మహాపురుషుల జీవితములు/పూండి రంగనాథము మొదలియారి

వికీసోర్స్ నుండి

పూండి రంగనాథము మొదలియారి

పూండిరంగనాథము మొదలియారి చెన్న పట్టణమున 1847 వ సంవత్సరమున జన్మించెను. ఆతనితండ్రి సుబ్బరాయ మొదలియారి. ఆంగ్లేయభాషలోఁ బ్రవేశము కలవాఁడై పొలములకు నీరు పంపు కాలువలమీఁద నధికారముగల యొక కంపెనీవద్ద నుద్యోగస్థుఁడుగా నుండెను. సుబ్బరాయ మొదలియారి రాజభాషయగు నింగ్లీషు చెప్పించుట వలన గలిగెడు లాభముల నెఱిఁగినవాఁడు కావున బాల్యము నందె మిక్కిలి చాకచక్యము బుద్ధికుశలతఁ గనబడుచున్న తన కుమారున కావిద్యఁ జెప్పింపఁ నారంభించెను. రంగనాథము బాలుడై యుండగాఁ దండ్రికిఁ జెన్నపట్టణమునుండి యవనాషి యను గ్రామమునకు బదిలి యయ్యెను. కాని యాగ్రామమున నతఁడు చిరకాలముండ లేదు. అక్కడ నుండగా నొకనాటిరాత్రి వానియింట బందిపోటు దొంగలు పడిరి. ఆ మొదలియారి ప్రియపుత్రుఁడగు రంగనాథమునకు దొంగలవలన మహాపాయము సంభవించునని భయపడి వాని నటుకమీఁద దాఁచి కూతునుం దీసికొని దొంగల యెదుటికి బోయి యింటనున్న సర్వస్వము వారికి సమర్పించెను. కానిదొంగలు తనివినొందక యింకను నీవు సొత్తు దాఁచితివి. అది చూపవేని నీ ప్రాణములు నీకు దక్కవుసుమీ" యని వానిని బెదిరించిరి. అప్పుడు తండ్రి గడగడవడంకుచు నటుకమీఁద బిడ్డను దాఁచుట తప్ప వేరు సొత్తు దాఁచలేదని చెప్పెను. చోరులు బాలకునిఁ బయి నుండి క్రిందికిఁ దింపిరి. అప్పుడు రంగనాథము తనప్రాణము నిమిత్తము మిక్కిలి దయనీయములగు మాటలతో దొంగలను బ్రతిమాలుకొనెను. దొంగ లెవ్వరికి హానిజేయకుండ నెట్టెటో యిలు వెడలిపోయిరి. సుబ్బరాయ మొదలియారి యుద్యోగము వెంటనే మాని మరునాడే యవనాషి నిడిచి చెన్న పురికిబోయి యక్కడ కాపుర ముండెను. రంగనాథునికిఁ దండ్రి యింటివద్ద శ్రద్ధతో జదువు చెప్పు చుండెను. రంగనాథము మొదలియారునకు ద్రవిడభాషలో నిరుపమానమైన ప్రవేశము కలదు. అట్లు కలుగుటకు దండ్రి యింటివద్ద స్వభాషలోఁ జేయించిన పరిశ్రమయె కారణమని మన మూహింప వచ్చును. 1860 వ సంవత్సరమున రంగనాథము మదుమూడేండ్ల ప్రాయమువాడై నప్పుడు తండ్రి పచ్చయప్పగారిబడికి చదువనంపెను. అప్పుడతఁడు మూడవతరగతిలో జేరెను. అది యిప్పటికి నాలుగవ ఫారమునకు సమానము. ఆనాటి హిందువులకు పచ్చయ్యప్ప పాఠశాలమీద మిక్కిలి యభిమాన ముండినందున బాలురందఱు నక్కడికే బంపబడుచు వచ్చిరి. రంగనాథుని బుద్ధికుశలత సంపంగి పూవు పరిమళమువలె వ్యాపించుటచే నాపాఠశాలకుఁ బ్రధనోపాధ్యాయుఁడు (ప్రిన్సిపల్) వానింగూర్చి విని మిక్కిలి శ్రద్ధ బూనెను. ఆ సంవత్సర మతఁ డరువదిరూపాయల విద్యార్థి వేతనము సంపాదించెను. సంవత్సరాంతమందైన పరీక్షలో రంగనాథముజూపిన తెలివికి సంతసించి యధికారులు నడుమతరగతిలో జదువకుండగనే వానిని బ్రవేశపరీక్ష తరగతిలో (మెట్రిక్యులేషన్) జేర్చిరి.

