నానకు చరిత్ర/సప్తమాధ్యాయము

వికీసోర్స్ నుండి

శ్రీ

నానకు చరిత్ర.

సప్తమాధ్యాయము.

ఇంతవఱకు నానకు దేశాటనమని చెప్పదగిన సంచారము చేయలేదు. అతడు తిరిగిన యూళ్ళు రెండు మూడు మాత్రమే గలవు. అందు మొదటిది సుల్తానుపురము. రెండవది యమ్నాబాదు గ్రామము. ఈయూళ్ళకు బోవునప్పుడు మార్గవశమున నత డొకటిరెండు గ్రామములు చూచియుండవచ్చును. అతని శరీరము వానిమనస్సువలెనే స్వేచ్ఛావిహార మందాసక్తిగల దగుటజేసి యతనికి దేశాటనమునందు మిక్కిలి యిష్టముండెను.

బలమర్దనులు వెంబడింప నట్లు తాల్వెండి గ్రామము విడిచి నానకుముందుగా యమ్నా బాదునకు బోయెను. అచ్చట పూర్వశిష్యుడగు లల్లో వాని నాదరించి పదునైదు దినములు తనయింట నుంచుకొనెను. అటనుండి గురువు తత్సమీపమందున్న మఱియొక తావునకు బోయెను. ఆస్థలమునకిప్పుడు నానకు మఠమని పేరు. ఆకాలమందచ్చటగాడనియమములతో యోగాభ్యాసము జేయునట్టి సిద్ధులనేకులుండిరి. గురు నానకు శిష్యసమేతుడై యాస్థలమునకుబోయి సిద్ధాశ్రమమున కెదురుగా నొక నారింజచెట్టుక్రింద గూర్చుండె. ఆకిచ్చలిచెట్టదివఱకు జాలకాలమునుండి శోషించి మోడుగానుండెనట. గురువు దానిక్రింద నాశీనుడైనతోడనే యావృక్షము పచ్చనియాకులు లేతచిగుళ్ళు గలిగి దర్శనీయ మయ్యెనట. ఈవింత దూరమునుండి సిద్ధులు గనిపెట్టిరట వారు తమకంటె నెక్కువయోగులు లేరని కడుగర్వితులై యుండువారట. తమకంటె నెక్కువ మహిమలుగల మహాత్ములు వచ్చెనని తెలిసికొని యాసిద్ధులు నానకు చుట్టుంజేరిరి. జోగులు పదిమంది జేరినప్పుడు వేదాంతచర్చ తప్ప మఱియొకవిషయమేది చర్చింపబడును? ఆసిద్ధులు తమకు దుస్సాధ్యములగు వేదాంతవిషయకప్రశ్నముల నెన్నో గురువు నడిగిరి. గురువు దేనిలోను వారికిం దీసిపోవడయ్యె. సిద్ధులడిగిన ప్రశ్నలకన్నిటికి గురువవలీలగ మనస్సునకు దక్షణమే నాటునట్లుగ ననుభవసిద్ధమగునట్లుగా బ్రత్యుత్తరములు చెప్పి యందఱను సంతుష్టుల జేసెను. అంతట నాసిద్ధులు నానకు తమకంటె నెక్కువ సిద్ధుడని గ్రహించి వానిం గొనియాడి తమమఠమున జేరుమని ప్రార్థించిరి. నానకు దానికి సమ్మతింపక మనుష్యున కాత్మశుద్ధి సత్ప్రవర్తనము మొదలగునవి యుండవలయును. గాని పై వేషములవలన లాభములేదనియు వేషధారణముతో బనిలేక యంత:కరణశుద్ధికై పాటుపడవలయుననియు తానేమత మునందు నేతెగయందు జేరుట లేదనియు జెప్పెను. అట్లుపలికి నానకు వారికాసమయమున గొన్ని నీతివాక్యముల నుపదేశించినట. అవి భాషాంతరమునం దుండుటచే వానితాత్పర్య మీక్రింద బొందుపరచుచున్నాడ. "కాషాయాంబరము దండము ధరించుటలోను మేనెల్ల బూడిద పూసికొనుటలోను యోగములేదు. సిరస్సు ముండనము చేయించుకొనుటలోను శంఖము లూదుటలోను యోగము లేదు. లౌకికాకర్షణములచేత జుట్టబడియు మనుష్యుడా యాకర్షణములకు లోబడక వాని కతీతుడై యుండుటలో నిజమైన యోగమున్నది. వట్టిమాటలవల్ల నిజమైన యోగమురాదు. ఈశ్వరుని సర్వవ్యాపకత్వ మెవ్వడు తెలిసికొనువో యతడే యోగి. యోగము మనస్సులోనేకాని దానికి వెలుపల లేదు. యోగము గోరీ దిబ్బలలో లేదు. యోగము శ్మశానములలో లేదు. ఈశ్వరైక్యము చెందుచున్నామని దొంగమూర్ఛలు బడుటలోలేదు. నానాదేశముల కరిగి తీర్థములందు మునుగుటలోలేదు. లౌకికాకర్షణములకు లోబడక వాని కతీతుడై యుండుటలోనే యోగము కలదు. మన యాదిగురువగు పరమేశ్వరుని దెలిసికొంటిమా సర్వసంశయములు నివారణములగు. అంతట ముక్తి కరతలామలక మగును. భగవద్విషయమును దెలిసికొనగోరువాడు ముందుగా మనశ్శాంతి సంపాదింపవలయును. మనస్సు తన యిష్టమువచ్చినట్లు దిరుగుటమాని నిశ్చలమైనప్పు డు పరంజ్యోతి తనలోనే వెలుగుచుండును. తనలో నీశ్వరతేజము ప్రకాశించుచున్నట్టు తెలిసికొనుటయే యోగము."

అనంతరము నానకు సిద్ధమఠము విడిచి గంగానది ప్రవహించెడు భూములలో సంచారము చేయదలచి పయనమయ్యెను. ఈయాత్రాచరిత్రలు సత్యమునకు దూరములై యద్భుతములతో మహిమలతో నిండిన కల్పనాకథలై యున్నవి. నిజమైన చరిత్రము నిమిత్తము నానకునుగూర్చి వ్రాయబడిన ప్రాచీనగ్రంథములను మన మెంతవెదకినను నూటి కొకచోట నెక్కడనో యొక సత్యమైన వృత్తాంతముండును గాని తక్కిన దంతయు బృహత్కథలోనున్న కథలకన్న నెక్కుడు చిత్రకల్పనలతో నిండియుండును.

ఆచరిత్ర లట్లుండుటకు మూడు ముఖ్యకారణములు గలవు. అందు మొదటిది. ఆచరిత్రలు వ్రాసినవారు భూగోళ శాస్త్రమేమో యెఱుగరు. వారు జన్మమధ్యమున స్వదేశమగు పంజాబు నప్పుడప్పుడు చూచియుందురు; కాని గంగానది ప్రవహించెడి దేశములనుగాని యచ్చట నివసించు జనులనుగాని వారెన్నడు జూచి యెఱుగరు. ఏస్థలముల జూడక స్థిమితముగా నిండ్లవద్ద గూర్చుండి విన్నకథల నాధారములు చేసికొని చరిత్రలువ్రాయు గ్రంథకతన్ లంతకంటె నెక్కువగ నేమివ్రాయగలరు. రెండవకారణమిది. ఆచరిత్రలీయాత్రలు జరిగిన ముప్పదియేండ్ల తరువాత వ్రాయబడినవి. ఆవ్రాతలు గూడ నానకుయొక్క ప్రియభక్తుడగు బలుడే చెప్పి వ్రాయించుటచేత బయలుదేరినవి. బలుడు గురువుతో గూడ దిరిగినను విద్యాగంధశూన్యు డగుటచే తను మూడవిశ్వాసముగలవాడగుటచేతను గ్రంథకర్తలకు గురువు వృత్తాంతమును చెప్పునప్పుడు నిజమగు వృత్తాంతములను సరిగ జెప్పలేక తన పిచ్చినమ్మకముల నందు జొనుపుచు చాలకాలము గడచినపిదప చెప్పుటచే సరిగా జ్ఞాపకములేక తన మందమతికి స్ఫురించిన వన్నియుం దెలుపుచు గురుచరిత్రమందలి యీభాగమును సంశయాస్పదముగ జేసెను. మూడవకారణ మిది. గురుచరిత్రము వ్రాయునప్పటికి గురువు మృత్యుడయ్యెను. అతని కీర్తి యార్యావర్తమందంతట వ్యాపించె. ఎన్నో మహిమలు వాని కారోపింపబడెను. ఎన్నోయద్భుతములు వానింగూర్చి చెప్పుకొనబడెను. చరిత్రకారులు వానిమహిమలు వినినవారే గావున తాము వినినవి చుట్టుప్రక్కలజనులు చెప్పుకొనునవి యగులోకసామాన్యచరియలతో బుస్తకములనింపిరి. ఆగ్రంథములలోనున్న విశ్వాసపాత్రములుకాని యంశములు విడిచి వానియాత్రలు కొన్ని వర్ణింతుము.

