శుకసప్తతి/తొమ్మిదవ యుపకథ

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శుకసప్తతి

చతుర్థాశ్వాసము

క. ................................. 1

తే. అవధరింపుము సకలరాజాధిరాజ
నతపదాంభోజుఁ డగు ధర్మనందనునకు
సరసవైదికలౌకికాచారవిహిత
హితకథారమ్యుఁ డగుధౌమ్యుఁ డిట్టులనియె. 2

తే. అవధరింపుము విక్రమార్కావనీంద్ర!
చిన్ననాఁ డేను మున్ను కాళీపురస్థ
లావలోకనకాంక్షచే నరిగి యరిగి
జంబుకేశ్వర మనుపట్టనంబుఁ జేరి. 3

తొమ్మిదవ యుపకథ

తే. కంటి పాంథజనాహ్వానకారిమృదుల
వాతపోతచలత్పటకేతనాంక
మై మదీయశ్రమచ్ఛిదాహారి యగుచు
నలరు నొకవంటకూలి యొయ్యారియిల్లు. 4

సీ. హాళి పుట్టించె సద్యఃకల్పితానల్ప
రసపూర్ణగాథాదురంతపటిమ
రక్తి గల్పించె ధారాళవాచాసుథా
మాధురీధుర్యసంగీతరీతిఁ
దెలియఁజేసె ననేకదేశసభాంతరా
రాశికాంతరనికరప్రపంచ
మస్ఫురం బొసఁగె శబ్దార్థవైచిత్రిని
బంధనోజ్జ్వలగద్యపద్యసమితిఁ
తే. దద్గృహులకన్న కల్పితతారకాయ
మానసోమసమానీతు లైనపథిక
కథికగాయకచారుసత్కవులయుదర
పూర్యగంతరసల్లాపములు నరేంద్ర. 5

చ. చిటిలిననాభినామ మొకచేఁ దెలనాకులు చాయతోడి
పుక్కిటివిడెముం బెడంగుగ బిగించిన పైఁటచెఱంగులోనఁ బి
క్కటిలు కుచంబులుం బసిఁడికమ్మతళుక్కను చెక్కుదోయి చొ
క్కటముగ ముద్దుగుల్కు నొకకల్కి వెసం జను దెంచి యచ్చటన్. 6

సీ. మఱివండిపెట్టుకొమ్మలు లేరె మావెంటఁ
బడుదు రటంచును బాయఁబలికి
పోవఁజూచినఁ దిట్టిపోదు రిదేల వా
దాడఁజాల మటంచు నాసగొలిపి
యటువంటివారమా యాఁకలిదీర్పు మి
క్కిలిపుణ్యమన్న నంగీకరించి

కమ్మలు గదలఁ గన్బొమ్మలు నిక్కిడ
నారజమ్మునఁ గూలి బేరమాడి
తే. వచ్చు తెరువరులందఱు వంటపనికి
నన్ను మెత్తురటంచు నందములు సూపి
బాళిపుట్టించు దాని కప్పథికులెల్ల
నొడఁబడికెమీఁదనే మిన్కు లొసఁగి రపుడు. 7

తే. వారితో నేను భుజియించి వనజబంధుఁ
డస్తగిరిఁ జేరుతఱియైన నపుడు నదికిఁ
బోవువారలఁ జూచి నేఁ బోక నిలిచి
సందెవార్చితి జలము లాసతి యొసంగ. 8

క. ఆసమయంబునం జీఁకటి
మాసినతనముదుకచీర మైకలనిగ్గు
ల్వాసులకుఁ బెనఁగఁగా నొక
దాసి యరుగుదెంచి యొకసుధాకరముఖితోన్. 9

క. ఏమో గుసగుసలాడిన
నామగువ మఱేమి సేతు ననుపగుమగవాఁ
డీమాటకు నొడఁబడఁ డ
క్కామినియెడ మాట నిల్పఁగా లేనైతిన్. 10

క. అనుమాటలు సవసవగా
విని నేనేమో ప్రమోషవిధమని చేరం
జని యది యేమని యడుగం
గనుఁగొని యమ్మగువ ముఖవికాస మెసంగన్. 11

