పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము/కలియుగధర్మ ప్రకారంబు

వికీసోర్స్ నుండి
తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము)
రచయిత: నారయ


కలియుగధర్మ ప్రకారంబు[మార్చు]

తెభా-12-20-వ.
అనిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం డిట్లనియె; “కలియుగం బతిపాప సమ్మిళితంబు; గాన దురితంబు లేలాగున రాకుండఁ జేయుదురు? కాలం బే క్రమంబున నడచుఁ? గాలస్వరూపకుం డైన హరి ప్రభావం బేలాగునం గానఁబడు? నీ జగజ్జాలం బెవ్విధంబున నిలుచు?” నని యడిగిన రాజేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియెఁ;“ గృత త్రేతా ద్వాపర కలి యుగంబులను యుగ చతుష్టయంబును గ్రమంబుగాఁ బ్రవర్తించు, ధర్మంబునకు సత్య దయా తపో దానంబులు నాలుగు పాదంబులై నడచు; శాంతిదాంత్యాత్మజ్ఞాన వర్ణాశ్రమాచారంబులు మొదలగునవి గలిగి ధర్మంబు మొదటి యుగంబున నాలుగు పాదంబులం బరిపూర్ణం బై ప్రవర్తిల్లు; శాంతిదాంతికర్మాచరణాది రూపం బగు ధర్మంబు మూఁడు పాదంబుల రెండవ యుగంబునం బ్రవర్తిల్లు; విప్రార్చనాహింసావ్రత జపానుష్టానాది లక్షణంబులు గలిగి ధర్మంబు రెండు పాదంబుల మూడవ యుగంబునం దేజరిల్లు; మఱియు జనులు గలియుగంబున దర్మరహితులు, నన్యాయకారులు, క్రోధమాత్సర్యలోభమోహాది దుర్గుణ విశిష్టులు, వర్ణాశ్రమాచారరహితులు, దురాచారులు, దురన్నభక్షకులు, శూద్రసేవారతులు, నిర్దయులు, నిష్కారణవైరులు, దయాసత్యశౌచాది విహీనులు, ననృతవాదులు, మాయోపాయులు, ధనవిహీనులు, దోషైక దృక్కులునై పాపచరితులగు రాజుల సేవించి, జననీజనక సుత సోదర బంధు దాయాద సుహృజ్జనులం బరిత్యజించి, సురతాపేక్షులై కులంబులం జెఱచుచుండెదరు; మఱియు క్షామ డామరంబులం బ్రజా క్షయం బగు; బ్రాహ్మణులు దుష్ప్రతిగ్రహవిహారులై యజ్ఞాదికర్మంబులు పదార్థపరులై చేయుచు హీనులై నశించెద; రట్లుగాన యీ కలియుగంబున నొక్క ముహూర్తమాత్రం బయిన నారాయణస్మరణ పరాయణులై మనంబున ‘శ్రీనృసింహ వాసుదేవ సంకర్ష’ణాది నామంబుల నచంచల భక్తిం దలంచు వారలకుఁ గ్రతుశత ఫలంబు గలుగు; నట్లు గావున రాజశేఖరా! నీ మది ననవరతంబు హరిం దలంపుము; కలి యనేక దురితా లయంబు గాన, యొక్క నిమేషమాత్రంబు ధ్యానంబు సేసినం బరమ పావనత్వంబు నొంది కృతార్థుండ వగుదు” వని పలికి మఱియును.
