కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

రెండవ ప్రకరణము

రాజశేఖరుడు గారి కూతురు రుక్మిణి స్నానమునకు వచ్చుట - నదీతీర వర్ణనము - రుక్మిణికిని సిద్ధాంతి గారి భార్యకును జరిగిన సంభాషణ - నీళ్లకు వచ్చిన యమ్మలక్కల ప్రసంగములు - పంచాంగపు బ్రాహ్మణుడు వచ్చి సంకల్పము చెప్పుట - రుక్మిణి స్నానము చేసి బయలుదేఱుట.

రాజశేఖరుడు గారు పౌరబృందముతో నాలుగడుగులు ముందుకు సాగిన తోడనే యొక సుందరి సుందరగమనముతో బాదముల యందలి యందియల మ్రోత మట్టియల మ్రోతతో జెలిమి సేయ, మొలనున్న వెండి యొడ్డాణము యొక్కయు, ముంజేతుల పసిడి కంకణముల యొక్కయు, గాజుల యొక్కయు కాంతులు ప్రతిఫలించి కుడిచేతిలోని తళతళలాడుచున్న రాగిచెంబునకు జిత్రవర్ణమొసంగ, మోమున లజ్జాభయములు నటియింప, పయ్యెద చక్కజేర్చుకొనుచు తిన్నగా దలవంచుకొని మెట్లు దిగివచ్చి చెంబును నీటి యొడ్డున నుంచి చెంబుమూతి కంటించియున్న పసుపుముద్దను దీసి కొంత రాచుకొని మోదుగాకులో జుట్టి తెచ్చుకొన్న కుంకుమపొట్లము నొక బట్టయుతుకు రాయిపయింబెట్టి, మోకాలిబంటి నీటిలో నిలుచుండెను. ఆమె రాజశేఖరుడు గారి పెద్దకూతురగు రుక్మిణి - ఆహా! ఆమె సౌందర్యమును బ్రత్యక్షమున జూడ నోచినవారి కన్నులే కన్నులు. ఆ కాలమున హిందూ దేశమునందలి సుందరులలోనెల్ల దెనుగుదేశములోని వారే రూపరేఖావిలాసముల చేత నసమానలుగా నుండిరి; వారిలోను బ్రాహ్మణజాతి నాతులు మిక్కిలి చక్కనివారు. కాని రుక్మిణి రూపమును దలచినప్పుడు మాత్రము, ఆ సుందరులొకసౌందర్యవతులని చెప్పుట కెల్లవారును సంకోచ పడుచుందురు. జనులందఱును మిక్కిలి సౌందర్యవతులని యొప్పుకొన్నవారిలో చక్కనివారి నేరి యామె చెంత నిలిపినచో గురూపురాండ్ర నిపించెడి యామె మనోజ్ఞత నేమని పిలువవలెనో తెలియకున్నది. అపూర్వ వర్ణనాసామర్థ్యము గల కాళిదాసాది కవులలో వొకరినైనను బోలజాలని నేను, ఉన్నత సౌందర్యమును బోధించు పదములు లేని భాషతోను, పదములు బోధించునంత వఱకైన బూర్ణముగా దెలుపలేని బుద్ధితోను వర్ణింపబూనుట యామె చక్కదనము యొక్క గౌరవమునకు గోరంత కలుగజేయుటయే గదా! అయిననూ యోగ్యవస్తువు దొరికినపుడు వర్ణింపక మానుట యుచితము కాదు కాబట్టి, యీ సృష్టిలోని వస్తువులతో వేనితోనైనను పోల్చి యీ పుస్తకముం జదువువారి కామె యవయవముల యొక్క రూపము నించుక మనస్సున బుట్టింతునన్నను ఆమె యంగముల నెంచి యా వస్తువుల పేరు చెప్పుటకె సిగ్గు వొడముచున్నది. వేయేల? చతుర్ముఖుడును ఘుణాక్షరన్యాయమున బడిన యామె రూపమునకు దలయూచి, తన యపూర్వ వస్తునిర్మాణచాతురిని మెచ్చుకోకపోడని యామెం జూచినవారెల్లరు నెంచుచుందురు. ఆమె శరీరశ్ఛాయం జూచిన, ఇక నీ భూమి మీద బంగారమునకేమి చాయ యెక్కువ గలదని తోచును; నల్లగానుండునేని, విండ్లామె కనుబొమలం గొంచెము పోలియున్నవని చెప్పవచ్చును; నేత్రములను జూచిన భాగ్యదేవత వాని యందే కాపురము కుదిరినట్టు కనిపించును; కాని, నిపుణముగా బరిశీలించినచో నేదో స్థిరవిచారమొకటి యామె హృదయపీఠమున నెలవుకొనియున్నట్టు ముఖలక్షణములు కొంచెము సూచించుచున్నవి. ఆ విచారమునకు గారణము లేకపోలేదు. ఆమె పెనిమిటి సహవాసదోషము చేత నాఱు నెలల క్రిందట దలిదండ్రులతో జెప్పక దేశాంతరము లేచి పోయినాడు. ఇప్పుడామెకు బరిమళ మబ్బినట్లు, ఇప్పుడిప్పుడే యౌవనము తలచూసి యాపె మేనిసోయగమునకు మెఱుగు దెచ్చుచున్నది. పచ్చని దేహము మీద అప్పుడు కట్టుకొన్న తెల్లని బట్టయు బంగారమునకు పటిక పూసినట్టులొక విధమయిన యందమునే కలిగించుచుండెను. సుందరాంగుల యంగముం జేరినప్పుడేది యందముగా నుండదు? ముక్కున నడ్డబాసయు, చెవుల నీలాల బావిలీలును, చేతుల కంకణములును, మెడలో పట్టెడయును, మొలను వెండి వడ్డాణమును, కాళ్లనందెలును, మట్టెలును, ఆమె యప్పుడు ధరించుకొన్నది. కంకణములకు సాహాయ్యముగా రంగురంగుల గాజులును లక్కపట్టెలును ముంజేతుల నలంకరించుచుండెను. ఈ నగలచే నామె యవయవములకేమైన శోభ కలిగినదో లేదో కాని యవయవములచే నగలు కొంత శోభ గాంచుట మాత్రము కరతలామలకముగా గనబడుచున్నది.

