దశరథరాజనందనచరిత్ర/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

శ్లో.

"సీతాలక్ష్మణపూర్ణపార్స్వయుగళం స్మేరానామ్భోరుహమ్
మేఘశ్యాను ముదారబాహుపరిఘం విస్తీర్ణవక్షస్థలమ్
కర్ణాన్తాయతలోచనం కటితటీసంవీతపీతామ్బరమ్
ధ్యాయే౽స్మత్కులభాగధేయచరణం రామంజగత్స్వామినమ్"

(శ్రీరామపాదుకాస్తవము)

1. తెలంగాణలోని ప్రాచీనకవులు-గ్రంథములు-సంస్థానములు-సాహిత్యము:

నల్లగొండ కవులు - రచనలు

సర్వశ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, శేషాద్రి రమణ కవులు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, డా. బిరుదురాజు రామరాజు — మొదలగు వారు ఆంధ్రసారస్వతమున కమూల్యాభరణము లర్పించిన మరింగంటి కవుల గూర్చి సారస్వతలోకమునకు కొంత తెలియపరచినారు — వీరికి నమోవాకములు.

'అచ్చతెనుంగు కబ్బమున కాదిపదంబయి పోల్చు భాగ్యము'ను పొందినది తెలంగాణాభూభాగము. ఈప్రాంతమందు కవులు పండితులు హెచ్చుగా నున్నను చరిత్ర కెక్కని చరితార్థులసంఖ్యయే యధికము. పూర్వకవుల తలపించు శైలిగల వీరిగ్రంథములు చాలభాగము నష్టములైనవి. మరికొన్ని 'ఆలయమందముద్రితములై తెరచాటున డాగియున్న బిబ్బీలవిధాన' గలవు. ముద్రణమైన స్వల్పసంఖ్య గ్రంథములును నేడు లభించుటలేదు.

ఈ ప్రాంతము ౼ విద్యానాథుడు, మల్లినాథ సూరి, శాకల్య మల్లన ౼ మొదలైన సంస్కృతకవిపండితులకే గాక ౼ బమ్మెర పోతన, పాలకురికి సోమనాథుడు, వేములవాడ భీమన, బుద్ధారెడ్డి, పినవీరభద్రుడు ఇత్యాది తెనుగు కవులు; సర్వజ్ఞ సింగభూపాలుని వంటి అలంకారికశిఖామణులు; అప్పకవి, గౌరన వంటి లాక్షణికులు; కొఱవి సత్యనారనవంటి ఆంధ్రకవితాపితామహులును ౼ కలిగి విశేషఖ్యాతి గాంచినది.

కొంతకాలము క్రిత మొకప్రబుద్ధుడు 'నిజాం రాష్ట్రమున ఆంధ్రకవులు-పండితులు పూజ్యము' అని వ్రాసెనట.[1] ఈ వాక్యమునకు నాటిపెద్దలు-సాహిత్యాభిమానులు ఎంతకుమిలిపోయిరో? తద్బాధానివారణార్థము 'ఇదిగో మా తెలంగాణ మందలి కవులు....' అని చూపుటకు సిద్ధ మొనర్చినదే 'గోలకొండ కవుల సంచిక' సంపాదకు లీసంచికను తాత్కాలికకాలహరణమునకో—వినోదమునకో సిద్ధము చేసినదిగాక - ఇది 'తెలంగాణకవుల కవిలె'వలె శాశ్వతముగా నుండునట్లు చేసినది. ఈ గో. క. సంలోగల కవుల జాడ-గ్రంథముల వివరములు-నేటికే కొన్ని విస్మృతప్రాయము లయినవనినచో — సంచికానిర్మాణమే జరుగకున్న నిక యెట్లుండెడిదో? దీనియందు కొన్నిపొరపా ట్లున్నను తెలంగాణకవులను గూర్చి సంక్షిప్తపరిచయము చేసికొనుటకు మాత్రము ప్రథమపాథేయముగా - సాహిత్యలోకసంచారకుల కీసంచిక యుపకరించుననుటలో నెట్టి సంశయమును లేదు.

మన తెనుగుసాహిత్యచరిత్రలం దేమి కవులచరిత్రలయం దేమి కవులను గూర్చి వ్రాయునపుడు ముఖ్యముగా కాలనిర్ణయాదులు చేయునపుడు ఆయా కవులను ఇతడు మాప్రాంతమువాడే యనియు - కాదు ఈప్రాంతమువా డనియు కొన్ని దశాబ్దములు శతాబ్దములు వెనుకకు ముందునకు లాగి బీభత్సము చేసినారు. అంతతో నాగక కవులను గూర్చి వివాదములను ప్రత్యేకగ్రంథములుగనే ముద్రించుకున్నారు. ఓరుగల్లు పోతన్నను కడపకు, నల్లగొండ జిల్లా పాల్కురికి సోముని (బమ్మెర, పాల్కురికి నేడు వరంగల్లు జిల్లాలో చేరినవి) కర్ణాటకప్రాంతమునకును, మహబూబునగర జిల్లా అప్పకవిని గుంటూరుకు లాగి వీరిని యచ్చటివారని నిరూపించుటకు 'చారిత్రకపరిశోధనాసర్కసు' చేసినారు. ఇట్టి స్థితి ప్రస్తుతకాలమున కొంత తగ్గినను అచ్చటచ్చట నయోమయస్థితి మాత్రము గలదు.

తెలంగాణ మందలి ప్రాచీన-తాళపత్రగ్రంథముల సంపాదించి ప్రత్యేకగ్రంథాలయ మేర్పరచి - ఆయా జిల్లాల కవుల చరిత్రను సమగ్రముగా సిద్ధము చేసిననా డిట్టిబాధలన్నియు తొలిగి తెలంగాణకవులచరిత్ర ఉద్యమస్వరూపము స్వరూపముగా గోచరించును. కానీ యీ బృహత్ప్రణాళిక యొక్కరిచేతిమీదుగా జరిగి - సుదీర్ఘపరిశ్రమయు ఫలవంతనుగుట దుస్త రము. ఇట్టి సత్కార్యమునకు సాహిత్యసంస్థలు తలంచిన సాధ్యమగును. గోలకొండ కవుల సంచికవలెనైనా తెలంగాణ కవుల సంచిక యొకటి సిద్ధ మొనర్చుట మిక్కిలి యవసరము. మన ప్రాచీనగ్రంథసంపద నశించిన పిదప విచారించిన నెట్టి ప్రయోజన ముండజాలదు - కొంత కాలముక్రితము – డా॥ బి. రామరాజుగారు ఈ విధముగా వ్రాసినారు:

"తెలుగుదేశ చరిత్రమందువలెనే - తెలుగు సాహిత్య చరిత్రమందును తెలంగాణము ప్రసక్తి తక్కువగా నుండుట సర్వవిదితము. దీనికి కారణము తెలంగాణ మందలి పూర్వకవులగ్రంథములన్నియు సేకరింపబడకపోవుట - సేకరింపబడినవి అనాదరము పాలగుట. కీ॥ శే॥ సురవరం ప్రతాపరెడ్డిగారు - గోలకొండ కవుల సంచిక సంపాదించుట కుండిన యముద్రితగ్రంథములు ఈనాడు తెలంగాణమున లభించుటలేదు. మన మెంత ప్రగతిమార్గమున పయనించుచున్నామో! ఈ తాళపత్రగ్రంథము లంతశీఘ్రగతిని శిథిలమగుచున్నవి. తెలంగాణమున తొలుదొల్త నీయముద్రితగ్రంథములను సేకరించుటకు నడుముగట్టినవారు లక్ష్మణరాయ పరిశోధకమండలివారే. ఆమహాసంస్థ పక్షమున కీర్తిశేషులు దూపాటి వెంకటరమణాచార్యులవారు - వందలకొలది తాళపత్రగ్రంథములను - శాసనములను - నాణెములను సేకరించిరి. కీ॥ శే॥ సురవరం ప్రతాపరెడ్డిగారు రెడ్డి విద్యార్ధి వసతి గృహములో నుంచిన గ్రంథములనే గాక నేను స్వయముగా సేకరించిన రెండువందల లిఖితగ్రంథములను కూడా లక్ష్మణరాయ పరిశోధకమండలి భాండాగారమున చేర్చితిని. పండ్రెండు సంవత్సరముల క్రిందట - నే నాగ్రంథముల పట్టికను సిద్ధము చేసితిని. అదిపోయినదట. నాటినుండి నేటివరకు ఆగ్రంథముల నొకమారైనను పరామర్శించినవారు లేరు. తమ్ము పరామర్శించిన క్రిములకు అవి తమదేహము లర్పించినవి. మనము చేసిన అనాదరణము వలని పరాభవముచే వాని హృదయములు శతచ్ఛిద్రములై గడ్డకట్టుకొని పోయినవి[2]-" ఇది 1961లో వ్రాసిన విషయమైనను - నేటికిని ఎట్టి మార్పులేదు.—

లోకమునకు విజ్ఞానచంద్రికలు ప్రసరింపజేసిన వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావుగారి పేరగల 'పరిశోధకమండలి' దుస్థితియే యిట్లున్న చో తెలంగాణమున ప్రాచీనగ్రంథసంరక్షణ మెట్లుండునో మన మూహించుకొనగలము[3]. తాళపత్ర ప్రాచీనగ్రంథసంపత్తు తెలంగాణములో నింకను గలదు. కాని లభించినవాని గతియే యిట్లున్నప్పుడు చెడిపోవుట కెచ్చట నున్న నేమి? భవిష్యత్తులో నైనను వీనికి సుదినములు రావలయునని యాశించుట మన విధిగద! తాళపత్రగ్రంథములు వందలకొలదిగా సంపాదించి వానిని సంరక్షించలేక, ప్రభుత్వమువారు వీరిని లక్ష్యపెట్టక, అవి యన్నియు చాలా భాగము నష్టము లగుచుండుట నాగుర్తులో గల విషయము.

తెనుగు సారస్వతము రాజాశ్రయముచే నెక్కువగా అభివృద్ధి గాంచినది. రాజరాజనరేంద్రుని నుండి యిట్టిప్రాపు గలదు. కాలక్రమముగా రానురాను చిన్న చిన్న సంస్థానము లేర్పడినవి. వాటిలో ఆంధ్రప్రాంతమందలి నూజివీడు, బొబ్బిలి, విజయనగరము, పిఠాపురము, మొదలగునవియు తెలంగాణమందలి మహబూబునగరం జిల్లాలోని గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, కొల్లాపురము, జటప్రోలు, దోమకొండ మొదలగునవియు నల్లగొండ జిల్లాయందలి రాజాచలమను నామాంతరముగల రాచకొండ, సంస్థాననారాయణపురము, నడిగూడెము, బేతవోలు మొదలైనవియుగా ఈసంస్థానములు ఎందరో కవి పండితులను పోషించి వారిచే నమూల్యకృతిరత్నముల వెలయింపచేసినవి. సంస్థానాధిపతులు కృతిభర్తలేగాక కృతికర్తలుగను ప్రసిద్ధిగాంచినారు.

గద్వాల వనపర్తి సంస్థానములు దశాబ్దమునకు పూర్వమును మానవల్లివారి సాహిత్యకృషికిని, తిరుపతి వేంకటకవుల అవధానవర్షమునకును దివ్యసాహితీఫలముల నందింప నోచుకొనినవి. నీతివాచస్పతులును, మానినీమన్మథులు నైన సురభివారు కొల్లాపుర సంస్థానాధిపతులు. వీరు చంద్రికాపరిణయాదు లొనర్చినవారు. రాచకొండ సంస్థానము శ్రీనాథునంతటివానికి కనకాభిషేకము చేసినది. అంతేకాక రసార్ణవసుధాకరాది గ్రంథములు వెలువడిన దీయాస్థానముననే! సంస్థాననారాయణపురము, బేతవోలు, 'సమాగతామితవచ స్స్వీకారశయ్యాచమత్కృతి సద్గ్రంథకవిత్వతత్వఘటనా వేద్యు'లైన కవిపండితుల కాశ్రయ మొసంగి సాహితీసారశీకరాసారముల కల్గించినవి.[4]

తెలంగాణ జిల్లాలలో నొకటైన నల్లగొండ చారిత్రకముగనేగాక సాహిత్యసాంస్కృతికముగను పేరెన్నిక గనినది. గో. క. సం లో ఆయాజిల్లాల కవుల సంఖ్య నొసంగిరి అందు నల్లగొండ కవుల సంఖ్య 57 మాత్రమే గలదు. ఏకారణము వలననో గాని అప్పటికే యిందు చేరవలసిన కవులు చేరలేదు. వదిలిపెట్టబడిన కవులే యీజిల్లాలో సుమారు 60 మంది గలరు, వీరిలో కొందరినిగూర్చి లభించిన యాధారములతో 'భారతి', 'ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రిక'లద్వార నేను తెలుపుచున్నాను. కాని గ్రంథములు దొరకనికవులు, కవి పేరు తెలియని రచనలు కొన్ని గలవు. ఆయాకవివంశీయుల అశ్రద్ధవల్ల పాడైన గ్రంథములును హెచ్చుగా గలవు. మరికొన్నిగ్రంథములు మదరాసు కాకినాడలయందలి ప్రాచ్యపుస్తకభాండాగారములయం దముద్రితముగా వాసము చేయుచున్నవి, ఉదా:-1,400 ప్రాంతమున రాచకొండ సంస్థానమునం దున్న బొమ్మకంటివారి హరుడను కవి మురారికృత అనర్ఘరాఘవమునకు వ్యాఖ్య వ్రాసెను. ఈప్రతి మదరాసు ఓరియంటల్ లైబ్రరీలో గలదని గో.క. సం. (22పుట) తెలుపుచున్నది. ఈవిధముగనే మరికొన్నిరచనలు గలవు. కవిత్రయముతర్వాత యథామూలముగా భారతము నాంధ్రీకరించిన చిఱుమర్రి నరసింహకవి మిర్యాలగూడెం తాలూకా కంపాలపల్లి నివాసి. ఈయన భారతమును భువనగిరిలో నొకవైశ్యునకు అంకిత మిచ్చినాడట. నేటివర కది యలభ్యముగా నున్నది.[5] ఈ విధముగా నల్లగొండమండల కవులు రచనలు వికీర్ణములుగా నున్నవి.

