువతుల్.

515


క.

మగువలు గరగరనై తగు
మగవానిం జూచి వీఁడు మగఁడైనఁ గదా
తెగుదుఃఖం బనుకొంచుం
దిగఁగాఱుదు రెపుడు నెమ్మది న్వగమిగులన్.

516


సీ.

గజకర్ణముల కింత గల్గినఁ గల్గనీ
     కలికినెమ్మదికి నిల్కడలు లేవు
కమలచూపున కింత గల్గినఁ గల్గనీ
     కాంతనెమ్మదికి నిల్కడలు లేవు
చలదళంబుల కింత గలిగినఁ గల్గనీ
     లలననెమ్మదికి నిల్కడలు లేవు
కారుమించున కింత గల్గినఁ గల్గనీ
     పడఁతినెమ్మదికి నిల్కడలు లేవు


తే.

జలదముల కింత గలిగినఁ గలుగనిమ్ము
కమలనేత్రలమదికి నిల్కడలు లేవు
కావున వధూటికల యిచ్చకంబు లెల్ల
విశ్వసించిన మగవాఁడు వెఱ్ఱివాఁడు.

517


క.

బిసరుహనయనలు మాయా
గ్రసరల్ మఱి వారిపొందు గారాదె కదా

యసమానమనీషాఢ్యులు
వసియింతురె యాఁడుప్రతిమ వ్రాసినయింటన్.

513


క.

కావున వివాహవిచ్యుతి
గావించితి ననుచుఁ బలుకఁగా వార లయో
దేవా సర్వజ్ఞుఁడ విటు
లీవాక్యము లాడవచ్చునే యివ్వేళన్.

519


తే.

ఎంచిచూచిన నూటవెయ్యింట నొకతె
గాక సతు లెల్ల జారసంగమసుఖైక
పరతఁ జెందిన వాన లేకరణిఁ గురియుఁ
బంట లేచందమునఁ బండుఁ బార్థివేంద్ర.

520


క.

ఇలువరుసయు మానుషముం
గలరాజుల యిండ్ల గన్నెకలు పుట్టునెడం
దెలిసిన వరించి మఱివా
రల నగరికిఁ దెచ్చి పెనుపరాదా చాలన్.

521


వ.

అని నిర్బంధించిన నయ్యభిమానధనుం డియ్యకొని సమన్వయమాన్యు లగు రాజన్యుల కన్యాజనంబులం బ్రతీక్షించుచుం బుట్టినయప్పుడ సూతికాగృహంబులు సొచ్చి బాలికాచతుష్టయంబుం బరిగ్రహించి నిజగేహంబునకుం దెచ్చి వియచ్చరపథావరోధిసాలనికరం బగునంతఃపురంబున వేఱువేఱ గృహంబుల నునిచి క్రమక్రమంబున మదసేనయు మంజువాణియు మణిమంజరియు మకరందయు ననునామంబు లిడి పోషింప నొక్కదాదిం గట్టడి సేసి కొండొకకాలంబునకు జవ్వనంబు నివ్వటిల్లిన నవ్వెలందులకు వరుసక్రమంబున

ననుదినంబునుం గామోపభోగంబులం బ్రమోదం బావహిలంజేయుచు నప్రమత్తుండై యుండె నంత.

522


క.

ఆకామిను లధిపతిరతి
నేకట దీఱమి మనోభవేషువితానం
బేకత నొందఁగఁ బరసుర
తాకాంక్షాయత్తచిత్తలై నెవ్వగలన్.

523


సీ.

మగవారిఁ జేయక మము నాఁడువారిఁగా
     నీరీతిఁ బుట్టింప నేల యనుచుఁ
బుట్టించెఁబో సాధుపురుషుతోడుతఁ గూర్ప
     కీక్రూరుతోఁ గూర్ప నేల యనుచుఁ
గూర్చెఁబో పరిపాటి కొంపలోఁ గూల్పక
     నీదుర్గమునఁ ద్రోయ నేల యనుచుఁ
ద్రోచెఁబో దయఁజూచి ఖేచరత్వ మొసంగ
     కీమానుషం బీయ నేల యనుచు


తే.

వారు రేలుఁ బవళ్లు దుర్వారఘోర
కోపమునఁ బల్కెడు దురాపశాపములఁ బ
యోరుహాసనుఁ డేమిగాకునికి పలుకు
టువిద తాటంకకరణముహూర్తమహిమ.

524


తే.

వార లీరీతి నుండ దుర్వారచోర
గతులఁ బ్రతిగన్నవాఁ డొక్కకన్నగాఁడు
కార్యసాధకుఁ డనుపేరు గలుగువాఁడు
నాఁడు తత్పురికాళికావసతిఁ జేరి.

525


క.

ఈ రాజు నగరికలిమి కు
బేరునిబొక్కసముకన్న పెట్టినధన మ

వ్వారిగ దొరకు న్మద్గృహ
దారిద్ర్యం బపుడు గాని తలఁగ దటంచున్.

526


క.

రే లెవ్వరు గనకుండఁగఁ
గాళీదేవిం బెకల్చి కడ నుంచి తదా
లీలస్థానము మొదలుగఁ
దాలిమితో నేల మాలెఁ ద్రవ్వఁగఁ దొడఁగెన్.

527


క.

పగలెల్లఁ గాళిక న్మె
చ్చుగ బిలముఖమున నమర్చుచు న్వాఁ డొకనా
లుగు దినములలో నరపతి
నగ రంటఁగఁ ద్రవ్వెఁ దెగువ నాటుకొనంగన్.

528


తే.

ఇదియె ధనమున్న గృహమని యెంచి యచట
నిర్గమద్వార మెడలించి నెమ్మి వెడలి
దైవవశమున మదనసేనావధూటి
పడుకయిల్లౌట నిలిచి విభ్రాంతుఁ డగుచు.

