కాశీమజిలీకథలు/ఆరవ భాగము/90వ మజిలీ

వికీసోర్స్ నుండి

అని చెప్పి యప్పారికాంక్షి యేతత్క థాశేషం బవ్వలినివాస స్థానంబున నిట్లు చెప్పుచుండెను.

తొంబదియవ మజిలీ

కవి కంఠకౌక్షేయుకుని కథ

రాజపుత్రా ! నీవు మంచి సమయమున వచ్చి నా కుపకారముఁ గావించితివి. నీ మే లెన్నటికిని మరువను. నాఁడు నన్ను వీండ్రు బట్టుకుందురా ? నా చెల్లెలు సరోజిని‌ కపాయము వచ్చునని దాని దాటించుచుఁ గాచికొనలేకఁ బోయితిని. ఈ కత్తియే నా చేత నుండినచో నెంతమంది వచ్చినను బీచ మడపక విడుతునా? ఇఁక నీ కృపాణమేమరక కరంబునఁ దాల్చియుండెద. నీ రాజభటులెందరు వత్తురో చూతుముగాక. నీవు సరోజినిం బెండ్లియాడెదనని యొప్పుకొని మానితివికదా ? అట్టి బుద్ధిమంతురాలు గుణవంతురాలు రూపవంతురాలి పుడమిలోనున్నదియా? ఎవ్వరో భోగముదానయని చెప్పినంతనే నమ్మి యుపేక్షింతువా ? దాని పుట్టువను గురించి తెలిసికొనవలసి యున్నది‌. ఉత్తమవంశ సంజాతయని దానిరూపమే చెప్పుచున్నది. అని పలుకుచు దన కథయు సరోజిని చరిత్రయు ఘటదత్తుఁడు సుముఖనితో నొక నాఁడు వక్కాణించెను.

ఆ మాట విని సుముఖుండు బావా ! నన్ను సుమేధుఁడు వేశ్యాంగనం బెండ్లి యాఁడ కూడదని యంకిలి చెప్పెను. మా కీ రహస్యము లన్నియు నెట్లు తెలియగలవు. అట్ల యినను నేను సరోజినీ గుణపాశ బద్దుండనై యింట నిలువక మీ నిమిత్తమై దేశాటనముఁ జేయుచుంటిని. కాళిందీపురమున కరిగి చంద్రవతి యింటికింబోయి దానితో సంభాషించితిని. ఇంట నున్న విత్తమంతయుఁ బోవుటయే కాక సరోజినిని కూడ నెత్తుకొని పోయిరని మిక్కిలి దుఃఖించుచున్నది. ఆ చిన్నది యున్న వెండియుఁ వెండియుం బైదియుఁ సంపాదించుకోఁ గలనని చెప్పుచున్నది. అది నీ కడుపునం బుట్టినదా యని నే నడిగితిని. మొదటఁ గొంతసేపట్లే చెప్పి చెప్పి చివురకది యట్టిది యయినచో నా చెంతకుఁ గ్రమ్మర రాకుండునా ? దానిం దెచ్చుకొంటి నారండకు నిందుండి పోవలయుననియే యున్నది. అని యదార్ధముఁ జెప్పినది.

అక్కడినుండి బయలుదేరి నే ననేక జనపదంబులు చూచుకొనుచు నిప్పటికి ఎంచి... న్ను. బొడగంటి... నీ వసవాయహారు(గవు. నిన్నర్ధుపనితోం గ సన్నం తెరగా మూఘుకరిన్ను యమం గల రిప్‌. 20 .అలాల. * బతి సంచులు ఎప్పినందులకే సొమున నలి పిళ్య్వాన థి యన ప ముబణంయిలే తన్మాతములే, ఇట మొనలు నేన ని యాజ వడువున నడుచువాఁడ నిన్ను నా మంత్రిగా జేసికొనియెద. మా పురమునకురమ్ము. సరోజిని యే కులము లలనయయినను బెండ్లి యాడెదనని శపథముఁ జేయుచున్నాను. అని తన హృదయాశయమంతయు సుముఖుఁడు తెలియఁ జేయుటయు ఘటదత్తుఁ డిట్ల నియె.