ఆతండు గంగాతీరమునం బయనముచేసి వంగదేశమునకు వచ్చెను. అచ్చట కొంతకాలముండి పిదప నత డాసామునకు బోయి యచ్చట ననేకమాసములుండెను. ఈపయనములతో మర్దనుడు మిక్కిలి డస్సి తన గురువువలె భక్తితత్ప రుడై మార్గాయాసము మరచుటకుగాని బలునివలె వైరాగ్యము గలిగి శ్రమకోర్చుటకుగాని సమర్ధుడు గాకపోయెను. అస్సాముదేశమున సంచరించుచుండ నానకు షేకుఫరీదను మహమ్మదీయ యోగియొక్క వంశస్థుడైన యొకతురకం గలుసుకొనెను. వారిరువురు గొన్నినాళ్ళు గలిసియుండి భగవద్విషయము లనేకములు చర్చించిరి. వారెడబాయునప్పుడు మతద్వేషములు లేక యొండొరులం గౌగిలించుకొని విషాదముతో వేరైరి. ఆసామునుండి గురు వోడ్రదేశమునకు బోయి జగన్నాధక్షేత్రమును దర్శించి యచటి యాలయమునం దర్చకులు పండాబ్రాహ్మణులు నిత్యకృత్యములలో జేయు నకార్యములం జూచి యేవగించెను.

జగన్నాధక్షేత్రమునుండి నానకు దక్షిణదేశమునకు బోయి యందనేక దివ్యస్థలముల సందర్శించి యక్కడనుండి సింహళద్వీపమునకుం జనెను. ఈగురువు వెళ్లునప్పటికి సంహళద్వీపమును శివనాధుడను రాజు పాలించుచుండెను. తన దేశమునకు మువ్వురుక్రొత్తమనుష్యులు వచ్చిరనియు నందు సామాన్యసన్యాసులకు బోలని యొక విరాగి గురువై యుండెననియు శివనాధరాజు విని వాని జూడగోరెను. కోరి యాతనిం జూడబోవుటకుముందు వాని ప్రజ్ఞ యెట్టిదియో జగద్వంచనము సేయవచ్చిన మాయయోగియో నిజమైన సన్యాసియో వాని మనోనిశ్చలత యెట్టిదో కనుగొని యనంతరము వాని దర్శనమునకు బోవలయునని రాజు నిశ్చయించుకొని పంచభక్ష్యపరమాన్నములతోనిండిన యన్నమును, విలువగల చీనిచీనాంబరములను సొగసుకత్తియలగు పడుచుకన్నియలను యోగికి గానుకగా బంపెను. గురునానకు మొదటి రెండు వస్తువుల జేతితో ముట్టక కన్నియలం గన్నెత్తిచూడక నిరాకరించుటయు నవి తోడ్కొనిపోయినవారు వచ్చినదారినే భగ్నమనోరధులై పోయిరి. తన కావించిన పరిక్ష గురునందలి గౌరవముబెంప రాజు స్వయముగ నానకును సందర్శింపవచ్చి యంతటి మహాత్ముని రాకచేత తనరాజ్యము ధన్యమైనదని కొనియాడెను. ఆమహారాజుచేసిన యాదరణమునకు సంతుష్టుడై కాబోలు నానకు సింహళద్వీపమున రెండుసంవత్సరముల యైదుమాసములుండెను. ఆదీవివెడలిలాతిభూములకు నానకు పయనమైనప్పుడు మర్దనుడు నిరంతరప్రయాణములచేత విసికి గురువును విడిచి యధేచ్చం జనియెను. అట్లు మర్దనుడు గురువును బాసిపోయినను కొంతకాలము వాని నెడబాసియుండునప్పటికి వాని కేమియుం దోచక పిచ్చియెత్తినట్లుండుటచే గురువు పిలువకపోయినను తనంతట తాను వచ్చి నానకును గలిసికొనెను.

అనంతరము గురునానకు లోకానుభవజ్ఞానము సంపాదింప భరతఖండమునకు జుట్టుప్రక్కలనున్న యనేక మ్లేచ్ఛ దేశములకు బయనము చేసెను. ఆయన చూచినట్లు జెప్పబ డినదేశములలో నొక్కదానిపేరేనియు నీనాటిభూగోళశాస్త్రజ్ఞు లెఱుంగరు. ఆదేశములాకా కాలమున నట్టి పేళ్ళుండునో లేక చరిత్రకారులు జగమునలేని దేశముల నూహించి గ్రంథములలో వ్రాసిరో మనము చెప్పజాలము. మనము నిశ్చయముగా నొక్కవిషయమునుమాత్రము చెప్పగలము. ఇస్లాము మతస్థాపకుడగు మహమ్మదువారి జన్మస్థలమైన యరేబియా దేశమునకు గురునానకు పోవుట నిర్వివాదాంశము. ఆదేశమునకు సముద్రయానముచేసెనో మెట్టదారినిబోయెనో చెప్పజాలముకాని త్రోవలో పారసీకదేశపు రేవుపట్టణమగు బుషాహరునగరము నాయన జూచెను. మార్గవశమున నతడేయూరికి బోయిన నాయూర బ్రహ్మజ్ఞానమునం దాసక్తిగల మనుష్యులంజేర్చి వారికుపదేశముజేసి జ్ఞానబీజముల నచ్చట నాటియవి పెరిగి ఫలించునని తోచినచోట్ల చిన్నసంఘము లేర్పరచి ప్రతిసమితి నొక్క పెద్దనేర్పరచి వానికి భాయి యనుపేరు వెట్టి యతనియాజ్ఞకు వారు బద్ధులై యుండునట్లు శాసించి యటుపిమ్మట పోవుచువచ్చెను. హిందూదేశమునకు బడమట నున్న దేశములలో నేటికిని ధర్మశాలలుండుట కాద్యకారణమీతడే. అట్లుసమాజములు స్థాపించుటలో గురునానకు యొక్క తలంపు క్రొత్తమతము స్థాపింపవలయుననికాదు. మిక్కిలి పురాతనమైన యార్యుల యుపనిషన్మతమును జగమునకు జాటుటయే యాయన ముఖ్యసంకల్పము. తనచేత నుప దేశింపబడిన జ్ఞానవాక్యములయందు నమ్మికగల జనులు నిర్భయముగ తమధర్మముల ననుష్ఠించి యితరులకు మార్గప్రదర్శకులై యుండవలయునని యాయన యెల్లచోటుల నొక్కి చెప్పుచువచ్చె.