529


ఉ.

పానుపుమీఁదఁ గెందలిరుబాకువజీరుని బాహువైభవ
శ్రీనిధియైన యమ్మదనసేనఁ గనుంగొని పొంగి నాకుఁ జే
కానుక చేసె నీ నృపతికొమిని నాదగు భాగ్య మెంత సొ
మ్మైన నదేల దీని బిగువారెడు కౌఁగిటఁ జేరఁ గల్గినన్.

530


చ.

అని తలపోయ వాని పొలు పద్దిరపాటునఁ జూచి విస్మయం
బనుపమలీల దొట్టిన భయంబును జిల్లరసేయ వాని నె
ల్లను గడఁ ద్రోచి యీపురుషలాభము దైవము గూర్చె నంచు మిం
చిన తమి యాన నమ్మదనసేన మనోభవదూయమానయై.

531


ఉ.

గ్రక్కునఁ గౌఁగిలించి తలఁకన్వల దెవ్వఁడవైన నేమి నా
చిక్కని గబ్బిగుబ్బలకుఁ జిక్కితి వెక్కడఁ బోవ వచ్చు నా

యక్కఱ దీర్పవచ్చిన లతాంతకృపాణివి నీవె నీకు నే
డక్కితినంచుఁ బ్రేమనిగుడం బువుపాన్పునఁ జేర్చి యచ్చటన్.

532


క.

అనిరోధచుంబితాధర
మనివార్యోపర్యధఃక్రియానిష్కరణం
బనితరపూర్ణానందం
బనఁదగు రతి నవ్వధూటి యతనిం గలసెన్.

533


తే.

కలసి యిట్టు లలభ్యయోగంబు దొరకె
ననుచు వెఱగంది యిట కెట్టు లరుగుదెంచి
తెవ్వఁడవు నీవు నీకుఁ బే రేమి యనుచు
నడిగి యంతయుఁ దెలిసి నెయ్యమున మఱియు.

534


క.

తనురాజు చెట్టఁబట్టిన
యనువుం జిరకాలకాంక్షితాన్యజనాలిం
గనతయును దెలిపి యది నేఁ
డొనఁగూడె న్నిన్నువంటి యొఱపఱి కతనన్.

535


తే.

రాజకులవర్యుఁ డాత్మభార్యాచతుష్క
నిలయముల వర్సవెంబడి నిద్రసలుపు
నాతఁ డిటు రానిదినములయందు వచ్చి
యిచట సంభోగ మొసఁగి న న్నేలుకొనుము.

536


మ.

అని ప్రార్థించినఁ గార్యసాధకుఁ డమందానందముం జెంది చం
దనగంధీ యనుబంధి నైతిఁగద నీతారుణ్యవిస్ఫూర్తికై
న నగమ్యం బిది యిందు రా వెఱతు నుండన్వచ్చుఁ గాళీనికే
తనసీమం దిన మీవు మత్కృతబిలద్వారంబున న్వచ్చినన్.

537


చ.

అన విని పొంగి యామృదుతరాంగితరంగితసంభ్రమాప్తి నా
యన వెనువెంటఁ దత్కృతబిలాధ్వగతిన్ ఘనసాధ్వసప్రదం

బనఁజను కాళికాగృహగుహాంతరభాగముఁ జేరి చీఁకటుల్
పెనఁగొనఁ దూర్పుమూల రతిలీలలఁ జారుని గూడి వేడుకన్.

538


క.

బిలమార్గంబునఁ గ్రమ్మఱ
నిలయము సేరంగఁ జని ఘనీకృతమోహా
కుల మొరు లెఱుఁగనికైవడి
నలచోరుని విడక యాలతాంగి మెలంగెన్.

539


క.

అని యాబాలసరస్వతి
జనపతికిం దెలిపె నని రసస్థితి మిగులం
గనఁబడఁ గీరము నొడువఁగ
దినకరునిరథంబు తూర్పుదిక్తటి దోఁచెన్.

540


క.

అంతఁ బ్రభావతి తనయ
భ్యంతరమందిరముఁ జెంది యారేయి ధరా
కాంతుని జేరుట కాత్మో
పాంతమునం గులుకఁ జిలుక యల్లనఁ బలుకున్.

541


క.

వినవమ్మ విక్రమార్కుం
డనుపమవిస్మయముఁ జెంది యవ్వలికథ యే
యనువున నడ నొ చెపుమా
యన సచివునితనయ సవినయంబుగఁ బలికెన్.

542


తే.

మహిప యంతట నయ్యభిమానధనుని
రెండవసుపాణి మకునికూరిమి పటాణి
మంజువాణి మనోవ్యథ మగకఱవునఁ
బడినగతినుండఁ దత్పురప్రాంతసీమ.

543


తే.

ఏటిదరి నొక్కసన్న్యాసి యింపునింపు
మఠము గావించుకొని శాస్త్రమంత్ర తంత్ర

వేదవేదాంతవిద్బ్రహ్మవేతృగరిమ
నితని కెన లేదనఁగ వార్త కెక్కి వెలయు.

544


తే.

త్రిషవణస్నానములు నిష్టదేవపూజ
గ్రంథపారాయణముఁ బరబ్రహ్మచింత
భైక్షభుక్తిహరీతకీభక్షణంబు
నజినశయనంబుఁ గల్గి యయ్యతి వొసంగు.

545


క.

ఆసమయంబున భృగుఁడను
భూసురుఁ డొకఁ డొక్కకార్యమునకై తమితో
నాసన్న్యాసికి నంతే
వాసిత్వము మెఱయఁగా ధ్రువంబున మెలఁగున్.

