కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/వాకిటికావలి తిమ్మన

వికీసోర్స్ నుండి

ఇంతటి అకృత్యంజరిగినా గంగ గంగ కాకపోదనిన్నీ కాశీలోని గృహస్థులందరూ పూనుకొని సంప్రోక్షణ మొదలైన ప్రాయశ్చిత్త కర్మలు జరిగిస్తే వైదికధర్మానికి కలిగిన కళంకాన్ని తొలగించవచ్చుననిన్నీ న్యాయాధికారులు ఓదార్చగావారు చెప్పిన సలహాబాగానే వున్నదని ఆఖరికివారందరూ నిశ్చయించి, ఉపవాసాలు మాని ఇళ్ళకు వెళ్ళారు.

ఆసమయంలో ఈరాయబారం నడిపిన దొరలలో ఒకరైన 'బర్డు ' గారు ఆ దృశ్యం ఇప్పటికీ తనకు కన్నులకట్టినట్టు వున్నదని కొన్ని సంవత్సరాల తరువాత 1884 లో బిషప్ హెబరుగారికి ఈసంగతులన్నీ చెప్పాడు. Bishop Heber's journal - Vol.1 pp.428-32

10. వాకిటికావలి తిమ్మన

(కృష్ణదేవరాయలవారి సన్నిహిత భృత్యులు)

"ప్రాకృత సంస్కృత ఘర్ఘర, మూకీకృత, కుకవితుంగ ముస్తాతతికిన్,
  వాకిటి కావలి తిమ్మన, వాకిట కవికోటి మాధవా కిటికోటే!"

శ్రీకృష్ణదేవరాయలవారి అనుగ్రహానికి పాత్రుడైన ఒక భట్టు రాయలవారి ఆస్థానములోని అష్టదిగ్గజాలనే కవులమీద నీర్ష్యవహించి వారి నెలాగైనా అవమానించాలని ఒక కుట్ర పన్నాడు. ఒక్కరోజున తాను చెప్పినట్లు చేస్తానని రాయలవారిచేత వాగ్ధానం చేయించుకొని, ఆ మరునాడు రాజసభలో అందరూ కూర్చుని వుండగా తాను లేచి కొందరు కవులపేర్లను చదివి "వీరు రాయల వారి సెలవు అయ్యేవరకూ రాజసభలోనికి రాకూడదని రాయలవారి యాజ్ఞ"యైనదని ప్రకటించాడు. ఈ విపరీతపు ప్రకటనను విని అక్కడివా రందరూ ఒకరి మొగము లొకరు చూచుకొని తెల్లబోయారు. రాయలవారున్నూ ఏమి జరుగుతుందీ తమాషా చూద్దామని గంభీరంగా ఉన్నారు.

అలాగ సభలోకి రాకూడ దని నిషేధింపబడినవారిలో అల్లసాని పెద్దన మొదలైన హేమా హేమీ లంతా వున్నారు. భట్టు ఇలాగ అన్న తరువాత వీరు రాయలవారి వైపునకు ఛూశారు. గాని వారి ముఖంలో ప్రసన్నభావం కనుపించనందువల్ల చేయునది యేమీ లేక రాయలవారు సభ చాలించిన తరువాత ఖిన్నులై బయటికి వెళ్ళి భట్టు ఏదోకుట్రపన్ని ఇలాగ తమ్ము పరాభవించినాడని ఊహించి, దీనిని గురించి విచారించి తరువాత చేయవలసిన కర్తవ్యాని గురించి ఆలోచించుకోవడానికని వీరు 'వాకిటికావలి ' తిమ్మన్న యనే రాయలవారి అంతరంగిక భృత్యుని యింటిముందర చేరి అక్కడ కూర్చుని ఏదో ఆలోచిస్తూ వున్నారు. అ సమయానికే వీరిని అవమానించిన భట్టు అందలం యెక్కి ఆ దారిని వస్తూ వీరిని చూచి "ఈతిమ్మన్నవాకిట గుమిగూడిన వీ రొక పందుల సమూహములాగ నున్నారు చూశావా అని తన సేవకుడైన మాధవుని సంభో దిస్తూ పైనచెప్పిన చాటు పద్యములోని ఉత్తరభాగమును చదివాడు.

ఈ యద్దేవమాట వినేటప్పటికి అక్కడనున్నవారికి పట్టలేనంత రోషం వచ్చింది. ఈ నీచుడికి తగినట్టుగా బుద్ధిచెప్పాలని పెద్దన్నగారా పద్యంయొక్క పూర్వభాగాన్ని పైనచెప్పినలాగ భావగర్భితంగా పూరించి జవాబుచెప్పారు.