ఈ తరగతిలోనుండి యతఁ డనేక బహుమానములం బడసెను. రాజా మాధవరావుగారు గణిత శాస్త్రమునందు నింగ్లీషు భాషా పాండిత్యమునందు మొదటివాఁడగు వానికి నొక బహుమాన మియ్యఁదలచి యా తరగతి బాలుర నందఱఁ బరీక్షింపఁ జేసెను. ఆ పరీక్షలో రంగనాథుఁడే మొదటివాఁడుగఁ గృతార్థుడై బహుమానము గ్రహించెను. ఆకాలమున రంగనాథ మొక చిన్న సాహసము చేసెను. దానింబట్టి యాతనికి తన సామర్థ్య మందెంత విశ్వాసము కలదో యెంత నిర్ణయత్వము స్వతంత్రబుద్ధి వానికడ నున్నవో మనము తెలిసికొనగలము. ఒకసారి స్త్రీ విద్యనుగూర్చి


యొక యుపన్యాసము వ్రాయుమని యుపాధ్యాయుఁడు తరగతిలో బాలురకందఱ కాజ్ఞాపించెను. అది సర్వోత్కృష్టముగవ్రాసిన వారికి గొప్ప బహుమాన మిచ్చునట్లు నిర్ణయము. అనేక బాలకులా విషయములంగూర్చి యుపన్యాసముల వ్రాసిరి. పరీక్షకులచే వ్రాయఁబడిన యుపన్యాసముల వన్నిటిని జదివి రంగనాథము యొక్కయు కుప్పరామశాస్త్రియను మఱియొక బాలకునియొక్కయు వ్రాతలు ప్రశస్తములని యా రెంటిలో నేది ప్రశస్తమో నిర్ణయింపలేక చెన్నపురిలో గొప్పన్యాయవాదులైన నార్టను మెయిను దొరలకుఁ జూపిరి. మెయినుదొర రంగనాథునిదే ప్రశస్తర మనెను. నార్టను కుప్ప రామశాస్త్రి వ్రాసిన దానిని మెచ్చెను. పరీక్షకులు సరిగా నప్పటి నిర్ణయింపలేక హైకోర్టు జడ్జీయగు హాలోవేగారి కుభయుల వ్రాతలం జూపిరి. ఆయన రంగనాథముకే బహుమాన మీయఁదగునని చెప్పెను. కాని యేకారణముచేతనో తుదకు బహుమానము రంగనాథమునకు రాలేదు. అందుకు రంగనాథుడు కుపితుడై తన కెందుచేత బహుమానము రాలేదో యాకారణ మానుపూర్వికఁ గనుగొన నిశ్చయించుకొనెను. అంతలో నతని పాఠశాలయొక్క సంవత్సరోత్సవము వచ్చెను. అయ్యవసరమున జరిగిన సభకు జెన్నపురి గవర్నరుగారగు హారిసు ప్రభువుగా రగ్రాసనాధిపతు లయిరి. ఆయన వచ్చి కూర్చుండిన పిదప రంగనాథుడు లేచి తన యుపన్యాసముఁ జేతపట్టుకొని దానిని గవర్నరుగారికి జూపి యాయన చేతనే తగవు పరిష్కరింప జేసికొనవలయునని బయలుదేర నుపాధ్యాయుడు బాలుని యుత్సాహము గనిపెట్టి తగవు న్యాయముగా బరిష్కరించుర ట్లొడంబడి బలవంతముగ వాని ప్రయత్నము నివారించెను.