అరేబియా ప్రయాణములలో నానకు వాని శిష్యులు నిర్బాధకముగ నన్నిప్రదేశములుం జూచుటకు తురకవేషములు వేసికొనిరి. నానకు సహజముగ కలహముల కిష్టపడని పరమసాధువౌటచే జగడములు రాకుండ నుంటకట్లు వేషము మార్చెనేకాని భయముచేత నెంతమాత్రముకాదు. ఏలయన నానకు మహమ్మదువారి జన్మప్రదేశమగు మెక్కాపట్టణమునకు బోయి పుణ్యభూములు చూడదలంచియు మహమ్మదీయులకు విరుద్ధములగు నాచారములనే గొన్నిటిని నెరపుచువచ్చెను. మెక్కాలో మహమ్మదీయుల కొక్క యాలయముగలదు. కాబా యని దానికిం బేరు. ఆయూరుకిబోయిన మహమ్మదీయు డెవ్వడు దన కాళ్ళు కాబాయున్న వైపునకుజూపి పగలుకాని రాత్రికాని శయనింపడు. పండుకొన్నప్పుడు తలయే కాబావైపున నుండవలయు. నానకు తరుచుగా రాత్రులు పండుకొనునప్పుడు తనకాళ్ళు కాబావైపునకు జాపుచువచ్చె. తురకలకు భయపడినవాడట్లు చేయునా? ఆగుడియధికారి యొకనాడు శాస్త్రవిరుద్ధముగా శయనించిన నానకునుజూచి దైవగృహమువైపు కాళ్ళుచాపుట యనాచారమని కఠినస్వర ముతో మందలించెను. అతనికి గురు విట్లు ప్రత్యుత్తరమిచ్చె. 'దేవునిగృహ మేప్రక్కను మాత్రమే యుండి యేప్రక్కను లేదో నాకు దెలియదు. నీవెఱుగుదువేని నాకాళ్లు చేతపట్టుకొని దేవుని మందిరములేని ప్రక్కకు వాటిని ద్రిప్పుము." ఆలయాధికారి వాని పలుకులు విని మతమునైనను లెక్కసేయక నోట పరిహాసములు సేయు మొండివాడై యుండవచ్చునని భావించి వాదము ముదరనీయక యంతతో సరిపెట్టెను. మెక్కావెళ్లిన మహమ్మదీయులు మహమ్మదువారు పరమపదము వేంచేసిన స్థానమగు మెదీనాకువెళ్ళి యాయనసమాధిజూడక పోరు. నానకు మెక్కాలోజూడవలసిన వైచిత్ర్యములనెల్లజూచి సంతుష్టుడై మెదీనాకుగూడ బోవదలంచుచుండ మర్దనుడు తన గురువు మెదీనాకు జనండనుకొని యక్కడకుబోక తప్పదని పట్టుపట్టెను. అదివరకే వెళ్ళదలచిన గురువు శిష్యుని ప్రోద్బలముచేత వెంటనే బయలుదేరి పండ్రెండుదినములు పయనముచేసి మెదీనాపట్టణముజేరి మహమ్మదు సమాధింజూచి కొన్నిదినములచ్చట నుండెను. ఆదినములలో నతడు మెక్కాలో వలెనే యిక్కడను సమాధివైపుకాళ్లుచాపి శయనించుచువచ్చెను. మెక్కాలోనున్న యాయజమానునికంటె మెదినాలోనున్న సమాధియజమానుడు చండతరుడు దురహంకారుడు. ఇందక్కజ మేమున్నది. దేవుని దూషించునప్పుడు సయితము నోరెత్తక గురువుల పేరెత్తినతోడనే రాక్షసుల వలె మీదబడి మనుష్యులను దూషించి వీలగునేని జేయిచేసికొను పరమభాగవతులు ప్రతిమతమున వేనవేలు గలరు. మెక్కా మెదీనాపట్టణములకుబోయి యాపుణ్యభూముల జూచినపిదప మహమ్మదు వారినిగూర్చి నానకున కెట్టియభిప్రాయము కలిగెనో శిష్యుడగు బలిని యీక్రిందివాక్యములవలన స్పష్టమగును. ఈమాటలు బలుని నోటనుండి వచ్చినను గురునియభిప్రాయములే యగుట నిజము.

మహమ్మదువారినిగూర్చి గురునియభిప్రాయములను బలు డీక్రిందివిధమున దెలిపెను. "మహమ్మదువారిస్వభావమున మహాత్ముల కుండవలసినంతశాంతము కానబడక కోపపు పాలెయెక్కువ గానబడు చున్నది. పునర్జన్మరాహిత్య మగునంతటివైరాగ్యము గూడ నాయనయొద్ద నున్నట్లు గానబడదు. స్వలాభపరాయణత యక్కడక్కడ గానబడుచున్నది. ఆయన పరిశుద్ధుడు నిష్కళంకచరిత్రుడు ననుట కెంతమాత్రము సందియము లేదు గాని సంపూర్ణ మైనపవిత్రత సంపాదించుటకు జన్మపరంపరనుండి విమోచనము మొందుటకు నీమహాత్ముడు మరలజన్మము నొందవలయు. ఆజన్మము హిందూస్తానమున నొకశూద్రునియింట గావలయు. ఆయన జీవన్ముక్తు డైయొకానొకకాలమున బరలోకారోహణము చేసి ఈశ్వరసందర్శనము చేసెనని చెప్పెడిమాటలు కేవలము కల్పితములు. ఏలయన నీప్రపంచమున సృష్టింపబడినజంతువులె నేత్రగోచారము లగును గాని సృష్టింపబడనివి. కంటి కగపడవు. భగవంతుడు సృష్టిపదార్థములలోనివాడు కాడు. కావున నతడు మానవదృగ్గోచరుడగుట యసంభవము. కాని జీవాత్మ చర్మోపాధిని బాసి పరిశుద్ధావస్థ జెందినప్పుడు పరమేశ్వరసాన్నిధ్యము బడయుటకు బాత్ర మగును. పవిత్ర మైన ఖురానుగ్రంథము భగవద్వాక్యము కాదు. కారణ మే మన భగవంతున కొకభాష లేదు.

అట్లు కొన్నిదినములు మదీనానగరమున నుండి యచ్చటివిశేషములు దర్శించుచుండ బ్రియసోదరింజూడ నతనికి బుద్ధిపుట్టెను. ఈచెలియలిమీద నాయనకు మొదటినుండియు నింతింత యనరానిప్రేముడి యుండెను. ఏలయన నీతోబుట్టువే చిన్ననా డతని కెన్నిసారులో శరణం బిచ్చెను. తంద్రి కఠిను డై యతని పై బిట్టలుక పూనినప్పుడు కాపాడెను. తన సోదరుడు మిక్కిలినీతిమంతు డనియు సత్యప్రియు డనియు నిక్కడక్కడ యనక యవకాశము వచ్చినచోటనెల్ల వాదించుచు వచ్చెను. లౌకికవ్యవహారవిముఖు డై పరమేశ్వరధ్యానపరాయణుడై సోదరుడు మందమతి యై యున్నపుడు తనభతన్‌సయితము పిచ్చివా డని యెగతాళిసేయుచుండ నామెయతడు పరమభాగవతోత్తము డని కనిపెట్టి గౌరవించెను. ఆకోరిక పొడమినతోడనే గురువు శిష్యసమేతుడై మదీనానగరమును విడిచి కొన్నిమాసములు నిరంతరప్రయాణములు గావించి పారసీకగాంధారాదిదేశము లతిక్రమించి పాంచాలదేశము ప్రవేశించి యెట్ట కేలకుసుల్తానుపురముజొచ్చి చెలియలిగృహము జేరెను. అన్నయుం జెలియలు పరస్పరసందర్శన జనితానందమున బరవశత్వము నొందిగాడాలింగనము జేసికొనిరి. కొంతకాల మతడు సోదరీగృహంబున వసియించి పుణ్యభూములలో నగ్రగణ్య మైనహిమాలయపర్వతము జూడదలంచెను. తలపుపుట్టగానె యతడు బయలుదేఱెను.