విద్వత్కవుల సంస్కృత ప్రాకృతములను అర్ధము చేసికొనలేక మిడుకు ఈ భట్టువంటి కుకవులు పందుల కాహారముగా నుండే తుంగగడ్డలవంటి వారనిన్నీ, అలాంటివారి కీ కవిబృందము పందులగుంపుగా కనబడడంలో ఆశ్చర్యం లేదనిన్నీ దాని భావం మేము నీవంటి అల్పులను మ్రింగగల వరాహములము సుమీయని ధ్వని. భట్టు ఇదివిని తల వంచుకొని వెళ్ళిపోయి, మర్నాడు రాయలవారితో జరిగిన సంగతి చెప్పగా "నీవు జరిగించిన అపచారానికి తగిన పరాభవం జరిగిం"దని అతనిని మందలించి రాయలవారు పెద్దనాదికవులను మళ్ళీ రాయలవారి సభకు రావించి గౌరవించారట.

ఈ గాధను పెద్దనకవి జీవితచరిత్రలో వుదాహరిస్తూ శ్రీ గురజాడ శ్రీ రామమూర్తి గారు ఆ పద్యంలో 'వాకిలి కావలి ' తిమ్మన యని పేర్కొనబడిన యతడు ముక్కు తిమ్మనయని పొరబాటుగా వ్రాశారు. అయితే వారే తెనాలి రామకృష్ణకవి జీవితంలో ఈ తిమ్మన్నను గురించిన ఇంకొక చాటుపద్యాన్ని ఉదాహరించి దాని గాధను వ్రాస్తూ అతడు కృష్ణదేవరాయలవారి వాకిటి కావలిగా నుండిన తిమ్మన్న యనే దండనాయకుడని సరిగానే వ్రాశారు. ఆ రెండవ గాధ యిది: ఒకమాటు కృష్ణరాయలవారు తమ వాకిట కావలిగా నుండే తిమ్మన్న యనే దండనాధుడి శౌర్యవిశేషానికి సంతోషించి అతని కొక అమూల్యమైన పచ్చడము (సేలువు) ను బహుమతి యిచ్చారట. అతడా పచ్చడము బుజాన వేసుకొని తన యింటికివచ్చి అరుగుమీద కూర్చునివుండగా అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, భట్తుమూర్తి, తెనాలి రామలింగకవి అదారిని పోతూ తిమ్మన్న గారిని చూసి ఆయనను అభినందిస్తూ నలుగురూ కలిసి ఒక కందపద్యంలో నాలుగు పాదాలు వరసగా ఇలాగ పూర్తిచేశారట:

      "వాకిటి కావలి తిమ్మా (అల్లసాని పెద్దన)
       ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా (ముక్కు తిమ్మన)
       నీకీ పద్దెమె కొమ్మా (భట్టుమూర్తి)
       నా కా పచ్చడమె చాలు నయముగ నిమ్మా"--
                               (తెనాలి రామలింగ కవి)

అంతట పద్యంచివర భావప్రకటనము చేసిన రామలింగకవికి తిమ్మన్నగారు తన పచ్చడం యిచ్చివేసి తక్కినవారికి ఇతర బహుమానము లిచ్చి పంపించి నాడట.

తిమ్మన్నచరిత్రకు ఆధారాలు

ఈ రెండు గాధలూ సమన్యయం చేసి చూస్తే ఈ పద్యాలలొ చెప్పబడిన వాకిటికావలి తిమ్మన్నయనే యతడు సామాన్యుడైన కాపలావాడివంటి ద్వారపాలకుడు కాడనిన్నీ, రాయలవారిదగ్గర గొప్ప అధికారమూ, పలుకుపడీ కలిగిన వుద్యోగియనిన్నీ, విద్యావంతుడు, రసికుడు అనిన్నీ ఊహించడానికి సావకాశం కనబడుతూ వుంది. ఈ తిమ్మన్నను గూర్చిన విశేషాలను తెలుపగల చరిత్రాధారాలేమైనా వున్నవేమో చూద్దాము.

తిరుపతి దేవస్థానం విచారణకర్తలైన శ్రీ మహంతు ప్రయాగ దాసువారు తిరుపతిక్షేత్రంలో రాజాధిరాజులూ, శ్రీమంతులూ చెక్కించిన శిలాశాసనాలయొక్క విలువను గ్రహించి వాటిని ప్రకటించడానికి నిశ్చయించి వాటిని గురించి ఒక నివేదికను తయారుచేయడానికి బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్యం బి.ఏ, గారిని నియోగించారు. శాసనసంపుటాలతో పాటు వారి నివేదికనుకూడా ఒక పెద్ధ గ్రంధముగా 1930 లో అచ్చువేయించారు. దీనివల్ల పల్లవులు, చోళులు మొదలైన రాజుల కాలంనాటినుంచి విజయనగర సామ్రాజ్యము నేలిన చక్రవర్తుల వరకూ గల చరిత్రాంశాలు విశేషాలు తెలుస్తున్నవి. అందులో తిమ్మన్న చరిత్రకూడా వున్నది.