546


సీ.

ముదముతో యతికన్న మున్న మేల్కని గోమ
    యంబున మఠ మెల్ల నలికివైచు
దపసి యేటికిఁ బోవుతఱి నంటి వెంటనె
    నడచు నాతనికమండలువుఁ దాల్చి
సన్న్యాసి దేవపూజకుఁ బూనుచో నుప
    కరణము ల్దొలిచి శీఘ్రమున నొసఁగు
సంయమీశ్వరుఁడు భిక్షకుఁ బోవునెడ గోచి
    యును నార్ద్రపటఖండ మొనరఁదాల్చుఁ


తే.

బారికాంక్షికి నజినంబుఁ బఱచి రాత్రి
పరమశుద్ధాంతరంగుఁడై పదము లొత్తు
నెలమి యమ్మౌనికలలోనఁ బిలిచె నేని
స్వామి పనియేమి యనుచు హస్తములు మొగుచు.

547


క.

ఈరీతి నుండ నాతని
మేరకు నొకనాఁడు మిగుల మెచ్చి యతీంద్రుం

డోరీ యలరితి నిచ్చెద
గారవమున నడుగు మేమి కావలె ననినన్.

548


తే.

ఆతఁడు ప్రణమిల్లి పల్కు సంయమివరేణ్య
విన్నప మొనర్ప వెఱతు నావెఱ్ఱితనము
ముద్దుగాఁ జూచు కరుణాసముద్రమూర్తి
వగుటఁ దెల్పెద నాకోర్కి యాదరింపు.

549


ఉ.

మాపొరుగింటి శూద్రుని కుమారిక పిన్నటనాఁటనుండియు
న్నాపయిఁ బ్రేమఁగన్నది యనంతర మొక్కఁడు పెండ్లియాడి వాఁ
డీపురిలోన నిల్వెడలనీక పరుం డటు సేరకుండ సం
జ్ఞాపరుఁ డౌచు దాని ననిశంబును నేలెఁడు సంయమీశ్వరా.

550


సీ.

ఉదుటుతో నారాక కెదురుచూచుచు ముద్దు
    గాఱఁగా నది నిల్చుకడపఁ జూచి
ననుఁ జూడఁగోరి క్రొన్ననతీవనడియాడు
    విధమున నది కుల్కు వీథిఁ జూచి
నీటికై వచ్చుట నెపముగ నాతోడఁ
    బలుకుచు నది చెందు బాళిఁ జూచి
తమవారి మొఱఁగి తత్తరము హత్తగ వచ్చి
    యది నన్ను గలయు పూఁబొదలఁ జూచి


తే.

యేను భరియింపలేక మీకృప సమాశ్ర
యించి యున్నాఁడ నన్ను నీ డేర్పవయ్య
యార్తరక్షణ మఖిలపుణ్యముగదయ్య
కూర్మి నెటులైన నను దానిఁ గూర్పవయ్య.

551


తే.

అనినఁ జిఱునవ్వు నవ్వి యయ్యతికు లేంద్రుఁ
డౌర మన్మథు నిజమాయకడ్డ మెవ్వ

రంబుజాసనముఖులలో ననుచు నతని
జేరువకుఁ బిల్చి యొకవేరు చేతికిచ్చి.

552


క.

ఇది త్రొక్కినఁ జనవచ్చు
న్మదిఁ దలచినచోటి కభ్రమార్గంబున న
మ్మదవతిఁ గలసెదు పోపొ
మ్మెద సందియ మెడలి రాత్రి కేగు మటన్నన్.

553


మ.

భృగుఁ డారేయిఁ దదౌషధాప్తిమహీతాంఘ్రిద్వంద్వుఁడై పోయి య
భ్రగతిం దగ్గృహసీమ డిగ్గి మరు బాబాఁబోలునాబాలతో
నగణేయాదృతిఁ గూడి క్రమ్మఱి యతం డాకైవడి న్రేలు త
న్మృగనేత్రామణిపొందుఁ బాయక యతిప్రీతాంతరంగంబునన్.

554


క.

ఆమూలికపై దానివి
ధ మ్మదివ్రాసినపసిండి దగడుపొదివి ప్రా
ణమ్మువలె దాఁచికొని మఱి
యెమ్మెయిఁ గర్జములదాని నేమఱకుండెన్.

555


క.

అంత నొకనాఁ డతండు పు
రాంతిక నదిఁ జేర నరిగి యమ్మూలికఁ ద
త్ప్రాంతమున నుంచి దైవా
క్రాంతమతిం డిగ్గి యొడలు కడిగికొనంగన్.

556


తే.

రాజశుద్ధాంతపుషితమరాళ మొకటి
యరుణపద్మదళభ్రాంతి నచటనున్న
మూలిక గ్రహించి యవరోధమునకుఁ జనియె
భృగుఁడు తదభావమునకు నెవ్వగలఁబొగిలె.

557

ఉ.

అంతట నమ్మరాళము విహారమహారతి మంజువాణిగే
హాంతరసీమ వైచినఁ దదౌషధముం గొని యవ్వధూటి వి
భ్రాంతతఁ జెంది దానిపయి బంగరుఱేకున వ్రాసియున్న య
త్యంతపరిస్ఫుటాక్షరచయంబుఁ బఠించి ప్రమోదమగ్నయై.

558


క.

ఇది త్రొక్కినఁ జనవచ్చు
న్మదిఁ దలఁచినచోటి కభ్రమార్గంబున నం
చొదవిన యాలిపియున్నది
గద దేవునికరుణ మెచ్చఁగావలె ననుచున్.

559


వ.