సృష్టిలోని యే పదార్థమునకును బరిపూర్ణత్వమును దయ చేయని రీతినే, సర్వసముడగు భగవంతుడు రుక్మిణి సౌందర్యమందును గొంత కొఱతను గలిగించినాడు కాని బొత్తిగా గలిగింపక మానినవాడు కాడు. నిజముగా అది యొక కొఱతయే యయ్యెనేని యామెకుం గల లోపమెల్లను మెడ మిక్కిలి పొడుగుగా నుండుట. అయిననూ ముష్టి సర్వశాస్త్రి యాయవారమునకు వచ్చినప్పుడెల్ల నామె మెడను జూచి సంతోషించి, "మిక్కిలి నిడుదగు మెడ కామిని కులవర్ధని దాని నెఱిగికొండనిరి బుధుల్!" అను సాముద్రిక గ్రంథములోని పద్యమును జదివి పోవుచుండును.
అప్పుడొక్కవిధవ మొల లోతు నీళ్లలో దూరముగా నిలుచుండి నోటిలో నేమేమో జపించుకొనుచు నడుమ నడుమ దలయెత్తి సూర్యుని వంక జూచి దండములు పెట్టుచు, దోసిటిలో నీళ్లు పట్టి సూర్యునకర్ఘ్యము విడుచుచు, అప్పుడప్పుడు ప్రదక్షిణములు చేయుచుండెను. ఆవఱకే వచ్చియున్న కొందఱు స్త్రీలు తమ యిత్తడి బిందెలను నీళ్లలో బెట్టి రేవునకు సమీపముగానున్న రాళ్లపయిని నిలుచుండి యొక్కొక్క పెట్టు వేయుచు మధ్యమధ్య నొక్కొక్క మాట చెప్పుకొనుచు బట్టల నుతుకుకొనుచుండిరి; ఒక వృద్ధాంగన సగము బట్ట కట్టుకొని తక్కిన సగము నుతుకుకొన్న తరువాత, ఉతికిన భాగమును మార్చి కట్టుకొని మిగిలియున్న భాగము నుదుకుకొనుచుండెను; కొందఱు వయసులోనున్న స్త్రీలును గోప్యముగా నుంచదగిన తమ యవయవములు స్నానము చేయునట్టియు గట్టున నున్నట్టియు పురుషులకు గనబడునట్లు సిగ్గువిడిచి తొడుగుకొన్న రవికలను దీసి యుదుకుటకయి తాము కట్టుకొన్న వస్త్రముల నక్కడనే విప్పి యావఱ కుదికిన వేఱు తడి బట్టలను చుట్టబెట్టుకొనుచుండిరి. ఆవల పది బారల దూరమున దాసీజనములు క్రిందబడిన మెతుకులకై కావుకావని మూగిన కాకులను చేయెత్తి యదిలించుచు అంటుతప్పెలలను ఒడ్డున బెట్టుకొని తోముకొనుచుండిరి. ఆ పయిని బెస్తలు పుట్టగోచులతో మొలబంటినీటిలో నిలుచుండి వలత్రాడు మొలత్రాడునం దోపుకొని రెండు చేతులతోను వలను త్రిప్పి లోతు నీళ్లలో విసరవైచి మెల్లమెల్లగా లాగుచుండిరి. మఱికొందఱు లాగిన వలలను నీళ్లలో బలుమాఱు జాడించి యంటుకొనియున్న బురద పోయిన తరువాత గట్టునకు దీసికొని వచ్చి చివర దగిలించియున్న యినుపగుండ్లు గలగలలాడ వలలను విప్పి రాయిరప్ప క్రింద బారవైచూచు నడుమ నడుమ వలకన్నుల సందున నుండి మిట్టిమిట్టిపడు చిఱుచేపలను చేతులతో నదిమిపట్టి మీలపుట్టికలను చేత బట్టుకొని నిలుచున్న పిన్నవాండ్ర చేతి కందిచ్చుచుండిరి. ఆ పయిని నాలుగడుగులు నడిచిన తరువాత దినమున కాఱణాల పాటుపడగలిగిన యొక సోమరిపోతు నీళ్లలోనున్న నడదోనె మీదికెక్కి నల్ల యన బడు పేరిననెత్తురుముద్దను త్రాటి చివరనున్న గాలమునకు గ్రుచ్చి, లేచి నిలువబడి కుడిచేతితో సత్తువ కొలదిని త్రాడు గిరగిర త్రిప్పి లోతు నీటన్విసరవైచి మరల గూర్చుండి చేప యెప్పుడు చిక్కునాయని తదేకధ్యానముతో త్రాడు వంకనే చూచుచు త్రాడు కదిలినప్పుడెల్ల నులికిపడుచు దైవవశమున చేప గాలమును మ్రింగి కొట్టుకొనుచుండ మెల్లమెల్లగా లాగుచు, త్రాడు తెంపుకొని పాఱిపోవునో యను భయమున గుడిచేతిలోని త్రాడు వదలుచు మరల లాగి ఉండగా జుట్టుచు, చేప కలసట వచ్చిన తరువాత నొడ్డునకు లాగి పెన్నిధి గన్న పేద వలె బరమానందము నొందుచు, ఒడ్డు దాక వచ్చిన తరువాత గ్రహచారము చాలక మత్స్యము త్రాడు తెంపుకొని పఱచిన చేతిలో బడ్డ సొమ్ము పోగొట్టుకొన్నవాని వలె నిర్వేదించు చేప రాకపోగా రెండణాల గాలము కూడ బోయెనని విచారించుచు వట్టి చేతులతో నింటికి బోయెను. ఆ సమీపముననే యొడ్డున జేరి కుఱ్ఱవాండ్రు వెదురుచువ్వ కొక దారమును గట్టి దాని కొననున్న చిన్న గాలమునకు ఎఱ్ఱలను గ్రుచ్చి నీళ్లలో వైచుచు దటాలున దీయుచు జిన్న చేపలను బట్టుకొని మఱియొక దారమునకు గుదిగ్రుచ్చి 'నాకు బది జెల్లలు దొరికినవి' 'నాకు నాలుగు పరిగెలు దొరికిన'వని యొండొరులతో జెప్పుకొనుచు సంతోషించుచుండిరి. అక్కడి జువ్విచెట్టు మీద గూర్చుండి చూచుచున్న చెడు గ్రద్ద యొకటి యకస్మాత్తుగా వచ్చి యొకటి రెండు పర్యాయములు పిల్లవాండ్రు త్రాడునకు గ్రుచ్చుటకయి చేతబట్టుకొన్న చేప నెగరదన్నుకొని పోయెను.

