శుకసప్తతి/ఏడవ యుపకథ

వికీసోర్స్ నుండి

ఏడవ యుపకథ


క. సౌరాష్ట్రభూమిలో గుణ
గౌరవుఁ డనునృపతి యేలఁగాఁ దగు విభవా
ధారంబను పురిఁ గథకా
ఖ్యారాముం డొక్కభూసురాగ్రణి వెలయున్. 476

సీ. అలికి మ్రుగ్గులు వెట్టినట్టి తిన్నెలు కంచు
బోరుతల్పులు పాలువోసి చాల
యూర్చవచ్చు ననంగ నొనరు చావడి తాళు
వారంబు చిన్నగవాక్ష లమరు
వంటకొట్టము చిలువాన మించిన మిద్దె
పట్టెమంచముతోడి పడుక యిల్లు
పడసాలముంగిలి పందిరి పసిగాడి
కాయధాన్యములున్న కణజములును
తే. బెరటిలో నారికేళజంబీరముఖ్య
నిఖలఫలవృక్షములు మంచినీళ్లబావి
నమర నయ్యింట నిత్యకల్యాణములును
బచ్చతోరణములు మించఁ బరఁగు నతఁడు. 477

తే. అతని ప్రియపుత్రి యగుచపలాఖ్య యొకతె
పేర్మిఁబోషింప నానాఁటఁ బెండ్లి కెదిగె
మరుఁడు మఱచినసాము వేమఱునుజేయఁ
దలఁచి సాదనగరడిలో దట్టిఁ గట్ట. 478

క. అంతట నక్కన్నియ నొక
యంతర్వాణికి నొసంగి యక్కథకుఁడు గే

హాంతమున నిలిపికొని యు
న్నంతట మోదము జనింప నాదంపతులున్. 479

క. ఆరీతినుండు నంతట
నారమణీమణికి యౌవనాగమ మొదవం
గూరిచిరి వరునితో ముద
మూరఁగఁ దలిదండ్రు లొక మహూర్తమునందున్. 480

క. ఆరేయి చపలమగనిం
జేరుటయే కాని యేమి చెప్పుదు లోకా
చార మెఱుంగని యాతని
గారా మొక్కింతయైనఁ గానక చనియెన్. 481

క. దినదినము నిట్టులూరక
చనిచని యామీఁద సిగ్గు చాలించి ముదం
బెనయం బైకొని చూచియుఁ
గనదయ్యె న్వాని సురతకాంక్షాగుణమున్. 482

సీ. తలుపుచెంగటఁ గొంత నిలిచి యాకర్షణ
శ్రీలేమిఁ దనుదాన చేర నరిగి
క్రముకఖండము లీయఁగాఁబోయి సంగ్రహో
న్మేష లేమిని శయ్యమీఁద నునిచి
కదిసి పాదము లొత్తఁగాఁ బూని యంగీకృ
తిస్ఫూర్తిఁ గనమి భీతిల్లి లేచి
ప్రేమగన్పడఁ బల్కరించి ప్రత్యుత్తర
స్థితి గానఁబడకున్న జిన్నఁబోయి
తే. శాస్త్రపాఠక్రమానంతజాడ్యుఁడై న
ధవుని గని యుస్సురంచును దలుపుమూసి

గుబ్బకవమీఁది పయ్యెదకొంగు పఱచి
నేలఁ బవళించు మగువ కన్నీరు దొరఁగ. 483

సీ. కవగూడి యెడఁబాయఁగా లేని మిథునంబు
కాంక్ష వీక్షించి యేకారఁ దొడఁగు
నన్యోన్యమైత్రి సయ్యాట లాడెడు వధూ
వరుల వేడుకకు భావమున నుడుకు
భాగ్యంబు గల సతీపతుల నిర్భయరహః
క్రీడల కెల్ల గ్రుక్కిళ్ళు మ్రింగు
మదనకేళీపరిమ్లానాంగులగు దంప
తుల యందమునకుఁ గొందలముఁ జెందు
నుర్వి నిర్వక్రతరుణవయోమదాంధ
గంధసింధురగమన లఖండసౌఖ్య
మెంత గల్గియు సంభోగహీనమైన
నెట్లు భరియింపఁగలరు మహి న్మహీంద్ర! 484

క. పగలెల్ల నింటిపనులకు
నగపడ నొకరీతి మఱచియైనను నుండున్
మగువ నిశాముఖమైన
న్దిగులుపడు న్మగని వగ గణించుచు మదిలోన్. 485

