ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/స్వైరవిహారము

వికీసోర్స్ నుండి

తాను ముందు కళాశాలలోఁ జేరునప్పటికిఁ దనసహపాఠులుగ ప్రాతఁనేస్తు లెవ్వ రుందురా యని చూచుచుండెను. నే నిపు డాతనిఁ గలసికొనఁగా, "ఒరే, నీ వొకయేడు చదువు మానివేయరా. దానితో అన్ని జబ్బులును చక్కబడతవి !" అని యతఁడు పలికెను. ఈతని యాలోచన కేవల పరోపకారబుద్ధిచే జనించినది కాదుగదా !

తలిదండ్రులతో నెమ్మదిగ నాలోచింపక, వారలకు నాయుద్దేశమైన సూచింపక, నేను కళాశాలాధ్యక్షునియొద్దకు రివ్వునఁ జని, నా విపరీతవ్యాధివృత్తాంత మెఱిఁగించి, ఒక వత్సరము విద్య విరమింప ననుజ్ఞ వేడితిని ! మెట్కాపుదొరకు నాయం దమితానురాగము. నాముఖ మంతఁగ రోగకళంకితము గాదని పలికి, మండలవైద్యాధికారికి 'సిఫార్సు' చేసి నాకు మంచిమందిప్పించెద నని యాయన ధైర్యము చెప్పెను. ప్రాత:స్నానములు, శీతలోపచారములును జేసిన సులువుగ నాకుఁ బునరారోగ్యము గలుగు నని యాయన యూరడించెను. కాని, ఆయన హితబోధనము లెంతసేపటికిని నాతల కెక్క లేదు. అంతట ఆయన, "అట్లైన మంచిది. నీ వొక సంవత్సరము హాయిగఁ దిరిగి, శరీరము నెమ్మదిపడి రా. మరల నాసాయమున విద్యాభివృద్ధి గాంతువులే !" అనువచనములతో నావీపు తట్టి, కళాశాలనుండి నాకు వీడ్కో లొసంగెను.

10. స్వైరవిహారము

నిజ మారసినచో, నాశరీర మంతగ వ్యాధిపీడితము గాకుండినను, విరామము లేని చదువనిన నేను విసిగి వేసారితి నని తేలక మానదు. ఒకసంవత్సరము కాలు సాగునట్లు నేను సంచారము చేసినచో, దేహమున కారోగ్యము, మనస్సునకు నెమ్మదియుఁ జేకూరఁగల వని నే నాశించితిని. జరుగుచదువున కంతరాయము గలుగుట తలిదండ్రులకు మొదట దుస్సహ మైనను, అచిరకాలముననే నే నారోగ్యవంతుఁడనై, వచ్చిననష్టమును వేగమె కూడఁదీయఁగలనని వారు నమ్మియుండిరి. 1888 వ సంవత్సరము ఫిబ్రవరి 18 వ తేదీని నేను కళాశాల మానుకొంటిని. ఆనెల 22 వ తేదీని మమ్ముఁ జూచి పోవచ్చిన మా రెండవ మేనమామతో, నన్ను వారి గ్రామ మంపి, అచట నాకు సదుపాయములు చేయింపు మని మాయమ్మ తనతమ్ముని మఱిమఱి వేడెను. అంతఁ గొంతకాలము నే నాగ్రామమున నివసించితిని. ఆదినములలో వేలివె న్ననిన మేము ఉవ్విళ్లూరుచుండెడి వారము. అది మాసోదరులలో మువ్వురికి జన్మస్థానము. మా ముత్తవ తల్లి, మేనమామలు మున్నగు బంధువర్గము నివసించు ప్రదేశము. పట్టణము విడిచి పల్లెయం దుండుట మొదట కొన్నిదినములవఱకు నాకుఁ గడు సంతోషముగ నుండినను, వేవేగమె గ్రామనివాసము నాకు మొగముమొత్తెను. ప్రాతస్సాయంకాలములందు నేను కాలువ గట్టుమీఁద విహారము సలుపుచుండువాఁడను. కాని, తక్కినకాలము గడచు టెట్లు ? పట్టణమందలి స్నేహసహవాసములు, వార్తాపత్రికలు, బహిరంగసభలు, ఇక్క డెట్లు సమకూరును ? అహర్నిశమును నాతో నుండు తమ్ములు చెల్లెండ్రు నిచట లేరుగదా ! పీల్చుటకు నిర్మలవాయువు, త్రావుటకు శుద్ధోదకము మున్నగునవి వలసినంత యిచట నుండుట వాస్తవమె. కాని, సుఖించునది మనస్సును విడిచిన శరీరముకాదు గదా ! కుగ్రామనివాసముమీఁద విసువుఁ జెందినపుడెల్ల నేను పట్టణము వచ్చి, తలిదండ్రులను సోదరీసోదరులను జూచి పోవుచుంటిని. తోడి విద్యార్థి యువకులు కళాశాలయందు విద్యాభివృద్ధి నొందుచుండఁగా, ఆరోగ్యాన్వేషణమునకనియును, హాయి ననుభవింతుననియును, నేను బడి యెగవైచి, పల్లెటూళ్ల యందు వ్యర్థ కాలక్షేపము చేయుచుంటి నని నే నంత గ్రహించి విచారించితిని. స్వయంకృతాపరాధమునకు పరిహార మేమి గలదు ? నాపూర్వ సహపాఠి యగు పాపయ్యశాస్త్రి సహవాసము మరగి, రాజమంద్రిలో నపుడపుడు నేను దినములు వెళ్లఁబుచ్చుచుండువాఁడను. స్వస్థలమగు కోనసీమకుఁ దాను బోయెద ననియు, వలసినచో నన్నుఁ గొనిపోయి యందలి దర్శనీయములగు తావులు చూపింతు ననియు నాతఁ డొకనాఁడు నాతో ననెను. ఇపుడు నేను గోరుచుండినదే యిట్టిమార్పు. మార్గమందు మా మేనత్తగారి నివాసస్థల మగు అమలాపురము ఉండుటచేత, అచటికిఁ బోయి నేను కొన్నిరోజులు నివసించుటకు మా తలిదండ్రులు సమ్మతించిరి. అంత 19 వ ఏప్రిలున సహచర సమేతముగ నేను బ్రయాణ మైతిని.

