ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/కళాశాలలో ప్రథమవత్సరము

వికీసోర్స్ నుండి

నా మిత్రు లిద్దఱును సజ్జనులే యని నమ్ముచుండువాఁడను. నిజమునకు, మేము మువ్వురమును ఉదారాశయములతో నొప్పియుండియు, అనుభవలేశము లేని వట్టి విద్యార్థులమె ! మాలో నెవ్వనికిఁ గాని యింకను శీలబలము, చిత్తస్థైర్యము నేర్పడలేదు. ఐనను, కొలఁదికాలములోనే, పరిస్థితులప్రభావమున, మాయభిప్రాయము లందును, నీతినియమాదులందును గొంత దృఢత్వ మేర్పడెను. ఈసంగతి ముందలి ప్రకరణముల యందుఁ దేటపడఁగలదు.

9. కళాశాలలో ప్రథమవత్సరము

1887 వ సంవత్సరము జనవరినెలలో నేను రాజమంద్రియందలి ప్రభుత్వకళాశాలలో ప్రథమశాస్త్ర పరీక్షతరగతిలోఁ బ్రవేశించితిని. నా సహపాఠి ముఖ్యప్రాణరావు నేనును ఆమండలమున ప్రవేశ పరీక్షలో నుత్తీర్ణు లైనవారిలో ప్రథమతరగతియం దుండుటచేత, మా కిరువురకును విద్యార్థివేతన మీయఁబడెను. ముఖ్యప్రాణరావు కడచిన నాలుగు సంవత్సరముల నుండియు, మాపాఠశాలలోనే నా సహాధ్యాయుఁడు. ఆతనినమ్రతను, కుశాగ్రబుద్ధిని మెచ్చనివారు లేరు. విద్యాభ్యాసమే జీవితనియమముగఁ గైకొనిన విద్యార్థి యాతఁడు. పాఠము చదువక యాతఁడు బడికి వచ్చినరోజు గాని, అపజయమందిన పరీక్ష గాని, లేదనియె చెప్పవచ్చును. ఆతని జ్ఞాపకశక్తి యత్యద్భుతము. ఒకసారి చదివినతోడనే యాతని కెంత కఠినపాఠమైనను ముఖస్థమయ్యెడిది. కావుననే యతఁడు ప్రతితరగతియందును, ప్రతిపరీక్షయందును, ప్రథమస్థాన మలంకరించి యుండెడివాఁడు. అతనిని విద్యావిషయమున మించుట యటుండఁగా, సమీపించుట కైన నేసహపాఠికిని వలను గాకుండెను. ఆసంవత్సరము రాజమంద్రిలో ప్రవేశపరీక్ష యందు ప్రథమతరగతిలో జయ మందినది మే మిద్దఱమే. కాని, అతనికి నాకును పెక్కుస్థానముల యంతరము గలదని, యిప్పటివఱకును నాకు జ్ఞాపకము !

ముఖ్యప్రాణరావు బుద్ధివైశద్యమున నసమానుఁడని లోక మెఱుఁగును గాని, ఏ తద్విద్యాపరిశ్రమమునకై దేహారోగ్యమును యౌవనముననే ధారవోసిన దురదృష్టవంతుఁడని యెవరికిని దెలియదు. కళాశాలలో నొకవత్సరము చదువకమునుపే, ఆ సుకుమార శరీరుఁడు అనివార్యరోగపీడితుఁడై మృత్యువువాతఁ బడెను. వానితో సరిసమానమగు మేధాశక్తి గల రామయ్య యను మా యింకొకసహపాఠిని గూడ, ఆదినములలోనే మృత్యుదేవత తనపొట్టఁ బెట్టుకొనెను. ఈ యనుంగునేస్తుల యకాలమరణముఁ గాంచి నే నతివ్యాకులచిత్తుఁడ నైతిని. ప్రజ్ఞాన్వితు లగు నిట్టి ప్రియమిత్రులను బాసి, పాడువడిన యీపుడమిని దినములు గడుపుట దుస్సహముగఁ దోచెను.