టీక:- అనిన = అనగా; శుక = శుకుడు అనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = గొప్పవాని; కిన్ = కి; రాజేంద్రుండు = మహారాజు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను; కలియుగంబున్ = కలియుగము; అతి = మిక్కిలి; పాప = పాపములతో; సమ్మిళితంబు = కూడినది; కాన = కనుక; దురితంబులు = పాపాలు; ఏలాగునన్ = ఏవిధముగా; రాకుండన్ = కలగకుండా; చేయుదురు = చేసుకొనెదరు; కాలంబు = కాలము; ఏ = ఏ; క్రమంబునన్ = విధముగా; నడచున్ = వర్తించును; కాల = కాలమే; స్వరూపకుండు = స్వరూపముగా కలవాడు; ఐన = అయిన; హరి = విష్ణుమూర్తి; ప్రభావంబు = ప్రభావము; ఏలాగునన్ = ఏవిధముగా; కానంబడున్ = తెలుస్తుంది; ఈ = ఈ; జగజ్జాలంబు = లోకాలన్ని; ఏ = ఏ; విధంబునన్ = విధముగా; నిలుచున్ = నిలబడతాయి; అని = అని; అడిగిన = ప్రశ్నించిన; రాజేంద్రున్ = మహారాజున; కున్ = కు; శుక = శుకుడు అనెడి; యోగీంద్రుండు = మహాయోగి; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను; కృత = కృతయుగము; త్రేత = త్రేతాయుగము; ద్వాపర = ద్వాపరయుగము; కలియుగంబులను = కలియుగములను; యుగ = యుగములు; చతుష్కంబునున్ = నాలుగింటిలోను; క్రమంబుగా = వరుసగా; ప్రవర్తించు = నడచెడి; ధర్మంబున్ = ధర్మమున; కున్ = కు; సత్య = సత్యము; దయా = దయ; తపస్ = తపస్సు; దానంబులు = దానములు; నాలుగు = నాలుగు (4); పాదంబులు = పాదాలు; ఐ = అయ్యి; నడచున్ = ఉంటాయి; శాంతి = శాంతి; దాంతి = దాంతి {దాంతి - బ్రహ్మచర్యాది తపఃక్లేశములను ఓర్చుకొనుట}; ఆత్మజ్ఞాన = బ్రహ్మజ్ఞానము; వర్ణ = చాతుర్వర్ణముల యొక్క; ఆశ్రమ = చతురాశ్రముల యొక్క; ఆచారంబులున్ = ఆచారములు {ఆచారము - పాటించవలసిన నడత}; మొదలగునవి = ఆదులు; కలిగి = ఉండి; ధర్మంబున్ = ధర్మము; మొదటియుగంబున = మొదటి(కృత)యుగంలో; నాలుగు = నాలుగు (4); పాదంబులన్ = కాళ్ళమీద; పరిపూర్ణంబు = నిండుగాఉన్నది; ఐ = అయ్యి; ప్రవర్తిల్లున్ = నడుచును; శాంతి = శాంతి; దాంతి = దాంతి; కర్మాచరణ = యజ్ఞయాగాదులు; ఆది = మున్నగువాని; రూపంబు = లక్షణములుకలది; అగు = ఐన; ధర్మంబు = ధర్మము; మూడు = మూడు (3); పాదంబులన్ = కాళ్ళమీద; రెండవయుగంబున = రెండవ(ద్వాపర)యుగంలో; ప్రవర్తిల్లున్ = నడచును; విప్ర = బ్రాహ్మణులను; అర్చన = పూజించుట; అహింసా = అహింసవర్తనందు; వ్రత = దీక్ష; జపా = నామాదులజపించుట; అనుష్టాన = చేయుట; ఆది = మున్నగు; లక్షంబులు = లక్షణములు; కలిగి = ఉండి; ధర్మంబు = ధర్మము; రెండు = రెండు (2); పాదంబులన్ = కాళ్ళమీద; మూడవయుగంబున = మూడో(ద్వాపర)యుగంలో; తేజరిల్లు = ప్రకాశించును; మఱియు = ఇంక; జనులు = ప్రజలు; కలియుగంబున్ = కలియుగమునందు; ధర్మ = ధర్మము; రహితులు = లేనివారు; అన్యాయకారులు = అన్యాయలుచేయువారు; క్రోధ = క్రోధము; మాత్సర్య = మచ్చరము; లోభ = లోభము; మోహ = మోహము; ఆది = మున్నగు; దుర్గుణ = దుర్గుణములుతో; విశిష్టులు = అధికముగాగలవారు; వర్ణ = జాతిననుసరించిన; ఆశ్రమ = ఆశ్రమాన్ననుసరించిన; ఆచార = ఆచారములేవి; రహితులు = పాటించనివారు; దురాచారులు = చేయరానిపనులు చేయువారు; దురన్న = తినరాని ఆహారము; భక్షకులు = తినువారు; శూద్ర = శూద్రులను, నీచులను; సేవా = సేవించుటందు; రతులు = లగ్నమగువారు; నిర్దయులు = దయలేనివారు; నిష్కారణ = కారణమేమిలేక; వైరులు = శత్రుత్వమువహించువారు; దయా = దయ; సత్య = సత్యము; శౌచ = శౌచము {శౌచము - నిర్మలత్వము}; ఆది = మొదలగుగుణములు; విహీనులున్ = లేనివారు; అనృత = అసత్యములు; వాదులు = మాట్లాడువారు; మాయ = కపట; ఉపాయులు = ఉపాయములు పన్నువారు; ధనవిహీనులు = దరిద్రులు; దోష = తప్పులయందు; ఏక = మాత్రమే; దృక్కులున్ = దృష్టికలవారు; ఐ = అయ్యి; పాప = పాపపు; చరితులు = శీలముగలవారు; అగు = ఐన; రాజుల = ప్రభువులను; సేవించి = సేవిస్తూ; జననీజనక = తల్లిదండ్రులను; సుత = కొడుకులను; సోదర = సోదరులను; బంధు = బంధువులను; దాయాద = జ్ఞాతులను; సృహృజ్జనులన్ = స్నేహితులను; పరిత్యజించి = విడిచిపెట్టి; సురత = కాముకకర్మ యందే; ఆపేక్షులు = కాంక్షగలవారు; ఐ = అయ్యి; కులంబులన్ = వంశపవిత్రతలను; చెఱచుచుండెదరు = కూలదోస్తుంటారు; మఱియు = ఇంకా; క్షామ = కరువు కాటకములచేత; డామరంబులన్ = దోపిడాది ఉపద్రవాలచేత {డామరము - కొల్ల మొదలగు దేశోపద్రవము, హావిడి, ఉపద్రవము}; ప్రజా = ప్రజలు; క్షయంబున్ = నాశనమగుటలు; అగున్ = జరుగును; బ్రాహ్మణులు = విప్రులు; దుష్ప్రతిగ్రహ = తీసుకోరాని దానములు తీసుకొని; విహారులు = తిరుగువారు; ఐ = అయ్యి; యజ్ఞ = యాగములు; ఆది = మున్నగు; కర్మంబులు = కార్యక్రమములు; పదార్థపరులు = ధనమునందాసక్తికలవారు; ఐ = అయ్యి; చేయుచున్ = ఆచరించుచు; హీనులు = నీచులు; ఐ = అయ్యి; నశించెదరు = నశిస్తారు; అట్లుగాన = అందుచేత; ఈ = ఈ; కలియుగంబునన్ = కలియుగమునందు; ఒక్క = ఒకే ఒక్క; ముహుర్త = ముహుర్తకాలము; మాత్రంబున్ = పాటు; అయిన = ఐనప్పటికి; నారాయణ = హరిని; స్మరణ = స్మరించుటందు; పరాయణులు = లగ్నమైనవారు; ఐ = అయ్యి; మనంబునన్ = మనసులో; శ్రీ = మహనీయమైన; నృసింహ = నరసింహస్వామి; వాసుదేవ = శ్రీకృష్ణా; సంకర్షణ = సంకర్షణుడా {సంకర్షణుడు - శత్రువులను ప్రళయమందలి జనములను సంహరించువాడు, విష్ణువు}; ఆది = మున్నగు; నామంబులన్ = పేర్లతో; అచంచల = సుస్థిరమైన; భక్తిన్ = భక్తితో; తలంచు = స్మరించెడి; వారలు = వారి; కున్ = కి; క్రతు = యజ్ఞములు; శత = వంద; ఫలంబున్ = చేసిన ఫలితము; కలుగున్ = లభించును; అట్లుగావున = అందుచేత; రాజశేఖరా = మహారాజా; నీ = నీ యొక్క; మదిన్ = మనసునందు; అనవరతంబు = నిరంతరాయముగా; హరిన్ = విష్ణుమూర్తిని; తలంపుము = స్మరించుము; కలి = కలికాలము; అనేక = బహు; దురితా = పాపములకు; ఆలయంబు = పుట్టిల్లు; కాన = కనుక; ఒక్క = ఒకే ఒక్క; నిమేష = నిమేషముపాటు {నిమేషము - క్షణములో మూడోవంతు కాలము, (చూ. కాల మానమునకు వివరముల దస్త్రము)}; మాత్రంబున్ = మాత్రమైన; ధ్యానంబున్ = ధ్యానము; చేసినన్ = చేసినచో; పరమ = ఉత్తమమైన; పావనత్వంబు = పవిత్రతను; ఒంది = పొంది; కృతార్ధుండవు = ధన్యుడవు; అగుదువు = ఔతావు; అని = అని; పలికి = చెప్పి; మఱియును = ఇంకను.
భావము:- అని శుకయోగి పరీక్షిన్మహారాజునకు చెప్పాడు. అప్పుడు పరీక్షన్మహారాజు శుకమహర్షిని ఇలా అడిగాడు. “కలియుగం ఘోరపాపాలకు ఆలవాలం కదా. మరి ఈ కాలంలో ప్రజలు తమకు పాపాలు చెందకుండ ఏమి చేయాలి? కాలం ఏవిధంగా నడుస్తుంది? కాలస్వరూపుడు విష్ణుదేవుని ప్రభావం ఏ విధంగా తెలుస్తుంది? ఈ లోకాలన్నీ ఏవిధంగా నిలబడతాయి?” అంతట,
శుకమునీంద్రుడు మహారాజుకు ఈవిధంగా బదులు చెప్పాడు. “కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని యుగాలు నాలుగు. ఆ నాలుగు యుగాలు వరుసగా నడుస్తుంటాయి. ధర్మానికి సత్యము, దయ, తపస్సు, దానము అని నాలుగు పాదాలు. ప్రథమ యుగం కృతయుగంలో శాంతి, దాంతి, ఆత్మజ్ఞానము, వర్ణాచారాలు, ఆశ్రమాచారాలు మున్నగునవి కలిగి ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది.