మరింగంటి వంశకవులు నల్లగొండమండలకవులలో అధికలబ్ధప్రతిష్ఠులు. వారియందు సింగరాచార్యులు ఆద్యుడు, మిన్నయైనవాడు. సింగరాచార్యులను గూర్చి తెలుసుకొనుటకు ముందు ఇతనికి పూర్వాపరములగల ఆవంశపుకవులను గూర్చి తెలిసికొందము.

2. మరింగంటి కవులు - రచనలు :

తరతరములుగా గీర్వాణాంధ్రభాషాకవివతంసులని పేరెన్నికగన్న యీవంశపుకవులకు నల్లగొండ మండల మాకరమైనది. అందు ముఖ్యముగా నేటిదేవరకొండ తాలూకాలోని 'కనగల్లు' గ్రామము. ఇచ్చటనుండి కొంతకాలము తర్వాత వీరిలో కొందరు ఇతరప్రాంతములయందు స్థిరపడినారు. మిర్యాలగూడెం తాలూకాలోని 'అనుముల’ హుజూర్ నగర్ తాలూకాలోని 'యాదవాకిళ్ల' జనగాం తాలూకాలోని 'మల్లంపల్లి' మరియు సూర్యాపేట, విశాఖపట్నము జిల్లాయందలి భీమునిపట్నము, కృష్ణామండలములోని మొఖాసాకలువపూడియందును గలరు.

వీరియింటిపేరు ఆసూరి మరింగంటివారు. ఈ పేరు (ఆసూరి) చాలావిశిష్టమైనది. ఎందుకనగా శ్రీమద్రామానుజుల వారిగృహనామమును ఆసూరి వారే! ఇక 'మరింగంటి' అని వీరికి గృహనామము కలుగుటకు గలకారణములను వీరు తమ రచనలయందు చమత్కారముగా నిట్లు తెల్పినారు. 'శేషాంశసంభవుడైన లక్ష్మణార్యుడు పండ్రెండువేలమంది త్రిదండసన్యాసులు, ఏడువేలజనము, డెబ్బదినాల్గువేల గురుజనము, లక్ష తిరునామధారులు వెంటరాగా శ్రీవైష్ణవమతస్థాపనార్థమై బయలుదేరి అనుకూలుర ననుగ్రహించి చెనటులను శిక్షించి అష్టదిశలయందు శ్రీమతమును నిల్పి శ్రీరంగమునకు తిరిగి రాగా లక్ష్మణాచార్యులతో శ్రీరంగేశుడు.

కంటిన్ లక్ష్మణమునివరుఁ
గంటిన్ గూరేశ దేశికస్వామిమ ఱిం
గంటి నదెవ్వరన 'మఱిం
గంటి' మహాన్వయము దనరె గణ్యం బగుచున్.

(ద. రా. నం. చ. 1–15,16)

అనెనట; ఈవిధముగనే సింగరాచార్యుల తర్వాతకవులును తమగృహనామవిషయమై తెల్పిరి. 'గోదావధూటీపరిణయము' (కృత్యాది. 25,26 నెం. పద్యములు) తాలాంకనందనీపరిణయమును ఇట్లే తెలుపుచున్నవి. తా. నం. పరిణయములో-

'కంటిమిమిము కూరేశులఁ
గంటిమి మీవెంట వచ్చు ఘను లెవరో మఱిం
గంటి మని బల్క నది మా
కింటికి పేరుంట నా మహిన్ రహి కెక్కెన్.'

(కృత్యాది)

అని గలదు. ఆసూరివారు ఈకారణాన మరింగంటివారై ఆసూరి మరింగంటి యనబడుచున్నారు.[6]

వీరు మౌద్గల్యగోత్రులు, హెచ్చుగా లక్ష్మీనృసింహవేంకటేశ్వరభక్తులు.

దశరథరాజనందనచరిత్రలో 'కవివంశవర్ణనము’న గలవారియందు సింగరాచార్యులకు పూర్వముగల వారిరచనలు ఏవియు లభించలేదు. వారును ప్రౌఢకవులే! ద. రా. నం. చ.[7]కృత్యాది ననుసరించి వంశవృక్షమును ముందొసంగుచున్నాను. దాని ప్రకారముగా తెలియవచ్చువారు-

1. చెన్నయాచార్యులు:- 'సకలరాజాధిరాజరాజమకుటాగ్రఘటిత చిరత్నరత్నబహుళనీరాజనాతి విభ్రాజితాంఘ్రిసరసిజుఁ 'డైన ఈ చెన్నయాచార్యులు మాధవగురుని పుత్రుడు. విశేషమేమనగా పుట్టుకతో నితడు సర్పరూపిగా కన్పించినవాడు. ఈయన మాహాత్మ్యము ద. రా. నం. చ, ని.సీ. క కృత్యాదులయందు 'గోదా..' యందును వర్ణింపబడినది. ఈయన బహుశాస్త్రనిష్ణాతుడట. పణ్కరాజుపల్లి గుట్టపై ఈయన నివాసము. ఈపణ్కరాజువల్లి యను గ్రామము ప్రస్తుతము మిర్యాలగూడెం తాలూకాలోని అడవిదేవులపల్లి గ్రామమునకు సమీపమున గలదు. ఆ గుట్టపై నరసింహ స్వామి యాలయమున్నది. మరింగంటి చెన్నయ్యగారని నేటికిని ఆప్రాంతపుప్రజలు గుట్టపై దేవళమున గల పుట్టయందు పాలు పోయుట పరిపాటి. అంతే గాక ప్రత్యేకముగా పూజలును సల్పుదురు. ఈయన 'దశనవసంఖ్య యగ్రజులు తద్దయు కూర్మి భజించుచుండగా' నుండెనట. ఈయన జన్మకారణము ననుసరించి యేమో, మరింగంటివారు నేటికిని సర్పమును పూజించుటయేగాక ఎంత భక్తి ప్రపత్తులతోనో చూచుదురు.

