కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/కాశీ మశీదులో శివలింగం

వికీసోర్స్ నుండి

కామన్సు సభలో సభ్యుడైనాడు. ఆర్కాటు నవాబుగారి పక్షమునవలంబించిన ఇంకా కొందరు దొరలుకూడా అక్కడ చేరారు. పిగట్టుగారి వ్యవహారాన్ని గురించి కామన్సు సభలో చర్చించబడి నప్పుడు వీరందరూ పిగట్టుగారి ప్రత్యర్ధుల చర్యలను సమర్ధించడానికి తంటాలు పడ్డారు గాని అందులోని నిజమంతా కామన్సు సభవారికి విశదమైంది. అంతట ఈస్ట్రాటసుగారున్ను, ఇతని తోడివారున్నూ చేసిన అక్రమాన్ని గుఱించి నేరాన్ని గుఱించీ విచారించి శిక్షించడానికి వీరిపైన ఒక క్రిమినలు కేసు దాఖలు చేయడానికి వుత్తర్వు చేయవలసిన దని కామన్సుసభవారు ఇంగ్లీషు రాజుగారికి విన్నపం చేశారు. ఆప్రకారం స్ట్రాటసు మొదలైన వారిమీద కేసుదాఖలై విచారణ జరుగగా వారినేరం రుజువు అయింది. అయితే వీరు చేసిన ఘోరాన్యాయానికి తగిన శిక్షమాత్రం వీరికి విధించబడలేదు. ఒక్కొకరికి వెయ్యి నవరసులు జుల్మానా మాత్రం విధించి వదిలివేశారు. (History of British Empire - Edward Thornton Vol.11 pp.199-213)

-----

కాశీ మశీదులో శివలింగం

క్రీ.శ. 1823-26 మధ్య కలకత్తాలొ తూర్పు ఇండియావర్తక కంపెనీవారి పరిపాలనలో ప్రధాన క్రైస్తవమతాధికారిగ నుండి హిందూదేశా మంతా తిరిగి చూసిన బిషప్ హెబరుగారు (Bishop Heber) తమ గ్రంధములో ఒకచిత్రమైన చరిత్రాంశాన్ని వుదాహరించారు.

1659-1707 మధ్య హిందూదేశాన్ని పరిపాలించిన ఔరంగజెబుచక్రవర్తి చాలా హిందూదేవాలయాలను పడగొట్టించి వాటిపై మశీదులు కట్టించినాడని ప్రతీతి. దేవాలయ స్తంభాలతోటీ రాళ్ల తోటీ దూలాలతోటీ నిర్మింపబడిన మశీదులు ఇప్పటికీ కాశీలో కనబడుతున్నాయి. ఒకశివాలయాన్ని పడగొట్టి మశీదుకట్టడంలో ఆదేవాలయంలో నుండిన అందమైన గొప్పశివలింగాన్ని అలాగే అట్టే వుండనిచ్చి మశీదు కట్టారు. ఈ శివలింగం నలభై అడుగుల ఎత్తు ఏకాండీ శిల. దీనిమీద అందమైన చెక్కడపు పని వుండేది. ఇది పూర్వం రెండురెట్లు ఎత్తువుండేదనిన్ని, క్రమక్రమంగా భూమిలోకి దిగబడిపోతూ వున్నదనిన్నీ, అది భూమిమట్టానికి రాగానే అన్నికులాలూ ఒక్కటైపోతాయనిన్నీ ప్రజలు అనుకుంటూ వుండేవారు.

ఈ శివలింగం మశీదులో చిక్కుపడినా హిందువులు దీనిని అతిపవిత్రంగా ఎంచి, మశీదు అధికారులను మంచిచేసుకొని, లోపలికి వెళ్లి దీన్ని పూజిస్తూవుండేవారు. భక్తులు ఇచ్చేకానుకలలో సగంవంతు తమకు చెల్లేపద్దతిని మశీదువారు దీనికి వప్పుకున్నారు.

ఈ శివలింగం చుట్టూవున్న చెక్కడపు పని మహమ్మదీయులకు అసహ్యంగా కనబడినా పైనచెప్పిన కారణంవల్ల దానిని ఏమీ చేయకుండా వుంచారు. ఇలాగ ఒక వందసంవత్సరాలు ఈ శివలింగానికి మశీదులోనే అర్చనలు జరిగాయి.