ఇట్లు తోఁచినది నా కొక్కనికే కాదు. నా మిత్రవర్గమున నందఱు దుర్భరవిషాదమునకు లోనయిరి. నన్నుఁ బొడగాంచిన సహవాసులు, "రామయ్యముఖ్యప్రాణుల సంగతి చూచితివిగదా. నీరసస్థితిలో నున్న నీ వారోగ్యమును గాపాడుకొననిచో, వారివలనే చేటు తెచ్చుకొనెదవుసుమీ !" యని యాత్రమున నన్ను హెచ్చరించుచుండువారు. నిజముగ, కళాశాలఁ జేరిననాఁటనుండియును దేహమున నాకు సపిగా లేదు. ఉష్ణాధికతచేతను, పైత్యప్రకోపమువలనను, తఱచుగ నాకుఁ దలనొప్పులు వచ్చుచుండును. ఉన్నటులుండి యాకస్మికముగఁ గనులు చీఁకటులు గ్రమ్మును. లోక మంతయు దిర్ధిరఁ దిరుగునట్లు దోఁచును. తోడనే తలనొప్పి తలచూపి, దిన మంతయు నన్ను వేధించును. కడుపులో వికారముగ నుండును. ఇవి యన్నియు ధాతుదౌర్బ ల్యలక్షణము లని వైద్యులు చెప్పెడివారు. నాయీడునఁ దాను నిట్టిబాధలకు లోనైతి నని మాయమ్మ చెప్పెడి మాటలు, నా కోదార్పుగలిగించుటకు మాఱుగ, మఱింత భీతిని బెంచుచుండెను ! స్వాభావికముగనే నేను దుర్బలశరీరుఁడను. ఆసమయమున నాకుఁ గొంచెము శరీరాస్వస్థత యేర్పడెననుట సత్యము. కాని, మాటి మాటికి నేను మననము చేయుచుండుటచేతను, చెలికాండ్రు సదా స్ఫురింపఁజేయు చుండుట వలనను, నా నీరసము గోరంతలు కొండంత లయ్యెను ! కావున, తగిన జాగ్రతతో నౌషధసేవ చేయక వ్యాధిని ముదురఁబెట్టినచో, నాకును మిత్రులు రామయ్య ముఖ్యప్రాణుల గతియే నిజముగఁ గలుగు నని నమ్మి నేను భీతిల్లితిని.

ఇట్లు భయమున వెతనొందెడి నాచికిత్సకై 1887 వ సంవత్సరమున మాతండ్రి పడిన శ్రమకు మేఱ లేదు. రాజమహేంద్రవరమునఁగల వైద్యశిఖామణులయొద్దకు నన్నాయన కొనిపోయి, నా చేయి చూపించి, యాలోచన లడుగుచుండువాఁడు. నానిమిత్త మాయన గ్రహింపని కూరగాయవైద్యములు, తెలిసికొనని 'గోసాయిచిటికలు'ను లే వని చెప్పవచ్చును. ఐన నేను సేవించిన యౌషధముల వలన నా కించుకంతయు లాభము సమకూరదయ్యెను.

ఎట్టకేలకు కళాశాలయందు మొదటివత్సరము గడచిపోయెను. సంవత్సరపరీక్షలో ప్రథమస్థానమున నుత్తీర్ణ మగుట యేవిద్యార్థికైన హర్ష దాయకముగ నుండును గాని, నామనస్సు నది మఱింత విచారతోయముల ముంచివై చెను ! నా యీకడపటి విజయమే కడపటి విజయముగఁ బరిణమించు నేమోగదా ! ఇపుడైన నేను మృత్యు ముఖమునుండి తప్పించుకొనుటకై యారోగ్యాన్వేషణము చేయవలదా ? నామిత్రుఁడు వెంకటరావు ప్రవేశపరీక్షలో నపజయము గాంచి, తాను ముందు కళాశాలలోఁ జేరునప్పటికిఁ దనసహపాఠులుగ ప్రాతఁనేస్తు లెవ్వ రుందురా యని చూచుచుండెను. నే నిపు డాతనిఁ గలసికొనఁగా, "ఒరే, నీ వొకయేడు చదువు మానివేయరా. దానితో అన్ని జబ్బులును చక్కబడతవి !" అని యతఁడు పలికెను. ఈతని యాలోచన కేవల పరోపకారబుద్ధిచే జనించినది కాదుగదా !

తలిదండ్రులతో నెమ్మదిగ నాలోచింపక, వారలకు నాయుద్దేశమైన సూచింపక, నేను కళాశాలాధ్యక్షునియొద్దకు రివ్వునఁ జని, నా విపరీతవ్యాధివృత్తాంత మెఱిఁగించి, ఒక వత్సరము విద్య విరమింప ననుజ్ఞ వేడితిని ! మెట్కాపుదొరకు నాయం దమితానురాగము. నాముఖ మంతఁగ రోగకళంకితము గాదని పలికి, మండలవైద్యాధికారికి 'సిఫార్సు' చేసి నాకు మంచిమందిప్పించెద నని యాయన ధైర్యము చెప్పెను. ప్రాత:స్నానములు, శీతలోపచారములును జేసిన సులువుగ నాకుఁ బునరారోగ్యము గలుగు నని యాయన యూరడించెను. కాని, ఆయన హితబోధనము లెంతసేపటికిని నాతల కెక్క లేదు. అంతట ఆయన, "అట్లైన మంచిది. నీ వొక సంవత్సరము హాయిగఁ దిరిగి, శరీరము నెమ్మదిపడి రా. మరల నాసాయమున విద్యాభివృద్ధి గాంతువులే !" అనువచనములతో నావీపు తట్టి, కళాశాలనుండి నాకు వీడ్కో లొసంగెను.

10. స్వైరవిహారము

నిజ మారసినచో, నాశరీర మంతగ వ్యాధిపీడితము గాకుండినను, విరామము లేని చదువనిన నేను విసిగి వేసారితి నని తేలక మానదు. ఒకసంవత్సరము కాలు సాగునట్లు నేను సంచారము చేసినచో, దేహమున కారోగ్యము, మనస్సునకు నెమ్మదియుఁ జేకూరఁగల