పుట:సకలనీతికథానిధానము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మున్నుడి


నీతిబోధకములగు గ్రంథములు తెలుఁగువాఙ్మయమునఁ బెక్కులు గలవు. నారాయణకవి, భానుకవి వేంకటనాథుల పంచతంత్రానువాదములు, దశకుమారచరిత్రమువంటి గద్యకావ్యముల యనువాదములు కదిరీపతి కృతమగు శుకసప్తతి, అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతి వంటికథలు విక్రమార్కగాథలు, ఇవియన్నియును నీతిబోధక వాజ్మయమునకు చెందినవే. సకలనీతి కథానిధానముగూడ యీ శ్రేణిలోనిది. ఈకృతి ఎఱ్ఱయకవిది. ఐదాశ్వాసముల హృద్యప్రబంధము. ఇందు బృహత్కథ, దశకుమారచరిత్ర కాదంబరి మొదలగు వానిలోని కథలే కాక కలియుగరాజుల చరిత్రలుకూడ కొన్ని వర్ణింపబడినవి. అనుప్రసక్తములుగా చిన్న చిన్న నీతికథలేశాక బేతాళకథలును జొనుపబడినవి. అనేక నీతి శ్లోకములకిందు తెలుగుసేత కలదు,

కృతికర్త - కాలము

ఈ కావ్యరచయిత ఎఱ్ఱయ శ్రీవత్సగోత్రుఁడు, కూచనామాత్య పుత్రుడు, “ అష్టభాషాకవితాప్రవీణ ” “ నవఘంటాసురత్రాణ " అను బిరుదములు కలవాడు. ఈతఁడే కొక్కోక పండితకృతమగు రతిరహస్యమును దెలిగించెను. పురాణసారమను వేఱొకకృతి గూడ నీతఁడు రచించెనట. (ప్రథమాశ్వాసము 18వ పద్యము చూడుడు.) అది గానరాదు. కుంటముక్కుల పినభైరవమంత్రి ప్రేరణమున నీకవి యా కృతిని శ్రీవేంకటేశ్వరస్వామి కంకతమొనర్చెను. భైరవమంత్రి పినతండ్రి మల్లమంత్రి. ఈతఁడే కొక్కోక కృతిపతి. పిన భైరవమంత్రి కొండపల్లి కిని, మల్లమంత్రి వినుకొండకును పదునైదవశతాబ్ది ఉత్తరభాగమున ప్రభువు లుగానుండిరను చరిత్ర నిర్ణయమువలన కృతికర్త ఎఱ్ఱయ కృష్ణామండలపు కొండవీటిసీమవాసిగా ఆకాలముననే వెలసినట్లు తేలుచున్నది.