అప్పుడొక్క పెద్దముత్తయిదువ మొగమంతయు నొక్కటే బొట్టు పెట్టుకొని, బట్టలతోనున్న బుజము మీది బిందెను తీసి చేతబట్టుకొని రుక్మిణియున్న తావునకు వచ్చి గౌరవము తోప "అమ్మాయి గారూ! ఏమి? మీరీ వేళ స్నానమునకు దయ చేసినారు". రుక్మిణి - "కార్తీకసోమవారము కాదా? కడపటి సోమవారము గనుక ప్రదోష వేళ మా అమ్మతో కూడ శివాలయమునకు వెళ్లవలెనని గోదావరి స్నానము చేయవచ్చినాను".

పెద్ద ముత్తైదువ - మీరు రాత్రి దాక భోజనము లేకుండనుండగలరా?

రు - "ఒక్క దినమునకేమి? ఏలాగునైన నుందును. మొన్న మీ రెండవ చిన్నదానికి శరీరములో నిమ్మళముగా లేదని చెప్పినావు. ఇప్పుడు కొంచెము నిమ్మళముగా నున్నదా?"

పె - "ఏమి నిమ్మళమో నాకు తెలియదు. మావారు రెణ్ణెల్లం బట్టి కామావధానుల చేత విభూతి పెట్టించుచున్నారు. రాత్రి తెల్లవారిన దాక నిద్ర లేక బాధపడినాము".

రు - "గ్రహబాధా యేమి?"