హిమాలయము హిందూస్థానమునకుత్తరమున భగవంతుడు నిర్మించినస్పటికపుగోడయో యనునట్లు భాతతఖండలక్ష్మిశిరోభాగంబున దాల్చినవడ్రంపుమకుటమో యనునట్లు విరాజిల్లుచుండును. ఇది యనేకపుణ్యక్షేత్రములకు నిలయము. నరనారాయణులకు నివాస మైనబదరికాశ్రమ మిందేయున్నది. సిద్ధసాధ్యగంధర్వఖేచరాదుల కిది విహారస్థాన మనియు నుమామహేశ్వరులకునికిప ట్టనియు బ్రహ్మాదిసురగణంబునకు సిద్ధమునివర్గమునకు నీమహీధరకూటములు యజ్ఞవాటము లనియు గుమారస్వామికి జన్మభూమి యనియు భగీరధిప్రయత్నమున నాకాశంబుననుండి మహీతలంబునకు దిగినగంగాదేవికి వసతిస్థలం బనియు నెల్లయోషధులకు నిలయం బనియు బురాణములలో వర్ణింపబడినది. మఱియు బరమభాగవతోత్తమ లగుమహామహులు పరమతస్థులు తమ్ము బాధించినప్పుడు నిలువ నీడలేక తలదాచుకొనుటకు జోటు లేక యె ట్టకేలకు దుర్గమమగునీపర్వతరాజముశరణు వేడి గుహాంతరములు నివాసములుగ జేసికొని సుఖించుచు వచ్చిరి. ఇట్టియామహాశైలముయొక్క నపారమహిమము పురాణములవలననేగాక చూచినతైర్థికులవలనగూడ విని దేశాటనపరాయణ డగునానకు శ్రవణంబుల వినిన దంతయు నేత్రంబులతో జూచి యానందింప దలచుట యాశ్చర్యము కాదు.

అత డాపర్వతమున కరిగి యొకక్షత్రమునుండి యొక క్షత్రమున కరుగుచు గంటి కగపడినబ్రహ్మవాదులతోడ వేదాంతచర్చలు సేయుచు దనప్రభావమెఱుగక తన్ను నిందించినవారిచేత నానావమానంబులం బడుచు భూషణంబులకు సంతసింపక దూషణంబులకు దురపిల్లక తనపనిచేసుకొనుచుండెను. మొట్టమొదట నతనియాసక్తిభావము కర్మకాండనిరసనము జూచి యాయామతస్థులు వానిని తమతమమతంబులంజేరు మనిపిలుచి యత డందు జేరక యామతముల ఖండింపవాంతనియెడల గౌరవము జూపకపోయిరి. కాని కాలక్రమమున నతనివి శేషవినయంబును సాటిలేనిసత్ప్రవర్తనమును సారము లేనిభక్తియు సూనృతవ్రతాశక్తియు గనుగొన్నపిదప నతడసాధారణపురుషు డనియు సర్వవిధముల మాననీయు డనియు దెలిసికొని యుధార్హగౌరవము గావించిరి. తొలుదొల్త నతనిని విశ్వసింపక యనుమానముతో జూచినవారు వానిసద్గుణసంపద యాలస్యముగ గనిపెట్టి యతడు తమ్ము విడిచిపోవున ప్పుడు మఱికొంతకాల మతనిసహవాససౌఖ్యము గలుగకపోయెగదా యని విచారించిరి. హిమాలయమున దిరుగుకాలమున శిష్యు డగుమర్దనునిశరీరస్థితిచెడెను. నానకుయొక్క శరీరము శీతోష్ణములకు జంకునది కాదు. రెండవశిష్యు డగుబలునిశరీరము నంతగా గాసిజెందలేదు. కాని మితిమీఱినయాచలియు నెడతెంపు లేనియావానలు నెల్లపుడు మంచుమీదిపయనములు సరిగ నాహారము లభింపమి ప్రయాణకష్టములు మొదలగునవి సుకుమారుడైనయాగాయకుని యారోగ్యమునకు భంగము గలిగించెను. నానాటి కతనిస్థితి బాగుపడుటకు మారు క్షీణించుటంజేసి గురువు యాత్ర కట్టిపెట్టి పంజాబుదేశమునకు బోవ నిశ్చయించెను. కాని యామండలముచేరుటకైన యవకాశము లేకయే మర్దనునిస్థితి పూర్తిగ జెడిపోయెను. కొన్నిదినములుమాత్రమే యతడు జీవింపగలుగు నని గురువునకు దోచెను. అందుచేతవా రతనిని దీర్ఘప్రయాణము సేయింపక దాపున నున్న యొకపల్లెకు దీసికొనిపోయి చేతనైనచికిత్స చేయించి స్వహస్తములతో జేయదగినంతయుపచారము జేసెను. బలుడును దనచెలికానికి శక్య మైనపరిచర్య గావించెను. ఆయుశ్శేషము లేనప్పుడు వైద్యములు నుపచారములు నిష్ప్రయోజనములు గదా. మర్దను డెట్టకేలకు మృతినొందెను. మర్దనుడు తనమరణానంతరమున తనదేహము దగ్ధము సేయవలసినదేకాని ఖననము చేయగూడ ద గురువుతో మనవి జేసికొనెను. శిష్యునియిచ్ఛాప్రకారమె గురువు కళేబరమును ఖననము సేయక నగ్నిపాలు చేయుటకే కృతనిశ్చయుడై తద్విషయప్రయత్నములు చేసెను. ఆమువ్వురు కప్పుడుగలసొత్తు మూడుశాటులు ఆశాటీత్రయమును నానకు శిష్యునికళేబరము జుట్టబెట్టి స్వహస్తనిర్మిత మైనచితి మీద శవమును బలుడుందానును బెట్టిరి. అగ్నిసంస్కారము బలునిచేత చేయింపక శిష్యవత్సలు డాకట్టకడపటికర్మముగూడ దనచేతులతోనే చేసెను. శిష్యునకు చుట్టము లెవ్వరు లేమి యతనియుత్తరక్రియలు చేయుట దర్మమని గురువు స్వయముగానె పారలౌకికక్రియలు చేసెను. నిజమైనప్రేమ యెక్కువతక్కువస్థితులుగాని వర్ణభేదముగాని పాటింపనీయదుగదా. "ఉదారచిత్తానాం వసుధయేవకుటుంబ:" యనునట్లు మహానుభావులకు లోకమే కుటుంబము. మర్దనుడు గురువుతో జిరసహవాసము జేయుటంజేసి మౌడ్యము బాసి జ్ఞానమించుకయైనసంపాదించెనా యని కొందఱు సంశయముపడవచ్చును. అట్లు సందియముపడుటకు వలనుపడదు. ఏలయన మంచిపూలు గుచ్చినదారముసైతము సువాసన గలిగి యుండును. అట్లె బ్రహ్మజ్ఞానసంపన్ను డైననానకువంటిమహానుభావునితో జిరకాలము కలసిమెలసియుండి యతడు సేయువేదాంతచర్చలు పలుమాఱు వినివిని యున్న మర్దనునకు జ్ఞాన మంటదనుట యసంభవము. మొట్టమొదట మర్దనుడు నాన కువద్ద శిష్యు డైనప్పుడు వాడు తనజాతియందు మిక్కుటమైనయభిమానము గలిగి యాశాపాశబద్ధుడై స్వలాభపరాయణుడై నెల్లవారి నెగతాళి సేయుస్వభావము గలవాడై చీటికి మాటికి సణుగుకొనుచు లోకవ్యవహారములయందెయాశక్తి గలిగి యుండెను. కాని కాలము గడచినకొలది గురువు యొక్కసదాచారసంపత్తి యీశ్వరభక్తి లోకోద్ధరణాశక్తి కన్నులార జూచినకొలది నతనిధనకాంక్ష స్వలాభపరాయణత మొదలగు సామాన్యమానవలక్షణము లడుగంటెను. భక్తిజ్ఞానవైరాగ్యములు వానిస్థానము నాక్రమించెను. అవి హృదయమున నెలకొనుటయు నతడు నిరర్థకసంభాషణములతో గాలక్షేపము సేయక సణుగులుగొణుగులు మాని పరాక్షేపణలు గట్టిపెట్టి జ్ఞానమార్గమున బడి బ్రహ్మానుసంధానపరాయణు డయ్యెను. ఆతనియందు గలిగినమార్పులు గనిపెట్తి సంతసించి యజ్ఞానకవచమును విడిచి జ్ఞానకవచమును దొడిగికొని తనశిష్యుడు దేహయాత్రచాలించినందుకు సంతసించెను.

