కాశీ మజిలీ కథలు/31వ మజిలీ/రాజనీతి

వికీసోర్స్ నుండి

చున్న యాచిన్న దాని నొక్కింతతడవు ఱెప్పవాల్పక చూచి రాజపుత్రుండు కైలాసా! అమ్మగా రెట్లాజ్ఞాపించిరొ యట్లు కావింతునని చెప్పుము. పొమ్ము. అని పలికి వానినంపెను.

అది మొదలమ్మదవతియు నిద్రించుచున్నను, మేల్కొన్నను, దిఱుగుచున్నను రాత్రిం బగలు నీడవలె రాజపుత్రుని పార్శ్వము విడువక సేవింపుచుండెను. చంద్రాపీడుండును జిత్రలేకం జూచినదిమొదలామెయందుఁ బ్రతిక్షణము వృద్ధిజెందుచున్న ప్రీతిగలవాఁడై తన హృదయముతో సమానముగజూచుచు విస్రంభకార్యములకు నియోగింపుచుండును.

అట్లు కొన్నిదినములు గడచినంత నాభూ కాంతుఁడు పుత్రకుని యౌవరాజ్య పట్టభద్రునిఁగా జేయఁదలంచి సంబారములన్నియు సమకూర్చుచుండెను. అప్పుడొకనాఁడు దర్శనార్థమై వచ్చిన చంద్రాపీడునింజూచి శుకనాసుఁడు సంతసించుచు రాజనీతి నిట్లుపదేశించెను.

రాజనీతి

తాత చంద్రాపీడ! సమస్తశాస్త్రములు నభ్యసించి వేదితవ్య మంతయు గురుతెఱింగిన నీకు మేమేమియు నుపదేశింపనవసరము లేదు. స్వభావముచేతనే వ్యాపించిన యౌవనతమము సూర్యప్రభచేతను రత్నకాంతులచేతను, దీపరుచులచేతనుఁ బోవునదికాదు. లక్ష్మీమదముసైతము దారుణమైనదే, యైశ్వర్యతిమిరాంధత్వము అంజన సాధ్యమైనదికాదు. దర్పదాహజ్వరము శిశిరోపచారముల నుపశమింపదు. విషయవిషాస్వాదనమోహము మంత్రబలంబున నశించునదికాదు. రాగమలావలేపనము స్నానంబునం బోవునదిగాదు. గర్భేశ్వరత్వము, యౌవనత్వము, అనుపమసౌందర్యత్వము, నొక్కొ క్కటియె యవినయమునకుఁ దావలమగుచుండ నన్నియు నొక్కచో నుండు నప్పుడేమి చెప్పఁదగినది?

యౌవనారంభమందు శాస్త్రజలములచేఁ గడఁగబడినను బుద్ధికాలుష్యము నొందకమానదు. తరచుమౌనులదృష్టి రాగముతోఁ గూడుకొని యుండును. నీవంటివారే యుపదేశమున కర్హులు. స్ఫటికమణియందుఁ జంద్రకిరణములువలె నిర్మలమగు మనంబున నుపదేశ గుణములు ప్రవేశించును. గురువాక్యము నిర్మలమైనను జలమువలె దుర్జనులకు శ్రవణగతమై శూలను గలుగఁజేయును. అనాస్వాదిత విషయ సుఖుండవగు నీకిదియే యుపదేశసమయము. కుసుమశర ప్రహార జఝు౯రిత హృదయులగు వారికుపదేశము జలమువలెనే నిలువక జారిపోవును. చందనవృక్షమునఁ బుట్టినయగ్ని మాత్రము దహింప కుండునా? బడబాగ్ని యుదకముచేత నడంగునా? జనులకు గురూప దేశము ప్రక్షాళనజలమువంటిది. విశేషముగా రాజుల కుపదేశించు వారులేరు. జనులు ప్రతిధ్వనివలెనే రాజవాక్యముల ననుసరించి పలుకుదురు.