తలంచి బహుకాలాభిలాషితం బగు పరపురుషసంగమం బనుభూతం బైన భంగింబొంగి మనోరథపరంపరాక్రమితదినావసాననిశాసమయంబున రాజకుంజరుండు మణిమంజరీమందిరగతుం డగుట యెఱింగి యక్కురంగనయన తనముంగిట నిల్చి పదాంగుష్ఠంబులన నయ్యౌషధమూలం బవలంబించి కాళికాగృహంబున కరుగవలయునని తలంచి నిరాధారంబగు గగనాంగణంబున కెగిరి దైవవశంబునం గాళీనికేతనద్వారంబున మొగులుతగులు దిగనాడి యరుగుదెంచిన మెఱుంగుతెఱంగున వ్రాలి కేళికాగతుల మెలంగు నవసరంబున.

560


క.

పరనగరరాజసుతుఁ డొ
క్కరుఁ డప్పురమునకు నాత్మకార్యంబునకై
యరుదెంచి యునికి నిజ
తామరసేక్షణఁ దలఁచి యతఁడు మన్మథవశుఁడై.

561


తే.

నిదురగానక యొకచోట నిలువలేక
వీథిఁ గ్రుమ్మరుచుండి యవ్వేళ నటకు

వచ్చి మరులచ్చివంటి యమ్మచ్చెకంటి
మెచ్చి మరు లెచ్చి యంటిన మెలఁతతోడ.

562


తే.

పలుకరించి తదాకారభాషణాది
కముల శుద్ధాంతకామినిఁ గాఁగఁ దెలిసి
యళికి తలఁకిన నాతనితలఁ పెరింగి
యానృపాంగన వేగ డాయంగనరిగి.

563


ఉ.

ప్రేమగనంబడం బలుకరించినవాఁడవు పోదువా యయో
నామగవాఁడ లెస్స నిను నమ్మితి రమ్మని పిల్చి కాళికా
ధామమునం బ్రతీచికడఁ దాను నతండుఁ బ్రసూనబాణసం
గ్రామవినోదకేళి సరిగాఁగఁ బెనంగి యనంతరంబునన్.

564


తే.

తనచరిత్రంబు నుడివి యాతనివిధంబుఁ
దెలిసి యిఁకమీఁద రాత్రులు దినదినంబు
నిచ్చటికి రమ్ము తఱియైన నేను వత్తు
ననుచు వొడఁబాటు చేసి యవ్వనిత సనియె.

565


క.

చని నాఁడు మొదలుగాఁ బ
ర్వినతమితో నజ్జయైనవేళల నృపనం
దనుపొందు నడుపుచుండెన్
ఘనతరమునిదత్తమూలికామహిమమునన్.

566


చ.

అని సచివేంద్రనందన ధరాధిపుతో వినిపించెనంచుఁ జెం
దిన నెఱునేర్పుతోఁ జిలుక తెల్పఁ బ్రభాతముగాఁ బ్రభావతీ
వనరుహగంధి యంతట నివాసముఁ జేరి దినావసానసం
జనితకుతూహలాప్తి నృపచంద్రునిదూతిక వెంటవచ్చినన్.

567


క.

శుక మిట్లను వినవమ్మా
సకియా యలవిక్రమార్క జనవరుఁడు దద

గ్రకథావిధ మడుగ న్మం
త్రికుమారి మనంబు గొలుపఁ దెలుపందొఁడగెన్.

568


తే.

దేవ యభిమానధనుని తృతీయభార్య
యైనమణిమంజరీహంసయాన తనదు
ప్రాయమెల్లను గోర్కులపాలు చేసి
యుపపతిక్రీడ కేకారుచున్న యంత.

569


క.

ధరపై నిగమావతియను
పురమునఁ గ్రూరుఁడను నామమున నొకశూద్రుం
డరివరనికరభయంకర
కరకరవాలాంకుఁడై జగన్నుతిఁ గాంచున్.

570


క.

ఆతనికిఁ జపల యనఁగాఁ
గాతరమృగనయన యొకతె గల దది మదిలో
నీతి గణింపక జార
వ్రాతములకు హృదయ మిచ్చి వర్తిల్లుటయున్.

571


తే.

ఆతఁ డది యెఱింగి కామినీహత్య కళికి
యాలిఁ దోడ్కొని పరభూమి కరుగుబుద్ధి
గంధవతిచెంత కరుదేరఁ గతిపయప్ర
యాణముల నంత నచ్చపలాబ్జనయన.

572


ఉ.

వీఁ డిఁక నెన్నిదేశములవెంబడిఁ ద్రిప్పునొ యేమి చేయను
న్నాఁడొకొ కా దటంచు జతనంబునఁ గన్ను మొఱంగిపోయిన
న్వాఁడిమి వెంటనే వెదకవచ్చుఁగదా యెటులైన నీతనిం
బోఁడిమి మాన్చికాని మఱిపోదఁగదంచు విచారఖిన్నయై.

573

క.

పెదవులు తడుపుచుఁ బదములు
గుదిగొనఁగా నొక్కచోటఁ గూర్చుండి యయో
హృదయేశ యెచటి కీడ్చెదొ
కద నాకుం దప్పి వశముగా దని పలుకన్.

574


తే.

అతఁడు చోరభయంబున నవ్వధూటి
మేనిసొమ్ములు తనయొడిలోన డాఁచి
నీరపాత్రంబుఁ గైకొని నెమకఁ జనియె
హ్రదనదీకూపముఖ్యంబు లంతలోన.

575


మ.

ఒక శూద్రుం డభిరామనాముఁ డొకయుద్యోగంబుపై వచ్చి య
మ్ముకురాస్యం గని యొంటినున్న దిది యేమో యంచు మాటాడనిం
చుక శంకించినఁ జేరఁబిల్చి తన యస్తోకవ్యథం దెల్పి య
వ్వికచాంభోరుహగంధి వాని మది యువ్విళ్లూరఁగాఁ జేయుచున్.