తే. హత్తుకోవచ్చు నీవంటియందగాని
కున్నదొకచోట నొకమంచియొఱపులాఁడి

దాని కిలికించితంబునఁ దవిలినట్టి
వాఁడు దేవేంద్రునకుఁ జీటి వ్రాయఁగలఁడు. 12

మ. అను నమ్మాటలతోడనే రతిపతిజ్యావల్లికాటీంకృతుల్
విని తా మంచిది పోదు నా యనుచు న న్వీక్షించి యయ్యంబుజా
నన సేబాసు బలార జాణవవు దన్నా యింత తెంపొందకుం
డినవాఁ డేమగవాఁడు నీతపము పండె న్నిండె సౌఖ్యస్థితుల్. 13

తే. పట్టనని యోగియౌ గుణభద్రుఁ డనెడు
భూసురుం డొక్కఁ డియ్యూర వాసిగనియె
వానిబంటున కున్నయైశ్వర్యగరిమఁ
బడసినఁ గుబేరుఁడైనను బ్రదికిపోవు. 14

మ. అలరుందూపులమన్నెవాని మగవాఁ డన్పించుఁ దత్కాంత య
య్యలివేణీమణి జారసంగమసుఖైకాకాంక్షచే దీని ని
చ్చలు నాయింటికిఁ బంపు నొక్కని మహాచాతుర్యధైర్యాప్తి మె
చ్చులొసంగం దగువానిఁగాఁ బనుపుమంచుం దైన్యపూర్వంబుగన్. 15

క. ఏనును మాలిమిగల మగ
వానికి నిది యెఱుకసేయ వడవడ వడఁకుం
గాని చన వెఱచువాఁ డ
మ్మానినితోఁ బ్రొద్దు కొంచెమా యొనఁగూడున్. 16

తే. అట్టిచో నెట్లు పోవుదు నంటివేని
దద్గృహముచెంత నొకవటతరువు గలదు
దానిపై నెక్కి చీఁకటిగాన నిపుడె
యూడవెంటనె దిగు మొనఁగూడు పనులు. 17

తే. కాంతిమతి దాని పేరు తత్కాంతుఁ డధిపు
డనుపఁగా దూరభూమికి నరిగినాఁడు
నడచి యిచ్చటి కతఁడు గాఁ దడవుపట్టు
వేగఁ జను మిందులకుఁగాను వెఱవవలదు. 18

క. అని నన్నుఁ బలికి దానిం
గనుఁగొని యమ్మగువ కింత కార్యంబో జ
వ్వని వే తెల్పుము పొమ్మని
యనుపఁగ నది వెడలి చనియె నంతట నేనున్. 19

మ. తరలంబైన మనోంబుజంబు ఘనసంత్రాసంబుతోఁ బోరి శం
బరవిధ్వంసి మహాప్రతాపము జయింపం గాంతిమత్యాలయాం
తరముం జేరఁగ నిశ్చయింప వట ముద్యత్ప్రౌఢిమ ల్మీఱ నె
క్కి రహి న్శాఖల వెంటనే యరిగి తద్గేహంబునం డిగ్గితిన్. 20

ఉ. అంతకుమున్నె యచ్చటి కొయారముమీఱఁగ వచ్చియున్న త
త్కాంతిమతీవధూటి ననుఁ గన్గొని మోమరవాంచి నిల్చినం
జెంతకుఁ జేరి దాసి యిది సిగ్గుపడ న్సమయంబటే గృహా
భ్యంతరసీమఁ జేర్పుద మటంచు ననుం గొనిపోయి రిద్దఱున్. 21

చ. బటువులు తాపి తాపఱుపు పట్టుకలాడముమీఁదఁ జల్వదు
ప్పటిపయిఁ జప్పరంపుజిగి బంగరు వ్రాఁతకురాళముం గురం
గటఁ బడిగంబుఁ గంచుదివగంబము గల్గినపట్టెమంచము
త్కటరుచినించ మించు రతిధామముఁ జేరితి నిర్భయంబునన్. 22

తే. అంతట భుజించి నను వినయంబుదోఁప
మంచమున నున్చి యక్కాంతిమతిని జూచి

యెనసెఁ గదవమ్మ నీమనోభీష్ట మితని
యలరుఁబ్రాయంబు కొల్లాడు మనుచుఁ బలికె. 23

శా. న న్నీక్షించి సమస్తదేశతరుణీనానారహఃక్రీడలం
గన్నావందపుజాణ విక్కలికి బొంకన్లేదు సుమ్మా మెయిం
జిన్నె ల్నించకుమా బయల్పడిన నాచేఁ గాదు సుమ్మా ప్రజం
గన్నుల్మూయఁగ నీకుఁ దెల్పవలెనా కార్యంబ కర్తవ్యమున్. 24