ధనమదులు దర్పవ్రణపూరితములగు చెవులుగలవారై గురూప దేశములను వినరు. వినినను గజములవలె గన్నులుమూయుచు నుపదేష్టలను బాధింపుచుందురు. ధనము ఆళూకాభిమానములఁ గల్పించును. రాజ్యలక్ష్మి తంద్రీప్రదమైనది. రాజ్యలక్ష్మి సరస్వతీయుతుండగువాని నసూయంబోలె జూడనీయదు. గుణవంతు నపవిత్రునిపగిది ముట్టనీయదు. సుజను నున్మత్తునివలెఁ బరిహసించును. వినీతు మహాపాతకుపగిది దాపుఁజేరనీయదు. అది తృష్ణావిషవల్లులకు సంవర్ధనధార, ఇంద్రియమృగములకు వ్యాధగీతి, మోహదీర్ఘనిద్రకు విభ్రమశయ్య, ధనమదపిశాచములకుఁ దిమిరసంహతి, అవినయమున కుత్పత్తిస్థానము. అన్నన్నా! రాజ్యలక్ష్మిచేత నాలింగితులగు రాజులొడలెఱుంగుదురా? అభిషేకసమయమందే మంగళకలశ జలములచే దాక్షిణ్యము కడగఁబడు చున్నది.

అగ్నికార్యధూమముచేత హృదయము మాలిన్యము బొందుచున్నది. పురోహితుని కుశాగ్ర సమ్మార్జనముచేత క్షాంతి పోవుచున్నది. చామరపననముచేతనే సత్యవాదిత యెగిరిపోవుచున్నది.

అతిచంచలమగు రాజ్యసంపదలను జూచుకొని గర్వించుచు రాగమగ్నులై అరుదైనను ననేక సహస్రములుభాతిదోచు నింద్రియ సుఖములచేత వివశత్వము నొందుదురు. ఆహా! ధనమదులు ఆసన్న మృత్యులువలె దగ్గిరనున్న బంధువులను సైతము గురుతెరుంగరు. ముఖరోగులు వలె గష్టముగా మాట్లాడుదురు. అంధులువలె దాపున నున్నవారి సైతము జూడలేరు.

జూదము వినోదమనియు, వేట పాటవమనియు, పానము విలాసమనియు, స్వదారపరిత్యాగము అవ్యసనత్వమనియు, నృత్యగీతవేశ్యాప్రసక్తి రసికతయనియు దోషములను సైతము గుణములుగా వర్ణించుచు స్వార్ధనిష్పాదనపరులు ధనపిశితగ్రాసగృధ్రులు నగు వంచకుల మాటలకు సంతసించు రాజుల శిరి యల్పకాలములో నశించును.

అమానుషషోచితములగు స్తోత్రవాక్యములు విని యాత్మారోపణము చేసికొనువారు సర్వజనులకుఁ బరిహాసాస్పదు లగుదురు. కుమారా! నీవెన్నఁడును ఇట్టి దుర్వృత్తులజిత్తమునుఁ జొరనీయకుము. వంచకుల నంతికమునకుఁ జేరనీయకుము. సర్వదా సజ్జనగోష్ఠిని మెలంగుము. సాధులఁదిరస్కరింపకుము. కర్ణేజవులమాటల వినకుము. పరిచారకులకుఁ జనువీయకుము. రాగలోభాదుల హృదయంబున నంటనీయకుము. అభిజాతునైనను, పండితునైనను, ధీరునైనను రాజ్యలక్ష్మి దుర్వినీతుల జేయుంగావున నీకింత సెప్పితిని. నీకు నా బోధ యేమియునవసరములేదు. రాజ్యభారమువహింపుము. ప్రజలదయతోఁ బాలింపుమని రాజనీతి యంతయు నతని కుపదేశించెను.

అప్పుడు చంద్రాపీడుఁడు శుకనాసుని వాక్యాంబువులచేతఁ బ్రక్షాళితుండువోలె నభిషిక్తుని పదిగి నభిలిప్తుని చందమున నలంకృతునిభాతిఁ ప్రీతహృదయుండై కొండొకవడి ధ్యానించి యతని యనుమతి నాత్మీయభవనమునకుఁ బోయెను.