నీవు కడు బుద్ధిమంతుండవని సరోజినియే చెప్పినది. మీ యిద్దరింగూర్చి నప్పుడుగదా బ్రహ్మవిన్నాణియని పేరుపొందును. లెమ్ము లెమ్ము ఇంతకు నక్కాంత యేమైనదో చూడవలయును. ఒక్కరిత నక్కానలో విడిచి వచ్చితిని. తెలివిగల దగుటయెట్లో తప్పించుకొని జనపదంబులఁ జేరఁగలదు. క్రూరసత్వంబు లేవియయిన బ్రమాదము గావించిన వేమో? వడిగా బోవలెనని పలుకుచు నతనితోఁ గూడ రెండు దినములలో నా వట పాదము దాపునకుఁ బోయెను. అందు నలుమూలలు వెదకి యడుగుల చిహ్నముఁగాంచి దుఃఖించుచు ఘటదత్తుఁడు హా ? ఇక నేమియున్నది? పదిదినముల క్రిందట నిందు విడిచిపోయి నేఁడు వచ్చి వెదకుచుంటిమి. సరోజిని యెందుఁ గనంబడును ? ఈ మహారణ్యములో దాని తెలివి యేమి యుపయోగించెడిని. కడుపు పగిలి మృతినొంది యుండును. అయ్యో ? కళేబరమైనఁ గనంబడినఁ జూతుముగదా ? కట్టా ! నీ సుగుణములకు సంతసింపక విధి యింత క్రూరుఁ డయ్యె నేమి ? వారకాంతచేఁ బెంపబడిఁ దుర్గుణముల బోధింపఁబడియు దృఢవ్రతయై యుంటివి. తల్లీ ? ఈ జన్మమునకుఁ నిన్నుఁ జూచు భాగ్యము నాకుఁ బట్టునా? ఇదిగో ? నీ భర్త సుముఖుడు నీ నిమిత్తమై విచారించుచున్నవాఁడు, వీని బుద్ధికి మెచ్చుకొంటివిగదా ? వారకాంత యనినందున కెంతయో యభిమానముఁ జెందితిని. నిన్ను దగిన భర్తతోఁ గూర్తునని చేసిన శపధము రిత్త పుచ్చి పరలోకమున కరిగితివా? సుముఖుఁ డిప్పుడు నిన్నుఁ బెండ్లి యాడుట కంగీకరించి యున్నాడు. వేగిరము కనంబడుము. అని యూరక యున్కత్తుండువోలె దఃఖించుచుండ సుముఖుఁడును గన్నీరుఁ గార్చుచు నతని కిట్ల నియె.

మిత్రమా ! నీ విట్లు శోకించుచుండ నా డెందము భేదిల్లుచున్నది. మన యరణ్యరోదనము వినువా రెవ్వరు? సరోజిని బ్రతికియున్న నిన్నిదినము లీ యరణ్యమున నెట్లుండును? జనపదంబులకుఁ బోయి వెదకుదము. ప్రాంత గ్రామముల కరిగి యుండునేమో చూడఁ దగియున్నది. ఇట్లు దుఃఖించుట వీరధర్మమే యని బోధించిన కన్నీరుఁ దుడిచికొనుచు నతండు దాని యడుగులు గురుతులు చూచినంత వంత కలిగినది. స్నేహపాశము కడు చెడ్డదిగదా ? పాప మా పూవుబోఁడి తల్లిని విడిచి నన్నాశ్రయించి తిరుగుచు నా మెంతయో ధైర్యము గరుపుచుండినది. అట్టి దానికొక యుపకారము చేయలేక పోయితిని. అవును ఇన్ని నాళ్ళిందేల యుండును? దాపుననున్న పల్లెల కరుగుదుము. రమ్ము. అని పలుకుచు ధైర్యము దెచ్చికొని యా ప్రాంత గ్రామముల కరిగి వెదకిరి. ఆ పేరుగల చిన్నది వచ్చిన ట్లెవ్వరును జెప్పలేదు.