క. అని తలుపుమూసికొంచుం
జనియం దద్దాసి గడియ చక్కఁగఁ బొంకిం
చి నెలంత యంత తల్పం
బున కొయ్యనవచ్చె నగవు మొగమునఁ దోఁపన్. 25

తే. ప్రథమసంగమకేళి యప్పటికి నంత
ముగ్ధ యనుపించి పిదప నమ్మోహనాంగి
జాతివారాంబుజేక్షణల్ సైఁత మింత
నేర రనిపించెఁ గలయిక యారజముల. 26

మ. సభలోన న్వివరింపరాదె గద తచ్చాతుర్య మెంతంచు నే
నభివర్ణించెద నంశుమత్కరదురాపాంతఃపురావాస యా
యిభయానామణి యెందు నేర్చినది హా యీకౌశలం బంచు నే
సభయాశ్చర్యతఁ జెందితి న్మహిమ నాసాతర్జనీయోగమున్. 27

ఉ. ఎంతకు నేర రంత తెగియించినవా రది యున్నదేకదా
యంతట తెల్లవాఱిన లతాంగి ననుం బడుకింటిమిద్దెపై
దంతపుమేలుమంచము సుధాకరకాంతగృహాంతరంబులో
నెంతయుఁ జింతలేక వసియింపగఁజేసెను సాహసంబునన్. 28

తే. రాత్రు లెల్లను గేళ్యగారమున నుంచుఁ
బగలు మేల్మచ్చుపై నుంచుఁ బ్రతిదినంబు
బేర్మి రెట్టింప షడ్రసోపేతములుగఁ
బ్రొద్దుప్రొద్దునఁ భోజనస్ఫురణ లొసఁగు. 29

తే. దానినడకల వగ లెన్నియైనఁ గలవు
చెప్పఁ జిత్రంబు లటమీఁదఁ జిత్తగింపు
మంత నయ్యింతి గర్భచిహ్నములు దాల్చె
వేడుకలు ద్రోచి నామది వెఱపువొడమ. 30

తే. అంత నొకనాఁటి రేయి యేకాంతసదన
సీమ నన్నుంచికొని మున్ను చేర్చియున్న
గంటమాకులుఁ గొని దివ్వెగంబ మింత
యెనయఁగూర్చుండి యాపూర్ణిమేందువదన. 31

సీ. శ్రీమన్మహాగుణస్థిరగుణభద్రపా
దములకు దేవరదాసియైన
కాంతిమతీదేవి ఘనభక్తినతులు గా
వించి చేయంగల విన్నపములు
మిమ్ము నాపాలిస్వామినిఁగాఁ దలంపుదు
మీమహిమంబులు మీకె తెలియుఁ
గలలోన మీరు సాక్షాత్కరించుటఁ జేసి
గర్భంబు నిలిచె నిక్కంబు గాఁగ
తే. నింటివారెల్ల నామీఁదఁ గంటగించు
టెపుడు నెఱుఁగుదురేకద యింకమీఁద
నేమి కల్పింపఁజూతురో యెఱుఁగరాదు
కరుణ నిల్పుమటం చొకకమ్మ వ్రాసి. 32

క. తనదాసిఁ బనుప నదియుం
ఘనజవమున నేగి చేరి కమ్మ యొసంగం
గనుఁగొని గుణభద్రుఁడు చది
వినవాఁడై విస్మయం బవేలముగాఁగన్. 33

క. చింతాక్రాంతుండై యిసు
మంతయు మాటాడకున్న నాతనికుపిత
స్వాంతత్వ మెఱిఁగి దాసి య
నంతత్వర మరలివచ్చి యంతయుఁ దెలిపెన్. 34