అంతటఁ దారీపీడుఁడు శుభముహూర్తమునఁ జతుస్సముద్ర జలంబులందెప్పించి బ్రాహ్మణాశీర్వాద పురస్సరముగాఁ జంద్రాపీడుని యౌవరాజ్య పట్టభద్రునింజేసెను.

అప్పుడు ప్రజలందరు నానందసాగరమున నీదులాడిరి. చంద్రాపీడుఁడు సింహాసనమెక్కిన గొద్దిదినముల కే తండ్రియనుమతివడసి శుకనాసుని శాసనప్రకారము చతురంగ వాహినీ పరివృతుండై వైశంపాయనుఁడు తోడరాఁ జిత్రలేకతోఁగూడ దిగ్విజయయాత్ర వెడలి క్రమంబునఁ బూర్వదక్షిణ పశ్చిమోత్తరదేశములఁ దిరిగి శరణాగతుల రక్షించుచు దుర్మార్గుల శిక్షించుచు భీతుల నోదార్చుచు రాజపుత్రుల కభిషేకము జేయించుచు రత్నముల స్వీకరించుచు నుపాయనములఁ గైకొనుచుఁ బన్నులఁ దీసికొనుచు విజయచిహ్నము లాయాచోటుల స్థాపించుచు శాసనముల లిఖింపుచు బ్రాహ్మణులఁ బూజించుచు మునుల కాశ్రమములఁ గల్పించుచు బరాక్రమమును వెల్లడించుచు గీర్తిని వెదజల్లుచు భూమండలమంతయు దిరిగి విజయస్థంభంబుల నాఁటి మరలి తన పురంబున కరుదెంచుచు నొకనాఁడు కైలాస సమీపమునఁ జరించెడు హేమజటులను కిరాతులకు నివాసస్థానమై పూర్వసముద్రమున కనతిదూరములోనున్న సువర్ణపురమును జయించి స్వీకరించెను.

మఱియు రాజపుత్రుఁడు ఆ నగరమందు నిఖిల ధరణితల పర్యటనమువలన నలసిన తనబలమునకు విశ్రాంతి గలుగుటకై కొన్ని దినములు వసించెను.

కిన్నరమిధునము కథ

ఆరాజకుమారుం డొకనాఁడు ప్రాతఃకాలమున నింద్రాయుధ మెక్కి యొక్కరుఁడ విహారాధ౯మై యాప్రాంతారణ్యమునకుఁ బోయి యందందు సంచరించుచు దైవయోగంబున నొకచోఁబర్వత శిఖరమునుండి దిగుచున్న కిన్నరమిధునమునుఁ జూచెను.

అపూర్వవస్తు విశేషదశ౯నంబున మిగులసంతసించుచు నతం డమ్మిధునమునుఁ బట్టుకొనఁదలంచి తురగమును మెల్లగా దానిదాపునకుఁ బోనిచ్చెను.

అప్పు డెప్పుడును జూడని పురుషునింగనుటచే నమ్మిథునంబు వెరవుగదురఁ గాలికొలఁది పరువెట్టదొడంగెను.

చంద్రాపీడుండును మడమలచేఁగొట్టుచు నత్తత్తడి వడిగాఁ బరుగిడ సేనానివేశమునువిడచి యమ్మిధునమువెంట నొక్కరుండ మిక్కిలి దూరముగాఁ బోయెను.

అతనితురగ మతివేగముగాఁ బోవుచుండుటచే నమ్మిథునము దొరకునట్లే కనంబడుచు నెక్కడను జిక్కక యొక్క ముహూత౯ ఘాత్రములోఁ బదియేనామడ నడచి యతండు చూచుచుండగనే యందున్న పర్వతశిఖర మెక్కినది.

అంతవరకు నొక్కడుగులాగువచ్చి యచ్చటఁ బ్రస్తరశకలము లత్తురగ గమనమున కంతరాయము గలుగఁజేయ శ్రమజెంది మేనెల్లఁ జెమ్మటలుగ్రమ్మ నడుచుచున్న గుఱ్ఱమునునిలిపి తనకుఁదా నవ్వుకొనుచు నతం డాత్మగతంబున నిట్లు తలంచెను.