రెండవ యుగం త్రేతాయుగంలో శాంతి, దాంతి, కర్మాచరణ మున్నగు లక్షణాలు కలిగి ధర్మం మూడు పాదాలతో నడుస్తుంది.
మూడవ యుగం ద్వాపరయుగంలో బ్రాహ్మణపూజ, జపానుష్టానములు, అహింసావ్రతము మున్నగు లక్షణాలు కలిగి ధర్మం రెండు పాదాలతో ప్రకాశిస్తుంది.
ఇంక నాలుగవ యుగం కలియుగంలో జనులు ధర్మదూరులు, అన్యాయం ఆచరించే వారు, క్రోధం మాత్సర్యం మోహం లోభం మున్నగు దుర్లక్షణాలు కలవారు, అయి ఉంటారు. వర్ణాచారాలను ఆశ్రమాచారాలను విడిచిన వారు, దురాచార పరులు, తినరాని ఆహారం తినువారు, శూద్రసేవాసక్తులు, దయలేనివారు, నిష్కారణ వైరాలు పెట్టుకునేవారు, అబద్ధాలకోరులు, కపటోపాయాలుపన్నువారు, దయ సత్యము శౌచము మున్నగు సుగుణాలు లేనివారు, దరిద్రులు, దోషపూరిత చూపులు కలవారు అయి ఉంటారు. అంతేకాకుండా పాపశీలం కల రాజులను సేవిస్తూ ఉంటారు. తల్లి తండ్రి కొడుకు సోదరుడు చుట్టం జ్ఞాతి స్నేహితుడు అన్న అనురాగాలు లేకుండా ఉంటారు. కేవలం కాముక కర్మ యందే కాంక్ష కలిగి తిరుగుతూ ఉంటారు. కులపవిత్రతను కూలదోస్తూ ఉంటారు. ఇంకా ఆ కలికాలంలో కరువుకాటకాలవలన ప్రజలు నశించిపోతుంటారు. బ్రాహ్మణులు పరిగ్రహింపరాని దానాలు పరిగ్రహిస్తూ ఉంటారు. భౌతిక పదార్థాల మీద మాత్రమే ఆసక్తితో యజ్ఞయాగాదులు చేస్తూంటారు. యధేచ్ఛావిహారులై ఉంటారు. ఇలా భ్రష్టులు నీచులు కావటంచేత నశిస్తారు.
కాబట్టి ఈ కలియుగంలో ఒక్కక్షణమైనా సరే శ్రీహరి స్మరణ పరాయణులు అయి, శ్రీనృసింహ, వాసుదేవ, సంకర్షణ మొదలైన నామాలతో సుస్థిరమైన భక్తితో పలకాలి. ఆ విధంగా హరినామస్మరణ పరాయణులు అయిన వారికి స్మరణమాత్రాన వందయజ్ఞాలు చేస్తే వచ్చే అంత ఫలం వస్తుంది.కాబట్టి రాజోత్తమా! నీ మనస్సులో నిరంతరాయంగా హరిని స్మరించు. కలియుగం అనేక పాపాలకు పుట్టిల్లు. కావున, ఒక్క నిమిషం ధ్యానం చేసినా ఉత్తమమైన పవిత్రత పొంది కృతార్ధుడవు అవుతావు.” అని చెప్పి శుకమహర్షి
మరల ఇలా చెప్పసాగాడు.

తెభా-12-21-క.
"మూవ యుగమున నెంతయు
వేడుక హరికీర్తనంబు వెలయఁగ ధృతిచేఁ
బాడుచుఁ గృష్ణా! యనుచుం
గ్రీడింతురు కలిని దలఁచి కృతమతు లగుచున్. "

టీక:- మూడవయుగమున = ద్వాపరయుగమునందు; ఎంతయున్ = మిక్కిలి; వేడుకన్ = ఉత్సాహముతో; హరి = కృష్ణుని; కీర్తనంబు = కీర్తనలను; వెలయంగ = ప్రకాశవంతముగ; ధృతి = పూనిక; చేన్ = తోటి; పాడుచున్ = ఆలపించుచు; కృష్ణా = శ్రీకృష్ణా; అనుచున్ = అంటు; క్రీడింతురు = విహరించెదరు; కలిని = కలికాలమును; తలచి = తలచుకొని; కృతమతులు = మనసునధరించినవారు; అగుచున్ = ఔతూ.
భావము:- “మూడవ యుగం అయిన ద్వాపరంలో "కృష్ణా"అని హరినామ స్మరణ చేస్తూ ఉంటారు. హరిని స్తోత్రాలు ఆలపిస్తూ ఉంటారు. కలిని తలచి జాగ్రత్త పడువారు అయి భగవంతుని యందు క్రీడిస్తూ ఉంటారు.”