పె - "అవునమ్మాయీ! ఏమి చెప్పుకోను? మగడు" - అని 'యిక్కడ నెవరును లేరు గదా' యని నాలుగు ప్రక్కలను జూచి మఱింత దగ్గరగా జరిగి చెవిలో మెల్లగా "మగడు పట్టుకొని వేపుకొని తింటున్నాడు. మీరెఱుగుదురు గదా దానికి పెండ్లియయి మూడేండ్లు కాలేదు. అప్పుడే దాని మగడు పోయి ఆఱు నెలలయినది. అప్పటి నుండియు దానికి కొన్నాళ్లు కలలోను కొన్నాళ్లు రాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడును కనబడుచునే యున్నాడు. పి‌ల్లకి సిగ్గు చేత ఎవ్వరితోను చెప్పక దాచినది. నెల దినముల నుండి బొత్తిగా ఎప్పుడును విడువక రేయింపగళ్లు వెంటవెంటనే యెక్కడికి వెళ్లిన నక్కడికి దిరుగుచున్నాడు. ఏమి పాపమో కాని మూడు దినముల నుండి మఱింత పీకుకొని తింటున్నాడు. ఈ మూణ్ణాళ్లలోను పిల్లది సగమయిపోయినది. ఇంతే గదా? మగనితో" - అని కడుపులో నుండి దుఃఖము బయలుదేఱగా గొంచె మాపుకొనుచు గన్నీరు పైట చెఱగుతో తుడుచుకొనుచు గొంచెము తాళి గద్గదస్వరముతో "మగనితో సౌఖ్యమనుభవింపనా? కాపురము చేయనా?" అని కొంచెము బిగ్గరగా నేడ్వజొచ్చెను.

రు - (ఆ మాటలు మనసుకు నాటి యొడలు పులకరింప గొంత తాళి ధైర్యము తెచ్చుకొని) "పెద్ద ముత్తైదువవు ఆలాగున గంట తడి పెట్టరాదు. ఊరుకో ఊరుకో రోగము మనుష్యులకు రాక మ్రాకులకు వచ్చున

పె - ఏడుపు చాలించి - "అమ్మాయీ! దానికే సౌఖ్యము నక్కఱలేదు. ఈలాగునైన నుండి బ్రతికి బట్టకట్టిన జాలును. మా ముసలి ప్రాణములు రెండును బ్రతికి బాగున్నంత వఱకు దానికి యన్నవస్త్రముల కేమియు లోపము రాదు."

రు - కొంచెము సేపేమేమో యాలోచించి - "సోమిదేవమ్మా! మీవారు గ్రామములొ పెద్ద సిద్ధాంతులు గదా? తెలిసి కూడ చిన్నదానికి అంత యర్ధాయుష్మంతున ... "

పె - మాటకడ్డము వచ్చి - "ఔనౌను! నీ వడుగబోవునది నేను గ్రహించినాను. ఎవరి యదృష్టమున కెవరు కర్తలు? దానికి ముండ మోయవలసిన వ్రాత యుండగా నెవరు తప్పింపగలరు? ఎవరైన జాతకము మంచిదిగా జూచి వివాహము జేయుదురు గాని పెండ్లి కుమారునకు లేని యాయువును తెచ్చి పోయగలరా?"

రు - "అవును. జాతకములో మీ యల్లునకు పూర్ణాయుస్సే యున్నది కాబోలు!"

పె - కొంచెమనుమానించి - "పూర్ణాయుస్సా? అవును పూర్ణాయుసే యున్నది. జాతక ప్రకారము జరగదా అందునేమో, వేళ తిన్నగా కట్టి జాతకము వ్రాసిన యెడల, అందులోనెన్ని యక్షరములున్నచో అన్ని యక్షరములును జరుగును. శాస్త్రము చక్కగా తెలియనివారు తిన్నగా వేళ కట్టలేక పాడు చేయుదురు. మావారు ఇన్ని ముహూర్తములు పెట్టినారు గదా? నీ వెఱిగినంత వఱకు మఱియొక విధముగా నెక్కడైన జరిగినదేమో చెప్పు"

రు - "కన్నమ్మ గారి బుచ్చమ్మ వివాహ ముహూర్తము మా చావడిలో మన సిద్ధాంతిగారే పెట్టినారు గాని దాని మగని జాతకము కూడ సిద్ధాంతి గారే వ్రాసి ... "

పె - "అవును ఒకానొకటి తప్పిపోవుటయు గలదు. జ్యోతిషమునకు బార్వతి శాపమున్నదట! మావా రెప్పుడును ఈ సంగతినే చెప్పుచుందురు. గట్టు మీద మట్టెల చప్పుడగుచున్నది. ఎవ్వరో వచ్చుచున్నట్లున్నారు. ఈ పాటికి మనమీ సంగతి చాలింతము" అని వెనుక తిరిగి చూచి బిందె యొడ్డున నుంచి స్నానమునకు నీళ్లలో దిగుచున్నది.