ఇలా వుండగా ఒకమాటు మొహరంపండుగ ఊరేగింపుల సందర్బంలో హిందువులకూ, మహమ్మదీయులకూ తగాదాలు వచ్చి దెబ్బలాటలు జరిగాయి. అది మతకలహంగా పరిణమించింది. ముసల్మానులు కొందరు ఆవేశపరులై హిందువులు అతిపవిత్రంగా పూజించే యీశివలింగాన్ని పగులగొట్టారు. అంతట హిందువులు ఉగ్రులై దీనికి ప్రతిక్రియగా ఒకమశీదును తగులబెట్టారు. దానిమీద తురకలు వీరావేశంతో ఒక ఆవును చంపి, దాని రక్తాన్ని విశ్వేశ్వర ఆలయందగ్గర గంగానదీజలంకన్నా అతిపవిత్రమని ఎంచి యాత్రికులందరూ స్నానపానములు చేసే "ఇననకూప"మనే ఒక పురాతనమైన నూతిలో కలిపారు.

అంతట కత్తి పట్టగల ప్రతి హిందువూ రోషవేశంతో కత్తులూ కఠారులూ పుచ్చుకుని కనబడిన తురకవాడిపై బడి దౌర్జన్యం చేయసాగారు. కాశీలో హిందువులే బహుసంఖ్యాకులైనందువల్ల తురకలనురూపుమాపుతారేమో నన్నంత భయం కలిగింది.

కుంఫినీ అధికారులు శిపాయీలను బయటికితెఛ్ఛి నిలపకపోతే ఇటుసూర్యుడటు పోయేలోపల ఊళ్ళో మశీదులనన్నింటినీ హిందువులు నేలమట్టం చేసేవారే. అయితే, హిందువుల దౌర్జన్యాన్ని అణచడానికి శిపాయీ లెంతవరకు తోడ్పడతారో అనేదికూడా అనుమానాస్పదమైన విషయంగా అధికారులకు తోచింది. కారణం ఏమిటంటే, అక్కడి శిపాయీలలో చాలామంది హిందువులు, సగంమంది బ్రాహ్మణులే. నిజంగా వాళ్ళమనసులో సంగతి చెప్పాలంటే ఒక్కొక్కడికి ఈ మహమ్మదీయుల రక్తాన్ని చూరగొనాలనే వుందని చెప్పాలి.

ఈ తురకలపైకి పోతూవున్న జనంలో ముఖ్యులు బ్రాహ్మణులూ, యోగులూ, గోసాయీలూ, బైరాగులూ, మొదలైన సనాతన ధర్మపరులే వీళ్ళు తమవంటినిండా విభూతి పూసికొని మొగాలపైన గోపీచందనం అద్దుకొని చావుకు తెగించినందుకు తార్కాణంగా తలవెండ్రుకలు విరబోసికొని జందములు చేతపట్టు కొని తమతోడి హిందువులతోనూ దేవుళ్ళతోనూ యుద్ధంచెయ్యబూనిన వారిని శాపనార్ధాలు పెడుతూ వీరంతా ముందువరుసలోనే వున్నారు. అయినప్పటికి శిపాయీలు చలించలేదు. తాము ఎవరి వుప్పు తింటున్నారో ఆ కంపెనీ వారి వుత్తర్వులను శిరసావహించి తమ రక్తబంధువులు ఎదురైనాసరే తుపాకీ పేల్చడానికి ఒట్టుపెట్టుకొని సైన్యపు కొలువులో చేరిన ఈ శిపాయీలు అవసరమైతే బ్రాహ్మడిపైనకూడా తుపాకీ పేల్చడానికి సంసిద్ధులైనారు.

పైన చెప్పిన శివలింగం వుండే మశీదు ద్వారందగ్గర కావలి కాస్తూవున్న శిపాయీలలో ఒకడు అక్కడ కిందపడివున్న శివలింగాన్ని చూసి ఇలాగాన్నాడు. "అయ్యా! మనమెన్నడూ అనుకోనిసంగతిని చూశాము. శివలింగంశిరస్సు నేలపైకి ఒరిగింది. ఇంక కొద్దికాలంలోనే మన మందరమూ ఒకేకులంవాళ్ళ మైపోతాము. అప్పుడు మనమతం ఏమవుతుంది?" అన్నాడు. "బహుశ: కిరస్తానీమతం అవుతుందేమో!" అని రెండవవాడన్నాడు.

కంపనీవారు ఇలాగ బందోబస్తు చేసినందువల్ల అల్లరి సద్దు అణగింది.