అప్పు డతండు శోకప్రభంజన ప్రజ్వలిత కోపజ్వలనుండై రౌద్రావేశముతో సుముఖా ! శరణుఁ జొచ్చిన తరుణీం గాపాడలేకపోయితిని. ఇఁక నా జన్మ మేటికి ? కాళిందీపురభర్త యెవ్వఁడో మాకుఁ బూర్వజన్మ విరోధి కావలయును. మాకుఁ బెంపుఁ గలుగునప్పుడెల్ల వాని భటులువచ్చి విఘ్నములు గలుగఁజేసిరి. నేనును వాండ్రకు వెఱచి దొంగవలెనే పారిపోవుచుంటి. యశమో మృత్యువో యొకటి యిఁక నాకుఁ బ్రాపింపనై యున్నది. కావున నిప్పుడపోయి కాళిందీనగరాధీశ్వరుం బరిభవించి నాకసిఁ దీర్చుకొనియెదను. నీ విందులకు సహాయ భూతుండవై చూచు చుండుమని పలికిన విని సుముఖుం డిట్లనియె

మిత్రమా ! ప్రజలు దొంగలచేఁ బీడింపబడినప్పుడు రాజులు వారిని గాపాడవలదా ? అందులకు గోపించినఁ బ్రయోజన మేమి యున్నది ? నీవు వోయి యాత్మ వృత్తాంతముఁ జెప్పికొని తప్పించుకొనుట లెస్స అదియుంగాక ఆ నృపతి యుదంతముఁ దెలిసికొని వచ్చితిని. వాని పేరు కీర్తి సేనుఁడట. నీవు చెప్పిన వసుంధరుని మామ కుమద్వంతునకు బినతండ్రి కుమారుండఁట. వారిబలగము చాల గొప్పది. వారితోఁ బోరుట కష్టము. శాంతిం బొంది సరోజినిని మరిమరి వెదకుదమని యుపదేశించిన నతండు అయ్యో ? ఇంకెక్కడి సరోజిని. పరలోకమున సుఖించుచున్నది. మనకుఁ గనంబడదు. అని పలుకుచు నతని మాటలచే నూరటఁ జెందెను. అయ్యిరువురు క్రమంబున నయ్యంబుజాక్షి ననేక జనపదంబుల కరిగి యన్వేషించుచుండిరి. ఒక గ్రామమందు వసియించియున్న సేనలం గాంచి సుముఖుఁ డీదళములెందుఁ బోవుచున్నవని యడిగిన నందొకం డిట్లనియె.

అయ్యా ! ఘటదత్తుఁడను మహాతస్కరుఁడు గ్రామములలోఁ దిరుగు చున్నాఁడు. రెండుమూఁడు సారులు వాఁడు దొరికియుఁ దప్పించికొని పారి పోయెను. ఈ పౌజుకీర్తిసేనుండను మహారాజుది. ఆ ఱేడు వానిం బట్టికొనక మరలి మరలి రావద్దని తనయొద్దనున్న వాహినులనన్నింటింబంపి యన్నాడు. ఆ బలములు దేశమంతయుఁ దిరుగుచున్నవి. వానింబట్టికొనుటకే మేమును బోవుచుంటి మని యా కథ యంతయుం జెప్పెను.

ఆ వార్త విని ఘటదత్తుఁ డత్యంతోత్సాహముతో నా సేనలోని యొక యశ్వమును లాగికొనిపోయి దానిపయి నెక్కి కృపాణియై తన పేరుఁ బ్రకటించుచు నా సేనల నడుమనుబడి మారి మసంగినట్లు శిరంబులు నరికియు బాహువులు చెక్కియుఁ బదంబుల నేసియు నడుముల ఖండించియు ముహూర్త మాత్రములో నా బలములనెల్ల ------- పెంటలఁ గావించెను. గోగ్రహణంబునఁ బాండవ మధ్యముడు వోలెఁ బ్రచండభండనముఁ గావింపుచున్న యా ఘటదత్తుని వ్రేటులకు నిలువలేక హత సేషులు పారిపోయిరి.