సీ. ఆడుదియైనచో నడుగఁ గులస్థాన
పౌరుషములతోడఁ బ్రబలువాఁడఁ
గొడుకైనఁ గలదులే గుణభద్రునకు మున్ను
మున్ను గాని పితౄణమోచనంబు
జతగూడ మనపురోహితుని రప్పింపరే
పాటించి లగ్న మేర్పఱచుఁగాని
బొడ్డుగోయరె యేమి పురుటింటిలోఁ జొచ్చి
మనపతివ్రత బిడ్డఁ గనియెనిప్పు
తే. డనుచుఁ గేరడముల నింటి యమ్మలక్క
లాడికొనఁ జేటికానీత యైనవస్తు
కోటిచే నింత యేమియుఁ గొదవలేక
కాంతిమతి యంత మగవానిఁ గనియె నధిప. 35

క. కని పెనిచెం దదనంతర
మున భూనాథుండు పనుపఁ బోయిన కార్యం
బొనగూడుకతనఁ గ్రమ్మఱి
చనుదెంచెం దద్విభుండు సదనంబునకున్. 36

తే. నిజసమాగమసంభ్రమోన్నిద్రు లగుచు
నింటివార లెదుర్కొన నేగుదెంచి
యాత్మభార్యాచరిత్రంబు లడుగఁ బొక్కి
ఖిన్నుఁడై యున్నవాని నీక్షించి యపుడు. 37

సీ. బెడఁగుఁజూపెడు నూనెముడిలోనుగా నంటఁ
గట్టిన వాసెనకట్టుతోడఁ
గస్తూరిపసుపు చొక్కటపుఁ జల్లనితావి
వెదచల్లు పుక్కిటివిడెముతోడ
నిసువుపై పసుపునూనియ జిడ్డులంటిన
చిటికమ్మికుఱుమాపుచీరతోడ
నొసటనందంబుఁ జెందు విభూతిరేఖపై
బొంకంబుగను చుక్కబొట్టుతోడఁ
తే. గాన్పుసంతస మందు మొగంబుతోడ
నడరు మురిపంబుగులుకు నెన్నడలతోడఁ
గాంతిమతి వీఁడె నీముద్దుగాఱు తనయుఁ
డనుచుఁ జేతికి నీయఁగా నవ్విభుండు. 38

తే. కన్ను లెఱ్ఱగా నెగాదిగఁ గన్గొని
యౌడు గఱచి దీని నాఁటదానిఁ
జంపరాదుగా విసర్జించితి నటంచుఁ
బార్శ్వచరులఁ జూచి పలుకుటయును. 39

చ, కలకల నవ్వి యౌనెకద కాదనవచ్చునె నన్నువంటితొ
య్యలి విడనాడ నీయెడ నయారె సెబాసురె యింటివారిమం
దులమహిమంబు గాక నిను దూఱఁగఁ బల్కఁ బనేమి బాపురే
కలియుగమా యటంచు నని కాంతిమతీలలితాంగి వెండియున్. 40

మ.కల నిక్కంబగునేయటన్న నిఁక నౌఁగాదంచు మారాడఁగాఁ
గలనా యింతకు వచ్చినప్పుడును బల్కన్నేర నాకాన్పు ర
చ్చల కెక్కెం గద యింక మానుదురె యీసాధ్వు ల్ననుం దూఱఁగా
వెలయం దైవ మెఱుంగుఁ గల్లనిజము ల్వీరాడఁగా నేమగున్. 41

సీ. నలుగు రుండినచోట నిలువఁగాఁ బెట్టి మా
టాడఁగాఁ గంటిరా యమ్మలార
ననువంటియాఁడుబిడ్డను గన్నవా రింతె
పలుకరే యేమియుఁ దెలియలేని
సబ్బిణు ల్మీరు మీచాటుమాటలు గదా
నానాథుమేలిగుణంబుఁ జెఱచె
దయ యింతలేక యెంతకు నెత్తుకొంటి ర
క్కట మిముఁ గన్నదిగాక తల్లి
తే. సూర్యుఁడా చూచుచున్నావె చోద్యపడక
యందఱును జేయుపాపపుణ్యంబు లెవరి
నడిగితివి ధర్మదేవతా యమ్మ చెల్ల
వింత నావంటిదానికా యింతమాట. 42

తే. అని గయాళించుకొనుచు హస్తాంబుజముల
నలరుపాపని దురదుర నరిగి తొట్ల
లోనఁబడవైచి మొగమునఁ బూను గండు
తోడ బొమముడి నిగుడ నత్తోయజాక్షి. 43