మర్దనునిమరణము నానకుయొక్క సంకల్పమునకు మార్పు కలిగించెను. పంజాబు దేశమునకు బోవలయునని యంతకుముం దత డాలోచించెను. కాని ప్రియశిష్యుడైన బలుడు సేతుబంధరామేశ్వరయాత్ర చేయవలయునని కుతూహలపది నందున నతనిమనోరధసిద్ధి గావించుటకై యతడు దక్షణాపథంబున కరుగ సంకల్పించెను. ఈప్రయాణమున నానకును కనేకులతో వేదాంతచర్చలు జరిగెను. ఆచర్చలు వివాదహేతువులు గాక యతనికి సంతోషప్రదములై రెండవపక్షము వారికి జ్ఞానసంధాయకము లై యుండెను. రామేశ్వరయాత్ర నుండి యతడు తిరిగివచ్చి కొందఱు సాధువులు గురుదాసుపురముజిల్లాలో నున్న బాటలె యనుపుణ్యక్షేత్రమునకు బోవుచున్నా రని విని యాసాధువులసహవాసము చేయుటకును తనజన్మభూమినింకొకసారి సందర్శించుటకును నిశ్చయించి వారితో గలిసి యచ్చోటి కరిగెను. బాటలేగ్రామవాసులకును నచ్చట చేరినతీర్థవాసులకును సనాతనసిద్ధాంతములకును వ్యతిరేకమైనమతబోధ చేయుచున్ననానకుయొక్కరాకయసహ్య మయ్యెను. ఆమెమహాత్మునియెడల వారెంతద్వేషభావము బూనిరో యెంతకఠినముగ దూషించిరో యెంతయవమానపఱచిరో మనము చెప్పజాలము కాని యెంద రెందరుసాధువులు తనతో వితండవాదములు చేసి వెఱపించినను వెఱవనిధీరుడు పలుపల్లియలయందు బట్టణములయందు వసియించు పూర్వాచార పరాయణుల కోపానలాజ్వాలలబాఱి బడనిశ్చలుడు వేనవేలుజనులు వచ్చి ప్రశ్నలవర్షము గురిపించి వాదించి యోడిపోయి తుదకు నిందించినను మనోధైర్యము చెడనిపరమశాంతుడు. బాటలేగ్రామము విడిచి వెడలవలసినవా డయ్యెను. "అతిపరిచయాదవజ్ఞ:" యన్నట్లు పిన్ననాటనుండియు దన్ను దనకుటుంబమును దనగృహపరిస్థితులను దనబాల్యవిచేష్టితము లను నెఱిగిన కాకులవంటి లోకుల నడుమ నున్నప్పుడు శాంతాంత:కరణుడగు పరమతపోధను డైనను వారివెక్కరింపులగ్గలమైనతరి తనశాంతము చిక్కబట్ట జాలడు.

పంజాబుదేశము విడువకమున్ను మృతినొందిన మర్దనుని స్థానమందు దనకు మఱియొక శిష్యుడు సంప్రాప్తించునేమో యని వెదుక జొచ్చెను. ప్రియశిష్యు డైనమర్దనున కొక్కకుమారు డుండె నని యతని కప్పుడు జ్ఞప్తికి వచ్చెను. ఆబాలకునిపేరు సజ్జదుడు. ఆకుమారు డెట్లైన శిష్యుడుగ బరిగ్రహించుటకు గురువును బలుడును గృతనిశ్చయ లై తమరాక గ్రామవాసుల కెవ్వరికిం దెలియకుండునట్లు రాత్రి ప్రొద్దుపోయిన తరువాత తాల్వెండిగ్రామమునకు వెళ్ళిరి. గురు వొకమారుమూలను గూర్చుండి సజ్జదునికడకు బలుని పంపెను. అత డతిరహస్యముగ బోయి గురుసందేశ మెఱిగించినతోడనే సజ్జదు డెంతకాలమునుండియొ ప్రయాణ మగుచున్నవాడ పోలె గడియయాలస్యమైన జేయక వెంటనే మూటముల్లె గట్టుకొని వానితో బయలుదేఱెను. అతనినిజూచి నానకు వానితండ్రియొక్క మరణవార్తను దెలిపెను. నానకు యొక్క తల్లియు దండ్రియు గతించినా రని సజ్జదు డెఱిగించెను. గురువుయొక్క పినతండ్రి మాత్రము బ్రతికి యుండె ననియు నిష్టమైనచో నతనిని జూడవచ్చుననియు సజ్జదుడు విన్నవింప గతన్నాస్థి మృతినొందిన వారికొఱకు వి చారించిన గార్యము లేదు. జీవించినయున్నవారిని జూడనక్కఱలే దని నానకు తన జన్మస్థానమున నొక్క రాత్రియైన సంపూణన్‌గ గడుపక శిష్యసమేతుడై వెడలెను.