అట్లు రెండు గడయలలోఁ జాలమందిని జయించిన యా మహావీరునిఁ జూచి సుముఖుఁ డుత్తరుడువోలె విస్మయాయత్తచిత్తుండై యతనిం గౌగలించుకొని మిత్రమా ? నీవు మనుష్య మాత్రుఁడవుగావు. ఈశ్వరాంశ నీయందున్నది. నీ యభీష్టముఁ దీరినది. కసిదీర వారి సేనల మర్దించితివి గదా ? ? ఇఁక మా పురమున కరుగుదము రమ్ము. నీకు మంత్రిత్వ మిప్పింతునని పలుకుటయు నతం డిట్లనియె.

రాజపుత్రా ! సరోజినిజాడఁ దెలిసికొనక నెక్కడకురాను మఱియు మఱియు వెదకి చూచెద నాతోఁ దిరిగి నీవు చాల నలసితివి. నీవు కడు సుకుమారుఁడవు. ఇంటికిఁబోయి సుఖింపుమనుటయు నతండు చాలుఁ జాలు. నేనందుల కనుట కాదు. నీ వధికార పదవిఁ బొంది గజాశ్వాందోళికాదులతోఁ దిరుగ వచ్చునని పలికితిని. నిన్ను విడచి పోవుదునా ? లెమ్ము. లెమ్ము. ఆ కొమ్మను వెదకుమని తొందర పెట్టెను. తిరుగనప్పురుషశ్రేష్ఠు లిరువురు నత్తరుణీమణి నందందు వెదకుచుండిరి. ఒక గ్రామములో దేవాలయము గోపురపు ముఖకుడ్య భాగమున మూఁడు ప్రకటన పత్రికలు కనంబడినవి. వానింజదువ నిట్లున్నది. మొదటిది ఘటదత్తుని బట్టికొని కట్టి తీసుకొని వచ్చినవారికి మూడు గ్రామములు కానుకగా నీయఁబడును. కాళిందీనగరభర్త కీర్తిసేనుఁడు రెండవది ఘటదత్తుడను బ్రాహ్మణ కుమారుని దీసికొని వచ్చినవారికి నపార పారితోషికము లీయబడును. కుముద్వితీ పురపాలకుఁడు వసుంధరుఁడు మూడవది ఘటదత్తుఁడను చిన్నవానిం దీసికొనివచ్చిన వానికి వేయి దీనారములు కట్టనమీయ గలవాఁడను. ఇట్లు కమలాపురాదీశ్వరుఁడు విజయదేవ భూపాలుఁడు. ఈ మూడు పత్రికలం జదివికొని ఘటదత్తుడు సంతసించుచు, ఆహా ! దైవము నాకిప్పుడించుక సముకుఁడైనట్లు తోచుచున్నది. నాయందత్యంతాగ్రహవ్యగ్ర చిత్తుండైన నాగురుండు వనుంధరుఁడు నారాక నభిలషించుచున్నాఁడు పోనిమ్ము. ఇదియు నొకశుభమే. అయ్యో? ఇంద్రదత్త తండ్రి విజయదేవుఁడు కూఁతురు ప్రోత్సాహంబున నీ పత్రిక వ్రాసి యుండును. హా ! సరోజినీ ? ఇట్టి సంతోషము నీవుండగఁ గలిగినది కాదు. నీ బుద్ది కౌశల్యమున నాయింతి స్వాంతము నన్ను గురించి కంతుసంతప్త మగనట్లు చేసితివి గదా? అని దుఃఖించుచు నేరా ! కీర్తిసేనుఁడా నీ పగ పాముపగకన్న గొప్పదిగదా? నా నిమిత్తము మూఁడు గ్రామములు దానముఁ జేయచుంటివి. బాపురే? నీ త్యాగము గొనియాడదగినదే గురునికంటెను మామకంటెను నా నిమిత్త మెక్కువ కరుచు చేయుచుంటివి. అని బీరములాడుచు సుముఖునితో మిత్రమా ! ఇప్పుడు నా నిమిత్తము మువ్వురు వార్తలనంపిరి. ముందెప్పటికిఁ బోవుదము ? ఎవ్వరి పని చక్కఁబెట్టి వచ్చెదము? ఒక వేళ మన సరోజిని తల్లియొద్ద కరిగిన దేమో? అదియుం జూడవచ్చును. తొలుతఁ గీర్తిసేనుని యభిలాషయే తీర్చి వత్తుమని పలుకుచు నా నగరమున కభిముఖముగాఁ గొన్ని పయనములు సాగించెను.