1862 వ సంవత్సరమున రంగనాథము మొదలియారీ ప్రవేశ పరీక్షయందు మొదటివాఁడుగ గృతార్థుఁ డయ్యె. ప్రెసిడెన్సీకాలే


జీలో బైపరీక్షల చదువుటకుఁ జేరెను. పచ్చయప్ప పాఠశాలాధికారులు చదువుకొనుటకు వానికిఁ నెలకు కొంతసొమ్ము నీయ వాగ్దానము చేసిరి. ప్రెసిడెన్సీ కాలేజీ యాదినములలో మిక్కిలి యున్నత స్థితిలో నుండెను. సాహిత్యము నందు సముద్రుఁడని చెప్పదగిన థామ్సనుదొరగారు దానికి ప్రధానోపాధ్యాయులై యుండిరి. అదివరకాకళాశాలలో బుద్ధిలో బృహస్పతులవంటి విద్యార్థు లనేకులు చదివి కీర్తిమంతులయిరి. కాని రంగనాథము వారి నంద నణగద్రొక్కెను. లోకమం దెవరికైన నొక శాస్త్రమందు విశేషాభిమాన ముండును. రంగనాథుని కన్ననో తత్వశాస్త్రమందు గణితశాస్త్రమందు నాంగ్లేయ సాహిత్యమందు విశేషించి స్వభాషయగు ద్రావిడమందు మహాభిరుచి కలదు. ఆనాల్గింటిలో నతనికతండె సాటియని చెప్పదగి యుండెను.

థామ్సను దొరయు దక్కిన యుపాధ్యాయులు రంగనాథుని యభివృద్ధి నెంతోశ్రద్ధతో జూచినారను టదియొక యాశ్చర్యము కాదు. అప్పటి డైరక్టరయిన పవెలుదొరగారు హాలోవేదొరగారు సయితము రంగనాథుని బుద్ధికుశలతవిని వానియభివృద్ధివిని నుత్సాహపడుచు వచ్చిరి. విద్యార్థిగానున్న కాలముననే మహాపురుషుల యాశ్చర్యమునకు బాత్రుఁడయినవాడు మనలో నితఁ డొక్కఁడే యని చెప్పవచ్చును. అతనికి గణితశాస్త్రమందు నపారమైన ప్రజ్ఞ యున్నను నాంగ్లేయ సాహిత్యమందుఁగూడ నాంగ్లేయు లనేకులే వానికి దీసిపోదురు. ఆతనితో సమానముగ నింగ్లీషువ్రాసి మాథలాడగల తెల్లవారిసంఖ్య తక్కువయని యనేకుల యభిప్రాయము. తిరువాన్కూరు రాజ వంశస్థుఁ డగు రామవర్మ తాను మహారాజు కాకమునుపే చెన్నపురి రాజధానిలో పట్టపరీక్షయందు మొదటి తరగతిలో నెవఁడు కృతార్థుఁ డగునో యావిద్యార్థికి మూడువందల


రూపాయలు విలువగల బంగారు పతకము బహుమానము జేయ వలసినదని యా మొత్తమును వడ్డివల్ల గూర్చునట్టి మూలధనమును చెన్నపురి యూనివరిసిటీవారికి 1862 వ సంవత్సరమునం దిచ్చెను. పట్ట పరీక్షయందు మొదటి తరగతిలో నెవరుకృతార్థులు కానందున 1863, 64 సంవత్సరములలో నెవరికి నీయఁబడలేదు. 1865 వ సంవత్సరములో రంగనాథముమొదలియార్ పట్టపరీక్షయందు మొదటి తరగతిలో గృతార్థుడైనందున పతకము వాని కీయఁబడెను.

ఈపతక మొక్కటియేకాదె రంగనాథుడు బహుపతకములను బహుపుస్తకములను బహుమానముగాఁ బడసెను. రంగనాథుని యపార మేథాశక్తికి గురువగు థామ్సను మిక్కిలి సంతసించి వానిని విడువలేక విద్యాభ్యాసము ముగియగానే గణితశాస్త్రమునందు సహాయోపాధ్యాయుఁడుగఁ దన కళాశాలలోనే నియమించెను. రంగనాథముయొక్క మిత్రులు గురువులు విశేషముగ నాంగ్లేయులే యగుట చేత వారి మార్గము ననుసరించి యతఁడు తన కనేకపర్యాయము లితరోద్యోగములు సంపాదించుకొనుట వీలు కలిగినను యవి నిరాకరించి విద్యాశాలయందే యావజ్జీవము గడపెను. చెన్నపురి దొరతనమువారు సమయము వచ్చినప్పుడల్ల రంగనాథుని ప్రజ్ఞాదులం గొనియాఁడుచు వచ్చినను ప్రజ్ఞ కుం దగునట్టి ప్రోత్సాహము మాత్రము సరిగా నీయలేదు. ఏలయన ప్రెసిడెన్సీ కాలేజీలో రంగనాథుడు గణితశాస్త్రోపాధ్యాయుఁడుగా స్థిరపడునప్పటికి రమారమి పదియాఱు సంవత్సరములు పట్టెను.