576


తే.

నీకు నామీఁదఁ గోర్కి జన్మించెనేని
కాఁపురమునకు నుండెదఁ గాని యిటకు
వచ్చు జలములు గొనుచు నావరుఁడు వాని
మొఱఁగిపోయిన వెదకుచు నరుగుదెంచు.

577


తే.

కూలికీలారికం బందుఁ గొంటువానిఁ
జెనకి నిర్జించిపోవ నీచేతఁ గూడ
దట్టు గావున నిట్లు సేయంగవలయు
నని యుపాయంబుఁ జెప్పిన యంతలోన.

578


ఉ.

క్రూరుఁడు నీళ్లుఁ గొంచు నటకుం జనుదెంచినఁ దత్ప్రఫుల్లనీ
రేరుహనేత్ర దప్పి యొకరీతి నడంచిన యట్లు చేసి యీ
యూరికిఁ బోయి నేఁ డిచట నుండుదమా యని మువ్వురు న్రయో

దారత నేగి గంధవతిఁ దద్దయు మెచ్చుచు వచ్చుచు న్నెడన్.

579


క.

ఆరమణియు నభిరాముఁడు
గ్రూరుని నిరువంకఁ బెట్టుకొని యయ్యో యీ
యూరికి దొర లేడా యీ
చోరుని దండింప ననుచు స్రుక్కక కూయన్.

580


క.

ఆమాటవిని తలారు ల
దేమని గద్దింప నామృగేక్షణ రొదగా
నామగఁ డితఁడని యయ్యభి
రాముని వెసఁజూపి నిబ్బరంబునఁ బలికెన్.

581


తే.

ఆలుమగఁడును నియ్యూరి యఱుత నిలిచి
చలిది భుజియింప నాసొమ్ము సంగ్రహించె
గొట్టుసేయక వీనిఁ జూపట్టుకొనుచు
నిచ్చటికిఁ దెచ్చితిమి పట్టుఁ డిప్పు డితని.

582


వ.

అనిన విని యన్నగరరక్షకు లాక్షేపపూర్వకంబుగా నతనిం
బట్టుకొని బాధించి శోధించి యొడిలోని యాభరణములం గనుంగొని దొంగయగు నని నిశ్చయించి యభిమానధనున కెఱింగించి మూఁడుత్తరువులు గైకొని నిజకామినీకుహనసంజనితవిస్మయాదృతప్రత్యుత్తరుం డగు నతని వధియించి యమ్మండనంబు లిచ్చినం జపలాభిరాములు సంపూర్ణకాములై యథేచ్ఛ నరిగి రాక్రూరుండును నన్యాయహతుం డయ్యెం గావునం బిశాచంబై యాచారవంతులం గని తలంగంబాఱుచు మాంత్రికులం గని గడగడ వడంకుచు నాయుధహస్తులం జూచి యేచినభయంబునుం బొందుచు భైర

వాజ్ఞావశుండై యాహారంబుఁ గొనంగానక వెఱచినవారి వెంటంబడి తదీయజనప్రకల్పితరాత్రి కాననంబుల నుద్దండతరజఠరానలంబున శృంగాటకంబులఁ గాఁపుగరిత లగ్గలంబుగా భగ్గునం దరికొన బలియర్పించు పొంగళ్లవలనం గొంతకొంత సంతసించుచు నిడుమలకుం గడగానక యప్పట్టనంబున నెట్టుకొని యున్నవాఁ డగుటం జేసి యతం డొక్కనాఁడు.

583


క.

నరపతికిం గానుకగా
విరిపొట్లము గొనుచు నొకఁడు వీథింజనుచో
గురుతర మగు సురుచిరత
త్పరిమళముల వెంటనంటి పాయక చనియెన్.

584


ఉ.

భూపతి యంత నవ్విరులపొట్లముఁ గైకొని కొల్వు దీఱి క్రీ
డాసరమైన బాళి నిగుడ న్వెస నంతిపురంబుఁ జేరి కొ
మ్మాపువుఁబోణి యంచు మణిమంజరి కిచ్చి తదీయమన్మథో
ద్దీపితకేళిఁ దేలి పొడతెంచు రవిం గని లేచిపోయినన్.

585


క.

ఆకమలనయన పరసుర
తాకాంతుల్ నిగుడ నెవ్వఁడైనను మగవాఁ
డీకడకు వచ్చి కోరిక
నాకొనగూర్చునని నెమ్మనంబునఁ దలఁపన్.

586


క.

క్రూరుం డప్పుడు తనయా
కారముతో నిలిచి యళుకుగాంచినదానిం
జేరంగ నరిగి వెఱవకు
మోరమణీ వినుము మన్మహోదంతంబున్.

587

చ.

అని నిజభార్య చేసిన యపాయమునం దనకట్లు సంభవిం
చిన యశరీరితాస్థితులు చెప్పి యిఁకం జఠరానలంబుచే
తను నెరియం దొడంగె వనితా యిపుడన్నము వెట్టితేని నీ
పనిచిన పంపుఁ జేసెద శుభంబగు నీకని మ్రొక్కి వేఁడినన్.

588


క.

అమ్మగువ చపలఁ గూరిచి
యమ్మా భువినాఁటదాన వైన న్నీచే
యమ్మహితసాహసము నా
కిమ్మా నాకోర్కు లెల్ల నీడేఱుటకున్.

589


క.

అని మెచ్చి క్రూరునిం గనుఁ
గొని వాహన మగుచు నన్నుఁ గొని చనఁగలవా
మనమునఁ దలఁచినచోటికి
దినదినము న్నీకు మంచితిండి ఘటింతున్.