ఇంతలో గొందఱు పుణ్యస్త్రీలును విధవలును మెట్టు దిగుచు ముందున్నవారు వంగి కాళ్ల వెండి పావడములను కొంచెము పయికి దీసికొనుచు వెనుక దిరిగి దూరమునున్నవారు వచ్చువఱకు దగ్గఱ వారితో మాటలాడుచు మెల్లమెల్లగా నీటి సమీపమునకు వచ్చి గృహకృత్యములను గుఱించి మాటాడుకొనుచు బిందెల నొడ్డున బెట్టిరి. అందఱును నొక్కచోట సమావేశమయి సావకాశముగా మాటాడుకొనుటకు నీళ్లకు వచ్చినప్పటికన్న మంచి సమయము స్త్రీలకెప్పుడును దొరకదు గదా? అందుచేతనే వారు సాధారణముగా కొంచెము తీఱుబడి చేసికొని మాటాడవలసిన నాలుగు మాటలను నీళ్లకు వచ్చినప్పుడే మాటాడుకొని పోవుదురు. అప్పుడు ముప్పదియేండ్ల యీడు గల పొట్టిదొకతె ముందుకు వచ్చి ముక్కు మీద వ్రేలు వైచికొని "ఓసీ! వెంకమ్మా! రాత్రి శేషమ్మను మగడు కొట్టినాడట! విన్నావా?"

వెంకమ్మ - "దానిని మగడెప్పుడును ఆలాగుననే కొట్టుచుండును. నెల దినముల క్రింద కఱ్ఱ పుచ్చుకొని కొట్టినప్పుడు చేతి గాజులన్నియు పగిలిపోయినవి."

పొట్టి - "దానిని మగడు తిన్నగా ఒల్లడట." అని బుగ్గను చేయి పెట్టుకొని "ఓసీ! ఓసీ! అతడు ముండ నుంచుకొన్నాడట సుమీ."

బట్టతల ముత్తైదువ యొకతె చేతులు త్రిప్పుకొనుచు ముందుకు వచ్చి "సరి సరి! దాని గుణము మాత్రము తిన్ననిదా? మొన్న సుబ్బావధానుల కొడుకుతో మాటాడుచుండగా మగని కంటనే పడ్డదట! మగవాడేలాగున నున్నను దోషము లేదు. ఆడదాని గుణము తిన్నగా నుండనక్కఱలేదా?"

పొట్టి - "దానికేమి గాని, పాపము! చిన్నమ్మను అత్తగారు లోకములో లేని కోడంట్రికము పెట్టుచున్నది. అంతే కాకుండ మగడింటికి వచ్చునప్పటికేవో నాలుగు లేనిపోని నేరములు కల్పించి చెప్పును. దాని మీద అతడు ప్రతిదినమును దానిని చావగొట్టుచుండును."

పదియాఱు సంవత్సరముల వయస్సు గల యొక చామనచాయది కన్నుల నీరు పెట్టుకొనుచు - "అత్తగారు బ్రతికియున్న చోట్ల నెల్ల నిదే కర్మము. లోకములో అత్తలెల్ల ఒకేసారి చచ్చిరా ... "

పొట్టిది - "శేషమ్మా! నీ అత్తగారు కూడ నిన్ను చాలా బాధ పెట్టునని విన్నాను. నిజమా?"
శేష - "బాధ గీధ నాకు తెలియదు. కోత పడలేక చచ్చి పోవుచున్నాను. జాము తెల్లవాఱ లేచి యింటి ప్రాచి యంతయు జేసి, అంట్లు తోమి, యింటికి కావలసిన నీళ్లన్నియు తోడి, మడిబట్టలుదికి, ఆమె లేచు వఱకు పనులన్నియు జేయుదును. అప్పుడు నాలుగు గడియల ప్రొద్దెక్కి లేచి కన్నులు నలుపుకొనుచు వచ్చి గరిటెనంటు వదలలేదని, వాకిటలో బెంట యట్టే యున్నదని తిట్ట మొదలుపెట్టును. తరువాత పేడ చేసి గోడ మీద పిడకలు చఱిచి ఱెక్కలు విఱుచుకొని జాము పొద్దెక్కి చలిదిభోజనమునకు వచ్చు వఱకు, 'ఒక మూల తెల్లవాఱక మునుపే తిండికి సిద్ధపడుదువు. పని మాత్రము ముట్టుకో'వని వంట చేసికొనుచు సాధించుచుండును. పగలు మగనితో మాటాడితే దప్పు కదా? రాత్రి యందఱి భోజనములు అయిన తరువాత, అత్తగారికి కాళ్లు పిసికి యామె నిద్రపోయిన తరువాత వెళ్లి పడుకోబోవు నప్పటికి రాత్రి రెండు యామములగును. పడుకొన్నది మొదలుకొని యెప్పుడు తెల్లవాఱిపోవునో, వేళకు బని గాకున్న అత్తగారెక్కడ కోపపడునో యని నిద్రలో సహితములికి పడుచుందును; ఎట్లు చేసినను నాకు తిట్లును దెబ్బలును తప్పవు గదా?" అని మొగమునకు కొంగడ్డము పెట్టుకొని నేత్రముల నీరు కార్పజొచ్చెను.

రుక్మి - "అత్తగారికి కోపము తెప్పించకుండ జేసెడు పనిని నీవు తిన్నగానే చేయరాదా?"