"అవసరం" తిమ్మయ్య

తిరుపతి దేవస్థానంలోవున్న శాసనాలవల్ల కృష్ణదేవరాయల వారి కొలువులొ 'అవసరం తిమ్మయ్య ' యనే దండనాయకు డొకడు రాయలవారి 'వాకిటికావలి ' అనగా ద్వారపాలకుల పై అధికారియై యున్నట్లున్నూ, అతడు వేయిమంది సైనికుల కధికారి యనిన్నీ, ఒక చిన్న సంస్థానానము నేలే సామంతమండ లేశ్వరుడనిన్నీ, అతనిని 'అమరం ' తిమ్మరసయ్య, తిమ్మప్ప నాయకుడు అనికూడా పిలిచేవారనిన్నీ, ఆయన రాయలవారి దర్శనం చేయించి అనేక సందర్భాలలో చాలాఉపకారాలు చేసినట్లున్నూ తెలుస్తున్నది.

తిరుపతిలో వున్న దానశాసనాలలో "అవసరం" నరసయ్య, తిమ్మయ్య, నరసయ్యలనే ముగ్గురు అన్నదమ్ముల పేర్లున్నూ, వారితల్లి బసవమ్మగారి పేరున్నూకూడా కనబడుతూ వున్నవి. శా.శ.1434 కు సరియైన అంగీరసనామ సంవత్సరం (క్రీ.శ.7-8-1512)నాటి శాసనములో ఈ కుటుంబంవారికి తిరువెంగళ నాధుడు ఇలువేల్పు అయినట్లున్నూ, అవసరం నరసయ్య తిమ్మయ్యగార్లు "రాయరబాగిల అవనరద".అనగా కృష్ణదేవరాయల వారి తలుపుల దగ్గవుండే ద్వారపాలకు లైనట్లున్నూ కన్నడంలో వివరింప బడింది. ఈ అన్నదమ్ములలొ తిమ్మయ్యయే మన 'వాకిటికావలి ' తిమ్మన యని నిస్సందేహంగా చెప్పవచ్చును.

ద్వారపాలకు డంటే మన 'గేటుకీపరు ' వంటి జవాను అనుకోకూడదు. అతడు రాయలవారి సన్నిధిలో నుండే ఒక గొప్పయుద్యోగి. రాయలవారి దర్శనం నిమిత్తం పోదలచినవారందరూ ఆయన అనుజ్ఞను పొందాలి. అతడు రాయలవారికి మనవిచేసి దర్శన మిప్పిస్తాడు. అందువల్ల ఆయనకు దివాణంలో గొప్ప అధికారము, పలుకుబడి వుండేవి.

శా.శ.1441 ప్రమాదినామ సంవత్సరం అనగా క్రీ.శ.1519-20 నాటి శాసనంలో పేర్కొనబడిన కృష్ణదేవరాయలవారి ద్వారపాలకుడైన 'తిమ్మభూపతి ' యీ వాకిటి కావలి తిమ్మన్నగారే. ఈ శాసనంలో 'భూప ' అనేపదము వాడినందువల్ల ఇతడు కొంత రాజ్యభాగమును పరిపాలించే సామంత మండలేశ్వరుడని తేలుచున్నది. ఈ శాసనంలో మధురజిల్లాలో అన్నామల పేర్కొనబడినందువల్ల అతని రాజ్యభాగం ఆ ప్రాంతాలలో వుండివుండాలి.

ఇలాగే చక్రవర్తిగారికి ఇతర విధాలైన సేవలు చేసేవారిలో గొప్ప ప్రభువులు, దండనాయకులు అనేకు లుండినట్లు శాసనాలవల్ల కనబడుతూవుంది. రాయలవారి సన్నిహితభృత్యులలో కొందరు గొప్ప వంశాలలో జన్మించిన వారున్ను, కొందరు రాజబంధువులున్ను వుండే వారు. వారిలో కొందరు దుర్గాధ్యక్షులున్ను, సామంత మండలేశ్వరులున్నూ కూడా వున్నారు.