590


తే.

అనిన నిను మోచికొనుట భాగ్యంబుగాదె
బ్రతికితినటంచు వాఁ డొడఁబడినఁ జూచి
యబల బోనంబు వాని కాహార మిచ్చి
తోయజానన యద్దమరేయివేళ.

591


క.

పతి మకరందాగృహసం
గతిఁ గాంచుట దెలిసి గగనగమనక్రూరో
ద్ధతవాహనయై విజన
క్షితి దలఁచుటఁ జనియె కాళిగేహము చేరన్.

592


క.

చని వాహనంబు డిగి య
వ్వనితామణి పథికుఁడైన వైశ్యుని నొకనిం
గని తనవర్తన మంతయు
వినిపించి తదీయకథలు విని మోదమునన్.

593

తే.

అతఁడు దానును గాళిగేహంబులోన
దక్షిణపుమూల రతికేళిఁ దనివినొంది
యనుదినము నాతఁ డటువచ్చునట్లు చేసి
పోయి యాలీల మెలఁగె సప్పొలఁతి మఱియు.

594


మ.

అని రాజన్యున కయ్యమాత్యసుత నిత్యప్రౌఢవాగ్రూఢిఁ దె
ల్పెనటంచున్ శుకరాజు పల్కునెడ నాళికాప్తభానుప్రభల్
దనర న్వైశ్యవధూటి యంత రనిశాంతం బొంది యారాత్రి య
మ్మనుజేంద్రాత్మజుపొందుఁ జెందఁ జనుప్రేమ న్ముంగల న్నిల్చినన్.

595


క.

కని చిలుక నేఁట మాత్రమె
విను మమ్మంత్రిసుత భూమివిభుతో మును జె
ప్పినకథ ఱేపటికిఁ గథల్
వినిపించిన నరఁటిపండ్ల వేయుము చెలియా.

596


వ.

అనినవ్వించి యాజవ్వనితో నవ్విహంగమపుంగవం బిట్లనియె.

597


క.

అంత నలవిక్రమార్కు డ
నంతరకథ యడుగ మంత్రినందన నవవా
నంతసమయప్రమోదా
క్రాంతవికస్వరపికస్వరంబునఁ బలికెన్.

598


తే.

మానవాధీశ యయ్యభిమానధనుని
నాలుగవకొమ్మ కమ్మకుందనపుబొమ్మ
యైన మకరంద యిచ్ఛావిహార మంద
సందు గానక మందచంచలతఁ జెంది.

599


సీ.

నిలనీని వంటవార్పుల నత్తమామల
     పోరును లేని కాఁపురము గలిగె

నెచటనుండిన నింట నేమనువారులే
     కింపుపొంపు ఘటిల్లు నిల్లుగలిగె
రేలువగల్పట్టి పాలార్పకొకవేళ
     తగ వెంచి చనుదెంచు మగఁడు గలిగె
వలసినయట్టు లవ్వారిగా సారక
     స్తూరికాముఖ్యవస్తువులు గలిగె


తే.

నెన్ని గలిగిన నేమి నాయిచ్చలోని
యాస గడతేఱ జారవిహారసుఖము
సంభవించ దటంచుఁ గాంక్షావిశేష
పరవశస్వాంత యగుచుఁ బాపంబుఁ జెంద.

600


మ.

ఒకనాఁ డాత్మనిశాంతసౌధలసమానోద్యానవీక్షాసము
త్సుకయై పోయి తదంతరంబున మణిస్తోమాతిథామాతిరం
జకమై యుప్పరమంటు చప్పరమున న్సౌవర్ణడోలావిలో
లకుఁడై నిల్చిన యొక్కసిద్ధుఁ గని చాల న్విస్మయం బందుచున్.

601


క.

జారవిహారంబునకే
కారెడు నాకోర్కిఁ దీర్పఁగా వచ్చిన య
మ్మారుఁడె యితఁడని యచ్చెలి
చేరం జని చూపువలపు చేఁతలఁ దెలుపన్.

602


క.

నిలిచిన నతఁడా సతికిం
గలకోర్కి యెఱింగి మమ్ముఁ గామింపకుమీ
యిలచూడఁగవచ్చిన సి
ద్ధుల మతనునితూపు మనసుఁ దూఱదు మాకున్.

603


ఉ.

ఇందు మనోహరంబయిన యివ్వనవాటిక చూచినప్పుడే
డెందము మమ్ము నిల్ప నిట డిగ్గితి మిప్పుడ పోవలెం జిదా

నందవిభూతిగల్గ లలనాజనసంగమసౌఖ్య మేల ర
మ్మిందునిభాస్య నీమది యభీష్టము సేకుఱునట్లు చేసెదన్.

604


క.

అని చేరఁబిలిచి కర్ణం
బున నొకమంత్రంబు నుడివి పూఁబోఁడి మనం
బున నీది జపింపు మింక గ
గనగమనము గల్గు నీదుకాంక్షలు తీరున్.

605


చ.

అని కరుణించి సిద్ధుఁడు వియత్పథజాంఘికుఁ డైన మెచ్చి య
వ్వనిత విభాకరుం డపరవార్ధిఁ బడ న్మణిమంజరీగృహం
బునకు నిజేశ్వరుం డరుగుపూఁట యటంచును నిశ్చయించి య
మ్మనువు జపించి విష్ణుపదమార్గమునం జనియె న్రయంబునన్.

606


క.

చని తత్కాళీగేహం
బున నొకమగనాలికూటమునకై కనుగూ
ర్కనియొక్కజారుతో నిం
పునఁ బొదలుచు నుత్తరంపుమూల రమించెన్.

607


తే.