శేష - "అయ్యో! రుక్మిణమ్మా! నీకత్తగారు లేదు గనుక నీకీ సంగతులేమియు తెలియవు. ఎంత పని జేసినను అత్తగారి కెప్పుడును మెప్పు లేదు. కలయంపి చల్లునప్పుడు చిక్కగా జల్లిన, 'ఇల్లంతయు సముద్రము చేసినావు జాఱిపడి చచ్చిపోనా?'యని తిట్టును. పలచగా(జల్లిన "నీళ్ళకు కఱవువచ్చినట్లు వేణ్నీల్లేచల్లినావుకా"వని తిట్టును. అడిగినమాటలకు మాఱు చెప్పిన"నామాట కెదురు చెప్పుచున్నావా" యని కోసి పెట్టును. బదులు చెప్పక యూరకున్న"మొద్దులాగున మాటాడవె"మని తిట్టును. ఆమెముందఱ ఏమి చేసినను తప్పిదమే. "ఆ" అన్న అపరాధము "నారాయణా" అన్న బూతుమాట. నేను కాపురనకువచ్చిన నాలుగు సంవత్సరముల నుండియు వాడుకొనుచున్న ఓటికుండ నాలుగుదినముల క్రింద పగిలి పోయినప్పుడు రాయివంటి క్రొత్తకుండ పగులగొట్టినా వని నేటివరకు తిట్టుచున్నది".

పొట్టి-"అత్త పోగొట్టినది అడుగోటికుండ, కోడలు పోఁగొట్టినది క్రొత్తకుండ" యన్న సామెతవినలేదా?

శేష- నేను పడుబాధ యిప్పు డేమిచూచినారు? నావిధవవదినగారు బ్రతికియున్నప్పుడు చూడవలెను. నిరుడు అమ్మవారి జాడ్యములో -దైవము కడుపుచల్లగా-ఆవిడ పోయినప్పటినుండి మూడుపూటలును కడుపునకింత తన్నగా అన్నము నైన దినుచున్నాను. ఆడబిడ్డ జీవించియున్నప్పు డదియునులేదు. ఉన్నమాట చుప్పవలెను. ఎన్నియన్నను ఇప్పుడు నాఅత్తగారు అన్నము తిన్నగాతినవైతివని తిటునుగాని తినిపోతినని తిట్టదు.

పొట్టిది-"లోకములో నెటువంటివారును లేకున్న - పిండిబొమ్మను జేసి పీఁటమీఁదఁబెట్టిన, ఆఁడుబిడ్డతనమున కదిరదరిపడ్డది-అన్నసామెత యూరకేపుట్టినదా?"

ఇంతలో జపము చేసికొనుచున్న ముసలామె కొంతదూరము వచి చెంబులోనీళ్ళు పాఱఁబోసి మీకు మాటలసందడిలో కన్నులు కనఁబడునా? ఈవల స్నానముచేసినవారున్నారని యయిన రాజశేఖర చరిత్రము లేదు. ఊరికే నీళ్ళు విదలుపుకొంగురు. మీఁద మయిలనీళ్ళు పడిస్నానము చేసినముండను చచ్చినట్టు చలిలో మరల మునుఁగుచున్నాను" అని గొణుఁగుకొనుచు లోతు నీళ్ళలోకి నడిచి బుడుగు బుడుగున నాలుగు ముణకలు వేసి బయలుదేఱి, మాటాడుకొనుచున్న వారివంక కన్ను లెఱ్ఱచేసి చూచుచు "అమ్మలక్కలు క్రిందునుమీఁదను దెలియక పొంగిపడుదురు. మా కాలములో నున్న కోడంట్రికములో ఇప్పుడు సహస్రాంశము లేదు. అత్తమందియు, వేముతీపునులేదు. ఎక్కడను అత్తలేని కోడలుత్తమురాలు. కోడలులేని యత్త గుణవంతురాలు" అని సణుగుకొనుచు, దోసిలితో నదిలోని నీళ్ళు మూఁడుసారులు గట్టునపోసి, కొంచెము దూరము పోయిన తరువాత మరల మూఁడుమాఱు లాత్మప్రదక్షిణములు చేసి మెట్లక్కియదృశ్యురాలయ్యెను.

శేషమ్మ- నాలుగు వంకలు ఁజూచి వడవడ వడఁకుచు" అమ్మలారా! నేనీలాగున అన్నానని మీరెవ్వరితోనైన ననెదురునుండీ!మా అత్తగారు విన్న నన్ను చంపివేసిపోవును. ఈవఱకే నాకు గతులు లేకుండ నున్నవి. ఇది విన్న బొత్తిగానే యుండవు. వెంకమ్మ తల్లి ! ఈ బ్రతుకు బ్రతుకుటకంటె గోదావరిలో పడితేబాగుండునని తోఁచుచున్నది." అని వలవల నేడ్వఁజొచ్చెను.

వెంకమ్మ- "ఊరుకో! ఊరుకో! అటువంటి అవాచ్యములెప్పుడును పలుకరాదు. పడ్డవాండ్రెప్పుడును చెడ్డవాండ్రుకారు." అని యూరడించుచున్నది.