ఈసారి గాంధార నగరమున కరుగవలయునని వారి సంకల్పము. గాంధారపురమున వసియించుచు సుప్రసిద్ధులైన బాబావలీ యను మహానుభావుని సందర్శింపవలయు నని యతడు బయలు దేఱెను. ఈదారి పలుమా ఱతనికాలిక్రింద నలిగినదే యగుటచేత గ్రామములు బురములు బరిచితములు. ఆమువ్వురును ముల్తాను మండలములోని తలంబాపట్టణము విడిచిన తరువాత గురువు బలునితో గూడి మెల్ల మెల్లగా వెనుకబోవుట కేర్పఱచుకొని ముందరియూరికి సజ్జదుని ముందుగాబంపెను. సజ్జదుడు కొంత దూరము పోవునప్పటికి వాని కొకయూరు కనబడెను. అచ్చట హిందువుల దేవాలయము మహమ్మదీయుల మసీదు నొక్క స్థలమందె యొకదానికొకటి చేరియుండెను. ఆమఠాధిపతి జనపనార పీచువలె మిక్కిలి తెల్లనై నాభీ వివరపర్యంతము వ్యాపించిన గడ్డము గలిగి వృద్ధు డనితెలియజేయుటకు మొగముమీద ముడుతలుగలిగి చూచినవారికి గౌరవభాజన మని తోచుచుండును. సజ్జదుడు గంభీరుడైన యాతనియాకారము చూచి భక్తితత్పరుడై యతని కభివాదము చేసి యతనితో బ్రసంగించెను. ఆవృద్ధుడు కొంతసంభాషణము జరిగినపిమ్మట వానిని భోజన శాలకు దీసికొనిపోయి మధురాహారములతో విందు సేయుమని సేవకుల కానతిచ్చెను. సేవకులును కడుపార వానికి మెక్కబెట్టు వారుపోలె సత్యాదరమున వానిని లోనికి దీసికొనిపోయి యోగిరముపెట్టుటకు మాఱు వాని కట్టినపుట్టము లొలుచుకొని తిండిపెట్టక కాలు సేతులు గట్టి మారుమూల గదిలో బడవైచిరి. ఇదిజరిగిన కొంతసేపటికి గురుడు బలుసమేతుడై యచ్చోటికి బోయి సజ్జదుని గానక యావృద్ధుని బిలిచి తనశిష్యుని శరీరాదులు వణిన్ంచ యానవాలు చెప్పి యట్టిలక్షణములు గల పడుచువాడు మీ కగుపడినాడా యని యడిగెను. అట్టికుఱ్ఱవాని మొగమైన జూడలేదని యా యోగి భృవుడు నొక్కిపలుక వాని మాయమాటలు దొంగచూపులు గురువున కనుమానము గలిగించెను. తోడనే బలుడును దానును సజ్జదునికొఱకు పలుతావులు వెదకిరి. ఎట్టకేల కన్నములేక మిక్కిలి ఖిన్నుడై యొకమూలబద్ధుడై యున్న సజ్జదున వారు కనుంగొని వానికట్లు విప్పి విముక్తంజేసి యావృద్ధుం బిలిచి నిరపరాథు లగు బాటసారుల నావిధముగ నిష్కారణముగ దోచుకొని చెఱబెట్టవలసిన యవసరమేమివచ్చినని మిక్కిలి కఠినముగ నడిగిరి. అడగుటతో దనివినొందక గురువు కపటయోగింజూచి సాథుబాధ పరమపాతకమనియు నది కావించిన దురాచరణము లిహలోకమునకు జెడుటయే గాక పరలోకమునకుగూడ జెడి దుర్గతులపాల గుదురని ధర్మోపదేశము చేసెను. అతితక్షణమైన మాయుపదేశముయొక్క వేడిమిచేత నమ్ముదుసలి దొండయొక్క రాతి గుండెయు గలిగి నీరై పోవ నతడు పశ్చాత్తప్తుడై దు:ఖపరవశుడై తన కావించిన దోసమొప్పుకొని తప్పు సైరింపుమని వేడుకొనెను. ఆపురుషత్రయ మాస్థానము విడిచి కొంతదవ్వరుగునప్పటికి మర్దనుని సమాధి యున్న యూ రగుపడెను. ఆసమాధి దృస్టపథమునం బడినతోడనే భస్మరూపు డైన తనతండ్రి యాసమాధిలో నున్నాడనివిని సజ్జదుడుపితృభక్తి తరంగితాంతరంగుడై యాస్థానము విడిచి రా జాల నని గురువుతో జెప్పి యచ్చటనె జీవిత శేషము గడుప నిశ్చయించుకొనెను. సజ్జదుడు తన్నువిడచుటచేత గానము తన చెవులకింక వినబడదని గురువు వానిని విడువలేక విడిచెను. శుభము సంప్రాప్తించినప్పుడు మేర మీఱిన యానందమును కష్టము సంప్రాప్తించినప్పుడు డపారమైన దు:ఖమును బొందుట ధీరలక్షణము గా దని శ్రీకృష్ణుడు భగవద్గీతలలో జెప్పిననీతి స్మరించుకొని యతడు సజ్జదునివియోగముకొఱకు విచారము నొందలేదు. అట్లు సజ్జదుని పితృసమాధికడ నెలకొలిపి బలోపేతుడై నానకు బహుదినంబులు ప్రయాణములుచేసి గాంధారుదేశమునకు హిందూదేశమునకు నడుమ నున్నకొండలలో ప్రసిద్ధమైన బొలాను కనుమదాటి కడుశ్రమపడి యెట్లకేలకు గాంథారము జేరెను. బాబావలీవారిని మిక్కిలి ప్రేమతో నాదరించెను. నానకు జ్ఞానసముద్రుడైన బాబావలీయొక్క సహవాస సౌఖ్యము కతిపయ దినములనుభవించి మునుపటికన్న జ్ఞానసంపన్నుడై యచ్చోటువిడచి స్వదేశాభిమాను డయ్యెను. మార్గమధ్యమున మానచందుండను క్షత్రియు డాయన కగపడెను. ఈరాచవానికి మతాసక్తి మెండు. ఎవ్వరైనదనకు సన్మతోపదేశము చేసి మంచిదారి చూపువారు దొరకుదురాయని తగినగురువునిమిత్త మత డెదురుచూచు చుండెను. మంచినీరు త్రాగబూనువారికి మహాసరోవర మగపడినట్లు నిరుపేదకు పెన్నిధి లభించినట్లు నానకువంటి జ్ఞానరత్నాకరు డాజ్ఞానదరిద్రునకు దొరకినతోడనే యతడు తనయదృష్టముచేత లభించెనని సంతసించి యనేక దినములు సుశ్రూషజేసి బహు సంవత్సరములనుండి దేనికై యన్వేషించు చుండెనో యాబ్రహ్మజ్ఞానఫలమును దని నొంద ననుభవించెను.

తిరిగి పయనము చేయునపుడు నానకు బాలనాధపర్వతమునొద్ద జుట్టుప్రక్కల నెక్కడ నూరుపల్లెలు లేని నట్టడవిలో నొకచెట్టుక్రింద శిష్యద్వితీయుడై దారితెన్ను కానక మెసగుట కాహారములేక బడలి గూర్చుండెను. ఆకొండదాపున జోగులమఠ మొకటి గలదు. ఆజోగుల కొడయడైనయోగి పరమదయాళువు పరోపకారపరాయణుడు. అతని యాజ్ఞాప్రకార మాజోగులు ప్రత్యహము సాయంసమయమున చిన్న చిన్నజట్లుగా జేరి దారితప్పి పోవుబాటసారులను గలిసికొని వారిని దమమఠమునకు దోడ్కొనివచ్చి సత్కరించుచుందురు. ఆగుంపులలో నొక్కటి వృక్షచ్ఛాయం గూర్చుండిననానకుం గనుంగొన తమమఠమునకువచ్చి యతిథి గావలసినదని వానిని గోరెను. ఆతరుచ్ఛాయయె తన కారాత్రి నివాసయోగ్య మగు నెలవగుననియు దా నదివిడిచి రాననియు నతం డుత్తరము చెప్పెను. వారతని యుత్తరము మఠాధిపతి కెఱిగింప నతడు కదలిఫొయి స్వయముగ నతని నాహ్వానము జేసెను. అతని కోరిక నిరాకరించుట మోటతన మగునని తలంచి గురువు తన యనుచరుని గలసి మఠమున కరగి యతిధియై వారిచ్చు సత్కారములనంది సంతుష్టుడయ్యెను. అత డామఠమున నొకటిరెండుదినము లుండి మరల బయలుదేరి తెంపులేని పయనములు చేసి తనమామగారైన మూళుడు వసియించుగ్రామము చేరెను. అప్పటికతడు పదియారు సంవత్సరములనుండి ప్రయాణముచేయుచుండెను. ఆగ్రామమునకు నానకు వచ్చినాడని వినినతోడనే ముదిమిచే నవయవపటుత్వము దప్పిన మూళుడు కన్నులార నల్లునొక్కసారి గని యతని నింటికి దోడ్కొనిరావలయునని శ్రమపడి యతడున్న ధర్మశాలకు బోయి సబహు మానముగ నతనిని దర్శించి తనయింటికి రమ్మని వేడుకొనెను. గురువు బహుమానముల స్వీకరింపక యతని గృహమునకు బోవుటకు సమ్మతింపక హరినామస్మరణమే తనకాప్తబంధు వనియు ధర్మశాలలే తన గృహములనియు జెప్పి యతనింబంపెను.