2. అప్పలాచార్యులు:- రాజాస్థానములయందు మరింగంటివారిపేరు ఈయననుండి వినిపించుచున్నది. ఈ అప్పలాచార్యులు ముగ్గురురాజులచేత మ్రొక్కులు గొన్నట్టి భగవత్సమానుఁడు (ద. రా. నం. చ.) మత్తేభనరహయమనుజేంద్రమకుటాగ్రమిళితాంఘ్రియుగళుఁడు' (ని.సి.క.) ముగురురాజు లనగా నరపతులు అశ్వపతులు గజపతులు.

మొట్టమొదటి యచ్చతెనుగుకావ్యముగా పరిగణింపబడుచున్న 'యయాతిచరిత్ర'ను పొన్నికంటి తెలగన్న మల్కిభరాంవద్ద మీర్ జుమ్లా (ఆర్థికమంత్రి) పదవిలోనున్న అమీనుఖానునకు అంకితమిచ్చినాడు. ఈవిషయమున తెలగన్నకు ప్రోత్సాహ మొసగినది అప్పలాచార్యులే యనుటకు యయాతి చరిత్రమందలి -

'తనకు న్నిచ్చలు మ్రొక్కువారిని సిరుల్ దైవారఁగాఁ జల్ల చూ
పున నెల్లప్పుడుఁ జూచి మన్పఁగల పెన్ప్రోడన్ మఱింగంటి య
ప్పనగారిన్ మదిలోనిమాట దెలియం బాటించుచుం గాంచినన్
గని యామేటితలం పెఱింగి పొసగంగా నన్ను మన్నించుచున్.'
పిలిచి పొన్నికంటి తెలగన్న నీచేయు
నచ్చతెనుఁగుఁగబ్బ మన్నియెడల
మించి వెలయఁగా నమీనుఖానున కిచ్చి
పుడమిలోన సిరులఁ బొగడు కనుము"

(1-9, 10)

అను పద్యములవలన తెలియుచున్నది. తెలగన్న తెల్పినప్రకారముగా నాలోచించినచో అప్పలాచార్యులు మల్కిభరాం ఆస్థానమున విశేషగౌరవాదరములతో నుండి, బహుదేశబుధులతో విద్యాపరీక్షల కాలము గడుపుచుండెడివా డని తోచుచ్నుది. అంతేగాక 'ఉభయవేదాంతార్థవిభవుఁడై ప్రభు లచే అభినుతుల్ గాంచిన వాడు' ('గోదా' తెలుపుచున్నది). ఇట్టిప్రతిభావంతుడు గావుననే తెలగన్న గ్రంథమును తురుష్కాధికారికి అంకిత మిప్పించు ప్రయత్నము విఫలము గాలేదు.

అప్పలాచార్యులను గూర్చి ఈ విషయములు తెలిసినవి. కాని రచన యొక్కటియు లక్ష్యముగా లేదు. ఈయనకు సోదరులు సప్తసంఖ్యగా గలరు. అందు అయిదవ వ్యక్తి -

3 జగన్నాథాచార్యులు: ద. రా. నం.చ లో సింగరాచార్యు లీయనను జగన్నాథసూరిగా తెల్పినాడు. ఈయనకును అప్పలాచార్యులవలెనే రచనలు లేని పరిచయము. జగన్నాథాచార్యులు 'సరసశతపద్యలేఖినీవిరచనారక్తి' గలవాడు. 'వినుతశతఘంటబిరుదాంకవిజయుడు' 'అవధానచక్రవర్తి' ఇంతేగాక కనకాభిషేక మందినవాడనియు శతావధానియనియు బహుసంస్కృతాంధ్రరచనాదక్షుడుగను, నేబతి కృష్ణమంత్రి' తన రాజనీతిరత్నాకరములో నిట్లు స్తుతించినాడు -

"గురుమూర్థన్యు శతావధానబిరుదాంకున్ ద్రావిడామ్నాయత
త్వరసజ్ఞున్, పటుసంస్కృతాంధ్రరచనాదక్షున్ హయాధీశకం
ధరసంలబ్ధసువర్ణవృష్టియుతుకర్ణాటక్షమాభృత్సభాం
తరపూజ్యున్ మరుకంటి వేంగళజగన్నాథార్యు గీర్తించెదన్."[8]

(1-3)

అప్పలాచార్యులు నవాబుల ఆస్థానమున విశేషగౌరవాదరముతో నున్నాడు గదా! జగన్నాథాచార్యులును నిచ్చట గౌరవము పొందెనో లేదో? గాని 'కర్నాటక్షమాభృత్సభాంతరపూజ్యుడు' మాత్ర మైనాడు. అప్పటికి తల్లికోటయుద్ధము (23-1-1565) జరుగక పూర్వమైన నళియరామరాయలవద్దనో, ఇంక కొద్ది ముందుకు పోయినచో శ్రీరంగరాయల (1574-'85) ఆస్థానములోనో, జగన్నాథాచార్యులు పైమన్ననలు పొందియుండవచ్చును. శ్రీరంగరాయలకన్న అళియరామరాయల ఆస్థానముననే ఈయనకు సన్మానము జరిగి యుండవచ్చును. కారణమేమనగా రామరాజభూషణుడు మొద లైన శతఘంటకవనధురీణులు గలరు గదా! 1550-'80 వరకు మల్కిభరాం పరిపాలనాకాలము. ఈమధ్యకాలమున విజయనగరరాజుల యాస్థానములో జగన్నాథాచార్యులు కనకాభిషేకము పొందియుండవచ్చునని యూహించుట కవకాశము గలదు. ఈజగన్నాథసూరి యనుజుడే మన సింగరాచార్యులు. ఈయనను గూర్చి ముందు తెలుపుదును. సింగరాచార్యుల తరువాత గల కవులను గూర్చి తెలుసుకొందము.

4. వేంకటనరసింహాచార్యులు:- ఈకవి సింగరాచార్యులకు ఆరవతరములో ఈ కోవలోనే సుమారు 1770 ప్రాంతమున నున్నవాడు. ఈపేరుగలవా రీవంగడమున నింక కొందరు గలరు కావున ప్రథమవెంకటనరసింహాచార్యులుగా నీతనిని పరిగణింపవచ్చును. మహాకవియైన యితడు రంగాంబావెంకటార్యుల పుత్రుడు. "షోడశమహాగ్రంథబంధురాలంకారనిర్మాణపారీణఘనయశోబంధురుడు" (గోదా-) ఇతనివి కొన్నిరచనలు మాత్రము లభ్యమైనవి. కనగల్లు నందలి తాళపత్రగ్రంథనిలయములో నేతత్కవివంశీయులైన శ్రీరంగాచార్యులవారు వీనిని బదిలపరచి యుంచెడివారు. గోదావధూటీపరిణయము దక్క తక్కిన వన్నియు నముద్రితములు.