శేషమ్మ- ఆ మాటలతో దుఃఖము మాని " గోదావరికి వచ్చిచాలసేపయినదమ్మా! ఇంతసే పేమిచేతుచున్నావని అత్తగారు చంపివేయును. వేగిరము పోవలెను." అని వేగముగా నీళ్ళుముంచుకొని బిందె బుజముమీఁద నెత్తుకొని గట్టునకు నడుచుచున్నది.

రెండవ ప్రకరణము

అప్పుడే నీళ్ళకు వచ్చినవారితో ఇరువదియేండ్లప్రాయముగలయొకతెచేరువ నున్న మఱియొకతె మెడదగ్గఱకు చేయి పోనిచ్చి"కాంతమ్మ! ఈపట్టెడ క్రొత్తగా చేయించుకొన్నావా? నీ కేమి? నీవు అదృష్టవంతురాలవు. గనుక తల మొదలుకొని పాదములవఱకు నీమగఁడు నీకు నగలు దిగవేయుఁచున్నాఁడు."

కాంత-నిన్ననే కంసాలిసుబ్బయ్యచేసి తెచ్చినాడు. నాలుగు పేటల పలకసరులు కూడ చేయిచున్నాఁడు. పేరమ్మా! మీ మగనికి నీమీఁద బహుదయ అని విన్నాను. నిజమేకదా!

పేర-ఎందుకువచ్చినదయ? సంవత్సరమున కొక్కపర్యాయమయినను పట్టుమని పదివరహాలనగ చేయించిపెట్టుట లేదుగదా? పూర్వజన్మమునందు చేసికొన్న పాపముచేత నా కీజన్మమందుఇటువంటి-

ఇప్పుడు ప్రక్కనునిలచున్న మఱియొకతె-పేరమ్మా! నీవు వృధాగా లేనిపోనివ్యసనము తెచ్చిపెట్టుకొనుచున్నావు. నీ కేమయిన అన్నమునకు తక్కువయిబదా? బట్టకు తక్కువయినదా? మహారాజు వలె మగఁడు తిన్నగా చూచునప్పుడు నగలు లేకపోయిన నేమి! మగనికి ప్రేమ లేకపోయినతరువాత, దిక్కుమాలిన నగ లేందుకు విట్టి మోతచేటు. చూడు మన గ్రామములో బంగారమ్మకు శరీరము నిండనెన్నినగ లున్నవో! అనగలపేర్లె కొన్ని నేను వినలేదు. దీపములు పెట్టఁగానే వెళ్ళి డానిమగఁడు బోగముదానియింటిలోఁగూరుచుండును. దాని కేమిసుఖ మున్నది? నీ మగఁడెప్పుడును చీఁకటి పడ్దతరువాత వీధిగుమ్మము దాఁటఁడు.

పేర-నీవు చదువుకొన్నదానవు గనుకు, కావలసినన్ని శ్రీరంగనీతులు చెప్పగలవు. నీకువలె మా కెవ్వరికిని ఇటువంటి వేదాంతము రాజశేఖర చరిత్రము తెలియదు. నలుగురును నగలు పెట్లుకొనివచ్చినప్పుడు, వట్టి మోడులాగున ఎక్కడి కయినను పేరింటమునకు వెళ్ళుటకు నాకు సిగ్గగుచున్నది. జానకమ్మా! నీకు నామగనివంటి బీదవాడు జాన-పేరమ్మతల్లీ! నేనేమో తెలియక అన్నాను కోపపడకు అని బిందె ముంచుకొని వెళ్ళిపోవుచున్నది'

తక్కినవారందఱును నీళ్ళు ముంచుకొని వెనుకనే బయలుదేఱి, " ఓసి పూజారిపాపమ్మ చెంపకొప్పు పెట్టుచున్నది"కరణమువండ్లా మెంతయొయ్యారముగానడుచునో చూచినావా"" అయ్యగారి రామమ్మ కేమిగర్వమో కాని మనుష్యులతో మాటాడనేమాటాడదే" " పుల్లమ్మ పట్టపగలే మగనితో మాటాడునఁట!"'కన్నమ్మది కొంచెము మెల్లకన్ను సుమీ' కరణమువారి సీతమ్మకునగలే లేవే అని పరులమీఁది దోషముల నెన్నుకొనుచు మెట్లెక్కి యిండ్లకునడిచిరి. విద్యాగంధమేయొ!ఱుగను మూఢవనితలకు మాటాడుకొనుటకంతకన్నా మంచివిషయము లేమి దొరకును? అక్కడకు వచ్చెడి స్త్రీలు సాధారణముగా సంభాషించెడి యితర విషయములు సవతుల పోట్లాటలును, మాఱుతల్లుల దుర్మార్గములును, మగల యనాదరణమును, మొదలైనవి తప్ప మఱియేమియు నుండవు.