"లార్డు చేంబర్లేన్" వంటి రాజసేవకుడు

మనదేశాన్ని పూర్వం ఏలిన చక్రవర్తుల దగ్గరనుండే రాజసేవకుల లాగనే ఇంగ్లీషురాజుగారి దగ్గరనుండే సన్నిహిత భృత్యులుకూడా సత్కులసంజాతులైన ప్రభువులుగానే వుంటూ వున్న సంగతి ఇంగ్లీషు రాజ్యాంగ చరిత్రను చదివినవారందరికీ తెలుసును. ఇలాంటి రాజసేవకుల లో 'లార్డుచేంబర్లేన్ ' అనే హోదాగల ఉద్యోగి అధికారమునుబట్టీ, గౌరవమునుబట్టీ, పలుకుబడినిబట్టీ చాలా గొప్పవాడు. ఇతను ఒక ముఖ్యమైన ప్రభువుగా వుంటాడు. ప్రీవీకవున్సిల్ అనే రాజుగాని అంతరంగిక కార్యాలోచన సభలో సభ్యుడుగా వుంటాడు. రాజుగారి కుటుంబములో తటస్థించే శుబాశుభాల కన్నింటికీ ఇతడు తగిన ఏర్పాట్లు చేస్తాడు. రాజుగారి దర్శనము చేయదలచిన వారందరూ ఇతనిని ఆశ్రయించాలి. రాజుగారి దర్శనము చేయతగినవారని తనకు తోచినవారి కతడు ఆహ్వానాలు పంపిస్తాడు. అతడు ఎల్లప్పుడూ రాజుగారి ప్రక్కనే నిలిచియుంటాడు. రాజుగారు రాజభవనంలోనుంచి బయటికి వెళ్లునప్పుడు బండిదగ్గరనుంచి లోపలిదాకా మార్గం చూపుతూ తీసుకొనివస్తాడు. రాజ దర్శనం కోసం వచ్చినవారిని రాజుగారికి ఎఱుకరుస్తాడు. రాజుగారి ఆలోచనమందిరము, శయనమందిరం ఈ చేంబర్లేన్ గారి తనిఖీక్రిందనే వుంటాయి. ఈయనక్రింద వైస్ చేంబర్లేన్ అనే సహాయోద్యోగి యొకడు వుంటాడు. ఇతనిక్రింది మాస్టర్, మార్షల్, మార్షల ఆఫ్ సెరిమొనీస్ మొదలైన ఇతరరాజ సేవకులు పనిచేస్తారు. రాజుగారికి సాలుపొడుగునా సేవచేడానికి 'Lords and grooms in waiting ' అనే హోదాగల ఆరుగురు ప్రభువులను నియమిస్తారు. వారొక్కొక్కరు పదిహెను రోజులుగాని, 21 రొజులుగాని వంతులుచొప్పున రాజసేవ చేస్తారు. ఇంకా ఇలాంటి సన్నిహితభృత్యులు, గౌరవహోదాలవారు చాలామంది వున్నారు.

ఇంగ్లీషు రాణీగారి అంత:పురముకూడా లార్డుచేంబర్లేన్ గారి అధికారంక్రిందనే వుంటుంది. రాణీగారి సేవకోసం ఇంగ్లాండు దేశంలో చాలా గొప్ప వంశాలలో జన్మించిన ప్రభువుల భార్యలు, వారి కొమర్తెలు, కోడళ్లు, మనుమరాండ్రు 'Ladies of the bed chamber, Women of the chamber, Maids of honour' అనే హోదాలతో నియమింపబడతారు. వీరు పూర్వము మన దేశములో రాణులకు చెలికత్తెలు, పరిచారికలు మొదలైనవారు చేసే సేవలే చేస్తారు. అందువల్ల మన వాకిటికావలి తిమ్మన గారు లార్డుచేంబర్లేను వంటి గొప్ప రాజోద్యోగి అవడానికి సందేహంలేదు.

'అమరం' తిమ్మరసయ్య

సేలంజిల్లా అరగలూరు గ్రామ దేవాలయంయొక్క దేవాదాయాన్ని వసూలు చేసి గుడిపనులు జరిగించే స్థానికు లనే గుడిపారుపత్తెగార్లు ముగ్గురికి కొన్ని యిబ్బందులు కలిగి వాటినిగురించి కృష్ణదేవరాయలవారికి స్వయంగా చెప్పుకొందామని వారు రాజధానీనగరమైన విద్యానగరానికి వెళ్ళారు. అక్కడ రాయలవారి ద్వారమువద్ద నుండే ప్రధానోద్యోగియైన 'అమరం ' తిమ్మరసయ్య గారు వీరిని రాయలవారి దగ్గరికి తీసికొనివెళ్ళి దర్శనం చేయించి వారి యిబ్బందు లను తొలగింప జేయడమేగాక వారి కొక హారము, తలపాగ, గుఱ్ఱము, గొడుగున్నూ బహుమతి చేయించాడట. ఈ సంగతి శా.శ. వర్షమ్లు 1441 కు సరియ్హైన ప్రమాధిసంవత్సరము (క్రీ.శ. 10-6-1519) నాటి శాసనంలో ఉదాహరింపబడివున్నది.

ఈ 'అమరం 'తిమ్మరసయ్యగారు మన వాకిటి కావలితిమ్మన్న గారే యనడానికి సందేహం లేదు. 'అమర ' మనగ పాళెపట్టుదొరల కియ్యబడు కొలది సీమ యని శబ్దరత్నాకరకారులు అర్ధం చెప్పి కుమార ధూర్జటి విరచితమైన కృష్ణరాజవిజయంలోని ఈ క్రింది పద్యాన్ని వుదాహరించారు.

గీ. "భటులు వేయిటి కెన్న నిర్వదియునాల్గు
    వేలుగా లక్షయిర్వదివేల ప్రజకు
    జెల్లు నల్వదిలక్షలు జీత మనఘ
    యమర మేలెడు దొరల కీక్రమము సుమ్మి."