రచనలు :-

  • 1. విదేహరాజకన్యకాభ్యుదయము.
  • 2. శ్రీకృష్ణశతానందీయము.
  • 3. చిలువపడిగఱేనిపేరణము.
  • 4. నృకంఠీరవాభ్యుదయము.
  • 5. క్షత్రబంధోపాఖ్యానము.
  • 6. జాంబవతీకుమారశృంగారవిలాసము.
  • 7. రామానుజాభ్యుదయము.
  • 8. శల్వపిళ్లరాయచరిత్ర.
  • 9. విష్వక్సేనప్రభాకరము.
  • 10. గోదావధూటీపరిణయము.
  • 11. పద్మినీకన్యకాభ్యుదయము.
  • 12. రతిమన్మథాభ్యుదయము.
  • 13. మిత్రవిందోపాఖ్యానము.

వీనియందు గోదావధూటీపరిణయము 1956 లో ఆ. మ. శ్రీరంగాచార్యులవారి సంపాదకత్వమున నల్లగొండ (రామగిరి) మహిళాభక్తసమాజమువారు ప్రచురించినారు, ఇది మూడాశ్వాసముల ప్రబంధము. గద్యపద్యములు సుమారు 300. కవిత్వమంత ప్రౌఢముగా లేకున్నను మంచిగానున్నది. గోదాదేవి యనగా ఆండాళు, ఆమె చరిత్ర దీనిలో ముఖ్యము. పరిష్కర్తలైన సంపాదకుల యశ్రద్ధ వల్లనేమో, దోషములు హెచ్చుగా నున్నవి. దానికితోడు ముద్రారాక్షసులు. దేవరకొండ తాలూకాయందలి 'శిరిసనగండ్ల' నరసింహస్వామి కీకృతి యంకితము. పూర్వులనుండి ఈ కవివరకు గల మరింగంటివారిని గూర్చి కృత్యాదిలో తెలిపినాడు. సింగరాచార్యుల తర్వాత గల మరింగంటి వారిని గూర్చి తెలుసుకొనుట కీగ్రంథకృత్యాది మిక్కిలిగా నుపకరించును.

శ్రీకృష్ణశతానందీయము :

ఇది ఎన్నియాశ్వాసములో తెలియదు. లక్ష్మణరాయపరిశోధకమండలిలోనున్నట్లు పరిశోధకులు తెల్పిన గ్రంథములలో నిది యొకటి. పింగళిసూరన కళాపూర్ణోదయమునందు మాయానలకూబరుని గల్పించినట్లు మాయాబ్రహ్మను కల్పించి, కొంత హాస్యమును చిలికింపచేసినాడు. బ్రహ్మ శ్రీకృష్ణుని గోవు లపహరించగా శ్రీకృష్ణుడు బ్రహ్మ వేషమున సరస్వతివద్దకు వెళ్లి మంతనము లాడుచుండును. ఆ సమయమున అసలు బ్రహ్మ వచ్చును. ఇరువురు బ్రహ్మల జూచి సరస్వతియు ఇతరులును తబ్బిబ్బగుదురు. చాల చక్కనిశైలిలో నున్న రచన. అముద్రితముగానున్న మంచిరచనలలో నిదియొకటి.

చిలువపడిగఱేనిపేరణము :

ఇది యచ్చతెనుగుకావ్యము. చిలువపడిగఱేడు = దుర్యోధనుడు (సర్పధ్వజుడు). ఇతని వివాహకథ యిం దభివర్ణితము. కొందరు భావించినట్టు కలువపడగఱేనిపేరణము సింగరాచార్యులరచన గాదు. శ్రీకృష్ణశతానందీయమును ఈగ్రంథమును గూర్చియు పండిత ఆదిరాజు వీరభద్రరావుగారు సంక్షిప్తపరిచయము చేసినారు[9]. ఈ వెంకటనరసింహాచార్యుల తరువాత తెలియవచ్చు

5 వేంకటరాఘవాచార్యులు :- రంగనాయకమ్మ భావనాచార్యుల పుత్రుడు - ప్రౌఢకవి. 'కేశవస్వామిశతకము' (అంత్యప్రాస), 'క్షమావింశతి' యను రెండు రచనలు లభ్యమైనవి. శతకరచనాకాలము శ.సం. 1778. (క్రీ.శ. 1853) దొరికిన యీ రెండురచనలును అత్యుత్తమముగా గలవు. పైరచనాకాలమునుబట్టి శతాబ్దముక్రింద యున్నట్లు తెలియుచున్నది. ‘ కేశవస్వామి భాస్వత్ఖగేశగామి' యనుమకుటముగల ఈశతకము కొంతకాలము క్రితము వరంగల్లు నుండి వెలువడుచుండిన 'ఆంధ్రాభ్యుదయము' అను పత్రికలో 'క్షమావింశతి'తోగూడ ప్రచురింపబడినదట. ఇటివల (1964లో) ఈ కవిప్రపౌత్రులైన మరింగంటి వేంకటరామానుజాచార్యులవారు (మొఖాసా కలువపూడి) క్షమావింశతితో శతకమునుముద్రించినారు.[10] మావద్దగల వ్రాతప్రతితోచూచిన ముద్రితప్రతిలో పాఠభేదములేగాక పొరపాట్లు హెచ్చుగానున్నట్లు తోచుచున్నది. ఈ వేంకటరాఘవాచార్యుల యనుజుడు —

6. (ద్వితీయ) వెంకట నరసింహాచార్యులు:- ఈయన 'తాలాంకనందినీపరిణయ' మను ఆరాశ్వాసముల ప్రౌఢప్రబంధమును 'ఇందిరాల భాగవత'మను యక్షగానమును రచించినాడు. తాలాంకుడనగా బలరాముడు. ఆయన బిడ్డయైన శశిరేఖను అభిమన్యుడు వివాహమాడుట యిందలికథ. మేనరికపు వివాహములపద్ధతి యిందు చక్కగా గలదు. ఆరాశ్వాసములతో గూడిన యీప్రబంధమును పై యక్షగానమును లక్ష్మణరాయ పరిశోధకమండలిలో నుండెడివని గో.క. సం. వలన తెలియుచున్నది. మావద్ద అటనట అసమగ్రముగా నున్న తా.నం. పతాళపత్రప్రతి లిఖతప్రతులును గలవు. ఇందలి గద్యపద్యసంఖ్య (లభించినంతవరకు) 1736. ఆదిరాజువా రీగ్రంథమును గూర్చిన విపులవ్యాసమును చాలకాలము క్రితము వ్రాసినారు[11]. ఆశ్వాసాంత్యములయందు 'ఆముక్తమాల్యద'వలె పద్యములు గలవు. అము ద్రితముగా నున్న మరింగంటి కవుల రచనలలో నిది యొకటి.[12] ఈగ్రంథరచనాసమాప్తికాలము (1764) క్రీ. శ. 1839. ఆంగీరస సం॥ భాద్రపద శు. అష్టమీయని కవి తెల్పినాడు.