ఒకనాఁడొక యగ్రహారములో బసఁజేసి బ్రాహ్మణులమని చెప్పి యొక విప్రగృహంబున భుజింపుచుండిరి. వారింటికి నాఁడు మరికొందరు బ్రాహ్మణులు వచ్చిరి. తరుచు భోజన సమయమున బ్రాహ్మణులు త్రిలోక వృత్తాంతములు ప్రసంగింతు‌రను వాడుక యున్నది. సుముఖుండాగేస్తుతో అయ్యా ! భూసురులు మీకెట్టి బంధువులు. వీరి కాపుర మెచ్చట యని ప్రస్తావముగా నడుగుటయు నతం డిట్లనియె.

వీరి కాపురము కాళిందీపురము. తత్పురాధీశ్వరుని యాస్థాన పండితులు. కీర్తిసేనుఁడను పేరుగల యా రాజు కృష్ణదేవరాయలువోలె బండితులనినఁ జెవి కోసుకొనును. సంతతము పండిత గోప్టిఁ జేయుచుండును. అమ్మహారాజు దండయాత్ర వెడలియుఁ బండితుల వెంటఁబెట్టుకొని తిరుగుచున్నాఁడు. ఈ యగ్రహారమునఁ బండిత వేదండకంఠీరవుండనియు సూరిభైరవుం డనియు బిరుదములుగల యిరువురు విద్వాంసులు గలరు. వారికిని వారి యాస్థాన పండితులకును రేపిందుఁ బ్రసంగము జరుగును. గెలిచిన వారికి గొప్ప పారితోషిక మిత్తునని రాజుగారు చెప్పుచున్నారు. వీరి ప్రసంగమునకు మాధ్యస్థుఁ డెవ్వఁడును దగినవాడు దొరకలేదు. రాజుగారే యుందురని చెప్పుచున్నారు. అని యా కథ యంతయుఁ జెప్పుటయు సుఖుముం డిట్లనియె.

అయ్యో ? అమ్మహారాజు దండయాత్ర వెడలెనని చెప్పితిరి. ఎవ్వరి మీదికో తెలియలేదు. వినిపింతురే యని యడిగిన నయ్యజమానుండాస్థాన పండితుల నడిగెను. వారు ఘటదత్తుఁడను దొంగ మా పురమువచ్చి వేశ్యామందిరములోఁ బ్రవేశించి విత్తమంతయుఁ దస్కంరించెను. వానిం బట్టికొనుటకుఁ బెక్కు సేనలం బంపెను. ఆ వీరుఁడు వారినందరను గాందిశీకులఁ గావించెను. మొన్నను పదివేల మందిని యొక్కరుఁడు పారఁదోలెనట. అ వార్తవిని మా భూభర్త స్వయముగా వానిం బట్టుకొనుటకు బయలుదేరెను. అని యా వృత్తాంతమును జెప్పిరి.

ఆ యింటి యజమానుఁడు అవును. ఘటదత్తుని పేరు వాడుకగానే వినుచున్నారము. వానికొఱకుఁ బెక్కండ్రు తిరుగుచున్నారని యుత్తరము జెప్పెను. రాజుగా రొక్కనికై యింత ప్రయత్నము చేయుట యాశ్చర్యమే. పండిత ప్రియుం డయ్యు దీర్ఘ క్రోధుండగుట కూడదని సుముఖుడు పలికెను. ఈ రీతి భుజించినంత కొంతసేపు నా కథయే చెప్పుకొనుచుండిరి. భోజనానంతరమున సుముఖుండు మద్యవర్తి గావలసినచో నీతండు తగినవాఁడే. ఈయన పేరు కవికంఠ కౌక్షేయుకుఁడు మీ యంగీకరింతురోఁ జెప్పుడని యుపదేశించెను. ఆ మాట విని యాస్థాన పండితులు అయ్యా ! తమ కాపురమెందని యడిగిన ఘటదత్తుడు కాశీపురమని యుత్తరముఁ జెప్పెను. మీరు వారికి మధ్యస్తులై యుండఁగలరా ? ఏమి విద్యలం జదివితిరని యడుగుటయు నేదో కొంచెము పాండిత్యము కలిగియున్నది. అవసరమైన నప్పని కంగీకరింతునని చెప్పెను.