ఈ పద్యంవల్ల 'అమరం ' అనేది కొంత జీతం, బత్తెము, సైనిక బలము, జమీను గల ఒక గొప్ప హోదా అని రూఢి అవుతూవుంది. 'అమరం ' అనే పదము 'అమరనాయంకర ' మనేదాని రూపాంతరము. విజయనగర సామ్రాజ్యంలోని వివిధప్రాంతాలలో గల కోటలకు అధ్యక్షులై దేశాన్ని పరిపాలించే ప్రభువులను అమరనాయకులనేవారు. వీరు రాజోద్యోగులై, దండనాయకులై, దేశపరిపాలకులైన నాయకులు, రాజకీయోద్యోగులలో దొరలు, పారుపత్యగార్లు, రాయసంవారు, అవసరంవారు, రాచకరణాలు అనే వివిధ హొదాలవారు కనపడుతున్నారు. వీరు చేసే వుద్యోగాలయొక్క వివరాలు స్పష్టంగా తెలియకపోయినా వీరు ప్రభుత్వోద్యోగం చేసే రాజసేవకులనిన్నీ, వీరికి జీతబత్తెములు, రాజమర్యాదలు, గ్రామాలు, జమీనులు వుండేవనీ తెలుస్తూంది. రాయలవారు యుద్ధానికి తర్లి వెడుతూ వున్నప్పుడు వీరుకూడా హాజరుగా వుండేవారనిన్నీ తెలుస్తూవుంది. వీరిని గురించి కొన్ని విశేషాలు రాయవాచకము లో వివరింపబడియున్నవి.

విజయనగర సామ్రాజ్యకాలంనాటి దేశచరిత్రను, రాజకీయ ఆర్ధిక సాంఘిక మత పరిస్థితులను గురించి పరిశోధించి శాసనములను స్థానిక చరిత్రలను, కవిలెలను, విదేశయాత్రికుల సాక్ష్యములను పరిశీలించి ఆకాలంలో మన కవులు రచించిన ప్రబంధములలోని వర్ణనలయందు, చరిత్రాంశములయందు గల నిజమును బయటికి తీసి "Studies in the History of the Third Dynasty of Vijayanagara" అనే గొప్ప చరిత్ర గ్రంధమును రచించిన డాక్టరు నేలటూరి వెంకటరమణయ్య గారీ సంగతుల నన్నింటినీ చక్కగా చర్చించియున్నారు.*[1]

తిమ్మప్పనాయకుడు

గోరంట్లగ్రామంలోని దేవాలయ సేవకులకు గల కొన్ని బాధలను సూరపరాజు అనే ఆయన తీర్చినాడనిన్నీ, ఆయన వాకిటి ఆదెప్ప నాయనిం వారి కార్యకర్త (ఏజంటు) అనిన్నీ, ఈ ఆదెప్పనాయనింవారి తండ్రిపేరు తిమ్మప్పనాయకుడనిన్నీ 1912-వ సంవత్సరపు మద్రాసు ఎపిగ్రాఫికల్ రెపోర్టు 55-వ పేరాలోను, 1912-వ సంవత్సరం 11-వ సంఖ్య శాసనములోను ఉదాహరింపబడినది. అవసరం తిమ్మయ్య యనీ, అమరం తిమ్మయ్య యనిన్నీ, వాకిటి తిమ్మయ్య యనిన్నీ పైన చెప్పిన శాసనాలలో పేర్కొనబడిన తిమ్మన్న గారే ఈ తిమ్మప్పయని చెప్పడానికి సందేహము లేదు.

ఇతర రాజసేవకులు

కృష్ణదేవరాయలవారి కొలువులోవుండి ఆయనకు సేవచేసే సద్వంశసంజాతులైన ఇతరనాయకులనేకుల పేర్లు తిరుపతి శాననాలలో కనబడుతున్నవి.

'ఊడియం ' ఎల్లప్పనాయకుడు

ఊడియం ఎల్లప్పనాయకుడు డనే రాజొద్యోగి కృష్ణదేవరాయల వారికీ, ఆయన తరువాత రాజ్యంచేసిన అచ్యుత దేవరాయల వారికి సన్నిహితభృత్యుడుగా వుండేవారు. ఊడియ మనే పదము ఊడిగ మనే మాటకు రూపాంతరము. ఇతడు 'కల్ తేరు ' అనగా రాతిరధం దగ్గర సత్రం నిర్మించినట్లున్నూ, తిరుపతిలో గోవింద రాజస్వామి వారికి దానం చేసినట్లున్నూ క్రీ.శ.1527 నాటి ఒకశాసనంవల్ల కనబడుతూ వుంది.

'అడపం ' బయ్యప్పనాయకుడు

అడప మంటే వక్కలు, ఆకులు మొదలైన తాంబూలపు ద్రవ్యము లుంచే సంచి దీనిని సంబెళమనికూడా అంటారు. ఆకాలంలో సామాన్యులు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక అడపను పట్టుకొనివెళ్ళేవారు. కృష్ణదేవరాయలవారు రచించిన ఆముక్తమాల్యద 7-వ ఆశ్వాసంలో 7-వ పధ్యంలో దీని వర్ణన కనబడుతూ వుంది. ఇది శ్రీమంతులనుభవించే భోగాలలో ఒకటి. అందువల్ల రాజాధిరాజులైన విజయనగర చక్రవర్తులకు తాంబూలద్రవ్యముల యుద్యోగి యొక డుండుడంలో ఆశ్చర్యమేమున్నది? కాశ్యపగోత్రుడైన తిమ్మప్పనాయకుడి కుమారుడైన ఈ బయ్యప్ప కృష్ణదేవరాయలవారి కాలంలోను, అచ్యుత దేవరాయలవారి కాలంలోనూ కూడా ఈయుద్యోగం చేసినట్లు అతడు తిరుపతి వెంకటేశ్వరస్వామికి 55,320 నార్పణములు సమర్పించి క్రీ.శ. 6-9-1538 సం॥ లో చెక్కించిన శాసనం వల్ల తెలుస్తూవుంది. ఇత డింకా కొన్ని గ్రామాల ఆదాయంవల్ల వచ్చే సొమ్మునుకూడా దేవుడికి సమర్పించాడు అందువల్ల ఇతడొక శ్రీమంతుడై యుంటాడనడానికి సందేహం లేదు.