1872 వ సంవత్సరమున రంగనాథుఁడు చెన్నపురి యూనివరిసిటీలో నొక ఫెల్లో జేయఁబడెను. అది మొదలుకొని యతఁడు చనిపోవువఱకు నేఁటేఁట నీగౌరవము పొందుచునే యుండెను. విద్యా విషయమున రంగనాథము మొదలియార్‌గారి యభిప్రాయమునకు


జూపఁబడు గౌరవము మఱి యేహిందువుని యభిప్రాయమునకు జూపఁబడుట లేదు. ఏయభిప్రాయమయిన జెప్పవలసివచ్చినప్పుడు రంగనాథము మొదలియార్ యొక మనుష్యునకుగాని యొక తెగకుగాని లాభము కలుగునట్టి పక్షపాతపు బలుకుల బలుకక సర్వవర్ణ ములవారి యభివృద్ధికి ననుకూలములగు వచనములఁ జెప్పుచువచ్చెను. విద్యాశాఖలో నేసభగూడినను నేచిన్నకమిటీ యేర్పడినను రంగనాథము మొదలియార్ యందుండవలసినదే. ఏచిన్న తీరుమానమైనను వానిచేతి దిద్దుబాటు బడయని పక్షమున నవి వ్యాసప్రోక్తము కానట్లే యనికమిటీలలోనిమెంబర్లు తలచుచువచ్చిరి. 1890 వ సంవత్సరమందు దొరతనమువారు ద్రవిడభాషాంతరీకరణముఁ జేయుటకు వాని నేర్పఱచుకొనిరి. 1829 వ సంవత్సరము జెన్నపట్టణమున కతఁడు షరీపుగా నియమింప బడెను.

ఒక్క విద్యావిషయమందే గాక ప్రజాక్షేమకరములయిన సమస్త వ్యవహారములందు దొరతనమువారు ప్రజలు రంగనాథుని యాలోచనము గైకొనుచు వచ్చిరి. చెన్నపురి మునిసిపాలిటీయందతఁడొక సభికుఁడై యనేకోపన్యాసముల నిచ్చెను. అవి యెంతో మనోహరములుగ నుండెను. చెన్న పురమందు స్వదేశీయులచేత స్థాపింపబడిన కాస్మాపాలిటన్ క్లబ్బునకు రంగనాథము మొదలియారి ప్రాణమని చెప్పవచ్చును. అతని మృదుమధురసంభాషణము చేత ప్రతి సాయంకాలము సభయంతయు గలకల లాడుచుండెనని వాని నెఱిఁగినవారిప్పటికిఁ జెప్పుదురు. 1890 వ సంవత్సరమందు బట్టపరీక్ష మొదలగు శాస్త్రపరీక్షలయందుఁ గృతార్థులైన విద్యార్థులకు శిష్టాచారముగ జరుగుచున్న హితోపదేశమును జేయునట్లు గవర్నరు గారు రంగనాథము నేర్పఱచిరి. అప్పుడతని నోటనుండి వచ్చిన యింగ్లీషుభాష మార్దవ మేమని చెప్పెను. అప్పు డొక వార్తాపత్రికలో


వానియుపన్యాసముగూర్చి నీక్రిందివిధముగా వ్రాయఁబడెను. "ఎదుటనుండి రంగనాథము మొదలియారి చేయు నుపన్యాసము వినినవారు తప్పక యాతఁడు స్వదేశస్థు డనుకొందురు. కాని చాటుననుండి వినిన పక్షమున శైలింబట్టి పదప్రయోగమును బట్టి యుచ్ఛారణముంబట్టి మాటలాడుచుండిన వాఁ డాంగ్లేయుఁ డనుకొనవలసినదే కాని నల్లవాఁడనుటకుఁ వీలులేదు." ఆయుపన్యాసమును మనవారు తెల్లవారు గూడ బహువిధముల శ్లాఘించిరి.