ఈ వెంకటనరసింహాచార్యులవి కొన్నిచాటుపద్యము లుండెనట. వానిలో రెండు మాత్రము మా తండ్రిగారి సంరక్షణలో నున్నవి. 'నల్లగొండ జిల్లా కవులు చాటువులు' (భారతి 1969 జూన్) అను వ్యాసమున వానిని ససందర్భముగా నుదహరించినాను.

7. చెన్నకృష్ణమాచార్యులు :- వెంకట నరసింహాచార్యుల సమకాలీనుడైన యీకవియు కనగల్లు వాస్తవ్యుడే యైనను కవిని గూర్చిన వివరములు తెలియుటలేదు. యాదగిరి నృసింహశతకము, మరికొన్ని రచనలు గలవట. అన్నియును అముద్రితములు. గో. క. సం. (399పు) యందును ఈ కవినిగూర్చిన విశేషవివరములు లేవు.

8. వరదదేశికులు:- గో.కం. సం. పేర్కొనబడని కవులలో నొకడైన యీ వరదదేశికులు షుమారు 150 సం. క్రిందివాడు. సరసకవి. సూర్యాపేట తాలూకాయందలి నరసింహాపుర మీతనినివాసస్థలము. శ్రీరామపాదుకాస్తవము[13], గోదాస్తుతి యను రెండు సంస్కృతరచన లీతనివి లభ్యమైనవి. రచన చాలా విలక్షణమైనది.

9. అప్పలదేశికులు:- శ్రీరామపాదుకాస్తవకర్తగా పేరుగాంచినవాడు. కాని యిది ఈయన రచనగారు. కర్తపేరులేని అర్వపల్లీనృసింహస్తోత్ర మొకటి[14] గలదు. దానిరచయిత అప్పలదేశికులవారే యని కొన్ని దృష్టాంతములతో ఈమధ్య తెలిసినది.

10. లక్ష్మణదేశికులు :- 19 శతాబ్దము ఉత్తరార్థమునం దుండిన యీకవి జనగాం తాలూకాలోని మల్లంపల్లి వాస్తవ్యుడు. కారికావళి, సూక్తిరత్నమాల (ము) రామానుజ అష్టోత్తరశతము మున్నగు నముద్రితరచనలు కొన్ని గలవని డా. రామరాజు గారు ('విజ్ఞాన సర్వస్వము' 6సం. 755, 756 పుటలు) తెలుపుచున్నారు.

11. వేంకట నరసింహాచార్యులు (తృతీయ) :- అనిరుద్ధవిలాసమను యక్షగానమును రచించినాడు (అము). సుమారు 80 సం. క్రిందటివాడు. సింగరాచార్యులవారి శాఖ. ఈ వెంకటనరసింహాచార్యుల పుత్రుడే కనగల్లు నందలి తాళపత్రగ్రంథనిలయ స్థాపకులైరి.

12. శ్రీరంగాచార్యులు: సుమారు 5 సం. క్రిత మీ రంగాచార్యులు పరమపదించినారు. కొన్నివందల తాళపత్రగ్రంథములు సంపాదించి బదిలపరచినారు. వానిలో కొన్ని కృష్ణ దేవరాయాంధ్రభాషానిలయమున కొసంగిరి. గోదావధూటీపరిణయ మొక్కటి మాత్రము వీరి సంపాదకత్వమున ప్రచురింపబడినది. గోదాశతక మొకటి ఈయన రచన గలదు (అము). శ్రీరంగాచార్యులు పరమపదించిన తర్వాత నిరాశ్రయమైన కుటుంబముతో పాటు తాళపత్రగ్రంథములును చెదిరిపోయినవి. వీరు జీవించి యున్నప్పుడు మానాయనగారికి మైత్రీపూర్వకముగా కొన్ని తాళపత్రలిఖితగ్రంథముల నొసంగిరి.

13. వెంకటరామానుజాచార్యులు:- కేశవస్వామి శతకకర్త యగు వేంకటరాఘవాచార్యులవారి పౌత్రులైన వేంకటరాఘవాచార్యుల పుత్రులు. జ్ఞానవయోవృద్ధులైన వీరు కృష్ణాజిల్లా మొఖాసాకలువపూడియం దున్నారు.

కేశవస్వామి శతకమును ముద్రించినది వీరే. జనగాం తాలూకాలోని 'జీడికల్లు' శ్రీరామచంద్రుడు వీరి యభిమానదైవము. 'భల్లాతకక్షేత్ర (జీడికల్లు) మాహాత్మ్యమ'ను అయిదాశ్వాసముల ప్రబంధమును వ్రాసినారు (అము). సుమారు 400 పద్యములకు పైగా గలవు[15]. వారణాసి అచ్యుత రామకవి సురతాణీపరిణయము మొదలైన గ్రంథములు వీరివద్ద యుండెనట. ఇటీవల తుఫానులో నవియన్నియు నష్ట మైనవని తెల్పిరి.

14. వెంకటనరసింహాచార్యులు (చతుర్థ) :- పై వెంకటరామానుజాచార్యులవారి సోదరుడు. సుమారు 8 సం. క్రితము సూర్యాపేటలో పరమపదించినారు. బహుగ్రంథకర్త. చాలాభాగము ముద్రణమైనవి. ముద్రితరచనలు 30 అముద్రితరచనలు 10 గలవు. ముద్రితరచనలలో మాలతీవసంతము, నీలాసుందరీపరిణయము అను ప్రబంధములును, సుచిత్రాభ్యుదయము, సుమాలినీపరిణయము అను నాటకములును ప్రసిద్ధి గాంచినవి.

15. లక్ష్మణాచార్యులు:- సుప్రసిద్ధ హరికథాకథకులైన వీరును వెంకటరామానుజాచార్యుల వారి సోదరులే. చక్కని కవిత చెప్పగలవారు. వీరు భీమపుర లక్ష్మీనారసింహప్రభుశతకము (1959) శబరిసపర్య (1968) హనుమన్నుతి (1968) మొదలైన రచనలు చేసినారు. విశాఖ మండలమందలి భీమునిపట్నములో నున్నారు.

16. పురుషోత్తమాచార్యులు:- 14 నెం. వెంకట నరసింహాచార్యులవారి పుత్రులు - ప్రస్తుతము వీరు సూర్యాపేటయందలి జిల్లాపరిషదున్నతపాఠశాలలో నధ్యాపకులుగా నున్నారు. పిత్ర్యమైన గ్రంథముల ప్రచురించి ప్రచార మొనర్చుటయేగాక - రసవత్కవితతో 'యాదగిరి లక్ష్మీనారసింహప్రభో' యను మకుటముగల శతకమును రచించినారు. ప్రస్తుత మిది ముద్రణ మగుచున్నది.