'క ట్టి క ' తి మ్మ న

జిల్లేళ్ల బసవనాయకరు కొమారూడైన తమ్మునాయకరు అనే యతడు కృష్ణదేవరాయలవారి 'కట్టిక ' అనగా వెండిబెత్తమును పట్టుకొని వుండే వేత్రధరుడు. ఇదియొక రాజలాంఛనము అతడొక దళవాయి అనిన్నీ, ఈయనకు 'దాడినేని ' అనే బిరుదుకూడా వుండేదనిన్నీ అతడు తిరుపతి వెంకటేశ్వరస్వామి వారికి నిత్యనైవేద్యము నిమిత్తము 1200 నార్పణములు సమర్పించి నప్పుడు క్రీ.శ.1513 వ సంవత్సరములో చెక్కించిన శాసనములో వ్రాయబడి వున్నది. ఈశాసనమే తెలుగులోకూడా క్లుప్తముగా వ్రాయబడివుంది. అందులో ఈకట్టిక తిమ్మన్న అనుసంధానం రామానుజయ్యగారి శిష్యుడనిన్నీ, అతని పేరు కట్టిక దాడినేని దళవాయి తిమ్మయ్య యనిన్నీ వుదాహరించబడి వున్నది. శత్రువుల మీదికి వెడలి జయించినందువల్లనే 'దాడినేని ' అనే బిరుదు ఇతనికి వచ్చివుంటుంది.

'విద్వత్సభారాయరంజక ' శ్రీరంగరాజు

కృష్ణదేవరాయలవారి పూర్వుల కాలం నుంచీ విజయనగరరాజ భవనంలో ఒక నాటకశాల వుండేది. కృష్ణదేవరాయలవారి కాలంలో ఒక నాట్యశాల, ఒక నృత్యశాలకూడావుండేవి. రాయలవారు తమ ఆస్థానంలో సాహిత్యవిద్వ్గాంసులను పొషిస్తూ సదా విద్యాగోష్ఠిలో కాలక్షేపం చేస్తూ 'విద్వత్ సభారాయ' లనే బిరుదు వహించారు. నృత్యముచేసిన సంగీతము పాడి అయనను రంజించే ఆటపాటకుల మేళ మొకటి యుండేది. ఈ మేళానికి నాయకుడు తిరుమల నాధుని కుమారుడైన శ్రీరంగరాజు. అతనికి 'విద్వత్ సభరాయరంజక' అనే బిరుదు ఉండేది. రాయల వారాయనకు గొప్పజాగీరులిచ్చారు. అందులో ఎర్లంపూడి అనే గ్రామాన్ని ఈ శ్రీరంగరాజు క్రీ.శ.1514 లో శ్రీవెంకటేశ్వరుల వారికి సమర్పించాడు. ఈ శ్రీరంగరాజు కొమర్తెయైన రంజకం కుప్పాయి అనే కుప్పసాని క్రీ.శ.1512 లో చేసిన దానం ఒకటి కనబడుతూవుంది. ఈ కుప్పాయికి తిరుమలమ్మ, ముద్దుకుప్పాయి అనే ఇద్దరు కుమర్తెలుండేవారు. తిరుమలమ్మ స్వామివారికి శా.శ.1439 ఈశ్వర సం (క్రీ.శ.1517)లో 3000 నార్పణములు సమర్పించినట్లు వ్రాయబడిన శాసనం తెలుగు ప్రతిలో ఆవిడ శ్రీరంగరాజు మనుమరాలనిన్నీ, కుప్పమ్మకుమార్తెననిన్నీ వ్రాయించింది.

కుప్పాయి రెండవ కొమర్తె ముద్దుకుప్పాయి మొదట విజయనగర చక్రవరియైన అచ్యుత దేవరాయల అంత:పురపరిచారికగా వుంటూవుండి ఆయన ఆజ్ఞప్రకారము తిరుపతి వెంకటేశ్వరస్వామివారి సేవ చేయడానికి వచ్చినట్లున్నూ, గోవిందరాజ స్వామివారి ఆలయం నుంచి ప్రతిరోజూ ఆవిడకు తినడానికి ప్రసాదం యిస్తూవున్నట్లున్నూ శా.శ.1453 ఖర సంవత్సరం(క్రీ.శ.6-6-1531) శాసనంలో వివరింపబడివున్నది. ఈశాసనంలో శ్రీరంగరాజు కొమార్తెయున్నూ ముద్దుకుప్పాయితల్లిన్నీ అయిన కుప్పసానికీకూడా "విధ్యుత్సభారాయరంజకం" అనే బిరుదు వుండినట్లు చెప్పబడివున్నది.