సీ. పట్టి కాఁపుర మింత రట్టాయెఁగా యంచుఁ
దల్లి పెల్లగు వంతఁ దల్లడిల్లు
జాయాబహుజ్ఞప్తజామాతృజాడ్యుఁడై
తండ్రి యందంద డెందమునఁ గుందుఁ
గ్రోధ మొందిననైనఁ గొడుకు దుర్గుణ మెంచి
యత్త మాడెత్తు మాటాడ వెఱచుఁ

దాఁజెప్పు చదువు లింతకుఁ దెచ్చెఁగా యంచు
మామ యే మన లేక మోమువాంచు
తే. మర్మ మెఱుఁగని వార లిమ్మగువ కేమి
యొచ్చమున్నదొకో మగఁ డొల్లఁ డనుచు
నాడుకొనఁ జొత్తు రక్కటా యాఁడుఁబుట్టు
పుట్టరాదుసుమా లోకమున నరేంద్ర. 486

తే. ఇట్లు వర్తింప నొక్కనాఁ డిరులుగవియు
వేళఁ గార్యాంతరాపేక్ష వెంటఁబడఁగ
నింటివారికిఁ జెప్పక నేగెఁ జపల
మగఁడు పొరుగూరికై బుద్ధిమంతుఁ డగుట. 487

క. ఆరేయి వానిచెలికాఁ
డారాధ్యుఁ డనంగఁ బరఁగు నాతండు తదా
గారమునఁ బడుకయింట ను
దారతదాగమనకాంక్షియై పవళించెన్. 488

తే. అంతఁ జపలావధూటి నేఁడైన మంచి
బుద్ధిపుట్టదె మగని కాపూర్ణదైవ
కరుణ నని కేళిగేహంబు గదిసి యచట
వాని నిజనాథుఁ డని మదిలోన నెంచి. 489

శా. చేరంగాఁ జని యక్కటా యధిప మీచిత్తంబు రాకున్న నీ
వీరీతిం బదసేవసేయు మని మీరే నన్ను శిక్షించి యే
నేరం బైన సహింప భాగ్యముగదా నిష్కారణం బిట్లు నా
పేరన్న న్మదిఁ గంటగించెదరు పెంపే మీకు నన్నేఁచుటల్. 490

క. అని దైన్యముతోఁ బలికిన
విని యాతఁడు మదనవిశిఖవివశుం డగుచున్

మునుదాని తెఱఁ గెఱుంగుట
నెనసినతమి సురతకేళి నింపుఘటింపన్. 491

క. ఆవెనుక మగఁడు గాఁడని
భావంబునఁ దెలిసి సిగ్గువడి యంతటిలో
దైవాధీనం బిది యని
భావించుచుఁ జపల మృదులభాషల ననియెన్. 492

తే. ఇంత మోసంబుఁ జేసి నాయీలువెల్ల
నపహరించితి విఁక నేమి యైనకార్య
మయ్యెనేకద యీరీతి ననుదినంబు
నన్ను మన్నింపుకున్నఁ బ్రాణములు విడుతు. 493

క. అని పలికె నదియు మొదలుగ
వెనుదీయక యజ్జయైన వేళల నెల్లం
జనుదెంచు వానిరతి న
వ్వనితామణి తనివిలేక వర్తిలఁ దొడఁగెన్. 494

సీ. భర్తకుఁ భ్రాతరౌపాసనాగ్ని యొసంగి
దుడుకుఁగా ముంగిటఁ దొంగి చూచు
నాయకునకు మజ్జనజలంబు ఘటియించి
తాపియింటికి నేగి తడవుచూచు
ధవునిచెంగట నిష్టదైవపూజ కమర్చి
తలవాఁకిటికిఁ బోయి నిలిచిచూచుఁ
బతికంచమున శాకవితతులు వడ్డించి
నిలువఁగూడక గోడ నిక్కిచూచు
తే. నెంతబాళియొ కాక యయ్యిందుముఖికి
గూర్మినారాధ్యురాకలు గోరు టొకటె

కాని ప్రాణేశు పరిచర్య కానివావి
యయ్యె నేమందునయ్య యయ్యతనుమహిమ. 495

సీ. ఠీవితో నేటినీటికిఁ బోవుచో వెంట
వెంటవచ్చితిఁజుమా విద్రుమోష్ఠి
పొరుగింటి చెలిఁ గూడి సరసము ల్పలుకుచో
జెంత నిల్చితిఁజుమా దంతిగమన
ముంగిట జననితో ముచ్చటలాడంగ
నిక్కిచూచితిఁజుమా టెక్కులాఁడి
పడుకటింటికిఁ జెలు ల్ప్రార్థించి యనుపుచోఁ
దలుపుమీటితిఁజుమా తతనితంబ
తే. యనుచు నారాధ్యుఁ డొంటిపాటైన వేళ
నవ్వధూమణితోడ మోహంబుఁ దెలుప
నప్పడంతియు నవి నీవు చెప్ప నేల
వినర నాకన్ను లెందున్న వనుచుఁ బలుకు. 496