అప్పుడు కుడిచేతిలో తాటాకులమీఁద వ్రాసిన పంచాంగమును బట్టుకొని, నీర్కావిదోవతి కట్టుకొని, మడత పెట్టిన చిన్నయంగవస్త్ర మొకటి బుజముమీఁద వేసికొనిమొగమునను దేహమునను విభూతిపెండెకట్లు స్పష్టముగా గానుపింప, నిమ్మకాయ లంతలేసి రుద్రాక్షలుగల కంఠమాలప్రకాశింప, రొండినిబెట్టుకొన్న పొడుముకాయ చిన్నకంతివలెఁ గనఁబడ, గట్టుమీఁదినుండిపోవుచు గోదావిరిలో స్నానము చేయువారెవ్వరోయని కనులకుచేయి యడ్డమువెట్టుకొని నిదానించిచూచి, గిరుక్కున మళ్ళి యొక బ్రాహ్మణుడు మెట్లుదిగివచ్చెను. బ్రాహ్మణుడు - "రుక్మిణమ్మగారూ! సంకల్పముచెప్పెదను స్నానము చేయండి"

రుక్మి - ' నేను డబ్బు తీసుకొనిరాలేదే'

బ్రా - డబ్బుకేమి? మధ్యాహ్న మింటివద్ద నిత్తురుగానిలెండి; (అనివంగినిలుచుండి) ఆచమనము చేయండి.కేశవా-నారాయణా-మాధవా-గోవిందా-తూర్పుమొగముగా తిరుగుండి.సూర్యునికేసి.

రుక్మి - స్నానము చేయవలెనా?

బ్రా - 'సంకల్పముచెప్పనిండీ' అని పొడుముబుఱ్ఱను రొంటి నుండి తీసి, మూతతీసి రెండుమాఱులు నేలమెద మెల్లగా గొట్టి యెడమచేతిలో కొంత పొడుము వేసికొని మరల నెప్పటియట్ల మూతవేసి కాయను రొండిని దోవతిలో దోపుకొని యెడమచేతిలో నున్న పొడుమును బొటనవ్రేలితోను చూపుడు వ్రేలితోను పట్టగలిగి నంత పెద్దపట్టును పట్టి బుఱ్ఱున పీల్చి రెండుముక్కులలోను ఎక్కించి, మిగిలినదానిని రెండవపట్టు పట్టి చేతిలో నుంచుకొని, ఎడమచేతిని కట్టుకొన్న బట్టకు రాచి ముక్కు నలుపుకొని, 'శుభేశోభనముహూర్తే శ్రీమహావిష్ణువరాజ్ఞయ - ప్రవర్తమానస్య - ఆద్యబ్రహ్మణ: - ద్వితీయ ప్రహరాధెన్ - శ్వేతవరాహకల్పే - వై వస్వతమన్వంతరే - కలియుగే - ప్రథమపాదే - జంబూద్వీపే - భరతవర్షే - భరతఖండే - అస్మిన్‌వతన్‌మానే వ్యావహారిక చాంద్రమానేన - కాళయుక్తి నామసంవత్సరే - దక్షిణాయనే - శరదృతౌ - కాతిన్‌కమాసే - కృష్ణపక్షే - ద్వాదశ్యాం - ఇందువాసరే - శుభనక్షత్ర శుభయోగ శుభకరణాద్యనేకగుణ విశిష్టాయా మాస్యాంశుభతిధౌ - క్షేమస్తైర్యవిజయాయురారోగ్యైవ్శ్వర్యాభి వృద్ధ్యధన్‌ం - అఖండగౌతమీస్నానమహం కరిష్యే - మూడుమాఱులు స్నానము చేయుండి". రుక్మిణి, తఱుచుగా స్నానము చేయుమనదికాచుగాన లోఁతు నీళ్ళలోనికి వెళ్ళుటకుభయపడి, మునుఁగుటకు చేతఁగాక మోకాలి లోఁతు నీళ్ళలోఁ గూర్చుండి కొప్పువిప్పుకొని దోసిలితోతలమీఁద నీళ్ళు పోసికొనుచుందెను. అప్పుడు సంకల్పము చెప్పిన బ్రాహ్మణుఁడు డబ్బు నిమిత్తము తరువాత వచ్చెదనని చెప్పి వెడలిపోయెను. అంతట రుక్మిణి బట్ట కొంగుతో తలతుడుచుకొని, శిరోజముల చివర ముడి చైచుకొని గట్టువంకఁ జూచి దూరము నుండి వచ్చుచున్న తండ్రిగారిని జూచి వేగిరము వేగిరము బయలుదేఱీ, రాతిమీఁద బెట్టిన కుంకుమ పొట్లమును దీసి నొసట బొట్టుపెట్టుకొని, రెండుమాఱులు చేతితో నిళ్ళు చెంఋమీఁద పోసి తీసికొని ,రెండడుగులు నదిలోనికిఁ బోయి నీళ్ళు ముంచుకొని , బట్టతిన్నగా సవరించుకొని, ఉతికినబట్టలను బుజము మీఁదను వానిపయిని నీళ్ళతో నున్న బిందెయును పెట్టుకొని తనకొఱకయి కనిపెట్టుకొని యున్న సిద్ధాంతిగారి భార్యతోఁగూడ గృహమునకు బోవ బయలుదేఱెను.