అప్పటి కప్పుడె అమలాపురపు కాలువ కట్టివేయుటచే, మేము ధవళేశ్వరము పోయి, అచటినుండి పడవపయనము చేసి, మఱునాఁడు దాక్షారామము చేరితిమి. శ్రీనాధుని "భీమఖండము" నేను జదువకున్నను, ఆంధ్రకావ్యములందు మక్కువగలిగి, నాతో "విజయవిలాస" "పారిజాతాపహరణము" లు గొనిపోయితిని. ప్రయాణమున నా కివియె నిత్యపారాయణగ్రంథము లయ్యెను. కాని, నాచెలికాఁడు రసజ్ఞత లేని రసికుఁడు. నూతనప్రదేశముల రామణీయకమును, ప్రాచీనదేవాలయముల పూర్వవాసనలును నా మనసు నమితముగ నాకర్షించెను. అచటనుండి కోటిపల్లి, ముక్తేశ్వరము మున్నగు క్షేత్రములు దర్శించి, 21 వ తేదీని మేము అమలాపురము చేరితిమి.

ఆపట్టణమున కనతిదూరమందలి యీదరపల్లి మా మేనత్తగారినివాసస్థలము. కొన్ని దినములవఱకును వారియిల్లు నావిడిది యయ్యెను. నామిత్రుఁడు అమలాపురమున బసచేసి, నన్నుఁ జూచుట కీగ్రామము వచ్చుచుండువాఁడు. నా కిచ్చట సావాసులు లేని లోపము లేదు గాని, సత్సాంగత్యమె సమకూరకుండెను. నా సహచరుఁడు ప్రవేశపరీక్షలోఁ దప్పుచుండెడి ప్రాఁతకాలపు విద్యార్థి. చప్పనిపాఠ్యపుస్తకములచవియె కాని, సాహిత్యగ్రంథరుచి యాతఁ డెఱుఁగడు ! ప్రకృతియందలి సుందరదృశ్యములు, గానకళాదుల రామణీయకమును, వానికి హృదయాకర్షక విషయములు గావు. స్నేహపాత్రతాదిగుణములు కొన్ని గలిగియుండియును, ఈతఁడు, అనుభవరహితులగు నాబోటిచిన్న వారల కాదర్శప్రాయుఁడగు సుశీలుఁడుగాఁడు. నీళ్లు నమల నేల ? నామమాత్రావశిష్టుఁడగు బ్రహ్మచారియె యీతఁడు ! రచ్చ కెక్కిన జారుఁడు గాకున్నను, శీలసౌష్ఠవము గోలుపోయి, తనప్రకృతలోపములకు, తనయేకాకిత్వమును విషమపరిస్థితులను ముడివెట్టి మనసు సరిపెట్టుకొనినసరసుఁడు ! ఇట్టియువకుల వలపుపలుకలు, రసికత్వపుఁబోకడలును లోకానుభవము లేని పసివారలకు విపరీతకామోద్రేకము గలిగింపఁజాలియుండును. ఈతని సహవాస సంభాషణములు నా భావపవిత్రతకు భంగము గలిగించి, నీతినియమములను నీటఁ గలుపుటకు సంసిద్ధము లయ్యె నని నే నపుడు గ్రహించితిని !