క. మును రామునిమాటలకై
యనలము వెసఁ జొచ్చి వెడలి యలరిన సీతాం

గనకంటె నేను దక్కువై
చని కాళిక చెంత బాససలిపి గెలిచెదన్. 44

మ. అనుచుం గ్రక్కున గేహము న్వెడల దాయాదు ల్మహాసాధ్వివి
ట్లు నినుం బేర్కొన మింక నీసడియె చాలుం జాలు రమ్మంచు వెం
టనె రాఁగా నిది యే మొకో యనుచు నానామానవు ల్గుంపులై
కనుఁగొంచుం జనుదేఱఁగా నడిచెం దత్కాళీమహాస్థానికిన్. 45

సీ. తనవారు పిలువఁగా వినక బాసయొనర్పఁ
జను టేటికో యని యనెడువారు
నాఁడుఁబుట్టువు చెడ్డదవుఁగదా యిటువంటి
యపకీర్తివచ్చెనే యనెడువారు
నపకీర్తివచ్చిన నడఁపక యింటివా
రగడు చేయుట దోస మనెడువారు
నగ డేమి చేసి రియ్యతివ తానే వారి
కారడి గల్పించె ననెడువారుఁ
తే. జూడవచ్చిన నచ్చుముచ్చో యెఱుంగ
కాడరా దేల యీపాప మనెడువారు
బయలుదేఱిన యపుడె యీపడఁతి జంత
యగుఁజుమా యనువారు నైరపుడు జనులు. 46

వ. వెండియుం దండోపతండంబులుగా మెండుకొని యాలోకించు పురజనంబుల కోలాహలంబు విచారించి సంభ్రమాశ్చర్యంబుగా నరిగి యూడిగంపుఁ బడఁతులు విన్నవించిన నన్నగరాధినాథుం డగు నరపాలుండు విస్మయంబున నగరు వెడలి తత్కాలసన్నిహితు లగు పరిచారకులు గొలువం జనుదెంచి. 47

క. తలతల మని కొందఱు బ్ర
ద్దలవా రెడఁగలుగ జడియ ధరణీధవుఁ డ
క్కలకంఠిఁ జేరి యనునయ
ముల మరలమి సమ్మతించి ముందుగ నడిచెన్. 48

తే. అంతఁ దొలునాఁటి రాత్రి రహస్యభంగిఁ
గాంతిమతి తీర్చి నను బందుకట్టి యునికి
నేను నొకజోగి వాల్కంబుఁ బూని భద్ర
కాళి సన్నిధి నుంటి గింకరునీరీతి. 49

తే. అచ్చటికి వల్లభుండు ధరాధినాథుఁ
డాదిగా మూఁక వెంటరా నరుగుదెంచి
కాంతిమతి చేరి తత్కాళికాపదాబ్జ
ములకు వెస మ్రొక్కి లేచి నిశ్చలత నిలిచి. 50

తే. కదిసి ప్రజలార కంటిమి కాన మనక
చూడుఁడని పల్కి ధైర్యవిస్ఫురణ మెఱయ
జనవరునిఁ జూచి రాజ నాసత్య మిపుడు
విశద మగును పరాకని విన్నవించి. 51

క. నినునంటి భద్రకాళీ
యనయము విభునంటి యీమహాయోగివరే
ణ్యుని నంటినఁ గాక మఱె
వ్వని నంటిన శాస్తి చేయ వలయు న్నాకున్. 52

మ. అని యక్కాంతిమతీవధూటి పలుకం బ్రావిర్భవద్విస్మయం
బున సారెం దలయూఁపసాగె గిరిశాంభోజాక్షి తన్మూర్ధకం

పనము న్మెచ్చి యొనర్చెనంచు నెదల న్భావించి పశ్యత్పురీ
జను లౌరౌర పతివ్రతా యనుచు మెచ్చ న్నింగి ముట్టె న్రొదల్. 53

ఉ. అంత నృపాలుఁ డాలలనయంఘ్రులకుం బ్రణమిల్లి యామినీ
కాంతముఖీ! యరుంధతివి కానక నీపయిఁ గానిపోని యీ
వింత ఘటించినట్టి యలివేణులనోరికి శాస్తి సేసి య
త్యంతయశంబు నిల్పితి కదా యిఁక నింటికి నేగఁగాఁ దగున్. 54