రంగనాథము నిజముగా హిందూసంఘమున కొక యలంకారమని చెప్పవచ్చును. ఈయలంకారము 1893 వ సం|| డిశంబరునెల 10 వ తేదీని దేశముశోక మగ్నమగునట్లు నేలపాలయ్యెను. ఆయనకొద్దిదినములు జ్వరముతో బాధపడిలో కాంతరగతుఁడయ్యెను. ఆజ్వరమువానిం దుదముట్టించునని యెవ్వరు దలంప లేదు. మరణమునకుముందు నాలుగు దినముల క్రిందటివఱకు నతడు పాఠశాలకుబోవుచునేయుండెను. అతఁ డతిపరిశ్రమవలన నకాలమృత్యువు వాతబడెనని లోకులు తలంచిరి. వాని మరణమునకు వగవని హిందువులు కాని మహమ్మదీయులు కాని యూరోపియనులుకాని లేరు. ప్రెసిడెన్సీకాలేజీ కౌన్సిలువారు కాలేజీకి రంగనాథము మొదలియారు చేసిన మహోపకారమునుగ్గడించి గణితశాస్త్రమునందెగాక తత్వశాస్త్రమందు, జరిత్రాశాస్త్రమందు వాని కసమాన ప్రజ్ఞ గలదని, వానిమరణమువలన దమకాలేజీకి గలిగిన నష్టమునకు మిక్కిలి విచారించిరి. అప్పుడు డైరక్టరుగానుండిన డాక్టరు డంకనుదొరగారు రంగనాథముతోగలిసి చిరకాలము పనిచేసిన సహకారియగుటచే వాని మరణమునకు మిక్కిలివగచి వానిపెద్దకుమారునిపేర నొక జాబు వ్రాసెను. అందులో నీక్రింది సంగతులున్నవి. "కొట్టకొనవఱకు నీతండ్రి నాయభిప్రాయమున మిక్కిలి యున్నతపదము నాక్రమించెను. చెన్నపట్టణములోనుండిన యేయూరో


పియనుఁడు నీతండ్రికి నావంటి చిరమిత్రుడు కాడు. నావలె నతని హృదయ మనోగతములైన గుణములను ప్రజ్ఞలను నెఱింగినవారు లేరు. అతఁడు మహాపండితుఁడు, రాజభక్తుడు. ఆలోచన చెప్పునప్పుడు దూరదర్శిజ్ఞాని, మరియాదలకు నిధి. ఇట్లుండుట చేత నతడు సర్వసమ్మతుఁడై యుండెను. ఆయనపేరు శాశ్వతముగా జ్ఞాపకముండునటుల జేయుటకు బ్రయత్నములు జరుగుచున్నవని వినుచున్నాము. అతఁడు మనకు జూపినమార్గము ననుసరించుటయే నతనికి గౌరవము చేయుట. జ్ఞాపకార్థ మేదేని నిర్మించుటయని నాయభిప్రాయము."

1894 వ సం||రం ఫిబ్రేవరు నెలలో రంగనాథము మొదలియారిపేరు శాశ్వతముగానుండుటకు జెన్న పురమందొక్క మహాసభ జరిగెను. ఆసభకు గవర్నరుగా రగ్రాసనాధిపతులైరి. ఆసమయమున చెన్నపురము హైకోర్టులో జిరకాలము జడ్జీపనిజేసిన సర్. టి. ముత్తుస్వామియయ్యరుగారు క్రిస్టియన్ కాలేజీలోఁ బ్రధానోపాధ్యాయులుగానుండిన డాక్టరు మిల్లరుదొరగారు మొదలగు ననేకులు రంగనాథమునుగూర్చి ప్రసంగించిరి. అప్పుడు ముత్తుస్వామిఅయ్యరుగారు చేసిన యుపన్యాసములోని కొన్ని వాక్యములిం దుదాహరింపఁ బడుచున్నవి. "వానితో గాఢమైనపరిచయము స్నేహము జేయుటవలన నతని ప్రజ్ఞలు నిరూపమానములని నేను తెలిసికొంటిని. అతఁడుపాధ్యాయుఁడుగా విద్వాంసుడుగా దేశాభివృద్ధికారకుఁడుగ నుండి చేసిన యుపకారము విలువలేనిది. అతని పరిశ్రమము, పూనిక, మిక్కిలి యద్భుతములైనవి. తన యర్హకృత్యము నెరవేర్చుచు నిరంతరము గ్రంథపఠనమందె యతఁడు కాలముపుచ్చు చుండును. ఒకసారి నేను చాలసేపు షికారుదిరుగగా నన్నతఁడు చీవాట్లు పెట్టెను. అది నాకిప్పటికి జ్ఞాపక మున్నది. ఈకాలము మీరు పాడుచేయక మంచిపనిక్రింద నుపయోగించుచున్న బాగుండునని నాకాయన యుపధేశము చేసెను".