ఇలాగ విజయనగర చక్రవర్తుల సేవను చేసే స్త్రీ పురుషులలో గొప్ప వంశాలవారూ, శ్రీమంతులూ అనేకు లుండేవారని తిరుపతి దేవస్థానములోనున్న శాసనాలవల్ల తెలుస్తూవున్నది."[2]

తి మ్మ శ బ్ద వి చా ర ము

మన తెలుగు దేశంలొ తిమ్మ, తిమ్మడు, తిమ్మన్న, తిమ్మప్ప, తిమ్మకవి, తిమ్మనృపతి, తిమ్మమంత్రి, తిమ్మయ్య, తిమ్మరాజు, తిమ్మాజి, తిమ్మశౌరి, తిమ్మశెట్తి, తిమ్మక్క, తిమ్మాయమ్మ, తిమ్మమ్మ,తిమ్మాంబ, తిమ్మాజమ్మ అనే స్త్రీ పురుషుల పేర్లేగాక తిమ్మాపురం, తిమ్మసముద్రము మొదలైన స్థలవాచకములున్నూ, తిమ్మిని బ్రహ్మిని చేయడము రమ్మన్నారు తిమ్మన్న బంతికి, తిండికి


1

రంగధామమును గరంబు సన్నుతి గాంచు
గ్రహములందు శశియు రవియుబోలె."

అని 4 వ ఆశ్వాసంలో వ్రాసినాడు. (చూ: శబ్దరత్నాకరము)

తెలుగులో తిరుపతి తిరుమల లనే పదాలు పర్యాయపదాలుగా చిరకాలంనుంచి వాడుకలో నున్నవి. తెలుగు, దేశానికీ, అరవదేశానికీ తిరుపతి కొండ సరిహద్దని అంటారు. తిరుపతిలోని ప్రజలందరికీ తెలుగే మాతృభాషగా వుండి తిరుమలలోనుంచి తిమ్మడనే పేరు రూఢమైంది. ఈ తిరుపతి వెంకటేశ్వరుడు తెలుగువారికి ఇలవేల్పుగా వుంటున్నాడు. అయితే ఇటీవల ద్రావిడాభిమానుల యుద్యమ మొదటి బయలుదేరి తిరుపతి వేంకటేశ్వరుడు పేరులొని వేంకటశబ్దము వేంగడ మనే అరవ శబ్ధంలో నుంచి పుట్టినదనీ, దానితో పాటు తిరుమల తిరుపతులు కూడా అరవవారి స్వార్జితపుసొత్తులనీ ఒక ప్రచారము జరుగుతూ వున్నది.

"జననీ సంస్కృతంబు సకలబాషలకును, దేశభాషలందు తెలుగు లెస్స"

మన దక్షిణభారతదేశఉలో పూర్వంనుంచీ ఏరాజవంశాలు ఏలుతూవస్తూవున్నా, వారు పల్లవులైనా, చోళులైనా, చాళుక్యులైనా, లేక కాకతీయులైనా, విజయనగరచక్రవర్తులైనా ఇక్కడి తెలుగువారినీ, అరవవారినీ, కన్నడులనూ కూడగట్టుకుని దేశప్రజలు, నాగరికతను, మతమర్యాదలను కాపాడుతూ ప్రజారంజకంగా పరిపాలించారేగాని వేరువేరు భాషలు మాట్లాడేవారని చీలదీసి 'పాకిస్తానాల 'ను ఏర్పరచలేదు. అందువల్లనె ఆసేతుహిమాచలపర్యంతముగల పుణ్యక్షేత్రాలను, పుణ్యనదులను దేశప్రజలందరూ ఇప్పటికీ అసమాన భక్తితోనే పూజిస్తూవుండడం తటస్థించింది. ఏ క్షేత్రమాహత్మ్యం చదివినా, ఏ పురాణం చదివినా ఆస్థలజలపవిత్రతను గురించీ, ప్రాశస్త్యాన్ని గురించీ వర్ణించడం కనబడుతుందేగాని ఇది అరవలది, అది తెలుగువారిది, ఇది కన్నడులది, అది మహారాష్ట్రులది, అనే భేదాన్ని పొరపాటునైనా చెప్పవు. కావేటిరంగని పదాలుగాని, పాండురంగవిఠలుని కీర్తనలు గాని, తుకారాము అభంగములుగాని, కబీరుదాసు కీర్తనలుగాని, తులసీదాసు తొహరాలుగాని, గీతగోవిందముగాని, తరంగములుగాని, తత్వాలుగాని ఎక్కడనైనా ఎవరైనా పాడుతూవుంటే అది ఏభాష అనే విచక్షణ లేకుండా దేశప్రజలందరూ-- స్త్రీలూ, పురుషులూ భక్తిపారవశ్యంతో తన్మయు లవుతారు. ఏక్షేత్రానికి పోయినా ఆప్రాంతపు భాషతో నిమిత్తం లేకుండా అక్కడి ప్రజలతో పాటు దేవుణ్ణి సేవించగల్గుతున్నారు.