చ. అనవిని రానిసిగ్గునఁ బటాంచల మించుక వంచినట్టి మో
మునకు మఱుంగుఁ జేయు కరము న్మృదుపాదపయోరుహద్వయం
బున నెలకొన్నచూపు లొకపొంకము చూపఁగఁ గొంకుమాట ల
త్యనుపమముగ్ధతాగతి వెలార్ప నడంకువచంద మేర్పడన్. 55

మ. అపవాదంబు పరిత్యజించుటకునై ప్రాణంబు లే నిల్పితి
న్నృప! యీభూప్రజ కెల్లఁదండ్రివిగదా నీముందఱం బాసచే
సి పరఖ్యాతి వహింపఁ గంటిఁ గద నీచిత్తంబు వచ్చెం గదా
యిపు డీపోడిమి చాలుఁ గాఁపురము పొందేలా విసర్జించెదన్. 56

క. అని వెండియుఁ బలుతెఱంగు
ల్గనఁబడఁగాఁ బల్కి ధరణికాంతునివచనం
బున కలికి మీఱఁజాలని
యనువున మేకొనియె నది గృహంబున కరుగన్. 57

మ. అపు డత్యుజ్జ్వలభూషణాంబరవిశేషాదు ల్సమర్పించి యా
తపనీయాంగిని బల్లకి న్నిలిపి యుద్యత్పంచవాద్యధ్వను
ల్విపులాభ్రాంతర మెల్ల నిండ వినయావిర్భూతిఁ దోడ్తెచ్చి యా
నృపలోకేశ్వరుఁ డింటనిల్పి చనియెం బ్రీతాంతరంగంబుతోన్. 58

క. అంతటఁ గాంతిమతీసతి
యింతంతనరానిప్రేమ నిటు సనఁగా దే
శాంతర నానామనుజుల్
సంతసమున నెంచ మిగుల సన్నుతి కెక్కెన్. 59

క. అని యిట్లు పుష్పహాసుఁడు
ననుపమవైఖరుల విక్రమార్కున కెఱిఁగిం
చె నటంచుఁ జిలుక పలుక
న్వనజాప్తుం డెక్కెఁ బూర్వవసుధాధరమున్. 60

వ. అప్పుడు ప్రభావతి మనోజరథవిఫలీకృతమనోరథయై యవరోధంబున కరిగి నిశాసమయం బగుటయు నవ్వసుంధరాపురందరసంగమానందంబు డెందంబునం గల్పించుకొని యనుభవించుచుం జను దెంచు నచ్చంచలాక్షితో ననంతరకథావిధానంబు వినుమని శుకాగ్రగణ్యుం డిట్లనియె. 61

క. అలవిక్రమార్క భూవరుఁ
డలఘుతరాద్భుతయుతాంతరంగుండై య
వ్వలికథ యడుగంగఁ గుతూ
హలమున నాతనికిఁ బుష్పహాసుం డనియెన్. 62

తే. ఇందులకు నింత విస్మయం బేల విక్ర
మార్క! యిఁక మీఁదఁ గలకథ యవధరింపు
మేను బూర్వక్రమంబున దానియిల్లు
జేరి నిల్చితిఁ దద్రతిస్థితులఁ జెలఁగి. 63

తే. బలి యొసంగినఁ బూజలు సలిపి వేఁడు
కొనినఁ దత్కాంతిమతిమాయ మనమునందు

హత్తుకొని యున్కిచే మానదయ్యె నధిప
కాళికాదేవి నిజశిరఃకంపనంబు. 64

చ. అదిగని పౌరు లెల్లను భయంబునఁ దత్పురనాథుఁ జేరి యాయదన మహాపతివ్రత గుణాంచిత కాంతిమతీలతాంగి నేర్పొదవఁగ నిల్పిన న్నిలుపనోపు మఱెవ్వరి చేతఁ గానియభ్యుదితశివాశిరశ్చలన మోనృప యంచును విన్నవించినన్. 65

మ. ఇదియౌనంచు నరేంద్రుఁ డందఱును దోనేతేరఁగా సర్వసౌ
ఖ్యదమౌ కాంతిమతీగృహంబు దరియంగా వచ్చి ఫాలంబుఁద
త్పదము ల్సోకఁగ మ్రొక్కి యెట్లయిన నంబామూర్ధకంపంబు మా
న్పి దయం బ్రోవు మటంచు దైన్యగతి గాన్పింపంగఁ బ్రార్థించినన్. 66