క. ఈరీతి నుండు నంతట
వారల యందములు సవసవలుగా వినియ
య్యూరెల్ల గుజగుజలఁబో
జారునితోఁ జపల తెలుపుఁ జాంచల్యముగాన్. 497

క. వచ్చెఁగద బెడఁద మన కిఁక
నిచ్చట నడయాడఁ గూడ దెటకేనియు నే
వచ్చెద రమ్మటులైన
న్విచ్చలవిడి నడువవచ్చు వెఱువకు మదిలోన్. 498

తే. అనిన భయమంది యాతఁ డోయబల యింత
సాహసక్రియ చేయంగఁ జనునె మనకు

ననుచు వారింప విన కది యతనిఁ గూడి
యరిగెఁ దెగియించి నిర్భరసురతవాంఛ. 499

శా. ఆరీతిం బహుదేశము ల్గడచిపో నారాధ్యుఁ డాత్మాంగనం
గారాము ల్దలపోసి యొక్కయెడ నిక్కట్టైనచో దానినా
నారత్నోజ్జ్వలభూష లూడ్చికొని యానందంబుతోడం బురిం
జేరెం దచ్చపలాక్షియు న్వగవఁజొచ్చెం గార్య మిట్లౌటకున్. 500

తే. వింటివా విక్రమార్క యవ్వెలఁది సేయఁ
దగనికార్యం బొనర్చి దుర్దశఁ గృశించె
గాన నన్యుల నడుగఁగా రానిమీన
హాసహేతువు మఱినీవె యరసికొనుము. 501

చ. తెలియఁగ జాలకున్న వచియించెద ఱేపని యింటికేగె న
చ్చెలువ యటంచుఁ దేనియలు చిల్కఁగఁ జిల్క వచింప నంతలో
బలబల వేగవచ్చినఁ బ్రభావతి కేళిగృహంబుఁ చేరి చం
చలమతి నాఁటిరేయి నృపచంద్రుని పొందిక గోరి చేరినన్. 502

తే. చిలుక వీక్షించి కలదు విచిత్రగాథ
యది యగాధసరోజరాగాధరోష్ఠి
యనుచు వచియింపఁ దొడఁగె భాష్యార్థమాన
మాధురీమాధురీణత సాధురీతి. 503

తే. చేరి యెన్నికథలు చెప్పినఁ గనలేక
విక్రమార్కధరణివిభుఁడు పిలువఁ
బనుపనేగి మంత్రితనుజాత తత్సభా
ప్రాంగణమునఁ దెరమఱుంగుఁ జెంది. 504

తే.

తనదు కథలకుఁ దరళికాతరళనయన
యాదిగాఁగల్గు నంతఃపురాబ్జముఖులు
పుష్పహాసప్రముఖమంత్రిపుంగవులును
వచ్చి యుండుటఁ దెలిసి యవ్వామనయన.

505


మ.

సభవారెల్లను సద్దుమాని వినుఁడీ సర్వంసహామండల
ప్రభుతోఁ దెల్పెద విక్రమార్కనృపచంద్రా సావధానంబుగా
శుభదం బీకథఁ జిత్తగింపవలె నంచుం దెల్పఁ జొచ్చె న్సుర
ర్షభకేళీవనికామరందరసవాచాప్రాచురీచాతురిన్.

506

ఎనిమిదవ యుపకథ

క.

గంధవతీ నామకము వ
సుంధర నొకపురము కరము శోభిలు భాస్వ
త్సైంధవచయాతిపత్రిత
బంధురమణిసౌధకేతుపటపటలం బై.

507


క.

ఆనగరరత్న మేలు
న్మానధనుం డనఁగఁ బరఁగు మానవపతిత
త్సూనుం డభిమానధనా
ఖ్యానవనీయుండు వెలయు నధికప్రజ్ఞన్.

508


తే.

అతఁడు జనకుని వెనుకఁ బట్టాభిషేక
మవధరించి నిజామాత్యులాప్తకోటి
యనుదినంబును విన్నవించిన వివాహ
మొల్ల నని నిస్పృహుండయి యుండె నంత.

509


క.

చనవరు లందఱు నొకనాఁ
డనఘా కల్యాణ మొల్ల ననుకారణమే