8 వ మెయితేదీని కోనసీమసంచారము ముగించి, రాజమంద్రి చేరితిమి. మా తలిదండ్రులకు నా నేస్తకానిని గుఱించిన నిజము తెలిసిన యెడల, ఆగ్రహమున వారు నన్ను మ్రింగివేసియుందురు ! ఐన నీసహవాసుని దురాకర్షణ మహిమమునను, అతని దుష్ప్రసంగశ్రవణాసక్తి చేతను, ఇంకఁ గొంతకాలము నేను వానినే యంటిపెట్టుకొని యుంటిని. నాచిత్తపారిశుద్ధ్యమునకుఁ గలిగిన చెఱుపు, క్రియారూపముగఁ బరిణ మించి, కూఁకటి వేళ్ల వఱకును శీలమున వ్యాపించెడిదియె. కాని, దైవానుగ్రహమునను, చిరకాలాభ్యస్త సన్ని యమప్రభావమునను, ఇతరస్నేహితుల సహవాసభాగ్యమునను, ఆచెడుగంతటితో నిలిచిపోయె నని నాకు స్పష్టపడెను !

కళాశాలావిద్యాభ్యాస మిఁకఁ గట్టిపెట్టి, వృత్తిస్వీకారమున కనుకూలించుచదువు చదువుటకు నేను న్యాయశాస్త్ర పుస్తకములు కొన్ని కొని ముందువేసికొని కొన్ని దినములు కూర్చుంటిని. కాని, నామనస్సున కవి వెగటయ్యెను. ఇంతలో పూర్వపరిచితుఁ డొకఁడు ధవళేశ్వరమునఁ దాను జరుపు మాధ్యమికపాఠశాలలో నొకనెల నన్ను ప్రథమోపాధ్యాయుఁడుగ నుండు మని కోరఁగా, వేతనము స్వల్ప మైనను, నే నందుల కియ్యకొంటిని. నా కీయవలసినజీతమైన నాతఁడు సరిగా నీయకుండినను, నేనొకమాసము ఉపాధ్యాయపదవి నుండి, శిష్యుల యనురాగము వడసి, మనస్సునకుఁ గొంత వ్యాపృతి గలిపించుకొంటిని. ఇంకొకనెల యొకవిద్యార్థికిఁ జదువు చెప్పితిని. ఇట్లు, విద్యాశాలను వీడినఁగాని పరిపూర్ణారోగ్యసౌఖ్య మందఁజాల నని యెంచి, చదువునకు స్వస్తి చెప్పి, తుదకు మొదటికే మోసము తెచ్చుకొనసిద్ధపడి, ఎటులో తప్పించుకొని తెఱపినిబడి, పరిపూర్ణారోగ్యభాగ్య మందుటకు చదువు సాగించుకొనుటయె మంచిసాధన మని నిర్ధారణచేసికొని, నేను, 1889 వ సంవత్సరారంభమున మరల కళాశాల చేర నుద్యమించితిని.

11. పునర్విమర్శనము

1889 వ సంవత్సర దినచర్య పుస్తకాంతమున నాజీవితములో నది యుత్తమదశ యని లిఖియించితిని. దీనియందుఁ గొంత సత్యము లేకపోలేదు. గతవత్సరమున నాశీలము కలుష భూయిష్ఠమై, కష్టశోధనలకు గుఱి యయ్యెను. నన్ను గాసిపెట్టిన దేహ మనశ్శత్రు