అనుదినము వేళయైనప్పు డవ్వధూటి
యటకుఁ దా వచ్చునట్లుగా నతఁడు వచ్చు
నట్లుగాఁ జేసి యట్టుల నతనిపొందు
విడువఁజాలక మెలఁగెఁ బూవిలుతునాజ్ఞ.

608


చ.

మనుజకులేంద్ర యంత నభిమానధనుం డొకనాఁటిరేయిఁ గాం
చనరుచివారము ల్గలహజారమునం గొలువున్కిఁ జేసి య
వ్వనితలు నల్వురు న్మునుపు వచ్చుక్రమంబున వచ్చి కాళికా
ఘనగృహసీమఁ జేరి రతిఁ గాంచుచునుండిరి నాల్గుమూలలన్.

609


క.

అంతట నభిమానధనుం
డాంతరమునఁ గాళికాపదాంబుజసేవా

నంతరతి వొడమ నుడిగపు
టింతులతోఁ గొలువు దీరి యేతెంచుటయున్.

610


క.

వచ్చిన దివ్వటివెలుఁగున
నచ్చెలువలు నాథుఁ జూచి రాతఁడుఁ గనియెం
దచ్చపలాక్షులఁ గనుఁగొని
యిచ్చమహాశ్చర్యసమభివృతముగ నిలువన్.

611


క.

తరుణులు నలువురు నపుడొం
డొరులచరిత్రంబు లెఱిఁగి యొదవినభయము
న్నిరసించి యొకయుపాయము
దొరకొన విభుఁ జేరి ధైర్యధుర్యాత్మకలై.

612


వ.

కట్టెదుట నిలువంబడి కాళికాపదాంబుజంబులు భజియింప నింపునం జనుదెంచిన యక్షకమలాక్షుల మిన్నలువురము మదీయనాయకులు నేమును ననుదినంబు నిశాసమయంబున నిచ్చటికి వచ్చి పోవుదుము. మాకు నతీతానాగతవర్తమానంబులు తెలియుట కడుగం బనిలే దింత యేల నీయంతరంగంబున భవదీయభార్యాసౌందర్యవిశేషభాషణాదులు మాయందుఁ దోఁచుటం జేసి సందియంబు కందళించినది కావున నింతయుం దెలుపవలసె నచ్చెలువలు మాయంశంబున జనియించినవారలు కావున మాపోలికలు వారికిం గలిగియుండు నయ్యండజయానలకు శుభంబుఁ
గోరికదా యేతన్మహాశాంకరీపదపంకజారాధనకు ననురాత్రంబు నరుగుదెంతు మిందు రమ్మని యిందుధరసుందరీసమీపంబునకు దోడ్కొనిపోయి నిర్మాల్యప్రసాదంబుగా విభూతి యొసంగి నీయంగనల సద్ధర్మంబుగా నేలి మామనంబులు

చల్లఁ జేయుమని యనిపిన నజ్జననాథుండును నేమియుం బలుకవెఱచి యూరక వెడలె నప్పుడు.

613


క.

అచ్చపలాక్షు లతిత్వర
వచ్చి నివాసముల నిలువ వసుధేశ్వరుఁడున్
ఱిచ్చపడుమనముతో వెస
నచ్చటికి న్వచ్చి వారినందఱఁ జూచెన్.

614


తే.

చూచి మనమున మిక్కిలి చోద్యమంది
వార లొనరించు నతులోపచారసరణిఁ
దేలి తజ్జాలసంసక్తిఁ దెలియలేక
యధికతరమైన ప్రేమతో నాదరించె.

615


ఉ.

మానవనాథ యిట్టియభిమానధనుం డెఱుఁగంగఁజాలెనే
యానలినాయతాక్షులదురాచరణం బది యట్టులే సుమా
యేనరుఁడైన నిట్టి వెత లించుక యైన నెఱుంగఁ డింతటన్
మానసవీథిఁ జూచుకొనుమా యిఁకఁ దెల్పఁగ నేర మేమియున్.

616


తే.

అనుచు బాలసరస్వతీవనిత విక్ర
మర్కుతోఁ దెల్పెననుచు శుకాగ్రగణ్యుఁ
డలప్రభావతి కెఱిఁగించునంతలో శ
కుంతములు మేఁతలకుఁ దమగూళ్ళు వెడలె.

617


తే.

అంతటఁ బ్రభావతీకమలాయతాక్షి
యాత్మకేళీగృహంబున కరిగి నాఁటి
రేయి నృపుపొందుఁ గోరి చేరిన మనోజు
తేజి యిట్లను దియ్యనితేనె లొలుక.

618

క.

నేఁటికథ చిత్రతర మో
బోటీ వినవమ్మ మంత్రిపుంగవసుత య
ప్పాటిం దెలిపిన నాదొర
నాటినచింతాభరంబున న్మన మగలన్.

619


తే.

కొంతతడవుండి యందు నొక్కింతయేని
దెలియ నే యెక్కడిపరాకు పలుకుమనుచుఁ
గదళికాకాంత పైఁజేతి కమ్మవిరుల
చెండు వైచినఁ దత్సతీసరసిజాక్షి.

620


తే.

సొమ్మసిలినట్లు వ్రాలినఁ జూచి విక్ర
మార్కభూపాలవరుఁడు హాహానినాదుఁ
డగుచు విలపింపఁ జని వయస్యాజనంబు
శీతలక్రియ లొనరింప సేదఁడేఱె.

621


చ.

అదిగని పుష్పహాసుఁ డహహా యని నవ్వఁ బ్రసూనవర్షమ
భ్యుదయము గాఁగ నంతట విభుండు కనుంగొని తీవ్రతోపుఁడై
యదయుఁడ వింతెకాక యొకయప్పుడు నవ్వనివాఁడ విప్పుడీ
మదవతి పుష్పపాతమున మ్రాన్పడిన న్వడి నవ్వ నేటికిన్.