మామగారి గ్రామమైన పఖోకరండవాలో నానకు రెండుమాసము లుండెను. ఆకాలములో నజ్ఞానతమ: పటలముచేత నావృతములైన యనేకమనస్సులయందు జ్ఞానదీపములను వెలిగించి వారిని యీశ్వరభక్తులుగ జేసెను. అంతకంత కతనిపేరు పరిసరభూములయందు వ్యాపించుటజేసి జ్ఞానసంపాదనము నిమిత్తము జనులు పెక్కండ్రతని సన్నిధికి రాదొడగిరి. మాసద్వయ మాగ్రామముననున్న తరువాత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు గొప్పతీర్థము జరుగునని తెలిసినందున నానకు బలునిగూడి యచ్చటి కరిగెను. ఆర్యావర్తమాన మందలి మహాపుణ్యక్షేత్రములలో గురుక్షేత్ర మొకటి. ఈ క్షేత్రముందే భగవానుడగు శ్రీకృష్ణుండు తన మేనమరదియు జెలియలి మగడును గారాపుచెలికాడునగు నర్జునునకు రథసారధియై పార్థసారథినామధేయంబున బ్రసిద్థుడై కురుపాండవ సైన్యమధ్యమున నరదంబున నిలువంబెట్టి యుపనిషత్కారమైన భగవద్గీతాశాస్త్ర మాధవుం డాయన కుపదేశించెను. ఈక్షేత్రమునందే కురుపాండవ రాజకుమారులు కౌరవసామ్రాజ్యము నిమిత్తము పెచ్చుపెరిగినమత్సరంబున మహాసంగ్రామము గావించి నిహతులైరి. ఈక్షేత్రమునందే యాకాలపురాజనందను లందము కౌరవపాండవులలో నేదోయొక పక్షముబూని మహానామప్రళయానలమునకు మిడుతలై కధావశేషులైరి. మహాభారతసంగ్రామము జరిగి రమారమి యిప్పటికి నాలువేల సంవత్సరములైనను ననేక రాజఋషులచ్చట రణనిహతులై వీరస్వర్గము జూరగొనుటచే నాటగోలెనది భువనపావనమైన పుణ్యక్షేత్రమై పుణ్యాత్ములకెల్ల సేవ్యమై పురాతనచరిత్రాభిలాషులకు గూడ నభిగమ్యమై విరాజిల్లుచున్నది. ఈకారణముచేతనే నానాకాస్థలమునకు బోయి యుండును. ఆసంవత్సరము సమ్మేళనము మిక్కిలి గొప్పది. అన్నివణన్‌ములవారు నన్నిమతములవారు నచ్చట సమావేశమైరి. కాని కాలక్షేపము నిమిత్తము వేడుకనిమిత్తము వేళాకోళము నిమిత్తము విహారము నిమిత్తము వచ్చినవారే కాని తీర్థవాసులలో ననేకులు నిజమైన భక్తితోడను శ్రద్ధతోడను బరమార్థముతోడను వచ్చినవారు లేరు. హోమములు గావించువారు స్వాధ్యాయము చెప్పువారు భజనలు సేయువారు స్నానములు సలుపువారు జపములు చేయువారు తపోనిరూడు లైనవారు ధర్మోపదేశములు చేయువారు వేనవేలు గనబడిరి. విగ్రహారాధనము విరివిగా జరిగెను. నిష్కళంక మైనభక్తి నిజమైనవైరాగ్యము సత్పుత్రదానము సాధుసేవ బ్రహ్మజిజ్ఞాస మొదలగునవచ్చట మృగ్యుములయ్యెను. నానకువంటి వేదాంతకవియన్నియు నసహ్యములై తోచెను. ఆజపములు తపములు దానములు ధర్మములు బ్రహ్మజ్ఞాననిష్ఠు డైన యామహాత్మునకు దలయేరు గలిగించెను. పారమార్థికులు గాక గతానుగతికులైన మూడలోకులకు బుద్ధి చెప్పవలయునని తలంచి బలుని బిలిచి యచ్చటచెరువులోనుండి యొకచేపం దెమ్మని యతడు తెచ్చిన యామత్స్యమునుదాకలోబెట్టి మండింపదొడగెను. అదిచూడగానే తీర్థవాసులకు నతితీక్షణమైన కోపము వచ్చెను. అటువంటి పావనక్షేత్రమున పరమపావన చరిత్రులగు తీర్థవాసులు లక్షోపలక్షలు చూచుచుండగ నటువంటి పుణ్యదినమున యోగి యన్నపేరు పెట్టుకొన్నవాడు జీవహింస చేసి కడుపు నించికొనుటకన్న కష్టకార్యము మరొకటి లేదని యచ్చట చేరినవారందరు దలంచి కోపగించిరి. కొందఱు తమనాలుకలను యధేచ్ఛముగ నుపుయోగించి వానిని నోటికి వచ్చునట్లు బండబూతులు తిట్టిరి. అట్టి దురాత్ముని బ్రతుకనియ్య గూడదని దుడ్డుకర్రలు చేతబట్టుకొని చంపవచ్చిరి. వాని కాసమయమున నొడలే తెలియలేదు. పొంగి పొరలివచ్చుచున్న మహాసముద్రమువలె జనసమూహము తన్ను నిర్మూలనము జేయుటకు దుడ్డుకఱ్ఱలతో వచ్చి మీదపడుచున్నను నతడు మహాపర్వతమువలె చలింపక నిర్భయముగ వారిముందర నిలిచి మీరు వాగ్వాదము చేసి నన్ను గెలువ దలంచిరా లేక దండప్రయోగముచేతనే నిర్జింపదలచిరా యని యడిగెను. వర్షకాల మేఘము లురిమిన చందమున దమకంఠము లెత్తి వారిట్లనిరి. వాగ్వాదముచేసి నీతప్పు నీవు తెలిసికొని యికముం దట్టిపని నెన్నడు సేయవని నీవు ప్రమాణము చేసిన పక్షమున నిన్ను విడిచెదము. లేదా యీచేపను నీవు కోసినట్లే నిన్ను ముక్కలుముక్కలుగా గోసెదమని వారుత్తరమిచ్చిరి. అపుడు నానకు వారి కిట్లనియెను. మనుష్యుడు మాంసమునుండి పుట్టెను. మాంసముతోనే పెరుగుచున్నాడు. కావున మాంసమునందు నంతద్వేష ముండవలసిన యవసరము లేదు. పూర్వాచార పరాయణులైన యామూడభక్తులు వానిమాటకు దగిన ప్రత్యుత్తరము చెప్పలేక యతడు జ్ఞానసంపన్నుడైన మహాయోగి అతని జోలికి మనము పోగూడదని చల్లచల్లగ జారిరి. నానకుగురువుయొక్క ప్రతిష్ఠ దేశమంతటను ముఖ్యముగ బంజాబుదేశమునను గ్రమక్రమముగ వ్యాపించెను. అత డొకమతమును మెచ్చలేదు. ఒక మతమును ఖండింపలేదు. ఏమతమునందైనను దోషములున్న పక్షమున నాదోషముల నతడువిమర్శించి ఖండించుచు వచ్చెను. దీనిఫలిత మేమనగా బ్రతి మతస్థులు నతనింగూర్చిన కథలువినుచు నతని గుణగణములు భక్తిశ్రద్ధలు జెప్పుకొనుచువచ్చిరి. అంతకంతకతనికి యశస్సు డిల్లీచక్రవర్తి యొక్క కొలువుకూటమువఱకు వ్యాపించెను. ఆకులమున భోగపరాయణు డైన యిబ్రహీములోడీ డిల్లీచక్రవర్తిన్‌యై యుండెను. ఆడిల్లీ చక్రవతిన్ కితనిగొడవ లక్కఱలేదు కాని యాయన యాస్థానమునందు స్వమతాభిమానియు నానకు సిద్ధాంతములయందు ద్వేషము గలవాడు నగు ముత్సద్దీ యను మహమ్మదీయుడుండి చక్రవర్తికి నానకుమీద నమితద్వేషము కలుగునట్లు చెవిచెంతజేరి కొండెము లెన్నెన్నియో చెప్పి యతని మనస్సు పాడుచేసెను. ఆమహమ్మదీయుడు చక్రవతిన్‌తో నీతెఱంగున