సింగరాచార్యులకు పూర్వోత్తరముల గల కవుల గూర్చి తెలిసినంతవరకు - వారివారి రచనలతో పరిచయ మొనరించినాను. అనుముల, యాదవాకిళ్ల ప్రాంతములయం దికకొంద రున్నారేమో! గాని వారిని గూర్చిన వివరములు తెలియరాలేదు.

ఇక సింగరాచార్యులవారి చరిత్రలో ప్రవేశింతము.

4. సింగరాచార్యులు - వంశవృక్షము :

దశరధరాజనందనచరిత్రయందును శుద్ధాంధ్రనిరోష్ట్య సీతాకల్యాణమునందును వంశవృక్షము సమానముగా గలదు. అంతేగాక కొన్నిపద్యములు మినహాయించిన రెంటిలోను కృత్యాది సమానముగానే గలదు. ద. రా. నం. చ. ప్రకారముగా సింగరాచార్యుల వంశవృక్ష మిది.

1. అప్పలగురుడు 2. వెంకటార్యుడు 3. నృసింహుడు 4. కోనేటిరాయశౌరి 5. జగన్నాథసూరి 6. సింగరాచార్యులు 7. రంగప్ప 8. సింగరప్ప. తెలిసినంతవరకు వీరిలో కొందరిని గూర్చి తెలుసుకున్నాము. సింగరాచార్యుల తరువాత గలవారి వంశానుక్రమణిక 'గోదావధూటీపరిణయము' నందు గలదు.

ఇక సింగరాచార్యుల స్వస్థలము కాలము రచనలను గూర్చి తెలుసుకుందము.

నివాసము:

శతఘంటావధాన, శారదాప్రశ్నవివరణ, ఆశుకవి యిత్యాది అన్వర్థబిరుదాభిరాముడగు సింగరాచార్యులు, వరదమాంబా తిరువేంగళాచార్యుల గర్భశుక్తిముక్తాఫలము. శ్రీవైష్ణవులు. మౌద్గల్యగోత్రము. మరింగంటివారికి పుట్టిల్లైన కనగల్లులో సింగరాచార్యుల పూర్వు లుండెడివారట. కొంతకాలము తరువాత, నేటి మిర్యాలగూడెం తాలూకా యందలి వాడపల్లిలో నరసింహస్వామి యాలయమున వీరు స్థానాచార్యత్వము వహించియున్నట్లు గోదావధూటీపరిణయములో గలదు.

మ.

"నరనాగాశ్వనృపాలశేఖరులు నానారత్నభూషావళుల్
తురగాందోళికఛత్రచామరతతుల్ తోరంబుగా నీయగన్,
సిరు లింపొందుచు వాడపల్లి నగరిన్ చెన్నొందుచున్నట్టి శ్రీ
నరకంఠీరవు కోవెలస్థలికి స్థానాచార్యులై యుండఁగాన్.”

(1-37)

దీని తరువాతగల-

సీ.

అమ్మహీమండలి కాఢ్యులౌ పరివృఢుల్
హర్హత తమనటు నాశ్రయించు
వేళను యాదవాకిళ్లను గ్రామంబు
నగ్రహారంబుగా నటనొసంగ
నతివేడ్క వారలు నాలయంబుగ నిల్చి
యధికసంపన్నత నలరుచుండు.....

(1-38)

ఇత్యాది పద్యము వలన వాడపల్లి నుండి వీరు యాదవాకిళ్ల యను (అగ్రహారము) గ్రామమునకు వెళ్లినట్లు గలదు. ఈ గ్రామము హుజూర్ నగరం తాలూకాలో నున్నది. మరింగంటివా రిప్పటికీ ప్రాంతములయం దున్నట్లు గతప్రకరణమున తెలుసుకున్నాము.

కనగల్లు నేడు దేవరకొండ తాలూకాలో గలదు. వాడపల్లియు నట్లే యుండెడిది. కాని జిల్లాల విభజన జరిగినపు డీవాడపల్లి మిర్యాలగూడెం తాలూకాలో చేరినది. కనగల్లు వాడపల్లి సమీపములుగా నుండును.

దశరథరాజనందనచరిత్రయు - నిరోష్ఠ్యసీతాకల్యాణమును - సింగరాచార్యులు కర్పరాద్రినరసింహస్వామి పేర నంకితమొసంగినాడు. దేవరకొండతాలూకాలో - పణ్కరాజుపల్లి యనుగ్రామము గలదు. అది అడవిదేవులపల్లి యనుగ్రామమునకు సమీపముగా నుండును. పణ్కరాజుపల్లి వద్ద గుట్ట గలదు. అందు నరసింహస్వామి యాలయమున్నది. ఆ పర్వతమునే సంస్కృతీకరించి కర్పరాచలమని కవి చెప్పుకొని యున్నాడు. అంతేగాక 'కర్పర' యను గ్రామమొకటియు ఈ పల్లెవద్దగల యొకచిన్నపల్లె. దీనివలననైనా కవి కర్పరాద్రి యనవచ్చును— '.... దేవరకొండ సీమలో సన్నుతపణ్కరాజువలిశైలమునన్ ....' (1-20) అని యీగ్రంథములో చెప్పబడిన దీకర్పరాచలమే!

శు. ని. నీ. కల్యాణమందు సింగరాచార్యులు తమతండ్రియైన తిరువేంగళనాథుడు గురురాయపట్టణస్థాపకుడై చెలంగిన హరితీర్థములు కొన్నిటిని పేర్కొన్నాడు—(1-50)(పద్యము-అనుబంధములో) ఆ గ్రామములు నేడేయే తాలూకాలలో గలవో తెల్పుదును—

1 అనంతగిరి- 1. దేవరకొండకు సమీపమున అనగా-దేవరకొండ నుండి కల్వకుర్తికి వచ్చు మార్గమునందు గలదు.

2. బిజినేపల్లి యను గ్రామము నాగరకర్నూలు తాలూకాయందు గలదు, దానికి పూర్వము అనంతగిరి యని పేరున్నట్లు తెలియుచున్నది.

2 ధర్మపురి- సుప్రసిద్ధమైన నరసింహ క్షేత్రము-కరీంనగర్ జిల్లాలో గలదు.

3 ఊరుగొండ- 1. 'ఉర్లుగొండ' యని-రామన్నపేట తాలూకాలో నొకటి గలదు.

2. మహబూబ్‌నగరం జిల్లాలోని జడ్ చర్ల - కల్వకుర్తిలో 'ఊరుగొండ పేట గలదు.
3. దేవరకొండ తాలూకాలో నొక యూరుగొండ గలదట. పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/20 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/21 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/22 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/23 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/24 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/25 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/26 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/27 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/28 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/29 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/30 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/31 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/32 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/33 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/34 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/35 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/36 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/37 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/38 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/39 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/40 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/41 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/42 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/43 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/44 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/45 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/46 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/47 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/48 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/49 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/50 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/51 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/52 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/53 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/54 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/55 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/56 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/57 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/58 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/59 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/60 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/61 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/62 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/63 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/64 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/65 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/66 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/67 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/68 పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/69 అభిప్రాయభేదము లుండవచ్చును. కాని, నాయభిప్రాయములను గ్రంథాధారములతో తెల్పినాను.