ఉ. ఆలలితాంగి కేళినిలయంబు కవాటము మాటుఁ జెంది భూ
పాలక యింటివా రిడిన బాముల రచ్చల కెక్కినంత యే
చాలదె యింకమీఁదను నిజంబుగ రట్టున కోర్చునంతకుం
దాళునె యీశరీరము వితావిత యెక్కడిజోలి యక్కటా. 67

తే. అరయఁ దోఁబుట్టుపైఁ గల్గు కరుణ నిందు
వచ్చి యీరీతి దేవరవారె యింత
ప్రార్థన మొనర్చుపట్లఁ గాదనఁగఁ దగునె
యైన నొక చిన్నవిన్నప మవధరింపు. 68

క. భామాజనసామాన్యము
గా మది నన్నెంచు జనులు గననేఁడు మొదల్
గామహిలోపలఁ గానని
నామహిమ మెఱుంగవలయు నరనాథమణీ. 69

తే. ఇలఁ బతివ్రత లగువారు గలిగిరేని
కాళి యొనరించు నిజశిరఃకంపనంబు
మాన్పు మని చాఁటఁ బనుపుము మానవేంద్ర
యప్పు డందటి వగ తెలియంగవచ్చు. 70

క. అని యవ్వధూటి పలుక
న్మనుజకులేంద్రుండు మాఱుమాటాడఁగఁ గొం
కినవాఁడై భువిఁ జాటం
బనిచెం దద్వచనరీతిఁ బ్రకటముగాఁగన్. 71

తే. అంత రాజాజ్ఞ మీఱరాదంచు ధరణిఁ
గలుగుసతు లెల్ల వచ్చి నిక్కమగుభక్తి
నెంత మ్రొక్కిన నంతంత కెచ్చసాగె
ధూర్జటివెలందిమూర్ధవిధూననంబు. 72

తే. కాంతిమతిదక్క మనుజలోకమున నిఁకఁబ
తివ్రతలు లేరటంచు నుదీర్ణవచన
ముఖరులై జనులాడ నమ్ముదిత లెల్ల
సిగ్గుపడి యేగి రప్పు డచ్చెరువుఁ జెంది. 73

ఉ. అంతట రాజమౌళి పునరాగతుఁడై ధరణిన్వధూటికా
సంతతిలోనఁ జూడ నొకసాధ్వియు లేదని యాత్మలోన సి
ద్ధాంత మొనర్చితి న్మముఁ గృతార్థులఁ జేయుమటంచు మ్రొక్క న
క్కాంతిమతీవధూటి యవుఁగాకని కాళిగృహప్రవేశయై. 74

తే. రాజు మొదలయినవారి దూరమున నునిచి
గర్భగృహమున కరిగి వేగమ కవాట
బంధన మొనర్చి గ్రక్కున భద్రకాళి
డాసి నిలుచుండి ధీరతాడంబరమున. 75

క. నామనసువచ్చు కైవడి
నే మెలఁగినఁ జూడలేక యెవ్వతెవే యీ
బూమెలు పన్నఁగ వలదిఁక
యీమేర న్నిలువకున్న నిట్టటుఁజేతున్. 76

తే. అనినం దత్కాళి యెంతకైనను దెగించి
నట్టిదీజంత యేమి సేయంగఁ బూను
నోయనెడుభీతిఁ దలయూఁచు టుడిగినిలువఁ
దరుణి వాకిలి తెఱచి యందఱిని బిలిచె. 77

క. పిలిచిన నరపతి మొదలుగఁ
గలవారలు వచ్చి భద్రకాళిదేవిం
దిలకించి శిరఃకంపము
నిలుచుటకు న్విస్మయాదినిబిడాశయులై. 78

తే. కాంతిమతి భూతలమున సాతాత్కరించి
నట్టియయ్యాదిలక్ష్మిగా కరసిచూడ
మనుజకామినిగాదు సుమ్మనియు మఱియు
మఱియు మ్రొక్కిరి వినయసంభ్రమము లెనయ. 79