జెప్పెను. ఈనానకు మహమ్మదీయ మతమునకె గాక హిందూమతమునకు గూడ ద్రోహవిగ్రహారాధనము సేయగూడదనియు వణన్‌భేదము దూష్యమనియు నితడు హిందువుల నధిక్షేపించును. గోవధము పాతకమనియు మహమ్మదువారు జగద్గురువు కారనియు మనల నధిక్షేపించును. కావున నిత డుభయమతస్థులకు విరోధియే కావున సర్వవిధముల దండ్యుడు. ఆపలుకులు చక్రవతిన్‌కి నచ్చెను. ముత్సద్దికి గాని చక్రవతిన్‌కి గాని హిందూమతము మీద నిజమైన యభిమాన మున్నదని మనము నమ్మగూడదు. మహమ్మదీయ మతము నధిక్షేపించుట చేతనే ముత్సద్దీకి నానకుపై బట్టరాని యాగ్రహము వచ్చెను. తనమతమును దూషించి నందుకు నానకును దండించినచో హిందువులకు గష్టముగ నుండు నని ముత్సద్దీ హిందూమతముమీద నత్యంతాభిమాన మున్నట్లభినయించి చక్రవతిన్ కాపరమసాధువు మీద సారములేని కోపముదెప్పించెను. ఆకోపాదేశమున జక్రవర్తి నానకును జెఱసాలలో బెట్టించెను. మహాపురుషులకు గృహములు కారాగృహములు నొక్కవిధముగానే యుండు ననుమాట భోగపరాయణు డైన చక్రవతిన్ యెఱుగడు, జీవ న్ముక్తు లగు మహాత్ములు కారాబద్ధులయ్యు చెఱసాలలో సంపూణన్ స్వాతంత్ర్యము గలవారియట్ల సంతోష భరితు లై యుందురు. అజ్ఞానులు యథేచ్ఛముగ విహరింప స్వాతంత్ర్యము గలిగియు సంసారబద్ధులై కారాబద్ధుల కంటె నధికదు:ఖము లనుభవించు చుందురు. చక్రవతిన్ గురువుయొక్క శరీరమునే నాలుగుగోడల నడుమబంధించెను. కాని యాతనియాత్మను బాథింప జాలడు. శరీరము చెఱనుండి గదలలేకపోయినను విశృంఖలమైన యాత్మ రోదసీ కుహరమంతయు స్వేచ్ఛగా విహరించి పరమేశ్వరుని పాదములవఱకు బయనముసేయును. ఆ చెఱసాలలో నున్న ఖైదీలు ప్రతిదినము తిరగళ్ళతో గొంతపిండి విసరవలయునని నియమముండెను. కారాబద్ధు లాపని బహుకష్టమున జేయవలసి వచ్చెను. నానకు స్వధర్మముచేయుటయం డత్యంతాసక్తి గలవాడు కావునదక్కిన వాండ్రవలె రేలు పెందలకడ నిదురవోవక విసరవలసినపిండి యంతయు విసిరి శయనించుచు వచ్చెను. అది యెఱుగక తోడిఖైదీలు నానకుయొక్క శిష్యులు నానకునకు మహామహిమలు గల్పించి నానకు స్వహస్తముతో విసరనక్కఱలేకుండ నతని ప్రభావముచేత వాటంతటవే తిరుగళ్ళు తిరిగె ననియు భగవంతు డే వచ్చి విసరెననియు జెప్పుకొన జొచ్చిరి. మూడవిశ్వాసము గల యానాడు జనులందఱు నామాటలు నమ్మిరి. దైవానుగ్రహమువలన నానకు చిరకాలము చెఱలోనుండ డలేదు. మొగలాయి వంశస్థు డగుబేబరు కట్టకడపటిసారి హిందూదేశముపై దండువెడలి పానిపట్టువద్ద యిబ్రహీము లోడీని గెలిచి యతనిం జంపి డిల్లీసింహాసన మెక్కెను. అతడు గద్దెయెక్కిన యెనిమిదవనాడు మహానుభావు డైనయోగి యొకడు పూర్వచక్రవతిన్ చేత నిహేన్‌తుకముగ జెఱబెట్ట బడెనని విని తక్షణమే యతనిని వదిలిపెట్టవలసినదనియు మిక్కిలి గౌరవముతో దనసన్నిధికి దోడ్కొని రావలసినదనియు నానతిచ్చెను. అతని యాజ్ఞాప్రకారము బందెకాడు వానిని జక్రవతిన్ సన్నిధికి దోడ్కొని పోయెను. చక్రవతిన్ యతనితో భగవద్విషయమై సంభాషించి యతడిచ్చిన యుత్తరములకు సంప్రీతుడై ప్రీతుడై వీడుకొలిపెను. ఏడుతరములవఱకు బేబరుసంతతివారు హిందూస్థానము పరిపాలింతురని యాసమయమున బేబరుతో నానకు చెప్పెనని కొందఱు చరిత్రకారులు వ్రాసిరి. అట్లు మొగలాయి చక్రవతిన్‌ని వీడ్కొని నానకు మరల దేశాటన మారంభించి కాశ్మీర దేశమునకు బోయియచ్చట దనసిద్ధాంతములను బోధించి ప్రసిద్ధు డైక యొక బ్రాహ్మణుని దనమతమునం గలపుకొనియెను. నాటం గోలె బెక్కండ్రు నాతని మతమును స్వీకరించి శిష్యులైరి. కాశ్మీరమునుండి యతడు లాహోరుపురమునకు వచ్చెను. ఆపురవాసియు మిక్కిలి పలుకుబడి గలవాడు గొప్పవాడునగు నొకతురక యమీరుగూడ నతని శిష్యు డయ్యెను. అనంతరము నతడు మామగారి యూరికి వచ్చెను. ఒకనా డత డాగ్రామమున నొక చెట్టుక్రింద గూర్చుండ జాటుజాతివాడైన యొకబాలుడు పశువులం దోలుకొనుచు నాదారిం బోయెను. వానిపేరు బూరా అతనిముఖవైఖరిం బట్టి సద్గురూపదేశము గలిగి సత్పురుషునిచేత శిక్షితు డైనపక్షమున నాబాలకుడు మహాపురుషుడు కా గలడని గురువు తెలిసికొని వానిం దనకడకు రమ్మని చేసన్న జేసెను. అబాలుడు తక్షణమె యాతనిసన్నిధికిం బోయి యేలపిలిచితిరని యడిగెను. పనియేమి లేదు. ఊరకపిలిచితినని గురు వుత్తరము చెప్పెను. లోకఖ్యాతకీతిన్ యైన మహానుభావుడు తగవంటి యర్భకుని నిర్హేతుకముగ బిలువ డని యబ్బాలుడు తలంచి మరునా డొక చెంబునిండ నేయి బోసికొని యతని దర్శనమునకు బోయి తనతెచ్చిన కానుక గ్రహింపు మని ప్రార్థించెను. నీతలిదండ్రులతో జెప్పి యిది తెచ్చితి వా వారియెరుకలేక తెచ్చితివా యని నానకు డింభకు నడిగి మాతాపితలకు దెలియకుండ దెచ్చితి నని యతడుత్తరము చెప్ప గృహయజమానులకు దెలియకుండ దొంగతనముగ దెచ్చిన వస్తువు పుచ్చుకో నని బాలకు డెంత బతిమాలినను దానిని గ్రహింపక పంపివైచెను. అనంతర మాబాలకుడు ప్రతిదినము గురుసందర్శనము జేసి క్రొత్తవిషయములు నేర్చికొనును గొంతకాలమునకాతనికి శిష్యుడై పంజాబుదేశ మందు మిక్కిలి పేరుగాంచిన సన్యాసి యయ్యెను. ఈవిధముగ హిందువులు మహమ్మదీయులుగూడ నతని శిష్యులుగను వచ్చిరి.

మామగారియూర నాలుగుసంవత్సరములుండి మామగారి మరణానంతరమున నతడు గ్రామము విడిచిపెట్టెను. అప్పటి కతనికరువది సంవత్సరములు నిండెను. మునుపటివలె దీఘన్‌ప్రయాణములుచేయుట కోపిక లేకపోయెను. అందుచేత స్వస్థలము విడిచి దేశాంతరముల కరుగగూడ దని యతడు నిశ్చయించుకొనెను.