వారు వోయి రాజుగారితో నా మాటలు చెప్పిరి. అతండప్పుడే యా పండితుని దీసికొని రమ్మని దూతలం బంపెను. పండిత వేషములు వైచికొని యా యిరువురు రాజునొద్ద కరిగిరి. వారి రూపములు దేజములు చూచి కీ‌ర్తిసేనుఁడు మిక్కిలి వెరగుఁబడుచు మీలోఁ బెద్ద పండితుఁడెవ్వడని యడిగిన వారేమియు నుత్తరము జెప్పక యూరకొనిరి.

మీకు మాటలు రావా యేమి? మా పండితులు మిమ్ము గురించి పెద్దగా స్తుతి జేసిరి. మీలో మధ్యవర్తిగానుందునన్న పండితుడెవ్వడు ? చెప్పుడని యడిగిన ఘటదత్తుడు నేను నేను అని యుత్తరము జెప్పుచు అయ్యా ! తమరిందాక నిట్ల డిగిన సమాధానము జెప్పియే యుందుము. మాటలురాక మానివేయ లేదు. మీ ప్రశ్న సమంజసముగా లేదు అని యూరకొంటిమి. మా యిరువురిలో నేను గొప్ప వాడనని చెప్పుకొనినచో రెండవవాని కవమానము కలుగును. ఆత్మస్తుతి దోషము పట్టును. అని యుక్తియుక్తముగా నుపన్యసించి యా వాక్యమునకు నూరు దోషములు పట్టినవని తెలియజేసెను. అతని యుపన్యాసము విని రాజు సంతోషాశ్చర్యములతో దమ పండితుల నామాటల బూర్వపక్షము జేయుడని నియోగించెను. వారు దమకు దోచిన యుక్తులచే బూర్వపక్షము జేసిరి. వాని నూరు విధముల ఖండించి తన వాదమును స్థిరపరచుచు దనకు బదునాలుగు విద్యలలోగల పాండిత్యము దెలియ జేసెను. అప్పుడా యాస్థాన పండితులు మెడకు వస్త్రములు చుట్టుకొని యతని పాదములం బడి మహాత్మా ! నీవు సరస్వతి యపరావతారమవు. మేముకాదు. భూలోకములోనేపండితుడును నీతో బ్రసంగింపలేడు. వ్యాసుడో శంకరుడో నీతో వాదింప దగిన వారని స్తుతించిరి.

కీర్తిసేనుడు తత్ప్రసంగమును వారి మాటలను విని నివ్వెర జెందుచునప్పుడా యగ్రహారములోనున్న పండిత వేదండసింహుని సూరిభైరవుని రప్పించి కవికంఠకౌక్షేయకునితో బ్రసంగించుమని యానతిచ్చెను. అప్పుడా విద్వత్ప్రవరు లిరువురు ప్రత్యేకము ప్రత్యేకము కవికంఠకౌక్షేయకునితో బ్రసంగించిరి. వారి కొక్కొక్క విద్యయందే పాండిత్యము కలిగియున్నది. ఘటదత్తునకు బదునాలుగు విద్యలయందు నసమానమైన ప్రజ్ఞ కలిగియున్నది అట్టివానితో వారెంతసేపు వాదము సేయగలరు. నాలుగైదు ప్రశ్నలడిగియే మాచేత గాదనిపించి పాదాక్రాంతుల గావించెను.

ఆ ప్రసంగమంతయు శ్రద్దతో విని కీర్తిసేను డపరిమిత కౌతుకము జెందుచు ఘటదత్తుం గౌగలించుకొని ఆహా! నేను మిక్కి లి పుణ్యము జేసికొనుటచే నేడు నీవంటి పండితుని దర్శనము జేయగలిగితిని. నా ఉత్సాహము తీరినది. చాల సంతోషించితిని. నీ యభీష్ట మెద్దియో చెప్పుము. నీ కోరిక దీర్చి కృతకృత్యుడ నయ్యెదనని యత్యంతాదరముతో బ్రార్థించిన సంతసించుచు ఘటదత్తు డిట్లనియె.