ఉ. ఆసమయంబున న్నరవరాగ్రణి భృత్యులు తెచ్చినట్టి సిం
హాసనమందు నవ్వికసితాంబుజలోచన నుంచి వైభవ
శ్రీసముదీర్ణవృత్తి నభిషేకము చేసి విశేషభూషణో
ద్భాసితచిత్రచేలము లపారముగాఁ గయికాన్క చేసి నా
నాసతు లెల్ల మ్రొక్కఁగ నొనర్చి యనేకకృతప్రణాముఁడై. 80

తే. నతు లొనర్చి మహాపతివ్రత యటంచుఁ
బేరుపెట్టి యలంకృతవారణంబు

పై సమాసీనఁ గావించి పటహముఖ్య
భద్రవాద్యరవంబు లంబరము నిండ. 81

వ. ఇవ్విధంబున నక్కాంతిమతి నూరేగించి నిజగృహబహిర్భాగంబున గజావరోహణంబు గావించిన యక్కాంతిమతిచేత సాష్టాంగప్రణామపూర్వకంబుగా ననుజ్ఞాతుండై యానృపాలపురుహూతుం డరుగం దక్కినవారలను బాదపరాగంబు ప్రసాదించి వీడ్కొలుపుచు నమ్మందగమన మందిరాంతరంబునకుం బోయి. 82

తే. వరము లిచ్చు మహాపతివ్రత యటంచు
నేతు కాశీపురాంతరక్షితిజనంబు
లచ్చమగు భక్తి గానుక ల్దెచ్చి చూడ
వేళగానక యుండఁగా వెలసె నధిప. 83

క. అంతయుఁ గనుఁగొని యిఁక నీ
జంత న్నమ్ముదురె యెపుడు చంపునొ యనుచుం
జింతించి యళుకుఁ బాయక
యంతం ద్వర వెడలి కాశి కరిగితి నధిపా. 84

శా. గంగాభంగముల మునింగి నిగమగ్రామేశ్వరు న్విశ్వనా
థుం గీర్తించుచు మ్రొక్కి డుంఠిగజవక్త్రుం గొల్చి యంతంద్రివే
ణిం గాయంబుఁ దొలంచి పూర్వకృతనిర్నిద్రాఘము ల్వాసి నీ
రంగత్పూర్వకృపారసంబునకుఁ బాత్రం బైతి ధాత్రీశ్వరా! 85

క. ఆయద్భుతంబు మదిలోఁ
బాయ మనఁగ లేకయుంటిఁ బదపడి సభలో
నీయాశ్చర్యముఁ గని భూ
నాయక తద్విగుణ మగుట నవ్వుదయించెన్. 86

క. అని తెలుప విక్రమార్కుం
డనుపమ విస్మయతఁ బుష్పహాసుని మన్నిం
చి నితాంతవిభవసౌఖ్యం
బుననుండె న్వింటె వైశ్యభుజగద్వేణీ. 87

క. అని యిట్లు చిలుక పలుకన్
విని మిక్కిలి వెఱఁగుచెంది వెసనంతటిలోఁ
దనచేతి గరలు కనఁబడఁ
జనియెఁ బ్రభావతి రహస్యసదనంబునకున్. 88

తే. కోమటిమెఱుంగుసిబ్బెపుగుబ్బలాఁడి
యంతిపురమున కరిగి సాయంసమయము
గాంచి కైచేసికొని మహీకాంతసంగ
మాభిలాషంబుతోఁ జేర నరుగుదేర. 89

క. కనుగొని గుణసాగరుఁ డో
వనితా చనియెదవె ధరణివల్లభుకడకుం
జను మిఁక నొకథ వినుమని
యనుచుం బలుకం దొడంగె నతివేడుకతోన్. 90

ఇరువదియొకటవకథ

ఉ. అంగవసుంధరాభరణమై యొక పట్టన మంద మొందు మా
తంగతురంగసద్భటకదంబశతాంగతతు ల్చెలంగఁగా
మాంగళికాభిధాన మసమానముగా వహించి యప్పురం
బంగదనామధేయవసుధాధిపుఁదేలు నవేలసంపదన్. 91

ఉ. ఆనరపాలమౌళి కపరాంగము కైవడి నొక్క మంత్రి మే
థానిధినాముఁడై తగు నతండు నిజాంగన జాయమానశో