622


చ.

అనవిని యయ్యమాత్యుఁడు ధరాధిప మున్నొకయద్భుతంబు నేఁ
గనుఁగొనఁగంటిఁగాన బహుకాలము తద్వ్యథం గుంది యున్కి నే
పనులకు నవ్వకుండితి సభాస్థలి నే డొకయద్భుతంబుఁ జూ
చినకత నన్మనంబు వికసించిన నవ్వితిఁ జిత్తగింపుమా.

623


తే.

అధిప యీయమ్మవారు మర్యాదపోవ
విడిచి నగరెట్లు వెడలెనో వెడలివచ్చి

తేరుక్రిందటి మరుగుజ్జుఁ జేరి వానిఁ
గలసి యేతెంచు నిది మీకుఁ గానఁబడదు.

624


ఉ.

దేవరకొల్వు దేరిన మదీయగృహంబున కేగువాడనై
యే వెసఁ బోవుచోఁ గురిసె వృద్ధవరాహకఠోరఘర్ఘరా
రావమహాశనిధ్వనిపరంపరతో నొకవాన మొన్న రే
యావిలమానసాంబుజుఁడనై యొకమండపసీమఁ జేరితిన్.

625


తే.

అచ్చటికి వచ్చె నిమ్మందయాన వచ్చి
తేరుక్రింది ప్రతీక్షణాధీనుఁ డైన
గుజ్జుఁ జేరిన వాఁ డతిక్రుద్ధుఁ డగుచు
నింతతడ వేల రావైతివే యటంచు.

626


తే.

గుండియలు గ్రుళ్లఁదన్నిన గ్రుక్కుమిక్కు
రనఁక యాతనికినుక చల్లాఱనిచ్చి
విక్రమార్కుడు నిద్రగావించుదనుక
వెడలి రారాదటంచును వేడుకొనియె.

627


తే.

అతని పదఘాతముల కోర్చినట్టిదాని
కివ్విరులబంతివ్రేటున కింతమూర్ఛ
వచ్చెనే యంచు నవ్వితి వసుమతీశ
చనవరియటంచు నాతప్పు సైఁపవలయు.

628


క.

అన విక్రమార్కభూపతి
విని వెఱుఁగున ముక్కుమీఁద వ్రేలిడి చింతన్
మునుఁగుచు బాలసరస్వతిఁ
గని తెలిసె న్మీనహాసకారణ మౌలే.

629


తే.

కాకయుండినఁ దైలపక్వంబులైన
మత్స్యములు నవ్వునే యంచు మందబుద్ధి

నక్కటా కాననైతి నీహంతలాఁడి
వగలు నమ్మితిఁ గద పతివ్రత యటంచు.

630


క.

అని మఱియుఁ బదియుఁ బడియును
గనుఁగొని కదళికకు నాజ్ఞఁ గల్పించె న్శా
స్త్రనిరూపితపద్ధతి న
జ్జననాథుఁడు వింటివా నిశాకరవదనా.

631


క.

అని చిలుక పలుకఁ బూర్వా
వనిధరశృంగాగ్రమున దివాకరుఁ డెసఁగం
గనుఁగొని ప్రభావతీసతి
చని గృహముననుండి తన్నిశాముఖవేళన్.

632


క.

పుడమిదొరఁ జేరు వేడుక
పొడమగఁ జనుదెంచి కీరపుంగవుతో నీ
కడుపెల్లఁ గథలు గద ని
న్నడుగం బనియేమి పోదునా యని పలుకన్.

633


తే.

పోయిర మ్మిందువదన యపూర్వమగుచు
నలరు నొకకథ విను విక్రమార్కనృపతి
యవ్విధంబున నిజసతి కాజ్ఞ వెట్టి
పుష్పహాసుని జూచి యింపులు జనింప.

634


శా.

ఈయాశ్చర్యము కంటిమేకద పురాదృష్టాద్భుతం బేమియో
యాయాఖ్యానముఁ దెల్పుమన్న నతఁడుద్యత్ప్రేమతో నిట్లనున్
సాయంకాలనటన్మహానటజటాఝూటాటవీద్యోధునీ
స్ఫాయద్భంగఘుమంఘుమోపమితవాచాచాతురీధుర్యుఁడై.

635


శా.

వస్వద్రిప్రతిమానధైర్యవిబుధధ్వంసిప్రభూద్భూతభీ
నిస్వస్థక్షితిభృద్విరోధిమునిదిఙ్నేత్రాబ్జన్మేణభృ

ద్వస్వాదిత్యముఖార్తబర్హిచయదీవ్యద్వారివాహోదయా
భాస్వద్వంశపయోధిశుభ్రకరశుంభత్కుంభకర్ణాంతకా.

636


క.

ఖరకరకులశరనిధిశశ
ధర ఖరసురవిషుతశమన ధనదసఖధను
ర్హరణభయదభుజ భవహర
సురవరమునినికరభజిత శుభకరశరణా.

637


స్రగ్విణి.

మానితాబ్జేక్షణా మౌనిసంరక్షణా
భానుసూనుప్రియంభావుకప్రాభవా
దానసంతుష్టగోత్రాసుధాంధస్తుతా
జానకీస్వచ్ఛభూసారసేందిందిరా.

638


గద్యము.శ్రీమత్ఖాదిరీనృసింహకరుణాకటాక్షవీక్షణసమాగత కవితాధార పాలవేకరికుల కలశాంభోనిధిసుధాకర తాడిగోళ్ళకరియమాణిక్యనృపహర్యక్షపౌత్రపవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక కదిరీపతినాయకప్రణీతంబైన శుకసప్తతి యను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.