దేవా ! నీ త్యాగము వెనుక నే పెద్దగా వింటని. ఒక దొంగంబట్టికొనిన వానికి మూడు గ్రామములిత్తునని బ్రకటించితివి. ఇంతకన్న నుదారభావ మేదియైనం గలదా? ఇట్టి వదాన్యుడవు. నీవు సంతసించుట కంటె కామ్య మేమియున్నది? అయినను గోరుమంటివి కావున జెప్పుచుంటిని. నీవా ఘటదత్తుడను చోరువిషయమై చేయుచున్న ప్రయత్నము మరలింపవలయు నిదియే నా కోరిక. ఊరక సేనలం వాని పరము చేయుచున్నావు. వాడు నీకు వశమగువాడు కాడు. నీ హితము కోరియే యీ కోరిక కోరితినని మిక్కిలి చాతుర్యముగా బలికిన విని‌ యా రాజు తెల తెల్ల బోవుచు నిట్లనియె.

ఓహో ! నీ కోరిక కడు చిత్రముగా నున్నది. ఆ ఘటదత్తుని నెరుగుదువా యేమి? వాడు చేసినపని సామాన్యమా? నా పాలనములోని యొకయాడుదాని సర్వస్వమును మ్రుచ్చిలించిన ముచ్చును శిక్షింపక యుపేక్షింప బాడియా? వాని నిమిత్తమే నా దండయాత్ర. వాని యందిట్టిదయ కలుగుటకు వానితో నీకుగల సంబంధ మెట్టిదో చెప్పుమని యడిగిన దేవా ! నాకు వానియందేమియు దయలేదు. మీసేన లన్నియు వ్యర్దముగా నాశన మగుచున్నవని చెప్పితిని. వానిని మీరు బట్టుకొనలేరు. మీరు వెనుకకు మరలుటయే శ్రేయమని నొక్కి వక్కాణించెను.

కాదు కాదు నీకేదియో విహీతము గలదు. నీవు వాని నెరింగి యుందువు. లేకున్న నీ కోరిక మాని మరియొక కోరిక కోరుము. దీనివలన నీకేమి లాభమని యడిగిన నితండు దేవా ! నేను పదిసారులు చెప్పినను గ్రహింప లేకున్నారు. నాకేదియు గోరిక లేదు. మీకు మంచి యగుటయే నా కోరిక. అని పలుకుచు నావరనాధు ననేక ప్రకారముల వేసి నిదివరకు తానే ఘటదత్తుడనని తెలియజేసెను.

అ మాట విని యారాజు మరియు నబ్బురముఁ జెందుచు ఏమీ? నీవు ఘటదత్తుఁడవా ? అట్లయిన నిట్టి పాండిత్యము నిట్టి పరాక్రమము గలిగియా వారకాంత ధన మంతయు‌ నేమిటికిఁ దోచుకొనిపోయితివి. ప్రాజ్ఞుండవయ్యుఁ బాపకృత్యములు చేయవచ్చునా? యని యడిగిన నతం డేమియు నుత్తరముఁ జెప్పలేదు. అప్పుడు సుముఖుండు దేవా? ఈతని చరిత్రము కడు విచిత్రమైనది వినుండు. పరస్త్రీపర ------------ దిట్టి విరక్తుఁ డెందున లేడు. వీనికిట్టి యపఖ్యాతి కలుగుటకుఁ బూర్వ పుణ్యఫలము. అని యతని వృత్తాంత మంతయుం జెప్పిన విని యాభూభర్త ----------------- వెరగందుచు నిట్లనియె.