ఈ కృతియందేమైన దొసగులున్న వానిని సింగరాచార్యుల కంటగట్టకుందురని యాశించుచున్నాను.

మరింగంటి కవులపై వచ్చిన వివిధరచనలను లభించినంతవరకు పరిశీలించి యవసరమగు స్థలములందు వానిని పేర్కొని ఆకరము లొసంగినాను. ఆయారచయిత లందరకు అభివాదములు. నల్లగొండకవులను గూర్చిన నావ్యాసములు కొన్ని యీసందర్భమున అవసరమైనవి. వాటికి పుటయడుగున 'శ్రీ' యని గుర్తుంచినాను. పరిష్కరణసమయమున అనుమానములుగా నుండి సవరించుటకు వీలుగాని కొన్నిపద్యములను ఆవిధముగానే ఉంచి ప్రశ్నార్థకచిహ్న ముంచనైనది.

నాయీపరిశీలనమందు అజ్ఞతవల్ల పొరపాట్లు కలుగవచ్చును. సాహిత్యప్రియంభావుకులు వానిని అప్రియములుగా భావింపరని విశ్వసించుచున్నాను.

తెనుగు సారస్వతమున అందు తెలంగాణలోని కవులయందున మరింగంటివారి దొకవిశిష్టశాఖ, ప్రత్యేకపద్ధతి, వీరి ముద్రితాముద్రితసంస్కృతాంధ్రరచనలగూర్చి పరిశ్రమించుట మిక్కిలియవసరమని విన్నవించుచున్నాడను.

"అంతయొ యింతయో తెలిసినట్టి విమర్శకులైన కావ్యసి
ద్ధాంతుల యొత్తిడిం బడి మహాకవి నాఁగటిచాలు దీర్చుఁ గా
లాంతరకీర్తి వృష్టిగతమై చను లాభము నెంచుచున్ లలా
టంత పరూక్షచింతన నటన్మధుభారతి సస్యధారణిన్"

విశ్వనాథ.


30-12-1969,

శ్రీరంగాచార్య.

పాలెము.

  1. గోలకొండ కవుల సంచిక (1948) "ప్రస్తావన" xili (గో.క.సం.)
  2. "మరుగుపడిన మాణిక్యాలు” - “మనవి" - లో.
  3. "మనప్రాచీన(తాళపత్ర)గ్రంథములు - వానిదుస్థితి"- (శ్రీ) “కృష్ణాపత్రిక" (1967 స్వాతంత్యదినోత్సవసంచిక)
  4. వివరములకు – "తెలంగాణములోని సంస్థానములు - సాహిత్యపోషణ' కేశవపంతుల నరసింహశాస్త్రిగారి వ్యాసము. (విజ్ఞానసర్వస్వము. 4. భా. విశ్వసాహితి పుటలు 1175-79) మహబూబ్ నగర సంస్థానముల గూర్చి మాత్రమే గలదు. ఇటీవల డా. తూమాటి దొణప్పగారు ఆంధ్రసంస్థానములు - సాహిత్యపోషణగురించి ప్రత్యేకగ్రంథము వెలువరించిరి.
  5. చిరుమర్రి నరిసింహకవి - "లక్షణనవరత్నమాలిక"(భారతి 1966 మార్చి) లక్షణనవరత్నమాలిక యను ఛందోగ్రంథ మిందు ప్రచురించనైనది. కవిని తత్కృతులను గూర్చియును గలదు. (శ్రీ)
  6. మరింగంటివా రని వచ్చుటకు పైకారణము కవికల్పితమేమో "మరికల్లు" అనుగ్రామము ననుసరించి మరింగంటి, మరిగంటిలగు అవకాశము గలదు. మరికల్లు పేరుగల గ్రామములు దేవరకొండ, నల్లగొండ, మహబూబ్ నగరం తాలూకాలలో గలవు.
  7. ద. రా. నం. చ. = దశరథరాజనందనచరిత్ర. ని. సీ. క. = (శుద్ధాంధ్ర)నిరోష్ఠ్యసీతాకళ్యాణము.
  8. కుతుబ్షాహీ సుల్తానులు - ఆంధ్రసంస్కృతి అను గ్రంథము (1962)న సంపాదకులు డా॥ బి. రామరాజుగారు నేబతి కృష్ణయామాత్యుని గూర్చి వ్రాసినవ్యాసములో నుదాహరించిన పద్యము (పుట 99).
  9. “మనతెలంగాణము" - పుటలు 24, 25 (1969) మరియు ఆచార్య ఖండవల్లి లక్షీరంజనంగారు - "ఆంధ్రసాహిత్యచరిత్రసంగ్రహము" 193, 194 పుటలలో పైరెండుగ్రంథములగూర్చి వ్రాసినారు. (1965)
  10. చూ. మరింగంటి రాఘవాచార్యులు - కేశవస్వామిశతకము ( శ్రీభారతి 1966 డిసెంబర్) ఈ వ్యాసము ప్రచురణమైన నాటికి - శతకము ముద్రణమైనట్లు నాకు తెలియదు. ఇటీవల నాకొకప్రతి వీరు పంపించినారు.
  11. "తెలంగాణ" పత్రిక (సం. 4. సంచికలు 44, 50. వ్యయ-వైశాఖ బ. దశమి. 2–7-1946)
  12. తాలాంకనందినీపరిణయము- ఒక పరిశీలన (శ్రీ) (భారతి. 1967 డిసెంబర్).
  13. శ్రీరామపాదుకాస్తవము - మరింగంటి అప్పలదేశికులవారిపేర 1967 సెప్టెంబరు 'భారతి'యందు ప్రచురించినాను. కాని తరువాత లభించిన యాధారములవలన తత్కర్త వరదదేశికులవారని తెలిపిన మిత్రులు మరింగంటి పురుషోత్తమాచార్యులవారు. ‘గోదాస్తుతి'లోని కొన్ని శ్లోకములు వరంగల్లునందలి వైదికకళాశాల ప్రిన్స్ పాల్ శ్రీమాన్. న. చ. రఘునాథాచార్యులవారివద్ద గలవు.
  14. "అర్వపల్లీనృసింహస్తోత్రము" ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రిక. (ప్లవంగ.లమార్గశీర్ష - పుష్య.) సంచిక (శ్రీ).
  15. భల్లాతకక్షేత్రమాహాత్మ్యమును ఇటీవల వీరు నాకు పంపినారు (వ్రాతప్రతి).

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.