అరవలైన పల్లవులూ, చోళులూ తెలుగుదేశాన్ని ఏలినప్పుడు గాని, చాళుక్యులు తెలుగుకర్ణాటకాలను ఏలినప్పుడుగాని, కర్ణాటక రాజ్యమధ్యలో తెలుగుప్రభుత్వము స్థాపించిన విజయనగరచక్రవర్తులు ద్రావిడ కర్ణాటకాలను పరిపాలించినప్పుడుగాని, ఒకజాతిని ఒక బాషను అధికముగా జేసి తక్కినవారిని అణగద్రొక్క లేదు. అన్నిభాషలనూ ఆదరించారు. "జనని సంస్కృతంబు సకలభాషలకును, దేశాభాషలందు దెనుగు లెస్స" యనే భావము ఒక్క తెలుగువారిలోనే కాదు అరవల లోనూ కన్నడులలోనూకూడా వ్యాపించి యున్నది. ఆయాదేశాలలో ఇప్పటికీ ప్రజల నోట వినబడే తెలుగుపదాలు, పద్యాలు, కీర్తనలు, కధలు, గాధలూ ఇందుకు ప్రబలమైన నిదర్శనాలుగ ఉన్నాయి. కృష్ణదేవరాయలంతటివాడు "దేశభాషలందు తెలుగు లెస్స"యని యుద్ఘోషించాడు. అంతమాత్రంచేత జాత్యహంకరముగాని, జాతి వైరముకాని ప్రబలలేదు.

ద్రావిడ ఉద్యమము

అరవదేశంలో ఇటీవల కొందరు ప్రబుద్ధులు బయలుదేరి ఒక ద్రావిడాభిమానమును ప్రచారంచేస్తూ తమదేశములోనుంచీ, భాషలోనుంచీ, సంగీత సాహిత్యములలోనుంచీ సంస్కృతాన్ని పారద్రోలడానికి ప్రయత్నిస్తున్నారు! అరవంలో పాడకుండా తెనుగులో పాడినాడనే కారణంతో త్యాగరాజుయొక్క దివ్యవాణిని తమ సంగీతసభలలో నుంచి వెలిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు! దేశములోని తెలుగు భాగాలు కూడా తమవే నంటున్నారు. ఇంక ఉమ్మడిప్రదేశాలన్నీ తమ వనడంలో ఆశ్చర్య మేమున్నది! ఈ సందర్భంలో దేశచరిత్రను కూడా తమ కింపుగా ఉండేటట్లు మార్చి వ్రాయడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలము ద్రావిడ దురభిమానావేశము గలవారుమాత్రమే ఇలాంటి పిచ్చిపనులు చేస్తే చింతలేదు. డాక్టర్ ఎస్. కృష్ణస్వామి అయ్యంగారివంటి ప్రాజ్ఞులైన చరిత్రకారులుకూడా తమ రచనలలో అరవభిమానం చూపిస్తూ సత్యాన్ని మరుగునపరచడము, చరిత్రాంశాలకు అపార్ధంకల్పించడం చాలా దు:ఖకరమైన సంగతి. తిరుపతి చరిత్రలో వారు తెలుగు భాషకు, తెలుగువారికి చేసిన అన్యాయము మరీ ఎక్కువగా నున్నది. వేంకట శబ్ధముతోపాటు తిరుమలను, తిరుపతిని అరవవారి స్వంత హక్కుగల సొత్తుగా నిరూపించాలని కృష్ణస్వామయ్యంగారు చాలా తంటాలుపడ్డారు. తిరుపతి దేవస్థానపు శాసనాలను పరిశోధించి నివేదికను తయారుచేసిన సాధు సుబ్రహ్మణ్యంగారి నివేదికను, ఈ తిరుపతి చరిత్రను పోల్చి చూస్తే కృష్ణస్వామయ్యంగారి పక్షపాతపు వ్రాతలు కొంతవరకూ తెలుసుకోవచ్చును.

మన తెలుగు చరిత్రకారులు, పరిశోధకులు, విశ్వకళాపరిషత్తు వారు, తెలుగుప్రజలూ చరిత్రరచనలలో మనకు జరుగుతూవున్న ఈ అన్యాయాన్ని గురించి ఎందుకు ఆలోచించరో తెలియడం లేదు. బ్రతికిచెడిన జాతి ఈ యాంధ్రజాతి అనియైనా స్మరించుకుంటే కృతార్దులం మవుతాము.

  1. చూ: 4 వ ప్రకరణము, పుటలు 151-153: 5 వ ప్రకరణము, పుటలు 130-1, 179-181.
  2. .(Tirupati Devasthanam Epigraphical Report by Sadhu Subrahmanyam, pp.199. 207)