మాహాత్మా ! నీ వృత్తాంతముఁ దెలియక నిన్ను ఖేదపెట్టిన నా తప్పు మన్నింపవలయును. వసుంధరుని మామ కుముద్వంతుండు నాకుఁ బినతండ్రి కుమారుండు. వసుంధరుని పాండిత్యప్రకర్షము మేము విని యుంటిమి. అతండు లోకప్రసిద్దుండు, రామలింగ కవికుమారుఁడు వానిశిష్యుడఁవు. నీ వంతకంటె నధికుండవైతివి. నీకుఁ గొన్ని యగ్రహారములీయఁ దలచికొంటి. నాయొద్దఁ బండితుఁడవుగా నుండుమని కోరికొనియెను.

అని వినిపించి యయ్యతి ప౦చాననుండు తరువాత చరిత్ర మవ్వల నున్న యునికియం దిట్లు చెప్పఁదొడంగెను.

తొంబది యొకటవ మజిలీ

మంజరికా ! ఈ సరోజిని కౌముది పోలికగా నున్నది చూచితివా? ఈ చిన్నది యింద్రదత్త కేమి కావలయును ? ఒకవేళ నా బాలిక బ్రతికి యిక్కడికి రా లేదుగదయని పాటలిక చెప్పిన విని మంజరిక అవును నాకును సందియము కలుగు చున్నది. నడక యచ్చుగ నట్లే యున్నది. ఇప్పుడు రాజపుత్రిక యొద్దనే ముచ్చటింపుచున్నది. దాపునకుఁ బోయి యాకర్ణింతము రమ్ము. యని పలుకుచు మంజరికయుఁ బాటలికయు మాటునఁ గూర్చుండి వారి మాటలు వినుచుండిరి. అప్పుడు సరోజిని రాజపుత్రికతో నిట్లు చెప్పుచుండెను.

దేవీ ! నేనించుకయు నసత్యము లాడుదానఁ గాను. ఘటదత్తుఁడు త్తమవంశ జాతుఁడు. వసుంధరుఁడను రాజునొద్దఁగొన్ని నాళ్ళుమంత్రి యైయుండి యాతని కేదియో కోపమువచ్చిన నందు నిలువక దేశాటనముఁ జేయుచు మహారణ్యమధ్యమునఁ బడియుండి యెకనాఁడు దొంగలచే రక్షింపఁబడెను. వాండ్రు తమవృత్తిఁ గైకొనుమని నిర్భంధించిరి. ఇష్టము లేకున్నను వారితోఁ గొన్ని దినములు తిరిగెను. చంద్రవతి యను వేశ్య నన్నుఁ బెంచికొన్నదని నీకిదివరకే చెప్పితినిగదా ? నన్ను వేశ్యా వృత్తికై బోధించినది. నే నంగీ‌కరింపక యెదురాడుచుంటిని. ఘటదత్తునకు రాజవేషము వైచి యానలువురు దొంగలు మాయింటికిఁ దీసికొనివచ్చిరి. నాఁడు చంద్రవతి నన్నుఁ బెద్దగా నిర్భంధించి వానితోఁ గూడుమని బోధించి వాని నా గదిలోనికి బంపినది. నేను దుఃఖించుచు వాని పాదముల మీదఁ బడి నా చిత్తవృత్తి నెరింగించితిని.

అతండు నన్నుఁ దోబుట్టువుగాఁ దలంచి మన్నించెను. అంతలో దొంగలు లోపలికివచ్చి వానిందిట్టుచు నన్ను బట్టికొని యొకడెత్తు కొనిపోయెను. గ్రామ ప్రాంత కాంతారమున నన్ను బలవంతము సేయుచుండ నతండు వారినందరం గడతేర్చెను. పెక్కులేల ? అతని పరాక్రమము చూచి తీరవలయును అని తలచి కథ ------------ కథయుం జెప్పి రాజపుత్రీ 1 మా చరిత్ర యింతయున్నది. సామాన్యముగా నతని దొంగయనియు నన్ను లంజయనియుఁ దలంపక మానరు. సత్యము చూచిన నతని వంటి బలశాలియు గుణశాలియుఁ బుడమిలో లేడు. అతఁడే నీకుఁ దగినవాఁడు. నీవే వానికిఁ దగుదువు. నీ వీవిషయమై చింతింపవలసిన పనిలేదని చాలసే వుపన్యసించినది.