రంగనాథునకు గలిగిన మహాఖ్యాతి వాని బుద్ధివిశేషముచేతనేగాని నిరంతరము పాటుబడుటవలనగాదు. దీని బట్టి యాతఁడు పాటుపడు వాడు గాడని మాయభిప్రాయముగాదు. కొందఱు మేథావంతులు కాకపోయిన విశేష పరిశ్రమముజేసి గొప్పవారగుదురు. రంగనాథము మొదలియారి నిరుపమానమైన బుద్ధిసూక్ష్మత గలిగి దానికిం దోడుగ బరిశ్రమజేసి ఖ్యాతిగాంచినవాడు. రంగనాథము మొదలియారి సంభాషించుచుండగా విన్న వారు మహానందభరితు లగుచుందురు. ఆతని భాషాశైలి మనోహరమై చాకచక్యముగలిగి మనస్సు నానందవార్థి నోలలాడించుచుండును. ప్రసంగములో నడుమనడుమ నతఁడు మహాకవుల యుద్గ్రంథములలోనుండి సంతోషజనకములైన పద్యములను వాక్యములను దీసి కంఠపాఠముగజదివి వినువారి వీనుల కెంతయు విందుచేయుచుండును. ఆంగ్లేయభాషలో నతనికి షేక్స్పియరు మహాకవియొక్క కవిత్వము మిక్కిలి ప్రియమైనది.

సాధారణముగ నింగ్లీషుభాషలో బ్రవీణతగల విద్వాంసులకు స్వభాషాపరిచయముండుటయరిది. రంగనాథము మొదలియారి విషయమట్లుగాదు. ద్రావిడభాషయందు మహాపండితులతో సమానమైన పాండిత్యము వానికిగలదు. ప్రసంగము వచ్చినప్పుడు సందర్భశుద్ధి యెఱిఁగి యతఁడు ద్రవిడ భాషలోనున్న కంబరామాయణమునుండి కొన్ని పద్యములనుదీసి చదివి దానిలోనుండు భావాదులనుమిత్రులకు బోధించుచుండును. ఈ కాలమున నింగ్లీషుభాషలోఁ గృషిచేయ విద్యార్థులు స్వభాషను బొత్తుగ నెఱుగక చెడిపోవుచున్నారని యాయన పలుమారు మిత్రులతోజెప్పి విచారించుచుండును. ఆయన సర్వవిధములచేత మిక్కిలి పెద్దమనుష్యుఁడు. తరుచుగా గొప్పవారితో సహవాసము చేయుటచేత నాతనిపద్ధతులు మిక్కిలి మంచివై యుండెను. అతని హృదయము మిక్కిలి మెత్తనిది. ఆయన జీవితములోఁ


జాలభాగము పేదలగు విద్యార్థుల విద్యనిమిత్తము ప్రతిమాసము వ్యయము చేయుచుండెను. అట్టిదానములు గుప్తములై యుండును. ఇతరులయందున్న బుద్ధిసూక్ష్మతల నతడు మెచ్చి సంతసించు చుండును. ఆయనకు ముత్తుస్వామియయ్యరును గూర్చి యీక్రింది యభిప్రాయము గలదు. "బుద్ధిసంపదను బట్టిచూడగా నీకాలమున హిందూ దేశమునఁ బుట్టిన వారిలో ముత్తుస్వామియయ్యరే శ్రేష్ఠుఁడు." రంగనాథము మొదలియారుచేసిన గ్రంథమొకటి కలదు. అది కంచి కాలందకమను ద్రవిడ భాషా పద్యకావ్యము.