ఈ కల్లోలం అణగినతరువాత మళ్లీ ఆసంగతి తలుచుకునే టప్పటికి కాశీలోని హిందువుల గుండెలు నీరైనవి. వారికి తీవ్రమైన విషాదం కలిగింది. "పవిత్రమైన కాశీక్షేత్రం అపవిత్రమైపోయినది. అతి పవిత్రమైన గంగాజలములో రక్తం కలిసింది. ఈకాశీమహాత్య్మం పోయింది. ఇంక ఇక్కడమోక్షం దొరకదు" అనే ఆలోచనలతో వేలకొద్ది బ్రాహ్మణులు ఉపవాసం చేస్తూ ముఖాలపైన విభూతిరేఖలతో పైమీద బట్టలుకూడా లేకుండా దు:ఖసూచకంగా గంగానదీ తీరాన్నివున్న ముఖ్యఘట్టాలకు నడిచి వెళ్ళి అక్కడ చేతులు కట్టుకుని తలలు వంచుకొని కూచుని మళ్లీ ఇళ్లకు పోకుండా అక్కడనే పడివుండి ఒక మెతుకైనా తినకుండా ప్రాణంపై ఆశ విడిచి ప్రాయోపవేశం చెయ్యడానికి నిశ్చయించారు.

ఇలాగ రెండుమూడు రోజులు గడిచినవి. ఇది చూసేటప్పటికి చాలామంది మనస్సులు కరిగినవి. వీళ్లను ఓదార్చి సానుభూతి చూపిస్తే వీళ్లకు కొంత మనశ్శాంతి కలుగుతుందని కొందరికితోచింది. ఈ సంగతినీ వీరు కాశీలోని మేజస్ట్రేటుల చెవిని వేశారు. అంతట కంపనీవారి ఆంగ్లేయోద్యోగులందరూ గంగా నదీతీరానికి వెళ్ళి అక్కడ ఘట్టాలలో ఇలాగ వుపవాసంచేస్తూవున్న బ్రాహ్మణులను చూచి వగచి, తాము నివారించడానికి ఎంతోకష్టపడి ప్రయత్నించినా లాభంలేక తమవశం తప్పి జరిగినదానికోసం వారందరూ ఇలాగ నిష్కారణంగా బాధపడడము బాగా లేదనిన్ని జరిగిన అక్రమాలను కొంత ప్రతిక్రియ జరిగించేవున్నారుకదా అందుకోసం మళ్ళీ ఇలాగ బాధ అనుభవించడం ఎందుకనిన్నీ చెప్పి, వాళ్ళను బుజ్జగించగా, వారందరూ చాలా దు:ఖించి తరువాత కొంత ఊరట చెందారు. ఇంతటి అకృత్యంజరిగినా గంగ గంగ కాకపోదనిన్నీ కాశీలోని గృహస్థులందరూ పూనుకొని సంప్రోక్షణ మొదలైన ప్రాయశ్చిత్త కర్మలు జరిగిస్తే వైదికధర్మానికి కలిగిన కళంకాన్ని తొలగించవచ్చుననిన్నీ న్యాయాధికారులు ఓదార్చగావారు చెప్పిన సలహాబాగానే వున్నదని ఆఖరికివారందరూ నిశ్చయించి, ఉపవాసాలు మాని ఇళ్ళకు వెళ్ళారు.

ఆసమయంలో ఈరాయబారం నడిపిన దొరలలో ఒకరైన 'బర్డు ' గారు ఆ దృశ్యం ఇప్పటికీ తనకు కన్నులకట్టినట్టు వున్నదని కొన్ని సంవత్సరాల తరువాత 1884 లో బిషప్ హెబరుగారికి ఈసంగతులన్నీ చెప్పాడు. Bishop Heber's journal - Vol.1 pp.428-32

10. వాకిటికావలి తిమ్మన

(కృష్ణదేవరాయలవారి సన్నిహిత భృత్యులు)

"ప్రాకృత సంస్కృత ఘర్ఘర, మూకీకృత, కుకవితుంగ ముస్తాతతికిన్,
  వాకిటి కావలి తిమ్మన, వాకిట కవికోటి మాధవా కిటికోటే!"

శ్రీకృష్ణదేవరాయలవారి అనుగ్రహానికి పాత్రుడైన ఒక భట్టు రాయలవారి ఆస్థానములోని అష్టదిగ్గజాలనే కవులమీద నీర్ష్యవహించి వారి నెలాగైనా అవమానించాలని ఒక కుట్ర పన్నాడు. ఒక్కరోజున తాను చెప్పినట్లు చేస్తానని రాయలవారిచేత వాగ్ధానం చేయించుకొని, ఆ మరునాడు రాజసభలో అందరూ కూర్చుని వుండగా తాను లేచి కొందరు కవులపేర్లను చదివి "వీరు రాయల వారి సెలవు అయ్యేవరకూ రాజసభలోనికి రాకూడదని రాయలవారి యాజ్ఞ"యైనదని ప్రకటించాడు. ఈ విపరీతపు ప్రకటనను విని